టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఓపెన‌ర్లగా కోహ్లి, రోహిత్‌.. జైశ్వాల్‌కు నో ఛాన్స్‌? | Sakshi
Sakshi News home page

T20 Wc 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఓపెన‌ర్లగా కోహ్లి, రోహిత్‌.. జైశ్వాల్‌కు నో ఛాన్స్‌?

Published Thu, Apr 18 2024 4:56 PM

T20 Wc Squad Latest: Parag in Contention but Yashasvi Jaiswal Could Miss Out - Sakshi

టీ20 వ‌రల్డ్‌క‌ప్‌-2024కు మ‌రో 54 రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వ‌నున్నాయి. జూన్ 2న డల్లాస్ వేదిక‌గా యూనైటడ్‌ స్టేట్స్‌, కెన‌డా మ‌ధ్య‌ జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌తో ఈ పొట్టి ప్రపంచ‌క‌ప్ షురూ కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను మే1 లోపు ప్రకటించాలని  ఐసీసీ ఆయా జట్లకు ఇప్ప‌టికే  డెడ్‌లైన్‌ విధించింది.

దీంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డుల త‌మ జ‌ట్ల‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డాయి. ఈ క్రమంలో భార‌త క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కూడా ఈ మెగా ఈవెంట్‌కు పంపే తమ జట్టును సిద్దం చేసే పనిలో పడింది.

అయితే తొలుత 20  మంది స‌భ్యుల‌తో కూడిన ప్రిలిమ‌న‌రీ జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అందులో నుంచి మే 25లోపు 15 మంది స‌భ్యుల పేర్ల‌ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేయనున్నట్లు సమాచారం.

రియాన్ పరాగ్‌కు ఛాన్స్‌..
అయితే ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతున్న రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్‌కు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. మిడిలార్డర్‌లో అద్బుతంగా రాణిస్తుండడంతో పరాగ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు వినికిడి. పరాగ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పరాగ్‌.. 63.60 సగటుతో 318 పరుగులు చేశాడు. ఇక​ ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రారంభించనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేసి.. మరో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉంచాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2024లో జైశ్వాల్ దారుణ ప్రదర్శన కనబరిస్తున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్‌17.29 సగటుతో 121 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిపై వేటు వేయాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో అద‌ర‌గొడుతున్న సీఎస్‌కే ఆల్‌రౌండ‌ర్ శివమ్ దూబేకు సైతం వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ మెగా ఈవెంట్‌కు భార‌త జ‌ట్ట‌ను బీసీసీఐ సెల‌క్షన్ క‌మిటీ ఏప్రిల్ 30న ప్ర‌కటించే అవ‌కాశ‌ముంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement