
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.
ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.
ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.
ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment