కొండగట్టు(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారిని బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేజిస్ట్రేట్లు దర్శించుకున్నారు. వేములవాడ మేజిస్ట్రేట్ జ్యోతి, సిరిసిల్ల మేజిస్ట్రేట్ ప్రవీణ్కుమార్, కరీంనగర్ మేజిస్ట్రేట్ హేమలత, మంచిర్యాల మేజిస్ట్రేట్ స్వాతి అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు వారి పేరున ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు.
సాయినాథునికి క్షీరాభిషేకం
ధర్మపురి: ధర్మపురి గోదావరి తీరాన ఉన్న శ్రీసాయి శివబాలాజీ మందిరంలో బుధవారం సాయినాథునికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు ప్రవీణ్శాస్త్రి ఆధ్వర్యంలో ఏటా శ్రీరామనవమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. భక్తులు స్వయంగా స్వామివారిని క్షీరాభిషేకం చేసేలా వీలు కల్పించారు.
కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జిగా సత్యంరెడ్డి
మల్లాపూర్: కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జిగా మండలంలోని ముత్యంపేటకు చెందిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి నియామకం అయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మంత్రి శ్రీధర్బాబు, కిసాన్కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు అఖిలేష్ శుక్ల, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
‘నేషనల్ హైవే’ బాధితులకు న్యాయం చేయండి
జగిత్యాలరూరల్: నేషనల్ హైవే విస్తరణలో భూములు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. అంతర్గాంలో రైతులు కోల్పోతున్న భూములను బుధవారం పరిశీలించారు. అంతర్గాం నుంచి జాతీయ రహదారి 563 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు సర్వే చేశారని, సర్వే ప్రకారం అంతర్గాంలో 45 ఇళ్లకు పైగా.. సుమారు 100 మంది రైతులు భూములు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. పక్కనుంచే నేషనల్ హైవే వెళ్తున్నందున జగిత్యాల, మేడిపల్లి, మల్యాల, కొండగట్టు వరకూ రద్దీ ఉండటం ద్వారా అంతర్గాం వద్ద ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయాలని, అండర్ పాస్లు నిర్మించాలని, మళ్లీ రీసర్వే చేసి రహదారి 100 ఫీట్లకు మించకుండా చూడాలని సూచించారు.