-
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. దీంతో సీఎంతో పాటు మంత్రులు సచివాలయం నుంచి వెనుదిరిగి వెళ్లారు.శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. అయితే ఒక వైపు లోక్సభ ఎన్నికల కోడ్, మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీని కోరింది. తెలంగాణ ప్రభుత్వ వినతిని సీఈవో వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలోనే వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. అయితే రాత్రి 7 గంటల వరకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీ నిలిచిపోయింది. -
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
సినీ హీరోయిన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నారు. అనేక పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత కిషన్రెడ్డి కామెంట్స్ మీద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఇంతకీ రాములమ్మ ఆలోచనలు ఏంటి? ఆమె కాంగ్రెస్లో కొనసాగుతున్నారా? లేక మరో గూటికి చేరాలనుకుంటున్నారా? లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒకప్పుడు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే. 1998లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి కమలం, కాంగ్రెస్ పార్టీలకు రెండు సార్లు రాజీనామాలు చేసి, మళ్ళీ చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేాశారు. కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్లో చేరిపోయారు. కొన్ని రోజులు హస్తం పార్టీలో యాక్టీవ్ గానే ఉన్నా.. ఆతర్వాత కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెండోసారి బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం సీనియర్గా ఆమెకు గుర్తింపు ఇచ్చినా కొద్ది రోజులకే మళ్ళీ హస్తం గూటికి వచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన విజయశాంతి పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేాశారు. ఎన్నికల అనంతరం ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆరు నెలల పాటు విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ అడపాదడపాగా సోషల్ మీడియా వేదికగా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయశాంతి. తాజాగా సోషల్ మీడియాలో విజయశాంతి పెట్టిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది.బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలకు కాంగ్రెస్ నేతగా విజయశాంతి కౌంటర్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ట్వీట్ చేసారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ఆత్మగౌరవం, పోరాట తత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమంటూ కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందంటూ చురకలు అంటించారు విజయశాంతి. అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను విమర్శిస్తే విజయశాంతి స్పందించడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ప్రస్తుత పోస్ట్ చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. కిషన్ రెడ్డి వాఖ్యలను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోలేదు అలాంటిది కాంగ్రెస్ నేత అయిన విజయశాంతికి ఏమవసరం అని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సొంత పార్టీని ఇరకాటంలో పెట్టడంలో విజయశాంతి స్టైలే వేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
‘రంగారెడ్డి’ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పార్టీ క్యాడర్లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. హస్తం శ్రేణుల్లో ఈ ఆందోళనకు కారణమేంటి? పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ? గ్రూపు తగాదాలు పార్టీ క్యాడర్కు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు పెద్ద ఎత్తున చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ?ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ...గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అవుతారనే ప్రచారంతో పార్టీ క్యాడర్కు కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ వివిధ కారణాలతో కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ... పార్టీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామా అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్ లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండోసారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. తాండూరు కాంగ్రెస్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. -
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిచాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని, ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారని తెలిపారు. మేనేజ్మెంట్, ఎకనామిక్స్లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన, అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని పేర్కొన్నారు.‘అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి.. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారు.సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్ను రూపొందించి ఉచితంగా అందజేశారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు.టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై బలంగా గళం విప్పారు. కరోనా మహమ్మారి సమయంలో, వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారుకేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు.ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి గారికే వేసి.. వారిని గెలిపించాలని కోరుతున్నాం’అని ట్వీట్లో పేర్కొన్నారు.✊ ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు💠 ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో… pic.twitter.com/V7KWVFSdpt— KTR (@KTRBRS) May 18, 2024 -
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
-
మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: వాతావరణంలో మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రత, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించడం లేదు. అంతేగాక ఈ నెలలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తరుచూ వానలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణశాఖ మరో చల్లటి కబురు చెప్పింది.దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రేపటికి (మే 19) బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.దీని కారణంగా మే 23వ తేదీ వరకు కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిపేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
TG: మేడిగడ్డపై మరో కమిటీ?
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) ఇచ్చే నివేదిక(మధ్యంతర!).. అందులోని సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీ వేయొచ్చని సమాచారం. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మత్తుల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. కమిటీ చేసిన సూచనలు, వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించనుంది. ఈ భేటీలోనే మరో నిపుణుల కమిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న మేడిగడ్డ బ్యారేజీ 7వ గేటను ఇంజినీర్లు ఎత్తేశారు. మరోవైపు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ పరిధిలోకి వచ్చే రిపేర్లు మాత్రమే చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఓకే చెప్పింది. దెబ్బ తిన్న ఏడో బ్లాక్లోని 20, 21 గేట్లను తెరిచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఇక బ్యారేజీకి మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం పుణే సంస్థ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. -
పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్, సాక్షి: కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డి హల్ చల్ చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అదుపులో మల్లారెడ్డిసుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 భూవివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పేట్బషీరాబాద్ పీఎస్కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన ట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారంటూ ధర్నా చేపట్టారు. పోలీస్ స్టేషన్లోకి మీడియాను పోలీసులు అనుమతించడం లేదుస్థానికంగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్రెడ్డిలకు వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మాకోరుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. -
తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు.EAP CET టాపర్లు (ఇంజనీరింగ్)మొదటి ర్యాంక్ - సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం,ఏపీ) రెండో ర్యాంక్ - గొల్లలేక హర్ష (కర్నూల్, ఏపీ) మూడో ర్యాంక్- రిషి శేఖర్ శుక్లఇంజనీరింగ్ విభాగంలో టాట్టెన్లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచారు.EA PCET టాపర్లు ( అగ్రి కల్చర్ అండ్ ఫార్మసీ)మొదటి ర్యాంక్- ఆలూర్ ప్రణిత ( మదనపల్లి, ఏపీ) రెండో ర్యాంక్ - నాగుడసారి రాధా కృష్ణ (విజయనగరం, ఏపీ) మూడో ర్యాంక్- గడ్డం శ్రీ వర్షిణి (వరంగల్,తెలంగాణ)ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ‘ఎప్ సెట్ను మొదటి సారిగా నిర్వహించాం. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించాం’ అని తెలిపారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడారు. ‘ఈ ఏడాది ఈఎపి సెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు . ఈఎపి సెట్కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తాం’అని అన్నారు. -
ఒక్క క్లిక్తో ఈఏపీ సెట్ ఫలితాలు
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాను ఒక్క క్లిక్తో తెలుసుకోండి... ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి -
వీడిన గందరగోళం.. సాయంత్రం కేబినెట్ భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రిమండలి సమావేశ నిర్వహణపై గందరగోళం వీడింది. ఇవాళ భేటీ ఉంటుందని రెండ్రోజుల కిందటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించగా.. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెళ్లకపోవడంతో ఉంటుందా? ఉండదా? అనే చర్చ నడిచింది. చివరకు సాయంత్రం భేటీ ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన అంశాలపై తెలంగాణ మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగానే తెలంగాణ కేబినేట్ సమావేశం పై తర్జనభర్జన కొనసాగింది. మరోవైపు ఇప్పటికే కేబినేట్ భేటీలో చర్చించే అంశాలు ఇవేనంటూ సీఎంవో కొన్ని అంశాలను మీడియాకు విడుదల చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలురుణమాఫీ నిధుల సమీకరణ పై నిర్ణయంధాన్యం కొనుగోళ్లు , ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చరాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చమేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చకొత్త విద్యా సంవత్సరం లో చేపట్టవలసిన చర్యలపై చర్చకేబినెట్ భేటీ నిర్వహణ కోసం ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. అయితే అనుమతి దొరికిందా? లేదా? అనే స్పష్టత రాలేదు. ఈలోపే సాయంత్రం 4గం. కేబినెట్ భేటీ ఉంటుందని మీడియాకు సీఎంవో సమాచారం అందించింది. -
మరో రెండ్రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలుచోట్ల మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్ కు నైరుతి ప్రాంతంలో చక్రవాతపు ఆవర్తనం (సైక్లోనిక్ సర్క్యులేషన్) కేంద్రీకృతమై ఉందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. అదే విధంగా రాయలసీమ, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతంలో మరో చక్రవాతపు ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాం గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలులో 6.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.71 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం మించి వానలు కురవడం గమనార్హం. తగ్గిన ఉష్ణోగ్రతలు: శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాలను పరిశీలిస్తే..ఆదిలాబాద్లో అత్యధికంగా 37.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్లో అతి తక్కువగా 21.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండురోజుల్లో కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈనెల 19న దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల వరకు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్లలో)కేంద్రం గరిష్టం ఆదిలాబాద్ 37.8 భద్రాచలం 35.2 దుండిగల్ 31.8 హకీంపేట్ 31.8 హనుమకొండ 30.0 హైదరాబాద్ 31.9 ఖమ్మం 35.0 మహబూబ్నగర్ 34.9 మెదక్ 33.8 నల్లగొండ 36.0 నిజామాబాద్ 35.3 రామగుండం 33.2 -
సైబర్ నేరగాళ్ల మైండ్ ‘బ్లాక్’
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పడానికి కేంద్రప్రభుత్వం మరో కీలకనిర్ణయం తీసుకుంది. వీరు వినియోగించే మొబైల్ఫోన్లు బ్లాక్ చేయిస్తోంది. తాజాగా 28,200 çహ్యాండ్సెట్స్ బ్లాక్ చేయాలని ఆయా సర్విస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఈ ఫోన్లలో వాడిన 20 లక్షల ఫోన్నంబర్ల పూర్వాపరాలు మరోసారి పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ–కేటుగాళ్లు గత ఏడాది ‘గ్రేటర్’పరిధిలోని బాధితుల నుంచి ఏకంగా రూ.621 కోట్లు కాజేశారంటే సైబర్ నేరాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డార్క్నెట్లో దొరుకుతున్న డేటా ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్లు అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బాధితులను టార్గెట్గా చేసుకుంటున్నారు. అయితే దీనికి సెల్ఫోన్ వినియోగదారుల వివరాలు అత్యంత కీలకం. వీరి నంబర్లతో కూడిన డేటా సైబర్ నేరగాళ్లకు డార్క్నెట్లో తేలిగ్గా దొరుకుతోంది. లక్ష మందికి సంబంధించిన ఫోన్ నంబర్లను కేవలం రూ.30 వేలకు విక్రయించేవారు అనేకమంది ఉన్నారు. ఈ డేటా వీరి వద్దకు ఎలా చేరుతోందనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.ప్రీ యాక్టివేటెడ్ సిమ్కార్డులు సైబర్ నేరగాళ్లు తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ బాధితుడు పోలీస్ ఫిర్యాదు చేసినా, దర్యాప్తులో ముందుకు వెళ్లకుండా, వారికి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఉండేలా ప్లాన్ చేశారు. బ్యాంకు ఖాతాలు, సెల్నంబర్లు ఇలా ఏదీ తమ పేరుతో లేకుండా చూసుకుంటున్నారు. వీరికి అవసరమైన బ్యాంకు ఖాతాలు, సిమ్కార్డులను సరఫరా చేయడానికి కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఇతరుల పేర్లతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలతోపాటు ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు సేకరించి సైబర్ నేరగాళ్లకు ఈ ముఠాలు అందజేస్తున్నాయి. బ్యాంకు ఖాతాలు ఇచి్చనందుకు కమీషన్లు, సిమ్కార్డుకు అధిక రేటు వీరికి దక్కుతోంది.ఆ రెండింటితో ఉపయోగం లేక... సైబర్ నేరగాళ్లను కట్టడి చేయడానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తొలినాళ్లలో సైబర్ నేరాలతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేసేది. ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో మరో అడుగు వేసింది. సైబర్ నేరగాళ్లు వినియోగించినట్టు, వినియోగించే అవకాశమున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించిన సెల్ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడం మొదలెట్టింది. దీంతో తెలివిమీరి వ్యవహరిస్తున్న ఆ కేటుగాళ్లు అధిక సంఖ్యలో ప్రీ యాక్టివేటెడ్ సిమ్కార్డులు సమీకరించడం మొదలెట్టారు. ఒక్కో నేరానికి ఒక్కో సిమ్ వాడుతున్నారని అధికారులు గుర్తించారు. ఫోన్లు బ్లాక్ చేసేలా తాజా నిర్ణయం సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న హ్యాండ్సెట్స్ను బ్లాక్ చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ బాధ్యతల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) పర్యవేక్షించడం మొదలెట్టింది. సైబర్ నేరాల్లో బాధితులుగా మారినవారు నేరుగా, ఆన్లైన్ ద్వారా పోలీసులు లేదా సంబంధిత ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, 1930కు కాల్ చేయడం ద్వారా, వెబ్సైట్, యాప్ల్లో దాఖలవుతున్న వీరి ఫిర్యాదుల్లో తమను సంప్రదించడానికి సైబర్ నేరగాడు వినియోగించిన ఫోన్ నంబర్ వివరాలు ఉంటున్నాయి. ఈ డేటా ఆధారంగానే డీఓటీ మొబైల్ ఫోన్లు బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుటోంది. సర్విసు ప్రొవైడర్ల సహకారంతో.. ఈ సెల్ఫోన్ హ్యాండ్సెట్లు గుర్తించడం, బ్లాక్ చేయడంలో ఆయా నెట్వర్క్ సర్విస్ ప్రొవైడర్ల పాత్ర అత్యంత కీలకం. ప్రతి సెల్ఫోన్కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్గా (ఐఎంఈఐ) పిలిచే ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఏ కంపెనీ సిమ్ వాడుతుంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఈ ఐఎంఈఐ రిజిస్టర్ అవుతుంది. బాధితుల ఫిర్యాదులో ఉన్న సెల్నంబర్ ఆధారంగా సర్విస్ ప్రొవైడర్ల సహకారంతో డీఓటీ ఐఎంఈఐ నంబర్లను గుర్తిస్తోంది. వీటితో జాబితా రూపొందించి ఆయా సర్విస్ ప్రొవైడర్లకు పంపిస్తోంది. దీని ఆధారంగా ఈ ఐఎంఈఐ నంబర్లు ఉన్న ఫోన్లు పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఆ హ్యాండ్సెట్ బ్లాక్ అయిపోతోంది. ఇటీవల కాలంలో నేరగాళ్లు స్కైప్ కాల్స్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహాకు చెందిన స్కైప్ ఖాతాలను కేంద్రం బ్లాక్ చేయిస్తోంది. -
నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేస్తారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫలితాలు చూడొచ్చు. కాగా, ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు. -
ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
పాపన్నపేట (మెదక్): ధాన్యం రవాణా చేయాలని కోరుతూ వారం రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన కరువైంది. వారి ఆందోళనను పట్టించుకోక పోగా ఓ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మెదక్ జిల్లా పాపన్న పేట సమీపంలో మిన్పూర్లో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వారం రోజులుగా రవాణా జరగక వందలాది క్వింటాళ్ల ధాన్యం కల్లాల్లో పేరుకు పోయింది. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలెత్తాయి. దీంతో ధాన్యం రవాణా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.సమాచారం అందుకున్న పోలీసులు పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్బాబుకు రైతుల ఆందోళన గురించి వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ‘ఎప్పు డంటే అప్పుడు వచ్చేయడానికి మాకు మాత్రం భార్యా పిల్లలు లేరా’అంటూ నిర్లక్ష్యంగా సమాధాన మివ్వడంతో ఆగ్రహించిన రైతులు బొడ్మట్పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై సురేశ్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చ జెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. పోలీ సులు ఫోన్ చేసి తహసీ ల్దార్ను ఘటనా స్థలానికి పిలిపించారు. రైతులతో తహసీ ల్దార్ కొద్దిసేపు మాట్లాడి వారికి క్షమాపణ చెప్పారు. అదేవిధంగా గంటలో ధాన్యం రవాణా ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ధాన్యం.. దయనీయం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. గత రెండురోజులుగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి.ఇంతకుముందు వర్షానికి తడవడంతో ఆరబోసుకున్న వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వర్షం కారణంగా రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.ఉమ్మడి కరీంనగర్లోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు మండలాల్లో క్వింటాళ్ల కొద్దీ వడ్లు తడిచిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి కాయలు రాలిపోయాయి. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ను అంతర్జాతీయ ప్రమా ణాలతో ఆధునీకరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. అలాగే కోహెడ మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, జౌళి శాఖల్లో ఒకే రకమైన పనితీరు కలిగిన కార్పొరేషన్లను సంఘటితపరిచి ఒకే కార్పొరేషన్ ఏర్పాటుచేసి, వాటిని బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేసి త్వరలోనే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిస్తామని తెలిపారు.అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోకుండా పంటల ఉత్పత్తులకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బయోమాస్కు సంబంధించిన యూనిట్లను కూడా ప్రోత్సహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థల గోదాములపై సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయాలని, దీనికోసం విద్యుత్ అధికారులతో సంప్రదించి తగిన ఒప్పందాలు చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలని మంత్రి చెప్పారు. ఈ ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సుమారు రూ.255 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలతో కలపి 5.70 కోట్ల మీటర్ల ఆర్డర్లు నేత కార్మికులకు వచ్చేవని, కానీ ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు కాకుండానే 2.50 కోట్ల మీటర్ల ఆర్డర్లు వచ్చాయనీ, ఇంకా 80 లక్షల మీటర్ల ఆర్డర్లు రావాల్సి ఉందన్నారు. పవర్ లూమ్స్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి కోరారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జౌళిశాఖ సంచాలకులు అలుగు వర్షిణి, ఉద్యాన సంచాలకులు అశోక్రెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి పాల్గొన్నారు.మంత్రి తుమ్మలతో డీసీసీబీ చైర్మన్ల భేటీ ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీబీ చైర్మన్లు శుక్రవారం సెక్రటేరియట్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు ఆయా బ్యాంకుల స్థితిగతులు, ఆర్థిక విధానాలను వివరించారు. -
రుణమాఫీపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్ సచివాలయంలో జరగనుంది. లోక్ స భ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకా శం ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణాల ను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ, రుణమాఫీ కటాఫ్ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు లక్షల రూపాయల వర కు పంట రుణాలు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఒక నిర్ణయం తీసు కుని.. నిధులు సమకూర్చే బాధ్యతను అధికార యంత్రాంగంపై పెట్టే అవకాశం ఉంది.ధాన్యం కొనుగోళ్లపై చర్చప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల (కాళేశ్వరం) రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది.ఇందులోని సిఫారసులు పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించి విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. -
ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పలు ఫిల్మ్ సిటీలకు ప్రభుత్వ భూ కేటాయింపు సమర్థనీయమైనప్పుడు.. ఆనంద్ సినీ సర్వీసెస్కు ఇవ్వడం తప్పెలా అవుతుందని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్రావును హైకోర్టు ప్రశ్నించింది. అలాగే 2001లో తొలిసారి జీవో జారీ చేస్తే.. 2008లో సవాల్ చేయడం సరికాదని, ఆలస్యానికి కారణాలు కూడా తెలుపలేదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ కనిపించనందున కొట్టివేస్తున్నామని స్పష్టం చేసింది. 2001, ఆగస్టు 21న సాధారణ పరిపాలన (ఐఅండ్పీఆర్) విభాగం జీవో 355ను జారీ చేసింది. హైదరాబాద్ షేక్పేట్లోని సర్వే నంబర్ 403లో 5 ఎకరాల భూమిని ఆనంద్ సినీ సర్వీసెస్కు ఎకరం రూ.8,500లకు కేటాయించాలని ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్డీసీ)కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఎందుకో భూమి అప్పగింతను నిలిపివేస్తూ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్డీసీకి లేఖ రాసింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం వచ్చాక డిసెంబర్, 2008లో మరో జీవో 744ను జారీ చేసి.. భూమిని అప్పగించింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్రావు 2008లో పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపు చట్టవిరుద్ధమని, జీవోలను కొట్టివేయడంతో పాటు ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరారు.ఈ పిటిషన్పై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీఎస్ఎఫ్డీసీకి 1982లో ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అలాగే పద్మాలయా స్టూడియోకు 9.5 ఎకరాలు, సురేశ్ ప్రొడక్షన్స్కు 5 ఎకరాలతో పాటు ఆనంద్ సర్వీసెస్కు కూడా 5 ఎకరాలు కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ 2004లో దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది.ఇది సినీ రంగ అభివృద్ధికి 1982లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ అద్భుతమైన పాలసీ. 2011లోనూ పలు పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు దర్శకుడు ఎన్.శంకర్కు 5 ఎకరాల కేటాయింపును ఇదే హైకోర్టు సమర్థించింది’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో ఇచ్చిన ఏడేళ్ల తర్వాత పిటిషన్ వేయడం సరికాదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం విచక్షణాధికారాన్ని వినియోగించుకుని జాప్యానికి కారణం లేనందున ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నామని తెలిపింది. -
త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అతి త్వరలో గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటించనుంది. ఈ కేటగిరీలో 8,180 ఉద్యోగాలకు గాను 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూలై 1వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఓఎంఆర్ ఆధారిత అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాతో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను (జీఆర్ఎల్) వెబ్సైట్లో ఉంచింది.ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అయితే డిజేబుల్డ్ (దివ్యాంగులు) కేటగిరీలో మాత్రం 1:5 నిష్పత్తిలో ఎంపిక చేపట్టనుంది. ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసిన వెంటనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేలా టీఎస్పీఎస్సీ కార్యాచరణ రూపొందించింది. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021–22 సంవత్సరం తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. అదే విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్పీఎస్సీ తెలిపింది. -
వివాదాస్పదులైతే పక్కకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైస్ చాన్స్లర్ల పోస్టుల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు సెర్చ్ కమిటీలు రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో ప్రతి విశ్వ విద్యాలయంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వం అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. విశ్వవిద్యాలయాలు ఎందుకు వివాదాస్ప దమవుతున్నాయి? అక్కడున్న లోపాలు ఏంటి? అధ్యయనం చేయాలని సూచించింది. వీసీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి వ్యక్తిగత వివరాలను కూడా లోతుగా పరిశీలించాలని స్పష్టం చేసినట్లు సమాచారం.సర్వీస్లో ఏమాత్రం వివాదాస్పద రికార్డు ఉన్నా.. వారిని పక్కన బెట్టాలని ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే వీసీలుగా ఉన్న వారితో అంటకాగే వ్యక్తుల దరఖాస్తులను కూడా పక్కన పెట్టాలనే ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. వర్సిటీల వారీగా సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ శాంతికుమారికి అన్ని కమిటీల్లో భాగస్వామ్యం కల్పించింది.ప్రభుత్వం వద్ద సమగ్ర నివేదికలురాష్ట్రంలో పది విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించేందుకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా వర్సిటీల్లో ఇన్నేళ్లుగా చోటు చేసుకున్న వివాదాలపై ప్రభుత్వం గతంలోనే నివేదిక కోరింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే అన్ని వర్సిటీల్లోని వ్యవహారాలపై సమగ్ర నివేదికలు తెప్పించుకుంది.ఉన్నత విద్యలో కీలక పదవులు నిర్వహించిన వారు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని అధ్యాపక సంఘాలు వర్సిటీల్లో జరుగుతున్న వ్యవహారాలపై సీఎంకు నివేదికలు ఇచ్చారు. ఈ నివేదికలు పరిగణనలోకి తీసుకుని ప్రక్షాళన చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. రాజకీయ ప్రాధాన్యతతో దుష్ఫలితాలువైస్ చాన్స్లర్ల నియామకంలో రాజకీయ ప్రాధాన్యత అనేక దుష్ఫలితాలకు దారితీస్తోందని పలువురు ప్రొఫెసర్లు సీఎం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్లోని యూనివర్సిటీల్లో వీసీల ఇష్టారాజ్యం నడుస్తోందని ఓ ఆచార్యుడు పేర్కొన్నట్లు తెలిసింది. బాసర ట్రిపుల్ ఐటీపై అనేక ఆరోపణలున్నాయి. ఇప్పటికీ అక్కడ ఇన్చార్జి వీసీనే కొనసాగుతున్నారు. గత కొన్నేళ్లుగా వర్సిటీపై అనేక రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేరుకు సెర్చ్ కమిటీలు నియమిస్తున్నా వాటికి ఏమాత్రం ప్రాధాన్యత ఉండటం లేదని వారు వివరించినట్లు తెలుస్తోంది.ఓ వర్సిటీ వీసీ నియామకాన్ని సెర్చ్ కమిటీ తీవ్రంగా తప్పుబట్టినా పెద్దగా పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. మరోవైపు గత కొంత కాలంగా విద్యాశాఖ కమిషనర్ల పాత్ర కూడా విశ్వవిద్యాలయాల్లో కొత్త సమస్యలకు దారి తీస్తోంది. గత ఏడాది ఓ ఐఏఎస్ అధికారి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయనకు నచ్చిన అంశాలపై వర్సిటీ పాలక మండలిలో ఆమోదం పొందేందుకు తీవ్ర ఒత్తిడి తెచ్చారనే విమర్శ లున్నాయి. ఈ క్రమంలో ఆయనకు, వీసీకి మధ్య జరిగిన ప్రచ్ఛన్న పోరు వర్సిటీ పరువు ప్రతిష్టలకు భంగం కల్గించిందని పలువురు సీఎం దృష్టికి తెచ్చారు.మరో వర్సిటీలో రిటైర్ అయిన వ్యక్తిని రిజిస్ట్రార్గా కొనసాగించిన తీరు కూడా అనేక విమర్శలకు కారణమైంది. దీని వెనుక వీసీ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. ఇలాంటి పలు వివాదాలు, వీసీల అవినీతి, అక్రమ వ్యవహారాలపై ముఖ్యమంత్రికి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వీసీల నియామకంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గద ర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
కేసీఆర్ను ఢీకొట్టలేక కవితను జైలుకు పంపారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఢీకొట్టలేక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితను బీజేపీ జైలుకు పంపిందని బీఆర్ఎస్ నేతలు ఆర్. ఎస్.ప్రవీణ్కుమార్, బాల్క సుమన్ ఆరోపించారు. మాట వినని, అడ్డుగా ఉన్న ప్రతిపక్ష నేతలపై ఐటీ, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తూ అక్రమ కేసు లను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వా మ్యం ప్రమాదంలో ఉందని, దయచేసి బీజేపీకి ఎవరూ ఓటు వేయొద్దంటూ అభ్యర్థించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితతో తిహార్ జైల్లో ఆర్.ఎస్.ప్రవీణ్, బాల్క సుమన్ అరగంట పాటు ములాఖత్ అయ్యారు.అనంతరం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కవిత చాలా ధైర్యంగా ఉన్నారని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టి, ఆమె తరపు న్యాయవాదికి నోటీసులివ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే ఈ కేసు ఎవరి చెప్పుచేతల్లో నడస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్థిక నేరాలకు, ఇతర దేశాల నుంచి నగదు లావాదేవీలకు పీఎంఎల్ఏ కేసు నమోదు చేస్తారని, అసలు ఏ ఆధారా లున్నాయని పీఎంఎల్ఏ నమోదు చేశారో చెప్పా లని వారు డిమాండ్ చేశారు. ప్రముఖుల పేర్లు చెప్పాలంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారనే విషయం కవిత చెప్పినట్లు తెలిపారు.తాము చెప్పినట్లు వింటే బయటకు పంపిస్తాం లేదంటే ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంచుతామనే సంకేతాలను బీజేపీ ఇస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా బీజేపీనే అని బాల్క సుమన్ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యే వారి పేర్లను 2020లో బీజేపీ నేత మీడియా సమావేశం ద్వారా చెప్పడం.. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా అరెస్టులు జరగడాన్ని మనమంతా చూస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఇంకా జరగాల్సిన ఎన్నికల్లో బీజేపీకి 220 ఎంపీ సీట్లు కూడా రావని సుమన్ జోస్యం చెప్పారు. -
విజయవాడ రోడ్డును వెంటనే విస్తరించాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై 17 ప్రాంతాల్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణనష్టం జరుగుతున్నందున ఆ రోడ్డును వీలైనంత తొందరలో విస్తరించాల్సిన అవసరం ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె డ్డి పేర్కొన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న లోపాలను ముందుగా మరమ్మతు చేయాలని అధి కారులను ఆదేశించారు. మరమ్మతులతో వాహనా లకు ఇబ్బంది ఎదురుకాకుండా, ముందుగా ప్రత్యా మ్నాయ మార్గం ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని సూచించారు. అధికారిక అనుమతుల పేరిట ఇంకా జాప్యం చేస్తే ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయని, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని పేర్కొ న్నారు. శుక్రవారం ఆయన ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహæదారుల విభాగం అధికారులతో సమీక్షించారు. విజయవాడ రహæదారిపై ప్రమాదాలు జరుగు తున్న చోట్ల వాహనచోదకులు గమనించేలా హెచ్చరిక, సూచిక బోర్డుల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అతివేగం నియంత్రణ చర్యలు చేపట్టడం, అవసరమైన ప్రాంతాల్లో ఆరు వరుసలకు రోడ్డును విస్తరించటం, కావాల్సిన చోట్ల వెహికిల్ అండర్ పాస్లు, రెండు వైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి చేపట్టాలని తెలిపారు. 2021లో మంజూరైన రీజినల్ రింగ్ రోడ్డు పనులు ఈ పాటికే ప్రారంభమై ఉంటే అది ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసి ఉండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 70 శాతం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, అటవీ భూములు, కోర్టు కేసుల వల్ల మిగతా దానిలో జాప్యం జరుగుతోందని ఎన్హెచ్ఏఐ రీజినల్ అధికారి రజాక్ మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి విజేంద్రబోయీ, ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధం మిగిలే ఉంది: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జి ల్లా: కొట్లాడి తెచ్చుకున్న తెలంగా ణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలే ఉందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉద్యమ శక్తుల ను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ, సా మాజిక అంశాల్లో వచి్చన మార్పు లు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పు స్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా పుస్తక రచయిత శ్రీనివాస్ యాదవ్ను ప్రత్యేకంగా అభినందించారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో, ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని ప్రశంసించారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని చెప్పారు. రచయితలు ప్ర జల పక్షాన ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భావవ్యాప్తితో ఉద్యమం ఉధృతమైంద ని గుర్తు చేస్తూ మరోసారి కవులు కళాకారులు ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్ సర్కారు తిరోగమన దిశగా ఆలోచించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు.పదేళ్ల తెలంగాణ పాలనలో ప్రజలకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదని కేసీఆర్ తన పాలన మజిలీలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్రావు, బాలమల్లు, శరత్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయు డు, బీఆర్ఎస్ యువ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి రాసిన ‘హౌ టు బయ్ ఆన్ ఇండియన్ ఎలక్షన్’ పుస్తకాన్ని కూడా కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో సమగ్ర ఎన్నికల ప్రక్రియలో పారీ్టల పాత్ర, ఓటర్లు, తదితర అంశాలతో ఈ పుస్తకం రాశారు. -
ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటా రద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి కోటా కింద ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎంబీబీఎస్లో సీట్ల కేటాయింపునకు స్వస్తి పలకాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు ఆదేశాల మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైపోతున్న సందర్భంగా జూన్ 2వ తేదీ తర్వాత నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లుగా అన్ని రకాల విద్యా సంస్థల్లో 15 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తున్నారు.రెండు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు కేటాయిస్తున్నారు. గత పదేళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఏపీలో కాలేజీల్లో కూడా ఇదే విధంగా ఉమ్మడి కోటా అమలవుతోంది. అయితే మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడి విద్యార్థులు అక్కడ దరఖాస్తు చేసుకోవడం తక్కువ. కానీ ఏపీ విద్యార్థులు మాత్రం ఉమ్మడి కోటాను ఉపయోగించుకుని ఇక్కడ సీట్లు పొందుతున్నారు. విభజన చట్టం జూన్ రెండో తేదీతో ముగిసిపోనుంది.దీంతో ప్రభుత్వం కూడా ఏపీతో ముడిపడి ఉన్న అంశాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటాను రద్దు చేస్తే, ఇక నుంచి అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులకే వస్తాయి. పీజీ మెడికల్లోనూ ఇదే పద్ధతి పాటిస్తారు. ఆ ప్రకారం రానున్న కౌన్సెలింగ్లో నిబంధనలు మార్చాలని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. విభజనకు ముందున్న కాలేజీల్లోనే అమలైన కోటారాష్ట్రంలో ప్రస్తుతం 26 ప్రభుత్వ, 27 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2022 వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఉమ్మడి కోటా అమలైంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. కొత్తగా ఏర్పడిన కాలేజీల్లో ఉమ్మడి కోటాను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే కోటా అమలు చేసింది. ఈ 20 కా>లేజీల్లో కలిపి 1,950 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో 200కు పైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు చేస్తే ఇక నుంచి ఆ 200 సీట్లు తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి వస్తాయి.తప్పనిసరిగా రద్దు చేయాలనే రూల్ లేదా?మరోవైపు విభజన చట్టం పదేళ్లతో ముగిసినా ఉమ్మడి కోటాను తప్పనిసరిగా రద్దు చేయాల్సిన రూలేమీ లేదని అధికారులు అంటున్నారు. ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రతిపాదనలపై అసలు చర్చే జరగడం లేదని చెప్పడం గమనార్హం.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement