పొలిమేర సినిమాలో ఉన్న గుడి ఎక్కడ ఉంది..? అసలు చరిత్ర ఇదే! | Sakshi
Sakshi News home page

పొలిమేర సినిమాలో ఉన్న గుడి ఎక్కడ ఉంది..? అందులో నిధులున్నాయా?

Published Mon, Nov 13 2023 11:20 AM

Maa Oori Polimera 2 Movie Temple Original History - Sakshi

‘మా ఊరి పొలిమేర’కు కొనసాగింపుగా పొలిమేర-2 విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. పార్ట్‌-1లో మర్డర్‌ మిస్టరీకి చేతబడి అంశాన్ని జత చేసి అనిల్‌ విశ్వనాథ్‌ తెరకెక్కించిన సినిమా ఇది. పార్ట్‌-2లో అన్నీ రివీల్‌ చేస్తాడు దర్శకుడు.  జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి.. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి.. లింక్‌ ఉందని.. అక్కడ నిధులు ఉన్నాయని కొమిరి చేసే క్షుద్రపూజల వల్ల వాటిని సొంతం చేసుకోవచ్చని ఇలా ఒక చక్కట కథాంశంతో దర్శకుడు చూపించాడు. సినిమాలో భాగంగా ఆ గుడి జాస్తిపల్లిలో ఉంది అని చెప్పారు.. కానీ  గుడి ఉండేది ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఉంది.

మాధవరాయ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో గండికోట కోటలో ఉన్న 16వ శతాబ్దపు హిందూ దేవాలయం . అప్పట్లో  కృష్ణుడి ప్రతిమ ఉండేది. దీనిని మాధవ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. ఈ గుడిలో రాధేశ్యామ్‌,సైరా నరసింహారెడ్డి, ఇండియన్‌-2,మర్యాద రామన్న వంటి చిత్రాలు ఇక్కడ షూటింగ్‌ జరిగాయి.

గుడి చరిత్ర
ఆలయంలోని కళ, నిర్మాణ లక్షణాల విశ్లేషణ ఆధారంగా చూస్తే దీనిని 16 వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లు సూచిస్తుంది. ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దపు శాసనాలలో కనుగొనబడింది. గండికోటలో విజయనగర కాలం నాటి రాజులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దపు శాసనాలు ఆ గుడిలో కనుగొనబడ్డాయి. పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ (లార్డ్ కృష్ణుడు) దేవుడికి నమస్కరించి, దేవుడికి మాల ( తోమాల ) సమర్పించారని వీటిలో పేర్కొంది.

ఆ గుడిలో నిధులు ఉన్నాయా..?
మహ్మదీయుల దాడుల వల్ల ఈ గుడి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ గుడిలో దేవుడి విగ్రహం లేదు. ఊరికి దూరంగా ఉండటం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఛాన్స్‌ ఉందని గుడికి లాక్‌ చేసి ఉంచుతారు. టూరిస్ట్‌లు వెళ్లిన సమయంలో గేట్లు తెరుస్తారు. స్థానికులు చెబుతున్న ప్రకారం ఆ గుడిలో ఎలాంటి నిధులు లేవని.. మహ్మదీయుల దాడుల సమయంలో వాటిని దోచుకున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ గుడి గోడలపై చాలా ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నాయి.

Advertisement
Advertisement