Sakshi News home page

ఇజ్రాయెల్‌పై దాడుల ఎఫెక్ట్‌.. ఇరాన్‌ భారీ షాకిచ్చిన అమెరికా!

Published Wed, Apr 17 2024 8:14 AM

US Would Soon Impose New Sanctions On Iran - Sakshi

వాషింగ్టన్‌: తమ కాన్సులేట్‌ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా.. ఇరాన్‌కు షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇరాన్‌కు సంబంధించిన మిస్సైల్‌, డ్రోన్ ప్రోగ్రామ్‌పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా పేర్కొంది. 

కాగా, ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రతీకారంగా ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇరాన్ మిసైల్, డ్రోన్ ప్రోగ్రామ్‌పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు, భాగస్వామ గ్రూపులు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇరాన్, దాని క్షిపణి, డ్రోన్ ప్రోగ్రామ్‌తో పాటు ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నూతన ఆంక్షలు విధించబోతున్నామన్నారు. 

మరోవైపు.. యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ కూడా ఇరాన్‌పై ఆంక్షలు విధించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. తమ మిత్రదేశాలు, భాగస్వాములు కూడా ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌పై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై దాడుల అనంతరం ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు. ఇజ్రాయెల్‌ కవ్విస్తే మాత్రం కచ్చితం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది. దీంతో, ఇరాన్‌ ప్రకటనపై ఇజ్రాయెల్‌ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్‌ మంత్రి బెన్నీ గాంట్జ్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. దీని కోసం తగిన సమయం, పద్దతిని ఎంచుకుంటామని సంచలన కామెంట్స్‌ చేశారు. 

Advertisement
Advertisement