మెడికల్‌ రాకెట్‌ సంచలనం: నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు, ఏడుగురి మృతి | Fake Doctors Dead Patients How A Medical Racket Unfolded In South Delhi, Know More Details Inside - Sakshi
Sakshi News home page

మెడికల్‌ రాకెట్‌ సంచలనం: నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు, ఏడుగురి మృతి

Published Thu, Nov 16 2023 3:34 PM

Fake Doctors Dead Patients How A Medical Racket Unfolded In South Delhi - Sakshi

వైద్యో నారాయణో హరిః  అన్న మాటలకే కళంకం తెస్తూ  రోగుల పాలిట యమకింకరులుగా మారిపోయారు ఆ  నలుగురు.  ఎలాంటి జాలి, దయ, పాప భీతి లేకుండా వరుసగా  రోగుల్ని బలితీసుకుంది ఈ ముఠా దేశ  రాజధాని నగరం నడిబొడ్డున చోటు చేసుకున్న  ఘటన సంచలనం సృష్టించింది. 

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ మెడికల్‌ రాకెట్‌ వ్యవహారం కలకలం రేపింది.నకిలీ సర్టిఫికెట్లతో సర్జన్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం సంచలనం సృష్టించింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని ఓ క్లినిక్‌లో శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్ల మృతితో వీరి వ్యవహారం వెలుగు చూసింది.  దీనికి   సంబంధించి ఇద్దరు వైద్యులతో పాటు నకిలీ మహిళా సర్జన్‌,  ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ను అరెస్ట్‌ చేశారు. 

డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్ , డాక్టర్ జస్‌ప్రీత్ సింగ్‌తో పాటు, మాజీ లేబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్‌ అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  వీరి సమాచారం ప్రకారం ఫేక్ సర్టిఫికేట్లతో శస్త్ర చికిత్స చేయడంతో ఇటీవల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీరి బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసుల  విచారణ చేపట్టారు. అలా మెడికల్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది.

2022లో అస్గర్ అలీ గాల్‌బ్లాడర్‌ సమస్యతో వీరి ఆసుపత్రికి వచ్చారు. అయితే ఇతనికి ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. కానీ సరిగ్గా థియేటర్‌లోకి వెళ్లేసరికి డాక్టర్ జస్ప్రీత్ స్థానంలో పూజ ,మహేంద్ర ఉన్నారు. చివరికి ఆపరేషన్‌ తరువాత సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లీ ప్రాణాలు పోయాయి.

ఎలాంటి అర్హత లేకుండా,  కనీస వైద్య ప్రోటోకాల్స్‌ పాటించకుండా  చాలామంది రోగులకు ఇలాంటి  శస్త్రచికిత్సలు చేశారని రోగుల బంధువుల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2016 నుండి అగర్వాల్‌ నడుపుతున్న మెడికల్ సెంటర్‌పై కనీసం తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని దర్యాప్తులో తేలింది. వీరి నిర్లక్ష్యం కారణంగా  మొత్తంగా ఏడుగురు చని పోయారు. చివరికి నవంబర్ 1 న, నలుగురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు విచారణలో వీరి బండారం బయట పడిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) చందన్ చౌదరి  వెల్లడించారు.  ఈసందర్భంగా ఈ క్లినక్‌నుంచి డాక్టర్ల సంతకాలు మాత్రమే ఉన్న ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లు,  టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP)  వివరాల రికార్డులను కూడా గుర్తించారు. వీటితోపాటు గడువు ముగిసిన సర్జికల్ బ్లేడ్‌లు, అనేక నిషేధిత మందులు ఇంజెక్షన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు  47 బ్యాంకుల చెక్‌బుక్‌లు, పలు ఏటీఎం కార్డులు , పోస్టాఫీసు పాస్‌బుక్‌లు, ఆరు POS టెర్మినల్ క్రెడిట్ కార్డ్ మెషీన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement