ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తాచారు. జిల్లాలోని ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన ఆకుల వెంకట సాయి మనస్వి రాష్ట్రస్థాయిలో 600 మార్కులకు 599 సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 23,163 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 80.08 శాతంతో 18,549 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 11,941 మందికి 10,036 మంది, బాలురు 11,222 మందికి 8,513 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 13,851 మంది ప్రథమ శ్రేణిలో, 3,116 మంది ద్వితీయ శ్రేణిలో, 1,582 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అయితే జిల్లా మాత్రం రాష్ట్రస్థాయిలో 25వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. గతేడాది 64.35 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరగడం విశేషం.
71 పాఠశాలల్లో నూరుశాతం
జిల్లాలోని 71 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణులు కాగా వీటిలో ప్రభుత్వ రంగ పాఠశాలలు పది ఉన్నాయి. నాగిరెడ్డిగూడెం ఏపీఆర్సీహెచ్ స్కూల్, ముసునూరు ఏపీ ఆర్ఈహెచ్ స్కూల్, అప్పలరాజుగూడెం ఏపీ ఆర్ఎస్ బాలుర స్కూల్, వేలేరుపాడు కేజీబీవీ, లంకపల్లి జీటీడబ్ల్యూహెచ్ స్కూల్, వీరమ్మకుంట జెడ్పీ హైస్కూల్ స్కూల్, కుక్కునూరు కేజీబీవీ, కేతవరం జెడ్పీ హైస్కూల్ స్కూల్, వేదాంతపురం జెడ్పీ హైస్కూల్, చింతలపూడి ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలుర పాఠశాల ఉన్నాయి.
మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ : పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు వచ్చేనెల 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఈనెల 23 నుంచి 30 వరకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే రూ.50 అపరాధ రుసుంతో మే 1 నుంచి 23 వరకూ ఫీజు చెల్లించవచ్చన్నారు. కాగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు లు చేసుకోవాలనుకునే విద్యార్థులు హెచ్ఎంలను సంప్రదించాలని సూచించారు. రీ కౌంటింగ్కు సబ్జెక్టుకు రూ. 500, రీ వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజును ఆన్లైన్లో చెల్లించాలన్నారు.
బీసీ గురుకులాల్లో విఘ్నేష్
నరసాపురం రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని బీసీ గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో నరసాపురం మహాత్మా జ్యోతిబా పూలే మత్స్యకార బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి బి.విఘ్నేష్ 581 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ గోటేటి వేణుగోపాలకృష్ణ తెలి పారు. జిల్లాలో 8 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. తమ పాఠశాలలో 36 మందికి 34 మంది ప్రథమ శ్రేణిలో, ఒకరు ద్వితీయ, ఒకరు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారన్నారు. 10 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారన్నారు.
సర్కారీ బడి.. ఫలితాల్లో సవ్వడి
జిల్లాలోని ప్రభుత్వ రంగ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఆకట్టుకున్నారు.
● శనివారపుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి మురాల మహేష్బాబు 588 మార్కులు,
● గూటాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థి గర్రే సాయి తన్మయి 587,
● కై కరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని శానం నందిని ప్రియ 587,
● చిన్నంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జె.యశ్వంత్ 586,
● పూళ్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని పులి లక్ష్మీ గాయత్రి 585,
● అప్పలరాజుగూడెం ఏపీఆర్ఎస్ బాలుర పాఠశాల విద్యార్థి తిరిమిల్లి జగన్నాథం 584,
● నాగిరెడ్డిగూడెం ఏపీఆర్జీహెచ్ స్కూల్ విద్యార్థినులు ఎం.అనురాధ లక్ష్మీ ఐశ్వర్య 584, కస్సే హనీ 584,
● నూజివీడు ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి బెజవాడ ప్రేమ చంద్రిక 584,
● వడలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పామిరెడ్డి దీక్షిత 583,
● నూజివీడు జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థి బత్తుల భువనేశ్వరి 583,
● షేక్ షబానా మెహరాజ్ 583,
● గణపవరం సీహెచ్ఎస్జెడ్పీ పీజీ హైస్కూల్ విద్యార్థి నాభిగారి మేఘన 583 మార్కులు సాధించారు.
రాష్ట్రంలో ప్రథమ స్థానంలో జిల్లా విద్యార్థిని
టెన్త్ ఫలితాల్లో సత్తాచాటినప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
80.08 శాతం ఉత్తీర్ణత
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు