MP: మహాత్ముడే మాకు ఉపాధి కల్పించాడు.. బాపూజీ బాటలో.. | Sakshi
Sakshi News home page

Pratiksha Soni: మహాత్ముడే మాకు ఉపాధి కల్పించాడు.. బాపూజీ బాటలో..

Published Wed, Feb 1 2023 3:11 PM

Madhya Pradesh Pratiksha Soni Says Gandhiji Gave Them Employment - Sakshi

రాట్నం వడకడం అనేది సాంకేతిక విషయం కాదు. స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపడి ఉన్న విలువైన చారిత్రక జ్ఞాపకం. మధ్యప్రదేశ్‌కు చెందిన  ప్రతీక్ష సోనీకి ఆ చారిత్రక జ్ఞాపకాల సమహారం అంటే ఇష్టం. వాటి నుంచి స్ఫూర్తి పొంది నలుగురికి సహాయపడడం అంటే ఇష్టం...

మధ్యప్రదేశ్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన ప్రతీక్ష సోనీ బాల్యం నుంచి బాపూజీ గురించి వింటూ పెరిగింది. రాట్నం వడకడం ద్వారా స్వదేశీ ఖాదీ ఉద్యమానికి ఊపిరులూదిన మహాత్ముడి గురించి ఎన్నో కథలు విన్నది. అలా తనకు తెలియకుండానే రాట్నం వడకడంపై ఆసక్తి మొదలైంది. చివరికి అదే తన ఉపాధిగా మారింది.

‘మహాత్ముడు మాకు ఉపాధి కల్పించాడు. ఇంటి దగ్గరే రాట్నం వడుకుతూ ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటున్నాం. ఇదంతా ఆ మహాత్ముడి దయ’ అంటుంది పద్దెనిమిది సంవత్సరాల ప్రతీక్ష.

ఆర్థికంగా బలహీనంగా ఉన్న 93 మందికి పైగా మహిళలకు రాట్నం వడకడం నేర్పించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది ప్రతీక్ష.
‘ఒకరోజు కూలి దొరికి, మరొక రోజు దొరకక ఆర్థికంగా ఇబ్బందులు పడేదాన్ని. అప్పులు చేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితులలో ప్రతీక్ష నాకు కొత్త దారి చూపించింది’ అంటుంది ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సుమిత్ర.

ఇరవై సంవత్సరాల విమల పట్నంలో ఉద్యోగం చేయడానికి వెళ్లింది. అయితే మూడు నెలలు గడవకుండానే తాను అక్కడ ఉండడం కష్టమనే విషయం అర్థమైంది. తన జీతంలో సగం డబ్బులు ఇంటి అద్దెకే పోయేవి. అలా అని ఊరుకెళ్లలేని పరిస్థితి. అక్కడ ఏ పని దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతీక్ష గురించి తెలుసుకుంది.
రాట్నం వడకడం నేర్చుకొని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఊళ్లోనే ఉంటుంది విమల.

ఇటీవల నేపియ పట్టణంలో జరిగిన స్వదేశి ఖాదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీక్ష– ‘ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త ఉత్తేజం వస్తుంది. పదిమందికి సేవ చేయాలనే దృక్పథం ఉన్న వారు పరిచయం అవుతారు. అలాంటి వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎన్నో మంచి  పనులు చేయవచ్చు’ అంటుంది.

చదవండి: 54 ఏళ్ల క్రితం హడలెత్తించిన 'డ్రమ్ములో శవం'
పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి...

Advertisement
Advertisement