Sakshi News home page

పిఠాపురంలో జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్‌సీపీలోకి మాకినీడి శేషకుమారి

Published Wed, Mar 20 2024 5:27 PM

Janasena Party Incharge Sesha Kumari Joins YSRCP At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలలో 28 వేల ఓట్లు తనకు వచ్చాయని తెలిపారు. ‘పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు. పవన్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు. జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. సీఎం జగన్‌తో అసలు పవన్‌ను ఎవరూ పోల్చుకోరు. సీఎం జగన్ స్థాయి వేరు. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం. ఆచరణలో ఏమీ చేయరు’ అని తెలిపారు.

నన్ను జనసేనలోకి రమ్మనటం పవన్ అవివేకం
డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం​ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే  ఓట్లేయమని అడుగుతాం. కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది. నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ. నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం. పవన్‌ను కూడా నేను మా వైఎస్సార్‌సీపీలోకి రమ్మంటే బావుంటుందా?. సీఎం జగన్ మీద జనానికి నమ్మకం ఉంది. ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు. పవన్‌కు అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు. జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు’ అని వంగా గీత అన్నారు.

Advertisement
Advertisement