Sakshi News home page

ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడి లక్ష్యాలపై ఐరాస ఆందోళన!

Published Tue, Apr 16 2024 10:36 AM

Iran vs Israel War: UN Worried About Strikes On Nuclear Sites - Sakshi

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 300లకు పైగా డ్రోన్లు, మిసైల్స్‌లతో శనివారం దాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై  ఇజ్రాయెల్‌ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది.  అయితే ఈ దాడులను ఇజ్రాయెల్‌  99 శాతం మిత్ర దేశాల సహకారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తున్న ఇజ్రాయెల్‌.. ప్రాంతీయ సంఘర్షణ తీవ్రతరం కాకుండా ఉండేందుకు సంయమనం పాటించాలని మిత్రదేశాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది.   

ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్‌లోని అణ కేంద్రాలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకోవటం పట్ల  తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి  నిఘా విభాగం చీఫ్‌ రాఫెల్ గ్రాస్సీ పేర్కొన్నారు. గత రాత్రి ఇజ్రాయెల్‌  ప్రధానమంత్రి వార్‌ కేబినెట్‌లో ప్రతీకార దాడులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్  ఇరాన్‌పై ప్రతీకాక దాడి చేయడికి సిద్ధంగా ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు.  అమెరికా, ఇండియా, యూకేతో పాటు పలు దేశాలు ఇరాన్‌పై ప్రతీకార దాడులతో పరిస్థితులను తీవ్రతరం చేయవద్దని ఇజ్రాయెల్‌ను  కోరుతున్నాయి.

మరోవైపు.. ఇజ్రాయెల్‌  ఆర్మీ చీఫ్‌ హెర్జి హలేవి స్పందిస్తూ.. ఇరాన్‌పై  ప్రతీకార దాడి చేయడానికి సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే దాడికి ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నుంచి ఆమోదం ఇంకా లభించలేదని అన్నారు. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు దిగితే తాము సెకండ్లలోనే శనివారం కంటే అతిభీకరమైన దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని ఇరాన్‌ హెచ్చరిస్తోంది.

Advertisement
Advertisement