టాటా రాకతో ఆ కంపెనీ దశ తిరిగింది! | Sakshi
Sakshi News home page

టాటా రాకతో ఆ కంపెనీ దశ తిరిగింది!

Published Tue, Dec 26 2023 3:10 PM

How Rs 12100 crore deal by Ratan Tatas company revived ailing government firm - Sakshi

కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ యాజమాన్యంలో నష్టాలబాటలో పయనించిన 'నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' (NINL), టాటాల చేతికి చిక్కడంతో అభివృద్ధి బాటలో పరుగులు తీస్తూ.. నేడు వేలకోట్లు ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సుమారు 2500 ఎకరాల ప్రాంగణంలో విస్తరించిన కంపెనీ ఒకప్పుడు పాములు, తేళ్లకు నిలయంగా మారి యంత్రాలన్నీ తుప్పు పట్టిన దశలో ఉన్న కంపెనీని.. రూ.12100 కోట్ల చెల్లింపుతో 2022 జులై 04న టాటా స్టీల్ ఒడిశాకు చెందిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL) కొనుగోలు చేసింది.

'ఎన్ఐఎన్ఎల్' టాటా చేతిలో పడ్డ కేవలం 90 రోజుల్లోనే తిరిగి ప్రారంభమైందని.. కంపెనీ ఎండీ అండ్ సీఈఓ 'సుధీర్ కుమార్ మెహతా' వెల్లడించారు. అంతే కాకుండా.. అప్పులతో సతమవుతున్న కంపెనీ లాభాల బాట పట్టి ఇప్పుడు ఆర్థికంగా మంచి పనితీరు కనబరుస్తోందని తెలిపారు.

అప్పులతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీ గత ఏడాది నుంచి ఇప్పటికే రూ.4600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. ఆగస్ట్‌లో టేక్ ఓవర్ అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులందరికీ మొత్తం జీతం చెల్లించినట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: స్టార్టప్‌లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే..

ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 120 కి.మీ దూరంలో ఉన్న కళింగనగర్‌లోని NINL సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న పెద్ద కంపెనీ. నిధుల కొరతతో సహా వివిధ కారణాలతో ఈ ప్లాంట్ సుమారు మూడేళ్లపాటు మూతపడింది. ఆ తరువాత టాటా గ్రూపు చేజిక్కించుకుని 2024 అక్టోబర్ 24న మొదటి బిల్లెట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ ఆశించిన స్థాయికంటే కూడా బాగా లాభాలను ఆర్జిస్తోందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement