ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని.. కిరాతకంగా చంపిన తనయుడు.. | Sakshi
Sakshi News home page

ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని.. కిరాతకంగా చంపిన తనయుడు..

Published Tue, Nov 14 2023 12:56 AM

- - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కుటుంబ పరంగా రావాల్సిన డబ్బులు ఇవ్వ కుండా తాత్సారం చేస్తున్నాడనే కోపంతో ఓ కసాయి తనయుడు తండ్రిని చున్నీతో ఉరిబిగించి హత్య చేసిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ జయేశ్‌రెడ్డి, ఎస్సై నీరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జవహార్‌నగర్‌ కాలనీకి చెందిన నక్క చిన్న పోశెట్టి(56) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

శనివారం రాత్రి తాగిన మైకంలో కుమారుడు సాయిలు తండ్రి చిన్న పోశెట్టిల మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాడనే కోపంతో ఇంట్లో ఒక్కడే నిద్రిస్తున్న తండ్రిని చున్నీతో ఉరిబిగించి హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి స్థానికంగా ఉన్న వారికి హత్య చేసినట్లు తెలుపగా మద్యం మత్తులో చెబుతున్నాడని వారు పట్టించుకోలేదు. సాయిలు పోలీసుల ఎదుట తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకొని ఆదివారం లొంగిపోయాడు.

సీఐ జయేశ్‌రెడ్డి, ఎస్సై నీరేశ్‌ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణలో సాయిలు మద్యానికి బానిసయ్యాడని తెలిపారు. కుటుంబ, పొలం పరంగా రావాల్సిన డబ్బుల విషయమై పలుమార్లు తండ్రీకుమారుడిల మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. సాయిలు మద్యానికి బానిస కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి: అమెరికాలో వైద్య విద్యార్థిని మృతి

Advertisement

తప్పక చదవండి

Advertisement