-
20 ఏళ్లలో ఏ దేశం ఎంత వృద్ధి చెందిందో తెలుసా.. (ఫొటోలు)
-
పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. స్థిరమైన వృద్ధికి అవకాశం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని 4 శాతం దిగువకు తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నట్లు, అయితే ఇందుకు ఆహార ధరలే అడ్డంకిగా మారుతున్నట్లు మార్చి బులెటిన్ ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’లో ఆర్బీఐ ఇటీవల తెలిపింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబరు నుంచి తగ్గుతూ వస్తూ, గత నెలలో 5.09 శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా, రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరేందుకు ఆహార ధరల ఒత్తిళ్లే అడ్డంకిగా మారుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబత్ర పాత్రా నేతృత్వంలోని బృందం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వృద్ధి మందగించడం, రాబోయే కాలంలో పరిస్థితుల్ని సూచిస్తున్నాయని వివరించింది. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వాస్తవిక జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి చేరుకుందని బులెటిన్ వివరించింది. పరోక్ష పన్నులు పటిష్ఠంగా వసూలు కావడం, తక్కువ సబ్సిడీలు వృద్ధి ఊపందుకునేందుకు దోహదం చేశాయని బృందం వెల్లడించింది. నిర్మాణాత్మక గిరాకీ, ఆరోగ్యకర కార్పొరేట్ గణాంకాలు, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు వృద్ధి ముందుకు సాగడానికి సాయపడతాయని వ్యాసం పేర్కొంది. ఇదీ చదవండి: 1 శాతం కుబేరుల దగ్గరే 40 శాతం సంపద దేశం ఏటా 8%, అంతకంటే ఎక్కువ వృద్ధిని స్థిరంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2021-24 మధ్య దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సగటున 8% పైనే నమోదైందని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అదుపులోనే ఉందని, విదేశీ మారకపు నిల్వలు బాగున్నాయని, వరుసగా మూడో ఏడాది కూడా ఆర్థిక ఏకీకరణ కొనసాగుతోందని తెలిపింది. వచ్చే కొన్ని దశాబ్దాలకు ఈ అనుకూల అంశాలను అవకాశాలు, బలాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
కొనసాగిన బుల్ రికార్డులు
ముంబై: పరిమిత శ్రేణి ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.., స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ సోమవారమూ కొనసాగింది. ఆకర్షణీయ స్థూల ఆర్థిక డేటా నమోదు కారణంగా అంతర్జాతీ య రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. మూడీస్ అప్గ్రేడ్ రేటింగ్తో బ్యాంకింగ్, ఇంధన, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్ద తు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 243 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల లాభంతో 73,872 వద్ద ముగిసింది. ఒక దశలో 184 పాయింట్లు బలపడి 73,990 వద్ద ఆల్టైం హైని అందుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 22,441 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 27 పాయింట్లు లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ముగింపు స్థాయిలు సరికొత్త రికార్డుతో పాటు వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.564 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,543 కోట్ల షేర్లు కొన్నారు. ► డిజిట్ ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ► డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ఇష్యూ కింద రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 10.94 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్బక్ వినియోగించుకోనుంది. బ్లాక్బక్ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్లో ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. -
జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి
కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రం వృద్ధి నమోదు చేశాయి. అలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశ జీడీపీలో వాటా తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35 శాతంగా ఉండేదని, 2022–23లో 15 శాతానికి తగ్గిందని లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముంద్రా వెల్లడించారు. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడంతోనే వ్యవసాయ రంగం వాటా తగ్గిందని మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు. ‘ప్రొడక్షన్ పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదు. పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లో ఉత్పత్తులు వేగంగా పెరగడమే ఇందుకు కారణం’ అని ఆయన వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయని మంత్రి అన్నారు. వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 4 శాతంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడానికి, సుస్థిరాభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వనరులను సమర్థంగా వినియోగించేందకు ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు, పాలసీలు తీసుకొచ్చిందని వివరించారు. కేంద్రం ప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? -
ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2023–24) 6.5 శాతం వృద్ధిని సాధించగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా అంచనా వేశారు. ఈ దశాబ్దం అనిశ్చితికి నిదర్శనంగా నిలవనున్నదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్పొరేట్ రంగం పెట్టుబడులను ఆలస్యంచేస్తే ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సాకారంకావని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ విషయానికివస్తే జీడీపీ వృద్ధి, ఆదాయ పురోగతి తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సగటున 6.5 శాతం ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్న నేపథ్యంలో మరింత పురోగతి అందుకోవడం ద్వారా ఆశ్చర్యాలకు తెరతీసే అవకాశమున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో వివరించారు. కాగా.. గతేడాది(2022–23)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం పుంజుకోగా.. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 6.5 శాతం జీడీపీ వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ బాటలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం 6.3 శాతం వృద్ధిని మదింపు చేశాయి. అయితే ఈ ఏడాది క్యూ2లో జీడీపీ 7.6 శాతం బలపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలది కీలకపాత్ర
సాక్షి, విశాఖపట్నం: జీడీపీలో ఎంఎస్ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ఎంఎస్ఎంఈ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఇపావో తెలిపారు. విశాఖలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ)షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్పై శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక రంగ వృద్ధికి దోహదపడటమే కాక.. ఉపాధికి ముఖ్య వనరులుగా ఉన్నాయని, గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో ఆర్థిక, ప్రాంతీయ అసమానతలను కూడా తగ్గిస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో ఇవి మరింత బలోపేతమవుతున్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించడానికి తమ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగా రుణ పరిధి పెంపు, ఆధునికీకరణకు ప్రోత్సాహం, సాంకేతిక సాయం, మౌలిక సదుపాయాల వృద్ధి, నైపుణ్యాల పెంపుదల, శిక్షణ అవకాశాల మెరుగుదల, మార్కెట్ల విస్తరణ, ఎగుమతుల ధ్రువీకరణ ప్రక్రియను మరింత సరళతరం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఏపీ మారిటైం బోర్డు డెప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ కమాండర్ బీఎం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికి, మౌలిక సదుపాయాల విస్తృతానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు పెరగడంలో మారిటైం బోర్డు తోడ్పడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టుల ద్వారా కొత్తగా పలు పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. శ్రావణ్ షిప్పింగ్ సరీ్వసెస్ లిమిటెడ్ ఎండీ జి.సాంబశివరావు, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర ఎస్ జాస్తి తదితరులు ప్రసంగించారు. ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆఖర్లో లాభాల స్వీకరణ
ముంబై: ఆఖర్లో అమ్మకాలు తలెత్తడంతో బుధవారం స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఆగస్టు నెలవారీ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు, దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి డేటాతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్అండ్గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ట్రేడింగ్లో 406 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ చివరికి 11 పాయింట్ల లాభంతో 65,087 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అయిదు పాయింట్ల లాభంతో 19,347 వద్ద స్థిరపడింది. మెటల్, ఐటీ, రియలీ్ట, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్(జేఎఫ్ఎస్) షేరు వరుసగా మూడో రోజూ అప్పర్ సర్క్యూట్ను తాకింది. ఇటీవల ఆర్ఐఎల్ ఏజీఎం సమావేశంలో జేఎఫ్ఎస్ బీమా, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాల్లోకి విస్తరిస్తుందని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రకటన ఈ షేరు ర్యాలీకి దోహదపడుతున్నాయి. తాజాగా బుధవారం బీఎస్ఈలో 5% ఎగసి రూ.233 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాౖకైంది. ► గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ షేరు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. బీఎస్ఈలో 19% ఎగసి రూ.874 వద్ద స్థిరపడింది. యూఈఏకి చెందిన దుస్తుల తయారీ కంపెనీ అట్రాకోను 55 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.455 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ షేరు ర్యాలీకి కారణమవుతోంది. -
స్థూల ఆర్థిక నిర్వహణ భేష్: కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అసాధారణ సవాళ్ల మధ్య భారత్ బలమైన రికవరీ బాటలో నడవడానికి దేశ స్థూల ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉండడమేనని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. ఇతర దేశాలకు ఇదొక ఉదాహరణగా పేర్కొంది. మౌలిక సదుపాయాల సరఫరా వైపు చేసిన పెట్టుబడులతో భారత్ దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని నమోదు చేయగలదని అంచనా వేసింది. ‘‘గడిచిన కొన్నేళ్లలో అంతర్జాతీయంగా ఊహించని సవాళ్లు నెలకొన్నాయి. దీనికితోడు భారత బ్యాంకింగ్, నాన్ ఫైనాన్షియల్ కార్పొరేట్ రంగంలో బ్యాలన్స్ షీటు సమస్యలు వెలుగు చూశాయి. అయినా కానీ, భారత్ స్థూల ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉండడం వీటిని అధిగమించేలా చేసింది’’అని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంతక్రితం ఆర్థిక సంవత్సంతో పోలిస్తే తగ్గడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గించేందుకు ప్రభుత్వం సుంకాలు తగ్గించి, సంక్షేమంపై వ్యయాలను పెంచొచ్చని పేర్కొంది. అలాగే, గరిష్ట స్థాయిలో మూలధన వ్యయాలను కొనసాగించొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల పనితీరు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ముందుగా వేసిన అంచనా 7 శాతం మించి, 7.2 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావడానికి, చివరి త్రైమాసికంలో బలమైన పనితీరును కారణంగా పేర్కొంది. -
భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: భారత్ ఎకానమీ పటిష్టంగా, నిలకడగా పురోగమిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఉద్ఘాటించింది. తగిన మూలధనం, అలాగే మొండిబకాయిలు (ఎన్పీఏ) బహుళ సంవత్సర కనిష్ట స్థాయికి తగ్గుతూ కొనసాగుతున్న పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక మూలస్తంభాల పటిష్టత వంటి అంశాలు ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్–కమిటీ ఇచి్చన నివేదికలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముందుమాట రాస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటి నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనే అంశంపై రాజీపడే ప్రశ్నేలేదని, ఈ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోని వారు ఇందుకు తగిన కృషి చేయాలని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనడానికి ఇది అవసరమనీ ఉద్ఘాటించారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండి బకాయిలు, నికర మొండిబకాయిలు వరుసగా 11.5 శాతం, 6.1 శాతాలుగా ఉన్నాయి. 2023 మార్చిలో ఇవి వరుసగా 3.9 శాతం, 1 శాతానికి తగ్గాయి. ► రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్ఓఏ) 2018లో కనిష్ట స్థాయి – 0.2 శాతం నుండి 2023లో 1.1 శాతానికి పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత మెరుగుపడింది. ► బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్మెరుగుపడ్డం విస్తృత స్థాయిలో అన్ని రంగాలకూ బ్యాంకింగ్ రుణ వృద్ధినీ పెంచుతోంది. ► 2022–23లో బ్యాంకింగ్ డిపాజిట్ల వృద్ధి 10 శాతం. 2023 జూన్ తొలి నాళ్లలో ఈ రేటు 11.8 శాతానికి పెరిగింది. రూ.2000 నోట్ల ఉపసంహరణా దీనికి ఒక కారణం. ► రిటైల్ రుణాలు మార్చి 2021 నుండి మార్చి 2023 వరకు 24.8 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదుచేసుకున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వృద్ధి రేటు 13.8 శాతంగా ఉంది. ► సైబర్ దాడులు, వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం. ► జీ 20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తగిన కృషి చేస్తుంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ థీమ్తో సవాళ్లపై పోరాటానికి దేశాల మధ్య పరస్పర సహకారానికి, సమన్వయ చర్యలకు భారత్ ప్రయతి్నస్తుంది. -
మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి 4.6 శాతం: ఎస్బీఐ అంచనా
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డిసెంబర్ త్రైమాసికంలో 4.6 శాతమన్న అంచనాలను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంత్ ఘోష్ వెలువరించారు. రెండవ త్రైమాసికంలో ఉన్న ఆశావహ పరిస్థితుల్లో తమ 30 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు లేవని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో వృద్ధి 4.4 శాతమన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) అంచనాలకన్నా ఎస్బీఐ గ్రూప్ ఎకనమిక్ అడ్వైజర్ లెక్కలు అధికంగా ఉండడం గమనార్హం. కాగా, ఆర్థిక సంవత్సరంలో (2022-23) 6.8 శాతం అంచనాలను 7 శాతానికి పెంచుతున్నట్లు ఘోష్ పేర్కొన్నా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్లో ఎకానమీ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికానికి ఇది 6.3 శాతానికి పడిపోయింది. 2023-24లో వృద్ధి 5.9శాతం : ఇండియా రేటింగ్స్ కాగా, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.9 శాతమని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. -
ఇప్పుడు ‘పప్పు’ ఎవరు?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికోత్పత్తి క్షీణతలను సూచిస్తూ ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అడిషనల్ గ్రాంట్స్ విడుదలపై లోక్సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సూచించారు టీఎంసీ ఎంపీ. ‘ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయి. తీవ్ర అసమర్థతను సూచించేందుకు, ఎదుటివారిని కించపరచేందుకు దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పు అనేది వెల్లడిస్తున్నాయి.’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్లో 26 నెలల కనిష్ఠానికి చేరుకున్న గణాంకాలను సూచిస్తూ ఈ మేరకు మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే తయారీ రంగం అక్టోబర్లో 5.6 శాతం మేర క్షీణించింది. మరోవైపు.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సూచిస్తూ విమర్శలు గుప్పించారు మహువా మొయిత్రా. ‘అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. అలాగే.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న డేటాను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 1/x In the spirit of the inalienable right to question the government, #Trinamool MP @MahuaMoitra makes a point on #ModiSarkar worth paying attention: “..the greatest liars has the believers” isn’t emotive but a fact based construct as #MahuaMoitra states facts on our economy. pic.twitter.com/1ukOSUv0aT — DOINBENGAL (@doinbengal) December 13, 2022 ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్కి బాయ్ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
అధిక ధరల సెగ: జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23, జూలై-సెప్టెంబర్) నెమ్మదించింది. 2021-22 ఇదే కాలంతో పోల్చితే జీడీపీ విలువ 6.3 శాతం పెరిగింది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు ఇందుకు ఒక కారణం. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం కన్నా వృద్ధి వేగం (2.1 శాతం మేర) మందగించడం గమనార్హం. అయితే, ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను మాత్రం భారత్ కొనసాగిస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 3.9 శాతం. భారత్ సాధించిన వృద్ధి రేటుకు మరే దేశమూ చేరుకోకపోవడం గమనార్హం. ఇక మొదటి, రెండు త్రైమాసికాలు కలిపి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి రేటు 9.7శాతం, రెండవ త్రైమాసికంలో 6.1-6.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనాలకు అనుగుణంగానే బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఉండడం గమనార్హం. 6.3 శాతం ఎలా అంటే.. 2011-12 స్థిర ధరల ప్రాతిపదిక, వాస్తవిక జీడీపీ విలువ 2021-22 క్యూ2లో రూ.35.89 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి 6.3 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్- జీవీఏ) ప్రాతిపదికన క్యూ2 వృద్ధి రేటు మాత్రం 5.6శాతం పెరిగి రూ.35.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. వ్యవసాయం: ఆర్థిక వ్యవస్థలో 15శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2శాతం . తయారీ: ఈ రంగం జీవీఏ మాత్రం 5.6 శాతం (2021 ఇదే కాలంలో) వృద్ధి నుంచి 4.3 శాతం పడిపోయింది. మైనింగ్: ఈ విభాగం కూడా 2.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021 ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు భారీగా 14.5 శాతంగా ఉంది. నిర్మాణం: వృద్ధి 8.1శాతం నుంచి 6.6శాతానికి తగ్గింది. యుటిలిటీ సేవలు: విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల వృద్ధి రేటు 5.6 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.5 శాతంగా నమోదైంది. సేవలు: మొత్తం జీడీపీలో మెజారిటీ వాటా కలిగిన ఈ విభాగం చూస్తే (ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్) వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 14.7 శాతానికి చేరింది.జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...ఎకానమీ పరుగుకు ఢోకా లేదు! అక్టోబర్లో 20 నెలల కనిష్టానికి మౌలికం అక్టోబర్లో ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం వృద్ధి రేటు 20 నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధి కేవలం 0.1శాతం గా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, సిమెంట్ రంగాలు క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఎరువుల రంగం మాత్రం 5.4శాతం పురోగతి సాధించింది. బొగ్గు విభాగంలో 3.6 శాతం, స్టీల్ రంగంలో 4శాతం వృద్ధి నమోదైతే, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి కేవలం 0.4శాతంగా నమోదైంది. 7 శాతం వరకూ వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం 7 శాతం శ్రేణి బాటలో ఉంది. పలు రంగాల్లో రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్లో అమ్మకాలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, బ్యాంక్ రుణ వృద్ధి, ఆటో అమ్మకాల గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి. -వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
క్యూ2లో ఎకానమీ వృద్ధి 5.8 శాతం
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23 జూలై,ఆగస్టు, సెప్టెంబర్) 5.8 శాతం వృద్ధి నమెదు చేసుకుంటుందని ఎస్బీఐ రిసెర్చ్ తన అధ్యయనంలో తెలిపింది. తయారీ, వినియోగ విభాగాల బలహీనత గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపనుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీన క్యూ2 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక లెక్కలు వెలువడనున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా అంచనాలను వెలువరించింది. క్యూ2లో మార్కెట్ అంచనాలకన్నా (6.1 శాతం) ఇది 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తక్కువగా ఉండడం గమనార్హం. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాలను 6.8 శాతంగా ఎస్బీఐ అంచనా వేసింది. మార్కెట్ అంచనాల కన్నా 20 బేసిస్ పాయింట్లు తక్కువ. 41 ఇండికేటర్ల విశ్లేషణల ప్రాతిపదికన ఎస్బీఐ అంచనాలు వెలువడతాయి. 2022-23 మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం. 2022-23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. తదుపరి ఆర్బీఐ పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకూ జరగనున్న నేపథ్యంలో క్యూ2 జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. -
భారత్ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ స్పష్టం చేసింది. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయని, రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయని వివరించింది. ఆయా అంశాలు ఊహించినదానికన్నా వేగంగా సానుకూలతను సంతరించుకుంటున్నట్లు వివరించింది. ఆయా అంశాలు దేశంపై రేటింగ్కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ’సావరిన్ డీప్ డైవ్’ పేరుతో మూడీస్ నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ డి గుజ్మాన్ మాట్లాడుతూ, ♦ భారతదేశానికి మూడీస్ ‘బీఏఏ3’ సార్వభౌమ రేటింగ్ ఇస్తోంది. అధిక రుణ భారం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ ఎకానమీ బలహీనతలను అధిక ఆర్థిక వృద్ధి పటిష్టత సమతౌల్యం చేస్తుంది. భారత్ కార్పొరేట్ వ్యవస్థ కూడా ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ప్రతిబింబిస్తోంది. ♦ 2022 చివరి నాటికి భారత్ రుణ నిష్పత్తి (దేశ స్థూలదేశీయోత్పత్తి– జీడీపీలో) 84 శాతంగా ఉంటుందన్నది అంచనా. పలు వర్థమాన దేశాలకన్నా ఇది ఎక్కువ. ♦ వచ్చే ఏడాది భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ–20 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మేము భావిస్తున్నాము. అయితే కుటుంబాలు, వ్యాపార సంస్థలు తక్కువ కొనుగోలు శక్తి సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం కీలక సవాలుగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం భారతదేశ వృద్ధికి ప్రతికూల ప్రమాదాలను సృష్టిస్తోంది. ♦ భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం జరిగింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. ♦ 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. ♦ బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయి. ♦ 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుంది. 2023లో జీ-20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణించే అవకాశం ఉంది. ♦ మెరుగైన పన్ను వసూళ్ల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2022-23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ♦ మూడీస్ గత ఏడాది అక్టోబర్లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్లుక్ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. రూపాయిపై ఆందోళన అక్కర్లేదు.. భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదని భావిస్తున్నాం. రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.05నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన దోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. -
మైనింగ్కు ప్రభుత్వ మద్దతు కావాలి
కోల్కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు. కోల్కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్దేబ్ పేర్కొన్నారు. -
7.2 శాతం వృద్ధికే ఇక్రా ఓటు
ముంబై: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు, కాంటాక్ట్ సేవలు పుంజుకోవడం సానుకూలతలుగా పేర్కొంది. నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో వృద్ధి కరోనా ముందు నాటికి స్థాయికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికంలో దేశ జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడగా, సెప్టెంబర్ త్రైమాసికంలో దీనికంటే తగ్గుతుందని, తదుపరి రెండు త్రైమాసికాల్లోనూ ఇంకాస్త తక్కువ వృద్ధిని చూస్తుందని తెలిపింది. ఎక్కువ రేటింగ్ ఏజెన్సీలు జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం, అంతకంటే దిగువకు ప్రకటించడం గమనార్హం. ఈ రకంగా చూస్తే ఇక్రా వృద్ధి అంచనాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆగస్ట్ నెలలో రోజువారీ రికార్డు స్థాయి జీఎస్టీ ఈవే బిల్లుల జారీ, పండుగలకు ముందస్తు భారీగా ఉత్పత్తుల నిల్వలను పెంచుకోవడం, కమోడిటీ ధరలు క్షీణించడం రానున్న పండుగల సీజన్కు ఎంతో సానుకూలమని.. అయితే, ఖరీఫ్లో కీలకమైన వరి దిగుబడి తగ్గనుండడం, వెలుపలి డిమాండ్ బలహీనపడడం వృద్ధికి ఉన్న సవాళ్లు అని, వీటిని పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. త్రైమాసికం వారీగా.. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5–7 శాతానికి పరిమితం కావచ్చు. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3), 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ4)లో 5–5.5 శాతంగా ఉండొచ్చు. బేస్ ప్రభావం వల్లే ఇలా ఉంటుంది’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. 2022 చివరికి ప్రైవేటు రంగంలో పూర్తి స్థాయిలో మూలధన వ్యయాలు పుంజుకుంటాయని, కంపెనీల తయారీ సామర్థ్య వినియోగం పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీవీఏ 7 శాతంగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 10.1 శాతంగా, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతం (మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లు) ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉండడంతో, దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటు విస్తరిస్తుందని అభిప్రాయపడింది. రూపాయి మరీ దారుణ పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి డాలర్తో 83కు పడిపోవచ్చని, పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ 7.3–7.8 శాతం స్థాయిలో ఉంటాయని అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటు 15.87 లక్షల కోట్లు (జీడీపీలో 6.7 శాతం) ఉంటుందని పేర్కొంది. -
భారత వృద్ధిపై ఎస్ అండ్ పీ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత వృద్ధి ప్రగతి పట్ల అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచాలను పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించినప్పటికీ.. ఎస్అండ్పీ మాత్రం 7.3 శాతంగానే కొనసాగించింది. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి ఎగువనే చలించొచ్చని అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఆర్థిక అంచనాలను తాజాగా ఎస్అండ్పీ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి వాతావరణం ప్రతికూలంగా ఉందని, అధిక అంతర్జాతీయ రేట్ల వల్ల కరెన్సీ విలువల క్షీణత, పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం వంటి ఒత్తిళ్లు ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. చైనాలో మందగమనం ప్రభావం.. భారత్లో వినియోగం, పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. ‘‘సవాళ్లు ఉన్నప్పటికీ.. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరం 2023–24కు 6.5 శాతంగా కొనసాగిస్తున్నాం’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయిస్ కూజ్స్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధించొచ్చని ఆర్బీఐ అంచనాగా ఉంది. ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్, సిటీ గ్రూపు భారత వృద్ధి రేటును 2022–23కు 7 శాతం, అంతకంటే దిగువకు ఇప్పటికే తగ్గించేశాయి. గత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండడం గమనార్హం. పస్త్రుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడడం తెలిసిందే. రూపాయిలో అస్థిరతలు.. రానున్న రోజుల్లో రూపాయి ఒత్తిళ్లను చూస్తుందని ఎస్అండ్పీ ఆర్థికవేత్త విశృత్ రాణా అంచనా వేశారు. అయితే, భారత్ వద్ద విదేశీ మారకం నిల్వలు గణనీయంగా ఉన్నట్టు తెలిపారు. రూపాయి డాలర్తో 81.52కు పడిపోవడం గమనార్హం. ‘‘గత నెల రోజుల్లో అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్తో పోలిస్తే రూపాయి క్షీణించింది తక్కువే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతున్న కొద్దీ రూపాయి మరిన్ని అస్థిరతలు చూడనుంది. బారత విదేశీ మారకం నిల్వల నిష్పత్తి అన్నది స్వల్పకాల విదేశీ రుణాలతో పోలిస్తే 2 కంటే ఎక్కువే ఉంది. ఇది గణనీయమైన మిగులు నిల్వలను సూచిస్తోంది’’అని విశృత్ రాణా వివరించారు. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగాను ఉంటుందని ఎస్అండ్పీ అంచనా వేసింది. వాతావరణంలో మార్పుల వల్ల గోధుమలు, బియ్యం ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్ల పెరుగుదలకు దారితీస్తుందంటూ, 2022–23 చివరికి 5.9 శాతం స్థాయిలో రెపో రేటు ఉంటుందని అంచనా వేసింది. -
మోర్గాన్ స్టాన్లీ కోత..భారత్ జీడీపీ వృద్ధి అంచనా కుదింపు!
ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకు అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– మోర్గాన్ స్టాన్లీ 40 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ రేటు 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. 2023–24 వృద్ధి అంచనాలను సైతం 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.7 శాతం నుంచి 6.4 శాతానికి దిగివచ్చింది. ప్రపంచ వృద్ధి మందగమన ధోరణి భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనుందని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇక 2022 డిసెంబర్తో ముగిసే సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 1.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 2021లో ఈ రేటు 4.7 శాతం. కాగా ఆర్బీఐ రెపోరేటు ప్రస్తుత 4.9% నుంచి 2023 ఆగస్టు నాటికి 6.5%కి చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. -
ఎకానమీ.. రివర్స్గేర్..!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22 చివరి త్రైమాసికంలో మరింత కిందకు జారింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి త్రైమాసికంలో 4.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. అంతక్రితం మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే, వృద్ధి రేట్లు తగ్గుతూ రావడం గమనార్హం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 20.3 శాతం వృద్ధి నమోదయితే, రెండవ త్రైమాసికంలో ఈ రేటు 8.5 శాతానికి తగ్గింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతంగా వృద్ధి స్పీడ్ నమోదయితే తాజా సమీక్షా త్రైమాసికంలో మరింతగా జారుడుబల్లపై నిలిచింది. కొన్ని రంగాల హైబేస్ ఎఫెక్ట్సహా కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో స్థానిక ఆంక్షలు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో సరఫరాల సమస్యలు, కమోడిటీ ధరల తీవ్రత వంటి అంశాలు సమీక్షా నెల్లో వృద్ధి రేటును కిందకు జార్చాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 మార్చి త్రైమాసికంలో పలు రంగాలు మంచి పురోగతిని నమోదుచేసుకున్నాయి. అయితే వృద్ధి రేటు మాత్రం అప్పట్లో 2.5 శాతంగా నమోదయ్యింది. ‘క్షీణత’ నుంచి ‘వృద్ధి’లోకి... కాగా 2021 ఏప్రిల్తో ప్రారంభమై, 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదయ్యింది. 2020–12 ఇదే కాలంలో ఎకానమీ ఏకంగా 6.6 శాతం క్షీణతను నమోదుచేసింది. అత్యంత లో బేస్ కూడా తాజా వార్షిక వృద్ధి రేటుకు కారణమయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, 2021–22లో ఎకానమీ 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) రెండవ అడ్వాన్స్ అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతకంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక ఆర్బీఐ అంచనాలు (9.5%) కన్నా 80 బేసిస్ పాయింట్ల తక్కువగా వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో బల హీన గణాంకాలే దీనికి కారణం. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 నుంచి 8.5% శ్రేణిలో ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో సమరి్పంచిన ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. ‘మూలధనం’ సానుకూలతలు మూలధన పెట్టుబడులకు సంబం ధించిన గ్రాస్ ఫిక్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్ 2020–21లో రూ.41.31 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.47.84 లక్షల కోట్లకు పెరగడం హర్షణీయ పరిణామం. 8.7 శాతం వృద్ధి రేటు ఎలా అంటే... జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్లు. 2021–22లో ఈ రేటు రూ.147.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 8.7 శాతమన్నమాట. కరెంట్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లెక్కలను సర్దుబాటు చేయకుండా చూస్తే నామినల్ జీడీపీ 2020–21లో రూ.198.01 లక్షల కోట్లు ఉంటే, 2021–22లో రూ.236.65 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 19.51%. చైనా వృద్ధి రేటుకన్నా తక్కువే 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. అయితే ఇంతకన్నా తక్కువగా భారత్ ఎకానమీ పనితీరు నమోదుకావడం గమనార్హం. దీనితో త్రైమాసికం పరంగా ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీగా చైనా నమోదయ్యింది. కట్టడిలోనే ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో కట్టడిలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. బడ్జెట్ అంచనా ప్రకారం జీడీపీ విలువలో ద్రవ్యలోటు 6.9% (రూ.15,91,089 కోట్లు). అయితే 6.71%గా నమోదయినట్లు (మొదటి అంచనాల ప్రకారం రూ.15,86,537 కోట్లు) కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వివరించింది. భారీ పన్ను వసూళ్లు ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ఉండడానికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల అంచనా రూ.17.65 లక్షల కోట్లుకాగా, వసూలయ్యింది రూ.18.2 లక్షల కోట్లు. అన్ని రంగాలూ బలహీనమే... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ స్థిర ధరల బేస్ ప్రకారం వేసిన గణాంకాల ప్రకారం, 2021–22లో ఎకానమీ అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే –6.6% క్షీణత నుంచి 8.7% వృద్ధికి మళ్లింది. జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో వృద్ధి రేటు 4.1 శాతంగా ఉంది. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కరెంట్ ఇయర్ ప్రాతిపదికన తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరం, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా 19.5 శాతం, 14.4 శాతంగా ఉన్నాయి. 2020–21లో ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో మైనస్ 1.4 శాతంగా ఉంది. ఇక జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ అంటే జీడీపీ ‘ప్లస్’ ఉత్పత్తులపై సబ్సిడీలు ‘మైనస్’ ఉత్పత్తులపై పన్నులు) విషయానికి వస్తే, వృద్ధి రేటు వార్షికంగా 8.1 శాతం ఉంటే, 4వ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇందుకు సంబంధించి 4.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక తాజా మార్చి త్రైమాసికంలో అన్ని విభాగాలూ బలహీనంగా ఉండడం గమనార్హం. తలసరి ఆదాయం వృద్ధి అంతంతే... తలసరి ఆదాయం కోవిడ్–19 కన్నా ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది. నికర జాతీయ ఆదాయం ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే, 2020–21లో ఇది రూ.1,26,855 ఉంటే, తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 18.3 శాతం పెరిగి రూ.1.5 లక్షలకు చేరింది. అయితే స్థిర ధరల వద్ద పరిశీలిస్తే, తలసరి ఆదాయం 7.5 శాతం మాత్రమే పెరిగి రూ.85,110 నుంచి రూ.91,481కి చేరింది. కోవిడ్ 19కు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో తలసరి ఆదాయం (స్థిర ధరల వద్ద) రూ.94,270. కోవిడ్ కఠిన ఆంక్షల నేపథ్యంలో 2020–21లో ఇది రూ.85,110కి పడిపోయింది. ప్రైవేటు వినియోగం బలహీనత నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయం నుంచి జీడీపీకి తగిన మద్దతుగా లభించగా, తయారీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా నాల్గవ త్రైమాసికం జీడీపీలో ప్రైవేట్ వాటా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం తీవ్రత, వినియోగ రికవరీలో అస్పష్టత వంటి అంశాల నేపథ్యంలో 2022–23లో వృద్ధి రేటు 7.2 శాతానికే పరిమితం అవుతుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బణం నేపథ్యంలో జూన్ మొదటి వారం పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును పావుశాతం పెంచుతుందని మా అంచనా. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎకనమిస్ట్ స్టాగ్ఫ్లేషన్ ఇబ్బంది తక్కువే... ఇతర దేశాలతో పోల్చితే భారత్కు స్టాగ్ఫ్లేషన్ (స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంతంతమాత్రంగా ఉండి, ధరలు తీవ్రంగా పెరగడం) ఇబ్బంది తక్కువే. ఇతర దేశాలకన్నా... భారత్ ఎకానమీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ముఖ్యంగా భారత్ ఫైనాన్షియల్ రంగం వృద్ధికి చక్కటి మద్దతును అందిస్తోంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాం... 2022కు సంబంధించి భారత్ క్రితం (ఏప్రిల్నాటి) 8.2 శాతం వృద్ధి అంచనాలను తగ్గించే పనిలో ఉన్నాం. గ్లోబల్ స్టాగ్ఫ్లేషన్ సవాళ్లు భారత్పై పడే అవకాశాలు కనిపిస్తుండడమే దీనికి కారణం. భారత్ ఇప్పటికే తక్కువ ఉపాధి కల్పన, అధిక ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది.అయితే సవాళ్లు ఉన్నప్పటికీ దేశం రికవరీ బాటనే నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల మరింత పెంపు బాటనే నడిచే అవకాశాలు సుస్పష్టం. మహమ్మారి సవాళ్ల నుంచి తప్పుకున్నట్లు అప్పడే భావించడం తగదు. చైనాలో ఈ ఆంక్షలు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. చైనా జీడీపీ 1% తగ్గితే, భారత్ వృద్ధి 0.6% తగ్గుతుంది. – లూయిస్ బ్రూయర్, భారత్లో ఐఎంఎఫ్ సీనియర్ రెసిడెంట్ ప్రతినిధి -
దేశానికి స్టార్టప్లే వెన్నెముక
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారంగా భారత్ నుంచి భారత్ కోసం ఆవిష్కరణలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. స్టార్టప్ల ప్రతినిధులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. ‘‘మన స్టార్టఫ్లు ఆట (పోటీ) నిబంధనలను మార్చేస్తున్నాయి. భారత్కు స్టార్టప్లు వెన్నెకముగా నిలుస్తాయన్న నమ్మకం ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత్లో 60,000 స్టార్టప్లు, 42 యూనికార్న్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం మూడింటిపై దృష్టి సారించి పనిచేస్తోంది. ప్రభుత్వ చట్రం నుంచి, అధికారిక అడ్డుగోడల నుంచి వ్యవస్థాపకత, ఆవిష్కరణలకు విముక్తి కల్పించడం. ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు సంస్థాగత యంత్రాగాన్ని ఏర్పాటు చేయడం. యువ ఆవిష్కర్తలు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలవడం’’ అని ప్రధాని వివరించారు. ఎంతో పురోగతి.. 2013–14లో కేవలం 4,000 పేటెంట్లు భారత సంస్థలకు మంజూరు అయితే, గతేడాది 28,000 పెటెంట్లు మంజూరైన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 2013–14లో 70,000 ట్రేడ్మార్క్లు సంఖ్య వృద్ధి చెందినట్టు చెప్పారు. అలాగే 2013–14లో 4,000 కాపీరైట్లు మంజూరు అయితే, 2021–22 మంజూరైనవి 16,000గా ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో భారత్ స్థానం 2015లో 81 ఉంటే, అది ఇప్పుడు 46కు మెరుగుపడినట్టు పేర్కొన్నారు. స్టార్టప్లు ప్రదర్శన.. 150కుపైగా స్టార్టప్లు ఆరు రకాల గ్రూపులుగా ఏర్పడి ఈ సందర్భంగా ఆరు రకాల థీమ్లపై ప్రదర్శన ఇచ్చాయి. సాగు రంగంలో విస్తృతమైన డేటా సమీకరణకు యంత్రాంగం, భారత్ను వ్యవసాయానికి ప్రాధాన్య కేంద్రంగా మార్చడం, టెక్నాలజీ సాయంతో హెల్త్కేర్కు మద్దతునివ్వడం, మానసిక ఆరోగ్య సమస్యకు పరిష్కారం, వర్చువల్ టూర్స్ ద్వారా రవాణా, పర్యాటకానికి ప్రోత్సాహాన్నివ్వడం, ఎడ్యుటెక్, ఉపాధి అవకాశాల గుర్తింపు, ఆఫ్లైన్ రిటైల్ దుకాణాలను ఈ కామర్స్తో అనుసంధానించడంపై స్టార్టప్లు తమ ఆలోచనలను ప్రధానితో పంచుకున్నాయి. ఉపాధి అవకాశాలకు వేదిక స్టార్టప్లు ఆవిష్కరణలు తీసుకురావడే కాదు భారీ ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కింది స్థాయి వరకు స్టార్టప్ సంస్కృతి ఫరిడవిల్లేందుకు వీలుగా ఏటా జనవరి 16న ‘నేషనల్ స్టార్టప్ డే’గా జరుపుకోనున్నట్టు ప్రకటించారు. స్టార్టప్లకు 2022 ఎన్నో అవకాశాలు, మార్గాలను తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఆవిష్కరణలు, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. స్టార్టప్లకు ప్రోత్సాహాన్నిస్తుంది.. నేషనల్ స్టార్టప్ డే అన్నది దేశ జీడీపీ వృద్ధిలో స్టార్టప్ల పాత్రను గుర్తించడమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, యువ నిపుణులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అడుగులు వేసేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని బోలోలైవ్ (షార్ట్ వీడియోల ప్లాట్ఫామ్) వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ సక్సేనా పేర్కొన్నారు. -
ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..?
న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్ ఓమిక్రాన్ పెరుగతున్న కేసుల వల్ల భారతదేశం ఈ ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం జీడీపీ రేటు తగ్గే అవకాశం ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) తెలిపింది. ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పేరుగుతుండటంతో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి రాత్రి, వారాంతపు కర్ఫ్యూలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం.. క్యూ4ఎఫ్ వై22లో జీడీపీ వృద్ధి ఇప్పుడు 5.7 శాతం(యోవై)గా ఉండనున్నట్లు తెలపింది. ఇది ఈ ఏజెన్సీ మునుపటి అంచనా 6.1 శాతం కంటే 40 బేసిస్ పాయింట్లు తక్కువ. "2022 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ది రేటును తగ్గిస్తూ 9.3 శాతంగా పేర్కొంది. ఇది మా మునుపటి అంచనా 9.4 శాతం కంటే 10 బేస్ పాయింట్లు తక్కువ" అని ఏజెన్సీ తెలిపింది. ఓమిక్రాన్ కొత్త కేసులు గత కోవిడ్ వేరియెంట్ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ఎక్కువగా ప్రాణాంతకం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫలితంగా, కోవిడ్ 1.0 & 2.0 కంటే ఇది తక్కువ విఘాతం కలిగిస్తుంది. కరోనా కేసుల వ్యాప్తిని అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూలు, లాక్ డౌన్ విధించాలని చూస్తుండటంతో ఆ ప్రభావం దేశ జీడీపీ పడుతున్నట్లు రేటింగ్స్ ఏజెన్సీ తెలిపింది. (చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు శుభవార్త!) -
ఒమిక్రాన్ అలజడి..! భారత్ను కుదిపేయనుందా...?
కోవిడ్-19 భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్నే చూపింది. వ్యవసాయం, మత్స్యరంగం, మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. కాగా తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచదేశాలు భయపడిపోతున్నాయి. మైనస్ 7.3 శాతంగా వృద్ధిరేటు..! కరోనా మహమ్మారి ఫస్ట్వేవ్ను ఎదుర్కోవడం కోసం వచ్చిన లాక్డౌన్తో దేశ వృద్ధి రేటు మైనస్ 7.3 శాతంగా నమోదు అయింది. కరోనా సెకండ్ వేవ్లో కూడా గ్రోత్ రేట్ కాస్త మెరుగైంది. వేగవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియనే ఆయా దేశాలను ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. సరైన జాగ్రత్తలు తీసుకొకుంటే ఒమిక్రాన్ వేరియంట్ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై భారీగానే ప్రభావం చూపుతోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వేగవంతమైన వ్యాక్సినేషన్..! భారత్లో ఇప్పటివరకు 33 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. భారత్లో టీకా వేగాన్ని పెంచడంతో ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ- నవంబర్ 2021 నెలవారీ ఆర్థిక నివేదికలో పేర్కొంది. మార్కెట్ సెంటిమెంట్లు, వేగవంతమైన టీకా కవరేజ్, బలమైన బాహ్య డిమాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రానున్న త్రైమాసికాల్లో భారత్ ఆర్థికంగా బలపడుతుందని అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో 8.4 శాతం గ్రోత్..! గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ స్థూల జాతీయోత్పత్తి (GDP) 8.4 శాతానికి పెరిగింది. సుమారు 100 శాతానికి పైగా జీడీపీ పుంజుకుంది. సేవ రంగం, తయారీ రంగాల్లో పూర్తి పునరుద్ధరణ, వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి కారణంగా జీడీపీ పుంజుకోవడానికి సహాయపడింది. ప్రైవేట్ రంగంలో రికవరీ మొదటి త్రైమాసికంలో 88 శాతం నుంచి రెండో త్రైమాసికంలో 96 శాతానికి పెరిగింది. సరఫరా విభాగంలో వ్యవసాయ రంగంలో జీవీఏ దాని ప్రీ-పాండమిక్ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతోంది. తయారీ , నిర్మాణ రంగాలు కూడా వాటి ప్రీ-పాండమిక్ స్థాయిలను అధిగమించి భారత వృద్ధికి కీలక చోదకాలుగా ఉద్భవించాయి. చదవండి: ద్రవ్యోల్బణం ఆందోళనలు ? పడిపోతున్న రూపాయి విలువ ! -
8.3 శాతం వృద్ధికి అవకాశం
వాషింగ్టన్: భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రపంచబ్యాంకు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 8.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చని తాజాగా అంచనా వేసింది. పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు, తయారీని పెంచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు వృద్ధికి తోడ్పడతాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కరోనా రెండో విడత ప్రబలడానికి ముందు ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనాల కంటే ఇది తక్కువేనని తెలిపింది. కరోనా రెండో విడత ప్రభావంతో ఆర్థిక రికవరీ నిలిచిపోయిందని.. వాస్తవానికి రికవరీ క్షీణించినట్టు కొన్ని సంకేతాల ఆధారంగా తెలుస్తోందని ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ అన్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నివేదికలో భారత్ జీడీపీ వృద్ధి 2021–22లో 7.5–12.5 మధ్య ఉంటుందని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం తెలిసిందే. దీంతో తన తాజా అంచనాల్లో దిగువ స్థాయికి వృద్ధి అంచనాలను సవరించినట్టు టిమ్మర్ పేర్కొన్నారు. కరోనా రెండో విడత ప్రభావం ఆర్థిక వ్యవస్థమీద ఎక్కువే ఉందన్నారు. కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరం కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరానికి అనుగుణంగానే ఉన్నాయని టిమ్మర్ అభిప్రాయపడ్డారు. ఇవి ఆర్థిక వ్యవస్థలో వెలుగు చూడని సామర్థ్యాలని బయటకు తీసుకొస్తాయని చెప్పారు. సామాజిక భద్రతా వ్యవస్థల కోసం నిధులను ఏర్పాటు చేయడం వంటివి సంఘటిత రంగంలోని కారి్మకులకే కాకుండా.. అసంఘటిత రంగంలోని వారికీ మేలు చేస్తుందన్నారు. ‘‘భారత్లో అమలు చేస్తున్న ఎన్నో స్వల్పకాలిక ఉపశమన చర్యలు దీర్ఘకాలం కోసం కాదు. దేశం మొత్తానికి సంబంధించి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సంస్కరణలు (కారి్మక, వ్యవసాయ) ఆ దిశలోనే ఉన్నాయి. కానీ, అదే సమయంలో చేయాల్సింది ఎంతో ఉంది’’ అని టిమ్మర్ వివరించారు. -
భారత ఎకానమీపై ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు..!
గత నాలుగు సంవత్సరాల నుంచి భారత జీడీపీ వృద్ది రేటు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కరోనా రాకతో జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరంలో -7.96 శాతం వృద్ది రేటును భారత్ను నమోదు చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. జీడీపీ గ్రోత్ రేట్ 12 శాతం మేర పడిపోయింది. 2021-2022 జీడీపీ రేటు 8.3 శాతం..! తాజాగా ప్రపంచ బ్యాంకు భారత ఎకానమీపై కీలక వ్యాఖ్యలను చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ 8.3 శాతం నమోదుచేస్తోందని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. భారత్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 20.1 శాతంగా నమోదుచేసింది. కరోనా రాకతో దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా మునుపటి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మునుపెన్నడూ లేని విధంగా జీడీపీ 24.4 శాతం మేర తగ్గింది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! గృహ ఆదాయాలే కీలకం లేకపోతే .. అంతే సంగతులు..! కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్తో సతమతమైనా భారత జీడీపీ వృద్దిరేటుపై ప్రపంచ బ్యాంకు తన నివేదికలో...కరోనా వ్యాక్సినేషన్, వ్యవసాయ, కార్మిక సంస్కరణలు, గృహ ఆదాయాల(నెలసరి, వార్షిక ఆదాయాలు) పెరుగుదల వంటి అంశాలు భారత జీడీపీ పెరుగుదలను నిర్ణయిస్తోందని పేర్కొంది. గృహా ఆదాయాల్లో రికవరీ ఉంటేనే..భారత ఎకానమీ పునరుద్దరణ ఉంటుందని తెలిపింది. గృహా ఆదాయాల్లో పెరుగుదల కన్పిస్తేనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది దీంతో జీడీపీ పెరుగుదలలో మార్పు కన్పిస్తోందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ఏదేమైనా, భారత్లో వివిధ రంగాలలో ఆర్థిక పునరుద్ధరణ అసమానంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. తయారీ, నిర్మాణ రంగాలు 2021 లో స్థిరంగా కోలుకున్నప్పటికీ, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులు, మహిళలు, స్వయం ఉపాధి వ్యక్తులు, చిన్న సంస్థలు వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దాంతో పాటుగా దక్షిణాసియా దేశాల్లో అనేక ఆర్థిక రంగాల్లో లింగ అసమానతలు భారీగా పెరిగిందని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మెర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
భారత్ జీడీపీ వృద్ధి 7 శాతం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2021–22లో 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్ (యూఎన్ఈఎస్సీఏపీ) మంగళవారం విడుదల చేసిన తన సర్వే ఆధారిత నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... 1. మహమ్మారి భారత్ వ్యాపార క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. దీనితో 2020–21లో ఆర్థిక వ్యవస్థ 7.7% క్షీణిస్తుంది. బేస్ ఎఫెక్ట్సహా ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో 2021–22లో వృద్ధి రేటు 7%గా ఉండే వీలుంది. 2. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15–మే 3, మే 4–మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి, రెండు త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొ లగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊ పందుకోవడంతో మూడో త్రైమాసికంలో స్వల్ప వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలోనూ దాదాపు ఇదే స్థాయి వృద్ధి రేటు నమోదుకావచ్చు. 3. కేంద్ర రుణ సమీకరణలకు సంబంధించి వడ్డీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉంచడం, బ్యాంకింగ్ మొండిబకాయిల తీవ్రతను అందుపులో ఉంచడం దేశం ముందు ఉన్న ప్రస్తుత పెద్ద సవాళ్లు. 4. వర్ధమాన ఆసియా–పసిఫిక్ దేశాల సగటు వృద్ధిరేటు 2021లో 5.9 శాతం ఉండే వీలుంది. 2022లో ఇది 5 శాతానికి తగ్గవచ్చు. 2020లో ఆయా దేశాల ఉత్పత్తి రేటు 1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. 5. బేస్ ఎఫెక్ట్ వల్ల 2021లో భారీ వృద్ధి రేటు (వీ నమూనా) కనిపించినప్పటికీ, తిరిగి ఎకానమీ ‘కే’ నమూనా రికవరీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. పలు పరిశ్రమలు, వ్యక్తులకు సంబంధించి రికవరీ రేటు విస్తృత ప్రాతిపదికన, ఏకరీతిన కాకుండా విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. 6. ఆసియా, పసిఫిక్ దేశాలు కేవలం వృద్ధిమీదే దృష్టి పెడుతున్నాయి తప్ప, ఉపాధి కల్పన, సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డానికి చర్యలు వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడం లేదు. మహమ్మారి వల్ల ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 8.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలో పడిపోయారు. వారు రోజుకు కేవలం 1.90 డాలర్లు (రూ.145కన్నా తక్కువ) సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు. 7. వృద్ధి ప్రణాళికల్లో ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. వర్ధమాన దేశాల్లో సైతం దిగువన ఉన్న ఎకానమీలకు అంతర్జాతీయ సహకారం అందాలి. కోవిడ్ను ఎదుర్కొనడంలో చైనా పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ కారణంగానే 2020 నాల్గవ త్రైమాసికంలో 6.5% వృద్ధిని సాధించగలిగింది. చైనా రిక వరీ మున్ముందూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement