-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
దుబాయ్: ఇరాన్ తూర్పు అజర్బైజాన్ పర్వతసానువుల్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) ప్రాణాలు కోల్పోయా రు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీప్రాంతంలో కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దుల్లాహియాన్ (60), ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలిక్ రహ్మతీ, అధికారులు, పైలట్లు, అంగరక్షకులు చనిపోయారని ఇరాన్ అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ మార్గదర్శకంలో ఇజ్రాయెల్పై గత నెలలో ఇరాన్ జరిపిన భీకర డ్రోన్లు, క్షిపణి దాడుల ఘటన మరువకముందే రైసీ హఠాన్మరణంపై ప్రపంచవ్యాప్తంగా భిన్న కథనాలు వినవస్తున్నాయి. అయితే రైసీ మరణోదంతంలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ సోమవారం స్పష్టంచేసింది. హెలికాప్టర్ ప్రమాదంపై అత్యున్నతస్థాయి దర్యాప్తునకు సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షొయిగు మాట ఇచ్చారు. రైసీ మరణం నేపథ్యంలో ప్రస్తుత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఖమేనీ ప్రకటించారు. ఉపవిదేశాంగ మంత్రి బఘేరీ కనీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించారు. హెలికాప్టర్ కూలడానికి గల కారణాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అధ్యక్షుడి మరణవార్త తెలిసి ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు మొదల య్యాయి. ఐదు రోజులు సంతాపదినాలుగా పాటించనున్నారు. లెబనాన్, సిరియా సైతం మూ డ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించాయి. భార త్ సైతం ఒక రోజు(మంగళవారం)ను సంతాప దినంగా ప్రకటించింది. రైసీ, ఇతర నేతల మృతదేహాలను తబ్రిజ్ పట్టణానికి తీసుకొస్తున్నారు. రైసీ ఖనన క్రతువును మష్హాద్ నగరంలో చేసే అవకాశం ఉంది.జాడ చెప్పిన తుర్కియే అత్యాధునిక డ్రోన్భారీ వర్షం, దట్టంగా కమ్ముకున్న మంచు, దారిలేని పర్వతమయ అటవీప్రాంతం కావడంతో త్రివిధ దళాలు రంగప్రవేశం చేసినా గాలింపు చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో తుర్కియే తమ అత్యాధునిక నిఘా డ్రోన్ను రంగంలోకి దింపింది. అది అడవిలో ఉష్ణాగ్రతల్లో మార్పుల ఆధారంగా సరిహద్దుకు 20 కి.మీ.ల దూరంలోని పచ్చని అటవీప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనిపెట్టి సహాయక బృందాలకు సమాచారం చేరవేసింది. దీంతో దళాలు నేరుగా ఘటనాస్థలికి చేరుకోగలిగాయి. ఆ తర్వాతే రైసీ మరణవార్తను ధ్రువీకరించారు. సంతాపాల వెల్లువరైసీ మరణవార్త తెల్సి చాలా ప్రపంచదేశాలు తమ సంతాప సందేశాలను పంపించాయి. ప్రధాని మోదీ సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ‘‘ రైసీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్–ఇరాన్ సంబంధాల బలోపేతానికి రైసీ చేసిన కృషి చిరస్మరణీయం. రైసీ కుటుంబ సభ్యులకు, ఇరాన్ దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ విచారకర సమయంలో ఇరాన్కు అండగా ఉంటాం’’ అని మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. లెబనాన్, సిరియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా, టర్కీ, రష్యా, మలేసియా, హౌతీ, ఖతార్, ఇరాక్, పాకిస్తాన్, అజర్బైజాన్, పోలండ్, యూఏఈ, వెనిజులా దేశాలు, యూరోపియన్ యూనియన్, ఐక్యరా జ్యసమితి, నాటో, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సంతాపం తెలిపాయి. గొప్ప సోదరుడిని కోల్పోయామని లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా, హమాస్తో పాటు హౌతీ తిరుగుబాటుదారులు సంతాపం ప్రకటించారు.నూతన అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడు?తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బర్ కేవలం 50 రోజులు కొనసాగనున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని తాత్కాలికంగా చేపడతారు. ఈ నియామకానికి సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతులతో ఒక మండలిని ఏర్పాటుచేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.ఖైదీల సామూహిక ఉరి ఉదంతంలో ప్రమేయంమతబోధకుల కుటుంబంలో మస్హద్ నగరంలో 1960 డిసెంబర్ 14న రైసీ జన్మించారు. మోతాహరీ యూనివర్సిటీలో న్యాయవిద్యను చదివారు. 15 ఏళ్ల వయసులోనే ‘ఖ్వామ్’లో మతవిద్యను నేర్చుకున్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవకాలంలో పశ్చిమదేశాల మద్దతున్న ఇరాన్ పాలకుడు షాకు వ్యతిరేకంగా ఆయాతొల్లా రుహొల్లా ఖొమేనీ చేసిన ఉద్యమంలో రైసీ పాల్గొన్నారు. 21 ఏళ్లకే కరాజ్ నగర ప్రాసిక్యూటర్గా, పాతికేళ్లకే టెహ్రాన్ డెప్యూటీ ప్రాసిక్యూటర్గా పనిచే శారు. అటార్నీ జనరల్ స్థాయికి ఎది గారు. తదనంతరకాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేశారు. అయితే 1988 ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన వేలాదిమంది రాజకీయ ఖైదీలను దేశవ్యాప్తంగా సామూహికంగా ఉరితీసిన ఉదంతంలో రైసీ ముఖ్యపాత్ర పోషించారని అమెరికా, ఇతర దేశాలు ఆరోపించాయి. రైసీ 2017లో హసన్ రౌహానీతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2021లో మరోసారి అధ్యక్ష ఎన్నికలు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమైన ప్రత్యర్థి నేతలందర్నీ అనర్హులు గా ప్రకటించడంతో రైసీ గెలుపు సులువైంది. ఛాందసవాద మత సంప్రదాయాల పేరిట భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళా, మానవ హక్కులను కాలరాశారని ఆయనపై మాయని మచ్చ పడింది. ఈయన మార్గదర్శకత్వంలో అమల్లోకి వచ్చిన కఠిన హిజాబ్ చట్టాన్ని అమలుచేస్తూ నైతిక పోలీసులు 2022లో మహ్సా అమిని అనే మహిళను కొట్టిచంపడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. 85 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ భవిష్యత్ రాజకీయ వారసునిగా రైసీ పేరు చాన్నాళ్లుగా వినిపిస్తోంది. హసన్ రౌహానీ కాలంలో కుదిరిన అణుఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్నాక అణ్వస్త్ర స్థాయి యురేనియం శుద్ధిని రైసీ మరింత పెంచి అంతర్జాతీయ ఆంక్షలకు గురయ్యారు. పాత, కొత్త ఆంక్షల కారణంగానే కొత్త హెలికాప్టర్లు కొనలేక పాత హెలికాప్టర్ల విడిభాగాలు దొరక్క, మరమ్మతులు చేయలేక చివరకు అదే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. రైసీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.మరోవైపు సంబరాలు!అతివాద రైసీ మరణవార్త తెల్సి ఇరాన్లో ఓవైపు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరుగుతుంటే మరోవైపు ‘టెహ్రాన్ నరహంతకుడు’ అంతమయ్యాడని వేలాది మంది బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. దేశ, విదేశాల్లో ఇరానీయన్లు వేడుకలు చేసుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. నెటిజన్లు పేల్చుతున్న మీమ్స్, జోక్స్కు కొదవే లేదు. ‘హెలికాప్టర్ ప్రమాదంలో ఒకరు బతకడం కంటే చనిపోతేనే బాగుణ్ణు అని లక్షలాది మంది కోరుకోవడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా’’ అని అమెరికాలో ఉన్న ఇరాన్ పాత్రికేయుడు మసీహ్ అలీనెజాద్ వ్యాఖ్యానించారు. వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరితీయించడం, కఠిన హిజాబ్ చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు రైసీ మరణ సంబరాలకు కారణమని తెలుస్తోంది. -
ఇరాన్ అధ్యక్షుడు హఠాన్మరణం.. భారత్తో వాణిజ్యం ఎలా ఉందంటే..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్(బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పరం ప్రతీకార దాడులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాలు భారత్తో జరుపుతున్న వాణిజ్యం ఏమేరకు ప్రభావం పడుతుందోననే ఆందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటివరకైతే రెండు దేశాలతో భారత్ మెరుగైన సంబంధాలను కలిగి ఉంది. ఏటా ఆయా దేశాలతో చేసే వాణిజ్యాన్ని పెంచుకుంటుంది. ప్రధానంగా వాటి నుంచి జరిపే దిగుమతులు, ఎగుమతులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.2022-23లో 2.33 బిలియన్డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది 21.7 శాతం అధికం. భారత్ నుంచి ఇరాన్కు చేసే ఎగుమతులు 1.66 బి.డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 14.34శాతం అధికం)గా ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ చేసుకునే దిగుమతులు 672 మిలియన్ డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 45.05 శాతం)గా ఉన్నాయి.భారత్ నుంచి ఇరాన్ వెళ్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ పౌడర్, షుగర్, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు, కూల్డ్రింక్స్, పప్పుదినుసులు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో మిథనాల్, పెట్రోలియం బిట్యుమెన్, యాపిల్స్, ప్రొపేన్, డ్రై డేట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఆల్మండ్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లుఇజ్రాయెల్తోనూ భారత్కు మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ఇబ్రాయెల్కు భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా ఆటోమేటివ్ డీజిల్, కెమికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లాస్టిక్, టెక్స్ట్టైల్, మెటల్ ఉత్పత్తులు ఉన్నాయి ఫెర్టిలైజర్ ఉత్పత్తులు, రంగురాళ్లు, పెట్రోలియం ఆయిల్స్, డిఫెన్స్ పరికరాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. -
హెలికాప్టర్ ప్రమాదం.. ఇరాన్ అధ్యక్షుడి చివరి వీడియో వైరల్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరో ఎనిమిది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడిచింది. అధ్యక్షుడి కాన్వాయ్లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని తెలిపింది. ఇరాన్- అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.కాగా తాజాగా హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రైసీకి చెందిన చివరి ఫోటో, వీడియోను ఇరాన్ మీడియా షేర్ చేసింది. ఇందులో రైసీ హెలికాప్టర్ కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. చాపర్లో వెళ్లడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్లో ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. రైసీ బయల్దేరిన 30 నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దాదాపు 16 గంటల తర్వాత కొండ ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలు గుర్తించారు. ఈ ఘటనలో రైసీతో పాటు హెలికాప్టర్లో ఉన్నవారంతా దుర్మరణం చెందారు.#Iranian President #Ibrahim #Raisai's last trip, the video of the aerial tour of the dam before the helicopter Crashh!!#Iran pic.twitter.com/fUTlBqpKW7— Imran Pazir (@imranpazir1) May 20, 2024తరువాతి అధ్యక్షుడు ఆయనే..కాగా ఇబ్రహీం రైసీ మృతిచెందడంతో.. తదుపరి ఇరాన్ అధ్యక్షుడు ఎవరవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్(69) తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే తొలుత వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోదించాలి. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు మొఖ్బర్, పార్లమెంటరీ స్పీకర్, న్యాయ వ్యవస్థ చీఫ్ ఘోల్లమ్హోస్సేన్ మొహసేని ఎజీతో కూడిన కౌన్సిల్ 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్కు అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో సంతాపం ప్రకటించారు.‘ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణవార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత్-ఇరాన్ దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. అతని కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్కు అండగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు.Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…— Narendra Modi (@narendramodi) May 20, 2024 ‘ఈ మరణవార్త షాక్కు గురిచేసింది. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో పలుమార్లు సమావేశమయ్యాను. ఈ జనవరిలో మా మధ్య భేటీ జరిగింది. ఈ విషాద సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా ఉంటాం.-భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్Deeply shocked to hear of the passing away of Iran’s President Dr Ebrahim Raisi and Foreign Minister H. Amir-Abdollahian in the helicopter crash. Recall my many meetings with them, most recently in January 2024. Our condolences to their families. We stand with the people of…— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 20, 2024 కాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ను బెల్-212 ఆదివారం సాయంత్రం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ ధ్రువీకరించింది.రైసీతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియాన్ (60), తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్మతీ తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది. ఇరాన్- అజర్బైజా ప్రావిన్స్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. విమానం బయలుదేరిన దాదాపు 30 నిమిషాలకే అడవుల్లో కుప్పకూలింది.మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి మరణవార్త పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ హమాస్కు మద్దతుగా ఉంది. గత నెలలో ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుపడిన విషయం తెలిసిందే. -
హెలికాఫ్టర్ క్రాష్.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
టెహ్రాన్: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అకాల మరణం చెందారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్బైజాన్-ఇరాన్ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాఫ్టర్ను గుర్తించిన ఇరాన్ బలగాలు.. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ప్రకటించాయి.భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం అతి కష్టం మీద హెలికాఫ్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు.. హెలికాఫ్టర్ పూర్తిగా కాలి ధ్వంసం అయినట్లు ప్రకటించాయి. క్రాష్ సైట్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్ రెడ్ క్రెసెంట్ చీఫ్ పిర్హోస్సేన్ కూలివండ్ ప్రకటించారు.Imagens adicionais de drone mostrando uma imagem mais nítida do local da queda do falecido presidente do Irã, o helicóptero de Ebrahim Raisi, que caiu ontem no noroeste do Irã, resultando na morte de todos os passageiros. #EbrahimRaisí pic.twitter.com/TPUrzL2oGz— 💢 𝑨𝒏𝒕𝒐𝒏𝒆𝒍𝒍𝒊 𝑹𝒐𝒅𝒓𝒊𝒈𝒖𝒆𝒔 💢 (@antonellibjj) May 20, 2024అంతకు ముందు టర్కీకి చెందిన డ్రోన్లు.. హెలికాఫ్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్నాయి. డ్రోన్ విజువల్స్ ద్వారా ఇరాన్ బలగాలకు సాయం అందించాయి.ఆదివారం అజర్బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన రెండు డ్యామ్లను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్తో కలిసి రైసీ ప్రారంభించారు. మూడు హెలికాఫ్టర్ల కాన్వాయ్తో తిరిగి ప్రారంభమైన ఆయన కాన్వాయ్లో కాసేపటికే ఇబ్బంది తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. ప్రయాణం మొదలైన అరగంట తర్వాత రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అయితే మిగతా రెండు మాత్రం సురక్షితంగా గమ్యానికి చేరుకున్నాయి.ప్రమాదం జరిగిన వెంటనే హెలికాఫ్టర్ కూలిన స్థలాన్ని గుర్తించేందుకు ఇరాన్ బలగాలు తీవ్రంగా యత్నించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ విశ్వయత్నాలు చేసి చివరకు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మరోవైపు రైసీ క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. -
రైసీ క్షేమమేనా?.. ప్రమాద స్థలానికి రెస్క్యూ టీమ్స్.. క్షణక్షణం ఉత్కంఠ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీని రక్షణ బలగాలు గుర్తించాయి. ట్రాఫిజ్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం 73 రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, భారీ వర్షాలు పడుతుండడం, దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. టర్కిష్ టెక్నాలజీ ఆధారిత డ్రోన్తో సెర్చ్ ఆపరేషన్ను ఇరాన్ లైవ్ టెలికాస్ట్ చేసింది. కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి.. పేలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి ఇరాన్ త్రివిధ దళాలు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. రాత్రి సైతం నైట్ విజన్ హెలికాఫ్టర్లతో సోదాలు జరిగాయి. వాతావరణం వర్షం కారణంగా సహకరించకపోవడంతో గగన తల సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. దీంతో బలగాలు గ్రౌండ్ లెవల్లో సెర్చ్ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. AKINCI İHA, İran semalarında İran Cumhurbaşkanı Reisi ve heyetini arama kurtarma çalışmalarına destek veriyor https://t.co/ovXnx13UcY— AA Canlı (@AACanli) May 19, 2024ఇంకోవైపు.. రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచదేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైసీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమాద తీవ్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు రైసీ క్షేమంగా తిరిగిరావాలని యావద్దేశం చేస్తున్న ప్రార్థనలు ఫలించేలా కనిపించడం లేదు.ఆదివారం ఓ అధికారిక కార్యక్రమంలో ఇబ్రహీం రైసీ పాల్గొన్నారు. ఇరాన్-అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను.. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం ఇరాన్ ఆర్థిక మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లూ వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిపోయిందని ఎక్కువ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వరంగ మీడియా మాత్రం ప్రమాదాన్ని ధృవీకరించకుండా వస్తోంది. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాఫ్టర్లు మాత్రం సురక్షితంగా ల్యాండయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందనే ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ.. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్బైజాన్లో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవాడనికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు. అందులో ఎవరు ఉన్నారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. భారీ పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోందని ఇరాన్ మీడియా సంస్థలు కథనాల్ని వెలువరించాయిటెహ్రాన్ టైమ్స్ ప్రకారం.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. -
అమెరికా బెదిరింపు ధోరణి
అహంకారం తలకెక్కితే బుద్ధి మందగిస్తుంది. పెత్తనం చలాయించాలన్న యావ పరిధుల్ని మరిచిపోతుంది. భారత్–ఇరాన్ల మధ్య సోమవారం కుదిరిన ఒప్పందంపై అమెరికా స్పందించిన తీరు దాని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. ఇరాన్తో ఒప్పందానికి సిద్ధపడేవారు ఆంక్షలు ఎదుర్కొనక తప్పదంటూ అమెరికా విదేశాంగ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్య బెదిరింపు ధోరణిలోవుంది. 2003లో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇరాన్తో చాబహార్ ఓడరేవు నిర్మాణంపై ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా అడుగడుగునా అడ్డుపడుతోంది. అందువల్లే అయిదేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు కాస్తా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2018లో పూర్తయిందనిపించి లాంఛనంగా ప్రారంభించారు. కానీ దానికి సంబంధించి రోడ్లు, రైల్వేలైన్లు మొదలుకొని వివిధ మౌలిక సదుపాయాల కల్పన, యంత్ర సామగ్రి వగైరాల విషయం అనిశ్చితిలో పడింది. మొత్తంమీద ఇప్పటికి 21 ఏళ్లయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్), ఇరాన్ పోర్టులు, నౌకా సంబంధ సంస్థల మధ్య ఓడరేవు టెర్మినల్ ప్రారంభంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఐపీజీఎల్ 12 కోట్ల డాలర్ల (రూ. వెయ్యికోట్లుపైగా) పెట్టుబడి పెడుతుంది. మన దేశం మరో 25 కోట్ల డాలర్ల రుణం సమకూరుస్తుంది. చాబహార్ సమీపంలో నిర్మించిన ఈ షహీద్ బెహెస్తీ పోర్టు మన దేశానికి లాభదాయకమైన ప్రాజెక్టు. అంతేకాదు... మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు అది ‘బంగారువాకిలి’. ఈ ప్రాజెక్టు కింద నిర్మాణమయ్యే రోడ్లు, రైల్వేలైన్లు వివిధ ఓడరేవులతో అనుసంధానమవుతాయి. సరుకు రవాణా చకచకా సాగుతూ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.పెట్రో కెమికల్స్, ఉక్కు, ఎరువుల రంగాల్లో ఇరాన్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది. మధ్య ఆసియా మార్కెట్లలో ఇప్పటికే తిష్ఠ వేసి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టుతో బంగారు భవిష్యత్తును కలగంటూ అందరినీ మించి ఎదగాలని దూకుడుగా వెళ్తున్న చైనాకు చాబహార్ ఓడరేవు కంట్లో నలుసు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తే బీఆర్ఐ ప్రాజెక్టుకు పెద్ద విలువుండదు. ఇంతలోనే అమెరికా కొరడా ఝళిపించటం ప్రారంభించింది. ‘మేం ఇరాన్పై ఆంక్షలు విధించాం కనుక దానితో ఎవరూ వాణిజ్యబంధం నెలకొల్పుకోరాద’ంటూ ఫర్మానాలు జారీచేస్తోంది. రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ఎందుకీ కడుపుమంట? ఏమిటీ బెదిరింపులు? ఇరాన్లో తనకు అనుకూలమైన మహమ్మద్ రెజా పహ్లావి (ఇరాన్ షా) పాలన సాగినంతకాలమూ అమెరికా ఆ దేశంతో సఖ్యంగా వుంది. ఇస్లామిక్ విప్లవం విజయవంతం కావటంతో ఆ పాలకుడు కాస్తా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖొమేనీ కనుసన్నల్లోకి ఇరాన్ వచ్చిననాటి నుంచీ ఆ దేశాన్ని అమెరికా అష్టదిగ్బంధం చేస్తోంది. ఏదో ఒక కారణంతో కయ్యానికి దిగుతోంది. తన సమస్యను ప్రపంచ సమస్య చేసి ఎవరూ ఆ దేశంతో వ్యాపార, వాణిజ్యాలను నడపరాదంటూ బెదిరిస్తోంది. పోనీ ఈ విషయంలోనైనా నిలకడగా వున్న చరిత్ర లేదు. 2003లో ఒప్పందం కుదిరినప్పుడు మౌనంగావున్న అమెరికా, ఆ తర్వాత కాలంలో ఇరాన్పై ఆంక్షలు విధించింది. పర్యవసానంగా ఆ ప్రాజెక్టు మూలనపడింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనాటికి అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడ్డాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకుని ఆంక్షలు సడలించాయి. మరుసటి ఏడాదికల్లా చాబహార్పై భారత్–ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఆంక్షల పర్వం మళ్లీ మొదలైంది. కానీ మన దేశానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అప్పటికి అఫ్గాన్ ఆర్థికాభివృద్ధిని, దానికి అందాల్సిన మానవతా సాయాన్ని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇచ్చామని అమెరికా ప్రకటించింది. సారాంశంలో క్షణక్షణమూ మారే తన చిత్తానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ మసులుకోవాలని అమెరికా వాంఛిస్తోంది. ఇలాంటి పోకడలను మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేసివుంటే వేరుగా వుండేది. అది లేకపోవటం వల్లనే తాజాగా మరోసారి హూంకరిస్తోంది. దేశాలకు తమవైన విధానాలుంటాయి. ధూర్త దేశంగా మారి ఇరుగు పొరుగుకే కాక ప్రపంచ శాంతికే భంగంగా పరిణమించినప్పుడు ఎవరూ అలాంటి దేశంతో కలవాలనుకోరు. గతంలో ఇరాన్ విషయంలో భారత్కు ఇచ్చిన మినహాయింపులకు షరతులున్నాయి. ఇరాన్నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును వెంటనే తగ్గించుకోవాలని, మున్ముందు ఆపేయాలని అప్పట్లో అమెరికా కోరింది. అప్పటికి రోజుకు ఏడు లక్షల చమురు బ్యారెళ్లు దిగుమతి చేసుకునే భారత్... చివరకు ఆ దిగుమతిని ఆపేసింది కూడా! ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయాలని అమెరికా కోరినా లెక్కచేయని భారత్... మొదటినుంచీ అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తున్న తమ విషయంలో భిన్నంగా ఉంటున్నదని ఇరాన్ ఇప్పటికే విమర్శించింది. ఇరాన్ వైఖరేమిటన్న సంగతలావుంచి మన ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి మనవైన విధానాలు రూపొందించుకోవటం తప్పనిసరి. విదేశాంగమంత్రి జైశంకర్ అన్నట్టు అంతర్జాతీయంగా ఎన్నో దేశాల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడే చాబహార్ పోర్టును అమెరికా సంకుచిత దృష్టితో చూడటం, మోకాలడ్డాలని ప్రయత్నించటం తగదు. మన దేశం ఇతర దేశాలతో కూడా ఈ విషయంలో చర్చించాలి. కాస్త వెనకా ముందూ కావొచ్చుగానీ ఇలాంటి అనారోగ్య ధోరణులు అందరికీ ముప్పు తెచ్చేవే! -
భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
ఇరాన్తో ఏ దేశం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆంక్షలు తప్పవని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో భారత్, ఇరాన్తో సోమవారం ఒప్పదం కుదర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.‘చాబహార్ పోర్టుకు సంబంధించి.. భారత్-ఇరాన్ దేశాలు ఒప్పందం చేసుకున్నట్లు మాకు రిపోర్టుల ద్వారా తెలుసు. భారత్ తన విదేశీ విధానంలో భాగంగా చాబహార్ పోర్టు విషయంలో ఇరాన్తో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే విషయంపై ఆలోచించుకోవాలి. కానీ, నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని, ఇప్పటికే విధించిన ఆంక్షలు సైతం తీవ్రంగా కొనసాగిస్తాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత పటేల్ అన్నారు.‘ఇప్పటికే చాలా సార్లు మేము ఆంక్షాల విషయాన్ని ప్రస్తావించాం. ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం. అలా కాదని ఇరత దేశాలు ముందకు వెళ్లితే.. వారికి వారుగా ఆంక్షలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది’అని ఇరాన్తో ఒప్పదం చేసుకున్న భారత్ను పరోక్షంగా హెచ్చరించారు. ఇక.. సోమవారం ఇరాన్లోని చాబహార్ పోర్టును పదేళ్ల పాటు భారత్ నిర్వహించేదుకు ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాంతీయ అనుసంధానంతో పాటు వాణిజ్య భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం చూపనుంది. -
ఇజ్రాయెల్కు ఇరాన్ అణుబాంబు హెచ్చరికలు!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్కు కీలక హెచ్చరికలు చేసింది. తమ దేశానికి ముప్పు ఉందంటే అణుబాంబలు తయారుచేయడానికైనా తాము వెనకాడబోమని ఇరాన్ పేర్కొంది.‘మేము అణుబాంబులు తయారు చేసేందుకు ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇజ్రాయెల్ వంటి దేశంతో.. మా దేశ ఉనికి ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా మిలిటరీ సిద్ధాంతాలను మార్చుకుంటాం. మా అణు కేంద్రాలపై ఇజ్రయెల్ దాడికి పాల్పడితే.. మా అణు సిద్ధాంతలను కూడా మార్చుకుంటాం’ అని ఇరాన్ సుప్రీ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ తెలిపారు.ఏప్రిల్లో సిరియా రాజధాని నగరంలో ఇరాన్ ఎంబసీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడులకు తెగపడినట్లు అంతర్జాతీయా మీడియా కథనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరు ఇరాన్- ఇజ్రయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఇరాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇక.. ఇరాన్కు సాంకేతికంగా అణు బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది. కావాలనుకుంటే అణ్వస్త్రాలను తయారు చేయగలం. అయితే ప్రస్తుతానికి అణు బాంబు తయారు చేయాలన్న అంశం మా ఎజెండాలో లేదని గతంలో ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాన్ 60 శాతం స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యాన్ని సాధించిందని తెలుస్తోంది. కాగా, 90శాతం వరకు స్వచ్ఛతను సాధిస్తే అణు బాంబులను తయారు చేయడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
భారత్ దౌత్యం సక్సెస్.. ఇరాన్ చెర నుంచి ఐదుగురు రిలీజ్
టెహ్రాన్: దౌత్యపరంగా భారత్కు మరో ఘన విజయం దక్కింది. ఇరాన్ స్వాధీనంలో ఉన్న వాణిజ్య నౌకలో బంధీలుగా ఉన్న ఐదుగురు భారతీయులు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ మేరకు భారత్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ దళాలు ఓ వాణిజ్య నౌకను హైజాక్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్ను ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి తమ ఆధీనంలోకి తీసుకుంది. సదరు నౌకను ఇరాన్ ప్రాదేశిక జలాల్లోకి తరలించారు. ఇక, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులు కూడా ఉన్నారు. "5 of the Indian sailors on MSC Aries have been released and departed from Iran today evening. We appreciate the Iranian authorities for their close coordination with the Embassy and Indian Consulate in Bandar Abbas," posts India in Iran (@India_in_Iran). pic.twitter.com/umppKnngG4— Press Trust of India (@PTI_News) May 9, 2024 ఈ నేపథ్యంలో వీరిని విడిపించేందుకు భారత్ విదేశాంగ శాఖ కసరత్తు చేసింది. మంత్రి ఎస్.జైశంకర్ ఆ మధ్య ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఆయన అభ్యర్థన మేరకు ప్రయత్నాలు ఫలించాయి. దాదాపు నెల రోజుల తర్వాత వీరిలో కొందరికి ఇరాన్ విముక్తి కల్పించింది.ఈ సందర్భంగా భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా..‘ఎంఎస్సీ ఏరిస్లోని భారత సిబ్బందిలో ఐదుగురిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం వారు స్వదేశానికి బయల్దేరారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసీ, కాన్సులేట్ చేసే ప్రయత్నాలకు ఇరాన్ అధికారుల నుంచి సహకారం లభిస్తోంది అని పేర్కొంది. భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్ నిన్న విడుదల చేసిందని’ చెప్పుకొచ్చింది. -
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
కొచ్చి: ఇరాన్లో చేపలుపట్టే పని చేసేందుకు వెళ్లిన భారతీయులను యజమాని వేధించాడు. సరైన జీవన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో యజమాని సయ్యద్ అన్సారీ నుంచి తప్పించుకోవాలని ఆరుగురు కన్యాకుమారికి చెందిన మత్స్యకారులు డిసైడయ్యారు.ఇంకేముంది చేపలు పట్టేందుకు యజమాని ఇచ్చిన బోట్లోనే ఇరాన్ నుంచి పారిపోయి సముద్రంలో ప్రయాణించి భారత్లోని కొచ్చి తీరాని వచ్చారు. కొచ్చి తీరానికి వీరి బోట్ చేరుకున్న వెంటనే తీరంలోకి కోస్ట్గార్డ్ గుర్తించి అడ్డుకున్నారు. ఆరా తీస్తే ఇరాన్ యజమాని తమను మోసం చేశాడని,అందుకే పారిపోయి వచ్చామని మత్స్యకారులు చెప్పారు. -
Sensex : జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద
ముంబై: స్టాక్ సూచీల నష్టాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్– ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్ను బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 వద్ద నిలిచింది. నిఫ్టీ 223 పాయింట్లు బలపడి 22,643 వద్ద నిలిచింది. సెన్సెక్స్ పరుగుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.48 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.406 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని 30 షేర్లలో హెచ్సీఎల్ టెక్(– 6%), ఐటీసీ (–0.44%), విప్రో(–0.37%), బజాజ్ఫిన్సర్వ్(–0.10%) మాత్రమే నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగసి 74,671 వద్ద, నిఫ్టీ బలపడి 236 పాయింట్లు దూసుకెళ్లి 22,656 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఐటీ, ఆటో, రియల్టీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.79%, 0.07% చొప్పున రాణించాయి. ఆల్టైం హైకి బ్యాంక్ నిఫ్టీ: ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, పీఎస్బీ షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో ట్రేడింగ్లో బ్యాంక్ నిఫ్టీ సైతం 49,474 వద్ద ఆల్ టైం హైని నమోదు చేసింది. చివరికి 1,223 పాయింట్ల లాభంతో 49,424 వద్ద ముగిసింది. మొత్తం ఈ సూచీలో 12 షేర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(3.30%), బంధన్ బ్యాంక్(0.20%) మాత్రమే నష్టపోయాయి.ఐసీఐసీఐ బ్యాంక్ఃరూ.8 లక్షల కోట్లు క్యూ4లో నికర లాభం 18% వృద్ధితో ఐసీఐసీఐ బ్యాంకు షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో 4.5%పెరిగి రూ.1,159 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 5% ఎగిసి రూ.1,163 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.36,555 కోట్లు పెరిగి రూ.8 లక్షల కోట్లపైన రూ.8.14 లక్షల కోట్లకు చేరింది క్యాపిటలైజేషన్ పరంగా రూ.8 లక్షల కోట్లు దాటిన అయిదో కంపెనీగా నిలిచింది. -
‘దాడి చేస్తే.. ఇజ్రాయెల్ను నాశనం చేస్తాం’
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోసారి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్న హెచ్చరించారు. మూడు రోజుల పాకిస్తాన్ పర్యటనలో ఉన్న రైసీ మంగళవారం మాట్లాడుతూ.. ఇరాన్ భూభాగంపై దాడి తీవ్రమైన మార్పులకు దారి తీస్తుందన్నారు. ఇజ్రాయెల్ దాడులకు తెగపడితే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందన్నారు రైసీ.‘పవిత్రమైన ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులకు దిగి తప్పు చేస్తే.. పరిస్థితి చేయిదాటి చాలా తీవ్ర అవుతుంది. ఇజ్రాయెల్లో ఏమైనా మిగులుతుందా అనేదిపై కూడా స్పష్టంగా ఉండదు’ అని రైసీ అన్నారు. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఏప్రిల్ 13న దాడి చేసిందన్నారు. ఇది అంతర్జాతీయ చట్టలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలను ఇరాన్, పాకిస్తాన్ దేశాలు రక్షిస్తాయన్నారు. అణచివేతకు గురవుతున్న పాలస్తీనాకు రక్షణ చర్యలు కొనిసాగుతాయని రైసీ స్పష్టం చేశారు.ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కొసాగిస్తున్న దాడులు మానవహక్కుల ఉల్లంఘన అని తీవ్రంగా మండిపడ్డారు రైసీ. ఇప్పటివరకు దాదాపు 34 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్నదాడులను వ్యతిరేకిస్తు యూఎస్లో పలు ప్రతిష్టాత్మకమై విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
పాక్కు అమెరికా సాలిడ్ వార్నింగ్
ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ను హెచ్చరించింది. ఇరాన్తో వ్యాపార ఒప్పందాలను పరిగణలోకి తీసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని ఆలోచించాలని వార్నింగ్ ఇచ్చింది. అదే విధంగా పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమానికి వస్తువుల సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని యూఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ అధకార ప్రతినిధి వేదాంత్ పటేల్ హెచ్చరించారు.‘సామూహిక విధ్యంసక ఆయుధ సంస్థల విస్తరణలు ఎక్కడ జరిగినా వాటికి వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తాం. చర్యలు తీసుకోవటం కొనసాగిస్తాం. ముఖ్యంగా ఇరాన్తో వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. చైనా.. పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణీ కార్యక్రమానికి పరికరాలు, వస్తువులను సరాఫరా చేయటం మేము గమనించాం ’ అని వేదాంత్ పటేల్ అన్నారు.ఇరాన్ అధ్యక్షుడు పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు మధ్య 8 వాణిజ్య ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక ఒప్పందాలు కుదుర్చుకోవటంలో చర్చలు కొనసాగుతున్నా పాక్ స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్పై అమెరికా హెచ్చరికలు తీవ్ర చర్చనీయాశం అయింది. -
Israel-Iran tensions: ఇజ్రాయెల్ ప్రతీకార దాడి
దుబాయ్: ప్రతీకార దాడితో పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండింది. తమ భూభాగంపై ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేసి చూపించింది. తమ డ్రోన్లను రంగంలోకి దింపింది. అమెరికా తయారీ ఎఫ్–14 టామ్క్యాట్స్ యుద్ధవిమానాలు ఉన్న ఇరాన్లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఇస్ఫహాన్ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్పై దాడి పని ఇజ్రాయెల్దేనని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న శుక్రవారం రోజే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం గమనార్హం. అణుకార్యక్రమాలు జరిగే ఆగ్నేయ జెర్డెంజన్ ప్రాంతంలో శత్రు విమానాలు, డ్రోన్లను నేలమట్టం చేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్రియాశీలం చేసింది. ఈ అణుకేంద్రంలో చైనా సరఫరాచేసిన స్వల్పస్థాయి అణు పరిశోధనా రియాక్టర్లు ఉన్నాయి. పౌర అణు అవసరాల కోసం అణు ఇంథనాన్ని ఇక్కడ ఉత్పత్తిచేస్తారు. ఇదే నగరంలో భూగర్భ అణు శుద్ది కర్మాగారం ఉంది. దీనిని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు నిజమే: ఇటలీ
క్యాప్రి ఐలాండ్: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్లో శుక్రవారం(ఏప్రిల్ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్లో జరుగుతున్న జీ7 మీటింగ్లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలోని న్యూక్లియర్ స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. డ్రోన్ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది. ఇటు ఇరాన్పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్లో మానవ బాంబు కలకలం -
ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్లో మానవ బాంబు కలకలం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఇరాన్లో భారీ పేలుళ్లు -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. ఇజ్రాయెల్ పనేనన్న అమెరికా!
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ చేసిన డ్రోన్, మిసైల్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్లోని ఇస్ఫాహాన్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయని అమెరికా పేర్కొంది. ఇరాన్పై మిసైల్ ఇజ్రాయెల్ దాడి చేసినట్లు అమెరికా అధికాలు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. తమ భూభాగంలో ఇప్పటి వరకు ఎలాంటి మిసైల్ దాడి జరగలేదని తెలిపింది. అదే సమయంలో కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్కు సుమారు 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫాహాన్ నగరంలోని అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్, పలు ఇరాన్ న్యూక్లీయర్ సైట్లు ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడి జరిగినట్లు అమెరికా మీడియా తెలిపింది. ఈ దాడులను ఇరాన్ కొట్టేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల నేపథ్యంలో ఇరాన్లో పలు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ‘ఇరాన్ రక్షణ వ్యవస్థ పలు డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసింది. ప్రస్తుతానికి ఎటువంటి క్షిపణీ దాడి జరిగినట్లు నివేదికలు లేవు’ అని ఇరాన్ ప్రతినిధి హుస్సేన్ దాలిరియన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇస్ఫాహాన్ సమీపంలోని ప్రధాన వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్ల శబ్దం వినిపించినట్టు మరికొందరు తెలిపారు. అయితే కీలకమైన ఎయిర్ బేస్ సైట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ కొన్ని డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్, మిసైల్ దాడులకు పాల్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరిస్తూ వచ్చింది. తాజా దాడులతో పశ్చిమాసియా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఒక వేళ యుద్ధం అంటూ ప్రారంభమయితే అది ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఆగదని.. ఇతర దేశాలకూ వ్యాపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్
న్యూఢిల్లీ: ఇరాన్ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్సీ ఏరీస్లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్లోని కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాలుగు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబొల్లాహియన్తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్ జలసంధిలో ఉన్న ఎంఎస్సీ ఏరీస్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
ముసుగులో గుద్దులాట కొనసాగేనా?
ఒకవైపు ఇజ్రాయెల్... మరోవైపు ఇరాన్, దాని భాగస్వాములు, ప్రచ్ఛన్న ప్రతినిధుల మధ్య సాగుతున్న ముసుగులో గుద్దులాటను ఒక స్థాయి వరకే కొనసాగించవచ్చు. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్ వైపుగా కమికేజ్ డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఆ తెర తొలగింది. తన ‘జియోనిస్ట్ శత్రువు’కు వ్యతిరేకంగా నాలుగున్నర దశాబ్దాల ఆవేశపూరిత వాగాడంబరం సాగించిన ఇరాన్ నిజానికి ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో లక్ష్మణరేఖను దాటినట్లయింది. ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఈ ప్రాంతాన్ని అగాథంలోకి తోస్తుంది. కానీ నిజంగా పరిస్థితి అలా ఉందా? మనం చాలా కాలంగా చూస్తున్న ముసుగులో గుద్దులాట నాటకంలో సరికొత్త అంకాన్ని చూస్తున్నామా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఏడవ నెలలో అడుగుపెట్టిన గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, ఏ సమయంలో అయినా విస్తృతమైన ప్రాంతీయ పెనుమంటగా మారే ప్రమాదాన్ని కలిగివుంది. అయితే, పాలస్తీనా సమస్య పరిష్కారానికి మద్దతుగా ఇరాన్ తరచుగా చేసే తీవ్రమైన బెదిరింపుతో కూడిన ఆగ్రహ ప్రకటనలు, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న ఒక అంతర్లీన వాస్తవాన్ని దాచిపెడుతున్నాయి. దాని అత్యున్నత నాయకుడైన అయతొల్లా అలీ ఖొమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం వాస్తవానికి చాలా జాగ్రత్తగానూ, ప్రమాదాన్ని కోరి ఆహ్వానించని తత్వంతోనూ సాగుతోంది. పైగా ముఖాముఖి ఘర్షణకు అది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాడి నిరోధం దిశగా ఇరాన్ ఇష్టపడే విధానం ఏమిటంటే, స్నేహపూర్వకంగా లేని దేశాలకు హెచ్చరికలను పంపడానికి తన ప్రతినిధుల (ప్రాక్సీలు) ద్వారా అసమాన యుద్ధంలో దాని అధునా తన సామర్థ్యాలను అమలు చేయడమే. ఒక పాత హిందీ పాటలోలా ‘అర్థమయ్యేవాళ్లకు అర్థమైంది’ అనేది దాని కార్యచరణ సూత్రం. తెహ్రాన్ లేదా దాని ఖుద్స్ బలగాలను హమాస్ దాడులతో అనుసంధానించడానికి తగిన నిర్ధారిత సాక్ష్యాధారం లేనప్పటికీ, అక్టోబరు 7న హమాస్ చేసిన దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని చాలామంది ఊహించారు. గాజాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన విధ్వంసక దాడిని ప్రారంభించినప్పుడు, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకోవడానికి హెజ్బొల్లాకు చెందిన యుద్ధంలో రాటుదేలిపోయిన క్యాడర్లను ఇరాన్ పంపుతుందనే ఆందోళన వాస్తవంగానే ఉండింది. అలాగే, గాజాలోని తన హమాస్ మిత్రపక్షానికి మద్దతు ఇవ్వడానికి ఇరాన్ రెండవ ఫ్రంట్ను ప్రారంభించవచ్చని కూడా భావించారు. ఏమైనప్పటికీ, ఆరు నెలల తరువాత కూడా, ఇరాన్, హెజ్బొల్లా రెండూ ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని లెబనాన్లో తమ హద్దులలోనే కొనసాగుతూ అసౌకర్యమైన సమ తౌల్యాన్ని కొనసాగించాయి. హెజ్బొల్లా వద్ద ఉన్న మారణాయుధాలు ప్రధానంగా ఉత్తర ఇజ్రాయెల్లో ఇప్పుడు జనాభా లేని గ్రామాలు, స్థావరాలకు వ్యతిరేకంగా ఉపయోగించబడ్డాయి. దక్షిణాన కొన్ని మైళ్ల దూరంలో ఉన్న సైనిక, పౌర లక్ష్యాలు హెజ్బొల్లా క్షిపణుల పరిధిలో ఉన్నప్పటికీ వాటిని తాకలేదు. వివాదాన్ని హెజ్బొల్లా తీవ్రతరం చేస్తే లెబనాన్ పై భయంకరంగా స్పందిస్తానని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్, సిరియాలోని అగ్రశ్రేణి హెజ్బొల్లా సముదాయం, సైనిక సంపత్తి లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అయితే హెజ్బొల్లాపై నేరుగా దాడి చేయడానికి ఇజ్రాయెల్ సైతం దూరంగానే ఉంది. సంవత్సరాల తరబడి ఇరాన్ చే జాగ్రత్తగా పోషించబడిన మరొక ప్రచ్ఛన్న శక్తి యెమెన్లోని హౌతీలు. ఎర్ర సముద్రంలోని సముద్ర మార్గాలలో వాణిజ్య నౌకలతో విధ్వంస క్రీడ ఆడటానికి తమ డ్రోన్ లను, క్షిపణులను హౌతీలు సానబెట్టారు. హౌతీల ఆయుధ నిల్వలు, శిక్షణ, వ్యూహాల మూలాల గురించి పెద్ద సందేహమేం లేదు. అయితే రింగ్మాస్టర్గా ఉండటంలోనే ఇరాన్ సంతృప్తి చెందుతూ, పశ్చిమ దేశాలు తనపట్ల శత్రు వైఖరితో కొనసాగితే విఘాతం కలిగించగలిగే ప్రభావాన్ని నిశ్శబ్దంగా నొక్కిచెప్పింది. అయితే, ఏప్రిల్ 1న డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యా లయానికి చెందిన కాన్సులర్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి... సిరియా, లెబనాన్ లలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన ఖుద్స్ బలగాల అధిపతి హసన్ మహ్దవీని చంపినప్పుడు ఆ పెళుసైన సమతుల్యత దెబ్బతింది. అత్యంత కచ్చితంగా తలపెట్టిన ఈ దాడి మహ్దవీతో పాటు ఆరుగురు స్వదేశీయులను కూడా మట్టు బెట్టడం, ఇరాన్ ప్రభుత్వాన్ని మండించింది. 2023 డిసెంబర్లో కూడా సిరియాలో ఇరాన్ సీనియర్ కమాండర్ అయిన సయ్యద్ రజీ మౌసావీని ఇజ్రాయెల్ హతమార్చింది. తెహ్రాన్ లోని అతివాదుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది కాబట్టే నాయకత్వం చేసే తీవ్రమైన ప్రతీకార బెదిరింపులు ఇప్పుడు గట్టి చర్యతో సరిపోలాల్సి ఉంది మరి. చివరికి ఏప్రిల్ 13న తాను తలపెట్టదలచిన సైనిక చర్య గురించి దాదాపు రెండు వారాల పాటు టెలిగ్రాఫ్ ద్వారా ఇరాన్ ప్రభుత్వం సూచిస్తూనే వచ్చింది. ఈద్–ఉల్–ఫితర్ ఉత్సవాలు ముగిసిన వెంటనే దాడి జరుగనున్నట్లు విçస్తృతమైన అంచనాలు వెలువడ్డాయి. అలాగే జరిగింది కూడా. ఈ ప్రాంతంలోని దేశాలకు 72 గంటల నోటీసు ఇచ్చామనీ, విమానాలను నిలిపివేయడానికీ, వారి పౌరులకు హెచ్చరి కలు జారీ చేయడానికీ భారత్ సహా ఇతర దేశాలకు తగినంత సమయం ఇచ్చామనీ ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్ ప్రయోగించిన ‘99 శాతం’ డ్రోన్లు, క్షిపణులను... బలీయమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలు, అలాగే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్ ్స, ఆఖరికి జోర్డాన్ తో సహా అనేక మిత్రదేశాలు విజయవంతంగా అడ్డుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. 80కి పైగా డ్రోన్లు, ఆరు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటన ధ్రువీకరించింది. నెగెవ్ ఎడారిలోని ఒక ఇజ్రాయెలీ వైమానిక స్థావరంలో స్వల్పంగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతానికి, ఈ దాడి ఇరాన్ సామర్థ్యాలకు నిజమైన ప్రతిబింబం కాదు లేదా ఇజ్రాయెల్ వైమానిక రక్షణకు నిజమైన పరీక్ష కాదు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. గత వారాంతం వరకు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు గాజాలో జరుగుతున్న అనాలోచిత విధ్వంసం గురించీ, అక్కడి ప్రజల బాధల గురించీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కానీ ఇరాన్ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే, అమెరికా యంత్రాంగం ఇజ్రాయెల్కు తన ‘గట్టి మద్దతు’ను పునరుద్ఘాటించింది. భవిష్యత్ ప్రమాదాలను నిరోధించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ తమ నావికా సంపత్తిని మోహరించాయి. శత్రుదుర్భేద్యమైనదని పేరొందిన ఇజ్రాయెల్ రక్షణ శక్తుల ఖ్యాతి అక్టోబరు 7న హమాస్ దాడితో కాస్త దెబ్బ తిన్నప్పటికీ, తాజాగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ లను, క్షిపణులను అధిక సంఖ్యలో తటస్థీకరించడంలో విజయం సాధించడం ద్వారా మళ్లీ తన్ను తాను నిలబెట్టుకోగలిగింది. గాజా ప్రస్తుతానికి మీడి యాలో పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అంతేకదా! అమెరికా, భారత్, ఇతర దేశాలు తిరుగుదాడి పట్ల సంయమనం పాటించాలనీ, లేకుంటే అది మరింతగా పెరుగుతుందనీ హెచ్చరించడంతో నెత న్యాహు మళ్లీ కేంద్ర స్థానంలోకి చేరుకున్నారు. తన షాడో–బాక్సర్లు బలంగా పంచ్లు విసిరినందున, దాడుల నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాననీ, అయితే ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగినట్లయితే తాను గట్టిగా ప్రతిస్పందిస్తాననీ ఇరాన్ సూచించింది. ఇక, ఇజ్రాయెల్లో రాజకీయ పార్టీలు నిలువునా చీలిపోయాయి. ప్రమాదకరమైన గీతను దాటినందుకు ఇరాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని రైట్ వింగ్ నాయకులు కోరుతున్నారు. ఇజ్రాయెల్ ప్రతిఘటనను ప్రారంభించడానికి ‘వెంటనే కదలాలి’ అని జాతీయ భద్రతా మంత్రి బెన్–గ్విర్ సూచించారు. మధ్యప్రాచ్యంలో భావితరాలు కూడా గుర్తుంచుకునేలా ఇజ్రాయెల్ గట్టిగా ప్రతిస్పందించాలని ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోత్రిచ్ పిలుపునిచ్చారు. బెన్నీ గాంట్జ్, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వంటి మితవాదులు తీవ్రమైన ప్రతి చర్యకు వ్యతిరేకంగా సలహా ఇచ్చారు. బదులుగా ఇరాన్కు వ్యతిరేకంగా వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచుకోవాలని సూచించారు. దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా అమెరికా పెడుతున్న ఒత్తిడిని బేరీజు వేసుకుని, తీవ్ర పర్యవసానాలు కలిగివుండే ఒక ప్రతిస్పందనను నెతన్యాహు రూపొందించనున్నందున రాబోయే కొద్ది రోజులు కీలకం కానున్నాయి. నవదీప్ సూరి వ్యాసకర్త ఈజిప్ట్, యూఏఈల్లో భారత మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రమాదపుటంచున...
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ రెండు దేశాల మధ్య నాలుగు దశా బ్దాల పైగా లోలోపల సాగుతున్న కుమ్ములాట బయటపడింది. ముందుగా ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి, ఒక జనరల్ సహా పలువురు సైనికాధికారుల మృతితో అగ్గి రాజుకుంది. ప్రతీకారంగా గత శనివారం ఇరాన్ పంజా విసరడంతో వ్యవహారం ముదిరింది. యుద్ధం ఊసెత్తకపోయినా దెబ్బకు దెబ్బగా టెహరా న్పై తగిన చర్య చేపడుతామంటోంది టెల్ అవీవ్. అసలే అస్థిరతలో మునిగిన పశ్చిమాసియా ఈ శరవేగ పరిణామాలు, వ్యాఖ్యలతో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధంలో చిక్కుకుపోవచ్చు. చాలాకాలంగా ఇరాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలకై పరోక్ష సహకారం అందిస్తూ ప్రాంతీయ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పౌరులపైన, వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఆస్తులపైన ప్రయోగిస్తూ వచ్చింది. అయితే, ఇజ్రాయెల్తో ఎన్నడూ నేరుగా ఘర్షణకు దిగలేదు. తెర వెనుక నుంచి తాను చేసినవి ఒప్పుకోనూ లేదు. ఇజ్రాయెల్దీ అదే పంథా. మూడేళ్ళ క్రితం ఇరాన్కు చెందిన ముగ్గురు అణుశాస్త్రవేత్తల హత్యలో తన పాత్రను ఆ దేశమూ అంగీకరించ లేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులతో గాజా భూఖండం సంక్షోభంలో పడింది. సదరు హమాస్ దాడుల వెనుక ఇరాన్ పాత్ర గురించి కథలు కథలుంటే, అదే అదనుగా పాలెస్తీనీయుల గాజాను ఇజ్రాయెల్ సమూలంగా ధ్వంసం చేసేసింది. ఐరాస సహా ఎవరెన్ని చెప్పినా నెలల తరబడి ఇజ్రాయెల్ ఆగలేదు, గాజాపై దాడులు ఆపనూ లేదు. ఈ నేపథ్యం నుంచి తాజా ఘటనల్ని చూడాలి. చివరకిప్పుడు ఇరాన్ నేరుగా తన గడ్డ మీద నుంచే ఇజ్రాయెల్పై దాడికి దిగింది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎన్నడూ లేనంతటి ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రయోగించిన 360 క్షిపణుల్లో చాలావాటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ల సహకారంతో ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిగా స్వీయ రక్షణ కోసమే తాము దాడి చేశామనీ, విషయం ఇంతటితో ముగిసిందనీ ఇరాన్ అంటోంది. ఇక, క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నందున సంయమనం పాటించి, పరిస్థితి ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా చూడాలని అమెరికా సహా ఇతర మిత్రదేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అభ్యర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరేనన్నట్టు ఉంటూనే, ఇరాన్కు తగిన బదులిస్తామంటోంది. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్లు దేనికది మధ్యప్రాచ్యంలో తమదే పై చేయి అని చూపేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగమే రెండు దేశాలూ ఇప్పుడు దాదాపు నేరుగా కయ్యానికి దిగడం! పశ్చిమాసియాలో పరిస్థితికి ఇరు దేశాల బాధ్యతా ఉంది. ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా పాలెస్తీనా భూభాగాల్ని బలవంతాన దిగ్బంధించి, కథ నడుపుతుంటే ప్రపంచపు పెద్దన్నలెవరూ ఎన్నో ఏళ్ళుగా పెదవి విప్పలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. నిరుడు హమాస్ దాడితో ఇజ్రాయెల్ అహం దెబ్బ తిని, గాజాలో సామూహిక ఊచకోతకు దిగినప్పుడూ అమెరికా సహా ఎవరూ దాన్ని ఆపలేక పోయారు. ఇరాన్ సంగతికొస్తే, అదీ ఇష్టానుసారం వ్యవహరించింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటివన్నీ అది పరోక్షంగా పోషిస్తున్న పాములే. కొన్నేళ్ళుగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ పరోక్ష సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ తీవ్ర వాద మూకలను నిలువరించడమే ఇజ్రాయెల్, అమెరికాల పని అయింది. వెరసి, ఇరాన్, ఇజ్రాయెల్ల తప్పిదాలు, స్వార్థంతో పక్కన చేరిన దేశాలతో పశ్చిమాసియా చిక్కుల్లో పడింది. తాజా ఘటనలతో యుద్ధం అంచున నిల్చుంది. ప్రతి యుద్ధం ప్రపంచంలో అనిశ్చితిని పెంచేదే. మరీ ముఖ్యంగా, ప్రపంచానికి ఇంధన భాండా గారం లాంటి పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారితే ఇక చెప్పేదేముంది! తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ – ఇజ్రాయెల్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొన్నది అందుకే! వ్యవహారాన్ని తెగేదాకా లాగి, ప్రపంచం రెండు శిబిరాలుగా చీలితే కష్టం. ఇరాన్ దాడితో పని లేకుండా గాజాలో యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అంటే, ఇరాన్ – ఇజ్రాయెల్ సంక్షోభం ముగియనే లేదని స్పష్టమవుతోంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం బరిలోకి దిగి, ముందు గాజాలో దాడులు, పాలెస్తీనాలో అమాయక పౌరుల మరణాలు ఆగేలా చూడాలి. ఇజ్రాయెల్కు 66 శాతం మేర ఆయుధాలిస్తున్న అమెరికా, అలాగే ఇతర ఆయుధ సరఫరా దేశాలు తమ సరఫరాలు తగ్గించగలిగితే మేలు. అంతకంతకూ అంతర్జాతీయంగా తాను ఒంటరి అవుతున్నానని ఇజ్రాయెల్ గుర్తించాలి. ‘అబ్రహమ్ ఒడంబడికల’ ద్వారా మితవాద అరబ్ దేశాలు నెయ్యానికి ముందుకు రావడంతో దానికి కలి గిన ప్రయోజనం పోతుంది. అయినా, ఇంతకు ముందు, ఇకపైన కూడా మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లు రెండు ప్రధాన సైనిక శక్తులు. ఇరుపక్షాలూ లక్ష్మణరేఖ దాటాయి. వాటి మధ్య ఘర్షణ చివరకు యుద్ధంగా పర్యవసిస్తే అది రెంటికీ నష్టమే. కాబట్టి, మంకుపట్టు వీడి, వెనక్కు తగ్గాలి. ప్రస్తుత ఉద్రిక్తతను చల్లార్చాలి. పొంచివున్న పెను యుద్ధం ముప్పును నివారించాలి. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు కొనసాగితే, ప్రపంచ చమురు సరఫరాలు సైతం అస్తవ్యస్తమై, ధరలు పెరుగు తాయి. రష్యా నుంచి చమురు సరఫరా కోసం ఎర్రసముద్రంపై ఆధారపడే మన దేశానికీ ఇబ్బందే. భారత్ సూచించినట్టు మళ్ళీ దౌత్యమార్గాన్ని ఆశ్రయించడమే అన్ని వివాదాలకూ పరిష్కారం. -
దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తాం: ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ తమ దేశంపై ఎలాంటి దాడికి దిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ప్రతి చర్యలకు తమ ఎయిర్ఫోర్స్ సిద్ధంగా ఉందని తెలిపింది. ఇరాన్పై ఎలాంటి దాడులు చేయాలన్న దానిపై చర్చించేందుకు ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ బుధవారం(ఏప్రిల్17)న భేటీ కానుంది. ఈ నేపథ్యంలో దాడులను ఎదుర్కొనడానికి తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. ‘ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మా స్పందన తీవ్రంగా ఉంటుంది’ అని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ చెప్పారు. తమ సుఖోయ్-24ఎస్ విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ ఎయిర్ఫోర్స్ కమాండర్ హెచ్చరించారు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్లోని లక్ష్యాలపై దాడి చేస్తుందా లేదంటే ఇరాన్ వెలుపల దాడులు చేస్తుందా అనేదానిపై స్పష్టత లేదు. ఇరాన్కు చెందిన వాణిజ్య నౌకలకు ఎర్ర సముద్రంలో రక్షణ కల్పిస్తున్నట్లు ఇరాన్ నేవీ అడ్మిరల్ షారమ్ ఇరానీ తెలిపారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 1న ఇరాన్ వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. వీటిలో 99 శాతం మిసైళ్లను ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థ సహకారంతో కూల్చి వేసింది. ఇదీ చదవండి.. ఇరాన్కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా -
ఇజ్రాయెల్పై దాడుల ఎఫెక్ట్.. ఇరాన్ భారీ షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్: తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా.. ఇరాన్కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇరాన్కు సంబంధించిన మిస్సైల్, డ్రోన్ ప్రోగ్రామ్పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్పై దాడులకు ప్రతీకారంగా ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇరాన్ మిసైల్, డ్రోన్ ప్రోగ్రామ్పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఇరాన్తో పాటు దాని మిత్రదేశాలు, భాగస్వామ గ్రూపులు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇరాన్, దాని క్షిపణి, డ్రోన్ ప్రోగ్రామ్తో పాటు ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నూతన ఆంక్షలు విధించబోతున్నామన్నారు. మరోవైపు.. యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ కూడా ఇరాన్పై ఆంక్షలు విధించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. తమ మిత్రదేశాలు, భాగస్వాములు కూడా ఇరాన్పై ఆంక్షలు విధిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇరాన్పై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్పై దాడుల అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం కచ్చితం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది. దీంతో, ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. దీని కోసం తగిన సమయం, పద్దతిని ఎంచుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. -
ఇజ్రాయెల్ ప్రతీకార దాడి లక్ష్యాలపై ఐరాస ఆందోళన!
ఇజ్రాయెల్పై ఇరాన్ 300లకు పైగా డ్రోన్లు, మిసైల్స్లతో శనివారం దాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ 99 శాతం మిత్ర దేశాల సహకారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తున్న ఇజ్రాయెల్.. ప్రాంతీయ సంఘర్షణ తీవ్రతరం కాకుండా ఉండేందుకు సంయమనం పాటించాలని మిత్రదేశాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్లోని అణ కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవటం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి నిఘా విభాగం చీఫ్ రాఫెల్ గ్రాస్సీ పేర్కొన్నారు. గత రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వార్ కేబినెట్లో ప్రతీకార దాడులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రతీకాక దాడి చేయడికి సిద్ధంగా ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. అమెరికా, ఇండియా, యూకేతో పాటు పలు దేశాలు ఇరాన్పై ప్రతీకార దాడులతో పరిస్థితులను తీవ్రతరం చేయవద్దని ఇజ్రాయెల్ను కోరుతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి స్పందిస్తూ.. ఇరాన్పై ప్రతీకార దాడి చేయడానికి సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే దాడికి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నుంచి ఆమోదం ఇంకా లభించలేదని అన్నారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తాము సెకండ్లలోనే శనివారం కంటే అతిభీకరమైన దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని ఇరాన్ హెచ్చరిస్తోంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్ఫోన్తో హై బీపీ!
- ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
- అనంత్నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
Advertisement