-
తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం
ఖమ్మం వన్టౌన్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో రైతులు అధైర్య పడొద్దని.. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ పూర్తిచేసి.. ఎంత మంది రైతులకు, ఎన్ని కోట్ల రుణమాఫీ చేశామనేది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో చెబుతామని తెలిపారు. కాగా, రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగేలా పంటల బీమా పథ కాన్ని అమలు చేస్తూ, ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి చెప్పారు. ఇక విత్తన కంపెనీలతో ఇబ్బందులు లేకుండా రైతులకు విత్తనాలు అందేలా ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుందన్నారు. కాగా, ఆయిల్పామ్తో లాభాలు గడించే అవకాశమున్నందున రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఇక పంట నష్టపరిహారం సైతం త్వరలో అందిస్తామని, వచ్చే ఖరీఫ్ నుంచి పెంచిన ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసా పంపిణీ ప్రారంభిస్తామని తుమ్మల తెలిపారు. కాగా, నల్లగొండలో ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజార్టీ ఇస్తామని అక్కడి నేతలు చెబుతున్నందున, ఆ మెజార్టీ దాటేలా ఖమ్మం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
కరువుతో కేసీఆర్ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా? అని మాజీ సీఎం కేసీఆర్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అథోగతికి మీరు కారణం కాదా? అని ప్రశ్నించారు. కేవలం రైతుబంధు పేరిట మిగతా విత్తన సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలన్నీ ఎత్తేసి రైతుల్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ఏనాడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఒక్క రైతునైనా ఆదుకున్నారా? అని నిలదీశారు. కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన రూ.10,000 అయినా నష్టపోయిన రైతులందరికి ఇచ్చారా? కేవలం మెదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసి, రెండో విడతగా ఏప్రిల్లో కురిసిన వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు జీవో ఇచ్చి డబ్బు విడుదల చేయలేదని గుర్తు చేశారు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ కాదా? అని తుమ్మల నిలదీశారు. -
మిర్చి రైతులు నష్టపోవద్దు
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంట భారీ ఎత్తున మార్కెట్లోకి వస్తోందనీ, ధర విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో 3.91 లక్షల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ఇప్పటికే 94395 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్కు వచ్చిందని వివరించారు. ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు కాగా 1.92 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా, స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు నష్టపోయారని, ఈ పరిస్థితి రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిందని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: తుమ్మల జంగారెడ్డిగూడెం రూరల్ (ఏపీ): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు నిర్వహిస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసు కుని అన్నదాతలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రి పోర్టు ఆధారంగా ఖర్చులకు ఒకటిన్నర రెట్లు రైతు కు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
తెరపైకి కొబ్బరి బోర్డు!
అశ్వారావుపేట రూరల్: రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో రైతు ల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు మొలకెత్తగా.. కేంద్రం స్పందిస్తుందా, లేదా అనే మీమాంస నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా.. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన సమయాన తెలంగాణలో సాగు తక్కువగా ఉందనే కారణంతో ఈ కార్యాలయాన్ని ఏపీకి మార్చారు. ఆనాటి నుంచి ఏపీ కొబ్బరి బోర్డు అధికారులే తెలంగాణలో కుడా కొబ్బరి సాగు విస్తరణ, అభివృద్ధి, రాయితీతోపాటు ఇతర సేవలందిస్తున్నారు. అయితే, తెలంగాణలో బోర్డు లేని కారణంగా కొబ్బరి రైతాంగానికి ఆశించిన స్థాయిలో సేవలు, రాయితీలు అందడం లేదనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లుగా ఇక్కడ కూడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడా వేలాది ఎకరాల్లో సాగు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎక్కువగా తోటలు, కొబ్బరి నర్సరీలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో కొన్నేళ్ల క్రితం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ రెండు మండలాల్లో కొబ్బరి తోటలు అత్యధికంగా విస్తరించాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 1,358 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 586 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తోటలు సాగులో ఉండగా, తెలంగాణలో ఇప్పటివరకు కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు కాలేదు. ఫలితంగా సాగుదారులకు సేవలందక సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. బోర్డు లేని కారణంగా ఈ ప్రాంత రైతులకు రాయితీలు, ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు దక్కడం లేదని తెలుస్తోంది. మంత్రి తుమ్మల లేఖతో కదలిక? గతేడాది ఏప్రిల్లో కొబ్బరి అభివృద్ధిమండలి బోర్డు అధికారుల బృందం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించింది. ఈసందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు బోర్డు ఏర్పాటు విషయాన్ని ఉన్నతా ధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పా రు. కానీ ఆ తర్వాత ఈ అంశం మళ్లీ మరుగునపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మలకు వ్యవసాయ శాఖ దక్కడంతో బోర్డు ఏర్పాటు విషయాన్ని స్థానిక రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తుమ్మల తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయాలని లేఖ రాయడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. -
వరికి రూ. 500 బోనస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. -
వ్యవసాయానికి రూ.1.33 లక్షల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రుణ ప్రణాళికను ఖరారు చేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఇతర రంగాలు సహా మొత్తంగా రూ.2.80 లక్షల కోట్ల రుణాలకు పచ్చజెండా ఊపింది. ఇది గతేడాది రుణ ప్రణాళికతో పోలిస్తే రూ.94 వేల కోట్లు అదనం కావటం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రుణ ప్రణాళికతో కూడిన ఫోకస్ పేపర్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకే పెద్దపీట వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి భారీ చేయూతనే లభించే అవకాశం ఉంది. రూ.133587.86 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేయటం విశేషం. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికలో నాబార్డు ఖరారు చేసిన మొత్తం రూ.1,12,762 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరారైన వ్యవసాయ రుణాల్లో.. పంటల సాగు, మార్కెటింగ్ కోసం రూ.81,478.02 కోట్లు, టర్మ్లోన్ల కింద రూ.27,664.91 కోట్లు, వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.5197.26 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.19,247.67 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఖరారు చేసింది. ఈ రంగానికి రూ.1,29,635.83 కోట్ల వరకు రుణాల రూపంలో ఇవ్వవచ్చని బ్యాంకర్లకు సూచించింది. బ్యాంకర్లు మరింత సాయానికి ముందుకు రావాలి: తుమ్మల దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా బ్యాంకర్లు మరింత ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వ్యవసాయంపై ఫోకస్ చేస్తుండటాన్ని నాబార్డు, బ్యాంకర్లు గుర్తించాలని కోరారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సూచించారు. ఆ రంగంలో గేదెలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని, కానీ ఆవు పాల వృద్ధిని కోరుకుందామని, దీని వల్ల ఆరోగ్యంతోపాటు, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించినట్టవుతుందని మంత్రి తుమ్మల సూచించారు. పామాయిల్ సాగుకు కూడా మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. వరి సాగు విస్తృతంగా సాగుతోందని, కానీ సంప్రదాయ తృణ ధాన్యాల వృద్ధిపై రైతులు దృష్టిసారించాలని మంత్రి కోరారు. నాగార్జున గ్రామీణ బ్యాంకు రుణంతోనే నా తొలి నామినేషన్ తనకు వ్యవసాయం రంగం, అందుకు రుణాలిచ్చే గ్రామీణ బ్యాంకులతో మంచి అనుబంధం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను సాగు కోసం నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకునేవాడినని, 1983 తొలి నామినేషన్ కోసం కూడా ఆ బ్యాంకు నుంచే రుణం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు బంధు నిధులను పెంచుతాం: రఘునందన్రావు రాష్ట్రంలో ప్రతి రెండున్నర వేల మంది రైతులకు ఒకటి చొప్పున ఉన్న రైతు వేదికలను ఆధునికీకరించటం ద్వారా వాటి వినియోగాన్ని పెంచి రైతులకు మరింత ఉపయోగకరంగా మారుస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్రావు వెల్లడించారు. వాటిల్లో టూ వే ఆడియో విజువల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో క్రాప్ ఇన్స్రూెన్స్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతు భరోసా ద్వారా ప్రస్తుతం అందుతున్న రైతు బంధు నిధులను పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వీలైనన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు నాబార్డు తీవ్రంగా కృషి చేస్తోందని, వాటి అవసరాలకు తగ్గట్టుగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ సీజీఎం సుశీల చింతల పేర్కొన్నారు. ఆర్బీ డీజీఎం రాజేంద్రప్రసాద్, ఎస్బీఐ జీఎం, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. 2024–25 సంవత్సరానికి వివిధ రంగాలకు నాబార్డు ఖరారు చేసిన రుణ ప్రణాళిక వ్యవసాయం, అనుబంధ రంగాల రూ.133587.86 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ. 129635.83 కోట్లు ఎగుమతుల కోసం రుణాలు రూ. 451.67 కోట్లు విద్య రూ.2706.50 కోట్లు గృహనిర్మాణం రూ.10768.58 కోట్లు పునరుత్పాదక విద్యుత్తు రూ.566.61కోట్లు ఇతర రంగాలు రూ.2283.51 -
ప్రజలపై భారం మోపం
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్ 2024–25 ప్రతిపాదనల రూపకల్పనలో భాగంగా గురువారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోకలిసి వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత జౌళి, ఉద్యాన వన, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార /ప్రజాసంబంధాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, వాటితో వచ్చే ఆదాయా న్ని ప్రజలకు పంచడానికి కృషి చేయాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలు, గడువు ముగిసిన భూముల లీజుపై దృష్టి సారించాలన్నారు. అసైన్డ్ భూములపై నివేదిక ఇవ్వాలి.. గత ప్రభుత్వం ధరణిలో ‘కాస్తు’ కాలమ్ తొలగించడంతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, కొన్ని పట్టా భూములను పార్ట్–బీలో పెట్టి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేసేవారని, 2014 తర్వాత ఈ విధానానికి స్వస్తి పలకడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ధరణితో ప్రభుత్వ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. 2014 వరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూములను ఏ అవసరాల కోసం వాడారు.. వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న భూమి ఎంత? వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆపద్బంధు, పిడుగుపాటు మృతులకు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను గత ప్రభుత్వం అమలు చేయలేదని అధికారులు వివరించారు. కేంద్రం ఈ పదేళ్లలో రాష్ట్రంలో 1.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి మాత్రమే నిధులిచ్చిందని, 2023–24లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిందని మంత్రులకు తెలిపారు. 2024–25లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలను వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2లక్షల గాను 67 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని, నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని మంత్రులు ఆదేశించారు. బతుకమ్మ చీరలు, విద్యా ర్థుల యూనిఫామ్ల తయారీపై ఆరా తీశారు. ఈ సమీక్షలో ఆర్థిక, రెవెన్యూ(విపత్తు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అర్వింద్ కుమా ర్, నవీన్మిత్తల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 పామాయిల్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేలా అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ. 1,050 కోట్లతో ఈ పరిశ్రమలను స్థాపించనున్నారు. తర్వాత రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ. 4.07 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని తీర్చిదిద్దేందుకు అవసరమైన రెండో ఫైలుపై సంతకం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికలను తీర్చిదిద్దుతామన్నారు. సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా.. మంత్రి మూడో ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కలి్పస్తూ నియామక పత్రం అందజేశారు. తర్వాత అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పుతామన్నారు. పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్లవేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులకు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే అంతరపంటలతో అదనపు ఆదా యం లభిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తుమ్మల తెలిపారు. -
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో త్రిమూర్తులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా... ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఉమ్మడి జిల్లా రాజకీయ చరిత్రలో ముగ్గురికి అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తర్వాత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఆరో వరుసలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పదో వరుసలో తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో భట్టి, తుమ్మల దైవసాక్షిగా, పొంగులేటి పవిత్ర హృదయంతో ప్రమాణ స్వీకారం చేశారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం భట్టికి ఉన్నత పదవి అంతా అనుకున్నట్లే భట్టికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవి లభించింది. సీఎం పదవి కోసం భట్టి పోటీ పడినా.. చివరకు అధిష్టానం ఆయనను డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తపరిచింది. జలగం వెంగళరావు తర్వాత ఉమ్మడి జిల్లాకు దక్కిన అత్యున్నత పదవి ఇదే. రేవంత్రెడ్డి తర్వాత అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో ప్రస్తుతం భ ట్టి కీలక నేతగా వ్యవహరించనున్నారు. గత ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో భట్టి నేతృత్వాన ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయని అనుచర నేతలు పేర్కొంటున్నారు. వైఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన భట్టి 2009 నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ప్రజలకు శీనన్నగా.. మాజీ ఎంపీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అతి తక్కువ కాలంలోనే మాస్ లీడర్గా ఎదిగి.. రాజకీయాలను శాసించే స్థాయి పొందారు. తొలుత కాంట్రాక్టర్గా పనిచేసిన పొంగులేటి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో 2013 ఫిబ్రవరి 23న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పొంగులేటి అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆయనతోపాటు పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, పొత్తులో భాగంగా భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలుపునకు కృషి చేశారు. పాలేరు ఉప ఎన్నికల సమయాన 2016 మే 3న బీఆర్ఎస్లో చేరిన పొంగులేటి ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు. తిరుగుబాటు చేసి.. ఏడేళ్లపాటు బీఆర్ఎస్లో కొనసాగిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. కేంద్ర రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీలో తనకు సముచిత స్ధానం దక్కలేదనే కారణంతో ఈ ఏడాది జనవరి 1న పార్టీపై తిరుగుబాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుండడంతో ఆయనను ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. అనంతరం జూలైలో ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షాన కాంగ్రెస్లో చేరిన పొంగులేటిని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్గా నియమించింది. ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ పేరిట ప్రచారం నిర్వహించడమేకాక ఉమ్మడి జిల్లాలో గడపగడపకు కాంగ్రెస్ను తీసుకెళ్లారు. తొలిసా రి ఎమ్మెల్యేగా తాజా ఎన్నికల్లో పాలేరు నుంచి గెలి చిన ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు. సముచిత గౌరవం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంలో అంతా తామై వ్యవహరించిన ముగ్గురు నేతలకు సముచిత గౌరవం దక్కింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ సత్తా చాటినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్కు అధిక స్థానాలు దక్కాయి. ఈసారి కూడా మెజార్టీ స్థానాలు దక్కడంలో భట్టి, పొంగులేటి, తుమ్మల కృషి ఉంది. వీరు తమ నియోజకవర్గాలే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తూ నాయకులను సమన్వయపరిచారు. దీంతో కార్యకర్తలు, నేతలు ఒకతాటిపైకి చేరగా కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. దీంతో ఈ ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం దక్కగా.. హైదరాబాద్లో జరిగిన ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా నుంచి అనుచర నేతలు భారీగా తరలివెళ్లారు. మూడు ప్రభుత్వాల్లో మంత్రి జిల్లా రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల ప్రస్థానం కలిగిన నేత తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం, బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రివర్గంలోనూ స్థానం దక్కడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి. 1985, 1995, 1996, 1999, 2001 ఏడాదిలో టీడీపీ హయాంలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్అండ్బీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014లో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన సమయాన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2018లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్పై ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. -
తుమ్మల గెలుపుతో ఏపీ రాజకీయాల్లో మలుపా?
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొద్ది రోజుల క్రితం ఒక కీలక ప్రకటన చేశారు. ఖమ్మంలో తన గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మలుపు అవుతుందన్నారు. ఖమ్మం సరిహద్దు గ్రామాల నుంచి, ఖమ్మం నుంచి వచ్చిన టీడీపీ అభిమానుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు కూడా ఆయన ఖమ్మం టీడీపీ ఆఫీస్కు వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే ఇప్పుడు ఏకంగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించి తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. తనకు ఎన్టీ రామారావే మంత్రి పదవి ఇచ్చారని, కేసీఆర్కు కూడా తానే చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. కేసీఆర్ తనకు పదవి ఇచ్చేదేంటని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదంటూనే తాను చేసిన సేవల గురించి కూడా చెప్పుకొచ్చారు. తన మెడలో వేసుకున్న పచ్చ కండువాను చూపుతూ, దీనివల్లే తాను పైకి వచ్చానన్నారు. ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా ఫర్వాలేదు.. కానీ ఆయన గెలిస్తే ఏపీ రాజకీయాలపై ఎందుకు ప్రభావం పడుతుంది? అక్కడ ఎందుకు మలుపు వస్తుంది? అన్నదాని గురించి వివరించి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకుండా దూరంగా ఉంది. దాంతో ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తనదారి తాను చూసుకున్నారు. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కోసమే అలా చేశారని ఆయన రహస్యం చెప్పేశారు. దానిని నిజం చేస్తూ తుమ్మల మరికొందరు ప్రకటనలు చేయడం, టీడీపీ జెండాలు కూడా మెడలో వేసుకుని సభల్లో పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు, చంద్రబాబుకు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీవారు మద్దతు ఇస్తే స్వాగతిస్తామన్నారు. అలాగే చంద్రబాబును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్నిసార్లు పొగుడుతూ తన స్వామి భక్తి చూపుతున్నారు. కోదాడలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కూడా టీడీపీ జెండాలు కనిపించాయి. ఇలా ఆయా చోట్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీడీపీవారు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన ఓపెన్ గానే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. గతసారి కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేశారు. రాహుల్ గాం«దీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయినా జనం ఆదరించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గాలికి వదిలివేశారు. బీజేపీ కన్నెర్ర చేస్తుందని.. 2023 తెలంగాణ ఎన్నికల్లో కొత్త వ్యూహంతో ఎన్నికల్లో పోటీచేయకుండా చంద్రబాబు కాంగ్రెస్కు పరోక్షంగా సహకరిస్తున్నారు. నేరుగా కాంగ్రెస్కు అండగా ఉన్నానని చెబితే బీజేపీ ఎక్కడ కన్నెర్ర చేస్తుందో అన్న భయం కావచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే తనకు ప్రయోజనం ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ చక్రం తిప్పి, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నది ఆయన ఆలోచన అని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు తన మిత్రుడో లేక వైసీపీ నేతలు విమర్శిస్తున్నట్లు ఆయన దత్తపుత్రుడో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. అంటే అటు బీజేపీతో కూడా రాయబారం జరపడానికి ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఈ విన్యాసాలు ఎన్ని చేసినా ఆయన ఇష్టం. కానీ తుమ్మల చేసిన ప్రకటనను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక, ఏపీలో టీడీపీకి ఉపయోగపడతామని చెబుతున్నట్లు అనుకోవాలా? రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల టీడీపీలో ఓడిపోయి రాజకీయంగా వెనుకబడితే కేసీఆర్ ఆయనను దగ్గరకు తీసి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు అభ్యర్థిని చేసి గెలిపించారు. కానీ సాధారణ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఆయన హవా తగ్గింది. దాంతో ఆయన అసంతృప్తి చెంది కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. నాడు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తి... తుమ్మల పదవులపై ఆసక్తి లేదంటూనే తనను ఆదరించిన బీఆర్ఎస్ను కాదని ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒకటి తప్ప అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. దానిని కూడా దృష్టిలో ఉంచుకునే తుమ్మల కాంగ్రెస్లోకి జంప్ చేసి ఉండాలి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 2018 ఎన్నికల సమయంలో తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసినప్పుడు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించిన వీడియో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కేసీఆర్ తెలంగాణను పచ్చని బంగారు రాష్ట్రంగా మార్చారంటూ గంభీరంగా ప్రసంగించారు. ఇప్పుడు అదే తుమ్మల కేసీఆర్ పాలన అంత దరిద్రపు పాలన చూడలేదని అంటున్నారు. అంతేకాదు, 2018లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, జనసమితి పార్టీల కూటమిని మాయ కూటమిగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రత్యేకించి ఖమ్మం అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీగా టీడీపీని, అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును విమర్శిస్తూ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీలను అన్యాయంగా లాక్కున్న పార్టీ టీడీపీ అని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 30 లేఖలు రాసిన సీఎం చంద్రబాబు అని ఆ రోజున ఆరోపించారు. ఈ రోజేమో టీడీపీ వల్లే తాను అది సాధించాను.. ఇది సాధించాను అంటూ స్పీచ్లు ఇస్తున్నారు. అదేదో చెప్పుకుంటే సరే అనుకుంటే, ఇప్పుడు ఏకంగా తన గెలుపు ఏపీ రాజకీయాలకు మలుపు అవుతుందని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని తామంతా కలిసి ఇబ్బంది పెడతామని చెబుతున్నారా? గతంలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కుట్ర చేసి ఆయనను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబుతో కలిసి అందలం ఎక్కిన అనుభవాన్ని గుర్తు చేసుకుని అలా ఏపీలో మళ్లీ చేయాలని ఆలోచిస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో, రాదో తెలియక ముందే తుమ్మల వంటి సీనియర్లు ఇలా మాట్లాడితే ఎలా విశ్లేషించాలి? కాంగ్రెస్లో చేరిన మాజీ టీడీపీ నేతలు వ్యూహాత్మకంగానే చంద్రబాబుతో సంబంధాలు కొనసాగిస్తూ, భవిష్యత్తు ఏపీ ఎన్నికల్లో ఆయనకు సహకరించాలని, అక్కడి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. టీడీపీ అప్పట్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. ఎన్టీఆర్ తన అల్లుడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి రాగానే, కొన్ని బాధ్యతలు అప్పగించి చివరికి ఆయన తన కొంప తానే ముంచుకున్నారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడితే... కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్ అంటేనే తుమ్మలకు పడేది కాదు. వారితో ఖమ్మం జిల్లాలో అనేక రాజకీయ పోరాటాలు చేశారు. చివరికి తానే కాంగ్రెస్లో చేరిపోయారు. ఆయన తన సొంత రాజకీయం కోసం ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో కూడా వేలుపెడతామని చెబితే ఆయనకే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. పైగా చంద్రబాబుతో కాంగ్రెస్ కుమ్మక్కయిన సంగతి ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల అంతిమంగా కాంగ్రెస్కు నష్టం జరుగుతుందో, లాభం జరుగుతుందో కానీ, ఇప్పటికైతే తుమ్మల చేసిన ప్రకటన ద్వారా వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని తెలియచేసింది. ఎన్టీఆర్ మాదిరి జగన్ అమాయకపు రాజకీయ నేత కాదు. ఆయన ఇప్పటికే అనేక డక్కాముక్కీలు తిన్న నేత. చంద్రబాబు వేసిన అనేక కుట్రలను ఛేదించిన నాయకుడు. తిరుగులేని ఆధిక్యంతో 151 సీట్లను గెలిచి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చిన శూరుడు. చంద్రబాబో, తుమ్మలో, మరొకరో వేసే ఎత్తుగడలను జగన్ తేలికగానే తిప్పికొట్టగలరని వేరే చెప్పనవసరం లేదు. - కొమ్మినేని శ్రీనివాసరావు -
తెలంగాణలో ధర్మానికి అధర్మానికి ఎన్నికలు జరుగుతున్నాయి: అజయ్
-
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఇంట్లో పోలీసులు సోదాలు
-
తుమ్మలపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
-
తుమ్మలపై పువ్వాడ అజయ్ హాట్ కామెంట్స్
-
తుమ్మల వర్సెస్ పువ్వాడ..
వారంతా సీనియర్ నాయకులే. అనేక యుద్ధముల ఆరితేరినవారే. పలుసార్లు విజయం సాధించినవారే. ఇప్పుడందరికీ తాజా ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఓడితే వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలకు తాజా ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయనే చెప్పాలి. ఓడినవారికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కీలక నేతలకు ఈ ఎన్నికలు రాజకీయంగా డూ ఆర్ డై అనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో తుమ్మల పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి తన 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశ్యంతో గెలుపే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి ప్రచారంకు వెళ్లుతున్నారు తుమ్మల. ఇక జిల్లాలో మరో కీలక నేత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీఆర్ఎస్ నుంచి ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగారు. మూడవసారి గెలిచి ఖమ్మం గడ్డపై హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అంతేకాదు తనకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చని..ఈసారి గెలిస్తే మిగిలిపోయిన అభివృద్ది ఏమైనా ఉంటే పూర్తి చేస్తానని ఈ ఒక్కసారి తనను ఆశీర్వాదించాలని ఖమ్మం ప్రజలను కోరుతున్నారు. లోకల్ ఫీలింగ్ తీసుకు వస్తూ ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పొటీ చేసి ఓడిపోయి.. పక్క నియోజకవర్గంకు వెళ్ళి అక్కడా ఓడిపోయిన నేత ఇప్పుడు మళ్ళీ ఖమ్మం వచ్చారంటూ తుమ్మల నాగేశ్వరరావు పేరెత్తకుండా సెటైర్లు వేస్తున్నారు పువ్వాడ అజయ్. ఖమ్మం ప్రజలు విజ్ణతతో ఆలోచించాలని కోరుతున్నారు మంత్రి అజయ్ కుమార్. ఖమ్మం నియోజకవర్గంలో 2 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులు చేశానని చెప్పుకుంటున్నారు. ఖమ్మం నియోజకవర్గం అటు తుమ్మలకు..ఇటు పువ్వాడకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారయని చెప్పాలి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. మొదటి సారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి..పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉండటంతో..పాలేరు నియోజకవర్గంలో విజయం కోసం తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. పొంగులేటికి తోడుగా ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడ పాలేరు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్లుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కందాల ఉపేందర్రెడ్డి తర్వాత గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కందాల బీఆర్ఎస్ తరపున పాలేరు బరిలో దిగారు. 2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెంది...ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు..ఇప్పటికే మొదటి విడత ప్రచారం సైతం పూర్తి చేశారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో సీనియర్ నేత, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేస్లో ఉండే నేత భట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మధిర నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచిన విక్రమార్క నాలుగోసారి గెలవడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నారు. కాని భారీ మెజారిటీ సాధించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. భట్టి విక్కమార్కకు గతంలో చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు మధిరలో భట్టిపై పోటీ చేసి ఇప్పటికి మూడుసార్లు ఓడిపోయిన ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కు ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయి. మూడు సార్లు ఓడినా గులాబీ బాస్ నాలుగోసారి టిక్కెట్ ఇచ్చారు. ఈసారి కూడా కమల్ రాజ్ ఓడితే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అవుతుంది. అందుకే లింగాల కనకరాజ్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగోసారైనా గెలిపించండని ప్రజల్ని ప్రాధేయపడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు సీనియర్ నేతలకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయని చెప్పాలి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల్లోని ఆ నేతలు గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. -
‘నేను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుంది’
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం పోటీ చేయమన్న చోట నుంచే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని కలిసిన అనంతరం మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు తుమ్మల. కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే పోటీ చేస్తా . పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నాను. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని రాహుల్ గాంధీ కోరారు’ అని తెలిపారు. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
కాంగ్రెస్కు 78 సీట్లు ఖాయం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పదితో పాటు రాష్ట్రంలో 74 నుంచి 78 సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన బీఆర్ఎస్ ఒక వైపు, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న కాంగ్రెస్ ఒక వైపు ఎన్నికల బరిలో ఉన్నాయని ఆయన అన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరాక తొలిసారిగా సోమవారం ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగగా.. తుమ్మలకు భట్టితో పాటు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం ఆగమాగం న్యాయం, ధర్మంతో పాటు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు. విజయభేరి సభలో ప్రకటించినట్లుగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్యారంటీ కార్డులో చెప్పినవన్నీ అమలు చేస్తామని అన్నారు. చేవెళ్ల, వరంగల్ డిక్లరేషన్లు, రుణమాఫీ వంటి హామీలు కూడా మేనిఫెస్టోలో చేర్చనున్నామని తెలిపారు. ప్రతి మండలంలో 15 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ పాఠశాలలు నిర్మిస్తామని చెప్పారు. కాంగ్రెస్ సభలు, సమావేశాలు, పార్టీ గాలి చూసి కల్వ కుంట్ల కుటుంబం ఆగమాగం అవుతోందని ఎద్దేవా చేశారు. మళ్లీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. పొంగులేటి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. సమావేశంలో తుమ్మలతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓడినా కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నుంచి పోటీ చేసి తనపై ఓడిపోయిన వ్యక్తికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారని, ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ కష్టపడి గెలిపించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తాను తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదని గుర్తు చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఒకసారి ఖమ్మం, మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచన తనది కాదని, తాను ఖమ్మం నుంచే పోటీ చేస్తానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తనతో పాటు ఖమ్మం ఎంపీగా, లోక్సభా పక్ష నాయకులుగా నామా నాగేశ్వరరావుకు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా కొండబాల కోటేశ్వరరావుకు, ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజకు.. ఇలా ఒకే సామాజికవర్గానికి చెందిన పలువురికి పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. తమకు ఎవరు మేలు చేశారో ఈ సామాజికవర్గం వారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్లోకి తుమ్మల
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. పాలేరు టికెట్ విషయంలో తుమ్మలకు భరోసా లభించినట్లు సమాచారం. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. ‘తుమ్మలన్న రా.. కదిలిరా.. జనమంతా ప్రభంజనంలా నీ వెంటే’ అంటూ ఖమ్మం నగరంలో ఫ్లెక్సీ వెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్లోకి రావాలని తుమ్మల నాగేశ్వరావును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగులేటి తాజా పరిణామాలపై చర్చించారు. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. అదీ.. బీఆర్ఎస్ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు ఇవాళ తుమ్మలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. చదవండి: ‘జమిలి’తో మరింత జోష్! -
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే రాజకీయాలకు గుడ్బై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల విడుదలను కళ్లారా చూశాకే రాజకీయాల నుంచి విరమిస్తానని... ఆ కోరిక నెరవేర్చుకునేందుకే ఎన్నికల్లో నిలబడుతున్నానని , ప్రజల కోరిక మేరకే నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి తుమ్మలను ఖమ్మంలోని ఆయన స్వగృహంలో కలిశారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ హోదాలో పొంగులేటి తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారన్నారు. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక అధికారికంగా నీళ్లు వదిలి అదే వేదికపై అందరికీ ధన్యవాదాలు తెలిపి రాజకీయాల నుంచి విరమించాలనేది తన జీవిత కోరిక అని వ్యాఖ్యానించారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పతనం మొదలైంది: శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి, రెండు శాతం ఓట్లు కూడా లేని సమయాన కేసీఆర్ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరి జిల్లాను అభివృద్ధి పథాన నడిపించారని చెప్పారు. అయితే, బీఆర్ఎస్లో కొన్ని శక్తులు ఆయ న్ను అవమానాలు, అవహేళనలకు గురిచేసి బయటకు వెళ్లేలా చేశాయన్నారు. కాంగ్రెస్ పక్షాన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్లోకి రండి
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆయన్ను పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్రెడ్డి ఆహ్వానించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని తుమ్మల నివాసానికి రేవంత్తోపాటు కాంగ్రెస్ నేతలు సుదర్శన్రెడ్డి, మల్లు రవి వెళ్లారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సీఎం కేసీఆర్ వ్యవహారశైలి, ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తుమ్మలతో రేవంత్ బృందం చర్చించింది. ఖమ్మం జిల్లా రాజకీ య సమీకరణాల్లో భాగంగా పార్టీలోకి రావాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. రేవంత్ ఆహా్వనం నేపథ్యంలో తుమ్మల సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఆయన ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్లోకి వస్తారని చెబుతున్నారు. కాగా, తుమ్మల ఈసారి ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పాలేరులో పోటీ సాధ్యం కాకుంటే ఖమ్మం అసెంబ్లీ నుంచి ఆయన బరిలో ఉంటారని, తుమ్మల ఎక్కడి నుంచి పోటీ చేసినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు కొత్త బలం వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా నేతలను దూరం పెట్టడంపై విమర్శలు... తుమ్మలతో భేటీకి పార్టీ ఖమ్మం జిల్లా నేతలను రేవంత్ దూరం పెట్టడం కాంగ్రెస్లో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బదులు నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్రెడ్డి, పాలమూరుకు చెందిన మల్లు రవిని తీసుకెళ్లి తుమ్మలను పార్టీలోకి ఆహా్వనించడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజల ఆత్మగౌరవం..అవసరం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా.. మీ అండ, బలగం ఉన్నంత కాలం దేనికీ తలవంచను.. నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉంది.’అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ ఇటీవల అసెంబ్లీ టికెట్ల జాబితా ప్రకటించగా, తుమ్మలకు స్థానం దక్కలేదు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆయన శుక్రవారం తొలిసారి జిల్లాకు వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల అనుచరులు వెయ్యికి పైగా కార్లు, ఇతర వాహనాల్లో వచ్చినాయకన్గూడెం వద్ద తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఖమ్మంలోని గొల్లగూడెంలో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు పదవి అలంకారం, అహంకారం, ఆధిపత్యం కోసం కాదని ప్రజల కళ్లలో చిరునవ్వు చూడటం కోసమేనని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా గోదావరి జలాలతో జిల్లా ప్రజల కాళ్లు కడిగి రాజకీయాల నుంచి విరమిస్తానని సీఎం కేసీఆర్కు చెప్పానని, అది నెరవేరాకే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. ప్రస్తు తం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా.. ప్రజల ఆరాటం, అభిమానం చూశాక తనకు అవసరం లేకపోయినా.. జిల్లా కోసం, ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పాలేరు, వైరా, లంకాసాగర్, ఉభయ జిల్లాల్లోని రిజర్వాయర్లను నింపి రాజకీ యాల నుంచి విరమిస్తానని తుమ్మల వెల్లడించారు. తుమ్మల ఫొటోతో ప్రత్యేక జెండాలు ర్యాలీలో ప్రతీ వాహనానికి ప్రత్యేకంగా తుమ్మల ఫొటో ఉన్న తెల్లరంగు జెండాలు కట్టారు. ఎక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కానీ బీఆర్ఎస్ జెండాలు కానీ కనిపించలేదు. కొందరు తుమ్మల ఫొటో ఉన్న జెండాలతో పాటు కాంగ్రెస్ జెండాలు కూడా పట్టుకోవడం కనిపించింది. -
ఆరని అసమ్మతి 'జ్వాల'
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఇతర పార్టీల కంటే ముందే ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. ఒకరొకరుగా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. తమ అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొందరు అసంతృప్తులు రహస్య భేటీలతో పార్టీ, అభ్యర్థులపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకొందరు పార్టీలో ఉంటామంటూనే అభ్యర్థులను మాత్రం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ దక్కించుకున్న నేతలతో సయోధ్య కుదుర్చుకునేందుకు అసమ్మతి నేతలు ససేమిరా అంటుండటం చర్చనీయాంశంగా మారుతోంది. బీఆర్ఎస్ జెండా లేకుండా భారీ ర్యాలీగా పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాయబారానికి మెత్తబడిన సూచనలు కనిపించడం లేదు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్రావు రెండు రోజుల క్రితం తుమ్మలను కలసి కేసీఆర్ సందేశాన్ని అందించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన తుమ్మలకు.. ఆయన అనుచరులు జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద భారీ స్థాయిలో స్వాగతం పలికారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించలేదు. తాను ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయకూడదనుకున్నా.. ప్రజల స్పందన చూసి మనసు మార్చుకుంటున్నట్టు తుమ్మల ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరేదీ వెల్లడించలేదు. నేడు అనుచరులతో మైనంపల్లి భేటీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శనివారం హైదరాబాద్ శివార్లలోని దూలపల్లిలో ఉన్న తన నివాసంలో అనుచరులతో భేటీ అవుతున్నట్టు ప్రకటించారు. తన కుమారుడు రోహిత్కు మెదక్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంపై ఆగ్రహించిన మైనంపల్లి.. మంత్రి హరీశ్రావుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కఠిన చర్యలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. కేసీఆర్ ఏ తరహా నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలలేదు. మరోవైపు మైనంపల్లి పార్టీని వీడే పక్షంలో ప్రత్యామ్నాయంగా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మర్రి రాజశేఖర్రెడ్డి, ఆకుల రాజేందర్ తదితరుల పేర్లు బీఆర్ఎస్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ప్రగతి భవన్కు నేతల క్యూ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రగతిభవన్కు క్యూకట్టారు. జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. వేములవాడ టికెట్ను వేరేవారికి ప్రకటించిన నేపథ్యంలో చెన్నమనేని రమేశ్కు మరో రూపంలో అవకాశమిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రమేశ్ను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ రంగ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమిస్తున్నట్టుగా ప్రకటన వెలువడింది. అనంతరం రమేశ్ నివాసానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ వెళ్లి మాట్లాడారు. ► ఇక టికెట్ల కేటాయింపులో జనగామ, నర్సాపూర్లలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి శుక్రవారం మరోమారు ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను కలిశారు. ► మరోవైపు బెల్లంపల్లి టికెట్ను తిరిగి దక్కించుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం అకస్మాత్తుగా తన కార్యకలాపాలను రద్దు చేసుకుని ప్రగతిభవన్కు రావడం చర్చనీయాంశమైంది. ► టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి నేత నల్ల మనోహర్రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ను వీడుతున్నట్టు ప్రకటించారు. కోదాడ అసమ్మతి నేతలు శుక్రవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ► రామగుండం, ఎల్బీనగర్, నాగార్జునసాగర్, పటాన్చెరు, మధిర, దేవరకొండ తదితర నియోజకవర్గాల్లోనూ అసమ్మతి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంకా పార్టీ నేతలకు అందుబాటులోకి రావడం లేదని సమాచారం. -
ఖమ్మం పాలిటిక్స్లో కలకలం
నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది? ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసు. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నాం. కానీ పార్టీలో దక్కిన గౌరవం ఏమిటి? భవిష్యత్లో జరగబోతున్నది ఏమిటి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు నా టీం సిద్ధంగా ఉంది.. – మాజీ ఎంపీ పొంగులేటి గతంలో నన్ను దెబ్బకొట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బుతోనే అన్నీ సాధ్యం కావు. క్యారెక్టర్, గుణం అవసరం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరం.. – మంత్రి పువ్వాడ అజయ్ నా రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశాను. ఉమ్మడి జిల్లాకు నేనేం చేశానో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశానో అందరికీ తెలుసు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పాలేరు నుంచే పోటీ చేస్తా. నా వెంట నిలిచేవారికి అండగా ఉంటా.. – మాజీ మంత్రి తుమ్మల ..ఒకరు మాజీ ఎంపీ, మరొకరు మంత్రి, ఇంకొకరు మాజీ మంత్రి.. ముగ్గురూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలే.. జిల్లాలో అనుచరులు, అభిమానగణం ఉన్నవారే.. పార్టీలో, ప్రభుత్వంలో తమకు దక్కుతున్న ప్రాధాన్యంపై అసంతృప్తితో ఉన్నవారు ఇద్దరు, ఆ అసంతృప్తిని దీటుగా ఎదుర్కొని నిలబడాలన్న ఆలోచనతో ఉన్నవారు మరొకరు.. మొత్తానికి ఆధిపత్యం కోసమో, రాజకీయ భవిష్యత్తు కోసమో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ కార్యచరణకు పదును పెట్టుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలు వేదికగా అనుచరులతో సమావేశాలు పెట్టి బల ప్రదర్శన చేసుకున్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం మయూరి సెంటర్ తుమ్మల.. ఎన్నికల రిహార్సల్! మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నూతన సంవత్సర వేడుకల పేరిట ఖమ్మం రూరల్ మండలంలో తన అనుచరగణం, కేడర్తో ఆత్మీయ సమ్మేళనంనిర్వహించారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన తుమ్మల.. ఈ కార్యక్రమంలో మరోసారి స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశానని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు ఏమేం చేశారో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశారో వివరించారు. అయితే ఈ కార్యక్రమం వచ్చే ఎన్నికలకు రిహార్సల్గా, బల ప్రదర్శనగా చెప్పవచ్చని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల పాలేరు నియోజకవర్గంలో స్పీడ్ పెంచారని అంటున్నారు. నన్ను దెబ్బతీసే ప్రయత్నాలు ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గతంలో తనను దెబ్బకొట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని, రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఆయన ఆదివారం ఖమ్మంలో ‘వాడవాడ పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తనపై నేరుగా ఆరోపణలు చేయలేక కార్పొరేటర్లను తులనాడి, వారిపై విషప్రచారం చేసి తనకు నష్టం చేయాలని చూశారని పువ్వాడ ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. డబ్బుతోనే అన్నీ సాధ్యం కాదని, క్యారెక్టర్, గుణం అవసరమని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరమని.. ఆ విలువలకు కట్టుబడి ప్రజల అవసరాలు తీరుస్తూ ఎవరి దగ్గరా ఏమీ ఆశించకుండా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందుకుపోతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నా టీమ్ పోటీ చేస్తుంది బీఆర్ఎస్లో జరిగిన గౌరవం ఏమిటో ఆలోచించాల్సి ఉంది: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కీలకనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి పొంగులేటి అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది, తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ రోజు బీఆర్ఎస్లో ఉన్నామని, కానీ ఆ పార్టీలో జరిగిన గౌరవమేంటి? భవిష్యత్లో జరగబోతున్న గౌరవం ఏమిటనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రేమ, అభిమానాలు పొందిన, పొందుతున్న ప్రతీ నాయకుడు ప్రజాప్రతినిధి కావాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శీనన్న (తన) టీమ్ అంతా సిద్ధంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. ఎంపీగా గెలిచి.. బీఆర్ఎస్లో చేరి.. వైఎస్సార్సీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులు, అభిమానులను సంపాదించుకున్నారు. 2014లో ఎంపీగా గెలిచారు. వైరా, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. కానీ తర్వాతి రాజకీయ పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరారు. ఈ క్రమంలో రాజకీయ జీవితం కొంత ఒడిదుడుకులకు లోనైంది. సిట్టింగ్ అయిన ఆయనను కాదని.. నామా నాగేశ్వరరావుకు గులాబీ పార్టీ టికెట్ దక్కింది. ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని పొంగులేటి ఆశించినా ఫలితం రాలేదు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన పువ్వాడ అజయ్కు ప్రాధాన్యం దక్కడం, తుమ్మల నాగేశ్వర్రావు తిరిగి పట్టుపెంచుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. -
Telangana: టికెట్ లేకపోతే పార్టీలో ఎందుకుండాలి?
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకే టికెట్లని గులాబీ దళపతి కేసిఆర్ ప్రకటించేశారు. మరోవైపు పాలేరులో ఎర్ర జెండా ఎగరేస్తామంటున్నారు తమ్మినేని వీరభద్రం. మరి పాలేరు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంగతేంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతోంది? టిక్కెట్ దక్కే చాన్స్ లేని తుమ్మల ఖీఖ లోనే ఉంటారా? పార్టీ మారుతారా? తుమ్మల ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? కారులో కష్టంగా ప్రయాణం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు కారులో ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నారు. పార్టీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే పార్టీలో తుమ్మల ఒంటరి అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సత్తుపల్లిలో జరిగిన ఎంపీ సన్మాన సభకు పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని అందుకే హజరుకాలేదని తుమ్మల ఓపెన్ గానే చెప్పారు. పిలవకుండా వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఈ ఘటనతోనే అర్థమవుతోంది, ఖమ్మం టిఆర్ఎస్ లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో? ఆ సభకు తుమ్మలను పిలవకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పొమ్మనలేక పొగబెడుతున్నారా? ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఒత్తిడితోనే తుమ్మలను పిలవలేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఇన్ని అవమానాల మధ్య పార్టీలో ఉండటం కష్టమని తుమ్మల అనుచరులు అంటున్నారు. ఇంకా నాన్చకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని తుమ్మలకు చెప్పారట. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గాని పాలేరు పరిధిలో గాని జనవరి మాసంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో తుమ్మల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆఖరులోగా ఈ సభపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టిఆర్ఎస్ లో కొనసాగాలా వద్దా అన్న దానిపై సభలోనే స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్లకే సీట్లంటే ఎసరొచ్చినట్టేనా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడినప్పటినుంచీ కారులో తుమ్మల పొలిటికల్ జర్నీ ఇబ్బందికరంగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. గత రెండేళ్ల నుంచి పాలేరులో జరిగే టిఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తుమ్మలకు ఆహ్వనాలు అందడంలేదు. ఏదో పార్టీలో ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటివల ప్రకటించిన నేపథ్యంలో.. టిక్కెట్పై ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. అయితే టిఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పోత్తులు దాదాపు ఖారారు అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు సీపీఎంకి కేటాయించాల్సి ఉంటుంది. మేం పోటీ చేస్తామంటున్న కామ్రేడ్స్ పాలేరులో ఎర్ర జెండా ఎగరవేస్తామని అక్కడ పోటీ చేద్దామనుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే చెప్పారు. ఇన్ని వ్యవహారాల మధ్య ఇక పార్టీలో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని తుమ్మల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వాజేడులో జరిగిన ఆత్మీయ సభ వరకు ఉన్న ఈక్వేషన్స్..సత్తుపల్లిలో జరిగిన టిఆర్ఎస్ సభ తర్వాతి పరిస్థితులకు చాలా తేడా వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ వర్గాలు మాత్రం తుమ్మల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్ లో ఉన్నారని.. ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం ఉన్నందునే.. పార్టీ పక్కన పెట్టిందంటూ ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. సత్తుపల్లి సభకు తుమ్మలను పిలకపోవడం కూడ ఇందులో బాగామేనన్న వాదన కూడా వినిపిస్తుంది. తుమ్మల విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతోంది గనుక..ఇక తుమ్మల కూడా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొలిటకల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
- నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
- Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
Advertisement