నీళ్లు లేవు.. సార్లు రారు | Sakshi
Sakshi News home page

నీళ్లు లేవు.. సార్లు రారు

Published Tue, Apr 9 2024 1:30 AM

Peddapalli School Students Protest On Road Over No Proper Facilities In Hostel - Sakshi

మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల విద్యార్థుల ఆవేదన 

3 కిలోమీటర్లు నడిచి వచ్చి మెయిన్‌ రోడ్డుపై ధర్నా

మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్‌ క్రాస్‌ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు.

సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్‌ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్‌ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. 

ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. 
గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్‌సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్‌ సుస్మిత హాస్ట ల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. 

నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన.. 
బోధన్‌/రుద్రూర్‌: నిజామాబాద్‌ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్‌ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement
Advertisement