-
షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణ మందులు, ఆరు ఔషధ మిశ్రమాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.ఎన్పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యాంటాసిడ్లు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్ ఔషధాలు చౌకగా లభించే మందులలో ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్పీపీఏ ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. మందుల ధర తగ్గింపు వల్ల దేశంలోని 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలగనుంది. కాగా గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది. -
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు
డాక్టర్ ప్రిస్కిప్షన్ రాస్తూ... ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీ లతో రోజును మొదలు పెట్టకండి’ అని చెబితే ఆ కఠోరమైన సూచనను జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. డాక్టర్ ముందు బుద్ధిగా తలూపుతాం. పాటిస్తామని గొంతులో నిజాయితీని ధ్వనింపచేస్తూ బదులిస్తాం. మరునాడు తెల్లవారి కాఫీ–టీలు తాగిన తర్వాతగానీ ముందురోజు డాక్టర్కు ఇచ్చిన మాట గుర్తు రాదు. ఇదంతా మన బ్రెయిన్ మనతో ఆడుకునే ఆటలో భాగం. అయితే ఈ డాక్టర్ మాత్రం టీ వద్దనే వద్దని చెప్పనే చెప్పరు. ‘హాయిగా టీ తాగండి. దేహానికి హాయినిచ్చే తాజా ఔషధ ఆకులతో చేసిన టీని తాగండి’ అంటూ ఒక పెద్ద జాబితానే సూచిస్తారు. అవన్నీ ఇంట్లో సాధ్యమే అంటూ తన ఇంటి టెర్రస్ను చూపిస్తారీ ఉత్తరాఖండ్ డాక్టర్ అన్షు రాఠీ. ఆమె టెర్రస్ మీద 1500 అడుగుల విస్తీర్ణం కలిగిన టెర్రస్ మీద మిరియాలు, యాలకుల చెట్లతో సహా 400 మొక్కలను పెంచుతున్నారు. అందులో పండ్లు, కూరగాయలతో పాటు అశ్వగంధ, తులసి, ఆరెగానో, పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, లవంగాలు, జాజికాయ, సోంఫు, మెంతులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంగువ, మిర్చి, కొత్తిమీర, కలోంజి (నల్ల జీలకర్ర) వంటి 15 రకాల ఔషధ మూలికల మొక్కలున్నాయి. ఏడాదంతా సీజనల్గా వచ్చే అనేక అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... ఆయా కాలాల్లో ప్రకృతి ఇచ్చిన ఔషధాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు 36 ఏళ్ల అన్షురాఠీ. నేర్చుకోండి... పచ్చగా పెంచుకోండి! ‘‘మనదేశంలో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది. ప్రదేశాలు, కాలాలను బట్టి ఆయా నేలల్లో కొన్ని ప్రత్యేకమైన జాతులు విస్తరిస్తుంటాయి. వాటికి అనువైన పరిస్థితులను అంచనా వేయగలిగితే వాటన్నింటినీ ఒకే చోట పెంచవచ్చు. కొత్తిమీర, మిరియాలు, జీలకర్రలను పెంచాలంటే అక్టోబర్-నవంబర్ నెలల్లో నారు పోయాలి. పసుపును మే-జూన్ నెలల్లో నాటాలి. నాటడం నుంచి ప్రతి దశనూ ఆస్వాదించాలంటే అలా చేయవచ్చు. గార్డెనింగ్లో అనుభవం లేని వాళ్లు మాత్రం నారుమడిలో గింజలు చల్లడం నుంచి మొదలు పెట్టకుండా నర్సరీ నుంచి నారు మొలకలను కొనుక్కోవడం మంచిది. మిరియాలు, యాలకుల వంటి వాటిని నాటేముందు రాత్రంతా నానబెట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలను నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నాటే పంటల కాల వ్యవధిని కూడా గమనించుకోవాలి. కొత్తిమీర రెండు వారాల్లో చేతికొస్తుంది, మెంతికి నాలుగు రోజులు చాలు. జీలకర్ర నారు 45 రోజులు తీసుకుంటుంది. ముందుగా ఒక కప్పులో నారు పోసి మొలకలు వచ్చిన తర్వాత ఆ నారు తీసి పెద్ద కుండీలు లేదా ట్రేలలో నాటాలి. ఈ ట్రేలను ఓ వారం రోజుల పోటు నీరెండలో ఉంచి ఆ తర్వాత ఎండలోకి మార్చాలి. View this post on Instagram A post shared by 🦋Dr. Rathi Anshu / Sustainability/Plant care tips , DIY, Decor (@myplantsmygarden) జీలకర్ర, కొత్తిమీర (ధనియాలు రావడానికి) పంట రావడానికి ఐదు నెలలు పడుతుంది. మిరియాలు మూడేళ్లు, యాలకులు ఐదేళ్ల సమయం తీసుకుంటాయి. మొక్కలు పెంచడంలో మట్టిని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మనం ఉన్న ప్రదేశంలో లభించే మట్టి స్వభావాన్ని గమనించుకోవాలి. మట్టిని పట్టుకుని ముద్ద చేసినప్పుడు సులభంగా బంతి ఆకారం వస్తే ఆ మట్టి జిగురుగా ఉన్నట్లు. అందులో 20 శాతం ఇసుక, 30 శాతం ఆవుపేడ, వేప పిప్పి కల΄ాలి. ఇలా తయారు చేసుకున్న మట్టిలో నాటిన మొక్కలకు తరచు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పంటకోతకు రావడానికి రెండువారాల ముందు వర్మీ–కంపోస్టు వేస్తే సరిపోతుంది. నేనున్నది గంగా నది–యమునా నదికి మధ్య విస్తరించిన నేల. ఇక్కడ మట్టి... మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలేవీ అవసరం లేదు. వంటగది వ్యర్థాలనే ఎరువుగా వేస్తున్నాను. వీటన్నింటినీ సొంతంగా పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంత సమయం, మరికొంత శ్రద్ధ ఉంటే చాలు. ఉదయాన్నే అరలీటరు నీటిలో తులసి, మెంతితోపాటు నచ్చిన తాజాఆకులను వేసుకుని పావు లీటరు అయ్యే వరకు మరిగించి రుచి కోసం తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కోసం ప్రయాస పడాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఫార్మసీ, మీరే వైద్యులు’’ అని ఆరోగ్యం కోసం ఔషధాలను కప్పులో పోసి ఇస్తున్నారు డాక్టర్ అన్షు రాఠీ. -
పూత రాలి.. కాయ కుళ్లి
కొల్లాపూర్ /జగిత్యాల అగ్రికల్చర్ ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి. మితిమీరి పురుగు మందుల పిచికారీ తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ధరలు సైతం నేలచూపులే ఏటా సీజన్ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది. మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా: బోధన్రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదుకోవాలి.. నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ రెండు సార్లు మందులు కొట్టాను పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి పూత నిలబడలేదు వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజేఎంఆర్లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు. జలుబుకు ఇన్ని మందులా..! సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్ట్రోమితార్పాన్,రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్ కోవిడ్కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు. నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్+డోంపెరిడోన్ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. రియాక్షన్లు..దుష్ప్రభావాలు కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. డోసులు ఎక్కువ తక్కువ! నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్ మందులు, హార్మోన్ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు. డాక్టర్లకు అవగాహన కల్పించాలి ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్ తీసుకువచ్చిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కేవలం వెబ్సైట్కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త -
మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్
కొందరు ఏదైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే బెంబేలెత్తిపోరు. చాలా ధైర్యంగా ఉండటమే గాకుండా మందులతో పనిలేకుండా చక్కటి జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని చూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే భారత సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఏం జరిగిందంటే?..సౌత్ చైనాలోని హంకాంగ్కి చెందిన రవి చంద్ర(51) అనే వ్యక్తి మదుమేహాన్ని మందులు వాడకుండానే నియంత్రించొచ్చని ప్రూవ్ చేసి చూపించాడు. అతను హాంకాంగ్లోని అమోలి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పనిచేస్తున్నాడు. అతనికి 2015లో చంద్రకి షుగర్ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వైద్యుల మందులు వాడమని సూచించడం జరిగింది. అయితే అతను ఆ మందులు వాడుతున్నా..రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు కనిపించలేదు. అందువల్ల అతను వాటికి బదులుగా ఫిట్నెస్పై దృష్టి సారిస్తే బెటర్గా ఉంటుందేమో అని భావించాడు. అందుకోసం అతను రోజు జాగింగ్, వాకింగ్ వంటి చేయడం ప్రారంభించాడు. దీంతో జస్ట్ మూడు నెలల్లోనే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేశాయి. అలా అతను క్రమం తప్పకుండా పరిగెత్తడం ప్రారంభించి మారథాన్ వంటి రేసుల్లో కూడా పాల్లొన్నాడు. అంతేగాదు చైనా, తైవాన్, భారత్ వంటి దేశాల్లో జరిగే పలు మారథాన్లలో పాల్గొన్నాడు . అలా అతను ఇప్పటి వరకు దాదాపు 29 రేసుల్లో పాల్గొన్నట్లు తెలిపాడు. మొదట్లో ఒక్క కిలోమీటరు నుంచి ప్రారంభించి క్రమంగా పది కిలోమీటర్లు పరుగు, నడకలలో మెరుగపడ్డానని వివరించారు. అంతేగాదు సుమారు 100కు పైగా మారథాన్లో పాల్గొన్న తన స్నేహితుడే తనకు ఈ విషయంలో స్పూర్తి అని చంద్ర చెబుతున్నాడు. తాను ఈ పరుగును చిన్న ఏరోబిక్ ఫంక్షన్ టెక్నిక్ని ఉపయోగించి పరిగెడతానని అన్నారు. అది హృదయ స్పందన రేటు సక్రమంగా ఉండేలా చేస్తుందని అన్నారు. ఇక చంద్ర తన డైట్లో శాకాహారమే తీసుకుంటానని, అప్పుడప్పుడూ చేపలు, చికెన్ తింటానని చెప్పారు. అలాగే లంచ్, డిన్నర్లలో ఎక్కువుగా కూరగాయలే ఉండేలా చూసుకుంటానని అన్నారు. చిరుతిండిగా కేవలం పండ్లే తింటానని చెప్పారు. ప్రస్తుతం అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 8 నుంచి 6.80కి పడిపోయాయి. అంతే షుగర్ లేదనే చెప్పొచ్చు. భలే చక్కగా ఫిట్నెస్పై దృష్టిసారించి మందులు వాడకుండానే మధుమేహాన్ని కట్టడి చేసి అందరికి ప్రేరణ కలిగించేలా చేశాడు. నిజంగా గ్రేట్ కదూ. అతను ఓ పక్క అత్యున్నాధికారి హోదాలో ఆఫీస్ పనులు చేసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. వర్క్లో చాలా బిజీ అని సాకులు చెప్పేవాళ్లు కూడా అవాక్కయ్యేలా షుగర్ని కట్టడి చేశారు రవిచంద్ర. (చదవండి: చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..) -
ఈఏపీసెట్, నీట్ విద్యార్థులకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్లు
సాక్షి ఎడ్యుకేషన్: ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం..ఇంజినీరింగ్, లేదా మెడిసిన్. అధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ను అందించే ఇంజినీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్లో చేరి్పస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్..అలాగే, ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లున్కల్పించే ఈఏపీసెట్కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈఏపీసెట్, నీట్ పరీక్షలకు ‘సాక్షి’ మాక్ టెస్ట్లు నిర్వహించనుంది. దీనికి టెక్నాలజీ పార్ట్నర్గా ‘మై ర్యాంక్’ వ్యవహరిస్తోంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్ష లాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్స్ స్థాయిని అంచనా వేసుకుని, దాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్న్ఫీజు రూ.250గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్కు ఏప్రిల్ 22 చివరి తేదీ. రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్కు హాల్ టికెట్ నంబర్ వస్తుంది. ఏప్రిల్ 27న నీట్, ఏప్రిల్ 28న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలుంటాయి. ఈ ఆన్లైన్ టెస్ట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. పరీక్షా సమయం 3 గంటలు. ఈ పరీక్షలకు హాల్ టికెట్ నంబర్ (యూజర్ నేమ్), ఫోన్ నెంబర్ (పాస్వర్డ్)తో ఆ సమయంలో ఎప్పుడైనా లాగిన్ అయ్యి రాసుకోవచ్చు. పరీక్ష ముగిసిన వెంటనే స్కోర్ను వెంటనే చెక్ చేసుకోవచ్చు. మాక్ పరీక్షలను https://sakshimocktest.myrank.co.in లో నిర్వహిస్తారు. టెస్ట్ కీ ని ఏప్రిల్ 30న ఇదే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. çపూర్తి వివరాలకు 95055 14424, 96660 13544, 96665 72244 నంబర్లకు కాల్ చేయవచ్చు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. చంద్రబాబు పాలనలో ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉండేది. దీంతో అప్పట్లో ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల పాలనలో పూర్తిగా చక్కబెట్టింది. ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులను ఉంచేలా చర్యలు తీసుకుంది. 2019 ముందు ఏటా చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు చేసి మందుల సరఫరా చేపట్టింది. కొరతకు తావివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం డబ్ల్యూహెచ్వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల సరఫరాకు సంబంధించి 2018–19 సమయంలో రేట్ కాంట్రాక్ట్లో 608 గాను 229 మందులే ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో 608 మందులకు గాను 566 మందులు రేట్ కాంట్రాక్ట్లో ఉంటున్నాయి. రేట్ కాంట్రాక్ట్లో ఉన్న మందులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200లకు పైగా, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. పీహెచ్సీలు, విలేజ్క్లినిక్స్కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే అందుబాటులో ఉంచుతున్నారు. మందుల బడ్జెట్లో గణనీయమైన పెరుగుదల టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందుల కోసం బడ్జెట్ గణనీయంగా పెరిగింది. పెరిగిన బడ్జెట్ ప్రభుత్వాస్పత్రుల్లో పుష్కలంగా మందులు ఉంటున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది. టీడీపీ ప్రభుత్వంలో 2015–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ. 216 కోట్లు మాత్రమే మందులకు వెచ్చించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్లు వ్యయం చేశారు. దీన్ని బట్టి టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏటా రూ. 200 కోట్లకు పైగా అదనంగా మందుల కోసమే ఖర్చు పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగి వైద్య సేవల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.700 కోట్ల మేర మందుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. -
హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి..
నోట్లో ఉన్న ఆహారాన్ని నమిలాక మింగివేసే ప్రక్రియ చాలా సులువుగా జరుగుతున్నట్లు అనిపిస్తుందిగానీ, నిజానికి ఇదొక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో నోరు, జీర్ణవ్యవస్థ తాలూకు కండరాలూ, నరాలు ఇవన్నీ పాలుపంచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని అంతరాయాలూ, అవాంతరాలతో గుటక వేసే ఈ ప్రక్రియ కష్టమవుతుంది. ఇలా మింగడం కష్టమయ్యే కండిషన్ను ‘డిస్ఫేజియా’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి పరిష్కారాలేమిటి అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుటక వేసే ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ఓరల్ ఫేజ్.. ఓరల్ ఫేజ్లో నోట్లో ఆహారాన్ని నమలడం లేదా చప్పరించడం జరుగుతుంది. అలా ఆహారాన్ని గొంతులోకి పంపడానికి సిద్ధం చేసే దశ వరకు ఓరల్ ఫేజ్ అంటారు. ఇందులో నోరు, నాలుక, పెదవులు, దంతాలు పాలుపంచుకుంటాయి. ∙ఇక ఫ్యారింజియల్ ఫేజ్ అంటే... తిన్నది కాస్తా గొంతు దగ్గర్నుంచి ఆహార నాళంలోకి చేరే దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ పొర విండ్ పైప్ను మూసుకుపోవడం వల్ల ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోకే వెళ్తుంది. ∙ఈసోఫేజియల్ ఫేజ్ దశలో ఆహారం ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా ఆహారనాళంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కడుపులోకి వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మింగడం అనేది చాలా సులువుగా మన ప్రమేయం లేనట్టుగా జరిగినట్లు అనిపించినా, నిజానికి మింగడం అన్నది మన సంకల్పంతోనే జరుగుతుంది. గుటక వేయడంలో సమస్యలూ... కారణాలు ఫ్యారింజియల్ ఫేజ్.. గుటక వేసే దశలైన ఓరల్, ఫ్యారింజియల్, ఈసోఫేజియల్ దశల్లో ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా మింగడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డిస్ఫేజియా’ అంటారు. ఒక్కోసారి జీర్ణ వ్యవస్థను నియంత్రించే నరాల సమస్య వల్ల కూడా గుటక వేయడం సాధ్యం కాకపోవచ్చు. గుటక వేయలేకపోడానికి మరికొన్ని కారణాలు.. ఈసోఫేజియల్ ఫేజ్.. మరీ చిన్న పిల్లల్లో... తల్లిపాలు తాగడంలో ఇబ్బందులు, మరికాస్త పెద్ద పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో శరీరాన్ని బిగబట్టడం; నమలలేకపోవడం, తినడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. తినే సమయంలో దగ్గు రావడం లేదా పొలమారడం ∙తరచూ వాంతులు చేసుకోవడం ∙నోటి నుంచి ముక్కు నుంచి చొల్లు కారడం ∙గాలి తీసుకోవడానికీ, తినడానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం తరచూ నెమ్ము లేదా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడటం ∙గొంతు గరుకుగా మారడం లేదా గొంతులోంచి గాలి రావడం ఇక పెద్దవయసువారిలో.. తల, మెడ, ఆహార వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థలో కండరాలూ, వాటిని నియంత్రించే నరాల సమస్యతో మింగడం కష్టం కావచ్చు. ఇందుకు దారితీసే పరిస్థితుల్లో కొన్ని.. గొంతు లేదా తల భాగంలో దెబ్బ తగలడం మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు వెన్నుపూసకు గాయం కావడం అల్జైమర్స్ మతిమరపుతో గుటకవేయలేకపోవడం మల్టిపుల్ స్కి›్లరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్, వయసు పైబడటంతో వచ్చే సమస్యలు గొంతు లేదా తలకు సంబంధించిన క్యాన్సర్తో మింగలేకపోవడం కొన్ని రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల మింగలేకపోవడం కారణమేదైనప్పటికీ గుటక వేయలేని పరిస్థితితో పాటు నోటి నుంచి అదేపనిగా చొల్లు కారడం, తినేటప్పుడు విపరీతంగా దగ్గురావడం, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు.. బాధితుల లక్షణాలను బట్టి.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన పరీక్షలు; నోటి పరీక్షలు, స్వరపేటికకు సంబంధించిన పరీక్షలు; నరాలకు సంబంధించిన లోపాలను తెలుసుకోడానికి సీటీ స్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై హెడ్ అండ్ నెక్ వంటి పరీక్షలు అవసరం. వీటితో పాటు మాడిఫైడ్ బేరియమ్ స్వాలో టెస్ట్; వీడియో ఫ్లోరోస్కోపీ, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ (ఫీస్) / ట్యూబ్ ఇవాల్యుయేషన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించాల్సి రావచ్చు. చికిత్స.. సమస్య ఏ కారణంతో వచ్చిందనే అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా యాక్సిడెంట్ వంటి కేసుల్లో సర్జరీతో పరిస్థితిని చక్కదిద్దాల్సి రావచ్చు. (ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఆహారం గుటకవేయలేని పరిస్థితి ఉంటే రైల్స్ ట్యూబ్ ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తారు). ఈసోఫేజియల్ దశలో వచ్చే సమస్యలకు ఈసోఫేజియల్ డయలేషన్, స్టెంట్ ప్లేస్మెంట్ చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఓరల్, ఫ్యారింజియల్ దశల్లో వచ్చే సమస్యలను స్వాలోయింగ్ థెరపీ వంటి చికిత్స అవసరం పడవచ్చు. క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, మందులతో చికిత్స వంటి రకరకాల చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. — డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్. -
నకిలీ మందుల ముఠా గుట్టు రట్టు!
దేశరాజధాని ఢిల్లీలో నకిలీ మందులను తయారు చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు రూ.1.96 లక్షల విలువైన క్యాన్సర్కు సంబంధించిన నకిలీ ఇంజెక్షన్లను విక్రయించారు. చైనా, అమెరికా తదితర దేశాలకు కూడా వీరు క్యాన్సర్ నకిలీ మందులను పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన రూ.89 లక్షల నగదు, రూ.18 వేల డాలర్లు, ఏడు అంతర్జాతీయ, రెండు భారతీయ బ్రాండ్లకు చెందిన క్యాన్సర్ నకిలీ మందులను క్రైమ్ బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ షాలినీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం మూడు నెలల విచారణ అనంతరం పోలీసుల దర్యాప్తు బృందం ఈ ముఠాను పట్టుకోగలిగింది. ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసుల బృందం ఢిల్లీ ఎన్సీఆర్లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు చేసింది. విఫిల్ జైన్ నకిలీ మందుల రాకెట్కు సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. ఇతనికి చెందిన ఇళ్ల నుంచి మూడు క్యాప్ సీలింగ్ మిషన్లు, ఒక హీట్ గన్ మెషీన్ మొదలైనవాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు కోమల్ తివారీ, అభినయ్ కోహ్లీలను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. -
దేశం చూపు రాష్ట్రం వైపు
సాక్షి, అమరావతి : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరికం నిర్మూలనే ధ్యేయంగా.. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు సీఎం జగన్ అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ. 2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఇంత భారీ ఎత్తున పేదల ఖాతాల్లో జమ చేయడం ఇదే తొలిసారి. ఇది దేశంలో అన్ని వర్గాల ప్రజల చూపు రాష్ట్రం వైపు చూసేలా చేసింది. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,79,246.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4,38,102.91 కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియో గం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగు పరుచుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కార్ హయాంలో పేదరికం 11.77 శాతం ఉంటే.. అది 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. అభివృద్ధికి ఊతం ♦ అంతర్జాతీయ స్థాయి విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్ను బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటతో ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది. ♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ.. ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసే శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో 1.80 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఎడెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ♦ నాణ్యమైన వైద్యం అందించడానికి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలు లేకుండా 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరి మితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి రూ.13 వేల కోట్ల వ్యయం చేసి.. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 17 కొత్త కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభమవగా.. వచ్చేవి ద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీ లు ప్రారంభం కానున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్ట, విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లు రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. గత 58 నెలల్లోనే రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు రావడమే అందుకు తార్కాణం. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. ♦ ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)ల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 35 శాతం ఉండటమే అందుకు తార్కాణం. ♦ విప్లవాత్మక సంస్కరణతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. ♦ సీఎం జగన్ సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతిపథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాల్సిందేననే చైతన్యం విద్యావంతులు, మేధావులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో రగులుతోంది. -
నల్లేరా..మజాకా...! ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసా?
ప్రకృతిని ఆధునీకులు సరిగ్గా పట్టించుకోరు కానీ.. ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాటి వాటిల్లో నల్లేరు కూడా ఒకటి. తీగ జాతికి చెందిన దీన్నే వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంధాన అని కూడా పిలుస్తారు. నల్లేరు లాభాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.! పట్టణ వాసులతో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు వీటిపై అవగాహన ఉంటుంది. గుబురు పొదల్లో, డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ కాడల్ని పాదుల మధ్య అక్కడడక్కడ వేస్తారు. తొండలు, ఉడతలు కూరగాయల పిందెల్ని కొరికేయకుండా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే దీని కోసినా, కొరికినా దురద వస్తుంది. నల్లేరుతో వంటలు అలా కూరగాయల పాదులపై వేసిన కాడలే.. వాటంతట అవే క్రమేపీ విస్తరించి అల్లుకుపోతాయి. ఇది వంట ఇంటిలోకి కూడా చేరింది. అయితే నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు. నల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు. వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఒకవంతు నల్లేరు గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి మెత్తగా నూరుకోవాలి. దీనిని రొట్టెలా తయారు చేసుకుని తింటే కొండ నాలుక రావడం, కోరింత దగ్గు తగ్గుతుంది. ఔషధ గుణాలు ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం , ఎముకలు విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు. నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాల కూడా శక్తినిస్తుంది. ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధగుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడతారు. నల్లేరులో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు. మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లోముఖ్యమైన ఎముకల బలహీనత చాలా ముఖ్యంది చెబుతారు. నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట. అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. -
అబద్ధాల రోగం.. కథనాలు ఘోరం
సాక్షి, అమరావతి: అబద్ధాలు అచ్చేయకపోతే రామోజీరావుకు నిద్రపట్టేలా లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లకుండా ఆయన భోజనం చేయలేరు. పేదలకు అందించే ఉచిత కార్పొరేట్ వైద్యం పైనా విషపురాతలే. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందడం రామోజీరావుకు నచ్చడం లేదు. మన రాష్ట్రంతో పాటు, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద పేద, మధ్యతరగతి ప్రజలకు అందుతున్న ఉచిత వైద్య సేవలపై నిత్యం కడుపు మంటను ప్రదర్శిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగానే ‘బకాయిల రోగం.. సేవలు ఘోరం!’ అంటూ ఈనాడు పత్రికలో శుక్రవారం కథనం అచ్చేశారు. ఆ పథకం సమర్థవంతంగా అమలు కావడం లేదంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. బకాయిల కారణంగా రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోయాయంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే.. ఈ ఏడాది రూ. 2,790.61 కోట్లు చెల్లించిన ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పథకానికి ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. బాబు పాలనలో నిర్వీర్యమైన పథకానికి సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ద్వారా ఊపిరిలూదారు. ఇటీవలే పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని ఏకంగా రూ. 25 లక్షలకు పెంచారు. 1,059 ప్రొసీజర్లను 3,257కు తీసుకుని వెళ్లారు. ప్రొసీజర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో 2019కు ముందు రోజుకు సగటున 1,547 చికిత్సలు చేయగా, ప్రస్తుతం 5,608 చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ఇంత ఘనంగా కొనసా గుతుంటే.. రాష్ట్రంలో నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయంటూ అబద్ధాలను అల్లి ఆ కథనం ప్రచురించారు. నిజానికి ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఏ నెట్వర్క్ ఆస్పత్రిలోనూ రోగులను చేర్చుకోని ఘటనలు లేవు. కావాలని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు, సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. త్వరితగతిన క్లెయిమ్లు గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రూ. 2,146.90 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 2,790.61 కోట్లు విడుదల చేశారు. ఆస్పత్రుల నుంచి వచ్చే క్లెయిమ్లను త్వరితగతిన అత్యంత పారదర్శకంగా ఆమోదిస్తున్నారు. ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులను ప్యానెల్ వైద్యులుగా తీసుకునే ప్రక్రియ చేపడుతున్నారు. క్యాన్సర్ చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎయిమ్స్, హోమీబాబా, శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్, రాష్ట్ర ప్రభుత్వం సంస్థలైన డీఎంఈ, స్విమ్స్, విమ్స్ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో క్లెయిమ్స్ ఆమోద ప్రక్రియలో తీవ్రమైన జాప్యానికి ఆస్కారమే లేదు. లంచాలకు తావు లేకుండా లంచాలకు, డబ్బు వసూళ్లకు తావులేకుండా పేదరోగులకు పూర్తి ఉచితంగా పథకం సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందేటప్పుడు నెట్వర్క్ ఆరోగ్యమిత్రల పర్యవేక్షణ ఉంటుంది. డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందాయో రోగుల నుంచి అభిప్రాయ సేకరణ విధానం అమలు చేస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కూడా రోగులు ఇంటికెళ్లి ఏఎన్ఎంలు మరోమారు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైన రోగులు లంచాలు, చేతి నుంచి డబ్బు చెల్లించిన ఘటనలు వెలుగు చూస్తే వెంటనే ఆ డబ్బులు వెనక్కి ఇప్పించడంతో పాటు, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. రోగులకు పథకం విషయంలో సందేహాల నివృత్తి వారికి ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు 104 కాల్ సెంటర్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటున్నారు. -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
నకిలీ మందుల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్ పై సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్రెడ్డి కోరారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్లను పోలి ఉండేలా కొన్ని మోసపూరిత కంపెనీలు నకిలీ మందులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు గత కొద్ది రోజులలో డీసీఏ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో గుర్తించిన మందులే ఉదాహరణగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా కాలక్రమేణా, రోగికి వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తాయని తెలిపారు. అనుమానం వచ్చినా ఫోన్ చేయండి నకిలీ మందులను గుర్తించినా, నకిలీ అనే అనుమానం వచ్చినా స్థానిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేయాలని సూచించారు. వివరాల కోసం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ వెబ్సైట్ https:// dca.telangana.gov.in లో ‘కీ కాంటాక్ట్స్’ విభాగంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 18005996969లో అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మెడికల్ షాపు ల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (పేరు, సంప్రదించాల్సిన నంబర్, చిరునామా) వివరాలు, డీసీఏ టోల్ ఫ్రీ నంబర్తో కూడిన ‘పోస్టర్’ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనో ల్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా అమెరికాకు చెందిన మహిళల ఆరోగ్య సంరక్షణ, సప్లిమెంట్స్ ఉత్పత్తుల సంస్థ మెనోల్యాబ్స్ను కొనుగోలు చేసింది. అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ అమిరిస్లో భాగమైన మెనోల్యాబ్స్ను దివాలా కోడ్ ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. మెనోల్యాబ్స్ పోర్ట్ఫోలియోలో ఏడు బ్రాండెడ్ ఉత్పత్తులు, యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. మహిళల పౌష్టికాహార, వెల్నెస్ ఉత్పత్తుల మార్కెట్లో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు మెనోల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడగలదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్తర అమెరికా విభాగం సీఈవో మార్క్ కికుచి తెలిపారు. మెనోల్యాబ్స్ అమెరికాలో తమ సొంత ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్తో పాటు అమెజాన్, వాల్మార్ట్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
మందులు డోర్ డెలివరీ..
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన వి. అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటివద్ద కాలుజారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో లేచి నడవలేని పరిస్థితి. బీపీ సమస్యతో బాధపడుతున్న తను ఊరిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లి మందులు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ కు మందుల కోసం వెళ్లింది. భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో) అబిగైల్ ఆరా తీశారు. బాధితుడు కదల్లేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులు అవసరమున్నాయని ఎంవో యాప్లో నమోదు చేసింది. మరుసటి రోజు నెల రోజులకు సరిపడా మందులు విలేజ్ క్లినిక్కు పోస్టల్లో వచ్చాయి. వాటిని సీహెచ్వో ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేసింది. మందులను వాడే క్రమాన్ని వివరించింది. ఈ పరిణామంతో అప్పలకొండ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కదల్లేని స్థితిలో ఉన్న తనకు ఇంటి వద్దకే అవసరమైన మందులను అందించారు. ప్రయాసలను తగ్గించారు. మాలాంటి వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని సీహెచ్వోతో తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఇలా ఒక్క అప్పలకొండ మాత్రమే కాదు...గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత, క్యాన్సర్ వంటి ధీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా..వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువచేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు. తపాల శాఖ ద్వారా మందులు సరఫరా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ మాడ్యూల్ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫారసు చేస్తారు. ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి, తపాల శాఖ ద్వారా విలేజ్ క్లినిక్లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సీహెచ్వోలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఇంటి వద్దకే మందులు తెచ్చి ఇచ్చారు – టి. నిక్సాన్, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా పదేళ్లుగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుకునే వాడిని. ప్రభుత్వం కొత్తగా ఇంటి వద్దకే మందులు సరఫరా చేస్తున్నారంటూ స్థానిక విలేజ్ క్లినిక్ వాళ్లు మందులు తెచ్చి ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఊరటనిచ్చే విధానమిది. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది – అబిగైల్, సీహెచ్వో, కొమరవోలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, అనకాపల్లి జిల్లా విలేజ్ క్లినిక్లో 105 రకాలు, పీహెచ్సీలో కొన్ని వందల రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు అవసరమైన మందుల జాబితాను ఆన్లైన్లో సూచించిన వెంటనే పోస్టల్లో మాకు వాటిని పంపుతున్నారు. ఈ మందులను ఇళ్ల వద్దకు వెళ్లి అందించినప్పుడు వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది. వేగంగా మందుల సరఫరా – డి. మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ సకాలంలో మందులు అందక, ఇతర దుకాణాల్లో కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే మందుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు వైద్యాధికారుల నుంచి ఆన్లైన్లో వచ్చిన ఇండెంట్లను పరిశీలించి మందులను పార్సిల్ రూపంలో మరుసటి రోజే పోస్ట్ చేస్తున్నాం. సీహెచ్వోలు మందులను అందజేసి, ధ్రువీకరణ కోసం ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. -
డ్రోన్ సాయంతో మందుల తరలింపు?
బీబీనగర్: గ్రామీణ రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ను బీబీనగర్ ఎయిమ్స్ వైద్యశాలకు తరలించి, వాటి ఆధారంగా తిరిగి రోగులకు అవసరమయ్యే మందులను డ్రోన్ విమానంలో తరలించేలా అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి భువనగిరిలోని ఓ మార్కెట్ ఆవరణలో నుంచి చిన్నపాటి డ్రోన్లో మందులను అమర్చి కంప్యూటర్ ద్వారా నియంత్రిస్తూ ఎయిమ్స్కు పంపినట్లు సోషల్ మీడియాలో బుధవారం ఓ వీడియో వైరల్ అయింది. దీనిపై ఎయిమ్స్ అధికారులు, డ్రోన్ విమానాన్ని తరలించిన ప్రాజెక్టు నిర్వాహకులను వివరాలను అడిగినప్పటికీ వెల్లడించకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎయిమ్స్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా వైద్య శిబికాలె నిర్వహిస్తున్నారు. రోగుల నుంచి వివిధ పరీక్షల నమూనాలను సేకరించి వారికి సిబ్బంది నేరుగా మందులను పంపిణీ చేస్తారు. కానీ, ఇప్పుడు డ్రోన్ విమానం ద్వారా ఎయిమ్స్కు మందులు, శాంపిల్స్ తరలించేలా ట్రయల్రన్ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ప్రభుత్వానికీ మనసు ఉండాలని..
సాక్షి, అమరావతి : విశ్వసనీయతకు నిలువెత్తురూపం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆలోచనల్లో నిబద్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆచరణలో ఎంతటి కష్టం, నష్టం ఉన్నా వెనక్కి తగ్గని గుణం ఆయన సొంతం. జీవనశైలి అత్యంత సాదాసీదాగా ఉంటుంది. మితాహారం ఆయనకు ఇష్టం. నిద్ర కూడా పరిమితమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అధికారంలో ఉన్నప్పుడూ అంతే నిరాడంబరత ఆయనలో కనిపిస్తుంది. మాట, భాష, వ్యవహార శైలే దీనికి నిదర్శనం. రోజురోజుకూ ఆయనలో ఓపిక, సహనం పెరుగుతూనే ఉన్నాయి. ఎంతమందితో మాట్లాడినా, ఎన్ని గంటలు చర్చించినా ముఖంలో చిరునవ్వు అలాగే కనిపిస్తుంది. మితాహారం మితాహారం తీసుకోవడం, అదే సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం జగన్లో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఆయన లేచిన తర్వాత రెండు కప్పుల టీ, తర్వాత గ్లాసుడు జ్యూస్ మాత్రమే ఉదయం తీసుకుంటారు. లంచ్కు ముందు కప్పు కాఫీ, లంచ్లో వెజిటబుల్ సలాడ్, పన్నీర్, తక్కువ మొత్తంలో ఫిష్ లేదా సంబంధిత ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. సాయంత్రం కూడా ఒక కప్పు కాఫీ తాగుతారు. రాత్రికి పుల్కా లేదా, రోటీతో కూరగాయలు తీసుకుంటారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పరిమితమైన ఆహారం, వ్యాయామం విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. స్వీట్లు లాంటి పదార్థాలకు దూరంగా ఉంటారు. ఎంత అవసరమో అంతే ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు. ఆపన్నులకు అండ వైఎస్ జగన్.. అనే పేరు వింటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఒక నమ్మకం. ఆయన ఉన్నాడు.. మనల్ని చూసుకుంటాడనే భరోసా కనిపిస్తుంది. ఇంతటి విశ్వాసం పొందడానికి ఆయన అనుసరిస్తున్న మార్గాలు కూడా స్ఫూర్తిదాయకం. ఒక నాయకుడిగా తాను నడవటమే కాదు పది మందినీ నడిపించే ప్రేరణతో కూడిన శక్తి ఆయన సొంతం. రుజువర్తన, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల, అవి నేరవేరే దాకా చెక్కుచెదరని సంకల్పం, అన్నింటికీ మించి క్రమశిక్షణ ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాయి. గొంతు విప్పలేని వర్గాలకు ఒక స్వరమై, ఆపన్నులకు ఆపద్భాంధవుడై ఆయన నిలవడం వెనుక ఈ వ్యక్తిత్వమే కారణం. దినచర్య ఇలా.. సమయాన్ని అత్యంత విలువైనదిగా జగన్ భావిస్తారు. అందుకనే రోజువారీ ప్రణాళిక విషయంలో షెడ్యూలు ప్రకారం ముందుకు సాగుతారు. తెల్లవారక ముందే నిద్రలేచే అలవాటును అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ వదులుకోలేదు. ఉదయం 4గంటలకు ఆయన దినచర్య ప్రారంభం అవుతుంది. ఆరోజు దినపత్రికలను ఒకసారి పరిశీలిస్తారు. స్పందించదగ్గ విషయాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి ఆదేశాలు ఇస్తారు. గంటకు పైగా వ్యాయామం ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఇంగ్లిషు ఛానల్స్, లేదా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక, పాలనా రంగాల్లో వస్తున్న అంశాలపై నిపుణులు చేసిన పోడ్కాస్ట్ వింటారు. ఇందులో స్వీకరించదగ్గ అంశాలను గుర్తు పెట్టుకుని ఒక పేపర్పై రాసుకుంటారు. రాష్ట్రానికి అవసరమైన అంశాల విషయంలో అవి ఎంత వరకు మేలు చేస్తాయనే విషయాన్ని ఆలోచించి వాటిని అమలు చేస్తారు. వ్యాయామం ముగిసిన తర్వాత తన కార్యాలయానికి రెడీ అవుతారు. సాధారణంగా మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యాలయంలోనే ఉంటారు. అధికారులతో సమీక్షలు, పాలనా పరమైన వ్యవహారాలు, పార్టీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కార్యాలయానికి వచ్చిన తర్వాత మొదట సీఎంఓ అధికారులతో సీఎం ప్రతి రోజూ సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలపై చర్చ ఉంటుంది. ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అమలు, అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా? ఎవరినైనా ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? అన్నదానిపై ప్రధానంగా చర్చ ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ల నుంచే ఆయన అధికారులతో నిరంతరం ఒక మాట చెప్తూ ఉంటారు. ‘నేను అయినా, మీరు అయినా ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. దాపరికంతో ఉన్నా, మీ ముందు నేను మనసు విప్పి ఓపెన్గా మాట్లాడకపోయినా ఈ సమావేశానికి అర్థం ఉండదు. ఏ అంశంపైనైనా మీ అభిప్రాయాలను సంకోచం లేకుండా చెప్పొచ్చు. అప్పుడే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం’ అని పలుమార్లు చెప్పారు. వ్యతిరేకులు చెప్పిన విషయాల్లో కూడా తీసుకోదగ్గవి ఉంటే మనస్ఫూర్తిగా స్వీకరించాలని, వాటిని పాజిటివ్గా తీసుకోవాలని అధికారులకు సూచించడం.. ఆయన వ్యవహార శైలిలో భాగం. విపత్తు సమయాల్లో అసహాయులైన వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా సీఎం మెరుపు వేగంతో స్పందించడం గురించి పలుమార్లు అధికారులు గుర్తు చేస్తుంటారు. ఒంటరిగా భోజనం చేయడం అరుదు మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా ఆ సమయం వృథా కాకుండా సీనియర్ అధికారులతోనో లేదా పారీ్టకి చెందిన నాయకులతోనో కలిసి భోజనం చేస్తూ అనేక విషయాల మీద మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకల్లా కార్యాలయానికి వచ్చి.. పాలనా విధుల్లో నిమగ్నమవుతారు. సాయంత్రం దాదాపు 7 గంటల వరకూ కార్యాలయంలో ఉంటారు. తిరిగి ఇంటికి వెళ్లిన సందర్భంలో కూడా ఒకరిద్దరు కార్యదర్శులు, సీనియర్ అధికారులు వెంటవెళ్తారు. ఈ సమయంలో మరో గంటన్నరసేపు ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చలు ఉంటాయి. రోజు వారీ విధులు ముగించిన తర్వాత ఒక ఆలోచన వచ్చినా, లేక టీవీల్లో రాష్ట్రానికి సంబంధించి ఏదైనా వార్తను చూసినా, ఇంగ్లిషు ఛానళ్లలో కొత్త అంశాలు వచ్చినా.. అప్పటికప్పుడు స్పందించి ఆయన అధికారులకు, పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేస్తారు. తగిన ఆదేశాలు కూడా జారీ చేస్తారు. రాత్రి ఎంత లేటైనా, ఎంత అలసట ఉన్నా తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు ఆయన దినచర్య ప్రారంభిస్తారు. ప్రభుత్వానికి మనసు ఉండాలి ప్రభుత్వానికి మనసు ఉండాలని అధికారులకు పదేపదే చెప్తారు ముఖ్యమంత్రి. అలాంటి మనసుతో ఆలోచించినప్పుడే పేదల కష్టాలను తీర్చగలమని తరచుగా అంటుంటారు. ఈ ప్రభుత్వ పాలనకు ప్రధానమైన పునాది ఉందంటే అది మానవత్వమేనంటూ అధికారుల్లో నిరంతరం స్ఫూర్తి నింపుతారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక బాలుడికి జీన్ థెరపీ అవసరం అని, దానికోసం కనీసంగా రూ.50 లక్షలు ఖర్చు చేయాలని అధికారులు ప్రతిపాదించినప్పుడు ఏం చేద్దామని ఆయన ప్రశ్నించినప్పుడు.. అంత ఇవ్వలేమని అధికారులు బదులిచ్చారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ మనం ప్రజలకు అంత కష్టం వచ్చినప్పుడు, ఆలోచిస్తూ నిబంధనల సాకు చూపించడం అత్యంత అమానవీయం అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రభుత్వంగా మనం తప్పక సహాయం చేయాలని నిర్దేశించారు. అటు విశాఖలో పాలిమర్స్ ఘటన అయినా, బోటు ప్రమాదాలు అయినా, ప్రమాదాలు సంభవించినా, చివరకు మొన్నటి తుపానులో కానిస్టేబుల్ విధి నిర్వహణలో మరణించినా.. వైఎస్ జగన్ అత్యంత మానవీయతను చూపిస్తూనే ఉన్నారు. పేదల బాగు కోసం ఉన్న వ్యవస్థలను మార్చడానికైనా, బడ్జెట్లు దాటడానికైనా, నిబంధనలను తిరిగి రాయడానికైనా వెనుకాడని తత్వం ఆయన సొంతం. నాన్చడం తెలియదు జగన్ పరిపాలనా వ్యవహారాలను దగ్గరగా చూస్తే కొన్ని అంశాల్లో వినూత్నత కనిపిస్తుంది. సాధారణ రాజకీయ నాయకుడు మాదిరిగా ప్రతి అంశాన్ని నాన్చి మూలన పడేసే తత్వానికి ఆయన చాలా దూరం. ఏ విషయం మీద కూర్చున్నా దాని మూలాల వరకూ వెళ్తారు. అవసరమైతే మరింత ఆలోచన కోసం మరి కొంత సమయం వెచ్చిస్తారు. తన ఆలోచన మీద సంబంధిత అధికారులు, నిపుణులతో లోతైన చర్చ చేస్తారు. పూర్తిగా అవగతమైన తర్వాత కార్యాచరణకు దిగుతారు. అమలులో ఇబ్బందులొస్తే వెనక్కి తగ్గడం, వాయిదా వేయడం చేయకుండా, మరింత పట్టుదలతో ముందడుగు వేయడం ఆయన నైజం. విద్య, వైద్యం ప్రజలకు నాణ్యంగా అందించాలని తపన విద్యలో నాణ్యత, ప్రజలకు అందించే వైద్య సేవల్లో నాణ్యత ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పడిన తపనను అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు. ఈ రెండు రంగాల్లో నాడు–నేడు అలా పుట్టుకొచ్చిన కార్యక్రమాలే. అత్యంత భారంగా మారిన విద్య, వైద్యాన్ని విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రజలకు ఒక హక్కుగా అందించడంతోపాటు, జనాభాలో మెజార్టీ ప్రజలు ఆధారపడే వ్యవసాయ అనుబంధ రంగాలతోపాటు, పారిశ్రామిక–ఉపాధి రంగాన్ని పటిష్టం చేయడానికి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సీఎం ఒక యజ్ఞమే చేశారు. జిల్లాల్లో పర్యటనలు లేని సమయంలో ఎక్కువ సమయం ఈ అంశాలకు సంబంధించిన వ్యవస్థలను పరుగులెత్తించడంపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. క్రమం తప్పకుండా ఆయా శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, వారికి లక్ష్యాలు నిర్దేశించడం, మరుసటి సమీక్షా సమావేశాలకల్లా వాటిలో ప్రగతిని సమీక్షించడం సీఎం ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. కాబట్టే ఈ నాలుగున్నరేళ్లు సాగిన సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం కూడా జరిగాయి. ప్రతి సమీక్ష ఒక సమస్యకు పరిష్కారాన్ని సాధించేలా సాగింది. తాను చేయాల్సిన పనులు, దృష్టి పెట్టాల్సిన అంశాలు కూడా తన జేబులో ఉన్న చిన్న పుస్తకంలో సీఎం ఇప్పటికీ రాసుకుంటారు. వాటిని తప్పనిసరిగా ఫాలో అప్చేసి ఫలితాలు సాధించే వరకూ ఆయన నిద్రపోరు. హడావిడి లేకుండా సాఫీగా, సజావుగా సత్వర ఫలితాలను సాధించాలనే శైలి ఆయనది. ఆదేశాల్లో స్పష్టత అధికారులకు స్థిరమైన బాధ్యతలు అప్పగించడం, అందులో కూడా స్పష్టత ఉండడం ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరుకు అద్దం పడుతుంది. అధికారులు ఎవరైనా వారిలో పూర్తి సామర్థ్యాలను వెలికితీసి, లక్ష్యాల దిశగా అడుగులు వేయించడం సాధ్యమవుతుందని ఆయన బలంగా విశ్వసిస్తారు. నాయకుడిగా ఆయనకున్న వ్యక్తిత్వం అధికారుల నుంచి ఉత్తమ పనితీరును రాబట్టుకోగలిగింది. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం, వారి అభిప్రాయాలను పూర్తిగా వినడం, బాధ్యతలను పూర్తిగా అప్పగించడం, సమిష్టి తత్వాన్ని పెంపొందించడం.. ఇలా అధికారుల పట్ల ఆయన వ్యవహరించే తీరుకు ప్రశంసలు దక్కాయి. అందుకే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన శాఖాధిపతులు చాలా వరకు సుదీర్ఘకాలంగా అదే స్థానాల్లో ఉండి సేవలు అందించారు. ఇప్పుడూ కొనసాగుతున్నారు. కీలక ఘటనలు 02.09.2009: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం 09.04.2010: పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఓదార్పుయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ 29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలు రాజీనామా 12.03.2011: ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద వైఎస్సార్సీపీ పతాకం ఆవిష్కరణ.. పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటన 13.05.2011: కడప లోక్సభ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్ 5,46,673 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి. 27.05.2012: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ 14.06.2012: 19 శాసనసభ నియోజకవర్గాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయభేరి, ఒక లోక్సభ స్థానంలో వైఎస్సార్సీపీ విజయం 24.09.2013: అక్రమ కేసుల్లో జైలు నుంచి బెయిల్పై వైఎస్ జగన్ విడుదల 05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్ పాండ్లో ఆమరణ దీక్ష 18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్సభలో వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం 16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం 20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్కు గుర్తింపు 25.10.2017: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ 06.11.2017: ఇడుపులపాయలో ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం 09.01.2019: 3,648 కి.మీ.లు సాగిన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగింపు 23.05.2019: రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం 30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం -
ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది. దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్ లైవ్స్టాక్ యూనిట్ల (ఆర్ఎల్యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్ ట్యాగ్లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్ఏల సహాయంతో సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్ లైవ్స్టాక్ యూనిట్గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
నాణ్యతలేని మందులకు కళ్లెం..
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో నాణ్యమైన మందులే ప్రజలకు అందేలా అనేక చర్యలు చేపట్టింది. ప్రమాణాల మేరకు లేని మందులను లేకుండా చేసేందుకు నాలుగున్నరేళ్లుగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా జాతీయస్థాయితో పోలిస్తే మన రాష్ట్రంలో నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్క్యూ) మందులు తక్కువగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సగటున 4% ఎన్ఎస్క్యూ మందులు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ మందుల శాతం 1.55 మాత్రమే. ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటి వరకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ అభీష్టం మేరకు మందుల షాపులు, తయారీ యూనిట్లను ఎంచుకుని తనిఖీ చేసేవారు. మూసధోరణిలో సాగే ఈ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వస్తిపలికింది. ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తనిఖీలు, శాంపిళ్ల సేకరణలో అధికారుల జోక్యాన్ని తగ్గించి ర్యాండమ్గా తనిఖీల నిర్వహణ, ఇంటెలిజెంట్ శాంపిలింగ్పై దృష్టి సారించింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ యాప్ను రూపొందించారు. ఈ విధానంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ పరిధిలోని ఏ షాప్లో తనిఖీ చేయాలనే విషయమై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అలర్ట్ వెళుతుంది. యాప్ సూచించిన షాపు, తయారీ యూనిట్లో తనిఖీలు నిర్వహించి, రిపోర్టులను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు శాంపిళ్ల సేకరణలో 10కి పైగా ప్రమాణాలతో ఎస్వోపీ రూపొందించారు. మార్కెట్లో ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులు, అసాధారణంగా ధరలు ఎక్కువ/తక్కువ ఉండటం.. ఇలా వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని శాంపిళ్లు సేకరించి విశ్లేషణకు లే»ొరేటరీలకు పంపుతున్నారు. నిరంతర నిఘా రాష్ట్రంలో 353 మందుల తయారీ యూనిట్లు, 213 బ్లడ్ బ్యాంకులు, 132 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు, 44,973 హోల్సేల్, రిటెయిల్ మందుల షాపులు ఉన్నాయి. నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తయారీ సంస్థలు, హోల్సేల్, రిటెయిల్ మందుల షాపులపై ఔషధ నియంత్రణ విభాగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు మందుల షాపుల్లో 12,686, మందుల తయారీ యూనిట్లలో 243 తనిఖీలు చేసింది. వాటిలో 3,015 నమూనాలను సేకరించి విశ్లేషించింది. ఈ విశ్లేషణలో 47 నమూనాలు (1.55%) ఎన్ఎస్క్యూగా తేలింది. ఎన్ఎస్క్యూగా తేలిన ఘటనల్లో అధికారులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా ఈ ఏడాదిలో ఇప్పటికి 16 కేసుల్లో దోషులకు కోర్టు శిక్ష విధించింది. -
దీర్ఘకాలిక జబ్బులకు ‘సురక్ష’తో భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. వైద్య శాఖ ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజలందరినీ స్క్రీనింగ్ చేయడమే కాకుండా.. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలందిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ), క్షయ జబ్బులతో బాధపడుతున్నవారిని గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1.84 కోట్ల మందిలో షుగర్ లక్షణాలు.. గత నెలలో ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 4.63 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశారు. 2.16 కోట్ల మందిలో బీపీ, 1.84 కోట్ల మందిలో షుగర్ జబ్బు లక్షణాలను గుర్తించారు. గతంలో నిర్వహించిన నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) సర్వేలో నిర్ధారించిన పాత బీపీ, షుగర్ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. బీపీ కేసులు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 12,790, నెల్లూరులో 12,583, విజయనగరంలో 12,124 వెలుగులోకి వచ్చాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 9,279, నెల్లూరులో 8,275, విజయనగరంలో 7,363 షుగర్ కేసులను గుర్తించారు. మరోవైపు క్షయ అనుమానిత లక్షణాలున్న 1,78,515 మంది నుంచి నిర్ధారణ పరీక్ష కోసం నమూనాలు సేకరించగా.. 417 మందిలో వ్యాధి నిర్ధారణ అయ్యింది. అలాగే కుష్టు వ్యాధి లక్షణాలున్న 9,925 మందిని గుర్తించగా.. వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 8 లక్షల మందిలో కంటి సమస్యలున్నట్టు గుర్తించిన వైద్యులు.. సాధారణ మందులతో తగ్గే సమస్యలున్న 2.44 లక్షల మందికి మందులు అందజేశారు. 4.86 లక్షల మందిని కళ్లద్దాలకు, 69,676 మందిని కేటరాక్ట్ సర్జరీలకు రిఫర్ చేశారు. వీరిలో 833 మందికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా సర్జరీలు నిర్వహించింది. కొత్తగా బయటపడిన బీపీ, షుగర్, క్షయ తదితర జబ్బులున్న వారికి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు. ప్రారంభదశలోనే గుర్తిస్తే ఎంతో మేలు.. చిన్న ఆరోగ్య సమస్యే కదా అని మొదట్లో నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంది. చాలా మందికి బీపీ, షుగర్ సమస్య ఉన్నట్టు కూడా తెలియదు. ఇలా అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే.. 20 శాతం పెరాలసిస్ కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. షుగర్ సమస్యను కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. కిడ్నీ, గుండె, ఇతర సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదముంది. దేశంలో బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా 64.9 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా గుర్తించిన మధుమేహం, రక్తపోటు, క్షయ, ఇతర సమస్యలన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి అనుసంధానం చేశాం. కొత్తగా గుర్తించిన మధుమేహం కేసుల్లో సంబంధిత వ్యక్తులకు హెచ్1బీ ఏసీ టెస్టులు నిర్వహిస్తాం. సంబంధిత వ్యక్తుల ఆరోగ్యాలను ఫ్యామిలీ డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో పాటు మందులు అందిస్తుంటారు. ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే తగిన సహకారం అందిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 6 లక్షల మందికిపైగా బీపీ బాధితులకు, 4.10 లక్షల మందికిపైగా మధుమేహం బాధితులకు నిరంతర వైద్య సేవలందిస్తున్నాం. –జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజారోగ్యంలో మంచి ఫలితాలు గ్రామాల్లో వ్యవసాయం, ఇతర కూలిపనులు చేసుకుంటూ జీవించే పేదలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వమే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి వైద్య సేవలందించడం శుభపరిణామం. ఇలా చేయడం ద్వారా బీపీ, షుగర్, ఇతర జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించవచ్చు. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ప్రజారోగ్య రంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. – డాక్టర్ బాబ్జీ, సీనియర్ వైద్యుడు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ -
గాజాకు భారత్ మానవతా సాయం!
పాలస్తీనా మిలిటెంట్లు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తెలిసిందే. ఈ భీకర యుద్ధంలో వేలాది మంది సాధారణ పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పాయారు. హమస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయల్ సైన్యం గాజాపై విధ్యంసకరంగా విరుచుపడింది. ఈ దాడులతో గాజా చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ నేడు గాజాలోని పాలస్తీనియన్లకు వైద్య సహాయం, విపత్తు సహాయ సామగ్రిని పంపింది. అంతేగాక యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీలు తదితరాల తోపాటు ఇతర అత్యవసర వస్తులు, నీటి శుద్దీకరణ మాత్రలు గాజాకు పంపిచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో పేర్కొన్నారు. గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటి వరకు ఈ దాడుల్లో దాదాపు 4,300 మంది పాలస్తనీయన్లు మరణించారని, ప్రధానంగా పౌరులే ఎక్కువుగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే వేలాదిమందికి పైగా ప్రజలు క్షతగ్రాతులుగా మారారని పేర్కొంది. ఇదిలా ఉండగా, భారత ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో గాజాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ వారం ప్రారంభంలోనే చర్చించిన సంగతి తెలిసిందే. పైగా భారత్ పాలస్తీనియన్ల కోసం తన వంతుగా మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటుందని మోదీ పాలస్తీనా అధ్యక్షుడుకి హామీ కూడా ఇచ్చారు. ఈ ఘర్షణలో పౌరుల మరణాలే అధికంగా ఉండటం బాధకరం అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారు తప్పక దీనికి బాధ్యత వహించక తప్పదని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ జిప్టు శిఖరాగ్ర సమావేశంలో యూఎన్ చీఫ్ ఆంటోనియా గుటెర్రెస్ కూడా మానవతావాద దృక్పథంతో కాల్పులు విరమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం గాజాలో తాగునీరు, ఆహరం, పెట్రోలు వంటివి లేక తీరని మానవతా పరిస్థితితో అట్టుడుకుతోందన్నారు. గాజా పరిస్థితిని చక్కబడేలా ప్రపంచ దేశాలన్ని తమవంతుగా సాయం అందించేలా మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థ ప్రయత్నాలు ఫలితంగా ఇజ్రాయెల్ కూడా గాజాకు మానవతా సాయం అందించేందుకు అంగీకరించింది 🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸! An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt. The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph — Arindam Bagchi (@MEAIndia) October 22, 2023 (చదవండి: గాజాకు స్వల్ప ఊరట.. అమెరికా మాటతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్) -
పొట్టి దూడ.. గట్టి మేలు!
పలమనేరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు పొట్టిరకం దూడలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. పుట్టినప్పుడు కేవలం అడుగు మాత్రమే ఎత్తు ఉండి, తన జీవితకాలంలో మూడు అడుగులు మాత్రమే పెరుగుతుంది. అయితే ఈ దూడలకు ఉండే తోక నేలకు తాకేట్లు ఉంటే... ఆ రకానికి విపరీతమైన డిమాండ్ ఉన్నట్టే. వీటిలో మొదటిరకం రూ.2 నుంచి రూ.4 లక్షలు పలుకుతుండగా, రెండో రకం రూ. 50వేల నుంచి రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఇంత ఖరీదైనా, ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఈ దూడల్లో తోక నేలకు తాకడం, గోపురం కింద గంగడోలు కిందికి ఉండే రకాలు ఇళ్లల్లో ఉంటే ఆరోగ్యంతోపాటు అదృష్టం వరిస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంది. సాంకేతికంగా ఈ జాతి దూడలు తక్కువ మేత తింటూ, ఎక్కువ రోగ నిరోధకశక్తి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలున్న దూడల కొనుగోలుకు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురము, ఉభయ గోదావరి జిల్లాలు సహా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన బడాబాబులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఔషధ గుణాలు మెండు అరుదైన రకం పశువులుగా ఈ పుంగనూరు పొట్టి దూడలకు పేరుంది. అధిక వ్యాధి నిరోధక శక్తి, తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాలనిస్తాయి. వీటి పాలు, మూత్రంలలో ఔషధ గుణములు మెండుగా ఉన్నాయి. అయితే వీటి ఉనికి ప్రశార్థకమవుతున్న తరుణంలో మరిన్ని దూడల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) ద్వారా కృషి చేస్తోంది. దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, దీన్లో 277 చిత్తూరు జిల్లా పలమనేరులోనే ఉన్నాయి. వీటిలో కుర్ర దూడలు 33, పెయ్య దూడలు 17 ఉండగా, మిగిలినవి ఎద్దులు, ఆవులు. పలమనేరు పరిశోధనా సంస్థలో ఉత్పత్తి... 1953లో పలమనేరు కెటిల్ఫామ్ వద్ద ‘సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం’ ప్రారంభమైంది. అనంతరం ఇన్సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా పొట్టి దూడల సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో 1995లో పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. స్థానిక అధికారులు మేలైన పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని స్థానికంగా ఈరకం ఆవులు కలిగివున్న రైతులకు అందిస్తున్నారు. తద్వారా వారి వద్ద పొట్టి దూడల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. పలమనేరు సహా రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఔత్సాహిక రైతులు ఫామ్స్లో ఈ పొట్టిజాతిని ఉత్పత్తి చేస్తూ లక్షల్లో విక్రయిస్తున్నారు. గణనీయ ఉత్పత్తికి కృషి ఆంధ్రప్రదేశ్ పశు అభివృద్ధి సంఘం (ఏపీఎల్డీఏ) ద్వారా పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని ఎదకొచ్చిన, పుంగనూరు ఆవులు కలిగిన ఉన్న రైతులకు స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో అందిస్తూ, ఈ జాతి అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తున్నాం. అవసరమైన రైతులు కెటిల్ఫామ్లో సెమన్ పొందవచ్చు.– డా.వేణు, సైంటిస్ట్, పశు పరిశోధన కేంద్రం, పలమనేరు -
‘ఆయుష్’కు కొత్త కళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆయుష్ డిస్పెన్సరీలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రంగులు వెలిసిపోయి, పాచిపట్టి అధ్వానంగా కనిపించే డిస్పెన్సరీలు కళకళలాడుతున్నాయి. రోగులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే మందులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అల్లోపతి ఆస్పత్రుల రూపురేఖలు మార్చినట్లుగానే ఆయుష్ ఆస్పత్రులను సైతం అన్ని విధాలా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నారు. ఒక్కో డిస్పెన్సరీకి రూ.3.5 లక్షలు కేటాయించి భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. ఎలక్రి్టకల్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్ను అమర్చి విద్యుత్ ఆదాకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 95 డిస్పెన్సరీల్లో మరమ్మతులు, రంగులు వేయడం వంటి పనులన్నీ పూర్తయ్యాయి. రూ.12 కోట్లతో మందుల సరఫరా ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 735 ఆయుష్ డిస్పెన్సరీలకు రూ.3 కోట్లతో ప్రభుత్వం మందులు సరఫరా చేసింది. ఈ మందులు వినియోగంలో ఉండగానే భవిష్యత్లో కొరత లేకుండా మరో రూ.12 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తోంది. రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి డిస్పెన్సరీలకు మందులను సరఫరా చేయనుంది. ఇంగ్లిష్ మందుల తరహాలోనే ఆయుష్ మందులను కూడా ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్, సిరప్స్, టానిక్స్ రూపంలో అందజేసేలా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నామని, విడతల వారీగా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ లగింశెట్టి తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా
- బుల్ బ్యాక్ ర్యాలీ
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement