-
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్టౌన్, డర్బన్లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్లో అంబేడ్కర్కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
న్యాయాన్యాయాలు
న్యాయం చేయటమే కాదు... చేసినట్టు కూడా కనబడాలంటారు. శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరిస్తూ లోక్సభ మూజువాణీ ఓటుతో తీర్మానం ఆమోదించిన తీరు ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించింది. మొయిత్రాపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటి, వాటి తీవ్రత ఎంత... ఎథిక్స్ కమిటీ ఆ ఆరోపణలను పరిశీలించవచ్చునా లేదా వంటి సందేహాల వరకూ పోనవసరం లేదు. అసలు బహిష్కరణకు గురయ్యే సభ్యులు ఆ నిర్ణయంపై సభలో తమ స్వరం వినిపించటానికి అవకాశం ఇవ్వకపోవటం సబబేనా? మొన్న 4న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 22వ తేదీ వరకూ సాగుతాయి. నివేదికపై శుక్రవారం అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ విపక్షం వాకౌట్చేసింది. ఎథిక్స్ కమిటీలో మొయిత్రాకు అవకాశమిచ్చామని, కానీ అడిగిన వాటికి జవాబులివ్వకుండా ఆమె దూషణలకు దిగారని కమిటీ చైర్మన్ వినోద్కుమార్ సోంకార్, కమిటీలోని బీజేపీ సభ్యులు ఇప్పటికే ఆరోపించారు. ఫిర్యాదుకు సంబంధంలేని ప్రశ్నలతో వేధించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆ ప్రశ్నలున్నాయని మొయిత్రా కూడా ప్రత్యారోపణ చేశారు. ఒకవేళ మొయిత్రా చేసిన ఆరోపణలన్నీ అబద్ధమే అనుకున్నా... అంతమాత్రాన సభలో తన వాదన వినిపించేందుకు ఆమె అనర్హురాలవుతారా? చట్టసభల్లో జరిగే చర్చలు, వాటి ప్రత్యక్ష ప్రసారాలు పాలక, విపక్ష సభ్యుల్లో ఎవరు ఎవరికంటే బాగా మాట్లాడుతున్నారో నిర్ణయించటానికి కాదు. తాము ఎన్నుకున్న సభ్యులు చర్చిస్తున్నదేమిటో, తీసుకుంటున్న నిర్ణయాలేమిటో, వాటిలోని మంచిచెడ్డలేమిటో తెలుసుకోవటం కోసం. మొయిత్రా కావొచ్చు...మరొకరు కావొచ్చు – చర్చ సందర్భంగా అప్రామాణికంగా లేదా అసంబద్ధంగా మాట్లాడితే వారి వాదనలోని డొల్లతనాన్ని ప్రజలే గ్రహిస్తారు. అది పాలకపక్షానికే మంచిది. సభలో అధికారపక్షానికి కావలసినంత మెజారిటీ వుంది. కనుక మొయిత్రాకు అవకాశమిచ్చినంత మాత్రాన కలిగే నష్టం ఏమీ లేదు. అసలు ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశ ప్రారంభం రోజైన ఈనెల 4నే ప్రవేశపెట్టాలి. కానీ పాలక పక్షం శుక్రవారానికి వాయిదా వేసింది. అయినా ఈ వ్యవహారం ఇలా ముగియటం మన పార్లమెంటరీ వ్యవస్థ లోపాన్ని తెలియజెబుతోంది. నివేదికను కమిటీలోని ఆరుగురు అంగీకరించగా, నలుగురు దాన్ని వ్యతిరేకించారు. ఎథిక్స్ కమిటీ నిర్ణయం సబబే కావొచ్చు... అది మెజారిటీ ప్రకారమే తీసుకుని వుండొచ్చు. కానీ సభలో మొయిత్రాకు అవకాశమీయటంవల్ల ఎంపీగా ఆమె ప్రవర్తనలోని గుణదోషాలను పౌరులు తెలుసుకునే అవకాశం వుంటుంది కదా! దాన్ని నిరాకరించటం ఏం సబబు? మొయిత్రాపై వున్న ఆరోపణల పూర్వాపరాలు పరిశీలిస్తే పార్లమెంటు సభ్యురాలిగా ఆమె తన పరిమితులు అతిక్రమించారా అన్న సందేహాలు కలుగుతాయి. సభలో వేయదల్చుకున్న ప్రశ్నలను సభ్యులు ఎక్కడి నుంచి అయినా ఎన్ఐసీలో లాగిన్ అయి, నేరుగా స్పీకర్కు చేరే విధంగా పోస్ట్ చేయొచ్చు. ఆ ప్రశ్నల అర్హతను స్పీకర్ నిర్ణయించాక అవి సంబంధిత మంత్రిత్వ శాఖలకు వెళ్తాయి. అనర్హ ప్రశ్నలను తొలగిస్తారు. ఇదంతా ఆమె నేరుగా చేసివుంటే ఇంత రచ్చయ్యేందుకు ఆస్కారం వుండేది కాదు. తన స్నేహితుడైన దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్, పాస్వర్డ్ అందజేసి అందులో ప్రశ్నలు పోస్ట్ చేయించమని చెప్పారు. తన నియోజకవర్గ పనుల్లో తీరిక లేకుండా వున్నందున ఇలా చేయించానని మొయిత్రా సంజాయిషీ. మామూలుగా ఇది సబబు అనిపించదు. కానీ 800మంది ఎంపీల్లో అత్యధికులు ఇలాగే చేస్తున్నారని, ప్రతిదీ వారే చేయాలంటే అసాధ్యమని ఆమె చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక నిబంధనేదీ లేదంటున్నారు. ఒకరిద్దరు సభ్యులు సైతం తామూ అలాగే చేస్తున్నామని చెప్పారు. ఎథిక్స్ కమిటీ మాత్రం ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చే చర్య అంటున్నది. పైగా లంచం తీసుకుని అదానీ సంస్థ లపై ఆమె ఈ ప్రశ్నలు వేశారని బీజేపీ సభ్యుల ఆరోపణ. ఈ సందర్భంగా 2005లో ఆన్లైన్ పోర్టల్ ‘కోబ్రా పోస్ట్’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ గురించి ప్రస్తావించుకోవాలి. 11మంది ఎంపీలు ప్రశ్నలు అడిగేందుకు తాము ఇవ్వజూపిన డబ్బు తీసుకున్నారని ఆ పోర్టల్ తేల్చింది. వీరిలో బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ, బీఎస్పీలకు చెందినవారున్నారు. ఇందులో 10 మంది లోక్సభ సభ్యులు, మరొకరు రాజ్యసభకు చెందినవారు. ఇదంతా ఒక చానెల్లో ప్రసారమైంది. ఆ ఎంపీలను సభ నుంచి బహిష్కరిస్తున్న సందర్భంలో మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ ఇందులో అవినీతికన్నా ఎంపీల బుద్ధిహీనత వెల్లడవుతోందన్నారు. అందుకు బహిష్కరణ శిక్ష విధించటం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మొయిత్రా విషయంలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? అసలు మొయిత్రాపై వచ్చిన ఆరోపణలకు విడిపోయిన ఆమె సహచరుడు జైఅనంత్ దేహద్రాయ్ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు రాసిన లేఖ ప్రాతిపదిక. మొయిత్రా, దేహద్రాయ్లకు బోలెడు తగువులున్నాయి. పెంపుడు కుక్క విషయం మొదలుకొని ఎన్నిటిపైనో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అందువల్ల ఆ లేఖకు ఎంతవరకూ ప్రాధాన్యమీయవచ్చో ఆలోచిస్తే బాగుండేది. అలాగే ప్రభుత్వంపై మొయిత్రా తరచు నిశిత విమర్శలు చేస్తుంటారు గనుక, ఆ కారణంతోనే చర్య తీసుకున్నారన్న అపప్రద రాకుండా చూసుకోవాల్సింది. అసలు ఆమెకు సభలో మాట్లాడే అవకాశ మిస్తే ఆదరాబాదరాగా చేశారన్న నిందకు అవకాశం వుండేదే కాదు. – డా‘‘ గుబ్బల రాంబాబు, రాజమహేంద్రవరం (డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం) -
అమెరికా చదువు సంస్కృతులు
అమెరికా విద్యారంగంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, రాజకీయులు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు పాఠశాలల నిర్వహణ అద్భుతంగా ఉండేది. యువ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చనువుగా ప్రవర్తించే వారు. పిల్లల విషయాలను చర్చించడానికి ఒక రోజయినా వారితో గడిపేవారు. నేటి విద్యార్థులు, యువత అతి తక్కువ సమయంలో ఊహించని, తీవ్రమయిన మార్పులకు గురవుతున్నారు. యుక్త వయసులోకి ప్రవేశిస్తున్న వీరు జ్ఞానాన్ని గ్రహించటానికి పెనుగు లాడుతున్నారు. పాఠశాలలకూ సమస్యలున్నాయి. విపరీతంగా సాగదీయ బడిన ప్రతిష్ఠాత్మక పునర్నిర్మాణ పథకం, ఆశించిన స్థాయిని అందు కోలేని దూరవిద్య, కరోన మహమ్మారి కాలపు అలవాట్ల నుండి బయటపడలేని దుఃస్థితి అందులో కొన్ని. విద్యాలయాల వద్ద మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు మరో తీవ్ర సమస్య. బాంబుల, తుపాకుల ఉపయోగ సంస్కృతి సకారాత్మక నిర్ణయా లకు అడ్డుతగులుతున్నాయి. మహమ్మారి కాలంలో కోల్పోయిన పాఠ్యాంశాలను విద్యా ర్థులు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. రెండేళ్లలో తప్పిన సాంఘికీకరణ, పరిపక్వతలను సంపాదిస్తున్నారు. సామాజిక అభివృద్ధిలో విద్యార్థులు రెండేళ్ళు వెనుకబడ్డారని మానసికశాస్త్ర ఉపాధ్యాయుల అభిప్రాయం. అందుకే బళ్ళలో అంతా బాగుందనేవాళ్ళ సంఖ్య తగ్గింది. విద్యారంగం పిచ్చివాళ్ళ, తీవ్రవాదుల హస్తాల్లో చిక్కుకుందని కొన్ని పత్రికలు ప్రచారం కూడా చేస్తున్నాయి. అమెరికాలో విడాకులు పెరిగాయి. పిల్లలకు ఇద్దరు తల్లిదండ్రుల పెంపక అవకాశం లేదు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరే పిల్లలను పెంచవలసి వస్తోంది. 25 శాతం పిల్లలు ఇలాంటి వారే. ఏ దేశంలోనూ ఈ స్థితి ఈ స్థాయిలో లేదు. ఈ చేదునిజం అమెరికాలో సింగిల్ పేరెంట్ సంరక్షణ శిశువులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనితో సమాజం నష్టపోతోంది. ఈ పిల్లలు ప్రవ ర్తనా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో వీరి సంఖ్య తక్కువ. వారిలో అవగాహన, బోధనాంశాలను అర్థం చేసుకోవడంలో తేడా ఉంటోంది. పిల్లల చదువు, భావిపౌరుల శ్రేయస్సుకు... అమెరికాలో పతనమయిన కుటుంబ, సామాజిక సంబంధాలను మెరుగుపర్చడమే మార్గం. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
వైద్యంలో వీరుడు
అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడిగా పేరొందిన డాక్టర్ సోహన్ సింగ్ అచ్చమైన తెలుగువాడు. గదర్ వీరుడు సోహన్ సింగ్ జోషీ స్ఫూర్తితో ఆయనకు ఆ పేరు పెట్టారు. దానికి తగ్గట్టుగానే, రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగానూ ఉచిత హోమియో ప్రజా వైద్య శిబిరాలు నెలకొల్పుతూ, మందులు అందిస్తూ తాను చనిపోయేదాకా విశిష్ట సేవలు అందించారు సోహన్ సింగ్. వైద్యంలో వీరుడిగా నిలిచారు. అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడు, హోమియోలో కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సోహన్ సింగ్ వైద్య వృత్తిలోనూ ‘గదర్’ వీరుల వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న సామాజిక కార్యకర్త. నరనరాన ప్రజా సేవలోనే తరించుతూ ఈ నెల 24న తన 76వ ఏట కన్నుమూశారు. అభ్యుదయ కవి పండితులు, పాత్రికేయ కురువృద్ధు తాపీ ధర్మారావు మనవరాలు విమలను సోహన్ సింగ్ పెళ్లాడారు. ఈమె ‘విశాలాంధ్ర’ దినపత్రిక సంపా దకునిగా పనిచేసిన తాపీ మోహనరావు కుమార్తె. మా తరం అంతా తాపీ మోహనరావు ఆధ్వర్యంలో పాత్రికేయ వృత్తి మెలకువలు దిద్దుకున్న వాళ్లమే. ఒక తెలుగువాడికి ‘సోహన్ సింగ్’ అని పేరు పెట్టడానికి కారణం, ‘గదర్ పార్టీ’ వీరులలో ఒకరైన ‘సోహన్ సింగ్ జోషీ’. దరిశి చెంచయ్య స్థాపించిన ఈ పార్టీ తెలుగునాట విప్లవోద్యమ బీజాలు నాటిందని మరచిపోరాదు. ఇంతటి పూర్వ చరిత్ర స్ఫూర్తితో ఎదుగుతూ, రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగానూ ఉచిత హోమియో ప్రజా వైద్య శిబిరాలు నెలకొల్పుతూ, మందులు అందిస్తూ తాను చనిపోయేదాకా విశిష్ట సేవలు అందించారు సోహన్ సింగ్. ఈ ఆచరణలో భాగంగానే ‘ధర్మకిరణ్ హోమియో రీసెర్చి ఫౌండేషన్’ను, అదే పేరిట హోమియో వైద్యశాలను, ఆదర్శ హోమియో ఫార్మసీ, కళాశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్లో తొలి హోమియో రీసెర్చి కేంద్రం ఏర్పా టుకు తన చొరవతో పథకం రచించగా దాన్ని కేంద్రం గుర్తించింది. పెక్కు శారీరక రుగ్మతలకు శాశ్వత పరిష్కా రాలు చూపిన ఘనాపాఠి సోహన్ సింగ్. ఎన్నో కుటుంబాలకు, స్కూళ్లకు 1999 నుంచి 2022 దాకా హోమియో మందుల ‘కిట్స్’ను అందించుతూ వచ్చారు. వైద్య సదుపాయాలు అందక పెక్కు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించారు. పెక్కు దేశీయ, రాష్ట్రీయ కేంద్రా లలోని వైద్య శాఖల సమన్వయ కర్తగా అమూల్యమైన సేవలందించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ హోమియో మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్కు దాదాపు 26 సంవత్సరాలుగా సలహాదారుగా ఉన్నారు. హోమియో రీసెర్చి ఫౌండేషన్ ఫార్మా యూనిట్ ఆధ్వర్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే మందుల స్థానే దేశీయ నాణ్యమైన హోమియో మందుల ఉత్పత్తికి కృషి చేశారు. దేశీయ వృక్ష జాతుల నుంచి లభించే ముడి సరుకు ఆధారంగా హోమియో టించర్లను, టిష్యూ సాల్ట్స్ను ఉత్పత్తి చేయించారు. ‘‘సోహన్ సింగ్ కర్మయోగి, పని.. పని.. పని... తప్ప మరో ధ్యేయం, యావ లేని వైద్యుడు. కొందరు రోజుకు 24 గంటలేనా అని బాధపడతారు, కొందరు జీవితాలకు లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. అతి కొద్దిమంది మాత్రమే నెలలకు, సంవత్సరాలకూ కూడా లక్ష్యాలు పెట్టుకుంటారు. ఒకటి పూర్తవగానే ఇంకొకటి, అలా లక్ష్యాలను వెంటాడుతూనే ఉంటారు. పనే ప్రాణం, లేకపోతే వారికి ఊపిరాడదు! ఆ లక్ష్యాల నుండి ఎడబాటుండదు, తడబాటుండదు. వారికి వయస్సు విరోధి కాదు, రోగాలను గురించి తలచుకునే సమయం ఉండదు. వారెవరో కాదు, మన సోహన్ సింగ్. భారత హోమియోపతి వైద్యంలో సోహన్ సింగ్ చూడని లోతులూ లేవు, ఎక్కని ఎత్తులూ లేవు... తెల్లవారు జామున సుదూర ప్రయాణాలు చేసి ఆయన ఇచ్చే తెల్లపంచదార మాత్రల కోసం జనాలు చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆయన ఇచ్చే మందులు తన వ్యవసాయ క్షేత్రంలో పెంచిన మూలికల నుంచే తీసుకుని తన సొంత ఫార్మసీలోనే తయారు చేసుకుంటారు. అత్యుత్తమమైన వైద్య సేవలు అందించిన సోహన్ సింగ్ వైద్యనారాయణుడు, వైద్యులందరికీ ఆదర్శనీయులు’’ అని డాక్టర్ చెరుకూరి బాలచంద్రమోహన్, సతీమణి డాక్టర్ సత్యవతీ దేవిల అభిభాషణ. ‘ధర్మకిరణ్ హోమియో పరిశోధనా సంస్థ’ అధ్యక్షురాలు పి. నీలిమా సతీష్ మాటల్లో చెప్పాలంటే, ‘‘చెట్లను, మొక్కల్ని కాపాడుకోగల్గితే, అవి తిరిగి మనల్ని రక్షించి, పక్కవాటు రోగాలు రాకుండా కాపాడతాయి.’’ ఆరోగ్య ప్రదాయినిగా మన దేశంలో హోమియో వైద్య విధానాన్ని పెంచి పోషించి, ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యానికి అనితర సాధ్యంగా దోహదకారి అయి, మనందరి ఆరోగ్య భావి భాగ్యోదయాల్ని కాంక్షిస్తూ శాశ్వతంగా సెలవు తీసుకున్న ప్రజా వైద్యుడు సోహన్ సింగ్కు ఇదే నివాళి! abkprasad2006@yahoo.co.in (సుప్రసిద్ధ హోమియో వైద్యుడు డాక్టర్ సోహన్ సింగ్ సెప్టెంబర్ 24న మరణించారు.) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే!
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement