లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల, శెట్పల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి దుండగులు ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పర్మళ్లకు చెందిన అన్నాదమ్ముళ్లు ఈర్ల రాజు, ఈర్ల గణేశ్ ఇళ్లతోపాటు రాజిరెడ్డిగారి అంజిరెడ్డి, వెంకట్రెడ్డి, శెట్పల్లికి చెందిన కంట్రపల్లి సాయన్న, గంగారాం ఇళ్ల నుంచి నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈర్ల గణేశ్, ఈర్ల రాజు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో ఉంటున్నారు. రాత్రి వేళ ఇంటికి తాళం వేసి దాబాపై పడుకోగా, దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బంగారు, వెండి ఆభరణాలతోపాటు రూ.30వేల నగదు ఎత్తుకెళ్లారు. అలాగే వెంకట్రెడ్డి ఇంట్లో నుంచి రూ.15వేల నగదు, అంజిరెడ్డి ఇంట్లో నుంచి వెండి గొలుసులు ఎత్తుకెళ్లారు. శెట్పల్లి గ్రామానికి చెందిన కంట్రపల్లి గంగారం ఇంట్లో 10 తులాల వెండి పట్లగొలుసులు చోరీకి గురయ్యాయి. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్లారెడ్డి సీఐ రవీందర్, ఎస్సై చైతన్యకుమార్రెడ్డి ఆయా గ్రామాలకు చేరుకొని క్లూస్ టీంను రప్పించి విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.