-
ఢిల్లీ హాస్పిటల్స్కు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని నాలుగు హాస్పిటల్స్కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమన ప్రభుత్వం యంత్రాంగం, ఫైర్ సర్వీసు బృందాలు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని దీప్ చంద్ బంధు, జీటీబీ, దాదా దేవ్, హెడ్గేవార్ హాస్పిటల్స్కు వచ్చిన బాంబు బెదిరింపు ఈ మెయిల్స్పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.ఆదివారం కూడా పది హాస్పిటల్స్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రాగా.. తనిఖీ చేసిన ఢిల్లీ పోలీసులు వాటిని నకిలీ బాంబు బెదిరింపులుగా తేల్చారు. తమకు ఎటువంటి బాంబు ఆనవాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక, మే 1వ తేదిన దాదాపు 150 స్కూళ్లకు ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఈ మెయిల్స్పై దర్యాప్తు చేసిన పోలిసులు రష్యన్ మెయిల్ సర్వీస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. -
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆగంతకుల బాంబు బెదిరింపులు మరోసారి కలకలానికి కారణమయ్యాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)తోపాటు ఎనిమిది ఆస్పత్రులకు ఈ–మెయిల్ హెచ్చరికలు అందాయి. మే ఒకటో తేదీన దేశ రాజధాని పరిధిలోని 150కి పైగా స్కూళ్లకు కూడా ఇదేవిధంగా బెదిరింపు మెయిళ్లు అందడం, పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం అవన్నీ వట్టివేనని తేలడం తెల్సిందే. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐజీఐ టెరి్మనల్–3లో బాంబులు పెట్టినట్లు మెయిల్ అందడంతో తనిఖీలు చేపట్టారు. భారీగా పోలీసులను మోహరించారు. అంతకుముందు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీ ప్రాంతంలోని 8 ఆస్పత్రులకు బెదిరింపులు అందాయి. అదేవిధంగా, గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ అందింది. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆయాచోట్లకు ఫైరింజన్లను పంపించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పోలీసు బృందాలు పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టాయి. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదని ఢిల్లీ నార్త్జోన్ డీసీపీ ఎంకే మీనా చెప్పారు. బురారీ ఆస్పత్రి, సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్, దాదాదేవ్ హాస్పిటల్, గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, బారా హిందూరావ్ హాస్పిటల్, జనక్పురి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి, అరుణా అసఫ్ అలీ గవర్నమెంట్ ఆస్పత్రులకు ఈ బెదిరింపులు వచ్చాయి. -
చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజేఎంఆర్లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు. జలుబుకు ఇన్ని మందులా..! సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్ట్రోమితార్పాన్,రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్ కోవిడ్కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు. నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్+డోంపెరిడోన్ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. రియాక్షన్లు..దుష్ప్రభావాలు కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. డోసులు ఎక్కువ తక్కువ! నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్ మందులు, హార్మోన్ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు. డాక్టర్లకు అవగాహన కల్పించాలి ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్ తీసుకువచ్చిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కేవలం వెబ్సైట్కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త -
Health Insurance: ఎక్కడైనా నగదు రహిత వైద్యం!
ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల్లో ఒకటి నగదు రహిత వైద్యం. ముందస్తు ప్రణాళికతో లేదా అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో అక్కరకు వస్తుంది. సాధారణంగా బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేది. నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే, సొంతంగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తప్పిస్తూ.. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత వైద్యం పొందేందుకు వీలుగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ ఏడాది జవనరి నుంచి ‘ఎక్కడైనా నగదు రహితం’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలేమిటో చూద్దాం. బీమా సంస్థ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోనూ నగదు రహిత చికిత్స పొందడమే నూతన విధానంలోని సౌలభ్యం. ప్రతి బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ పేరుతో ఒక జాబితా నిర్వహిస్తుంటుంది. ఆ జాబితాలోని ఏ హాస్పిటల్లో చికిత్స పొందినా బీమా సంస్థే నేరుగా చెల్లింపులు చేస్తుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ నెట్వర్క్ ఆస్పత్రిలోనే చికిత్స పొందాలంటే సాధ్యపడకపోవచ్చు. ప్రమాదానికి గురైనప్పుడు వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఆస్పత్రి బీమా నెట్వర్క్లో భాగంగా లేకపోతే? బిల్లు భారీగా వస్తే..? ఆ మొత్తాన్ని రోగి సంబందీకులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, సత్వర వైద్యం అందాల్సిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి తరుణంలో సమీపంలోని హాస్పిటల్కు వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎక్కడైనా నగదు రహితం ఉపయోగపడుతుంది. అత్యవసరమనే కాదు, ముందుగా అనుకుని నిర్ణిత సమయానికి తీసుకునే చికిత్సలకు సైతం నాన్ నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కడైనా నగదు రహితం విధానం ఎలా పనినిచేస్తుందో తెలుసుకోవడం అవసరం. నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే.. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రావడానికి ముందు కూడా కొన్ని బీమా సంస్థలు నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ జనరల్, బజాజ్ అలియాంజ్ జనరల్ సైతం నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశాయి. ముందస్తుగా నిర్ణయించుకుని, తీసుకునే చికిత్స విషయంలో బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్ (టీపీఏ)కు రెండు నుంచి మూడు రోజుల ముందు (48–72 గంటలు) తెలియజేయడం తప్పనిసరి. ఈ మెయిల్ లేదంటే ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా లేదంటే లిఖిత పూర్వకంగా బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరిన 24 నుంచి 48 గంటల్లోపు (బీమా సంస్థ ఆధారంగా వేర్వేరు) విషయాన్ని తెలియజేయాలి. 15 పడకలు తప్పనిసరి.. నగదు రహిత వైద్యం పొందేందుకు ఎంపిక చేసుకునే ఆస్పత్రిలో కనీసం 15 పడకలు (బెడ్స్) ఉండాలన్నది నిబంధన. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, హాస్పిటల్ అనే నిర్వచనానికి అనుగుణంగా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పనిచేస్తూ ఉండాలి. గుర్తింపు కార్డులు, పాలసీ డాక్యుమెంట్లు, మెడికల్ రిపోర్ట్లు, పి్రస్కిప్షన్లు, బిల్లులు నిర్ధేశిత ఫార్మాట్లో బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది. నగదు రహిత వైద్యానికి అనుమతించే ముందు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఆమోద లేఖను చాలా బీమా సంస్థలు కోరుతున్నాయి. ఆస్పత్రి బిల్లులు నిజమైనవేనా? ప్రామాణిక అడ్మిషన్ ప్రక్రియ విధానాన్నే అనుసరిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగానే చికిత్సా విధానాలు ఉన్నాయా? అని బీమా సంస్థలు పరిశీలిస్తాయి. ఇక పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధుల చికిత్సా క్లెయిమ్లో వేచి ఉండాల్సిన కాలం), కోపే క్లాజ్, మినహాయింపులు, ముందస్తు వ్యాధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని గమనించాలి. కొన్ని చికిత్సలకు సంబంధించి (ఉదాహరణకు కేటరాక్ట్) ఉప పరిమితులు ఉంటే, వాటి విషయంలోనూ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పాలసీలో ప్రత్యేకమైన రైడర్ తీసుకుంటే తప్ప కాటన్, ఫేస్ మాస్్కలు, సర్జికల్ గ్లోవ్లు, నెబ్యులైజేషన్ కిట్లకు పరిహారం రాదు. ఏవైనా అదనపు చార్జీలు (కవరేజీలోకి రానివి) విధిస్తే, పాలసీదారు సొంతంగా చెల్లించుకోవాలి. చార్జీల పట్ల అవగాహన నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రకాల చికిత్సలకు వసూలు చేసే చార్జీల వివరాలు బీమా సంస్థ రికార్డుల్లో ఉంటాయి. దీనివల్ల పాలసీదారు సొంత పాకెట్పై భారం పడదు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్సలకు ఎంత చార్జీ వసూలు చేస్తారన్నది కీలకం అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్కు మించి నాన్ నెట్వర్క్ ఆస్పత్రి చార్జీ చేస్తే, అప్పుడు క్లెయిమ్ పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆస్పత్రి పడకలు, ఏ ప్రాంతంలో ఉందన్న దాని ఆధారంగా చికిత్సల ధరలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చికిత్సకు నెట్వర్క్ హాస్పిటల్లో రూ.50,000 పరిమితి ఉందనుకోండి. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇదే చికిత్సకు రూ.70,000 వేలు చార్జ్ చేస్తే, పాలసీదారు తాను సొంతంగా రూ.20,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకని నగదు రహిత వైద్యం కోరుకునే వారు తమ పాకెట్ నుంచి పెద్దగా చెల్లించొద్దని భావిస్తే, అప్పుడు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్భాల్లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అలాంటప్పుడు పాలసీదారు సొంతంగా చెల్లించి, డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్మెంట్కు వెళ్లాల్సి వస్తుంది. రోగికి శరవేగంగా చికిత్స అవసరమైతే తప్పించి, మిగిలిన వాటికి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ను ఎంపిక చేసుకోకపోవడం మంచిది. నెట్వర్క్–నాన్ నెట్వర్క్ బీమా సంస్థ నగదు రహిత వైద్యం అందించేందుకు వీలుగా పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందానికి వచ్చిన ఆస్పత్రులు నెట్వర్క్ జాబితాలో ఉంటాయి. ఇలా ఒప్పందం చేసుకునే సమయంలోనే చికిత్సల ధరల విషయంలో బీమా సంస్థ ఆస్పత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. దీనివల్ల బీమా సంస్థకు కొంత భారం తగ్గుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్తో ఈ అనుకూలత బీమా సంస్థలకు ఉండదు. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది.. చికిత్స కోసం ఎంపిక చేసుకునే నాన్ నెట్వర్క్ ఆస్పత్రి బీమా సంస్థ బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. బ్లాక్ లిస్ట్లోని ఆస్పత్రిలో చేరడం వల్ల నగదు రహిత వైద్యం అందదు. రీయింబర్స్మెంట్కు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల మొత్తానికే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు కూడా బీమా సంస్థ పోర్టల్కు వెళ్లి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితాను ఓ సారి పరిశీలించడం ఎంతో మంచిది. ఇక ముందస్తు ప్రణాళికతో తీసుకునే చికత్సలకు బీమా సంస్థ నెట్వర్క్లోని హాస్పిటల్కు వెళ్లడమే మేలు. ఎందుకంటే నెట్వర్క్ ఆస్పత్రులు బీమా సంస్థ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు దాదాపుగా ఎదురుకావు. నెట్వర్క్ హాస్పిటల్తో లాభాలు ► నెట్వర్క్ (ఎంపానెల్డ్) ఆస్పత్రుల్లో టారిఫ్లు బీమా సంస్థతో కుదిరిన అంగీకారం మేరకు ఉంటాయి. చికిత్సల చార్జీలు నిర్ధేశిత పరిమితుల పరిధిలోనే ఉంటాయి. దీంతో క్లెయిమ్కు సత్వర ఆమోదం లభిస్తుంది. వేగంగా డిశ్చార్జ్ కావచ్చు. ► నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ పరిష్కారం సాఫీగా, వేగంగా జరుగుతుంది. ► నెట్వర్క్ ఆస్పత్రులు అన్నింటిలోనూ చికిత్సల నాణ్యాత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో రోగులకు చికిత్సల తర్వాత సమస్యల రిస్క్ తగ్గుతుంది. ► ఆస్పత్రి, బీమా సంస్థ మధ్య విశ్వసనీయమైన బంధం వల్ల చికిత్సల బిల్లులను మరీ పెద్దవి చేసి చూపించడం ఉండదు. అనవసర ప్రక్రియలు, ఔషధాల వినియోగం ఉండదు. మోసాల రిస్క్ తగ్గుతుంది. -
వైఎస్ జగన్ పాలనలో రూపురేఖలు మారుతున్న ప్రభుత్వ హాస్పిటల్స్
-
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్కు తీసుకెళితే డాక్టర్కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్కు టీమ్గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్గా ఈ క్లినిక్స్ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
ఇకపై చిన్న ఆసుపత్రుల్లోనూ క్యాష్లెస్ వైద్యం
ముంబై: ఆరోగ్య బీమా పాలసీదారులు త్వరలోనే అన్ని రకాల ఆస్పత్రుల్లోనూ నగదు రహిత వైద్యం పొందే దిశగా అడుగులు పడుతున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఇందుకు సంబంధించి ‘క్యాష్లెస్ ఎవ్రీవేర్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. జాబితాలో లేని హాస్పిటళ్లలోనూ పాలసీదారులకు నగదు రహిత వైద్యాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపింది. కనీసం 15 పడకలు ఉండి, ఆయా రాష్ట్రాల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినవి నగదు రహిత వైద్యాన్ని ఆఫర్ చేయవచ్చు. దీంతో పాలసీదారులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే తమ పాకెట్ నుంచి ఎలాంటి చెల్లింపులు చేయక్కర్లేదు. చికిత్సల వ్యయాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. క్లెయిమ్ అనుమతించడంపై చెల్లింపులు ఆధారపడి ఉంటాయని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. కొన్ని షరతులకు లోబడి పాలసీదారులు నగదు రహిత వైద్యం కోసం ఏ ఆస్పత్రిని అయినా ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. నాన్ ఎంపానెల్డ్ (బీమా సంస్థ జాబితాలో లేని) హాస్పిటల్లో చేరడానికి 48 గంటల ముందు లేదా, చేరిన 48 గంటల్లోపు బీమా సంస్థకు తెలిజేయాల్సి ఉంటుందని పేర్కొంది. బీమా సంస్థ నెట్వర్క్లో లేని ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పుడు పాలసీదారులపై భారం పడకుండా చూడడమే దీని ఉద్దేశ్యమని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చైర్మన్ తపన్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40వేల ఆస్పత్రుల్లోనే నగదు రహిత వైద్యం పాలసీదారులకు అందుబాటులో ఉండడం గమనార్హం. -
జనరల్ అట్లాంటిక్ చేతికి ఆసుపత్రులు!
ముంబై: గ్లోబల్ పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్(జీఏ) దేశీ ఆసుపత్రుల చైన్ను కొనుగోలు చేసే బాటలో సాగుతోంది. 19 ఆసుపత్రుల నెట్వర్క్ కలిగిన ఉజాలా సిగ్నస్ హెల్త్కేర్ సరీ్వసెస్లో 70 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సంస్థ విలువను రూ. 1,600 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంస్థలో తొలుత ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి 51 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ప్రస్తుత వాటాదారులలో 8 రోడ్స్ వెంచర్స్ ఇండియా, ఇవాల్వెన్స్ ఇండియా ఫండ్, సోమర్సెట్ ఇండస్ హెల్త్కేర్ ఫండ్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రమోటర్ల నుంచి సైతం కొద్దిపాటి వాటానుచేజిక్కించుకోనుంది. వెరసి ఉజాలా సిగ్నస్ పేరుతో అమర్ ఉజాలా నిర్వహిస్తున్న సంస్థలో మొత్తం 70 శాతం వాటాను జీఏ కొనుగోలు చేయనుంది. డీల్ ప్రస్తుతం డాక్యుమెంటేషన్ స్థితిలో ఉన్నదని, కొద్ది వారాలలో పూర్తికాగలదని తెలుస్తోంది. అయితే అటు జీఏ, ఇటు ఉజాలా సిగ్నస్ ప్రతినిధులు ఈ అంశాలపై స్పందించకపోవడం గమనార్హం! ఉత్తరాదిన సర్వీసులు ఉజాలా సిగ్నస్ ప్రధానంగా ఉత్తరాదిన ద్వితీయ, తృతీయస్థాయి పట్టణాలలో 19 ఆసుపత్రులను కలిగి ఉంది. హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, జేఅండ్కే, ఢిల్లీలలో మొత్తం 1,800 పడకలతో హెల్త్కేర్ సర్వీసులు విస్తరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 600 కోట్ల టర్నోవర్, రూ. 120 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించగలదని అంచనా. సిగ్నస్ మెడికేర్ను 2011లో డాక్టర్లు దినేష్ బాత్రా, షుచిన్ బజాజ్ ఏర్పాటు చేశారు. తదుపరి 2019లో అమర్ ఉజాలా మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. హెల్త్కేర్ రంగంలో విస్తరించే ప్రణాళికలతో 10 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న సంస్థలో రూ. 130 కోట్లకు నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. ఆపై ఉజాలా హెల్త్కేర్కుగల రెండు ఆసుపత్రులను సిగ్నస్లో విలీనం చేసింది. తద్వారా విలీన సంస్థలో నియంత్రణతోపాటు ప్రధాన వాటాను పొందింది. కాగా.. 2018లో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్ హాస్పిటల్స్)లోనూ జీఏ 13 కోట్ల డాలర్లు(సుమారు రూ. 1,079 కోట్లు) ఇన్వెస్ట్ చేసి మైనారిటీ వాటాను కొనుగోలు చేసిన విషయం విదితమే. -
రాబోయే వ్యాధులకు ముందే చెక్!
సాక్షి, హైదరాబాద్: మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణ కోసం అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన అత్యాధునిక బయోబ్యాంక్ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. 3 లక్షలకుపైగా జీవ నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ చేసేందుకు వీలుగా ఈ బయోబ్యాంక్లో మైనస్ 80 డిగ్రీల ఫ్రీజర్లు పదిహేను, మైనస్ 20 డిగ్రీల ఫ్రీజర్లు ఐదు, మైనస్ 160 డిగ్రీలతో కూడిన మూడు లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు ఉన్నాయి. ఈ తరహా నిల్వ కేంద్రం ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిదిగా పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ ఈ బయోబ్యాంక్ను మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ బయో బ్యాంక్ అర్థవంతమైన పరిశోధనలకు, వ్యాధుల నివారణకు వీలు కల్పిస్తుందని.. అంతిమంగా అత్యాధునిక వైద్య విధానాల అభివృద్ధికి దోహదపడుతుందని హుడ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, బిగ్ డేటా టూల్స్, మెషీన్ లెర్నింగ్ అల్గా రిథమ్ల మేళవింపుతో ఈ బయోబ్యాంక్ పనిచేస్తుందన్నారు. కేన్సర్, డయాబెటిస్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు బయటపడక ముందే కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని సంతరించుకొనే క్రమంలో బయోబ్యాంక్ ఏర్పాటును మేలిమలుపుగా లెరోయ్ హుడ్ అభివర్ణించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ ప్రెసిడెంట్, కో–ఫౌండర్ అయిన హుడ్... హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిన ఆటోమేటెడ్ జీన్ సీక్వెన్సర్ను గతంలో కనుగొన్నారు. ఇదో మైలురాయి: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డి వైద్య పరిజ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని పెంపొందించే దిశగా బయోబ్యాంక్ ఓ మైలురాయి కాగలదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలకు కీలక వనరుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ బయోబ్యాంక్కు 3 లక్షల కంటే ఎక్కువ నమూనాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉందని వివరించారు. వ్యాధుల నివారణకు తోడ్పడే ఔషధ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బయోబ్యాంక్ ఏర్పాటు సహకరిస్తుందని చెప్పారు. దీనిద్వారా వచ్చే 5–10 ఏళ్ల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులతోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల వివరాలను సేకరించి వారి జీవ నమూనాలను విశ్లేషిస్తామని వివరించారు. వ్యాధుల నిర్ధారణ, నివారణలో విప్లవం... బయోబ్యాంక్ అనేది ఒక రకమైన నిల్వ సౌకర్యం. ఇది 3 లక్షల కంటే ఎక్కువ మానవ కణజాల నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ ఉంచగలదు. మానవ కణజాల నమూనాల నిల్వ, విశ్లేషణ ద్వారా ఇది జన్యు పరిశోధనలో సహాయ పడుతుంది. సంక్లిష్ట వ్యాధుల చికిత్స రానురానూ కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాధుల రాకను ముందే పసిగట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది. దీనికోసం వ్యక్తుల కణజాల నమూనాలను సేకరిస్తారు. వాటిని నిల్వ చేసి పదేళ్లపాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ సమయంలో ఆయా వ్యక్తుల్లో ఆరోగ్యపరంగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్ని, వ్యాధుల దాడిని, వాటికి కారణాలను పసిగట్టడం ద్వారా వారసుల ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేస్తారు. అలాగే దాదాపుగా అదే కణజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా పసిగట్టే అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యాధి రావడానికి ముందే నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుంది. -
గాజా.. మరుభూమి!
దెయిర్ అల్ బలాహ్/జెరూసలేం/టెల్ అవీవ్: గాజాలో పరిస్థితులు నానాటికీ విషమిస్తున్నాయి. కరెంటు తదితర సదుపాయాలతో పాటు నిత్యావసరాలన్నీ పూర్తిగా నిండుకోవడంతో కొద్ది రోజుల క్రితం నుంచే పూర్తిగా పడకేసిన ఆస్పత్రులు క్రమంగా మృత్యుదిబ్బలుగా మారుతున్నాయి. రోగులు, నవజాత శిశువుల నిస్సహాయ సామూహిక మరణాలకు వేదికలుగా మారుతున్నాయి. గాజాలోని ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 179 మృతదేహాలను ప్రాంగణంలోనే ఒకే చోట సామూహికంగా ఖననం చేసినట్టు ఆస్పత్రి డైరెక్టర్ అబూ సలామియా తాజాగా నిర్ధారించడం పరిస్థితికి అద్దం పడుతోంది! వీరిలో చాలామంది ఐసీయూ రోగులు, నవజాత శిశువులేనని సమాచారం. అక్కడ 30కి పైగా శవాలను ఖననం చేస్తుండగా చూసినట్టు అక్కణ్నుంచి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షి కూడా వెల్లడించారు. పలు ఇతర ఆస్పత్రుల్లోనైతే మృతదేహాలు కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నట్టు సమచారం. ప్రస్తుతం ఉత్తర గాజాలో అల్ అహ్లి బాప్టిస్ట్ ఆస్పత్రి మాత్రమే కాస్తో కూస్తో పని చేస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఒక్క మంగళవారమే 500 మందికి పైగా క్షతగాత్రులు అందులో చేరినట్టు వివరించింది. కరెంటు లేకపోవడం, ఆక్సిజన్, ఇంధనంతో పాటు ఆహార పదార్థాలు, నిత్యావసరాలన్నీ నిండుకుంటుండటంతో అది కూడా ఏ క్షణమైనా పూర్తిగా మూతబడే పరిస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చింది. మరోవైపు గాజా అంతటా ఎటు చూసినా వ్యర్థాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మురుగు నీరు పొంగి పొర్లుతోంది. వాటిద్వారా ఇప్పటికే పలు అంటురోగాలు ప్రబలుతున్నాయి. ఇవి మరింత విజృంభిస్తే గాజా మరుభూమిగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. చలి, చెదురుమదురు వర్షాలతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. జబాలియాలో 30 మంది మృతి: మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ బీభత్సం మంగళవారం కూడా యథాతథంగా కొనసాగింది. ఆస్పత్రులతో పాటు ఇంకా చెదురుమదురుగా మిగిలి ఉన్న భవనాలన్నీ క్షిపణి, బాంబు దాడులు, కాల్పులతో అల్లాడిపోయాయి. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడులు మరో 30 మందిని బలిగొన్నట్టు తెలుస్తోంది. గాజాలోని పార్లమెంటు భవనాన్ని ఇజ్రాయెల్ సైనికులు ఆక్రమించారు. భవనం లోపల ఇజ్రాయెల్ పతాకాలతో ఉన్న సైనికుల ఫొటోలు ఆ దేశ మీడియాలో వైరల్గా మారాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్)కు చెందిన గోల్డెన్ బ్రిగేడ్ గాజా పార్లమెంటును స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటిదాకా 100 మందికి పైగా ఐరాస వర్కర్లు యుద్ధానికి బలయ్యారు. మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 11,550 దాటినట్టు గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. వీరిలో మూడొంతులు మహిళలు, పిల్లలేనని పేర్కొంది. ఆస్పత్రులను కాపాడాలి: బైడెన్ బందీల విడుదలకు కృషి చేస్తున్నట్టు తాము కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అల్ షిఫాతో పాటు గాజాలో ఆస్పత్రులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా కాపాడాలన్నారు. ఏ ఆస్పత్రి మీదా ఇజ్రాయెల్ సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడరాదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, పట్టు వీడేందుకు ఇప్పటిదాకా ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ కూడా కాస్త దిగొస్తున్నట్టు కన్పిస్తోంది. గాజా ఆస్పత్రుల్లో మృత్యుముఖంలో ఉన్న నవజాత శిశువులను సురక్షితంగా తరలించేందుకు ఇంక్యుబేటర్లను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్పత్రులే కమాండ్ సెంటర్లు: ఇజ్రాయెల్ ఆస్పత్రులను హమాస్ తన స్థావరాలుగా మార్చుకుందని ఇజ్రాయెల్ మరోసారి ఆరోపించింది. ఇందుకు ఆధారాలున్నట్టు పేర్కొంది. రంటిసీ పిల్లల ఆస్పత్రిలో గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలతో కూడిన కమాండ్ సెంటర్ను గుర్తించామంటూ సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేసింది. ఇజ్రాయెల్ బందీలను కూడా అక్కడే దాచారని అనుమానం వెలిబుచ్చింది. వీటిని హమాస్ మరోసారి ఖండించింది. ఆస్పత్రులపై నిస్సిగ్గు దాడులను సమర్ధించుకునేందుకే ఇజ్రాయెల్ నిరాధారణ ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. వాళ్లు రోగులు.. జంతువులు కాదు! కంటతడి పెట్టిస్తున్న డాక్టర్ ఇంటర్వ్యూ అల్ షిఫా ఆస్పత్రిని తక్షణం వీడాలన్న ఇజ్రాయెల్ ఆదేశాలను వైద్య సిబ్బంది మంగళవారం కూడా తిరస్కరించారు. 700 మందికి పైగా నిస్సహాయులైన రోగులను ప్రాణాపాయ పరిస్థితుల్లో వదిలి వెళ్లలేమని స్పష్టం చేశారు! ఈ క్రమంలో ఆస్పత్రికి చెందిన హమామ్ అల్లో అనే నెఫ్రాలజిస్టు మరణానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడందరినీ కంటతడి పెట్టిస్తోంది. ‘‘ఆస్పత్రిలో, ఐసీయూ వార్డుల్లో అంతమంది ఉన్నారు. వారంతా రోగులు. జంతువులు కారు. నేను వెళ్లిపోతే వారికి చికిత్స అందించేదెవరు? చికిత్స పొందడం వారి హక్కు. వారి కర్మకు వారిని వదిలి వెళ్లలేం. 14 ఏళ్ల పాటు వైద్య విద్య నేర్చుకున్నది ఇలా కేవలం నా జీవితాన్ని కాపాడుకునేందుకు రోగులను నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్లిపోయేందుకు కాదు’’ అంటూ కొద్ది రోజుల క్రితం డెమొక్రసీ నౌ అనే స్వతంత్ర పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కుండబద్దలు కొట్టారు. కుటుంబంతో పాటు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలను హమామ్తో పాటు ఆయన కుటుంబం కూడా బుట్టదాఖలు చేసింది. అత్తగారింట్లో ఉండగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమామ్తో పాటు ఆయన తండ్రి, మామ, బావమరిది దుర్మరణం పాలయ్యారు! స్వేచ్ఛాయుత పాలస్తీనా కోసం హమామ్ నిత్యం కలలు కనేవాడని గుర్తు చేసుకుంటూ తోటి నెఫ్రాలజిస్టు బెన్ థామ్సన్ కన్నీటి పర్యంతమయ్యాడు. కాల్పులాపితే బందీల విడుదల: హమాస్ యుద్ధానికి ముగింపు ఇప్పట్లో కనిపించని పరిస్థితుల్లో, కనీసం కాల్పుల విరామం కోసం హమాస్ ప్రయత్నిస్తోంది. ఐదు రోజుల పాటు కాల్పులాపితే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీల్లో 70 మంది మహిళలు, చిన్నారులను విడుదల చేసేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా దీన్నిప్పటికే ఇజ్రాయెల్కు చేరవేసినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ చెరలో ఉన్న 200 మంది పాలస్తీనా చిన్నారులు, 75 మంది మహిళలను వదిలేస్తే తమ వద్ద ఉన్న బందీల్లో మహిళలు, పిల్లలను విడుదల చేస్తామని గత వారం కూడా హమాస్ ప్రకటించడం తెలిసిందే. హమాస్ చెరలో 240 మందికి పైగా ఇజ్రాయెలీలున్నట్టు సమాచారం. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధ్యక్షురాలు మిర్జానా స్పొల్జారిక్ మంగళవారం ఇజ్రాయెల్లో వారి కుటుంబాలను కలుసుకుని ధైర్యం చెప్పారు. మరణానంతర ప్రసవాలు! ఆస్పత్రులపై ఇజ్రాయెల్ దాడులు అంతులేని దారుణాలతో పాటు పలు విషాదాలకూ కారణంగా మారుతున్నాయి. సౌకర్యాల లేమి తదితరాల కారణంగా ఆస్పత్రుల్లో ఎందరో నిండు గర్భిణులు దుర్మరణం పాలైనట్టు హమాస్ ఆరోగ్య శాఖ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘అలాంటి పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ వృత్తి ధర్మం మరవలేదు. ఎప్పటికప్పుడు ఆ మృతదేహాలకు హుటాహుటిన సిజేరియన్ చేసి వీలైనంత మంది శిశువులను బయటికి తీసి కాపాడుతూ వచ్చారు’’ అని పేర్కొంది. ఇంక్యుబేటర్లతో పాటు ఏ సదుపాయాలూ లేక ఆ నవజాత శిశువులు కూడా మృత్యువుకు చేరువవుతున్నట్టు చెప్పింది. బయటపడ్డ కశ్మిరీ మహిళ లుబ్నా నజీర్ షాబూ అనే కశ్మిరీ మహిళ తన కూతురు కరీమాతో పాటు గాజా నుంచి మంగళవారం సురక్షితంగా బయట పడింది. వారిద్దరూ ఈజిప్టు చేరినట్టు భర్త వెల్లడించారు. ఈజిప్టులోని భారత మిషన్ల కృషి వల్లే తాను, తన కూతురు గాజా నుంచి బయట పడ్డట్టు లుబ్నా చెప్పారు. గాజాలో సర్వం నేలమట్టమైందని ఆవేదన వెలిబుచ్చారు. -
గాజాలో ఆగని వేట
గాజా స్ట్రిప్/జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది. ఖాన్ యూనిస్, రఫా, డెయిర్ అల్–బలా నగరాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని గాజీ సిటీలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టినట్లు తెలిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్లో 1,400 మందికిపైగా జనం మరణించారు. గాజాలో హమాస్ను అధికారం నుంచి కూలదోయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై దృష్టి పెట్టింది. గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. మరో ఐదుగురు బందీల విడుదల ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే. గాజా రక్షణ బాధ్యత మాదే: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్ రక్షణ బాధ్యతను నిరవధికంగా ఇజ్రాయెల్ తీసుకుంటుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. తద్వారా గాజా స్ట్రిప్ మొత్తం ఇజ్రాయెల్ నియంత్రణ కిందికి వస్తుందని సంకేతాలిచ్చారు. గాజాను తమఅదీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడారు. గాజాలోకి మానవతా సాయాన్ని చేరవేయడానికి లేదా హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడిపించడానికి వీలుగా మిలిటెంట్లపై యుద్ధానికి స్వల్పంగా విరామం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ! గాజాలోకి పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి. సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్కు అమెరికా సూచించింది. రఫా పట్టణంలో ఇజ్రాయెల్ దాడి తర్వాత స్థానికుల ఆక్రందన -
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఆర్డీవో(రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్) వ్యవస్థను రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, తర్వాత వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో త్వరలో ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన రెవెన్యూ డివిజన్ అధికారి పోస్ట్ కాలగర్భంలో కలిసిపోనుంది. ఇప్పటికే VRA, VRO వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రెవెన్యూ డివిజన్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల కొంత మందికి ప్రమోషన్ల కూడా ఇచ్చారు. దాదాపు 90 మంది వరకు ఆర్డీవోలు పనిచేస్తున్నారు. వీరందరికి కొత్త పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. త్వరలో ఆర్డీవో వ్యవస్థను తీసివేసి వీరిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా నియమించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆసుపత్రిలో సూపరింటెండెంట్తో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీవోల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో 300 బెడ్స్ ఉన్నాయి. కాగా, ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్య సేవలు ఎక్కడ అందుతున్నాయి?. వైద్య సేవలు అందని పక్షంలో ఎవరిని సంప్రదించాలో తెలియక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికి ఆర్డీవోలను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. కాగా, రాష్ట్రంలో సర్కారు దవాఖానాలకు పట్టిన నిర్లక్ష్యం జబ్బుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త ట్రీట్మెంట్ ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇది కూడా చదవండి: నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా? -
కార్పొరేట్ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం
వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వైరల్ జ్వరాలతోపాటు డెంగ్యూ జ్వరం భయపెడుతండటంతో ప్రజలు ఆందోలన చెందుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో జ్వరాలు వస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్సీర్ పరిధిలో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదలతో ఢిల్లీలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 22 వరకు ఢిల్లీలో మొత్తం 187 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి పోలిస్తే ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే అత్యధికం. కేవలం జూలై మొదటి మూడు వారాల్లో డెంగ్యూ కేసులు దాదాపు 65 నమోదయ్యాయి. జూన్లో 40, మేలో 23 వెలుగు చూశాయి. వీటికి తోడు 61 మలేరియా కేసులు నమోదయ్యాయ్యాయి. సీఎం సమీక్ష ఈ నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరాన్ని పట్టి పీడిస్తున్న డెంగ్యూ కేసులను ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, మేయర్ షెల్లీ ఒబెరాయ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. అధికారులకు కేజీవ్రాల్ ఆదేశాలు అనంతరం ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 20 డెంగ్యూ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. వాటిలో 19 నమూనాలలో టైప్-2 తీవ్రమైన స్ట్రెయిన్ ఉన్నట్లు తేలినట్లు చెప్పారు. డెంగ్యూ రోగులకు ఆసుపత్రుల్లో పడకలు రిజర్వ్ చేయాలని, ఆసుపత్రులు ‘మొహల్లా’ క్లినిక్లలో తగినన్ని మందుల నిల్వ ఉండేలా చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు భరద్వాజ్ తెలిపారు. జరిమానా పెంపు ఇంటి చుట్టుపక్కలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దోమలువృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న ఆయన.. ఈ కారణంగానే దేశ రాజధానిలో పరిస్థితి తీవ్రతరంగా మారినట్లు తెలిపారు. ఈ క్రమంలో డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దోమల ఉత్పత్తికి అవకాశమిచ్చే ఇళ్లకు రూ. 1000, వాణిజ్య సంస్థలకు రూ. 5000కు జరిమానాను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. -
గర్భిణుల అరిగోస
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురిటినొప్పు లొస్తే ఇప్పటికీ ఎడ్లబండిలోనే... లేదంటే బురదలో పంటచేల మీదుగా... అడవి దారిలో నరకయాతన పడి నడుస్తూ... ఏటా వానాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల గర్భిణుల కష్టా లివి. వాగులు, వంకలు ఉప్పొంగిన ప్పుడు, కల్వర్టులు, రోడ్డు డ్యాం, లోవల్ వంతెనలు దెబ్బతిన్న సమయాల్లో ఆసు పత్రులకు వెళ్లేందుకు నేటికీ నానాకష్టాలు పడాల్సి వస్తోంది. 108, 102 వాహనాలు వెళ్లలేక ఎడ్లబండి, ప్రైవేటు వాహనాలు, మనుషులే మోసుకుని వస్తూ ఆసుపత్రు లకు తరలిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు తల్లి, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ముంచుకొస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూర్, కెరమెరి, తిర్యా ణి, బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, వేమనపల్లి, కాసిపేట, కోట పల్లి మండలాల్లో రాకపోకలకు ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 26న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామపంచాయతీ పాటి గ్రామానికి చెందిన మూడు నెలల గర్భిణి రెడ్డి మల్లక్క జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లేందుకు అరిగోస పడింది. ఎర్రవాగు ఉప్పొంగడంతో 108 వాహనం వచ్చే పరిస్థితి లేక ఎడ్లబండి, ఆటోలో వెళ్లింది. మొదట బెల్లంపల్లి, అటు నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భస్రావం జరిగింది. నెరవేరని హామీలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రిస్కు ఉన్న గర్భిణులను వారం ముందే ఆసుపత్రికి తరలించి డెలివరీలు చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా ‘బర్త్ వెయిటింగ్ రూమ్స్’ ఏర్పాటు చేశారు. ఇది పకడ్బందీగా అమలు కావడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 133గ్రామాలు ఉన్నాయి. ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే 219గ్రామాలు హై రిస్కులో ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఈ నెలలో ప్రసవమయ్యే 46మందిని గుర్తించారు. కేవలం నార్మల్ డెలివరీలకే ఈ జిల్లాలో సేవలు అందుతున్నాయి. సిజేరి యన్ చేయాలంటే ఆదిలాబాద్ రిమ్స్, మంచిర్యాలకు రిఫర్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వానాకాలంలో ఎయిర్ అంబులెన్సులు అందుబాటులో ఉంచుతామని హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ♦ ఇది ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం ఎంపల్లి, గోండుగూడ వెళ్లే దారి. వర్షాలు కురిసి వరదలు వస్తే నానా కష్టాలు పడాలి. అత్యవసర సమయంలో గర్భిణులు, బాధితులు ఆసుపత్రులకు వెళ్లేందుకు ఇక్కడి గిరిజనులు నరకం చూస్తున్నారు. ♦ గురువారం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నాగారానికి చెందిన నిండు గర్భిణి దుర్గం లావణ్య పురిటి నొప్పుల బాధతోనే అటవీ ప్రాంతం గుండా నడవాల్సి వచ్చింది. ఇక్కడ కల్వర్టు దెబ్బతినడంతో తిప్పలు పడాల్సి వచ్చింది. ఎందుకీ సమస్య..? ♦ అటవీ సమీప గ్రామాలకు రోడ్లు వేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు రావడం లేదు. అనాదిగా ఆ గ్రామాలకు మట్టి రోడ్లే దిక్కవుతున్నాయి. రిజర్వు ఫారె స్టుల్లో కొత్త రోడ్లు, విస్తరణ, కల్వర్టులు, హై లెవల్ వంతెనల నిర్మాణాలకు అనుమతుల ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండానే రిజర్వు ఫారెస్టుల్లో రోడ్ల పనులు చేపట్టారు. అయితే వాటిపై కేసులు నమోదయ్యాయి. కొత్త అనుమతులు పొందాలంటే క్లిష్టంగా మారింది. కొన్ని చోట్ల టైగర్జోన్, రిజర్వు ఫారెస్టు గుండా వెళ్లే రోడ్లకు అనుమతులు కేంద్రం నుంచి సులువుగా రావడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు నేరుగా నిధులు మంజూరు చేయించి, పనులు చేపట్టే ప్రయత్నాలు చేస్తే, అటవీ శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయిన ఘటనలు ఉన్నాయి. ♦ ఈ నెల 24న కుమురంభీం జిల్లా దహెగాం మండలం లోహకు చెందిన గర్భిణి మడే ప్రమీలను సరైన రోడ్డు సౌకర్యం లేక అష్ట కష్టాలు పడుతూ ఎడ్లబండిలో ఆసుపత్రికి తరలించారు. ఇదే మండలం రావుపల్లికి చెందిన ఆలం భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు వచ్చాయి. సిగ్నల్స్ లేక సెల్ఫోన్లు పనిచేయక 108కు సమాచారం ఇవ్వకలేకపోయారు. 30కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్సీ చేరుకునేందుకు ప్రైవేట్ జీపులో వెళ్లారు. చివరకు తల్లీబిడ్డ క్షేమం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ♦ ఈ నెల 20న ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్కు పరిధి చిన్నమారుతిగూడకు చెందిన ఆత్రం సావిత్రి బాయి పురిటి నొప్పులతో బాధపడుతూ అరకిలోమీటరు మేర బురదలో, పంట చేను మీదుగా నడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ఈ ఆవాసానికి సరైన రోడ్డు లేకపోవడమే ఇక్కడి వారికి శాపంగా మారింది. -
అసలే అక్రమం... ఆపై నకిలీ!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి నకిలీ, అక్రమ ఔషధాలను తీసుకువచ్చి వివిధ ఆస్పత్రులతో పాటు సామాన్యులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులున్న ముఠాలో ఇద్దరిని అరెస్టు చేసి రూ.28.72 లక్షల విలువైన ఔషధాలు స్వాదీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్రావు శనివారం వెల్లడించారు. కర్మన్ఘాట్కు చెందిన పోకల రమేష్, పెద్ద అంబర్పేట వాసి బి.రాఘవరెడ్డి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇందులో తీవ్రనష్టాలు రావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించారు. రమేష్ కు సమీప బంధువైన పూర్ణచంద్రరావుకు ఫార్మ రంగంలో అనుభవం ఉంది. గతంలో ఆల్ఫాజోలమ్ టాబ్లెట్లు అక్రమంగా విక్రయిస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కాడు. ఇతగాడు ఉత్తరాది నుంచి అక్రమ, నకిలీ ఔషధాలను సిటీకి తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిద్దామంటూ సలహా ఇచ్చాడు. లైసెన్సు లేకపోయినా ఈ దందాలోకి దిగిన వీరితో పాటు లక్ష్మణ్ అనే వ్యక్తి కూడా ముఠాలో చేరాడు. వీరంతా కలిసి ఉత్తరప్రదేశ్కు చెందిన నదీమ్, ఢిల్లీ వాసి అరుణ్ చౌదరి నుంచి ఈ ఔషధాలను తక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. ఎలాంటి బిల్లులు, పత్రాలు లేకుండానే కొరియర్లో సిటీకి రప్పిస్తున్నారు. ఈ ఔషధాలను మార్కెట్ రేటు కంటే 30 నుంచి 40 శాతం తక్కువ ధరకు అమ్ముతూ రోగులను ఆకర్షిస్తున్నారు. కొన్ని ఆస్పత్రులకు సైతం వీటిని సరఫరా చేస సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా వ్యవహారాలపై ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్సై మహ్మద్ ముజఫర్ తన బృందంతో వలపన్నారు. శనివారం దిల్సుఖ్నగర్లోని ఓ ఆస్పత్రి వద్ద రమేష్, రాఘవలను పట్టుకున్నారు. వీరి నుంచి స్వాదీనం చేసుకున్న ఔషధాల్లో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్మార్క్, అరిస్టో సహా వివిధ కంపెనీల పేర్లతో ఉన్న వాటితో పాటు ఆస్పత్రులకు సరఫరా అయ్యే ‘నాట్ ఫర్ సేల్’ మందులు కూడా ఉన్నాయి. ఈ ముఠా కొన్ని ఔషధాలను వివిధ వైద్యశాలలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. కేసును మలక్పేట పోలీసులకు అప్పగించారు. -
ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు
సాక్షి, అమరావతి: సూర్యుడిపై ఉమ్మేస్తే తన ముఖంపైనే పడుతుందన్న ఇంగితాన్ని కూడా ‘ఛీనాడు’ పట్టించుకోవడం మానేసింది! ఆ ముఖం తడుస్తున్నా సరే.. తుడుచుకునేందుకు కూడా అది సిద్ధపడటం లేదు!! నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపు అన్నట్లుగా వలువలు వదిలేసి కోలాటమాడుతోంది! డ్రామోజీ సమర్పిస్తున్న దగుల్బాజీ కథనాల్లో తాజాగా రాష్ట్ర ఆరోగ్య రంగం కూడా చేరింది!! వైద్య ఆరోగ్యశాఖలో దాదాపు 49,000 పోస్టులను భర్తీ చేయకుండా ఖాళీగా వదిలేసిందంటే ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు ఎంత బరి తెగించి వ్యవహరించిందో ఈనాడుకు కనపడలేదా? ఆరోగ్యశ్రీని నీరుగార్చి దాదాపు రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టిన చంద్రబాబు నిర్వాకాలపై రామోజీ కలం కదలలేదు ఎందుకు? ఒకే ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు.. మూడేళ్లలో మొత్తం 17 వైద్య కళాశాలలు ఆవిష్కృతమవుతుండటం.. వైద్య ఆరోగ్యశాఖలో 49,000 పోస్టుల భర్తీ.. రూ.17,000 కోట్ల వ్యయంతో ఆరోగ్య రంగానికి జవసత్వాలు కల్పిస్తున్న పరిస్థితి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం గతంలో ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి భరోసా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమూ ఆంధ్రప్రదేశ్ మినహా మరొకటి లేదు! కోవిడ్ మహమ్మారినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ఉచితంగా లక్షల మందికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. తాజాగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పల్లె ముంగిటకే డాక్టర్లను పంపుతున్న రాష్ట్రం కూడా మనదే. ఉన్నఫళంగా రాత్రికి రాత్రే రావటానికి మెడికల్ కాలేజీలేమీ రోడ్డు పక్కన కిళ్లీ షాపులు కాదు! ఓ కొత్త వైద్య కళాశాల ఏర్పాటు కావాలంటే కచ్చితంగా కొన్ని నిబంధనలు అనుసరించాలి. కనీసం 330 పడకల సదుపాయంతో ఆసుపత్రులు రెండేళ్ల పాటు సేవలందించాలి. పక్క రాష్ట్రానికి కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయంటూ రామోజీ గుండెలు బాదుకుంటున్నారు. మరి అక్కడ పదేళ్లుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉందన్న విషయం గుర్తులేదా? అది కూడా అక్కడి ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఎంతో కృషి చేయడంతో రెండో విడతలో ఇప్పుడు 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మన రాష్ట్రంలో ఆరోగ్య రంగం నిస్తేజంగా మారటానికి గత సర్కారు నిర్వాకాలే కారణమన్న సంగతి తెలిసీ రామోజీ బురద చల్లే యత్నం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఒకేసారి వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాదే ప్రవేశాలు కల్పించనున్నారు. ఇవన్నీ సహించలేక ఈనాడు అయోమయం కథనాలను తన పాఠకులకు వడ్డించింది! తెలంగాణలో ఎలా అంటే? తెలంగాణ ప్రభుత్వం 2014–19 మధ్య నాలుగు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని కళాశాలల ఏర్పాటుకు వీలుగా 25 సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేస్తూ పడకల సంఖ్యను పెంచింది. 2018లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. అప్పట్లో తీసుకున్న చర్యలు 17 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చేందుకు దోహదపడ్డాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేయడంతోపాటు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు దిశగా కనీసం ప్రయత్నించలేదు. కనీసం తెలంగాణను చూసైనా ఆస్పత్రుల్లో పడకలు పెంచిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చారు. నాడు బీజేపీకే చెందిన కామినేని శ్రీనివాసరావు రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ వైద్య కళాశాలలను ప్రోత్సహిస్తూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారు. సమర్థతతో సాధించిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు మాట నెరవేరుస్తూ 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత ఐదు జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం ద్వారా రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతులను రాబట్టారు. దీంతో ఈ ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే ఏడాది పాడేరు, పులివెందుల, ఆదోనిలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వీలుగా అక్కడి ఆస్పత్రుల్లో పడకలు పెంచేలా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో 2024–25లో మరో మూడు కొత్త వైద్య కళాశాలలు, ఆ తర్వాత ఏడాది మిగిలిన 9 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధమయ్యారు. తద్వారా మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోనూ ఏర్పాటు కానున్నాయి. వైద్య రంగం అభివృద్ధికి సాక్ష్యాలివిగో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజారోగ్యానికి సీఎం జగన్ రక్షణగా నిలిచారు. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు వెచ్చించింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలని్నంటినీ పథకం పరిధిలోకి తేవడంతో 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు ఏకంగా 3,255కి పెరిగాయి. ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్ర చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ►సీఎం జగన్ అధికారంలోకి రాగానే మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 3,300 మంది అంబులెన్స్ సేవలను వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను తొలుత మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి రావడంతో 104 ఎంఎంయూలు మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ►గతేడాది ఏప్రిల్ నుంచి 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ►గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ వి«ధానాన్ని ప్రవేశపెట్టారు. పీహెచ్సీ వైద్యులు నెలకు రెండుసార్లు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామాలను సందర్శించి అక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. పీజీ సీట్లు పెరిగాయ్.. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించడంతోపాటు ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లను సమకూర్చేందుకు ఖాళీల భర్తీతో పాటు కొత్తగా పోస్టులను సృష్టించి నియామకాలు చేపట్టింది. ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. దీంతో 2019 వరకూ 937 మాత్రమే పీజీ సీట్లు ఉండగా గత నాలుగేళ్లలో ఏకంగా 768 సీట్లను రాబట్టగలిగారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు 1705కి పెరిగాయి. పీజీ సీట్లను మరింత పెంచడం ద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతోంది. వైద్యరంగంలో ఆదర్శంగా ఏపీ చంద్రబాబు అసమర్థతతో వైద్య రంగంలో రాష్ట్రం వెనుకబాటుకు గురైంది. ఆయన అధికారంలో ఉండగా ఆరోగ్య రంగాన్ని నీరుగార్చారు. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలతో వైద్య రంగంలో ఏపీ రోల్ మోడల్గా ఆవిష్కృతం అవుతోంది. తెలంగాణలో తొమ్మిదేళ్లలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాల తీసుకురాలేకపోయిన విషయాన్ని ఈనాడు ఎందుకు విస్మరించింది? ఏపీలో ఒకేసారి 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే అందుబాటులోకి వస్తున్నాయి. మిగిలినవి రెండేళ్లలో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న రామోజీరావుకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైద్య రంగానికి ఏం చేశారో రాసే ధైర్యముందా? – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చదవండి: Fact Check: అర్హులకు పరిహారం జమచేస్తే నిందలా?.. ‘ఈనాడు’ వంకర రాతలు -
ఆ దుర్ఘటన మిగిల్చిన కన్నీటి కథలు..తమ వాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబాలు
ఒడిశాలో బాలసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నాలుగు రోజులైంది. ఆ ఘటనలో చనిపోయిన వందలాది మందిలో ఇంకా గుర్తించలేని మృతదేహాలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు తమవారెక్కడున్నారో తెలియక వెతుకులాటలో కొందరు కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని శోకం, అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి భార్య, కూతురు ఇదే ప్రమాదం బారిన పడ్డారు. దీంతో అతడు తన భార్య, కూతురు ఆచూకి కోసం ఎంతగానో తపించాడు. చివరికి మార్చురీలో ఎన్నో మృతదేహాలను చూసిన తర్వాత గానీ తన భార్యను గుర్తించలేకపోయాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి, ఆ బాధను దిగమింగి కూతురు కోసం వెతకడం ప్రారంభించాడు. ఆమె బతుకుందా లేదా అన్న టెన్షన్తో నరకయాతన అనుభవించాడు ఆ వ్యక్తి. చివరికి జిల్లా కలెక్టర్, బాలాసోర్ నివాసితులు సాయంతో కూతురు కోసం భువనేశ్వర్కి బయలు దేరాడు ఆ తండ్రి. అలానే పశ్చిమ బెంగాల్కి చెందిన మరో తండ్రి హేలారామ్ మాలిక్ తనకు ఈ రైలు ప్రమాదం గురించి తనకు తెలియదని కన్నీటిపర్యంతమయ్యాడు. తన కొడుకు ఫోన్ చేసి తాను తీవ్ర గాయాలతో ఉన్నాని, ప్రమాదం జరిగిందని చెప్పడంతో హుటాహుటినా ఇక్కడకు వచ్చానని చెప్పాడు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆ ఘటన జరిగిన రాత్రికే వచ్చినా.. కొడుకు ఆచూకి కానరాక ఆ తండ్రి ఎలా తల్లడిల్లాడో వివరించాడు. చివరికి తాను తన కొడుకుని మార్చురీలోనే గుర్తించానని, అపస్మారక స్థితిలో ఉంటే చనిపోయాడనుకుని రెస్క్యూ సిబ్బంది మార్చురీలో ఉంచినట్లు తెలిపాడు హేలారామ్. ప్రస్తుతం అతని కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఎన్నో మిరాకిల్ ఘటనలు తోపాటు, కన్నీటిని మిగిల్చిన విషాద కథలు అక్కడ అడుగడుగున కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, వాస్తవానికి కొన్ని మృతదేహాలను వివిధ ప్రాంతాలకు తరలించడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. అధికారులు ఆయా మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తుపట్టాలనే ఉద్దేశంతో వాటిని పర్యవేక్షించడమే గాక గుర్తుపట్టేలా బాధితు కుటుంబ సభ్యులకు సాయం చేస్తున్నారు. ఈ మేరకు బాలాసోర్ జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ దత్తాతత్రేయ భౌసాహెబ్ షిండే మాట్లాడుతూ..తమకు రెండు కంటట్రోల్ రూంలు ఉన్నాయని, మృతదేహం ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు అని పేర్కొన్నారు. కాగా, ఇంకా 101 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందని కూడా అధికారులు వెల్లడించారు. (చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..) -
ఈశాన్యంలో వైద్య సదుపాయాలు బలోపేతం
గువాహటి: ఈశాన్య రాష్ట్రాల్లో నూతన ఆసుపత్రులు, వైద్య కళాశాలల రాకతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈశాన్య భారతంలో సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం తొమ్మిదేళ్లుగా శ్రమిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతాన్ని ఆమడ దూరంలో ఉంచాయని, తమ ప్రభుత్వం దగ్గరికి చేర్చుకుంటోందని వివరించారు. ఈశాన్య భారతదేశంలో నిర్మించిన తొలి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. అస్సాం రాజధాని గువాహటిలో రూ.1,123 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అలాగే నల్బారీ, నాంగావ్, కోక్రాజార్లో మెడికల్ కాలేజీలను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. రూ.546 కోట్లతో నిర్మించే అస్సాం అడ్వాన్స్డ్ హెల్త్కేర్ ఇన్నోవేషన్ ఇనిస్టిట్యూట్ (ఏఏహెచ్ఐఐ)కు పునాదిరాయి వేశారు. దీన్ని అస్సాం ప్రభుత్వం, ఐఐటీ–గువాహటి సంయుక్తంగా నిర్మించనున్నాయి. 1.1 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. విపక్షాలు దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రూ.7,300 కోట్లతో కూడిన ఐదు రైల్వే ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై రూ.3,200 కోట్లతో పలాస్బారీ–సువాల్కుచీ బ్రిడ్జి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. దిబ్రూగఢ్లో రూ.1,709 కోట్లతో నిర్మించిన మిథనాల్ ప్లాంట్ను ప్రారంభించారు. అస్సాంలో సంప్రదాయ బిహూ నృత్యోత్సవంలో మోదీ పాల్గొన్నారు. 11,000 మందికిపైగా నృత్యకారులు, కళాకారులు అలరించారు. ఇక్కడ గురువారం నిర్వహించిన బిహూ నృత్యం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించడం తెలిసిందే. సాంకేతికతతో సత్వర న్యాయం గౌహతి హైకోర్టు వార్షికోత్సవంలో మోదీ న్యాయసేవలు అందించే వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. టెక్నాలజీతో సత్వర న్యాయం అందించవచ్చని, దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల వంటి మూరుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతోమేలు జరుగుతుందన్నారు. శుక్రవారం అస్సాంలో గౌహతి హైకోర్టు 70వ వార్షికోత్సవ ముగింపు సభలో మోదీ ప్రసంగించారు. నూతన టెక్నాలజీతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. లక్షలాది మంది పౌరులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేశామని ప్రధాని మోదీ వివరించారు. దానివల్ల ఆస్తుల సంబంధిత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. -
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్
లండన్: బ్రిటన్లోని అతిపెద్ద బోధనా ఆసుపత్రుల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్–ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈఓగా భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ నియమితులయ్యారు. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ట్రస్టుకు ఒక మహిళ, అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓ కావడం ఇదే తొలిసారి. ఆమె 2022 జూలై నుంచి ఓయూహెచ్ మధ్యంతర సీఈఓగా ఉన్నారు. కఠిన పోటీని ఎదుర్కొని తాజాగా పూర్తిస్థాయి సీఈఓ అయ్యారు. భాగస్వామ్య వర్సిటీలతో, ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ చారిటీతో కలిసి పనిచేస్తానని మేఘనా చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పరిశోధనలు, నవీన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. ఆమె అబ్స్టెట్రిక్స్, గైనకాలజీలో మేఘనా పండిట్ శిక్షణ పొందారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో యూరోగైనకాలజీ విజిటింగ్ ప్రొఫెసర్గా, ఎన్హెచ్ఎస్ ట్రస్టులో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా, వార్విక్ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్గా చేశారు. -
చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స
బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. లక్షల మందికి సోకుతూ వేగంగా విస్తరిస్తోంది. జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసిన క్రమంలో పరిస్థితులు దారుణంగా మారాయి. వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దగ్గు, దమ్ము, శ్వాసకోస సంబంధిత సమస్యలతో వయోవృద్ధులు ఆసుపత్రులకు పరుగులుపెడుతున్నారు. బెడ్లు సరిపోకపోవడంతో హాలులోనే నెలపైనే చికిత్స అందిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితులు దయనీయంగా కనిపిస్తున్నాయి. బెడ్లు నిండిపోవడంతో కోవిడ్ బాధితులకు హాల్లోనే చికిత్సలు అందిస్తున్నారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతూ హార్ట్ మానిటర్స్, ఆక్సిజన్ ట్యాకులతో ఉన్న రోగుల దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. షాంఘైలోని ఓ ఆసుపత్రి హాల్లోనే రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఇదీ చదవండి: బీజింగ్లో కోవిడ్ బీభత్సం -
AP: అత్యవసర వైద్యం మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రజలు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యవసరమయ్యే క్లిష్టమైన సంరక్షణ(క్రిటికల్ కేర్)ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గుండెపోటు, కార్డియో వాస్కులర్ స్ట్రోక్స్, శ్వాసకోశ రుగ్మతలు, పాయిజన్, సెప్టిక్ షాక్, ఇతర సందర్భాల్లో బాధితులకు నాణ్యమైన వైద్య సేవల కోసం నెల్లూరు జీజీహెచ్, కడప, శ్రీకాకుళం రిమ్స్లలో క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ)లు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించింది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కరోనా వైరస్ తెలియజేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీసీబీల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.71.25 కోట్లతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నెల్లూరు, కడప, శ్రీకాకుళంలో ఒక్కోచోట రూ.23.75కోట్ల ఖర్చుతో రూ.71.25 కోట్లతో 50 పడకల సామర్థ్యంతో సీసీబీలను ఏర్పాటుచేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జీజీహెచ్, కడప రిమ్స్లో సీసీబీల ఏర్పాటుకు డీపీఆర్లు రూపొందించగా, వాటికి ఆమోదం లభించింది. సీసీబీల ఏర్పాటుకు టెండర్లను పిలవాలని ఎన్హెచ్ఎం నుంచి ఏపీఎంఎస్ఐడీసీకి ప్రతిపాదనలను పంపారు. శ్రీకాకుళం రిమ్స్లో సీసీబీ ఏర్పాటుకు డీపీఆర్ను రూపొందిస్తున్నారు. త్వరగా టెండర్లు పూర్తి చేసి, శరవేగంగా సీసీబీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ ‘సాక్షి’తో చెప్పారు. -
పెళ్లినాటికి నాకు సైకిల్, రెండు గేదెలే... కానీ, ఇప్పుడు
హుడాకాంప్లెక్స్(రంగారెడ్డి జిల్లా): ‘నా పెళ్లి(1976) నాటికి సైకిల్, రెండు పశువులు మాత్రమే ఉండె. కానీ, ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. అతిపెద్ద విద్యాసంస్థలు స్థాపించా. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యా’ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివా రం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడ్డానని, అనేక వ్యాపారాలు చేసి, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు. అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందుచూపుతో నగరం నలమూలలా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ రంగం కుదేలైనా హైదరాబాద్లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందని, ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలు అందజేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బెంగళూరు కాదు, హైదరాబాదే.. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు గుర్తుకొ చ్చేదని, కానీ ఇప్పుడు కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందని, ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ముఖ్య కార్యాలయాలు ఇక్కడే కొలువుదీరాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్బీ నగర్లో చేపట్టిన అభివృద్ధి వల్ల ఈస్ట్జోన్ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని తెలిపారు. నాగోలు నుంచి గండిపేట వరకు మూసీకి ఇరువైపులా రూ.1,370 కోట్ల వ్య యంతో 120 అడుగుల రోడ్డు నిర్మించేందు కు ప్రణాళికలు రూపొందించామని చెప్పా రు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఫిర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రావు, ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement