యాపిల్‌కి షాకిచ్చిన కోర్టు.. వందల కోట్లు చెల్లించేలా | Apple Agrees To Pay $25 Million Fine For US Over Hiring Of Immigrants - Sakshi
Sakshi News home page

ఉద్యోగుల నియామకంలో వివక్ష, యాపిల్‌కి షాకిచ్చిన కోర్టు.. వందల కోట్లు చెల్లించేలా

Published Mon, Nov 13 2023 12:16 PM

Apple Agrees To 25 Million Fine For Us Court - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. అమెరికా న్యాయం స్థానంలో కొనసాగుతున్న ఓ కేసుకు సంబంధించి రూ.208 కోట్లుకు పైగా చెల్లించేందుకు అంగీకరించింది. 

యాపిల్‌ సంస్థలోని పలు విభాగాల్లో ఉద్యగ అవకాశాల్ని అమెరికా పౌరులు, గ్రీన్‌ కార్డ్‌ దారుల కంటే వలసదారులకు అనుకూలంగా ఉండటం ద్వారా కంపెనీ ఫెడరల్‌ చట్టాల్ని ఉల్లంఘించిందనే ఆరోపణల్ని పరిష్కరించి, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌ ఎదుట 25 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. 

గ్రీన్ కార్డులు, అమెరికా వచ్చే వలసదారులకు స్పాన్సర్ చేయడానికి సంస్థలకు అనుమతించే ఫెడరల్ కార్యక్రమం కింద అర్హులైన ఉద్యోగాల కోసం అమెరికన్ పౌరులు, గ్రీన్‌ కార్డ్‌ వీసా దారుల్ని నియమించుకోవడంలో విఫలమైంది. తద్వారా పౌరసత్వం ఆధారంగా వివక్షను నిషేధించే చట్టాలను ఉల్లంఘిస్తుందని న్యాయ శాఖ గత వారం ఒక ప్రకటనలో తెలిపింది.

స్థానికంగా ఉన్న అమెరికన్‌ కంపెనీలు హెచ్1బీ, ఎల్1,ఎల్‌1 వీసా వంటి యూఎస్‌ వర్క్ వీసా దారుల్ని ఉద్యోగంలో నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ అన్నీ సంస్థలు అలా చేయడం లేదు. నిబంధల్ని ఉల్లంఘించి విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.  

దీనిపై అమెరికా న్యాయ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వం ఆధారంగా వివక్షకు సంబంధించిన కేసుల్లో న్యాయశాఖ గతంలో ఎన్నడూ లేనంతగా సంస్థల నుంచి నష్టపరిహారం చెల్లించేలా సంస్థల్ని పట్టుబట్టింది. నిబంధనల ప్రకారం యాపిల్ 6.75 మిలియన్ డాలర్లను సివిల్ పెనాల్టీల రూపంలో చెల్లించాలని, 18.25 మిలియన్ డాలర్లను బాధిత కార్మికులకు కేటాయించాలని పేర్కొంది.

ఈ ఆరోపణలపై స్పందించిన యాపిల్ తాము అనుకోకుండా డీఓజే ప్రమాణాలను పాటించలేదని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ తన నిబద్ధతను వ్యక్తం చేస్తూ నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. 

Advertisement
Advertisement