ఓటరు నమోదుకు ఆధార్‌ తప్పనిసరి కాదు: ECI | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుకు ఆధార్‌ తప్పనిసరి కాదు: కేంద్ర ఎన్నికల సంఘం

Published Thu, Sep 21 2023 4:56 PM

Aadhaar number not mandatory to enrol as voter - Sakshi

సాక్షి,  ఢిల్లీ: ఓటరు నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం Election Commission of India స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారం -6, 6బీ లో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఓ రిట్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అండర్‌ టేకింగ్‌ సమర్పించింది ఈసీఐ.

ఇప్పటికే దాదాపు 66,23,00,000 కోట్ల ఆధార్ కార్డులను ఎన్నికల కార్డులతో జత చేశామని తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం.. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్  2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

ఎన్నికల గుర్తింపు కార్డులతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జూన్ 2022లో ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022ని నోటిఫై చేసింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జీ నిరంజన్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చేపట్టింది. 

ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది సుకుమార్‌ పట్టజోషి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం తరపున అండర్‌టేకింగ్‌ను బెంచ్‌కు సమర్పించారు.  అండర్‌ టేకింగ్‌లో.. ఫారం6(కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారం)తో పాటు 6బీ(రిజిస్ట్రేషన్‌ ఇన్‌ ఈ-రోల్‌) అవసరమైన మార్పులు చేస్తమని తెలిపారు. అలాగే. ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022లోని రూల్ 26-బి ప్రకారం ఆధార్ నంబర్‌ను సమర్పించడం తప్పనిసరి కాదని పేర్కొంది. ఈసీఐ అండర్‌ టేకింగ్‌ నేపథ్యంలో.. కోర్టు సదరు రిట్‌ పిటిషన్‌ను డిస్పోజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

Advertisement
Advertisement