ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. ఇజ్రాయెల్‌ పనేనన్న అమెరికా! | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. ఇజ్రాయెల్‌ పనేనన్న అమెరికా!

Published Fri, Apr 19 2024 11:21 AM

US official says Israel launches missile attacks on Iran Isfahan - Sakshi

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌ చేసిన డ్రోన్‌, మిసైల్‌ దాడులకు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు పాల్పడినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయని అమెరికా పేర్కొంది. ఇరాన్‌పై మిసైల్‌ ఇజ్రాయెల్‌ దాడి చేసినట్లు అమెరికా అధికాలు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్‌ స్పందిస్తూ.. తమ భూభాగంలో ఇప్పటి వరకు ఎలాంటి మిసైల్‌ దాడి జరగలేదని తెలిపింది. అదే సమయంలో కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు స్పష్టం చేసింది.

ఇరాన్‌ రాజధాని నగరం టెహ్రాన్‌కు సుమారు 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫాహాన్ నగరంలోని అతిపెద్ద మిలిటరీ ఎయిర్‌ బేస్‌, పలు ఇరాన్ న్యూక్లీయర్‌ సైట్లు ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకుని మిసైల్‌ దాడి జరిగినట్లు అమెరికా మీడియా తెలిపింది.

ఈ దాడులను ఇరాన్‌ కొట్టేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పలు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ‘ఇరాన్‌ రక్షణ వ్యవస్థ పలు డ్రోన్లను  విజయవంతంగా కూల్చివేసింది. ప్రస్తుతానికి ఎటువంటి క్షిపణీ దాడి జరిగినట్లు నివేదికలు లేవు’ అని ఇరాన్ ప్రతినిధి హుస్సేన్‌ దాలిరియన్ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 

ఇస్ఫాహాన్ సమీపంలోని ప్రధాన వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్ల శబ్దం వినిపించినట్టు మరికొందరు తెలిపారు. అయితే కీలకమైన ఎయిర్‌ బేస్‌ సైట్‌లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ కొన్ని డ్రోన్‌లను ప్రయోగించి ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్‌, మిసైల్‌ దాడులకు పాల్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి  ఇరాన్‌పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరిస్తూ వచ్చింది. తాజా దాడులతో పశ్చిమాసియా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఒక వేళ యుద్ధం అంటూ ప్రారంభమయితే అది ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ మధ్య ఆగదని.. ఇతర దేశాలకూ వ్యాపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement