Sakshi News home page

మీది పిరికితనం, చేతగానితనం

Published Thu, Apr 4 2024 4:52 AM

Mudragada Padmanabham comments over Pawan Kalyan - Sakshi

బ్లేడ్‌బ్యాచ్‌ వచ్చేస్తుందన్నప్పుడు రాజకీయాలు మానేయండి 

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు మాజీ మంత్రి ముద్రగడ సూచన

రాజమహేంద్రవరం రూరల్‌: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేతగానితనం, పిరికితనంతోనే బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి చేయడానికి వచ్చేస్తోందంటున్నారని మాజీమంత్రి, వైఎస్సార్‌ సీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. అలాంటప్పుడు రాజకీయాలు మానేయాలని సూచించారు. రాజమహేంద్రవరం బొమ్మూరులోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పవన్‌కళ్యాణ్‌కు కార్యకర్తలు వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇవ్వకూడదని, వారిని అడ్డుకునేలా ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున జీతాలిచ్చి బౌన్సర్లను పెట్టుకున్నారని చెప్పారు. ప్రజలు ముట్టుకోకూడదని, షేక్‌హ్యాండ్‌ ఇవ్వకూడదనే.. బ్లేడ్‌బ్యాచ్‌ వచ్చేస్తోందంటూ పవన్‌ నెపం వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తామంతా ప్రజల్లోనే తిరుగుతున్నాం కదా.. తమపై బ్లేడ్‌బ్యాచ్‌ దాడులు చేయలేదే అని ప్రశ్నించారు.  

చంద్రబాబు మాటలు అసహ్యంగా ఉన్నాయి  
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే అసహ్యంగా ఉందని ముద్రగడ పద్మనాభం చెప్పారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు, ఆయన స్నేహితులు.. గతంలో ఆయన పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. సీఎం జగన్‌కు ఒక చాన్స్‌ ఇచ్చానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఒక్కచాన్స్‌ ఇచ్చారని, ప్రజాసంక్షేమ పథకాలతో మంచిపాలన చేస్తునఆయన్ని మరోసారి సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.కె.రావు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రీజనల్‌ కోఆర్డినేటర్‌ జక్కంపూడి గణేష్, మాజీ వైస్‌ ఎంపీపీ నక్కా రాజబాబు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement