Sakshi News home page

అతిక్‌ సోదరుల దారుణ హత్య.. మాయవతి రియాక్షన్‌ ఇదే..

Published Sun, Apr 16 2023 3:37 PM

Mayawati Slams UP Government Over Gangster Atiq Ahmad Killing - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనేత, గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వారిద్దరినీ ముగ్గురు యువకులు.. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చి చంపారు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈఘటనపై తాజాగా బీఎస్పీ చీఫ్‌ మాయావతి స్పందించారు. 

కాగా, మాయావతి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. గుజరాత్ జైలు నుండి తీసుకువచ్చిన అతీక్ అహ్మద్, బరేలీ జైలు నుండి తీసుకువచ్చిన అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో దారుణంగా కాల్చి చంపారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారికి చంపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఆందోళనకరమైన ఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా బై లా’ కాకుండా ఎన్‌కౌంటర్‌ ప్రదేశ్‌గా మార్చడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసుల సమక్షంలో ఇలా హత్యలు జరిగితే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. 

మరోవైపు.. ఈ ఘటనలో లవ్లేశ్‌ తివారీ, సన్నీ, అరుణ్‌ మౌర్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిని విచారించగా.. ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్‌ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లలో వెళ్లి కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.

Advertisement
Advertisement