గ్యారంటీలు అమలైతే ఓట్లడగం | Sakshi
Sakshi News home page

గ్యారంటీలు అమలైతే ఓట్లడగం

Published Tue, May 7 2024 7:00 PM

గ్యారంటీలు అమలైతే ఓట్లడగం

● అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దు ● కాంగ్రెస్‌ నాయకులకు మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌

నర్సాపూర్‌రూరల్‌: ఆరు గ్యారంటీలు అమలయ్యే గ్రామాల్లో మేం ఓట్ల అడగమని, అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. సోమవారం నర్సాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమలు కాని గ్యారెంటీలపై మాట్లాడిన రాహుల్‌గాంధీకి, కేసీఆర్‌ను బూతులు తిడుతున్న రేవంత్‌రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవలలని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌ రిజర్వేషన్లు, బీజేపీ మతం పేరుతో ఓటర్లను రెచ్చగొడుతూ గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలను ఎత్తివేస్తానంటున్నారని, దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు. పదేళ్ల బీజేపీ పాలన కార్పొరేట్లకు దోచిపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికలకు ముందు ఫేక్‌ వీడియోలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచనతో ఉన్నారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మా ట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. హత్నూర మండలం రెడ్డిపాలెంలో పలువురికి బలవంతంగా కాంగ్రెస్‌ కండువాలు కప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న నర్సాపూర్‌లో నిర్వహించే రోడ్‌షోలో కేసీఆర్‌ పాల్గొంటారని, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, నాయకులు సింగయ్యపల్లి గోపి, చంద్రగౌడ్‌, మన్సూర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సత్యంగౌడ్‌, నయీమ్‌, ఆంజనేయులుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement