‘ఉగ్రవాదిని కాదు.. నేను అరవింద్‌ కేజ్రీవాల్‌ని’ | Sakshi
Sakshi News home page

‘ఉగ్రవాదిని కాదు.. నేను అరవింద్‌ కేజ్రీవాల్‌ని’

Published Tue, Apr 16 2024 11:47 AM

I am not a terrorist AAP MP Sanjay Singh on Delhi CMs message - Sakshi

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశానికి, ఢిల్లీ ప్రజలకు కోసం ఒక కుమారుడుగా, సోదరుడుగా పనిచేశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. తీహార్‌ జైలు నుంచి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పంపిన సందేశాన్ని మీడియాకు సంజయ్‌ సింగ్‌ వెల్లడించారు. 

‘నా పేరు అరవింద్‌ కేజ్రీవాల్‌. నేను ఉగ్రవాదిని కాదు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా  ఎన్నికైన నేను పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ను తీహార్‌ జైల్‌లో గ్లాస్‌ గోడ ద్వారా కలిశాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఆప్‌పై ఎంత ద్వేషం పెంచుకున్నారో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం’ అని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారన్నారు. 24 గంటలు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని సంజయ్‌ సింగ్‌ మండిపడ్డారు. 

‘జైలులో ఉ‍న్నది సీఎం అరవింద్‌ కేజ్రీవాల్. ఆయన ఓ మట్టి మనిషి.. అయన్ను ఎంత విచ్ఛినం చేయాలని చూసినా అంతే బలంగా తిరిగి వస్తారు. తీహార్‌ జైలులో అరవింద్‌ కేజ్రీవాల్‌ కలసిన పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ భావోద్వేగానికి గురయ్యారు.  ఇది మనందరికీ చాలా ఉద్వేగభరితమైన విషయం. ప్రధాని మోదీ, బీజేపీకి సిగ్గు చేటు’ అని సంజయ్‌ సింగ్‌ అన్నారు.

‘ప్రధాని మోదీ సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్‌ బాండ్ల  పథకం ఉత్తమమైనది అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ సుప్రీ కోర్టు తీర్పును అవమానించారు. మోదీ సుప్రీం కోర్టుక, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement