సినిమా ఇండస్ట్రీలో ఈ గురుశిష్యుల బంధం గురించి తెలుసా? | Special Story: Tollywood Guru Sishyulu Relationship - Sakshi
Sakshi News home page

సినిమా ఇండస్ట్రీలో ఈ గురుశిష్యుల బంధం గురించి తెలుసా?

Published Tue, Sep 5 2023 2:12 PM

Tollywood Guru Sishyulu Special Story - Sakshi

శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తమ శిష్యులకు సినిమా పాఠాలు కూడా నేర్పించి సక్సెస్‌ఫుల్‌ హీరోలు,డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు..  నేడు  గురుపూజోత్సవం సందర్భంగా వారిలో కొందరిని గుర్తు చేసుకుందాం.

తన డైరెక్షన్​తో పాటు రైటింగ్స్​తో టాలీవుడ్​లో ఓ మార్క్​ వేశారు దర్శకుడు సుకుమార్​. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్​ పట్టిన ఈ స్టార్​ డైరెక్టర్​.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్​ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్​.. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా లెవెల్​లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్‌కు నేషనల్‌ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సుక్కూ లాగానే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులకు గూస్​బంప్స్​ తెప్పిస్తున్నారు.తొలి సినిమాలతోనే బ్లాక్​బస్టర్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు.

తన వద్ద పని చేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యగణాన్ని టాలీవుడ్​లో పాపులరయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్​ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్​ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్​ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు. 

'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్​గా పరిచయమైన బుచ్చిబాబు సనా.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్​కు ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్​లో డైరెక్టర్​గా లాంఛ్​ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్​తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. 
 టాలీవుడ్‌లో మరో సెన్సేషన్ డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల.. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్​గా పరిచయమయ్యాడు. నాని, కీర్తి సురేశ్​ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో  శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్​గా మారిపోయాడు.
 'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు.
 జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు 

► యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే.
► డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్​గా పనిచేశాడు. 
 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్​లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
 ఇండస్ట్రీలో స్టార్ రైటర్​గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్‌కు సపోర్ట్‌గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్​గా పనిచేస్తున్నారు.

ఆర్జీవీ ఫ్యాక్టరీలో ఎందరో...
ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్‌లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నారు. వ‌ర్మ శిష్యుల్లో ఆయ‌న త‌ర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్ల‌లో కృష్ణ‌వంశీ, తేజ‌, పూరి జ‌గ‌న్నాథ్, గుణ‌శేఖ‌ర్, శివ‌నాగేశ్వ‌ర‌రావు, నివాస్, అజ‌య్ భూప‌తి, జీవ‌న్ రెడ్డి, హరీశ్‌ శంకర్‌, జేడీ చక్రవర్తి, బాలీవుడ్‌ నుంచి అనురాగ్‌ కశ్యప్‌, బాలీవుడ్‌ అగ్రదర్శకుడు మధుర్‌ బండార్కర్‌ ఉన్నారు.  వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సంగీత ప్రపంచంలో
సంగీతంలో స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు వారిలో  దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో ఏఆర్‌ రెహమాన్‌,మణిశర్మ ముందు వరుసలో ఉంటారు. దేవీశ్రీ ప్రసాద్‌, తమన్‌, హారీశ్‌జై శంకర్‌లు కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు.


సూపర్‌ స్టార్‌ కృష్ణకు గురువు ఎవరంటే...
కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆయనను కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి వారు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా షూటింగ్‌‌లో భాగంగా గుంటూరులో ఉన్నారు కృష్ణ. తన గురువు గారిని ఆఖరిచూపు చూసేందుకు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ రవాణా సదుపాయాలేవీ అందుబాటులో లేవు. ఆఖరికి ది హిందూ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి, వారి ప్రత్యేక విమానంలో హుటాహుటిన మద్రాసు చేరుకున్నారు.

కమల్‌ హాసన్‌కు వారిద్దరూ గురువులే
అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌ - ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలొచ్చాయి. కె.విశ్వనాథ్‌ జీవించి ఉన్న రోజుల్లో ఆయనతో కొంత సమయం గడిపేవారు కమల్‌హాసన్‌.. మరో దిగ్గజ దర్శకుడు కె బాల చందర్‌ కూడా కమల్‌కు గురువే.. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. 

చిరంజీవి- విశ్వనాథ్‌ల గురు శిష్యుల బంధం
తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్‌కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే.  విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్‌లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్‌గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు.

(ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ కోసం వీళ్ల రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా.. టాప్‌లో ఎవరంటే?)

Advertisement
Advertisement