Sakshi News home page

Ram Mandir: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్‌.. రేట్లు ఎలా ఉన్నాయి?

Published Mon, Jan 15 2024 1:06 PM

Amitabh Bachchan Bought Plot in Ayodhya - Sakshi

ఈనెల 22న అయోధ్యలో నూతన రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. అదేరోజున రామాలయంలోని గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య..  ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఆవిర్భవించనుంది.

రామాలయం ‍ప్రారంభోత్సవం నేపధ్యంలో ఈ ప్రాంతంలో భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడి భూముల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.. అయోధ్యలో భూములను కొనుగోలు చేశారు.

ముంబైకి చెందిన డెవలపర్ కంపెనీ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ ద్వారా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ సెవెన్‌ స్టార్‌ మల్టీ పర్పస్‌ ఎన్‌క్లేవ్‌ ‘ది సరయూ’లో ఉంది. అమితాబ్ కొనుగోలు చేసిన ప్లాట్ సైజు 10 వేల చదరపు అడుగులు. ఇందుకోసం ఆయన రూ.14.5 కోట్లు వెచ్చించారు.

అయోధ్యలో ప్లాట్ కొనుగోలుకు సంబంధించి అమితాబ్ ఒక ప్రకటన కూడా చేశారు. ‘అయోధ్య నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన నగరం. అయోధ్యకున్న కాలాతీత ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద నాలో భావోద్వేగ సంబంధాన్ని సృష్టించాయి. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన అయోధ్య ఆత్మలోకి నా హృదయపూర్వక ప్రయాణానికి ఇది నాంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఎదురు చూస్తున్నానని’ అమితాబ్‌ పేర్కొన్నారు. 

ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా షేర్ చేసిన బ్రోచర్‌లోని వివరాల ప్రకారం అయోధ్య నగరంలో 1,250 చదరపు అడుగుల భూమి ధర రూ. 1.80 కోట్లు, 1,500 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.35 కోట్లు. 1,750 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.50 కోట్లుగా ఉంది. అమితాబ్ బచ్చన్ ప్లాట్‌ను కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. సరయూ నది రెండు నిముషాల ప్రయాణ దూరంలో ఉంది.
ఇది కూడా చదవండి: నేటి నుంచి ‘ప్రాణప్రతిష్ఠ’ ముందస్తు ఆచారాలు ప్రారంభం!

Advertisement

What’s your opinion

Advertisement