Sakshi News home page

Navneet Rana: బీజేపీలోకి నవనీత్‌ రాణా.. అమరావతి నుంచి పోటీ!

Published Thu, Mar 28 2024 6:59 AM

Navneet Rana Joins BJP in Nagpur Amravati Candidate - Sakshi

మహారాష్ట్రలోని అమరావతి సిట్టింగ్‌ ఎంపీ నవనీత్ రాణా అధికారికంగా బీజేపీలో చేరారు. నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే నవనీత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికిముందు అమరావతి (రిజర్వ్డ్ స్థానం) నుంచి పార్టీ అభ్యర్థిగా నవనీత్ రాణాను బీజేపీ ప్రకటించింది. 

బీజేపీలో చేరిన నవనీత్ రాణా మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నానని అన్నారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే వారిని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తారని, ఈ విధంగానే తనకు టిక్కెట్‌ కేలాయించారన్నారు. తన శ్రమను బీజేపీ గుర్తించిందని, ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి 400 సీట్లు దాటాలనే బీజేపీ సంకల్పాన్ని నెరవేరుస్తామన్నారు. ఇకపై తాను బీజేపీకి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. 

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు స్వతంత్రులు గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. వారిలో నవనీత్ రానా కూడా ఒకరు. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా 36,951 ఓట్ల తేడాతో గెలుపొందారు. పంజాబీ కుటుంబానికి చెందిన నవనీత్ కౌర్‌.. రవి రానాతో పెళ్లి తర్వాత రానాను తన పేరులో చేర్చుకున్నారు. 

నవనీత్ కౌర్, రవి రాణా యోగా గురు రామ్‌దేవ్ బాబా ఆశ్రమంలో కలుసుకున్నారు. 2011లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఎంపీ నవనీత్ ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆర్మీలో పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు నవనీత్‌  మోడలింగ్‌లో తన కెరియర్‌ ప్రారంభించారు. తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించారు. నవనీత్ పెళ్లి తర్వాత రాజకీయాల్లో కాలుమోపారు. 2014లో ఎన్‌సీపీ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అమరావతి ఎంపీగా ఎన్నికయ్యారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement