insurance
-
ఆరోగ్యశ్రీ దళారీకి దాఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకాన్ని బీమా పేరిట దళారుల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొద్ది నెలలుగా వైద్య సేవ ట్రస్ట్లో బీమా ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ని ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు రూ.2.5 లక్షల కవరేజీతో ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించి బీమాకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం కిందకు వస్తున్నాయి. ఈ కుటుంబాలను సగంగా విభజించి శ్రీసత్యసాయి నుంచి గుంటూరు వరకూ ఒక జోన్, ఎన్టీఆర్ నుంచి శ్రీకాకుళం వరకూ మరో జోన్ కింద పరిగణించనున్నారని తెలిసింది.ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారం చేతికొచ్చాక సూపర్ సిక్స్ల తరహాలోనే బీమా హామీకీ తిలోదకాలిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని కుటుంబాలకే రూ.2.5 లక్షల మేర బీమా కల్పించనుంది.బీమా.. ఒక విఫలయత్నం దేశంలోనే మొదటిసారిగా రూ.25 లక్షల వరకూ కవరేజీతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. అప్పటి వరకూ రూ.5 లక్షల వరకూ ఉన్న కవరేజీని రూ.25 లక్షలకు పెంచారు. అంతేకాకుండా 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో 1,059 ప్రొసీజర్లతో మొక్కుబడిగా అమలైన పథకాన్ని ఏకంగా 3,257 ప్రొసీజర్లతో బలోపేతం చేశారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. అలాంటి పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దళారుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీమా విధానం విఫలమై తిరిగి ఏపీ తరహా ట్రస్ట్ విధానంలోకి మారారు. ఇప్పటికే పలు చోట్ల విఫలమైన ఒక విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతు అసంబద్ధం
బీమా చేసిన వ్యక్తి ఆవరణలో కాకుండా మరెక్కడైనా వాహనాన్ని ఉపయోగించి ప్రమాదం జరిగితే బీమా(Insurance) సంస్థ బాధ్యత వహించదనే పాలసీ షరతు అసంబద్ధమని సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల వ్యాఖ్యానించింది. ఇన్సూరెన్స్ చేసిన వాహనం క్రేన్ కావడంతో కోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రేన్లను ఉపయోగిస్తారని తెలియజేస్తూ, ఈ పరిస్థితిని ఇరు పక్షాలు వివిధ స్థాయుల్లో పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.పాలసీదారుడు తన టాటా హిటాచీ హెవీ డ్యూటీ క్రేన్కు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బీమా తీసుకున్నాడు. 2007లో జంషెడ్పూర్లోని టాటా స్టీల్ వద్ద పనులు నిర్వహిస్తుంటే క్రేన్ ప్రమాదానికి గురైంది. దాంతో పాలసీ క్లెయిమ్ చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. కానీ కంపెనీ తన పాలసీను తిరస్కరించింది. అందుకు పాలసీ షరతులను కారణంగా చూపింది. ప్రమాదం వల్ల నష్టం జరిగినప్పటికీ బీమా చేసిన వ్యక్తి ఆవరణ వెలుపల వాహనాన్ని ఉపయోగించినట్లయితే బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతును ఉటంకిస్తూ క్లెయిమ్ను తిరస్కరించింది. దాంతో పాలసీదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఇలాంటి షరతు సహేతుకం కాదని, ముఖ్యంగా క్రేన్లను సాధారణంగా కార్యాలయ ఆవరణలో కాకుండా నిర్మాణ ప్రదేశాల్లోనే ఉపయోగిస్తారని వివరించింది. పాలసీ కొనుగోలు, రెన్యువల్ సమయంలో ఈ షరతును పరిష్కరించకపోవడంపై కోర్టు ఇరు పక్షాలపై అసహనం వ్యక్తి చేసింది. బీమా కంపెనీలు పాలసీదారులకు స్పష్టమైన, న్యాయమైన నిబంధనలు కల్పించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. పాలసీదారుకు వెంటనే క్లెయిమ్ మొత్తాన్ని సెటిల్ చేయాలని బీమా కంపెనీని ఆదేశించింది.ఇదీ చదవండి: ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్కోటక్ స్పందనఈ తీర్పు బీమా పరిశ్రమలో అనుసరిస్తున్న కొన్ని షరతులను సడలించేలా చర్యలు తీసుకునేందుకు కీలకంగా మారిందని కొందరు భావిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, బీమా పాలసీల్లో పారదర్శకతను పెంపొందించడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పు హైలైట్ చేస్తోంది. -
ఐఎఫ్ఎస్సీలో కార్యకలాపాలకు ఊతం..
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. షిప్ లీజింగ్ యూనిట్లు, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే బీమా ఆఫీసులు, ట్రెజరీ కార్యాలయాలకు ప్రయోజనాలను కల్పించే ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. పలు పన్ను మినహాయింపుల గడువును 2030 మార్చి వరకు వరకు పొడిగించారు. వాస్తవానికి కొన్ని మినహాయింపులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోనున్నాయి. మరోవైపు, ఐఎఫ్ఎస్సీలోని ట్రెజరీ సెంటర్లకు సంబంధించి డివిడెండ్ నిర్వచనం క్రమబద్ధీకరణ, ఫండ్ మేనేజర్లకు సరళతరమైన విధానాలను కూడా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక సేవల రంగంలో భారత్ పురోగమించేందుకు ఇవి దోహదపడగలవని గిఫ్ట్ సిటీ ఎండీ తపన్ రే తెలిపారు. పన్ను ప్రయోజనాల గడువు పొడిగించడం వల్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా ఒక స్పష్టత లభిస్తుందని ధృవ అడ్వైజర్స్ పార్ట్నర్ ఆదిత్య హన్స్ చెప్పారు. -
బీమా రంగంపై ఆపోహలు.. వాస్తవాలు
లక్షలాది మంది పౌరులను, అనేక వ్యాపారాలను రక్షిస్తున్న బీమా పరిశ్రమ తరచూ విమర్శలను ఎదుర్కొంటుందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఛైర్మన్, బజాజ్ అలియన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. చాలామంది బీమా కంపెనీలు కేవలం లాభాల కోసమేననే తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఈ రంగంపై ఉన్న అపోహలు, వాస్తవాలపై ప్రజలకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. తపన్ సింఘాల్ బీమా రంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని గణాంకాలను తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం, గత ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ రూ.1.72 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్లను పరిష్కరించింది. ఇందులో రూ.80,000 కోట్లకు పైగా ఆరోగ్య బీమాకు చెల్లించిందే. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 80% కంటే ఎక్కువే. తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్ల్లో 20% తరచుగా మోసపూరితమైన లేదా ఆమోదయోగ్యం కాని విధంగా ఉంటున్నాయి. వైద్య ఖర్చుల కోసం బీమాపై ఆధారపడడం కంటే పొదుపు చేసి దాంతో వైద్య ఖర్చులు భరించవచ్చనే దోరణి కొందరిలో ఉంది. అయితే, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం ఆరోగ్య బీమా ఉన్నా పాలసీదారులు సుమారు 60% ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య 100%కు పెరుగుతుంది. ఏటా పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల ఆరోగ్య సమస్యలున్న చాలా కుటుంబాలు పేదరికంలోని నెట్టివేయబడుతున్నాయి. ప్రస్తుతం దేశ జనాభాలో సుమారు 7% మంది ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ఏటా పేదరికంలోకి జారుతున్నారు. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.మోటార్ పరిశ్రమబీమా ఆధారిత ప్రమాద రక్షణ క్లెయిమ్ చెల్లింపులు సుమారు రూ.55,000 కోట్లు నిలిచిపోవడంతో మోటార్ బీమా విభాగం కుదేలవుతుంది. దాంతో ప్రమాదాల ఆర్థిక భారం పూర్తిగా వాహన యజమానులపై పడుతుంది. ఇది ఆర్థిక అస్థిరత పెరగడానికి, వాహన అమ్మకాలు తగ్గడానికి దారితీస్తుంది. మోటార్ థర్డ్ పార్టీ క్లెయిమ్లను కవర్ చేయడంలో బీమా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోటార్ బీమా విభాగంగా థర్డ్ పార్టీ క్లెయిమ్ల్లో రూ.27,000 కోట్లకు పైగా సెటిల్ చేశారు.సాంఘిక సంక్షేమ పథకాలుఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) కింద 2024 నవంబర్ 30 నాటికి దాదాపు 36 కోట్ల మంది లబ్ధిదారులను ధృవీకరించారు. ఈ ప్రభుత్వ పథకం సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఆసుపత్రిలో చేరడానికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. బీమా పరిశ్రమ మద్దతు లేకుండా హైబ్రిడ్ నమూనా(ఇన్సూరెన్స్+నగదు చెల్లింపు)ను అవలంబించే రాష్ట్రాల్లో ఈ పథకం అంత ప్రభావవంతంగా ఉండదు. ఈ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.ప్రకృతి విపత్తులువరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు విపరీతమైన మానవ, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ఈ సమయాల్లో బీమా కీలకమైన రికవరీ మెకానిజంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు జాతీయ విపత్తు నివారణ నిధి (ఎన్డీఎంఎఫ్)కు రూ.13,693 కోట్లు, రాష్ట్ర విపత్తు నివారణ నిధికి (ఎస్డీఎంఎఫ్) రూ.32,030.60 కోట్లు కేటాయించింది. ప్రతి ప్రకృతి విపత్తు తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం కోసం భారీగా ఖర్చు చేస్తుంది. మరింత పటిష్ఠమైన బీమా కార్యక్రమాలు అమల్లోకి వస్తే ఈ నిధులను అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలకు మళ్లించవచ్చు.వ్యవసాయంభారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) వంటి పథకాలు గత ఎనిమిదేళ్లలో రూ.1.64 లక్షల కోట్ల క్లెయిమ్లను అందించాయి. ఈ చెల్లింపులు రైతులకు ఆర్థిక ఉపశమనం కలిగించాయి. రైతు ఆత్మహత్యలు తగ్గడానికి దోహదం చేశాయి. దేశ ఆహార భద్రతకు రైతులు తమ వంతు సహకారాన్ని అందించేందుకు బీమా దోహదపడుతుంది.రూ.1.73 లక్షల కోట్ల మోసపూరిత క్లెయిమ్లుమోసపూరిత క్లెయిమ్ల వల్ల బీమా పరిశ్రమకు ఏటా కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను నిత్యం ప్రత్యేక యంత్రాగాల ద్వారా పర్యవేక్షిస్తున్నా ఫ్రాడ్ క్లెయిమ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లలో మొత్తం బీమా పరిశ్రమలో సుమారు 3.01 లక్షల మోసపూరిత కేసులను గుర్తించారు. వీటి విలువ రూ.1.73 లక్షల కోట్లని తేలింది. భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ ఈ మోసాల వల్ల ఏటా సుమారు రూ.30,000 కోట్లు నష్టపోతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.అపోహలు వీడాలి..బీమా సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయని కొందరి అభిప్రాయం. ఇవి కేవలం లాభాల కోసమే ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే బీమా కంపెనీలకు లాభాలు వచ్చినా భవిష్యత్తులో క్లెయిమ్లకు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ సగటు క్లెయిమ్ నిష్పత్తి 80 శాతం కంటే ఎక్కువే. కంపెనీల రాబడితో లెక్కిస్తే క్లెయిమ్ నిష్పత్తి 115% వద్ద ఉంది. అంటే ప్రీమియంల ద్వారా సమకూరిన ప్రతి రూ.100కు పరిశ్రమ రూ.115 చెల్లిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీమా సంస్థలు క్లెయిమ్ చెల్లింపులు, నిర్వహణ ఖర్చులపై డబ్బును కోల్పోతున్నాయి.లక్షల మందికి ఉపాధిప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న బీమా పరిశ్రమ జీవనోపాధికి తోడ్పడుతోంది. ఈ పరిశ్రమలో లాభాపేక్ష లేదని చెప్పలేం. కానీ, అదే సమయంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్రోకర్లు, టీపీఏ(థర్డ్పార్టీ ఏజెంట్లు)లు, ఇన్సూరెన్స్ రంగంలోని నిపుణులు ఈ పరిశ్రమ విలువను పెంచుతూ ఆర్థిక, ఉపాధి వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తున్నారు.ఇదీ చదవండి: భారత్లోకి స్టార్లింక్.. లైన్ క్లియర్..?వ్యవస్థను దిగజార్చకూడదు..బీమా కంపెనీలు లాభాలు సంపాదించినంత మాత్రాన అవి వినియోగదారులను మోసం చేస్తున్నాయనే అభిప్రాయాలుండడం సరైందికాదు. మోసపూరిత క్లెయిమ్లు చేస్తూ సంస్థలను, వ్యవస్థను దిగజార్చకూడదని నిపుణులు కోరుతున్నారు. ఈ పరిశ్రమపై అవగాహన ఉన్నవారు మరింత ఎక్కువ మందిని బీమా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. -
మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్
భారతీయ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారు. ఆర్థికాంశాల్లో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్(Term life insurance) ఆవశ్యకత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీమా సాధనం గురించి తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దిష్ట ప్రీమియం చెల్లిస్తే, నిర్దిష్ట జీవిత బీమా కవరేజీని అందించే ప్యూర్ ప్రొటెక్షన్ పథకం. దురదృష్టవశాత్తు పాలసీదారు కన్నుమూసిన పక్షంలో సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని వారి నామినీకి బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ ప్రీమియంకే ఎక్కువ కవరేజీని అందించడం టర్మ్ ప్లాన్ల ప్రత్యేకత.ఉదాహరణకు 30 ఏళ్ల నేహా వార్షికంగా రూ.9,646 ప్రీమియంతో 30 ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి సమ్ అష్యూర్డ్(Sum Assured)కి పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒకవేళ దురదృష్టవశాత్తు నేహా మరణించిన పక్షంలో ఆమె నామినీకి రూ.1 కోటి బీమా మొత్తం లభిస్తుంది. ఇలా నేహా తీసుకున్న టర్మ్ పాలసీ అనేది ఆమె కుటుంబసభ్యులకు ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. అయితే, ఈ టర్మ్ పాలసీని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. ఉదాహరణకు నేహా గనుక టర్మ్ పాలసీని తీసుకోవడం ఒక పదేళ్లు వాయిదా వేశారనుకోండి .. అప్పుడు అదే లైఫ్ కవరేజీకి ఆమె ఏకంగా రూ.15,900 వార్షిక ప్రీమియం కట్టాల్సి వస్తుంది. పైగా పాలసీ వ్యవధి కూడా 20 ఏళ్లకే పరిమితమవుతుంది. మొత్తం మీద ఆమె తక్కువ కాలవ్యవధికి వర్తించే పాలసీకి ఏటా రూ.6,000 చొప్పున కట్టాల్సి వస్తుంది. అదే ముందుగా తీసుకుని ఉంటే, ఈ అదనపు మొత్తాన్ని మరో చోట ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. యాడ్–ఆన్తో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత జీవిత పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా మరికాస్త ప్రీమియం చెల్లించడం ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలను అందించేందుకు యాడ్–ఆన్ రైడర్లు ఉపయోగపడగలవు. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ఇది ఇటు ఆరోగ్యం అటు జీవిత బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొన్ని జీవిత బీమా కంపెనీలు 32 తీవ్ర అనారోగ్యాలకు కూడా కవరేజీని అందిస్తున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన బ్రెస్ట్, సరి్వకల్, ఒవేరియన్ క్యాన్సర్లు, గుండె.. మెదడు.. కిడ్నీ సంబంధ సమస్యలు మొదలైనవి ఈ జాబితాలో ఉంటున్నాయి. 30 ఏళ్ల వయస్సు గల మహిళ, 30 ఏళ్ల కాలవ్యవధికి కేవలం నెలకు రూ. 977 చెల్లించడం ద్వారా రూ. 50 లక్షల వరకు ప్రయోజనాలను పొందేందుకు ఈ యాడ్–ఆన్ను తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నట్లు తేలిందంటే, చికిత్స కోసం నిధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, బీమా సంస్థ ఏకమొత్తంగా చెల్లిస్తుంది. ప్రస్తుతం కీమోథెరపీ వ్యయం దాదాపు రూ. 25 లక్షల వరకు ఉంటోంది. ఇలా వైద్య చికిత్స వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు.ప్రీమియం వెయివర్ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని విధంగా జీవితం ఉంటుంది. కాబట్టి పాలసీదారు ప్రమాదవశాత్తూ శాశ్వత వైకల్యానికి గురై ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మటుకు బీమా సంస్థలు అదనంగా తీసుకోకుండా, పాలసీ అంతర్గతంగానే ఈ ఫీచరును అందిస్తున్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న పాలసీలో ఇది లేకపోతే, కొంత అదనపు ప్రీమియం చెల్లించైనా తీసుకోవడం శ్రేయస్కరం.యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు 11.9 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ప్రయోజకరంగా ఉండగలదు. నెలకు కేవలం రూ.302 మేర అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.50 లక్షల లైఫ్ కవరేజీకి నేహాలాంటి వారు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్ను తీసుకోవచ్చు. ఉదాహరణకు, రూ.1 కోటి కవరేజీ గల బేస్ పాలసీని, రూ.50 లక్షల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ను తీసుకుంటే, ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో మొత్తం రూ.1.50 కోట్ల క్లెయిమ్ లభిస్తుంది.కుటుంబానికి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్న వారికి దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి, ఆదాయానికి అంతరాయం ఏర్పడినా, కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. క్లెయిమ్ల విషయంలో మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న బీమా సంస్థ నుంచి దీన్ని కొనుగోలు చేయడం మంచిది. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య కాలంలో మొత్తం పరిశ్రమలో అత్యుత్తమంగా 99.3 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని నమోదు చేసింది. అలాగే, నాన్–ఇన్వెస్టిగేటెడ్ డెత్ క్లెయిమ్లను సగటున 1.2 రోజుల వ్యవధిలోనే సెటిల్ చేసింది.– ఎలిజబెత్ రాయ్, హెడ్ (ప్రోడక్ట్ మేనేజ్మెంట్), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -
ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమా
ఉద్యోగులకు సామాజిక భద్రతా కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారు.ఈడీఎల్ఐ స్కీమ్ వివరాలుఅర్హతలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ.15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్లో డిఫాల్ట్గా చేరతారు.యాజమాన్యం వాటా: ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యజమానులు ఈడీఎల్ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతన పరిమితి రూ.15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.బీమా కవరేజీ: సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే, రిజిస్టర్డ్ నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా రూ.15,000కు లోబడి ఈ బెనిఫిట్ను లెక్కిస్తారు.ప్రయోజనాలు: కనీస హామీ ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్టవేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ఈడీఎల్ఐ(EDLI) పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వాటాను యాజమాన్యం జమచేయాలి. అయితే దీని కంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు ఏవైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.ఇదీ చదవండి: కూతురి కోసం మంచి పథకంఎలా క్లెయిమ్ చేయాలి?ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు చెందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5 ఐఎఫ్ (ఇన్సూరెన్స్ ఫండ్) పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను ఫారంతో నింపి కార్యాలయంలో అందించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయాలి. -
బీమా పరిశ్రమకు ధీమా
భారత జీడీపీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడిస్(Moody's) అంచనా వేసింది. 2025–26లో 6.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ బలమైన విస్తరణతో బీమా రంగం ప్రయోజనం పొందనున్నట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance)కు పెరుగుతున్న డిమాండ్తో బీమా కంపెనీలు ప్రీమియంలో స్థిరమైన వృద్ధిని చూడనున్నాయని వివరించింది. అధిక ప్రీమియం ఆదాయం, పెరుగుతున్న ప్రీమియం ధరలు, ప్రభుత్వ సంస్కరణలతో బీమా రంగం లాభదాయకత మెరుగుపడనున్నట్టు అంచనా వేసింది.‘భారత ప్రైవేటు బీమా కంపెనీలు తమ వినియోగదారుల బేస్ను పటిష్టం చేసుకోవడం కొనసాగనుంది. కాకపోతే అండర్రైటింగ్ ఎక్స్పోజర్, నియంత్రణపరమైన మార్పులతో వాటి క్యాపిటల్ అడెక్వెసీపై ఒత్తిళ్లు కొనసాగనున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25లో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముందటి సంవత్సరంలో వృద్ధి 8.2 శాతం కంటే కొంత తక్కువ. భారత తలసరి ఆదాయం–కొనుగోలు శక్తి సమానత్వం సైతం వృద్ధి చెందుతోంది. 11 శాతం వృద్ధితో 2024 మార్చి నాటికి ఇది 10,233 డాలర్లకు చేరింది’ అని మూడిస్ పేర్కొంది. భారత జాతీయ గణాంక కార్యాలయం (NSO) 2024–25 సంవత్సరానికి జీడీపీ 6.4 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనా కంటే మూడిస్ అంచనాలు బలంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుభారీ అవకాశాలు..అధిక సగటు ఆదాయం, వినియోగదారుల రిస్క్ ధోరణి బీమాకు, ముఖ్యంగా ఆరోగ్య బీమాకు డిమాండ్ను పెంచుతున్నట్టు మూడిస్ పేర్కొంది. 2024 మొదటి ఎనిమిది నెలల్లో బీమా ప్రీమియం ఆదాయం 16 శాతం పెరిగినట్టు తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రీమియంలో 8 శాతం వృద్ధిని అధిగమించినట్టు వివరించింది. ‘భారత్లో బీమా విస్తరణ రేటు (జీడీపీలో బీమా ప్రీమియంల వాటా) 2024 మార్చి నాటికి 3.7 శాతంగానే ఉంది. యూకే 9.7 శాతం, యూఎస్ 11.9 శాతంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. అందుకే భారత బీమా రంగం బలమైన విస్తరణకు పుష్కల అవకాశాలున్నాయి’ అని పేర్కొంది. -
15 వరకు వరికి బీమా గడువు పెంపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటల బీమా పథకం నత్తనడకన సాగుతోంది. స్వచ్ఛందంగా రైతులే నమోదు చేసుకోవాల్సి ఉన్న బీమా పథకంపై వారికి అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభు త్వం ఘోరంగా విఫలమైంది. మరోవైపు బీమా ప్రీమియం కూడా అధికంగా ఉండటంతో రైతులు ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి వరితో సహా అన్ని పంటలకు ప్రీమియం గడువు డిసెంబర్ 31నే ముగిసింది. అయితే వరికి మాత్రమే ప్రీమియం గడువును పెంచేందుకు బీమా కంపెనీలు ముందుకొచ్చాయి. జనవరి 15 వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం కల్పించాయి. నోటిఫై చేసిన జీడి పంటకు గతేడాది నవంబర్ 22తో, ఇటీవల కొత్తగా నోటిఫై చేసిన మామిడితో సహా అన్ని పంటలకు డిసెంబర్ 31తో బీమా ప్రీమియం చెల్లించడానికి గడువు ముగిసింది. ఈసారి 7.46 లక్షల మందే.. నోటిఫై చేసిన పంటల సాగు లక్ష్యం 60.55 లక్షల ఎ కరాలు కాగా ఇప్పటి వరకు అతికష్టమ్మీద 9.75 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. గతేడాది 43.82 లక్షలమంది రైతులకు బీమా రక్షణ లభించగా, ఈ ఏడాది రబీలో పంటలు సాగు చేసిన రైతుల్లో కేవలం 7.46 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు.నమోదు చేసుకోవడం ఓ ప్రహసనం..పంటల బీమాలో స్వచ్ఛంద నమోదు రైతులకు తలనొప్పిగా మారింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులు ముందుగా తాము సాగు చేసే పంటల వివరాలను జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్సీఐసీ)లో నమోదు చేయాలి. రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్లే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి చెల్లిస్తారు. ఒకవేళ బీమా వద్దనుకుంటే రాతపూర్వకంగా బ్యాంకుకు వెల్లడిస్తే సరిపోతుంది. బ్యాంకుల నుంచి రుణం పొందని రైతులు తమ వాటా ప్రీమియంను ఆన్లైన్లో చెల్లించి, ధ్రువీకరణ పత్రాలతో సచివాలయాలు/ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు/పోస్టాఫీస్లు/కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఎన్సీఐసీ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. కౌలు రైతులకైతే సీసీఆర్సీ కార్డులు తప్పనిసరి. రైతులు సాగు చేసిన పంటలను ధ్రువీకరిస్తూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది జారీ చేసే ఏరియా షోన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆధార్ సీడింగ్ బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ప్రీమియం చెల్లింపు, ఎన్సీఐసీ పోర్టల్లో గడువులోగా అప్లోడ్ చేయడం రైతులకు కత్తి మీదసాములా మారింది. బీమా లేకపోయినా పర్వాలేదు.. పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేకపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. -
మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
ప్రస్తుతం మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పరిరక్షించుకోవడమనేది సవాలుగా మారుతోంది. శారీరక ఆరోగ్యం(Health)తో సమానంగా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన పెరుగుతుండటంతో వీటిని సైతం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా గుర్తిస్తున్నారు. అయితే, ఇందుకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డంకిగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు తమ పథకాల్లో మానసిక ఆరోగ్య కవరేజీని చేర్చడం ప్రారంభించాయి. దీనితో కౌన్సిలింగ్, థెరపీ, ప్రివెంటివ్ కేర్ వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా(health insurance) ప్లాన్ ఎంపిక చేసుకునేటప్పుడు, అది అందించే కవరేజీ, ప్రయోజనాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అలా పరిశీలించతగిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..సమగ్ర కవరేజీకౌన్సిలింగ్, థెరపీ సెషన్లు వంటి మానసిక ఆరోగ్య సేవలను కవర్ చేసేవిగా పథకాలు ఉండాలి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను కలిసే అవకాశాన్ని కల్పించాలి. టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. దీంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లతో ఆన్లైన్లో సంప్రదించేందుకు వీలవుతుంది. అదనంగా, ఔట్పేషంట్ డిపార్ట్మెంట్ (ఓపేడీ) కవరేజీ ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా డాక్టర్ను సందర్శించవచ్చు, ఇది సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది.వెల్నెస్ ప్రోగ్రాంలుఅనేక బీమా కంపెనీలు ఇప్పుడు తమ పథకాలలో వెల్నెస్ ప్రోగ్రాంలను చేరుస్తున్నాయి. ఇవి మైండ్ఫుల్నెస్ సెషన్లు, ఒత్తిడిని అధిగమించేందుకు వర్క్షాప్లు నిర్వహించడం లేదా ఫిట్నెస్పరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవిగా ఉంటున్నాయి. ఉచిత యోగా తరగతులు, జిమ్ మెంబర్షిప్లు లేదా వెల్నెస్ యాప్(Wellness App)లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా కొన్ని పథకాలు అందిస్తున్నాయి. హోమ్ హెల్త్కేర్ సేవలుదీర్ఘకాలిక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నవారికి క్లినిక్లకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి హోమ్ హెల్త్కేర్ ప్రయోజనాలు ఉన్న పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి వద్దే సంరక్షణ సేవలను సౌకర్యవంతంగా అందుకునేందుకు ఈ పాలసీలు సహాయపడతాయి. ఇన్సెంటివ్లు, రివార్డులుకొన్ని బీమా పథకాలు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ రివార్డులు అందిస్తాయి. ఉదాహరణకు, మీరు రెగ్యులర్ హెల్త్ చెక్–అప్స్ చేయడం లేదా ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రెన్యువల్పై డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని పథకాలు వాకింగ్ లేదా వ్యాయామం మొదలైన వాటికి పాయింట్లు అందిస్తాయి. వీటిని తరువాత రిడీమ్ చేసుకోవచ్చు.వెల్నెస్ ప్రోగ్రాంలుఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తోడ్పడే వెల్నెస్ ప్రోగ్రాంలు, ప్రివెంటివ్ కేర్లాంటివి అందించే పాలసీ(Policy)లను ఎంచుకోవాలి. డిస్కౌంట్లు, రివార్డులు మొదలైనవి ఇచ్చే పాలసీల వల్ల బీమా వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. డబ్బూ ఆదా అవుతుంది. ఇక టెలిమెడిసిన్, హోమ్ హెల్త్కేర్ ఫీచర్లు సత్వరం సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.ఇదీ చదవండి: ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడనేది మరింత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. చికిత్స చేయకపోవడం వల్ల పలు రకాల పరిస్థితులు రోజువారీ జీవితానికి అడ్డంకులుగా మారతాయి. సంబంధాలను నాశనం చేస్తాయి. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్లను పదే పదే కలవాల్సి రావడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ కవరేజీ అవసరాల వల్ల ఆర్థికంగా కూడా ఇది మరిన్ని ఖర్చులకు దారి తీస్తుంది. కాబట్టి తగినంత కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవడం వల్ల భావోద్వేగాలపరంగానూ, ఆర్థికంగాను సవాళ్లను అధిగమించేందుకు సహాయకరంగా ఉంటుంది. -
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు... ప్రీమియం భారం భరించలేక రైతుల గగ్గోలు
-
రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఊహకందని ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు, ఐపీపీబీ (ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్).. 'గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటికి సంబందించిన పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐపీపీబీ రూ.399 ప్లాన్ఈ ప్లాన్ కింది మీరు ఏడాదికి రూ.399 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చు.ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల హాస్పిటల్లో చేరితే యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు కోసం రూ.60,000 లేదా ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. అంతే కాకుండా హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ.25,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం మరో రూ.5,000 అందుతాయి. ఈ ప్లాన్ కింద ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.ఐపీపీబీ రూ.299 ప్లాన్ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారు సంవత్సరానికి రూ.299 చెల్లించి.. 10 లక్షల రూపాయల ప్రమాద భీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా లభిస్తుంది.ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారుకు రూ.399 ప్లాన్లో లభించే దాదాపు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఎడ్యుకేషన్ బెనిఫీట్స్.. హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1,000 చొప్పున లభించే ప్రయోజనాలు అందవు.ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులుదీనికి అర్హులు ఎవరంటే..18 నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దేనిని కవర్ చేయదంటే..ఆత్మహత్య చేసుకున్నా, మిలటరీ సర్విసెస్లో ఉంటూ మరణించినా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి కన్నుమూసినా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వంటి వాటివల్ల చనిపోయినా.. ప్రమాదకరమైన క్రీడల్లో మృత్యువాత పడినా ఈ ఇన్సూరెన్స్ లభించదు. -
మనం లేకపోయినా మన వాళ్లతో ఉన్నట్లే!
జీవితం క్షణ భంగురం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోం. అప్పటిదాకా వస్తే చూసుకుందాంలే అనుకుంటాం. పరిస్థితులు సహకరించకో, ఉదాసీనతో, నిర్లక్ష్యమో..కారణం ఏదైనా కావొచ్చు. భవిష్యత్ ప్రణాలికల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ‘పోయినవాడు బాగానే పోయాడు.. మాకు ఏం మిగిల్చాడు గనుక..’ అని ఉన్నవాళ్లు తిట్టుకోకూడదంటే కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తే చాలు. కుటుంబ పెద్దని దురదృష్టం పలకరించినా..ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ చేసే మేలు అంతాఇంతా కాదు. అదెలాగో తెలుసుకుందాం.చిన్న వయసులోనే ఈ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. నెలవారీ లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు.టర్మ్ ఇన్సూరెన్సు పరమార్థం ఏమిటంటే సాధారణంగా ఏ వ్యక్తి అయితే ప్రీమియం కడతాడో ఆ వ్యక్తి మరణానంతరం ఆర్థిక భరోసానిస్తుంది. ఒకేసారి బీమా మొత్తాన్ని సదరు కుటుంబం అందుకోవచ్చు లేదంటే..దఫాలవారీగా కూడా తీసుకోవచ్చు.సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అప్పటి నుంచి మొదలుకొని 99 ఏళ్ల వరకు పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది.ఒకేసారి బీమా మొత్తంపాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి నామినీ/ ప్రయోజనదారుకు ఒకేసారి బీమా మొత్తం (సమ్అష్యుర్డ్) చెల్లిస్తారు. ఇందుకు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఎంచుకోవాలి.ఉదా: x అనే వ్యక్తి రూ.ఒక కోటి టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. నెలకు రూ.10,000 దాకా ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ కాలవ్యవధి 35 ఏళ్లుగా భావిద్దాం. ఈ వ్యవధిలోనే పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అతని కుటుంబం ఒకేసారి రూ.కోటి పొందగలుగుతుంది.దఫాల వారీగా కావాలంటే...ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉండే కుటుంబాలు తక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే ఇది మరింత తక్కువ ఉంటుంది. కోటి రూపాయలకు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఒకేసారి ఆ మొత్తం అందుకునే కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలో సరైన అవగాహన ఉండదు. ఒక్కోసారి ఆ సొమ్ము పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. లేదా విచ్చలవిడిగా ఆ సొమ్ముని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇలాంటి టర్మ్ పాలసీ తీసుకున్న ప్రయోజనం నెరవేరదు. అలా జరగకుండా ఉండాలంటే దఫాలవారీ చెల్లింపు పద్ధతిని ఆశ్రయించడం మేలు. ఈ పద్ధతిలో సదరు నామినీకి ఇన్సూరెన్సు కంపెనీ విడతల వారీగా సొమ్ము చెల్లిస్తుంది. అయితే పాలసీ తీసుకునే వ్యక్తికి తన కుటుంబం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తన భార్య, పిల్లలు, వారి చదువులు, పెద్దవాళ్ల అవసరాలు.. ఇలా ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. తన పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చే సరికి ఇంతకావాలి.. తన పిల్లల పెళ్లిళ్ల ఖర్చుకు ఇంత అవసరమవుతుంది.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నామినీకి ఏయే సమయాల్లో ఎంతెంత చెల్లించాలో పేర్కొనవచ్చు.నెలవారీ చెల్లింపులుపాలసీదారు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ఎంచుకుంటే తదనుగుణంగానే నెలకింత చొప్పున నామినీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకేసారి రూ.ఒక కోటి మొత్తం వద్దనుకుంటే నెలకు కొంత వచ్చేటట్లు ఆప్షన్ ఎంచుకోవాలి. దాంతో సదరు బీమా కంపెనీ ఆ మొత్తాన్ని నెలకు రూ.50,000 చొప్పున 15 ఏళ్లపాటు చెల్లిస్తుంది.ఏడాదికోసారి చెల్లించేలా..నెలకోసారి కాకుండా ఏడాదికోసారి ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం ఏడాదికి రూ.6 లక్షలచొప్పున 15 ఏళ్లపాటు నామినీకి చెల్లిస్తారు.మరో పద్ధతిఈ పద్ధతి ప్రకారం నామినీకి సమ్ అష్యుర్డ్ (రూ.కోటి అనుకుందాం) మొత్తంలో 50-70% పాలసీదారు చనిపోయిన వెంటనే చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా నెలకింత చొప్పున చెల్లిస్తూ వస్తారు.అధిక ప్రయోజనం ఇచ్చే మరో విధానంఈ ఆప్షన్లో ముందుగా నామినీకి కొంత మొత్తం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని 10-20 శాతం వార్షిక వృద్ధిని లెక్కగట్టి నెలవారీ చెల్లింపుల్లో అందిస్తారు. పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!టర్మ్ ఇన్సూరెన్సు అనేది ప్రతి కుటుంబానికి కచ్చితంగా అవసరమయ్యే ఒక సురక్ష సాధనమని చెప్పొచ్చు. కానీ దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితాలకు ఈ పాలసీ భరోసాను ఇస్తుందని మాత్రం ఎవరూ గ్రహించరు. మీ కుటుంబంలో ఆర్థిక పరమైన అవగాహన ఉండి, వచ్చే సొమ్ములు సరైన మార్గంలోనే సద్వినియోగం అవుతాయన్న నమ్మకం ఉన్నప్పుడు ఏకమొత్తం (లమ్సమ్) పొందే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. లేదంటే నెలవారీ, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి తదనంతరం కుటుంబం ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడకూడదంటే మాత్రం కచ్చితంగా టర్మ్ పాలసీ వెంటనే తీసుకోవాలి.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
జీవిత బీమా అనగానే.. డబ్బు వృథా, అనవసరంగా ప్రీమియం చెల్లించాలనే ధోరణి ఉంది. దీన్ని గ్రహించిన కంపెనీలు వినియోగదారులు చెల్లించే ప్రీమియంపై రాబడి వచ్చేలా ఎండోమెంట్ పాలసీలను తీసుకొచ్చారు. అయితే ఇందుకు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఒకవైపు బీమా కవరేజీ.. మరోవైపు రాబడి ఉంటుంది. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా సరైంది కాదని, కొన్నిసార్లు సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా ఎండోమెంట్ పాలసీల్లో వచ్చే రాబడి తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. బీమా సంస్థలు, ఏజెంట్లు మార్కెటింగ్లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని చేస్తుంటారు. కానీ, బీమా రక్షణా? లేక రాబడా? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ అంశాలను వివరించే కథనం ఇది..బీమా, పొదుపుతో కూడిన ప్లాన్లుసంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రముఖ సంస్థకు చెందిన ఓ ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుంది.ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తున్నాయా..?55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై సుమారు రూ.50 చొప్పున వస్తుంది. మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు.. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి.మరణిస్తే చెల్లింపులు ఇలా..ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది.ప్రత్యామ్నాయం..బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైన బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా ప్యూర్ లైప్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పైఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం.35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేలు అనుకుందాం. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. పైన చెప్పుకున్న ప్లాన్లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పైప్లాన్లో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈఉదాహరణ తెలియజేస్తోంది.కాంపౌండింగ్ ఉండదు..విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది.ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్ను కొనుగోలు చేసుకోవచ్చు.గ్యారంటీడ్.. పార్టిసిపేటింగ్బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ అనే వాటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో వీటిని చెల్లిస్తారు.ఇదీ చదవండి: ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రాఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమియంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం అధికంగా ఉంటుంది. -
బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐ
బీమా పాలసీలను విక్రయించేందుకు ఏదో ఒక సంస్థ మీదో లేదా బ్యాంకులపైనో అధికంగా ఆధారపడకూదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బీమా కంపెనీలకు సూచించింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతకాలని తెలిపింది. పాలసీలను విక్రయించేందుకు ఇతర అనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.బీమా కంపెనీలు వాటి మాతృ సంస్థలుగా ఉన్న బ్యాంకుల ద్వారానే దాదాపు 90 శాతం పాలసీలను విక్రయిస్తున్నాయని బీమా నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఐఆర్డీఏఐ మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్తులో పాలసీల విక్రయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ముసాయిదాను తీసుకురావాలని ఐఆర్డీఏఐ యోచిస్తోంది. ఇప్పటివరకు అధికంగా బ్యాంకుల ద్వారానే పాలసీలు విక్రయిస్తున్నందున ఒక్కసారిగా ఈ విధానంలో మార్పు రాదని, అందుకు కొంత సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. పాలసీల విక్రయానికి సంబంధించి ఐఆర్డీఏఐ నిబంధనలు తీసుకురాబోతున్న నేపథ్యంలో కంపెనీలు ఇతర పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్పై రూ.5 తగ్గింపు!బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు ఇప్పటికే బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా గతంలో స్పష్టం చేశారు. బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలన్నారు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకులు కీలకపాత్రే పోషిస్తున్నప్పటికీ, బలవంతంగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నట్లు చెప్పారు. -
బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
బీమా ప్రీమియం వసూళ్లు నవంబర్ నెలలో తగ్గినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించింది. 2023 నవంబర్లో వసూలైన రూ.26,494 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో బీమా ప్రీమియం రూ.25,306 కోట్లుగా నమోదైంది. గతంలో పోలిస్తే ఇది 4.5% తక్కువగా ఉంది. బీమా రంగంలో ప్రముఖంగా సేవలందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లు ఈసారి తగ్గుముఖం పట్టాయి. దానివల్లే ఈ పరిస్థితి నెలకొందని కౌన్సిల్ అభిప్రాయపడింది.ఎల్ఐసీ ప్రీమియం తగ్గుముఖం పడుతుంటే ప్రైవేట్ సంస్థల ప్రీమియంలో మాత్రం గతంలో కంటే 31 శాతం వృద్ధి కనబడింది. నవంబర్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.3,222 కోట్లు, మ్యాక్స్ లైఫ్ రూ.748.76 కోట్లు, హెచ్డీఎఫ్సీ లైఫ్ రూ.2,159 కోట్లు, ఎస్బీఐ లైఫ్ రూ.2,381 కోట్ల వరకు ప్రీమియం వసూలు చేశాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 16% వృద్ధి కనిపించింది. ఎల్ఐసీ కూడా అదే మొత్తంలో వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకమైంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ చాలా మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా ఇవ్వగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ దీన్ని తీసుకోని వారు నిపుణుల సలహాతో మంచి పాలసీను ఎంచుకోవాలి. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: జీడీపీ మందగమనంబీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆరోగ్య బీమా.. పాలసీ సంస్థ మారుతున్నారా?
మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రస్తుతం మారుతున్న విధానాలకు అనుగుణంగా లేకపోవచ్చు. మార్కెట్లో పోటీ నెలకొని ఇతర కంపెనీలు తక్కువ ప్రీమియంతో మరింత మెరుగైనా సదుపాయాలుండే పాలసీని అందిస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో పాలసీను రద్దు చేసుకోకుండా ‘పోర్టబిలిటీ’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలసీను వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ‘పోర్టబిలిటీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వెయిటింగ్ పీరియడ్ను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య బీమా పాలసీని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు.ప్రస్తుత పాలసీ నిబంధనలు, షరతులు మీ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు పోర్ట్కు ప్రయత్నించాలి.పాలసీ చెల్లించే విలువ తక్కువగా ఉంటూ, ప్రీమియం అధికంగా ఉన్నప్పుడు పోర్ట్ను పరిశీలించవచ్చు. అయితే అందులో అధిక క్లెయిమ్ ఇచ్చే సంస్థలను ఎంచుకుంటే ఉత్తమం.స్థానిక ఆసుపత్రులు బీమా సంస్థ నెట్వర్క్ కవరేజ్ జాబితాలో లేనప్పుడు ఈ విధానాన్ని పరిశీలించాలి.ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ రెన్యువల్ చేయడానికి 45 రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి.ప్రస్తుతం చాలా సంస్థలు రెన్యువల్కు ఒక రోజు ముందు, పాలసీ గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పోర్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు.తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేమంటే ఇబ్బందులు ఎదురవుతాయి.గమనించాల్సినవి..పాలసీని పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ప్రధానంగా బీమా మొత్తంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక బీమా సంస్థలో రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. బోనస్తో కలిపి ఈ మొత్తం రూ.7.50లక్షలు అయ్యింది. కొత్త బీమా సంస్థకు మారి, రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు కొత్త సంస్థ రూ.7.5 లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది. మిగతా రూ.2.5 లక్షలను కొత్త పాలసీగానే పరిగణిస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనికి ఇతర షరతులూ వర్తిస్తాయి.ఇదీ చదవండి: 13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్వివరాలు అన్నీ తెలపాలి..కొత్త సంస్థకు మారేటప్పుడు ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిమ్ వివరాలు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించీ వివరించాలి. పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు. కానీ, పాలసీ వచ్చిన తర్వాత ఇవి బయటపడితే పరిహారం లభించదు. -
ఇన్సూర్టెక్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు
న్యూఢిల్లీ: భారత ఇన్సూర్టెక్ రంగానికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయని ఒక నివేదిక తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్లు సమీకరించగా.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని అంచనా వేసింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్ (ఐఐఏ) ఈ నివేదికను రూపొందించాయి.‘‘ప్రస్తుతం భారత్లో 150 ఇన్సూర్టెక్ కంపెనీలు (బీమా రంగ టెక్నాలజీ సంస్థలు) ఉన్నాయి. ఇందులో 10 యూనికార్న్లు, సూనికార్న్లు, 45కు పైగా మినీకార్న్లు ఉండగా, గడిచిన ఐదేళ్లలో ఆదాయం 12 రెట్లు పెరిగి 750 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం మీద ఈ రంగంలోకి వచ్చిన నిధులు 2.5 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం ఎకోసిస్టమ్ విలువ 13.6 బిలియన్ డాలర్లను అధిగమించింది’’అని ఈ నివేదిక వివరించింది. డిమాండ్, పంపిణీపై ఇన్సూర్టెక్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని, అండర్ రైటింగ్ (రిస్క్ల మదింపు), క్లెయిమ్లు, సేవల్లో ఆవిష్కరణలకు గణనీయమైన అవకాశాలున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది. అపార అవకాశాలు.. గడిచిన ఐదేళ్లలో భారత ఇన్సూర్టెక్ రంగం ఆదాయం 12 రెట్లు పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు బీసీజీ, ఐఐఏ నివేదిక వెల్లడించింది. ‘‘అండర్ రైటింగ్, క్లెయిమ్లలో డేటా, టెక్నాలజీ సామర్థ్యాల ను వినియోగించుకునేందుకు ఇన్సూర్టెక్ కంపెనీలకు అపార అవకాశాలున్నాయి’’ అని బీసీజీలో ఇండియా ఇన్సూరెన్స్ ప్రాక్టీస్ లీడ్, ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన పల్లవి మలాని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ఇన్సూరెన్స్ పరంగా చెప్పుకోతగ్గ పురోగతి సాధించినప్పటికీ.. హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ ఇప్పటికీ ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందన్నారు. 45 శాతం వైద్య చికిత్సల వ్యయాలను జేబుల నుంచే వ్యయం చేయాల్సి వస్తున్నట్టు వివరించారు. దీంతో 2047 నాటికి నూరు శాతం ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సాధించడంతోపాటు, జేబు నుంచి చేసే వ్యయాలను 10 శాతం లోపునకు పరిమితం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ నివేదిక సూచించింది. ఇక అంతర్జాతీయంగా ఇన్సూర్టెక్ రంగంలోకి నిధుల రాక తగ్గినట్టు, ఆసియా పసిఫిక్ ప్రాంతం ఈ విషయంలో బలంగా నిలబడినట్టు ఈ నివేదిక తెలిపింది. -
‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో అనారోగ్యాలు పెరుగుతున్నాయి. దాంతో వైద్య ఖర్చులు అధికమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య ఖర్చులకు బీమా మొత్తం సరిపోకపోవచ్చు. కాబట్టి కొంత ‘ఆరోగ్య నిధి’ని సైతం ప్రత్యేకంగా సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్య బీమా సరిపోనట్లయితే అత్యవసర నిధిని ఉపయోగించాల్సి రావొచ్చు. దాంతోపాటు అప్పు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పటివరకు చేసిన పొదుపు, పెట్టుబడులు కరిగిపోకుండా ఇది రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్నవారు ఈ నిధిని తప్పకుండా సిద్ధం చేసుకోవాలి.ఈ నిధి ఎందుకంటే..ఆరోగ్య బీమా పాలసీలో కేవలం వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు మాత్రమే అందిస్తారు. కానీ వైద్యేతర ఖర్చులు పాలసీదారులే భరించాలి. ఒకేవేళ పాలసీ తీసుకునే సందర్భంలో కో-పే(కొంత పాలసీ కంపెనీ, ఇంకొంత పాలసీదారు చెల్లించే విధానం) ఎంచుకుంటే మాత్రం వైద్య ఖర్చుల్లో కొంత పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. వైద్యం పూర్తవ్వకముందు, వైద్య పూర్తయిన తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.చిన్నపాటి ఖర్చుల కోసం..అత్యవసర పరిస్థితులకు ఆరోగ్య బీమా సరిపోతుంది. అయినప్పటికీ కొద్ది మొత్తంలో వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు రూ.15వేల లోపు వైద్య బిల్లులు అయితే దానికోసం ఆరోగ్య బీమాను వినియోగించకపోవడమే మేలు. ఒకవేళ క్లెయిమ్ చేస్తే పాలసీ రిన్యువల్ సమయంలో వచ్చే అదనపు బోనస్ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగని అప్పుచేసి ఆ ఖర్చులు భరించాలని కాదు. అందుకే ఇలాంటి ఖర్చుల కోసం సొంతంగా ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!ఎంత ఉండాలంటే..ఈ నిధి ఎంత మొత్తం అవసరం అనేదానికి కచ్చితమైన అంచనాలేం లేవు. మీ జీవినశైలి, మీరున్న ప్రాంతంలో ఖర్చులు, నెలవారీ మిగులుపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, ఈ నిధిని సొంతంగా నిర్ణయించుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలో కో-పే లేకపోతే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అత్యవసర ఆరోగ్య నిధి ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. -
మభ్యపెట్టి అంటగట్టొద్దు
బ్యాంకులో డబ్బు డిపాజిట్, విత్డ్రా, క్రెడిట్ కార్డులు, లోన్లు జారీ.. వంటి కార్యకలాపాలు సాగిస్తుంటారు. దాంతోపాటు వివిధ బీమా పాలసీలు కూడా విక్రయిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా తెలిపారు.ఈ సందర్భంగా పాండా మాట్లాడుతూ..‘బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలి. మోసపూరిత బీమా పాలసీలు విక్రయించకూడదు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకస్యూరెన్స్ (బ్యాంక్ శాఖల ద్వారా బీమా పాలసీలు విక్రయించే) మార్గం చాలా ఉపయోగపడుతోంది. అయితే దీన్ని కస్టమర్లకు అందించడంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్త వహించాలి. మోసపూరిత పాలసీలను అంటగట్టకూడదు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకర్ల పాత్ర కీలకం. బీమా పాలసీలను అమ్మడాన్ని ప్రాధాన్యతగా తీసుకోకూడదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలుప్రస్తుతం మార్కెట్లో చాలా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు విక్రయించినందుకు సిబ్బందికి ఇన్సెంటివ్లు ప్రకటిస్తున్నారు. దాంతో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు చేకూర్చని పాలసీలను, నిబంధనలు సరిగా తెలియజేయకుండా మోసపూరితంగా అంటగడుతున్నారు. దాంతో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ బ్యాంకులకు కొన్ని సూచనలు చేశారు. తాజాగా ఐఆర్డీఏఐ ఛైర్మన్ దీనిపై స్పందించారు. -
వడ్డీ రేట్లు భారమే..
ముంబై: ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు భారంగా భావిస్తున్నారని, కనుక వాటిని అందుబాటు స్థాయికి తీసుకురావాలంటూ బ్యాంక్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎస్బీఐ నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమలు కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. వడ్డీ రేట్లను తగ్గించడం వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడంలో సాయపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని, ఈ విషయంలో ఆహారపరమైన ద్రవ్యోల్బణాన్ని అవరోధంగా చూడడం సరికాదంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరడంతో ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం: ద్రవ్యోల్బణానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు కమోడిటీలు కారణమవుతున్నాయని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా మూడు లేదా నాలుగు శాతం ద్రవ్యోల్బణం స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం సూచీ లేదా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అన్న చర్చలోకి తాను వెళ్లాలనుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఎంతో సంక్లిష్టమైనదని, సామాన్యులపై భారం మోపుతుందంటూ.. సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వృద్ధి మందగమనంపై ఆందోళనలు అక్కర్లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యాంక్లు ప్రధానంగా రుణ వితరణ కార్యకలాపాలకే పరిమితం కావాలని, బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దని, ఇది రుణాలను భారంగా మారుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇది చాలా కీలకమని సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు 2025–26లో రూ.6.12 లక్షల కోట్లు, 2026–27లో రూ.7 లక్షల కోట్ల మేర రుణ వితరణ లక్ష్యాలను నిర్దేశించినట్టు ఆమె తెలిపారు. అనైతిక విధానాలను అరికట్టండి: దాస్ముంబై: సరైన కేవైసీ ధ్రువీకరణ లేకుండా ఖాతాలు తెరవడం, అబద్ధాలు చెప్పి ఉత్పత్తులను అంటగట్టడం వంటి అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకులు గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇందుకోసం అంతర్గత గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ పోర్ట్ఫోలియోలను క్రియాశీలకంగా సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పుల వల్ల తలెత్తే ముప్పులు.. సవాళ్లను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. -
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..
చాలా మందికి రిటైర్డ్ జీవితానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత కొందరు సముద్రానికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడితే మరికొందరు ప్రశాంతంగా ఏ కొండ ప్రాంతంలోనో లేదా ఊళ్లోనో ఉండాలనుకుంటారు. మన దేశంలో రిటైర్మెంట్ పరిస్థితులు నాటకీయంగా మారుతున్నాయి.పదవీ విరమణ అంటే పరిమితమైన అవసరాలతో ప్రశాంతమైన జీవనమనే రోజులు పోతున్నాయి. నేటి రిటైరీలు ఉద్యోగానంతరం కూడా జీవితాన్ని చురుగ్గా సాగించాలనుకుంటున్నారు. ప్రయాణాలు, హాబీలు, సోషల్ ఎంగేజ్మెంట్ మొదలైన వాటితో సందడిగా గడపాలనుకుంటున్నారు. అయితే, పటిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఈ కల సాకారం కాగలదు. చాలా మందికి తాము సరైన ప్రణాళికనే వేసుకున్నామా, తాము దాచుకుంటున్నది రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపోతుందా అనే సందేహాలు ఉంటాయి.ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాల కారణంగా ప్రస్తుతం మనిషి జీవితకాలం మరింతగా పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకో రూ. 1 లక్ష (ఏడాదికి రూ. 12 లక్షలు) అవసరమవుతాయని, 60 ఏళ్ల తర్వాత మరో 15 ఏళ్ల పాటు జీవిస్తారనుకుంటే మొత్తం రూ. 1.8 కోట్లు (రూ. 12 లక్షలు గీ 15) అవసరమవుతాయి. 85 ఏళ్ల వరకు జీవిస్తే రూ. 3 కోట్లు అవసరమవుతాయి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇలా అదనపు సంవత్సరాల కోసం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వనరుల సమీకరణకు కృషిరిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం నిశ్చింతగా సా గేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలించండి. వాస్తవ గణాంకాలను పరిగణన లోకి తీసుకోండి. మీ నెలవారీ జీవన వ్యయాలను లెక్కేయండి. ముందుగా చెప్పినట్లు జీ విత కాలం 85 ఏళ్లనుకుంటే, 60 ఏళ్ల వ్యక్తికి అప్పటివరకు అయ్యే జీ వన వ్యయాల కోసం రూ. 3 కోట్ల వర కు ని ధి అవసరమవుతుంది. వార్షిక ద్రవ్యోల్బణానికి సమాన స్థాయిలో రాబడులు ఉంటాయన్న అంచనా లతో ఈ మేరకు లెక్క వేశాం. మీ ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లెక్క వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. దేశీయంగా పెరుగుతున్న హెల్త్కేర్ ఖర్చులను ఒకసారి చూద్దాం. హెల్త్కేర్ ద్రవ్యోల్బణం సుమారు 14 శాతంగా ఉంటోంది. కొత్త టెక్నాలజీలు, చికిత్సల వల్ల బిల్లుల భారం మరింతగా పెరుగుతుంది. వైద్య చికిత్సల ఖర్చులు పెరిగే కొద్దీ ఎమర్జెన్సీల కోసం మరింత నిధిని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. పెరిగే ఖర్చులను తట్టుకునేందుకు మీరేం చేయాల్సి ఉంటుందంటే..పెద్ద మొత్తంలో కవరేజీ ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలిబేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ను పరిమాణాన్ని పెంచుకునేందుకు టాప్–అప్ తీసుకోవాలిమేజర్ అనారోగ్యం బైటపడినప్పుడు ఏకమొత్తంగా డబ్బునందించే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ను పరిశీలించాలిజీవితకాలానికి మించే రిటైర్మెంట్ ఫండ్ను సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే.. 1. భారీ రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం: పొదుపు చేయాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. 2. ఆర్థిక సాధనాలు ఉపయోగించుకోవాలి: మీ రిటైర్మెంట్ ఫండ్ను పెంచుకునేందుకు జీవిత బీమా సాధనాలను పరిశీలించండి. ఏ ఆర్థిక ప్రణాళికైనా, ముఖ్యంగా రిటైర్మెంట్లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి విజయవంతం కావాలంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీలు తగినంతగా ఉండటం ముఖ్యం. 3. పన్ను ప్రయోజనాలు: బీమా పథకాలు సాధారణంగా పన్నులపరమైన ప్రయోజనాలు కల్పించేవిగా ఉంటాయి. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్తో సహా ప్రస్తుత ఛానెల్లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్ఫామ్లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్ల ఆడిట్
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.ఐఆర్డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రెండు సంస్థల పేర్లను ఐఆర్డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. -
EPFO: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్పై మరింత ప్రయోజనం
ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెరుగుపరిచిన ఈ పథకం రూ. 7 లక్షల వరకు జీవిత బీమా రక్షణను అందిస్తుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 28 నుండి వర్తింపులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.1976లో ప్రారంభమైన ఈ పథకం ఈపీఎఫ్ఓ సభ్యులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ఈ స్కీమ్ కింద కనీసంగా రూ. 1.5 లక్షలు, గరిష్టంగా రూ. 6 లక్షల బీమా కవరేజీని 2018లో ప్రవేశపెట్టారు. ఇది 2021 ఏప్రిల్ వరకు కొనసాగింది. మళ్లీ 2021 ఏప్రిల్ 28 నుంచి పొడిగిస్తూ కనీస బీమా ప్రయోజనాన్ని రూ. 2.5 లక్షలకు, గరిష్ట కవరేజీని రూ.7 లక్షలకు పెంచారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..అంతేకాకుండా ఈ లబ్ధి పొందేలంటే చివరి 12 నెలలు ఒకే సంస్థలో పనిచేసి ఉండాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం సడలించింది. వేర్వేరు కంపెనీల్లో పనిచేసి ఉన్నా సరిపోతుంది. ఈ పథకం చెల్లుబాటు ఈ ఏడాది ఏప్రిల్ 27తో ముగియగా ఈ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. ఈ చొరవ ఇప్పుడు 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు రూ. 7 లక్షల వరకు జీవిత బీమాను అందిస్తుంది. -
పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమా
పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. దీన్ని తరాలు గుర్తిండిపోయేలా వైభవంగా జరపాలనుకుంటారు. పెళ్లి బట్టల షాపింగ్ నుంచి వధువు అత్తారింట్లో కాలుమోపే వరకు రూ.లక్షలు ఖర్చు చేస్తారు. మొన్నామధ్య అనంత్ అంబానీ పెళ్లికి ముఖేశ్ అంబానీ కుంటుంబం కోట్లల్లో ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయి. పెళ్లిలో ఎలాంటి అవాంతరం జరగకుండా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఆస్తి నష్టం కలిగి, బంధువులు గాయాలపాలైతే..పెళ్లి చేస్తున్న కుటుంబ సభ్యులకు తీరని వ్యథగా మారుతుంది. అలాంటి వారికోసం చాలా బీమా కంపెనీలు వివాహ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినా ఈ బీమా ఆర్థికంగా ఆదుకుంటుంది.వివాహ వేడుక స్థాయి, సర్వీసులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సర్వీసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది.లయబిలిటీ కవరేజీ..పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటిది జరిగితే ఈ కవరేజీ వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ థర్డ్ పార్టీకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు.ఏదైనా కారణాల వల్ల పెళ్లి రద్దైనా లేదా వాయిదా పడినా క్యాన్స్లేషన్ కవరేజీ ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. విలువైన వస్తువులు పాడైనా దాని కోసం ప్రత్యేకంగా కవరేజీ అందిస్తున్నారు. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ను అందించే సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా.. ‘అటైర్ కవరేజీ’ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవాలి. -
విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి గరిష్ఠంగా 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే ఇది 2.6 శాతం అధికం. విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లేప్పుడు ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. దానికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.ఆరోగ్య అత్యవసర పరిస్థితి కోసం..నిత్యం వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తూంటారు. వారికి వెళ్లినచోట ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.విభిన్న దేశాలు.. ఒకే పాలసీ..ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ పాలసీ అమలయ్యేలా ఒకే పాలసీని ఎంచుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.800-రూ.900 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: ఎక్కేద్దాం... ఎగిరిపోదాం! విమాన ప్రయాణికుల జోరుసామాగ్రి అందకపోయినా ధీమాగా..ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామాగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామాగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది. -
రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్పేలో కొత్త ప్లాన్
దీపావళి సమీపిస్తోంది. ఈ పండుగ ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆదమరిస్తో అంత విషాదాన్ని నింపేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్పే' బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఉపశమనం కల్పించడానికి ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ తీసుకువచ్చింది.ఫోన్పే పరిచయం చేసిన ఈ కొత్త ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ కేవలం తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 రోజుల పాటు రూ. 25,000 వరకు కవరేజి లభిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదా మరణం సంభవిస్తే దానికయ్యే ఖర్చుల నుంచి ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ కవరేజ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా కోసం ఫోన్పే యాప్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం వినియోగదారుకు మాత్రమే కాకుండా.. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులకు కవరేజి లభిస్తుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'ఫైర్క్రాకర్ బీమా కోసం ఎలా అప్లై చేయాలంటే➤ఫోన్పే యాప్లోని బీమా విభాగాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత, అక్కడే ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది.➤ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకున్న తరువాత ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఇక్కడే బీమా మొత్తం రూ. 25000, ప్రీమియం రూ. 9 ఉండటం చూడవచ్చు.➤కింద కనిపించే కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తరువాత పాలసీ పీరియడ్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని కిందనే పాలసీదారు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత తొమ్మిది రూపాయలు చెల్లించాలి. ఇలా సులభంగా ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు
బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీను సరళీకరించేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటుకు సంబంధించి 13 మందితో కూడిన ఈ మంత్రుల సంఘం సూచనలిస్తుంది. అక్టోబర్ 30న ఈ కమిటీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.జీఎస్టీ మండలి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ ఛౌధ్రి నేతృత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా, మేఘాలయ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల మంత్రుల సంఘం సిఫారసులు అందించనుంది. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్కు కేంద్రమంత్రి నితిన్గడ్కరీ బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు ఆర్థికమంత్రికి లేఖ సైతం పంపించారు. అంతకుముందే బీమా ప్రీమియంపై జీఎస్టీ సరళీకరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగానే తాజాగా మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసి నివేదిక కోరుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలునవంబర్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 5 శాతానికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. మరి కొన్నింటిలో ప్రీమియంపై పూర్తిగా జీఎస్టీను ఎత్తివేయాలని కోరుతున్నారు. -
సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..
ఇప్పటివరకు మనుషులకు, జంతువులకు, వ్యాపారాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి వినే ఉంటారు. ఇప్పుడు కొన్ని సంస్థలు ఏకంగా సైబర్ మోసాలకు కూడా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. దీనికోసం రోజుకు కేవలం మూడు రూపాయలు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..టెక్నాలజీ రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. సైబర్ మోసాల భారీగా పడి నష్టపోయిన ప్రజలు చాలామందే ఉన్నట్లు గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఈ నష్టాలను భర్తీ చేయడానికి చిన్న ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా కొన్ని సంస్థలు తీసుకురావడం జరిగింది.ఐడెంటిటీ చోరీ, డబ్బు పోగొట్టుకోవడం, ఫిషింగ్, ఈ-మెయిల్ స్పూపింగ్, సైబర్ స్టాకింగ్ మొదలం వాటికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ఇవన్నీ చిన్న మొత్తంలో కవరేజికి పనికొస్తాయి. ఈ రిస్క్ కవరేజీలు రోజుకు మూడు రూపాయల వద్ద లభిస్తున్నాయి. భారీ మొత్తంలో జీవిత భీమా, వెహికల్స్ ఇన్సూరెన్స్ మాదిరిగా లభించదు.ఇదీ చదవండి: ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఇందులో నకిలీ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్ మెసేజస్, ఫ్రాడ్ కాల్స్, పేస్ మార్పింగ్, ఓటీపీ వంటివి ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. నేరగాళ్లు ప్రజలను దోచుకోవాడానికి అన్ని విధాలా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాయలో పడితే.. భారీ నష్టాలను చవి చూడాలి ఉంటుంది. కాబట్టి ఈ భారీ నుంచు కొంత ఉపసమయం పొందటానికి ఈ ఇన్సూరెన్స్ ఉపయోగోపడుతుంది. -
ధీమాగా బీమా.. ఇలా!
'ఇన్సూరెన్స్'.. ఈ పదం మన నిత్యజీవితంలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులకు, జంతువులకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చాలా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు అనేక ఆఫర్లను అందిస్తూనే ఉన్నాయి. అయితే మీరు వాహనాలను కొనుగోలు చేసినప్పుడు.. దానికి ఇన్సూరెన్స్ పొందాలనుకున్నప్పుడు, తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ కథనంలో చూసేద్దాం..బీమా కవరేజ్వాహనాలను ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ పాలసీ అందించే కవరేజ్ గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో మోటారు బీమా పాలసీ రెండు ప్రధాన రకాల కవరేజీలను అందిస్తుంది. అవి థర్డ్-పార్టీ లయబిలిటీ, సమగ్ర కవరేజ్ (Comprehensive Coverage).కొత్త కారును కొనుగోలు చేసే సమయంలోనే కారు డీలర్ ద్వారా థర్డ్-పార్టీ బీమా అందిస్తారు. ఇది ఒక బేసిక్ ఇన్సూరెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. శారీరక గాయాలు, వైకల్యం, మూడో వ్యక్తి యొక్క వాహనం లేదా ఆస్తికి సంభవించే నష్టాలను మాత్రమే ఇది భర్తీ చేస్తుంది. థర్డ్-పార్టీ బీమా పాలసీ నిబంధనల ప్రకారం, మీ వాహనానికి జరిగిన నష్టానికి ఈ కవరేజి ద్వారా క్లెయిమ్ చేసుకోలేరు.ఇక సమగ్ర కవరేజ్ విషయానికి వస్తే.. రోడ్డు ప్రమాదం వంటి ఏదైనా ఊహించని సంఘటనల్లో కారుకు సంభవించే నష్టాలకు ఇది భర్తీ చేస్తుంది. కాబట్టి మోటారు బీమా పాలసీని ఎంచుకునే ముందు మీకు కావలసిన కవరేజీ గురించి తెలుసుకుని ఎంచుకోవాలి.ప్రీమియం & ఐడీవీబీమా పాలసీని ఎంచుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా ప్రీమియం లేదా ఐడీవీ (Insured Declared Value) గురించి కూడా తెలుసుకోవాలి. మీ కారు ఏదైనా రిపేరుకు మించి లేదా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పాడైపోయినప్పుడు ప్రీమియం కవరేజీ నష్టాన్ని భర్తీ చేస్తుంది.ఐడీవీ విషయానికి వస్తే.. దీనిని ఎంచుకునే ముందు మీరు కారు ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేసుకోవాలి. కారు బీమా పాలసీని ఆన్లైన్లో సరిపోల్చేటప్పుడు, కారు మార్కెట్ విలువకు దగ్గరగా ఉండే IDVని ఎంచుకోవచ్చు. అనుకోని ప్రమాదంలో మొత్తం కారు ధ్వంసమైనప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు ఈ కవరేజీ పనికొస్తుంది.యాడ్ ఆన్ కవర్స్మెరుగైన కవరేజ్ కోసం యాడ్-ఆన్లను కొనుగోలు చేయవచ్చు. సమగ్ర మోటారు బీమా పాలసీలో కవర్ చేయని కొన్ని నష్టాలను దీని ద్వారా కవర్ చేసుకోవచ్చు.ఉదాహరణకు.. ప్రమాదం సమయంలో కారు టైర్లకు డ్యామేజ్ జరిగితే.. ఆ నష్టాన్ని సాధారణ బీమా ద్వారా భర్తీ చేసుకోలేరు. కానీ ఈ యాడ్ ఆన్ కవర్స్ కొనుగోలు చేసి ఉంటే.. ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకోవచ్చు. కొత్త కారును కలిగి ఉన్నప్పుడు టైర్ కవర్, ఇంజిన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్, ఇన్వాయిస్ కవర్ వంటి వాటికోసం యాడ్ ఆన్ కవర్స్ ఎంచుకోవాలి.నో క్లెయిమ్ బోనస్నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది ఒక సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్లు చేయనందుకు బీమా కంపెనీలు అందించే రివార్డ్. మీరు కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసినప్పుడు ప్రీమియంపై తగ్గింపు రూపంలో రివార్డ్ పొందవచ్చు. వరుసగా 5 సంవత్సరాలు క్లెయిమ్ చేయని పక్షంలో.. మీరు మీ రెన్యూవల్ ప్రీమియంపై50 శాతం వరకు NCB తగ్గింపును పొందవచ్చు.ఇదీ చదవండి: కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండిఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలిఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాష్లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది.రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకుని మీ అవసరాలకు సరిపోయే బీమా పాలసీని ఎంచుకోవచ్చు. -
వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?
షోరూమ్లో కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా బీమా తీసుకోవాల్సిందే. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా లాంగ్టర్మ్ బీమా ఎంచుకుంటే ఐదేళ్లు బీమా వెసులుబాటు ఉంటుంది. అయితే బీమా అయిపోయాక చాలామంది దాన్ని తిరిగి రెన్యువల్ చేయడం లేదు. తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్లో కేవలం 19 శాతం టూ వీలర్ యజమానులు మాత్రమే బీమా రెన్యువల్ చేయిస్తున్నారు. వాహనం తీసుకున్న కొత్తలో అనివార్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీమా తీసుకోవాల్సిందే. కానీ బీమా సమయం పూర్తయిన తర్వాత కూడా వాహనదారులు ఇన్సూరెన్స్ చేయించాలి.మార్కెట్లో ఆప్లైన్తోపాటు ఆన్లైన్లో చాలా వెబ్పోర్టళ్ల ద్వారా టూవీలర్ బీమాను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బీమా తీసుకునేప్పుడు గమనించాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీమాలున్నాయి. మొదటిది థర్డ్ పార్టీ బీమా, రెండోది సమగ్ర బీమా. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వాహనాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైన జరిగితే పరిహారం ఇచ్చేలా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. శారీరక గాయాలు, ఆస్తి నష్టం, మరణం.. వంటివి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు.విస్తృత బీమావిస్తృత బీమా ప్రయోజనాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.ఇవి తెలుసుకోండి..కవరేజీ: బీమా పాలసీ ఎంచుకునేప్పుడు మొత్తం ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోవాలి. నిత్యం వాహనాన్ని ఉపయోగిస్తుంటే దాని విలువ ఆధారంగా కవరేజీని అంచనా వేయాలి. థర్డ్-పార్టీ చేయించినప్పటికీ.. సమగ్ర బీమా ఉండటమే మేలు. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినా పూర్తి భద్రత ఉంటుంది.ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ: వాహనం తీవ్రంగా దెబ్బతిన్నా లేదా దొంగతనానికి గురైనా కంపెనీలు అత్యధికంగా చెల్లించే పరిహారమే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ). వాహనాన్ని కొనుగోలు చేసి చాలా రోజులైతే క్రమంగా దాని విలువ తగ్గిపోతోంది. ఐడీవీ మార్కెట్లో వాహన ప్రస్తుత ధరను తెలియజేస్తుంది.బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియా(సీఎస్ఆర్) తెలుసుకోవాలి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.కొన్ని కంపెనీలు రోడ్సైడ్ అసిస్టెన్స్ కోసం కొంత మొత్తంలో బీమా తీసుకునే సమయంలోనే వసూలు చేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుపై నిలిచిపోతే దాన్ని సర్వీస్ సెంటర్ వరకు భద్రంగా చేరవేసేందుకు రోడ్సైడ్ అసిస్టెన్స్ యాడ్ఆన్ ఉపయోగపడుతుంది.బీమా రెన్యువల్ చేసిన ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే తర్వాత సంవత్సరం కట్టే ప్రీమియంకు కొన్ని కంపెనీలు రాయితీలు ఇస్తుంటాయి.ఇదీ చదవండి: ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపుఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహన రిపేర్ల కోసం ఎలాంటి నగదు చెల్లించకుండా ఉండే పాలసీను ఎంచుకోవాలి. పాలసీ నెట్వర్క్ గ్యారేజీల్లో ఉచితంగానే రిపేర్ చేస్తారు. మీరు ఉంటున్న ప్రదేశాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ గ్యారేజీలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. -
70 ఏళ్లుపైబడినవాళ్లకు ఆయుష్మాన్ భారత్ అమలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్భారత్ వర్తింపజేస్తూ నిర్ణయం. ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నది: మంత్రి అశ్వినీ వైష్ణవ్తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందుతాయి.కేబినెట్ నిర్ణయాలుపీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి ఆమోదం.. రూ.10,900 కోట్ల కేటాయింపు.. ఈవీలపై సబ్సిడీ కొనసాగింపు.. 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్ల ఏర్పాట్లు జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్ల కేటాయింపు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన.. రూ. 70,125 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం.. 25,000 గ్రామాలను కలిపేలా రోడ్ల నిర్మాణం పీఎం ఈ -బస్ సేవా పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. రూ. 3,435 కోట్ల రూపాయలతో 38వేల ఈ -బస్ ల ఏర్పాటు వాతావరణ శాఖ టెక్నాలజీ(మిషన్ మౌసమ్) కోసం రూ.2 వేల కోట్ల కేటాయింపు -
మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవంటే..
జీవిత బీమా విషయానికొస్తే మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఎంపిక ఉత్తమం? – జితేంద్రజీవిత బీమా పాలసీ కొనుగోలు చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం. ఆర్థికంగా తమపై ఆధారపడిన వారుంటే తప్పకుండా దీన్ని తీసుకోవాలి. తమకు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు కుటుంబ అవసరాలను ఆదుకుంటుంది. మనీబ్యాక్, యులిప్, పెన్షన్ ప్లాన్లు ఇవన్నీ హైబ్రిడ్ బీమా ఉత్పత్తుఉలు. ఇవి జీవిత బీమాతోపాటు పెట్టుబడుల ప్రయోజనాన్ని ఆఫర్ చేస్తుంటాయి. దీంతో చూడానికి ఆకర్షణీయంగా అనిపిస్తాయే కానీ, వాస్తవంలో కాదు. ఎందుకంటే ఈ తరహా పాలసీలు తగినంత జీవిత బీమా రక్షణను ఇవ్వవు.భారీ రక్షణ కోరుకుంటే ప్రీమియం చాలా ఖరీదుగా మారుతుంది. ఇక ఈ ప్లాన్లలో పెట్టుబడులపై రాబడులు చాలా తక్కువ. కనుక బీమా, పెట్టుబడులను వేర్వేరుగా నిర్వహించుకోవడం మంచిది. పెట్టుబడుల కోసం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా కోసం అచ్చమైన టర్మ్ ప్లాన్ను పరిశీలించాలి.హైబ్రిడ్ ప్లాన్లతో పోల్చి చూస్తే టర్మ్ ప్లాన్ల ప్రీమియం ఎంతో అందుబాటులో ఉంటుంది. 35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన పురుషుడికి రూ.కోటి కవరేజీకి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం రూ.15,000. చాలా మంది బీమా పాలసీని ఏజెంట్ లేదా బ్రోకర్ ద్వారా తీసుకుంటుంటారు. దీంతో వారు తమకు అధిక కమీషన్ లభించే హైబ్రిడ్ ప్లాన్లను అంటగడుతుంటారు.అచ్చమైన టర్మ్ ప్లాన్లో జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం రాదు. అలాంటివి టర్మ్ ప్లాన్లు అని సులభంగా గుర్తించొచ్చు. కేవలం పాలసీదారు మరణించిన సందర్భంలోనే ఈ ప్లాన్ల కింద పరిహారం అందుతుంది. కానీ, హైబ్రిడ్ ప్లాన్లు జీవించి ఉన్నా కానీ, చివర్లో కొంత మొత్తాన్ని వెనక్కిస్తాయి. ఇందుకోసం అవి అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవి? – వినయడెట్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ స్వల్పకాల అవసరాలకు ఉద్దేశించిన నిధులను లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రక్షణ ఉంటుంది. అస్థిరతలు లేకుండా ఊహించతగిన ఆదాయం కోసం షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఎంపిక చేసుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్లకు షార్డ్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి సురక్షితమైనవి. స్థిరత్వంతోపాటు నిలకడైన రాబడులు అందిస్తాయి.డైనమిక్ బాండ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటే.. ముందుగా ఆ విభాగంలోని పథకాల పనితీరు వివిధ వడ్డీ రేట్ల సైకిల్స్లో ఎలా ఉందన్నది విశ్లేషించండి. సంబంధిత ఫండ్ పోర్ట్ఫోలియోలోని డెట్ పత్రాల క్రెడిట్ నాణ్యతను కూడా పరిశీలించాలి. నిర్వహణ ఆస్తుల పరంగా టాప్–10 డైనమిక్ బాండ్ ఫండ్స్లో ఐసీఐసీఐ, కోటక్, ఎస్బీఐ పథకాలు మెరుగ్గా ఉన్నాయి. హెచ్ఎస్బీసీ ఇండియా ఎక్స్పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్హెచ్ఎస్బీసీ మ్యుచువల్ ఫండ్ కొత్తగా హెచ్ఎస్బీసీ ఇండియా ఎక్స్పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 19తో ముగుస్తుంది. ఉత్పత్తులు లేదా సర్వీసుల ఎగుమతుల వల్ల లబ్ధి పొందే సంస్థల షేర్లు, అలాగే ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తయారీ, ఆటోమొబైల్స్, పారిశ్రామికోత్పత్తులు, ఫార్మా, రసాయనాలు, టెక్స్టైల్స్, నిర్మాణం మొదలైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపార ఫండమెంటల్స్, పరిశ్రమ స్వరూపం, వేల్యుయేషన్, ఆర్థిక బలా లు వంటి అంశాల ప్రాతిపదికన షేర్ల ఎంపిక ఉంటుందని సంస్థ సీఐవో–ఈక్విటీ వేణుగోపాల్ మంగత్ తెలిపారు. కోటక్ నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా కోటక్ నిఫ్టీ ఇండియా టూ రిజం ఇండెక్స్ ఫండ్ను ప్రవేశపెట్టింది. ఇది సెప్టెంబర్ 16తో ముగుస్తుంది. నిఫ్టీ500లో ట్రావెల్, టూరిజం థీమ్ ఉన్న షేర్లను ఎంచుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ఇండెక్స్లోని ఒక్కో స్టాక్కి వెయి టేజీ ఉంటుంది. పర్యాటక రంగానికి చోదక విభాగాలు ఇందులో ఉంటాయి. విహారయాత్రలు, వ్యాపార సంబంధ ప్రయాణాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందవచ్చని సంస్థ ఎండీ నీలేశ్ షా తెలిపారు. యూటీఐ నుంచి రెండు ఇండెక్స్ ఫండ్ ఆఫర్లుయూటీఐ ఫండ్ 2 ఇండెక్స్ ఫండ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూటీఐ నిఫ్టీ ప్రైవేటు బ్యాంక్ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ200 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ ఆఫర్లను (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఇండెక్స్ ఫండ్ నిర్వ హణలో తమకున్న విస్తృతమైన అనుభవంతో తక్కువ వ్యయాలతో కూడిన అత్యధిక నాణ్యమైన పెట్టుబడుల ఆప్షన్లు అందిస్తున్నట్టు ఫండ్ పేర్కొంది. యూటీఐ నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్ఫండ్ అన్నది ఇదే సూచీలోని స్టాక్స్లో పెట్టుబడులు పెడుతుంది. ఈ 2 పథకాల ఎన్ఎఫ్వోలు 16న ముగుస్తాయి. కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ లేదు.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
జీవనశైలిలో మార్పు, విభిన్న ఆహార అలవాట్లతో అనారోగ్యబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉందనే ధీమాతో ఆసుపత్రిలో చేరిన కొందరి క్లెయిమ్లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే సమయంలోనే పాలసీదారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఇలా క్లెయిమ్ అందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తారు.. అలా కంపెనీలు క్లెయిమ్లు తిరస్కరించకూడదంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం.బీమా పాలసీ డాక్యుమెంట్లు గతంలో సామాన్యులకు అర్థంకాని కఠిన పదాలతో ఉండేవి. కానీ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీ పత్రాలు సరళమైన భాషలో ఉండాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అన్ని కంపెనీలు అందరికీ అర్థమయ్యే విధంగా పాలసీ పత్రాలను వెల్లడిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ జారీ చేస్తుంటాయి. అయితే వాటిని సరిగా అర్థం చేసుకుని బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.ఆరోగ్య సమాచారం సరిగా తెలపడంపాలసీ తీసుకునేప్పుడు ఆరోగ్య విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ గతంలో ఏదైనా సర్జరీలు, అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా కంపెనీలకు ముందుగానే చెప్పాలి. దానివల్ల స్వల్పంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ముందుగానే తెలియజేయడం ఉత్తమం.వెయిటింగ్ పీరియడ్పాలసీ తీసుకున్న వెంటనే కొన్ని రకాల జబ్బులకు కంపెనీలు వైద్య ఖర్చులు అందించవు. అలాంటి వ్యాధులకు బీమా వర్తించాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే కంపెనీలకు బట్టి ఈ వ్యాధులు మారుతుంటాయి. మీకు ఇప్పటికే కొన్ని జబ్బులుండి వాటికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవాలి.సరైన ధ్రువపత్రాలతో రీయింబర్స్మెంట్బీమా కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఆసుపత్రులు అందుబాటులో లేనివారు ఇతర హాస్పటల్లో వైద్యం చేయించుకుంటారు. తర్వాత బీమా కంపెనీకి బిల్లులు సమర్పించి తిరిగి డబ్బు పొందుతారు. అయితే అందుకు సరైన ధ్రువపత్రాలు అవసరం. వైద్యం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని నిబంధనల ప్రకారం రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి.ఇదీ చదవండి: అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..క్లెయిమ్ను తిరస్కరించకుండా ఏ జాగ్రత్తలు పాటించాలంటే..బీమా పాలసీ తీసుకునేముందే అన్ని నిబంధనలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి అవగాహన కలిగి ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలోనే అన్ని అంశాలను పరిశీలించాలి.బీమా సంస్థ నియమాలను తప్పకుండా అనుసరించాలి. పైన తెలిపిన విధంగా ఆరోగ్య విషయాల వెల్లడిలో పొరపాటు చేయకూడదు. ప్రతిపాలసీకు కొన్ని షరతులు, మినహాయింపులు, పరిమితులుంటాయి. వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే చేరాలి. అత్యవసరం అయితే తప్పా ఇతర హాస్పటల్స్లోకి వెళ్లకూడదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కోపే(కొంత బీమా కంపెనీ, ఇంకొంత పాలసీదారులు చెల్లించాలి) ఎంచుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం కొంత పాలసీదారులు చెల్లించాలి.కొన్నిసార్లు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఆ సందర్భంలో పరిహారం చెల్లించదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ వెబ్సైట్లో వాటిని అప్డేట్ చేస్తుంటారు.బీమా క్లెయిమ్ చేసుకునే విధానంలో ఎదైనా సందేహాలుంటే కంపెనీలను సంప్రదించాలి. బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తాయి. -
Bihar: డ్యూటీలో మరణిస్తే రూ. 2.30 కోట్లు
బీహార్ పోలీసులు ఇకపై ఉచిత జీవిత బీమా ప్రయోజనం పొందనున్నారు. తాజాగా బీహార్ పోలీసు విభాగం బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పుందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు పోలీసు సిబ్బంది ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే, వారి కుటుంబానికి రూ.2.30 కోట్ల వరకు బీమా ప్రయోజనం అందుతుందని బీహార్ పోలీసులు తెలిపారు.బ్యాంక్ ఆఫ్ బరోడాతో బీహార్ పోలీసులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దరిమిలా పోలీసు విభాగానికి చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ (హెడ్క్వార్టర్స్) జెఎస్ గంగ్వార్ మాట్లాడుతూ తమ సిబ్బంది కోసం ఉచిత జీవిత బీమా ప్రయోజనం కల్పించామన్నారు. దీనిలో సహజ మరణమైతే రూ.20 లక్షల వరకు అందజేస్తారన్నారు. డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు మరణించిన సిబ్బందికి బీమా ప్రయోజనం రూ.2.30 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఎవరైనా ఉద్యోగి డ్యూటీలో ఉన్నప్పుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 1.50 కోట్ల అదనపు బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు.ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి వికలాంగునిగా మారితే రూ.1.50 కోట్ల వరకు బీమా ప్రయోజనం పొందుతారన్నారు. బీహార్ పోలీస్ విభాగంలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి కూడా ప్రత్యేక ప్యాకేజీని అందించనున్నట్లు గాంగ్వార్ తెలిపారు. బీమా నిబంధనలలో సిబ్బంది కుమార్తెల వివాహం, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం కూడా ఉంటుందన్నారు. -
కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండి
ఒకప్పుడు ఇంటికో వాహనం ఉండేది. ఇప్పుడు మనిషికో వాహనం అన్నట్టుగా వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరూ భీమా / ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇది ప్రమాదం జరిగినప్పుడు నష్టాన్ని కొంత వరకు భర్తీ చేస్తుంది. కాబట్టి అది కొత్త కారు అయినా.. పాత కారు అయినా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి.చట్టప్రకారం కూడా మీ కారుకు భీమా ఉండాల్సిందే. చాలా మంది తమ వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి క్యాష్లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది.క్యాష్లెస్ క్లెయిమ్ కింద జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే.. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఇన్సురెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ తరువాత ఇన్సూరెన్స్ సంస్థ కారును ఏదైనా గ్యారేజిలో జరిగిన నష్టాన్ని లేదా ప్రమాదాన్ని అంచనా వేసి ఖర్చు ఎంతవుతుందో లెక్కిస్తారు. అయితే ఇన్సురెన్స్ కంపెనీలకు తెలియకుండా కారును రిపేర్ షాపుకు లేదా గ్యారేజీకి తీసుకెళ్లకూడదు.కారును గ్యారేజీ సిబ్బంది రిపేర్ చేసిన తరువాత.. రిపేర్ చేయడానికి అయిన ఖర్చును నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజికే చెల్లిస్తుంది. ఒకవేళా కారును రిపేర్ చేయడానికి వీలుకానప్పుడు కారు విలువ మొత్తాన్ని సంస్థ కారు యజమానికి చెల్లిస్తుంది.ఇక రెండోది.. రీయింబర్స్మెంట్ క్లెయిమ్. దీని కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే.. ముందుగా కారు ప్రమాదానికి గురైన 24 గంటలలోపు ఫోన్ చేసి లేదా ఆన్లైన్లో చెప్పే అవకాశం ఉంటే తెలియజేయాలి. ఆ తరువాత క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తరువాత ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సంస్థకు సమాచారం అందించిన తరువాత మీ వాహనాన్ని మీకు నచ్చిన గ్యారేజికి తీసుకెళ్లి రిపేర్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నష్టం జరిగింది.. రూ.50 కోట్లు ఇవ్వండి: రిమీ సేన్కారు రిపేర్ పూర్తయిన తరువాత.. దానికైన ఖర్చు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. వాటన్నింటినీ కంపెనీ పరిశీలించి కారు యజమానికి డబ్బు చెల్లిస్తుంది. -
బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!
పంటల బీమా చెల్లించడంలో సంస్థలు ఆలస్యం చేస్తే 12 శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు వాటి సంఖ్య 8.69 కోట్లకు పెరిగిందన్నారు. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్ల బీమా పొందారని తెలిపారు.ఈ మేరకు లోక్సభలో మంత్రి మాట్లాడుతూ..‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై ) కింద రైతులకు చెల్లించాల్సిన బీమా ఆలస్యం చేస్తే కంపెనీలపై 12 శాతం పెనాల్టీ విధిస్తాం. ఇది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. పంటల బీమాకు సంబంధించి రాష్ట్రాల ప్రీమియం విడుదలలో జాప్యం జరుగుతోంది. బీమా చెల్లింపుల్లో జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను విడుదల చేస్తుంది. గత ప్రభుత్వంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు అది 8.69 కోట్లకు పెరిగింది. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్లకు బీమా పొందారు. సహజ కారణాల వల్ల నష్టపోయిన పంటలను ఈ పథకం కవర్ చేస్తోంది. 2023లో 5.01 లక్షల హెక్టార్ల పంట భూమి ఈ బీమా పరిధిలోకి వచ్చింది. అది 2024లో 5.98 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దీని ద్వారా 3.57 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ -
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పెన్షన్, పీఎఫ్పై వివాదం.. స్పందించిన ఆర్మీ
అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సియాచిన్ గ్లేసియర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్కు చెందిన అన్షుమాన్ సింగ్కు.. మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రకటించింది.జూలై 5న ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. కాగా అయితే పెళ్లైన అయిదు నెలలకే అన్షుమాన్ మరణించడం, వారి ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి. ఈ వీడియోను రక్షణశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసిందిఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.కాగా వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఏజీఐఎఫ్), ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) , ఇతర స్థిరాస్తుల నుంచి బీమా పొందడం కోసం తమ తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అయితే వీటన్నింటికీ ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. కానీ పెన్షన్ కోసం ఒకే నామినీ ఉంటారు. జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని NOKకేగా పేర్కొంటారు. ‘నా కొడుక్కి వచ్చిన అవార్డును కోడలు తీసుకెళ్లింది. ఆమె మాతో ఉండటం లేదు. మేము కొడుకునే కాదు, అవార్డును కూడా కోల్పోయాం. కోడలు మాతో జీవించాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొడుక్కి వచ్చిన అవార్డుపై మాకూ అధికారం లేదా?‘ అని వాపోయారు. అయితే అత్తమామల ఆరోపణలపై సింగ్ భార్య స్మృతి సింగ్ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.అయితే కోడలు స్మృతి సింగ్పై దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా వచ్చి రూ.1 కోటి eర్థిక సాయం.. సింగ్ భార్య, తల్లిదండ్రులకు 50-50 శాతం విభజించనున్నట్లు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పీఎఫ్, పెన్షన్ మాత్రం భార్యకే చెందుతుందని తెలిపాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రూ. 50 లక్షల సహాయంలో రూ. 35 లక్షలు అతని భార్యకు, రూ. 15 లక్షలు అతని తల్లిదండ్రులకు అందించనున్నట్లు పేర్కొన్నాయి.Amid allegations made by the parents of late Captain Anshuman Singh against their daughter-in-law Smriti Singh, Army sources clarified that the AGIF of ₹1 crore was split between his wife and parents while the pension goes directly to the spouse. @dperi84 reports.… pic.twitter.com/UCJocN2TBA— The Hindu (@the_hindu) July 14, 2024 వీలునామాలో సింగ్ భార్య నామినేట్ అయినందునా ఆమెకు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అంతేగాక కెప్టెన్ సింగ్ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కావడంతో ఆయనకు స్వయంగా పెన్షన్ పొందున్నారు. మాజీ అధికారిగా ఇతర ప్రయోజనాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఆర్మీ పాలసీ ప్రకారం ఒక అధికారి వివాహం చేసుకున్న తర్వాత, అతని భార్య పెన్షన్ కోసం నామినీ అవుతుందని ఆర్మీ వర్గాలు వివరించాయి.అయితే సింగ్ తల్లిదండ్రుల ఆరోపణలపై పలువురు అధికారులు స్పందించారు. నామినీ అనేది ఖచ్చితంగా అధికారి ఎంపిక అని. అందులో జీవిత భాగస్వామి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు పూర్తిగా కుమారుడిపై ఆధారపడిన సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలను ఆర్మీ యూనిట్ పరిష్కరిస్తుందని తెలిపారు. -
కొత్తగా ‘160’ సిరీస్ ఫోన్ నంబర్లు.. ఎవరికంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల ‘160’ సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉన్న సంస్థలు మొదటి దశలో సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం '160' ఫోన్ నంబర్ సిరీస్కు మారుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.అంటే ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర సంస్థల నుంచి సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ '160'తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. మోసగాళ్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్ను వినియోగదారులు సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.ట్రాయ్ అధికారులు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25కు పైగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, టెల్కోలు సహా ఇతర ఆర్థిక సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రమోషనల్ అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న 140 సిరీస్ కార్యకలాపాలను డీఎల్టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)కి మార్చడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు, డిజిటల్ సమ్మతిని కూడా అమలు చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్, మార్కెటింగ్ కోసం 140 సిరీస్ను అమలు చేయడంతో.. 10 అంకెల నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పై గణనీయమైన నియంత్రణ ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన 10 అంకెల స్పామ్ నంబర్లలో చాలా వరకు కృత్రిమ మేధను ఉపయోగించి టెల్కోలు నేరుగా బ్లాక్ చేస్తున్నాయి. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (ఎల్ఐసీ) పాలసీ దారులకు ముఖ్యగమనిక. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధన్ వృద్దిని విత్డ్రా చేసుకుంటున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది.ఈ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ .. పాలసీ పాలసీదారులకు రక్షణ, సేవింగ్స్ను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తికి మెచ్యూరిటీ తేదీలో హామీ ఇవ్వబడిన మొత్తం మొత్తాన్ని కూడా అందించేది.ఈతరుణంలో ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ఫిబ్రవరి 2, 2024న పునఃప్రారంభించబడింది. ఏప్రిల్ 1, 2024 న ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ప్రత్యేకతుల • సింగిల్ ప్రీమియం ప్లాన్• పాలసీ టర్మ్, డెత్ కవర్ని ఎంపిక చేసుకోవచ్చు. • పాలసీ వ్యవధిలోపు పాలసీ దారులకు హామీ ఇచ్చినట్లు ప్రయోజనాలను అందిస్తుంది. •ఎక్కువ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీలకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. • మరణం లేదా మెచ్యూరిటీపై లంప్సమ్ బెనిఫిట్• మెచ్యూరిటీపై ఇన్స్టాల్మెంట్, సెటిల్మెంట్లో డెత్ బెనిఫిట్స్ను ఎంపిక చేసుకోవచ్చు.• పాలసీకి లోన్ అందుబాటులో ఉందిఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ టర్మ్• ఎల్ఐసీ ధన్ వృద్ధి 10, 15 లేదా 18 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కాలాన్ని బట్టి కనీస ప్రవేశ వయస్సు 90 రోజుల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. • ఎల్ఐసీ ధన్ వృద్ధి ప్లాన్ బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్• పాలసీ కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 1,25,000. • జీవిత బీమా పాలసీ వ్యవధిలో రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత కానీ నిర్ణీత గడువు తేదీకి ముందు పాలసీదారులు మరణిస్తే.. నిబంధనల ప్రకారం ప్రయోజనాలు సంబంధిత పాలసీ దారుడి కుటుంబానికి అందుతాయి. -
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ప్రముఖ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అప్స్టాక్స్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. తమ కొత్త బిజినెస్ను టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్తో ప్రారంభిస్తున్నామని కంపెనీ వర్గాలు చెప్పాయి. త్వరలో హెల్త్, మోటార్, ట్రావెల్ సెగ్మెంట్లలో బీమా ఉత్పత్తులు మొదలుపెడుతామని కంపెనీ తెలిపింది.అప్స్టాక్స్తో మొదటి భాగస్వామిగా హెచ్డీఎఫ్సీ లైఫ్ జతైనట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అప్స్టాక్స్ కోఫౌండర్ కవితా సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘మా కంపెనీను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ సురక్షితంగా, వేగంగా పనిచేస్తోంది. వినియోగదారుల సంపదను సమర్థంగా నిర్వహించడంలో భాగంగా బీమా సేవలు ప్రారంభించాం. కొత్త బిజినెస్ మోడల్ వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.అప్స్టాక్స్ ఇప్పటికే స్టాక్ క్రయవిక్రయాలు, ఐపీఓలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లు, కమోడిటీలు, కరెన్సీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీర్-టు-పీర్ లెండింగ్, ప్రభుత్వ బాండ్లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు సహా అనేక రకాల సేవలందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్లకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కస్టమర్లకు సంబంధించి పది రెట్లు వృద్ధి నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఫోన్పే వంటి ఫిన్టెక్ కంపెనీలు సైతం బీమా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్స్టాక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2023, ఏప్రిల్ 24న వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫోన్పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్లో రూ.426 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. -
బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ సర్క్యులర్ జారీ
బీమా కంపెనీలు వాటికి నిర్దేశించిన రంగాల్లో తప్పనిసరిగా కనీస వ్యాపారం చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) మాస్టర్ సర్క్యులర్ను జారీ చేసింది. 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.బీమా కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో, సామాజిక రంగంలో, మోటారు థర్డ్ పార్టీకి సంబంధించి కనీస లక్ష్యాలు చేరుకోవాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఈ ఆదేశాలు జీవిత బీమా సంస్థలతోపాటు నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలకు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా కంపెనీలు తప్పనిసరిగా వాటికి కేటాయించిన రంగాల్లో కనీస వ్యాపారాన్ని చేయాలని చెప్పింది.ఇదీ చదవండి: గోల్డ్ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖతో సంప్రదించి గతంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు గ్రామ పంచాయతీలను కేటాయించింది. గ్రామీణరంగ బాధ్యతలను నెరవేర్చాలని ఆదేశించింది. ఆయా కంపెనీలు పంచాయతీల పరిధిలో బీమాలేని వారికి అవగాహన కల్పించి బీమా తీసుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. సామాజిక రంగంలో, మోటార్ థర్డ్ పార్టీ బీమా చేసుకునేలా సంస్థలు బాధ్యత వహించి తమకు నిర్దేశించిన కనీస టార్గెట్ను పూర్తి చేయాలి. ప్రస్తుతం దేశంలో ఐదు స్వతంత్ర ఆరోగ్య బీమా కంపెనీలు, 40 సాధారణ బీమా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. -
ఒక్కనెలలోనే రూ.12వేలకోట్ల ప్రీమియం వసూలు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఒక్కనెలలోనే రూ.12,384 కోట్ల ప్రీమియం వసూలు చేసింది. 2014 తర్వాత నెలవారీ అధిక ప్రీమియం వసూలైనట్లు తెలిసింది.2024 ఏప్రిల్ నెలకుగాను ఎల్ఐసీ సంస్థ రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు తెలిపింది. గత ఏడాది ఏప్రిల్లో వసూలైన రూ.5,810.10 కోట్ల ప్రీమియంతో పోలిస్తే ఇది 113.14% అధికంగా నమోదైంది. ఎల్ఐసీ వ్యక్తిగత ప్రీమియం విభాగంలో రూ.3,175.47 కోట్లను వసూలు చేసినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. 2023 ఇదే కాలంలోని రూ.2,537.02 కోట్లతో పోలిస్తే ఇది 25.17% ఎక్కువ. గ్రూప్ పాలసీల ప్రీమియం వసూళ్లు రూ.9,141.34 కోట్లుగా ఉన్నాయి. గత ఏప్రిల్లో రూ.3,239.72 కోట్లతో పోలిస్తే ఇది 182.16% అధికంగా ఉంది. ఎల్ఐసీ పాలసీదారుల నమ్మకాన్ని సంపాదించిందని అందువల్లే ఇలా పెద్ద మొత్తంలో ప్రీమియం వసూలైనట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. -
బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆపద్బాంధవి. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే చేతి నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందుతోంది. ఏదైనా శస్త్ర చికిత్స జరిగినా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక విశ్రాంత సమయంలో సైతం ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ద్వారా భృతి కూడా ఇస్తోంది. వెరసి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టకాలంలో ఈ పథకం కొండంత అండగా నిలుస్తోంది. ఇంతటి గొప్ప పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శీతకన్ను వేశారు. నాడు వైఎస్సార్కు, నేడు సీఎం జగన్కు ఎంతో మంచి పేరు తెచ్చిన ఈ పథకాన్ని ఏదోరకంగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో 2014–19 మధ్య ఈ పథకానికి పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారు. ప్రొసీజర్లు, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచకుండా అధికారం లోంచి దిగిపోయేనాటికి అంపశయ్య పైకి ఎక్కించారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకానికి ఊపిరిలూదారు. దీంతో బాబుకు మింగుడు పడలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పెద్ద స్కెచ్చే వేశారు. బీమా పేరుతో మాయ చేసి, మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేకుండా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పారీ్టలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైద్యం, ఆరోగ్యం అంటూ నాలుగు అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగ్గా అమలు పరుస్తామని గానీ, పేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు (క్యాష్ లెస్ ట్రీట్మెంట్), రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యం కల్పిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్నిబట్టి బాబు వస్తే ఆరోగ్యశ్రీ పథకం కనుమరుగవుతుందనడానికి టీడీపీ మేనిఫెస్టో ఒక సంకేతం అని రాజకీయ విశ్లేషకులు, వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. ట్రస్ట్లో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు చేతి నుంచి నగదు చెల్లించకుండానే పూర్తి స్థాయిలో చికిత్సలు పొందుతున్నారు. కాగా, టీడీపీ తాజా హామీని గమనించినట్లయితే వాళ్లు అధికారంలోకి వస్తే.. ట్రస్ట్ స్థానంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏజెన్సీలను ప్రవేశపెట్టనున్నారని ఇట్టే తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభు త్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నా యి. అదే ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే వారి లాభాపేక్ష వల్ల ప్రజలకు వైద్య సేవల కల్పన ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహమే లేదు. ట్రస్ట్ అయితే అందులో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్స్కు అయి నా నిర్ధే శించిన రేట్స్ ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డానికి వీలుండదు. అలా వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈవో ఆధ్వర్యంలో ఆస్పత్రులపై చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవే ట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు వస్తే ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి. లేదంటే ఆస్పత్రి నుంచి బయటకు పంపించేస్తాయి. ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేని 2024 టీడీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా ∗ ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ∗ అన్ని మండలాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు ∗ బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు జనరిక్ మందులు 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతో పాటు, మరో 12 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి ఐదేళ్లలో అందుబాటులోకి తేవడం.తద్వారా 2,550 ఎంబీబీఎస్, 2,737 పీజీ మెడికల్ సీట్లు సమకూర్చడం.∗ కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు తేవడం ద్వారా అందుబాటులోకి 1,020 నర్సింగ్ సీట్లు. ∗ హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో మూడు వైద్య హబ్ల ఏర్పాటు. ∗ క్యాన్సర్ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేలా గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు.∗ గడచిన ఐదేళ్లలో మాదిరిగానే వచ్చే ఐదేళ్లలోనూ ప్రజారోగ్య రంగానికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు. వైద్య రంగ అభివృద్ధిని కొనసాగిస్తాం. పై రెండు మేనిఫెస్టోలు గమనిస్తే ప్రజారోగ్యం పట్ల ఏ నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. మూడు సార్లు సీఎంగా పనిచేశా.. విజనరీనని చెప్పుకునే నాయకుడు ప్రజారోగ్యం పట్ల ఉజ్జాయింపుగా నాలుగంటే నాలుగే హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సీఎం జగన్ మాత్రం ప్రజారోగ్యం విషయంలో గడచిన ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆ ఒరవడిని అదే విధంగా కొనసాగిస్తూ వచ్చే ఐదేళ్లలోను ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తానని తన మేనిఫెస్టోలో ప్రకటించారు. సాక్షి, అమరావతి: వైద్య, విద్యా రంగాలను ప్రైవేట్ పరం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగానే తొలి నుంచీ ఆయన ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తాం’ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా ప్రొసీజర్లను పెంచి చేతులు దులుపుకున్నారు.2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చి, కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి. వివిధ అనారోగ్య బాధితులకు చికిత్సలు అందించడానికి ఆస్పత్రుల నుంచి ట్రస్టుకు అభ్యర్థనలు వచ్చినా వాటిని రోజుల తరబడి పెండింగ్లో ఉంచేవారు.దీంతో చేసేదేమీ లేక చికిత్సలు చేయించుకోవడానికి ప్రజలు అప్పులపాలైన దుస్థితి. ఈ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చి, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.1,059గా ఉన్న ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. తద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్సల కోసం రూ.13,421 కోట్లు వెచ్చించారు. ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర శస్త్ర చికిత్సలు చేయించుకున్న 24.59 లక్షల మందికి సాయం చేశారు.జగన్, బాబు పాలన మధ్య ఎంతో తేడా! అంశం: కొత్త వైద్య కళాశాలలు జగన్ పాలన: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. ఇందుకోసం ఏకంగా రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం మరో ఐదు, వచ్చే విద్యా సంవత్సరం మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. బాబు పాలన: టీడీపీ అధికారంలో ఉండగా ఏ రోజు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు పాటుపడింది లేదు. వైద్య విద్యను వ్యాపారం చేసి తన వాళ్ల జేబులు నింపడానికే పాటుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 16 ప్రైవేట్ వైద్య కళాశాలలకు బాబు పాలనలో అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంశం : గ్రామీణ ప్రజల ఆరోగ్యం జగన్ పాలన: పీహెచ్సీ వైద్యులనే గ్రామాలకు పంపి ప్రజలకు వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి, వారి ఆరోగ్యాలపై వాకబు చేశారు. 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లను నియమించారు. తద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 105 రకాల మందులను అందుబాటులో ఉంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడు విలేజ్ క్లినిక్స్లో టెలీ మెడిసిన్ సౌకర్యం ఉండటంతో స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ఇక్కడే లభిస్తుండటంతో పట్టణాలు, నగరాల్లోని పెద్దాస్పత్రులకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఇళ్ల వద్దకు మందుల డోర్ డెలివరీ ప్రారంభించింది. బాబు పాలన: పల్లె ప్రజలకు సుస్తీ చేస్తే పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిందే. ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమం ఉండేది కాదు. విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఊసే లేదు. పీహెచ్సీలకు వెళితే అక్కడ డాక్టర్లు ఉంటారో లేదో తెలియని దుస్థితి. దీంతో చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, వ్యయప్రయాసలకోర్చి పరుగు తీయాల్సిన పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ, క్రమం తప్పకుండా వారి ఆరోగ్యంపై వాకబు చేసే వ్యవస్థ లేక, ప్రజలు జబ్బు ముదిరి అప్పులపాలయ్యేవారు. అంశం : ఇంటింటా ఆరోగ్య సర్వే జగన్ పాలన: అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, వైద్య పరీక్షలు నిర్వహించి వివిధ అనారోగ్య బాధితులను గుర్తించారు. వారికి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ సురక్ష శిబిరాలు నిర్వహించి స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి, ఉచితంగా చికిత్స చేయించారు. బాబు పాలన: ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమం నిర్వహించిందే లేదు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని వాకబు చేసి, వాటి పరిష్కారానికి కనీసం ఆలోచించిన పాపాన పోలేదు. అంశం: ఆస్పత్రుల్లో నాడు–నేడు జగన్ పాలన: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే నాడు–నేడు కార్యక్రమంల ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రుల్లో వనరులను సమకూర్చారు. దీంతో 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్క్వాష్), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది.కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. ఆస్పత్రుల్లో ఏ ఒక్క వైద్య, సిబ్బంది పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఐదేళ్లలో 54 వేల మేర పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించారు. 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలు కోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. బాబు పాలన: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసేలా టీడీపీ జమానాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, సర్జికల్స్, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే బాబు వ్యవహరించారు. 2014–19 మధ్య గుంటూరు జీజీహెచ్లో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందడం బాబు పాలనలో దిగజారిన ప్రభుత్వ వైద్య రంగ దుస్థితికి నిదర్శనం. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం గుణపాఠంతో ఆస్పత్రులను బలోపేతం చేసేలా అడుగులు వేయలేదు. ఐదేళ్ల బాబు పాలనలో కేవలం 4 వేల మేర పోస్టులను మాత్రమే వైద్య శాఖలో భర్తీ చేశారు. బాబు పాలనలో 108, 104 వ్యవస్థలు కూనరిల్లాయి. ఎవరు కావాలో ఆలోచించండి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ఇంతగా నిర్వీర్యం చేసిన నేత ఒక్క చంద్రబాబు తప్ప దేశంలో మరొకరుండరు. సింగపూర్, యూకే ప్రపంచ స్థాయి రాజధాని అంటూ బాబు బాకాలు ఊదిన అమరావతికి కూత వేటు దూరంలోని గుంటూరు జీజీహెచ్లోనే అప్పట్లో శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. 2019లో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రభుత్వాస్పత్రులను సంస్కరించారు. వైద్య రంగానికి ఊపిరిలూదారు. పెద్దాస్పత్రులను ఐదేళ్లలో అవయవాలు మార్పిడి చేసే స్థాయికి తీసుకెళ్లారు.ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్స్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే సర్కార్ వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని దిగజార్చిన బాబు, ఆ వైద్య రంగానికి ఊపిరిలూదిన వైఎస్ జగన్.. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సముచిత నిర్ణయం తీసుకోకపోతే వైద్యానికి డబ్బు కోసం ఆస్తులు తాకట్టుపెట్టాలి. ఆస్తులు లేని వారు తల తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలి. -
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది. -
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది. ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది. ఫ్రీలాంజ్ యాక్సెస్.. ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి. ఇదీ చదవండి: ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే..! పాలసీ డిజిటలైజేషన్ ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపుదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది.ఫ్రీలాంజ్ యాక్సెస్..ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.పాలసీ డిజిటలైజేషన్ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్.. ఎల్ఐసీ
న్యూఢిల్లీ: దేశీ బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రపంచంలోనే అ త్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిల్చింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్తో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్ఆర్ఎంఏ ఇన్సూరెన్స్ 1.3 బిలియన్ డాలర్ల విలువతో (82% వృద్ధి) మూడో స్థానంలో ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ తెలిపింది. మరోవైపు, విలువపరంగా చూస్తే చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. 33.6 బిలియన్ డాలర్లతో పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సీపీఐసీ వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది రాష్ట్రాలు ముందుంటున్నాయి. పట్టణవాసుల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మందికి బీమా రక్షణ ఉంటోంది. బీమాపై అవగాహన, జీవిత బీమా పాలసీ కలిగి ఉండటం, ఆర్థిక భద్రతను మెరుగుపర్చుకోవడంపై ఇక్కడి వారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. దీనికి సంబంధించి బీమా సంస్థ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మార్కెటింగ్ డేటా కాంతార్ నిర్వహించిన 6వ విడత ఇండియా ప్రొటెక్షన్ కోషంట్ (ఐపీక్యూ) సర్వేలో దక్షిణాది 49 పాయింట్లు దక్కించుకుంది. దీని ప్రకారం 44 పీక్యూతో దక్షిణాది మెట్రోల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు. దక్షిణ భారతంలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక ప్రీమియం అనేది టర్మ్ ప్లాన్ కొనుగోలుకు అవరోధంగా ఉంటోందని పేర్కొన్నారు. దక్షిణాది వారు రిటైర్మెంట్ ప్లానింగ్కి మరింతగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్వాసులు ఆరోగ్యకరమైన అలవాట్ల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పాటు పిల్లల భవిష్యత్పైనా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లు వివరించింది. 25 నగరాల వ్యాప్తంగా 4,700 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. -
అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే!
అట్లాంటాలోని బుఫోర్డ్ హైవేలోగల గ్యాస్ స్టేషన్లో గత జనవరి 21న జరిగిన సాయుధ దోపిడీని దులుత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించింది. వివరాల్లోకి వెళితే గ్యాస్ స్టేషన్ నిర్వాహకుడు, క్యాషియర్ రాజ్ పటేల్.. నలుపు రంగు దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, ఐదువేల డాలర్లు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాస్ స్టేషన్లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రసారం అయినప్పుడు ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ పటేల్ను ఆ గుర్తు తెలియని వ్యక్తి కొట్టగానే అతను వెంటనే కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. రాజ్ పటేల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతనితో పాటు అదే గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న కర్టిస్లను విచారించారు. దీనిలో వారు డబ్బు కోసం కుట్ర పన్నారని తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పటేల్ ఈ దోపిడీకి సంబంధించి చెబుతున్నదానిలో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్ పటేల్ విచారణ అధికారులతో గుర్తు తెలియని వ్యక్తి తన ముఖంపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. అయితే పోలీసులకు రాజ్ పటేల్ ముఖంపై ఎలాంటి గుర్తులు కనిపించలేదు. సెక్యూరిటీ ఫుటేజ్లో కర్టిస్.. రాజ్ పటేల్ను మెల్లగా కొట్టినప్పటికీ అతను వెంటనే పడిపోవడం పోలీసులలో అనుమానాలను పెంచింది. తనపై దాడిచేశాక ఆ గుర్తు తెలియని వ్యక్తి బయటపడేందుకు గ్యాస్ స్గేషన్లోని మరో తలుపును ఉపయోగించాడని రాజ్ పటేల్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ అధికారి అదే తలుపు నుండి బయటకు వెళ్లి అక్కడ పరిశీలించాడు. కర్టిస్ ఆ గదిలో పనిచేసేవాడని పటేల్ పోలీసులకు తెలిపాడు. అయితే కర్టిస్ తాను ఈ దాడి జరిగిన సమయంలో ఎవరినీ చూడలేదని పోలీసు అధికారులకు చెప్పాడు. వీడియో ఫుటేజీలో ఆ గుర్తు తెలియని వ్యక్తి సైడ్ డోర్ నుండి బయటకు వెళ్లి, అక్కడున్న చెత్తకుప్ప దగ్గర రెండుసార్లు బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పోలీసులు కర్టిస్ను అదుపులోకి తీసుకుని, ఆ గది కీని అడిగారు. అతను కీని బయటకు తీసే సమయంలో అతని జేబులో నుండి విలువైన బిల్లులు పడిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. కర్టిస్ గ్యాస్ స్టేషన్లో ఉద్యోగి అని, ఈ దోపిడీకి పాల్పడింది అతనేనని పటేల్ పోలీసుల ముందు ఆరోపించాడు. పోలీసుల విచారణలో కర్టిస్ తాను నగదు దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా రాజ్ పటేల్ చేసిన ప్లాన్ అని, తాను దొంగిలించిన నగదు తీసుకుంటే, రాజ్ పటేల్ బీమా సొమ్ము తీసుకోవాలని ప్లాన్ చేశాడని కర్టిస్ పోలీసులకు తెలిపాడు. -
గురివింద ప్రయాసే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం నుంచి రాళ్లేస్తున్న రాజ గురివింద ప్రవాసాంధ్రులకు బీమా రక్షణ కరువైందంటూ కన్నీళ్లు పెట్టారు! చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో బీమా క్లెయిమ్గా నలుగురు బాధిత కుటుంబాలకు చెల్లించిన మొత్తం రెండంటే రెండు లక్షల లోపే ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 28 లక్షల మందికి రూ.42 లక్షలకుపైగా క్లెయిమ్ పరిహారం అందచేసింది. మరో రూ.25 లక్షల మొత్తానికి సంబంధించిన క్లెయిమ్లు ప్రాసెసింగ్లో ఉన్నాయి. ప్రవాసుల భద్రత, డబ్బు విషయంలో వెనుకాడే ప్రభుత్వమైతే సొంత ఖర్చులతో విపత్తు వేళ ఆగమేఘాలపై వారిని స్వస్థలాలకు తరలిస్తుందా? బీమా ప్రీమియం స్వల్ప మొత్తంలోనే రూ.ఐదారు వందలు లోపే ఉంటుంది. అయితే ప్రవాసాంధ్రుల్లో చాలా మంది విదేశాల్లో తాము పని చేస్తున్న చోట్ల బీమా కవరేజీని పొందుతున్నందున ప్రవాసాంధ్ర బీమా భరోసాను తీసుకోవడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అనే రీతిలో రోత కథనాలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందాన్ని పొందడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 2.5 లక్షల మందికి ఏపీ ఎన్ఆర్టీఎస్ సేవలు ఏపీ ఎన్ఆర్టీఎస్ గత నాలుగేళ్లలో 2,55,000 మంది ప్రవాసాంధ్రులకు వివిధ సేవలతో సాయాన్ని అందించింది. 24/7 ద్వారా ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవాసాంధ్రుల బీమా పథకం క్లెయిమ్ కింద కేవలం నలుగురికి రూ.2 లక్షల లోపే అందించగా ఇప్పుడు గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం 28 మందికి పరిహారంగా రూ.42,05,604 చెల్లించింది. రూ.25,53,700 విలువైన మరో పది క్లెయిమ్లు పురోగతిలో ఉన్నాయి. బీమానే కాకుండా అంబులెన్సు, ఎక్స్గ్రేషియా, రీ పాట్రియేషన్ ద్వారా అధిక సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందారు. అనారోగ్య బాధితులతోపాటు మృతుల భౌతిక కాయాలను విమానాశ్రయాల నుంచి స్వస్థలాలకు తరలించేందుకు 1,077 అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. ఇందుకోసం రూ.1.93 కోట్లకు పైగా వెచ్చించింది. ప్రమాదవశాత్తు విదేశాల్లో మరణించిన 489 మంది కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద రూ.2.44 కోట్లకుపైగా చెల్లించింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న 4,622 మందిని రీపాట్రియేషన్తో స్వస్థలాలకు క్షేమంగా తరలించింది. – వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ ♦ దాదాపు 20 లక్షల మంది ప్రవాసాంధ్రుల్లో గత సర్కారు కేవలం 16,713 మందికి (ఒక్క శాతం) మాత్రమే బీమా కల్పిస్తే అది చాలా గొప్పంటూ డప్పు కొట్టిన రామోజీకి కరోనా విపత్తులో వేల మంది ప్రవాసులను ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా మాతృభూమికి తరలించిన విషయం తెలుసా? ఉక్రెయిన్ యుద్థం లాంటి సందర్భాల్లో ప్రభుత్వం సత్వరమే స్పందించి డబ్బుకు వెనుకాడకుండా ప్రవాసులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచి్చంది. ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించి 50 వేల మంది వలస కార్మికులను రాష్ట్రానికి క్షేమంగా తరలించింది. ♦ బీమా రక్షణ అనేది స్వచ్ఛందం. అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అవసరమైన వారు ముందుకొచ్చి తీసుకుంటారు. అమెరికా, కెనడా, యూకే, ఐరోపా, ఆస్ట్రేలియా తదితర చోట్ల తాము పని చేస్తున్న సంస్థల్లో బీమా ప్రయోజనాలు అందుతున్నందున ప్రవాసులు ప్రభుత్వ పథకంలో చేరడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి ఇది కూడా ప్రభుత్వ తప్పిదమేనా రామోజీ? ♦కోవిడ్ విపత్తు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లక్షల మంది ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చేశారు. బీమా సౌకర్యం లేని వారిని గుర్తించి పథకం ప్రయోజనాలు వివరిస్తూ అందులో చేర్చేందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. తద్వారా గత ప్రభుత్వ హయాం కంటే మెరుగ్గా 33,596 మందికిపైగా బీమా ప్రయోజనాన్ని పొందారు. విదేశాలకు వలస వెళ్లే కార్మికులకు మూడేళ్లకు కేవలం రూ.550 ప్రీమియం అంటే రోజుకు సుమారు 50 పైసలకే అందిస్తున్నా అది కూడా భారమే అంటూ రాగాలు తీయడం వారిని అవమానించడం కాదా? ♦ ఎలా చూసినా గత సర్కారు రెండేళ్లలో ప్రవాసాంధ్రులకు అందించిన ప్రయోజనం కంటే గత నాలుగేళ్లుగా చేకూరిన లబ్ధి 10 రెట్లు అధికంగా ఉంది. -
పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త స్కీమ్.. ఎన్నో బెనిఫిట్స్
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ పిల్లల కోసం అమృత్ బాల్ పేరిట ఓ కొత్త పాలసీని పరిచయం చేసింది. పిల్లల ఉన్నత విద్య, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్ఐసీ అధికారికంగా వెల్లడించింది. ఈ పాలసీ మెచ్యూరిటీ కనీస వయస్సు 18 ఏండ్లు. గరిష్ఠం 25 సంవత్సరాలు. షార్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 5, 6 లేదా 7 ఏండ్లు. కనీస పాలసీ టర్మ్ కోసం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 10 ఏండ్లు చెల్లించాలి. ఇక సింగిల్ ప్రీమియం పేమెంట్ కోసం 5 ఏండ్లు. మినిమం సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ఠ బేసిక్ సమ్ అష్యూర్డ్ కోసం పరిమితి లేదు. షరతులకు లోబడి పాలసీ వ్యవధిలో రుణ సదుపాయం లభిస్తుంది. హై బేసిక్ సమ్ అష్యూర్డ్, ఆన్లైన్ సేల్ కింద పూర్తయిన ప్రతిపాదనకు రిబేటు. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందేందుకు 5, 10 లేదా 15 ఏండ్ల వాయిదాల్లో సెటిల్మెంట్ ఆప్షన్లు. మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్లపై పాలసీ వ్యవధిలో గ్యారంటీడ్ అడిషన్స్ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. -
పాలసీదారుల కోసం ‘బీమా సుగం’
న్యూఢిల్లీ: బీమా ఉత్పత్తులకు సంబంధించి అన్ని రకాల సేవలు అందించే ‘బీమా సుగం’ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఏర్పాటును బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ముసాయిదాను విడుదల చేస్తూ, మార్చి 4 నాటికి దీనిపై అభిప్రాయాలు తెలిజేయాలని కోరింది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ, వారి సాధికారత కోసం ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ (ఆన్లైన్ వేదిక)ను ప్రతిపాదిస్తున్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. దేశంలో బీమా వ్యాప్తికి (మరింత మందికి చేరువ), లభ్యత, అందుబాటు ధరల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. కస్టమర్లు, బీమా సంస్థలు, మధ్యవర్తులు లేదా బీమా ఇంటర్మీడియరీలు, ఏజెంట్లకు ఇది ఏకీకృత పరిష్కారంగా ఉంటుందని పేర్కొంది. పారదర్శకతను, సమర్థతను, బీమా వ్యాల్యూ చైన్ వ్యాప్తంగా సహకారానికి, టెక్నాలజీ ఆవిష్కరణలకు, బీమా సార్వత్రీకరణకు, 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం సాకారానికి తోడ్పడుతుందని వివరించింది. ఇది లాభాపేక్ష రహిత సంస్థగా పనిచేయనుంది. బీమా సుగంపై ఎవరికీ నియంత్రిత వాటా ఉండదని, జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు వాటాదారులుగా ఉంటాయని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. -
భేదాలు చూడని ప్రేమకు భరోసానిచ్చే బహుమతి
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ ప్రియమైన జీవిత భాగస్వామికి తన మనసులోని ప్రేమను చాటుతూ వారికి మంచి బహుమతి ఇవ్వాలని చాలామంది చూస్తుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచన. ఎవరి అభిరుచి, బడ్జెట్కి తగినట్లు బహుమతి ఎంచుకుంటూ ఉంటారు. పుష్పగుచ్చం, చాక్లెట్స్, బంగారం ఇలా అనేక బహుమతులు ఇస్తుంటారు. ఈసారి ఇందుకు భిన్నంగా వారి ఆర్థిక జీవితానికి, భవిష్యత్కు భరోసానిచ్చే ఈ బహుమతులు ఇచ్చి చూడండి. తప్పకుండా వారు సర్ప్రైజ్ అవుతారు. డిపాజిట్లు, పెట్టుబడుల రూపంలో.. పెట్టుబడులు మీ జీవిత భాగస్వామికి గొప్ప బహుమతి అవుతాయి. వారి భవిష్యత్ లక్ష్యాలు చేరుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, పీపీఎఫ్ ఇలా పెట్టుబడులకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా విలువైన బహుమతి కొనాలనుకుని మీ వద్ద సరిపడా డబ్బు లేకపోతే.. ఎప్పుడు వారికి ఆ బహుమతి ఇస్తే వారికి ఉపయోగపడుతుందో చూడండి. ఒకటి రెండేళ్లు సమయం ఉంటే రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచి, కాలపరిమితి ఏర్పాటు చేసుకుని, ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని జమచేయండి. మొదటి నెల మొత్తాన్ని జమ చేసి దానికి సంబంధించిన వివరాలు వారికి తెలియజేసి బహుమతి ఇవ్వండి. దీర్ఘకాలం పాటు నెలవారీ సిప్ విధానం ద్వారా పెట్టుబడులు ప్రారంభించి బహుమతి ఇవ్వొచ్చు. లేదా మీ జీవిత భాగస్వామికి ఇష్టమైన సంస్థల షేర్లను కొనుగోలు చేసి బహుమతి ఇవ్వొచ్చు. జీవిత, ఆరోగ్య బీమాతో.. మీ జీవిత భాగస్వామి, పిల్లల భవిష్యత్కు బీమా భరోసా కల్పించొచ్చు. జీవిత (టర్మ్ ప్లాన్), ఆరోగ్య బీమాలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో అనుకోని సంఘటనలు జరిగితే ఈ పాలసీలు మీ జీవిత భాగస్వామికి అండగా ఉంటాయి. దీంతో భవిష్యత్కు భరోసానిచ్చే అతిపెద్ద బహుమతి వారికి ఇస్తున్నట్లే అవుతుంది. ఎమర్జెన్సీ కోసం క్రెడిట్ లైన్.. అన్ని అత్యవసర సమయాల్లోనూ మీరు మీ జీవిత భాగస్వామి పక్కన ఉండలేకపోవచ్చు. కానీ ఫ్లెక్సీపేతో వ్యక్తిగత క్రెడిట్ లైన్ను అందించవచ్చు. స్వల్పకాలిక, చిన్న చిన్న అత్యవసరాల కోసం ఇది వారికి ఉపయోగపడుతుంది. ప్రతిసారీ రుణం కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా అత్యవసరాలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది వారికి ఉపయోగపడే బహుమతి అవుతుంది. బంగారం పథకాలతో.. భారతీయులకు బంగారం పట్ల మమకారం ఎక్కువ. ఇందులో భావోద్వేగాలు నిండి ఉంటాయి. బంగారం బహమతి ఇస్తే మీ ప్రియమైన వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే, బంగారాన్ని ఆభరణాల రూపంలో కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో గానీ, గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో గానీ, డిజిటల్గా గానీ అందించడం వల్ల ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇదీ చదవండి: 'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్! ఈ ప్రేమికుల రోజున మీకు ప్రియమైన భార్య, పిల్లల భవిష్యత్ను సురక్షితం చేసే బహుమతులు వారికి అందించండి. మీ కుటుంబ సభ్యులకు పొదుపు, పెట్టుబడులు, బ్యాంకులు అందించే సేవలు, క్రెడిట్ కార్డులు, బీమా ఇలా అన్ని ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించండి. పొదుపు చేయడం పిల్లలకు అలవాటు చేయండి. మీరు చేసే పొదుపు అలవాట్లు, ఆర్థిక విషయాల గురించి నేర్పించే పాఠాలే భవిష్యత్లో వారికి గొప్ప బహుమతులు అవుతాయి. -
ఇన్సూరెన్స్ సొమ్ము కోసం... శవపేటికలోని మృతదేహం అపహరణ
రంగంపేట/రాజమహేంద్రవరం రూరల్: అప్పుల పాలైన ధాన్యం వ్యాపారి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తాను మృతిచెందినట్లు శవపేటికలో ఉన్న మృతదేహాన్ని తీసుకువచ్చి పెట్రోలు పోసి కాల్చి నమ్మించేందుకు చేసిన ప్రయత్నం పోలీసుల విచారణలో బెడిసికొట్టింది. చివరకు ధాన్యం వ్యాపారితో పాటు, అతనికి సహకరించిన ముగ్గురు కటకటాల పాలయ్యారు. రంగంపేట మండలం పాతవీరంపాలెం గ్రామశివారు కేతమల్లు వెంకటేశ్వరరావు(పూసయ్య) జీడిమామిడితోటలో ఈ నెల 26వ తేదీన కాలిన మృతదేహం ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహం వెంకటేశ్వరరావుదిగా భావించి పోస్టుమార్టం కోసం అనపర్తి ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు భార్య అతని మృతదేహంపై పడి తీవ్రంగా ఆవేదన చెందుతున్న విషయం తెలుసుకున్నాడు. దీంతో అతను వెంటనే భార్యకు ఫోన్ చేసి ఎవరో బాడీని తగులబెట్టి తనను కొట్టి తుప్పల్లో పడవేశారని చెప్పాడు. వెంకటేశ్వరరావు బతికి ఉండడంతో కాలిన మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కిషోర్కుమార్ ఆధ్వర్యంలో అనపర్తి సీఐ పి.శివగణేష్, రంగంపేట ఎస్సై పి.విజయకుమార్ దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు అసలు విషయాన్ని బయట పెట్టాడు. వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు(పోసియ్య)కు అప్పులు ఎక్కువగా ఉండడంతో తన పేరుపై ఉన్న రూ. కోటి ఇన్సూరెన్న్స్ను క్లయిమ్ చేసుకొనేందుకు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ను అమలు చేసేందుకు హుకుంపేట గ్రామానికి చెందిన వందే శ్రీను, తలారి సుబ్బారావు, మోరంపూడికి చెందిన సిరాచిన్నాలతో వెంకటేశ్వరరావును వినియోగించాడు. ఒక శవాన్ని తీసుకొచ్చి తన పొలంలో కాల్చేయాలని నిర్ణయించాడు. ఆ ముగ్గురితో రూ.రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు ఈ నెల 25వ తేదీ రాత్రి పాతబొమ్మూరులోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఒక శవాన్ని తవ్వి బయటకు తీశారు. సదరు మృతదేహాన్ని శ్రీను కారులో వేసుకొని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పాత వీరంపాలెం వెళ్లి వెంకటేశ్వరరావుకు తెలిపాడు. ఇద్దరూ కలిసి శవాన్ని తగులబెట్టి అక్కడనుంచి పరారయ్యారు. ఈ నెల 26వ తేదీన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ కాలిపోయిన బాడీ వెంకటేశ్వరరావుది అని భావించి శవాన్ని అనపర్తి హాస్పిటల్కు తరలించారు, అనంతరం గ్రామంలో తన భార్య, పిల్లలు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని శ్రీను ద్వారా తెలిసి, ఎవరో బాడీని తగులబెట్టి తనని కొట్టి తుప్పల్లో పడేసారని డ్రామా మొదలెట్టాడు. చివరకు పోలీసులు వెంకటేశ్వరరావు, అతనికి సహకరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం డ్రామా బయటపడింది. ఆ మృతదేహం నెల్లి విజయరాజుది పాతబొమ్మూరు క్రైస్తవ శ్మశానవాటికలో తస్కరించిన మృతదేహం బొమ్మూరు గ్రామానికి చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి నెల్లి విజయరాజుదిగా పోలీసులు గుర్తించారు. నెల్లివిజయరాజు అనారోగ్యంతో ఈనెల 23వ తేదీన మృతిచెందారు. ఈ నెల 24న ఖననం చేశారు. 29న అతని జ్ఞాపకార్థకూడిక నిర్వహించారు. అయితే మంగళవారం రంగంపేట పోలీసులు నిందితులను తీసుకుని పాతబొమ్మూరు శ్మశానవాటిక వద్దకు వెళ్లే వరకు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు నెల్లి విజయరాజు మృతదేహాన్ని తీసుకువెళ్లి పెట్రోలుతో దహనం చేశారన్న విషయం తెలియలేదు. పోలీసులు విజయరాజు ఖననం చేసిన చోట తవ్వించి చూడగా అందులో మృతదేహం కనిపించలేదు. అనపర్తి హాస్పిటల్లో ఉన్న మృతదేహం విజయరాజుదిగా ఆయన కుటుంబసభ్యులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పాతబొమ్మూరులోని శ్మశానవాటికకు తీసుకువచ్చి ఖననం చేశారు. -
రొయ్యకు బీమా.. రైతుకు ధీమా
సాక్షి, భీమవరం: ఆక్వా రైతుకు అడుగడుగునా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయంతో సాగులో వారికి ధీమా కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో బీమా పాలసీ కల్పనకు ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. బీమా పాలసీలపై రైతులకు అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు ఆలిండియా ప్రాన్ ఫెడరేషన్, స్టేట్ ప్రాన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 200 మందికి పైగా ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ఓరియంటల్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై వారు అందించే పాలసీల వివరాలను రైతులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సాగు కాలం, ప్రీమియం రేట్లు, సైక్లోన్ జోన్, నాన్ సైక్లోన్ జోన్లలో పాలసీ కవరేజీ వివరాల గురించి అవగాహన కల్పించారు. రైతులు తమ ఎంపిక ప్రకారం 135 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రాథమిక కవర్ను ఎంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాన్ని కవర్ చేసుకోవచ్చునని తెలిపారు. పాలసీలపై రైతులు లేవనెత్తిన సందేహాలను బీమా సంస్థల ప్రతినిధులు నివృత్తి చేశారు. వ్యాధులు, వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్ సమస్యలు, ఇతర సవాళ్లను ఆక్వా రైతులు అధిగమించేందుకు ప్రభుత్వం బీమా పాలసీ తెచ్చిందని ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అంజలి ఈ సందర్భంగా తెలిపారు. ఫిషరీస్ జేడీ మాధవీలత, డిప్యూటీ డైరెక్టర్ ఆనందరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్వీ ప్రసాద్, నేషనల్ ప్రాన్ ఫార్మర్స్ అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరావు, ఏపీ ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీకేఎఫ్ సుబ్బరాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్ల రాంబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా ఆక్వా ఫార్మర్స్ అధ్యక్షుడు నాగభూషణం, వత్సవాయి కుమార్రాజా తదితరులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే బీమా ఈ సదస్సులో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ ఆక్వా రైతుల ప్రయోజనాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఏదోక పాలసీని తెచ్చి రైతులపై రుద్దకుండా వారి సూచన మేరకు ప్రయోజనకరమైన పాలసీ తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఫిబ్రవరి 10 నాటికి సదస్సులు పూర్తి చేసి పాలసీలపై రైతుల నుంచి వచ్చిన సూచనలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు ఆక్వా రైతులకు పెట్టిన రూ. 340 కోట్ల విద్యుత్ బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. అప్సడా ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రైతులకు మూడు లక్షలకు పైగా సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో బ్రూడల్ స్టాక్ మెయింటెనెన్స్ సెంటర్ (బీఎంసీ) ఏర్పాటులో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో రూ. 36 కోట్లతో బీఎంసీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఆగస్టు నాటికి ప్రారంభించే విధంగా సీఎం జగన్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని రఘురాం తెలిపారు. -
ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: ► సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఫెయిల్ కావటంతో ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించారు. కండక్టర్ బస్సు ముందు నిలబడి ఆ వివరాలను రిపోర్టులో రాస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొంది.. దీంతో బస్సు దూసుకొచ్చి ముందు నిలబడిన కండక్టర్ను ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలే ఆయన కుటుంబానికి ప్రమాద సాయంగా రూ.40 లక్షలు అందాయి. ► మెహిదీపట్నంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్పై ఓ చిన్న కారణంతో గతంలో ఆర్టీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని సర్వీసు నుంచి తొలగించింది. దానిపై ఆ డ్రైవర్ లేబర్ కోర్టును ఆశ్రయించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో అతను దుర్మరణం చెందాడు. సర్వీసులో లేకపోవటంతో ఆర్టీసీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చిన్న పిల్లలను చదివించేందుకు ఆయన భార్య ఇళ్లల్లో పాచి పనులు చేయాల్సి వచ్చింది. ఆ దీనావస్థకు చలించి కొందరు జోక్యం చేసుకోవటంతో చివరకు ఆ ఉద్యోగి కుటుంబానికి కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా సాయం అందింది. ఇలా అనుకోని ప్రమాదం చోటు చేసుకుని.. సంపాదించే కుటుంబ పెద్ద చనిపోతే అల్పాదాయ కుటుంబాలు ఆర్థికంగా ఎదు ర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆస్తులు లేని కుటుంబాలు, సంపాదించే ఇతర వ్యక్తులు లేని కుటుంబాలు రోడ్డున పడటమే. ఇలాంటి సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వారి ఖాతాలున్న బ్యాంకు శుభవార్త చెప్పింది. ప్రమాదవశాత్తూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబాలకు ఇకపై ఏకంగా రూ.కోటి సాయం అందనుంది. ఆ ఉద్యోగి పేరుతో రూపే కార్డు ఉంటే మరో రూ.15 లక్షలు అందుతుంది. వెరసి, రూ.1.15 కోట్లు అందటం ద్వారా ఆ కుటుంబానికి ఆర్ధికంగా వెసులుబాటు కలగబోతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది అమలు కానుంది. ఖాతాలు యూబీఐలోకి రావడంతో.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్దగా ఊరటనిచ్చే ప్రమాద బీమా లేదు. సంస్థ పరంగా అందే సాయం కూడా నామమాత్రమే. ఇలాంటి తరుణంలో, సూపర్ సేవింగ్ శాలరీ ఖాతా ద్వారా యూబీఐ పెద్ద వెసులుబాటు కల్పించింది. గతంలో ఆర్టీసీ జీతాల ఖాతాలు మరో బ్యాంకులో ఉండేవి. ఏడాదిన్నర క్రితం ఎండీ సజ్జనార్ వాటిని యూబీఐలోకి మార్చారు. ఆ సమయంలో ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం అందే వెసులుబాటు గురించి చెప్పిన బ్యాంకు అధికారులు, ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాలను సూపర్ సేవింగ్ సాలరీ ఖాతాలుగా మార్చాలని సూచించారు. ఆ వెంటనే ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు పొందే వీలు కల్పించింది. దాదాపు ఏడాదిగా అది అమలవుతోంది. ఈ సమయంలో దాదాపు 20 మంది ఆర్టీసీ ఉద్యోగులుకు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. వీరి కుటుంబాలకు దశలవారీగా ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని బ్యాంకు అందజేసింది. ఏదైనా సంస్థలో పనిచేస్తూ, ప్రతినెలా ఠంచన్గా జీతం అందే వారికి ఈ ఖాతా పొందే వీలును బ్యాంకు కల్పిస్తోంది. బ్యాంకుల మధ్య పోటీతో పెంపు బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం నేపథ్యంలో, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.కోటికి పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 47 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. ప్రతినెలా రూ.220 కోట్ల వరకు వారి జీతాల పద్దు ఉంటుంది. నిత్యం ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు టికెట్ల రూపంలో ఆదాయం (మహిళలకు అందించే జీరో టికెట్ల మొత్తం కాకుండా) ఉంటుంది. ఇవన్నీ ఆ బ్యాంకులోనే డిపాజిట్ అవుతాయి. ఇది పెద్ద మొత్తం కావటంతో సంస్థను ఆకట్టుకునేందుకు ఆ బ్యాంకు ఈ ప్రమాద బీమా మొత్తాన్ని పెంచింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఇక బ్యాంకు అందించే రూపే కార్డు ఉన్న వారికి అదనంగా మరో రూ.15 లక్షలు కూడా అందుతుంది. ఇప్పటికీ అవగాహన లేని ఉద్యోగులెందరో.. ఈ ప్రమాద బీమా గురించి దాదాపు ఉద్యోగులందరికి తెలిసినా, అది వర్తించాలంటే ఏం చేయాలన్న విషయంలో కొందరికి ఇప్పటికీ అవగాహన లేదు. తమ ఖాతాలను సూపర్ సేవింగ్స్ సాలరీ ఖాతాగా మార్చాలంటూ ప్రతి ఉద్యోగి సంబంధిత బ్యాంకు బ్రాంచీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ, ఆ ఖాతాలోకి మారని ఉద్యోగులెందరో ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే వారికి ఈ పథకం వర్తించదు. దాదాపు ఏడాదిగా ఆ బ్యాంకు ప్రమాద బీమా వసతిని అమలు చేస్తున్నా, ఉద్యోగులకు అవగాహన కల్పించటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ఇక రూపే కార్డు తీసుకోవాలని, దాన్ని ప్రతి 45 రోజుల్లోపు ఒకసారన్నా కచ్చితంగా వాడాలన్న నిబంధన గురించి కూడా అవగాహన లేదు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈడీ కృష్ణకాంత్ చర్యలు ప్రారంభించారు. ఈ పథకం వివరాలు, ఉద్యోగులు అనుసరించాల్సిన విషయాలను తెలియ చెప్తూ ఫ్లెక్సీలు రూపొందించి అన్ని డిపోలకు పంపుతున్నారు. -
నెట్వర్క్లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్లెస్ ట్రీట్మెంట్.. కానీ..
ప్రైవేటు ఆస్పత్రుల్లో నెట్వర్క్లోలేని హాస్పటల్స్లో కూడా ఇవ్వాళ్టి నుంచి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఈమేరకు కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ తెలిపింది. బీమా తీసుకుని ఏదైనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారికి ఇకపై ఇబ్బందులు తొలగనున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితేనే ఎలాంటి డబ్బు చెల్లించకుండా వైద్యం పూర్తయ్యేది. అయితే ఈరోజు నుంచి నెట్వర్క్ ఆసుపత్రులతోపాటు ఆ జాబితాలో లేని హాస్పటల్స్లో చేరినా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నెట్వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆసుపత్రుల్లో క్యాష్లెస్ సదుపాయం వినియోగించుకోవాలంటే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకు రెండు రోజుల ముందు అంటే 48 గంటల ముందే సదరు వైద్యం గురించి తెలియజేయాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఎమర్జెన్సీ సందర్భాల్లో నెట్వర్క్లోలేని ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిం వర్తిస్తుందని కౌన్సిల్ వివరించింది. ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే క్యాష్లెస్కు అనుమతి ఉండేది. క్యాష్లెస్ సదుపాయం లేనిచోట వైద్యానికి అయ్యే ఖర్చును పాలసీదారులే చెల్లించాలి. తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. దాంతో ట్రీట్మెంట్ అయిన ఖర్చు పూర్తిగా ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. ఫలితంగా పాలసీదారులు కొంత నష్టపోయే అవకాశం ఉండేది. దాంతోపాటు ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండేవి. ఇదీ చదవండి: దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం! ప్రస్తుతం 63 శాతం మంది క్యాష్లెస్ సదుపాయం ఎంచుకుంటుంటే.. మిగిలినవారు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని కౌన్సిల్ ఎండీ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ తపన్ సింఘాల్ తెలిపారు. క్లెయిం ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
LIC Jeevan Dhara II Policy: ఎల్ఐసీ 'జీవన్ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్ఫిట్స్!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్ ఇన్ కమ్ పొందవచ్చు. జీవన్ ధార 2 పథకం వివరాలు ►పాలసీ కట్టే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. ►ఒకేసారి డిపాజిట్ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు. ►యాన్యుటైజేషన్ లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ► తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి. ► రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు, ► సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు, ►యాన్యుటీ టాప్-అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ►ఈ ఎల్ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్ తీసుకోవచ్చు. ►పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు. -
నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే..
ప్రతి ఏడాది మునుపటి సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుంది. 2024 కూడా అంతే. 2023తో పోలిస్తే కొన్ని మార్పులు సహజం. ఇవన్నీ అందరి జీవితాలపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. ఆర్థిక అవగాహనతో సమాజంలో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి. అయితే జనవరి 1, 2024 నుంచి వచ్చే కొన్ని ప్రధాన మార్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. పెరిగిన కార్ల ధరలు టాటా మోటార్స్, మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా వంటి చాలా ఆటో కంపెనీలు జనవరి 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతామని ప్రకటించాయి. అధిక ఇన్పుట్ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశాయి. ధరల పెంపు దాదాపు 2-3 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని మోడళ్లకు అధిక ధరల పెంపు ఉండవచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. యూపీఐ ఐడీలు రద్దు ఆన్లైన్ పేమెంట్ యాప్లైన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్లలోని యూపీఐ ఖాతాను ఒక సంవత్సరం పాటు ఉపయోగించకుంటే, ఇక నుంచి అది పనిచేయదు. ఇలాంటి ఐడీలను జనవరి ఒకటో తేదీ నుంచే డీయాక్టివేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి ఈ ఏడాది నవంబర్ ఏడో తేదీన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటన జారీ చేసింది. లావాదేవీలు నిర్వహించని కస్టమర్ల ఫోన్ నంబర్లతో మోసాలు జరగకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. కావాలంటే వాటిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది. సులభమైన భాషలో బీమా వివరాలు 2024 జనవరి 1 నుంచి ఆరోగ్య బీమా పాలసీదారుల కోసం రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లను (సీఐఎస్) విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. కస్టమర్లు పాలసీలోని ముఖ్య విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా చేయడం దీని లక్ష్యం. సులభమైన భాషలో అన్నింటినీ వివరించాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్! డిజిటల్ కేవైసీ ఇకపై మొబైల్ కనెక్షన్ల కోసం సిమ్ కార్డ్లను కొనుగోలు చేసే విధానం మారుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఆదేశాల ప్రకారం.. కస్టమర్లకు సిమ్ కార్డ్లను విక్రయించే ముందు వారి ఫిజికల్ వెరిఫికేషన్ను దశలవారీగా తొలగించాలని టెలికమ్యూనికేషన్ కంపెనీలను ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తిగా డిజిటల్గా ఉంటుంది. కస్టమర్లు తమ ఫొటో గుర్తింపు రుజువును చూపించి, డిజిటల్గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. సిమ్ కార్డ్ మోసాలను అరికట్టడానికి ఈ చర్య ఒక మార్గమని డాట్ వివరించింది. -
రూ.7.83లక్షల కోట్లకు చేరిన జీవిత బీమా ప్రీమియం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీవిత, సాధారణ బీమా సంస్థలు మెరుగైన వృద్ధిని చూపించాయి. జీవిత బీమా ప్రీమియం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగి రూ.7.83 లక్షల కోట్లకు చేరుకుంది. సాధారణ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం సైతం 16.4 శాతం వృద్ధితో రూ.2.57 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి (ఐఆర్డీఏఐ) సంస్థ విడుదల చేసింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 16.34 శాతం పెరగ్గా, ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) ఆదాయం 10.90 శాతం వృద్ధి చెందింది. మొత్తం ప్రీమియంలో రెన్యువల్ (పాత పాలసీల పునరుద్ధరణ) ప్రీమియం 52.56 శాతం వాటాను ఆక్రమించింది. మిగిలిన 47.44 శాతం ప్రీమియం నూతన పాలసీల రూపంలో సమకూరింది. రెన్యువల్ ప్రీమియం 8.88 శాతమే పెరగ్గా.. నూతన పాలసీ ప్రీమియం ఆదాయం 17.90 శాతం వృద్ధి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 285 లక్షల పాలసీలు 2022–23లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 284.70 లక్షల నూతన పాలసీలను జారీ చేశాయి. ఇందులో ప్రభుత్వరంగ బీమా సంస్థలు జారీ చేసినవి 204.29 లక్షలుగా (71.75 శాతం) ఉన్నాయి. ప్రైవేటు జీవిత బీమా సంస్థలు 80.42 లక్షల పాలసీలను (28.25 శాతం) జారీ చేశాయి. జీవిత బీమా సంస్థల పన్ను అనంతరం లాభం ఐదు రెట్లు పెరిగి రూ.42,788 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.7,751 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల లాభం 800 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా సంస్థల లాభం 72.36 శాతం వృద్ధిని చూసింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ (సాధారణ బీమా) రంగం మొత్తం రూ.257 లక్షల కోట్ల స్థూల ప్రీమియాన్ని అండర్ రైటింగ్ చేసింది. 27 ప్రైవేటు రంగ బీమా సంస్థలు (స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు సహా) రూ.1.58 లక్షల కోట్ల ప్రీమియాన్ని అండర్రైట్ చేశాయి. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 38.42 శాతం వాటా కలిగి ఉంటే, ప్రైవేటు సాధారణ బీమా సంస్థల వాటా 61.58 శాతంగా ఉంది. మొత్తం వ్యయాల్లో కమీషన్ (మధ్యవర్తులకు), నిర్వహణ వ్యయాలు ఎక్కువగా ఉంటున్నాయి. నాన్ లైఫ్ బీమా సంస్థల అండర్రైటింగ్ నష్టాలు రూ.32,797 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.31,810 కోట్లుగా ఉన్నాయి. వార్షికంగా నష్టాలు 3 శాతం పెరిగాయి. స్విస్ ఆర్ఈ సిగ్నా నివేదిక ప్రకారం మన దేశంలో జీవిత బీమా విస్తరణ 2022–23లో 3 శాతానికి తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 3.2 శాతంగా ఉంది. -
అత్యంత కస్టమైజ్డ్ పాలసీలకు ఆదరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారితో జీవిత బీమాపై అభిప్రాయం మారిందని, ఏదో పెట్టుబడి సాధనంగా కాకుండా కీలకమైన రిస్క్ కవరేజీ సాధనంగా చూసే ధోరణి పెరిగిందని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ (బీఏఎల్ఐసీ) చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) సమీర్ జోషి తెలిపారు. ప్రజలు టర్మ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడం పెరిగిందని చెప్పారు. అలాగే, చెల్లింపుల్లో వెసులుబాటు, ఆన్లైన్ లావాదేవీలు, అదనపు కవరేజీ, వినూత్న ఉత్పత్తులు మొదలైన అత్యంత కస్టమైజ్డ్ ఆప్షన్లను కోరుకుంటున్నారని ఆయన వివరించారు. కంపెనీలు కూడా దానికి అనుగుణంగా సత్వరం తమ సర్వీసులు, ఉత్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని జోషి చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ఏస్, డయాబెటిక్ టర్మ్ ప్లాన్ మొదలైనవి ఈ కోవకి చెందినవేనని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దక్షిణాదిపై మరింత దృష్టి .. ఇతరత్రా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మొదలైనవి .. అలాగే గోవా, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో బీమా విస్తృతి ఎక్కువగా ఉందని ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో బీమా విస్తృతిని మరింత పెంచడంపై దృష్టి పెడుతున్నాం. కీలక ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాం. ప్రవాస భారతీయ కస్టమర్లలో చాలా మంది ఈ ప్రాంతాలకు చెందినవారే కావడంతో వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు, సర్వీసులను తీర్చిదిద్దుతున్నాం. లక్ష కోట్లు దాటిన ఏయూఎం.. బజాజ్ అలయంజ్ లైఫ్ అతి తక్కువ కాలంలోనే దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 56,085 కోట్లుగా ఉన్న మా ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటింది. మాపై కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం. సరళమైన, వినూత్నమైన, కస్టమర్ ఆధారిత సాధనాలు, సమర్ధమంతమైన పంపిణీ వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడ్డాయి. పాలసీల వృద్ధిపరంగా పరిశ్రమ కన్నా అధికంగా 23 శాతం వృద్ధి సాధిస్తున్నాం. మాకు 1.40 లక్షల మంది ఏజెంట్లు, 60 పైచిలుకు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం, 505 శాఖల పటిష్టమైన నెట్వర్క్ ఉంది. మొత్తం మీద సహాయకరమైన నియంత్రణ వ్యవస్థ, ప్రభావవంతమైన మార్పులతో 2023 మా సంస్థతో పాటు ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగానికి సానుకూలంగా గడిచింది. వృద్ధి లక్ష్యాలు.. వినూత్న ఉత్పత్తులు, సమగ్ర సేవలతో కొత్త ఏడాదిలో మరింత మంది కస్టమర్లకు చేరువై జీవిత బీమా రంగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్దేశించుకున్నాం. కొత్త పాలసీల విషయంలో పరిశ్రమకు రెట్టింపు స్థాయి వృద్ధి సాధించడం, వేగంగా ఎదుగుతున్న టాప్ సంస్థల్లో ఒకటిగా కొనసాగడాన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నాం. మా నెట్వర్క్ను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడతాం. పరిశ్రమపరంగా చూస్తే 2032 నాటికి భారత ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రపంచంలోనే ఆరో పెద్ద మార్కెట్గా ఎదుగుతుందని స్విస్ రీ సంస్థ ఒక నివేదికలో అంచనా వేసింది. పరిశ్రమ వృద్ధి గతిని తీర్చిదిద్దడంలో నియంత్రణ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. బీమా సుగమ్, బీమా వాహక్, బీమా విస్తార్ వంటివి దేశవ్యాప్తంగా కోట్ల మందికి బీమాను అందుబాటులోకి తేవడం ద్వారా ‘2047 నాటికి అందరికీ బీమా కల్పించడం’ అనే ఐఆర్డీఏఐ లక్ష్య సాధనలో తోడ్పడగలవు. అలాగే పాలసీలను క్రమబద్ధీకరించడం, ప్రక్రియలను .. సర్వీసులను మెరుగుపర్చడం వంటి చర్యల ద్వారా బీమాను సరళతరం చేయడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెట్టనుంది. -
5 లక్షల ప్రమాద బీమా.. 10 లక్షల ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, బాయ్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లినప్పుడు కుక్క తరమడంతో కంగారులో భవనం పైనుంచి పడి మరణించిన ఓ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యాబ్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలో ఓ యాప్ను టీ–హబ్ ద్వారా సిద్ధం చేసి అవకాశం ఉన్న వారికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు నవంబర్ 27న కొందరు ఫుడ్ డెలివరీ బాయ్లతో భేటీ కావడం తెలిసిందే. అప్పుడు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తిని ఈ మేరకు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఓలా, ఉబర్ ద్వారా పనిచేసే ఆటో డ్రైవర్లతోపాటు క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్ల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న బాయ్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆయా సంస్థల్లో పనిచేస్తూ రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని... ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్తాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంతకంటే మెరుగైన విధంగా చట్టం తయారీకి బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టని సంస్థలపై చర్యలు.. ‘సంస్థలు కూడా లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరించే ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. నాలుగు నెలల క్రితం ఓ స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పైనుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందేమోనని చూశా. కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లకు సీఎం సూచించారు. డిజిటల్, మాన్యువల్ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆటోవాలాలు ఆందోళన పడొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటోవాలాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆటోవాలాలతోనూ త్వరలో చర్చించి వారికి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్యాబ్, ఫుడ్ డెలివరీ బాయ్స్తో సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ఆటోవాలాల ఉపాధి పడిపోదని, బస్సులు దిగాక ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులు మళ్లీ ఆటోలనే కదా ఆశ్రయించాల్సిందని అన్నారు. -
Insurance: బీమా కూడా లేకుండా కోట్ల మంది!
ముంబై: బీమా విస్తరణకు ప్రభుత్వం, బీమా రంగ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, దేశ జనాభాలో 95 శాతం మందికి బీమా రక్షణ లేదని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ ఓ నివేదికలో తెలిపింది. ఈ నివేదికను ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా ఆవిష్కరించారు. యూపీఐ, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ల విస్తరణకు దోహదపడిన చర్యలను అనుసరించాలని బీమా పరిశ్రమకు ఆయన సూచించారు. ఈ నివేదికలో పేర్కొన్నట్టు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో విపత్తుల ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు పూర్తి చేసుకునే నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఇది అవసరమన్నారు. దేశ జనాభా 144 కోట్లలో 95 శాతం మందికి బీమా కవరేజీ లేని విషయాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రకృతి విప్తతులు పెరిగిపోయిన క్రమంలో బీమా కవరేజీ ప్రాధాన్యాన్ని ఈ నివేదిక ఎత్తి చూపించింది. రుణానికి బీమా లింక్ దిగువ, మధ్యాదాయ వర్గాల్లో 84 శాతం మంది, తీర ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 77 శాతం మందికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదని ఈ నివేదిక తెలిపింది. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని తన నివేదికలో నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ సూచించింది. నిజానికి బీమా తీసుకున్న వారిలోనూ కవరేజీ సమగ్రంగా లేని అంశాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: LIC Credit Card: ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్! జీవిత బీమా రక్షణలో 87 శాతం అంతరం (వాస్తవ కవరేజీ–తీసుకున్న దానికి మధ్య) ఉందని, ఇది గణనీయమైన వ్యాపార అవకాశాలు వీలు కల్పిస్తుందని తెలిపింది. అలాగే, 73 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేదని వెల్లడించింది. ప్రభుత్వం, ఎన్జీవోలు, పరిశ్రమ కలసి సూక్ష్మ ఆరోగ్య బీమా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యాన్యుటీ, పెన్షన్ ప్లాన్లలో కవరేజీ అంతరం 93 శాతంగా ఉందని తెలిపింది. -
2047 నాటికి భారతీయులందరికీ జీవిత బీమా.. త్వరలో ప్లాన్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో 2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యం సాధనలో ఎల్ఐసీ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ చైర్మన్ సిద్థార్థ మహంతి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను గ్రామీణ ప్రాంతాల వారి కోసం రూపొందించిన ప్లాన్ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ ఎలా కలి్పంచాలన్న దానిపై మా దృష్టి ఉంటుంది. రానున్న రోజుల్లో మా మొత్తం వ్యాపారంలో గ్రామీణ ప్రాంతాల వాటా పెరగనుంది’’అని మహంతి పేర్కొన్నారు. జీవిత, ఆరోగ్య, ఆస్తుల బీమాతో కూడిన బీమా విస్తార్ ఉత్పత్తిని ప్రతిపాదించినందుకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ సగటుతో చూస్తే మన దేశంలో బీమా కవరేజీ చాలా తక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు డిజిటల్గా మారే ‘డైవ్’ ప్రాజెక్ట్ను ఎల్ఐసీ చేపట్టింది. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కన్సల్టెంట్ను కూడా నియమించుకుంది. మా భాగస్వాములు, కస్టమర్లు, మధ్యవర్తులు, మార్కెటింగ్ చేసే వారికి అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలన్నదే డైవ్ ప్రాజెక్ట్ ధ్యేయమని మహంతి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత కస్టమర్లను డిజిటల్ మార్గాల ద్వారా సొంతం చేసుకోవడంపై ఎల్ఐసీ దృష్టి సారించనుంది. అనంతరం ఇతర విభాగాల్లో డిజిటల్ పరివర్తనం ఉంటుందని మహంతి చెప్పారు. ‘‘కస్టమర్లు కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచే మొబైల్ ద్వారా కావాల్సిన సేవలను పొందొచ్చు’’అని ప్రకటించారు. -
జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్లో తెలిపింది. బీమా సంస్థకు, పాలసీ హోల్డర్కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ను సవరిస్తున్నట్లు ఐఆర్డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
సైబర్ బీమాకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ బీమాకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఏటా 27–30% వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం భారత్లో సైబర్ బీమా మార్కెట్ పరిమాణం 50–60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) స్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా 27–30% మేర చక్రగతిన వృద్ధి చెందుతోంది. ‘సైబర్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 3–5 ఏళ్లలో ఇదే స్థాయి వృద్ధి కొనసాగే అవకాశం ఉంది‘ అని నివేదికలో పేర్కొంది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో పాటు సరఫరా వ్యవస్థ, రిటైల్, ఫైనాన్స్ వంటి డిజిటైజేషన్ అధికంగా ఉండే విభాగాలు సైబర్ క్రిమినల్స్కు లక్ష్యాలుగా ఉంటున్నట్లు తెలిపింది. కాబట్టి, మిగతా రంగాలతో పోలిస్తే సైబర్ బీమాను తీసుకోవడంలో ఈ విభాగాలు ముందుంటాయని పేర్కొంది. పలువురు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఐఎస్వో)తో నిర్వహించిన సర్వే ఆధారంగా డెలాయిట్ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకులు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ వచ్చే దశాబ్ద కాలంలో సైబర్ బీమా గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ (రిస్క్ అడ్వైజరీ) ఆనంద్ వెంకట్రామన్ తెలిపారు. విక్రేతలు, కొనుగోలుదారుల అవసరాల మేరకు పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రాబోయే మూడేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు రక్షణ కలి్పంచుకునేందుకు సర్వేలో పాల్గొన్న సీఐఎస్వోల్లో 70% మంది మరింత ఎక్కువ వ్యయం చేయడానికి మొగ్గు చూపారు. ► గణనీయంగా వినియోగదారుల డేటాబేస్లు ఉన్న కొన్ని పెద్ద కంపెనీలు తమ డిజిటల్ ఇన్ఫ్రా బడ్జెట్లను పెంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చుకునేందుకు మరింత ఇన్వెస్ట్ చేయడానికి బదులు బీమా కవరేజీని పెంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ► దేశీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ వృద్ధి గతి ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండనుంది. కంపెనీలు డిజిటల్ పరిపక్వతను సాధించే వేగం, డిజిటైజేషన్ .. కఠినతరమైన సైబర్ చట్టాల అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంప్రదాయేతర సంస్థలైన టెక్నాలజీ కంపెనీల్లాంటివి కూడా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ప్రవేశించడం వీటిలో ఉండనున్నాయి. ► సైబర్ బీమాను ఒక వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూసే ధోరణి పెరగాలి. డిజిటైజేషన్ వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగు స్థాయిలో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడం తప్పనిసరి అనేది కంపెనీలు గుర్తించాలి. ► సమగ్ర రిసు్కల నిర్వహణలో సైబర్ రిసు్కలు ప్రధానమైనవని గుర్తించి బోర్డులు, సీఈవోలు సైబర్సెక్యూరిటీ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ► బీమా పాలసీలను సరళతరం చేయడంతో పాటు వివిధ కవరేజీల గురించి కొనుగోలుదార్లలో అవగాహన పెంచేందుకు బీమా కంపెనీలు కృషి చేయాలి. ► పౌరుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన డేటా రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలి. -
మెరైన్ బీమాపై శ్రీరామ్ జనరల్ ఫోకస్
చెన్నై: బీమా సంస్థ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వాహనయేతర బీమా విభాగాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మెరైన్, అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి సంబంధించిన బీమా పాలసీలను ప్రవేశపెడుతోంది. కంపెనీ చీఫ్ అండర్రైటింగ్ ఆఫీసర్ శశికాంత్ దహూజా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాపారంలో మోటార్ ఇన్సూరెన్స్ వాటా సుమారు 92 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. డైవర్సిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా ఫైర్, మెరైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు శశికాంత్ చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో వాహనయేతర వ్యాపారాన్ని 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇది 7–8 శాతంగా ఉంది. కేవలం ఒక విభాగంపై ఎక్కువగా ఆధారపడకూడదనే వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం 37% పెరిగి రూ.98 కోట్లకు చేరింది. ఈ ఏడాది వ్యాపారం 30% మేర వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు శశికాంత్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల బీమా పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్ల విలువైన పాలసీలను విక్రయించామన్నారు. ఈ ఏడాది వీటి విక్రయాలు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 3,780 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా 700 మందిని నియమించుకోనున్నామని శశికాంత్ తెలిపారు. -
‘ఉపాధి’కి ఇంధనం..
మీలో ఒకడిగా.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్’! ఇవన్నీ ఎవరో చెబితేనో.. ఎవరో ఉద్యమాలు చేస్తేనో తీసుకొచ్చినవి కావు. నా 3,648 కి.మీ. పాదయాత్రలో మీ సమస్యలను కళ్లారా చూశా. మీలో ఒకడిగా నాలుగేళ్లుగా మీ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్..’ అంటారు. మీ బిడ్డ పాలనలో ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్’ అంటే... తమ కష్టాన్ని చెప్పుకోలేని, తన ఆర్తిని వినిపించలేని పేదల గొంతుకై వాళ్ల తరపున నిలబడుతున్న ప్రభుత్వం మనది. కాబట్టే అట్టడుగున ఉన్న పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా కర్మణా మీ బిడ్డ నమ్మాడు కాబట్టి ఆ దిశగా నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఆటోలు, టాక్సీలను నడిపే డ్రైవర్ సోదరులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సొంతంగా ఆటోలు, టాక్సీలు కలిగి ఉండి వాటిని నడిపే వారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్తోపాటు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.పది వేల దాకా ఖర్చవుతోందన్నారు. అంత మొత్తం భరించేందుకు ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకే ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకాన్ని తెచ్చినట్లు తెలిపారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.275.93 కోట్ల వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత ఆర్ధిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ఐదేళ్లలో రూ.1,301.89 కోట్లు.. ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా రూ.10 వేలు పెడుతున్నాం. ఈ డబ్బు ఎలా వాడతారు? దేనికి వినియోగిస్తారన్నది నేను అడగను. కానీ మీ అందరికి సవినయంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. మీ వాహనంలో ప్రయాణికులు ఉన్నారని, మీకూ కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతోమందికి సేవలందిస్తున్న మీకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది. ఒక్క ఏడాది కూడా ఈ పథకాన్ని ఆపకుండా ఐదేళ్లలో ఐదు విడతల్లో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సహాయం చేయడం ద్వారా ఒక్క వైఎస్సార్ వాహన మిత్ర ద్వారానే ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లను నేరుగా అందించాం. గడప వద్దకే సంక్షేమం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు, రేషన్ కార్డుల దగ్గర నుంచి పెన్షన్ల దాకా, జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలన్నీ ఇంటివద్దకే తీసుకొచ్చి అందిస్తున్నాం. మీ అవసరాలు ఏమిటో జల్లెడ పట్టి మరీ తెలుసుకుని నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా గడపవద్దకే చేర్చుతున్నాం. నా పేద అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలన్న ఆరాటంతో మన గ్రామంలోని ప్రభుత్వ బడికే ఇంగ్లిష్ మీడియం చదువులను తెచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. మీ గ్రామానికే విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పరిచయం చేయడంతోపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, హెచ్బీ, కఫం టెస్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతున్నాం. గ్రామ, వార్డు స్ధాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూస్తున్నాం. విత్తనాల నుంచి విక్రయాల దాకా రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తూ ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతన్నలు.. నేతన్నలు.. గంగపుత్రులు రాష్ట్రంలో 52.39 లక్షల మంది రైతన్నల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ప్రభుత్వంగా వారికి తోడుగా నిలబడుతున్నాం. ఒక్క వైఎస్ఆర్ రైతుభరోసా కోసమే రూ.30,985 కోట్లు ఖర్చు చేశాం. పంటలు వేసే సమయానికి పెట్టుబడి ఖర్చుల కింద రైతన్నల చేతుల్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదని అన్నదాతలకు తెలుసు. వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తూ మత్స్యకార భరోసా ద్వారా 2.43 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో ఏకంగా రూ.538 కోట్లు అందించాం. మగ్గం కదిలితే తప్ప బతుకు బండి నడవని 82 వేల చేనేత కుటుంబాలకు ఐదేళ్లలో ఒక్క నేతన్న నేస్తం పథకం ద్వారానే రూ.982 కోట్లు అందించి అండగా నిలిచాం. తోడు అందిస్తూ.. చేదోడుగా నిలుస్తూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే, పుట్ఫాత్ల మీద విక్రయాలు సాగించే చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలను అమలు చేస్తున్నాం. వాళ్లు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారు...? అందుకు పెట్టుబడి ఎక్కడ నుంచి వస్తుంది? ఆ పెట్టుబడి కోసం ఎంతెంత వడ్డీకి డబ్బులు తెస్తున్నారో గతంలో ఎవరూ పట్టించుకోలేదు.అలాంటి 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటివరకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.2956 కోట్లు అందించాం. రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చి 3.30 లక్షల మందికి ఇప్పటివరకు రూ.927 కోట్లు సాయం అందించాం. అమ్మ ఒడి.. విద్యా దీవెన.. వసతి దీవెన అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీ బిడ్డ జగనన్న అమ్మఒడి పథకాన్ని తెచ్చాడు. 52 నెలల్లో 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అమ్మఒడి కోసం రూ.26 వేల కోట్లు విడుదల చేశాం. 26.99 లక్షల మంది తల్లులకు వారి పిల్లల పెద్ద చదువుల కోసం విద్యా దీవెన ద్వారా అందించిన సహాయం రూ.11,317 కోట్లు. జగనన్న వసతి దీవెన బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. ఏడాదికి రూ.20 వేలు వరకు అందిస్తూ జగనన్న వసతి దీవెన కోసం రూ.4,275 కోట్లు వెచ్చించాం. అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ... చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు మోసపోయారు. మాట ప్రకారం వారిని ఆదుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చి 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చాం. లేదంటే చంద్రబాబు మోసాలతో 18 శాతం ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ లోన్స్ 50 శాతం దాటేవి. అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నావడ్డీ కూడా వర్తింపచేసి దాదాపు రూ.5 వేల కోట్లు ఇచ్చి తోడుగా నిలబడ్డాం. 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.14,129 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా 3.58 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4.39 లక్షల మంది ఓసీ నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం రూ.1,257 కోట్లు. 30.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలిచ్చాం. ఇప్పటికే 21.32 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తమకు ఇంతగా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే మరొకటి లేదని నా అక్కచెల్లెమ్మలకు తెలుసు. ఇవన్నీ ఎవరో అడిగితేనో, ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మీ బిడ్డ.. మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ కష్టాలు, సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. ఇది మీ ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో మంత్రులు పి.విశ్వరూప్, జోగి రమేశ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి, కైలే అనిల్ కుమార్లతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జగనన్న అవసరం నేను విజయవాడలో 15 ఏళ్లుగా సీఎన్జీ ఆటో నడుపుతున్నాను. గతంలో ఇక్కడ 4 సీఎన్జీ స్టేషన్లు మాత్రమే ఉండడంతో గ్యాస్ కోసం రోజంతా పడిగాపులు పడేవాళ్లం. ఆటోలకు ఇన్సూరెన్స్లు, ఫిట్ నెస్లు చేయించుకోవడానికి కూడా కుదిరేది కాదు. పాదయాత్రలో మా స మస్యలు మీకు చెప్పగానే సానుకూలంగా స్పందించారు. మీరు సీఎం అవ్వగానే వాహనమిత్ర పథకం ద్వారా మాకు సాయం చేస్తున్నారు.ఈ విడతతో కలిపి నాకు రూ.50,000 వచ్చాయి. మీ చొరవతో విజయ వా డలో ఉన్న సీఎన్జీ స్టేషన్లు 4 నుంచి 15 అయ్యాయి. కోవిడ్ వల్ల రవాణా రంగం కుదేలైపోతే మానవత్వంతో మాకు 5 నెలల ముందే వాహనమిత్ర సాయం అందించా రు. నా తల్లి 2 నెలలు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే వలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చారు. మా అమ్మ చనిపోయే వరకు రూ. 81 వేలు వచ్చాయి. నా కూతురుకి అమ్మ ఒడి సాయం అందింది. నా కుమారుడికి వసతిదీవెన ద్వారా రూ.20 వేలు, ఇంజినీరింగ్ చదువుకు రూ.2,20,320 వచ్చాయి. మొత్తం నా కుటుంబానికి రూ.3,85,300 లబ్ధి కలిగింది. నా ఆటోకు ఇంధనం ఎంత అవసరమో... ఈ రాష్ట్రానికి జగనన్న కూడా అంతే అవసరం. – వినోద్, ఆటో డ్రైవర్, వాహనమిత్ర లబ్ధిదారుడు, విజయవాడ -
మీరు బ్యాంకులో డబ్బుల్ని డిపాజిట్ చేస్తున్నారా?.. మీకొక విషయం తెలుసా?
మీరు డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా? చేస్తే మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో ఈ బ్యాంకు డిపాజిట్లు అంత శ్రేయస్సకరం కాదు. ఎందుకంటే ఒక వేళ మీరు డిపాజిట్ చేసిన బ్యాంకుకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి దివాళా తీస్తే? ఇదిగో ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అందిస్తుంది. ఆ పథకం గురించి మీకు తెలుసా? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) అన్ని బ్యాంకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ అందించే డిపాజిట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ను అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా కొత్త మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఒకవేళ ఆ బ్యాంకు ఏదైనా సంక్షోభంలో చిక్కుకున్నా, రూ.5లక్షల వరకు డిపాజిట్ను ఖాతాదారులు తిరిగి పొందే వీలుంది. అర్హులైన ఖాతాదారులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారింటీ కార్పొరేషన్(DICGC) యాక్ట్ ప్రకారం దివాలా లేదా నష్టాల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లు తమ డబ్బుని విత్డ్రా చేసుకునేందుకు అప్లై చేసుకున్న 90 రోజుల్లో తిరిగి ఇవ్వబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
చిన్న సంస్థలకు బీమాతో భరోసా - లాంబార్డ్ ఈడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద సంస్థలతో పోలిస్తే లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎదుర్కొనే సవాళ్లు విభిన్నంగా ఉంటాయని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. ప్రకృతిపరమైన లేదా వ్యాపారపరమైన విపత్తులు ఎలాంటి వాటినైనా ఎదుర్కొనేందుకు పెద్ద సంస్థలకు తగిన ఆర్థిక వనరులు ఉంటాయని.. కానీ స్వల్ప మార్జిన్లతో పని చేసే చిన్న సంస్థలకు వాటిని ఎదుర్కొనేంత ఆర్థిక సామర్థ్యాలు పెద్దగా ఉండవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వాటికి బీమా ఉపయోగపడుతుందన్నారు. ఒక్కో ఎంఎస్ఎంఈ రిస్కులు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి తమకు అనువైన, తగినంత కవరేజీ ఇచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దీన్ని వ్యయంగా గాకుండా భరోసాగా పరిగణించాలని పేర్కొన్నారు. దేశీయంగా 6.2 కోట్ల పైచిలుకు వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ ఎస్ఎంఈ బీమా తీసుకున్న వాటి సంఖ్య 3 శాతం కన్నా తక్కువే ఉంటుందని ఆయన చెప్పారు. బీమా ప్రయోజనాలపై అవగాహన తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని మంత్రి వివరించారు. దీనితో ఈ అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ మొదలుకుని కారు, ఫోన్ల వరకూ అన్నింటినీ ఇన్సూర్ చేయించుకోవచ్చని అర్థమైతే చిన్న సంస్థలు.. బీమాను ఒక వ్యయంగా కాకుండా రిస్కులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాధనంగా చూడటం మొదలుపెడతాయని మంత్రి చెప్పారు. టెక్నాలజీతో సెటిల్మెంట్ వేగవంతం.. ఇక, ఎస్ఎంఈల విశిష్ట అవసరాలను గుర్తించి తాము కృత్రిమ మేథ, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి ఉపయోగించి క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ. 5 లక్షల వరకు ప్రాపర్టీ, మెరైన్ క్లెయిమ్లను పది రోజుల్లోపే ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈల బీమా అవసరాల కోసం డిజిటల్ ప్లాట్ఫాంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్ హెల్త్, లయబిలిటీ, ఇంజినీరింగ్ ఇన్సూరెన్స్ వంటి పలు పాలసీలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం?
వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అద్దె ఇళ్ల భావన ఎక్కువైంది. దేశంలో చాలామంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అద్దె ఇళ్లతో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. ఇంటి యజమానులతో పోలిస్తే అద్దెకు ఉండే వారికి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పటికీ.. వారితో అద్దెకు ఉంటున్నవారికీ ఓ బాధ్యత ఉంది. అదే హోమ్ ఇన్సూరెన్స్. అదేంటి హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి ఓనర్కు సంబంధించింది కదా.. దీంతో అద్దెకు ఉంటున్నవారికి పనేంటి అనుకోవద్దు.. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎంత అవసరమో.. అద్దెకుంటున్నవారికీ అంతే అవసరం. అది ఎందుకు.. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వస్తువుల రక్షణ ఇళ్లలో అద్దెకుండేవారు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముఖ్యమైన కారణం ఇది. ఈ హోమ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వస్తువులు అంటే టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, దుస్తులతోపాటు ఇతర విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న లేదా చోరీకి గురైన వస్తువులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొత్తవాటిని కొనుగోలు లేదా మరమ్మతుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఆస్తుల డ్యామేజీ కవరేజ్ వస్తువుల రక్షణతోపాటు ఇంటి ఆస్తుల రక్షణను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అద్దెదారు అనుకోకుండా ఇంటి ఆస్తిని పాడు చేసినట్లయితే, అంటే కిచెన్లో మంటలు ఏర్పడి ఇంటికి సంబంధించిన వస్తువులు దెబ్బతింటే ఆ నష్టాన్ని ఓనర్కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయపడిన ఇంట్లోకి వారికి బీమా వర్తిస్తుంది. తాత్కాలిక జీవన వ్యయాలు అగ్నిప్రమాదం లేదా వరదలు వంటివి సంభవించినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరొక చోట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో హోటళ్లలో ఉండటానికి, భోజనం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను ఈ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది. అందుబాటులోనే ప్రీమియం హోమ్ ఇన్సూరెన్స్పై భారతదేశంలో చాలా అపోహలు ఉన్నాయి. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అందుబాటు ప్రీమియంతోనే ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలెత్తే ఆర్థిక నష్టాలతో పోల్చినప్పుడు అది సహేతుకంగానే ఉంటుంది. అద్దెదారుల నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక పరిమితుల ప్రకారం దేశంలో అనేక కంపెనీలు ఈ రెంటర్స్ హోమ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. -
కౌలు రైతులకూ భరోసా
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం సంకలి్పంచింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది కౌలు కార్డులు (పంట హక్కు సాగు పత్రాలు–సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. గతంలో కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేవి కాదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల పేరిట బ్యాంకులు మొండిచేయి చూపడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు. కౌలు, వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచి్చన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు. సీసీఆర్సీల ద్వారా సంక్షేమ ఫలాలు సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 సీజన్లో 2,72,720 మందికి, 2020–21లో 4,14,770 మందికి, 2021–22 సీజన్లో 5,24,203 మందికి, 2022–23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలుదారులకు రూ.246.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు జారీ 2023–24లో కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీల జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా.. ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందించేందుకు సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్లో వీరికి వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నా. ఈ ఏడాది మినుము, వరి వేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు. గతేడాది రైతు భరోసా కింద రూ.13,500 జమయ్యాయి. ఈ ఏడాది కూడా కౌలుకార్డు తీసుకున్నా. రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేశామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. – కంపమళ్ల రమీజ, రుద్రవరం, కర్నూలు జిల్లా కౌలు కార్డు ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా నేను రెండెకరాలు కౌలుకు చేస్తున్నా. ఈ ఏడాది వరి, మొక్కజొన్న వేశాను. కౌలు కార్డు కోసందరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సులు లేకుండా సీసీఆర్సీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ద్వారా రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. రైతు భరోసా సాయం కోసం అప్లోడ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. – వీరంకి గోపీకృష్ణ, మోరంపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా మారింది
-
ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!
ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ప్రయాణీకులకు బీమా సౌకర్యాన్ని డీఫాల్ట్గా అందివ్వనుంది. తాజా నిర్ణయంతో వెబ్సైట్/యాప్లో టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి ఈ ఆప్షన్ను ఐఆర్సీటీసీ డిఫాల్ట్గా ఇస్తోంది. అంటే ఐఆర్సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది ఆటోమెటిక్గానే వస్తుంది. ఒకవేళ బీమా ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్ మార్క్ను తొలగించుకునే సౌలభ్యం కూడా ఉంది. కానీ ప్రతి ప్రయాణీకులు దీన్ని వినియోగించుకోవడమే చాలా అవసరం. ఐఆర్సీటీసీ పోర్టల్లో తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్గా రూ. 10 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని బీమా పరిశ్రమలోని సీనియర్ అధికారి పేర్కొన్నారని ఐఏఎన్ రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై ఐఆర్సీటీసీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇందుకోసం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ)ఐఆర్సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది. రైల్వే బీమాను ఎంచుకున్న ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా, లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ను రైల్వే శాఖ అందిస్తుంది. ఒకవేళ తీవ్రంగా గాయపడి పాక్షిక అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. అలాగే గాయపడిన వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. అయితే బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసి నపుడు బీమా సౌకర్యం అందించే సౌకర్యం ఉండేది. ఈ రూ. 10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే చార్జ్ చేసేది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభించే సౌకర్య అందుబాటులోఉండేదన్న సంగతి తెలిసిందే. -
పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పొరపాటు చేస్తే రూ.7 లక్షలు పోయినట్లే!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మూడు పథకాల్ని ఖాతాదారులకు అందిస్తుంది. వాటిలో ఒకటి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్), ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, వీటిలో ఈడీఎల్ఐ పథకంలో భాగంగా ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారుడు మరణిస్తే సదరు ఉద్యోగి నామినీకి రూ.7 లక్షల వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. ఇవి పొందాలంటే ఈ- నామినేషన్ తప్పనిసరి. ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రాక్టీస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డైరెక్టర్, ఆనంద్ రాఠీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అమ్జద్ ఖాన్ మాట్లాడుతూ, ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు బీమా రక్షణగా ఈపీఎఫ్ అందించే ప్రయోజనాల్లో ఇది ఒకటి. ఉద్యోగుల కోసం 1976లో ప్రారంభించిన ఈ పథకం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952 కింద కవర్ చేయబడిన అన్ని సంస్థలు డిఫాల్ట్గా ఈడీఎల్ఐ ప్రయోజనాల కోసం నమోదు చేసుకుంటాయని అన్నారు. ఇక, ఈపీఎస్, ఈపీఎఫ్ స్కీమ్లలో ఉద్యోగి కొంత మొత్తాన్ని చెల్లిస్తుండగా.. ఈడీఎల్ఐలో మాత్రం ఉద్యోగి తరుపున యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ ప్రయోజనాన్ని ఉద్యోగులు పొందాలంటే ఏదైనా సంస్థలో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏడాదిలోపు ఉద్యోగులు ఈ స్కీమ్లో అనర్హులు. మరింత సమాచారం కోసం సంబంధిత ఈపీఎఫ్వో కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. క్లెయిమ్ ప్రాసెస్ : ఉద్యోగి అకాల మరణంతో నామినీలు తప్పనిసరిగా పీఎఫ్ , పెన్షన్ విత్ డ్రాయిల్, ఈడీఎల్ఐలను క్లెయిమ్ ఫారమ్ ద్వారా క్లెయిమ్ చేయాలి. నామినీ తప్పనిసరిగా ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. తప్పని సరిగా బ్లాంక్ చెక్లు సైతం అందుబాటులో ఉంచుకోవాలి. చదవండి : ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం -
ఒకే పాలసీలో జీవిత, ఆరోగ్య బీమా ప్రయోజనాలు: అదేంటో తెలుసా?
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి ‘ఐషీల్డ్’ పేరిట కొత్త బీమా పాలసీని ప్రవేశపెట్టాయి. ఇటు ఆరోగ్య బీమా, అటు జీవిత బీమా ప్రయోజనాలు ఉండేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దాయి. వైద్య చికిత్సల వ్యయాలకు కవరేజీ ఇస్తూనే పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో కుటుంబానికి పెద్ద మొత్తంలో సమ్ అష్యూర్డ్ను అందించేలా ఈ పాలసీ ఉంటుందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) చికిత్స వ్యయాల భారం పడినా, ఇంటిపెద్దకు ఏదైనా జరిగినా కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ సమగ్రమైన బీమా పథకం తోడ్పడగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ చీఫ్ డి్రస్టిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా వివరించారు. హాస్పిటలైజేషన్, డే–కేర్ ట్రీట్మెంట్ మొదలైన వాటికి ఆరోగ్య బీమా భాగం ఉపయోగపడనుండగా, జీవిత బీమా భాగంతో.. 85 ఏళ్ల వయస్సు వరకూ లైఫ్ కవరేజీ ఉంటుంది. (792 బిలియన్ డాలర్లకు యాప్ ఎకానమీ ) -
చిన్న సంస్థల కోసం వినూత్న బీమా పథకాలు
ముంబై: జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కోసం మూడు వినూత్న బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఎంఎస్ఎంఈ సురక్షా కవచ్ పాలసీ, ప్రాపర్టీ ఆల్ రిస్క్ (పీఏఆర్) పాలసీ, ఐ–సెలెక్ట్ లయబిలిటీ పాలసీ వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. సురక్షా కవచ్ పాలసీ.. విపత్తుల నుంచి వాటిల్లే ఆస్తి నష్టాన్ని భర్తీ చేస్తుందని, ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి నష్టాల కోసం పీఏఆర్ కవరేజీ ఉపయోగపడుతుందని వివరించారు. ఆభరణాల వంటి విలువైన వాటికి ఐ–సెలెక్ట్ లయబిలిటీతో అదనపు కవరేజీ పొందవచ్చని పేర్కొన్నారు.