మోర్తాడ్(బాల్కొండ): వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తే నంబర్లను కేటాయిస్తారు, విద్యార్థులు స్కూల్, కళాశాలల్లో అడ్మిషన్ తీసుకుంటే అడ్మిషన్ నంబర్ ఇస్తారు. అలాగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కూడా క్రమ సంఖ్య అంటూ ఒకటి ఉంటుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం క్రమ సంఖ్యను 4గా ఎన్నికల కమిషన్ గుర్తించింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగింది. అప్పటి వరకు నిజామాబాద్ స్థానం సంఖ్య 34గా పరిగణించారు. పునర్విభజన అనంతరం నిజామాబాద్ పార్లమెంట్నియోజకవర్గం సంఖ్య సింగిల్ డిజిట్లోకి మారింది. 1957లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఆవిర్భవించిన సమయంలో అప్పుడు కేటాయించిన సంఖ్య 29గా ఉండేది. 1962లో నియోజకవర్గాల పునర్విభజన జరగగా అప్పుడు 35గా నమోదైంది. 1967లో మరోసారి నియోజకవర్గాల పునిర్వభజన జరిగింది. అప్పట్లో క్రమ సంఖ్యను 34 కాగా, 2004 వరకు అందే సంఖ్య కొనసాగింది. 2009లో నియోజకవర్గాల పునిర్వభజన జరగడంతో క్రమ సంఖ్య సింగిల్ డిజిట్లోకి మారింది. ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాద్ ఎంపీ స్థానం సంఖ్య 4గా ఉండగా తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా ఇదే సంఖ్యను లెక్కలోకి తీసుకున్నారు. భవిష్యత్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే క్రమ సంఖ్య మారే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికార యంత్రాంగం తెలిపింది.