తొలి ఎంపీ.. సి.మాధవరెడ్డి | Sakshi
Sakshi News home page

తొలి ఎంపీ.. సి.మాధవరెడ్డి

Published Sat, Apr 20 2024 1:30 AM

- - Sakshi

● హైదరాబాద్‌ రాష్ట్రంలో మొదటి ఎన్నికలు ● సోషలిస్టు పార్టీ తరఫున ఆదిలాబాద్‌ నుంచి పోటీ ● 25 వేల పైచిలుకు అధిక్యంతో విజయం

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. మహారాష్ట్ర, కర్నాటకలోని పలు ప్రాంతాలను కలుపుకుని హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం జనరల్‌ స్థానంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో 21ఎంపీ స్థానాలు ఉండగా అందులో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గానికి 1952 మార్చి 27న తొలిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇందులో సోషలిస్టు పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ తరఫున సి.మాధవరెడ్డి పోటీ చేయగా, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జేవీ నర్సింగ్‌రావు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,51,017 మంది ఓటర్లున్నారు. కాగా తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో సగానికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉన్నారు. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో 1,56,907 (44.7శాతం)ఓట్లు పోలయ్యాయి. 1,94,110 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా ఆ రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఓటు చెల్లుబాటు కావడం గమనార్హం.

ఆదిలాబాద్‌ ఎంపీగా..

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో చెరుకు మాధవరెడ్డి ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన ఆయనకు 90,995 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి నర్సింగ్‌రావుకు 65,912 ఓట్లు పోలయ్యాయి. దీంతో మాధవరెడ్డి 25,083 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి ఆదిలాబాద్‌ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవి తాన్ని ప్రారంభించిన మాధవరెడ్డి కాంగ్రెస్‌, టీడీపీల నుంచి కూడా పదవులు దక్కించుకున్నారు. ఆయన రాజకీయ జీవితం మూడు పార్టీల్లో సాగింది. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 1962లో బోథ్‌ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్బావంతో ఆ పార్టీలో చేరిన ఆయన రెండోసారి 1984లో మరోసారి ఎంపీగా విజయంసాధించారు.

చెరుకు మాధవరెడ్డి

1/1

Advertisement
Advertisement