Sakshi News home page

అర్వింద్‌, బాజిరెడ్డిల నామినేషన్‌

Published Sat, Apr 20 2024 1:15 AM

కలెక్టర్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న బీజేపీ అభ్యర్థి అర్వింద్‌  - Sakshi

సుభాష్‌నగర్‌: పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి రెండోరోజు శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌ రెండు సెట్ల నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్‌ నామినేషన్‌ దాఖలు చేశారని తెలిపారు. వీరితోపాటు బహుజన్‌ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్‌, స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి శ్రీనివాస్‌, ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్‌, స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్‌, నామినేషన్‌ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్‌ అధికారి వివరించారు. కాగా రెండు రోజులకు మొత్తం మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్‌

బీఆర్‌ఎస్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెండు సెట్ల నామినేషన్లు దాఖలుచేశారు. బిగాల గణేశ్‌గుప్తా కారు నడపగా, అభ్యర్థి బాజిరెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేశ్‌రెడ్డితో కలిసి ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. మరో సెట్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు జగిత్యాల్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, బోధన్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి అయేషా ఫాతిమాతో కలిసి దాఖలు చేశారు. బాజిరెడ్డి కుటుంబ సభ్యులతో నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నా.. ఈసీ నిబంధనల మేరకు వారు బయటే వేచి ఉన్నారు.

పసుపు రైతులతో కలిసి బీజేపీ అభ్యర్థి..

బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్‌ ధర్మపురి పసుపు రైతులతో కలిసి మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మెడలో పసుపు కొమ్ముల దండ, స్వయంగా కారు నడుపుతూ అర్వింద్‌ నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. పసుపు రైతుల సమక్షంలో, వారి ఆశీర్వాదంతో మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశానని తెలిపారు. పసుపు రైతులు సమకూర్చి ఇచ్చిన డబ్బుతో నామినేషన్‌ డిపాజిట్‌ చెల్లించానని, చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో రైతులు పండించే పసుపు, వరి, మామిడి, మొక్కజొన్న, చెరుకు, ఇతరత్రా పంటలకు విత్తనాల నుంచి మార్కెటింగ్‌ సౌకర్యం వరకూ అన్ని చర్యలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయా పంటల ప్రాసెసింగ్‌, ప్యాకేజీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని, స్వయం ఉపాధి మహిళలకు వాల్యూయాడెడ్‌ సర్వీస్‌లో భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. దేశాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తామని, తద్వారా యువతకు ఉపాధి పెరుగుతుందని తెలిపారు. గల్ఫ్‌ వలసలు ఆపుతామని, అక్కడ ఉన్న వారందరికీ ఉపాధి కల్పించి వాపస్‌ వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పసుపు రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

రెండో రోజు ఆరుగురి నామినేషన్‌

ఇప్పటి వరకు 8 మంది అభ్యర్థుల

నామినేషన్లు దాఖలు

Advertisement
Advertisement