దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా | Sakshi
Sakshi News home page

దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా

Published Mon, Apr 29 2024 11:16 AM

tdp leaders attack on ysrcp activists at ongole

ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు యుక్తాయుక్త విచక్షణ మరిచి ‘రాళ్లతో కొట్టండి.. కర్రలతో బాదండి..’ అని సెలవిస్తే పచ్చదండు ఊరుకుంటుందా?  ‘నిన్ను చంపితే ఏం చేస్తావ్‌..’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నేతల గత వైఖరిని మరోసారి గుర్తు చేస్తున్నాయి.    ‘ఓటు వేయకుంటే పోటు.. అడ్డు తగిలితే వేటు’.. స్థూలంగా చెప్పాలంటే టీడీపీ సిద్ధాంతం ఇదే.  ప్రజల ఆశీస్సులతో గద్దెనెక్కాలనే ఆలోచనకే తావు లేకుండా తమకు తెలిసిన ‘దండన’ విద్యనే పచ్చ నేతలు నమ్ముకున్నారు. నిత్యం తగువులే తలంపుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పారీ్టల నాయకులు, కార్యకర్తలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో టీడీపీ నేతల వికృత క్రీడకు బలైన రాజకీయ నాయకులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. అంతకు పది రెట్ల మంది అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చుపెట్టడమే కాకుండా తమ అహానికి, అవినీతికి అడ్డు వస్తున్నారనే కారణంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు మళ్లీ బరితెగించారు.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని పచ్చమూకలు రెచ్చిపోయాయి. పల్లెల్లో దాడులకు తెగబడ్డాయి. తమకు అడ్డువస్తే అంతమొందించడమే లక్ష్యంగా రెచ్చిపోయాయి.  నేడు అధికార పక్షంపై వికృత రాతలతో శునకానందాన్ని పొందుతున్న పచ్చమీడియా నాడు కళ్లుండి చూడలేదని కబోదుల్లా చోధ్యం చూశాయి. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అరాచకాల్లో కొన్ని ప్రధాన ఘటనలు  ఎంపీటీసీ భర్తను చంపారు 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపూడి మండలం కెల్లంపల్లి సెగ్మెంట్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా తేలుకుట్ల గురవమ్మ పోటీ చేశారు. ఏప్రిల్‌ 11న గోసుకొండ అగ్రహారంలో పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడటంతో గురవమ్మ భర్త వెంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలులో చికిత్స ΄పొందుతూ మృతి చెందారు. ఏడాది వ్యవధికే దిగులుతో గురవమ్మ కూడా కన్నుమూసింది.

  • దాడులకు అంతే లేదు..
    పీసీపల్లిలో 2017 జూలైలో వైఎస్సార్‌ సీపీ ఎంపీపీ బత్తుల అంజయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు.

     2015 ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన అప్పటి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌తోపాటు మరో ఏడుగురిపై అక్రమంగా కేసులు బనాయించారు.  

  • కొండపి నియోజకవర్గంలో అయ్యప్పరాజుపాలెంలో ఎంపీటీసీ ఎన్నికల రోజున ఐదుగురిపై దాడి చేసి గాయపరిచారు. జరుగుమల్లి మండలానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయబాబుపై టీడీపీ నేతలు దుర్మార్గంగా రేప్‌ కేసు పెట్టించారు.  

  • టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో సాధారణ ఎన్నికల సమయంలో వెంకట్రావు అనే వ్యక్తి ఏజెంట్‌గా కూర్చున్నాడని అతనికి చెందిన రూ.5 లక్షల విలువ చేసే పొగాకును టీడీపీ నాయకులు తగలబెట్టారు.  

    2014లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక సమయంలో టీడీపీ బరితెగించింది. మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డి ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పేరుతో అరెస్టు చేయించారు.  

గాజులపల్లెలో దాష్టీకం
2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని పుల్లలచెరువు మండలం మర్రివేముల నుంచి ఆ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో గాజులపల్లెలో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులను రెచ్చగొట్టడమే కాకుండా మర్రివేముల నుంచి 100 మంది టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లి దమనకాండ సృష్టించారు. ఇళ్లలోకి చొరబడి ఆడామగా తేడా లేకుండా బయటకు లాక్కుని వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల సొమ్ము లూటీ చేశారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని కాలితో తన్నడంతో ఆమెకు అబార్షన్‌ చేయాల్సి వచ్చింది. మమ్ము చిన్న అంజయ్య అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఎముకలన్నీ విరిగి ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. సుమారు పది వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పురుగుమందు డబ్బాలు తెచ్చి కొందరిపై పోసి రాక్షసానందం పొందారు.  

రాళ్లదాడిలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త బలి  
పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామంలో 2018 సెపె్టంబర్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రంగునీళ్లు చల్లి రెచ్చగొట్టారు. మరుసటి రోజు ఉదయం వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు కొందరు బహిర్భుమికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన టీడీపీ నాయకులు కొందరు ఇంటిపైకి ఎక్కి ఒక్కసారిగా ఇటుక రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎనిమిరెడ్డి పెదబ్రహ్మయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

రెచ్చగొట్టి.. అక్రమ కేసులు పెట్టి..  
ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఆలూరి శ్రీహరి ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని 2019లో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్‌ పెట్టడమే కాకుండా, బూతులు తిడుతూ.. తొడలు చరుస్తూ టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దాడికి దిగడమే కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, మరికొందరిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టించారు. కమ్మపాలెంలో దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రెయినేజీ, రోడ్లు, పబ్లిక్‌ టాయ్‌లెట్‌కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా టీడీపీ నేతలు అడ్డుపుల్ల వేశారు. కమ్మపాలెంలో 119 మంది దళితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లోకి వారిని వెళ్లనివ్వకుండా దామచర్ల అడ్డుకున్నారు. దళితులు మొత్తుకుంటున్నా వినకుండా ఆ స్థలంలో గుండా డ్రెయినేజీ నిర్మించి జులుం ప్రదర్శించారు.  

  • ఒంగోలు సమతా నగర్‌లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారానికి ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలిన పచ్చ మందలో మేడికొండ మోహన్‌రావు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ చౌదరి, ఆయన భార్య కీలకంగా ఉన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఏఆర్‌ కానిస్టేబుల్‌ భార్య మాట్లాడిన బూతులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.  

  • స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయిన రోజున బండ్లమిట్టలోని దుకాణాలపై టీడీపీ నేతలు తెగబడ్డారు. ఓ ముస్లిం యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా, దుకాణం షట్టర్‌ మూతవేసి హల్‌చల్‌ చేశారు. గాయపడిన ముస్లిం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో కీలక సూత్రధారి, సమతానగర్‌లో రచ్చకు కారణమైన మేడికొండ మోహన్‌రావే. నగరంలో రాజకీయ ఘర్షణలు ఎక్కడ జరిగినా మోహన్‌రావు పేరే ప్రధానంగా వినిపిస్తోంది.  

  • మోటా నవీన్‌ అనే ఎస్టీ యువకుడిని చితకబాది ముఖంపై మూత్రం పోసిన కేసులో నిందితుడు రామాంజనేయ చౌదరికి ఆశ్రయం కలి్పంచి పోలీసులకు చిక్కకుండా కొద్ది రోజులపాటు అడ్డుపడింది మోహన్‌రావే అన్న ఆరోపణలున్నాయి. దాడి కేసులో జైలుకు వళ్లి వచ్చిన మోహన్‌రావును ముందు పెట్టి దామచర్ల జనార్దన్‌ ఆడిస్తున్న డ్రామాలను ఎల్లో పత్రిక ప్రముఖంగా ప్రచురించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది.   

Advertisement
Advertisement