‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి | Sakshi
Sakshi News home page

‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి

Published Sat, Feb 24 2024 4:35 AM

RBI allows Paytms UPI payment business to be migrated to other banks - Sakshi

ముంబై: యూపీఐ హ్యాండిల్‌ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ)కి ఆర్‌బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్‌ చెల్లింపులు, సెటిల్మెంట్‌ వ్యవస్థను ఎన్‌పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్‌ను మైగ్రేట్‌ చేసే క్రమంలో పేమెంట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్లుగా (పీఎస్‌పీ) 4–5 బ్యాంకులను ఎన్‌పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది.

తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్‌కు మాత్రమే మైగ్రేషన్‌ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్‌లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్‌లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. 

Advertisement
Advertisement