పన్నూ హత్యకు కుట్ర.. యూఎస్‌ మీడియా రిపోర్డును ఖండించిన భారత్‌ | Sakshi
Sakshi News home page

పన్నూ హత్యకు కుట్ర.. యూఎస్‌ మీడియా రిపోర్డును ఖండించిన భారత్‌

Published Tue, Apr 30 2024 12:07 PM

India slams USA media linking RAW officer to Pannun plot unwarranted

ఢిల్లీ: అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూను హత్యచేసేందుకు భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రణాళికా రచించాడని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించిన నివేదికను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత రా(RAW)మాజీ అధికారి విక్రమ్‌ యాదవ్‌ అమెరికాలో గురుపత్వంత్ సింగ్‌ను హత్య చేయాలని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారని వాషింగ్టన్‌ పోప్ట్‌ తన రిపోర్టులో తెలిపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్ స్పందించారు. 

‘వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్‌, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు.  ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ అని అ‍న్నారు. 

ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తాకు  సీసీ-1 అనే పేరు తెలియని  అధికారి సాయం చేసినట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్‌పోస్ట్‌ ఆ అధికారిని  విక్రమ్‌ యాదవ్‌గా గుర్తించింది. ఈ కేసులో అమెరికా తరచూ చేస్తున్న ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్‌ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement