జైశ్వాల్‌కు అన్యాయం.. డబుల్‌ సెంచరీ చేసినా! లేదు అదే కరెక్ట్‌? | Sakshi
Sakshi News home page

IND vs ENG: జైశ్వాల్‌కు అన్యాయం.. డబుల్‌ సెంచరీ చేసినా! లేదు అదే కరెక్ట్‌?

Published Mon, Feb 19 2024 8:45 AM

Netizens wonder why double centurion Yashasvi Jaiswal didnt get the Player of the Match award - Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో భారత్‌ రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్‌ జట్టు కేవలం 122 పరుగులకే చాపచుట్టేసింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా స్పిన్‌ ఉచ్చులో ఇంగ్లండ్‌ బ్యాటర్లు చిక్కుకున్నారు.

5 వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని జడ్డూ శాసించాడు. జడ్డూ బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లో కూడా సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా(112) సెంచరీతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు వరించింది. అయితే జడేజాకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కడంపై ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయారు. 

ఓ వర్గం జడ్డూకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వడం సరైన నిర్ణయమంటుంటే.. మరో వర్గం డబుల్‌ సెంచరీ వీరుడు యశస్వీ జైశ్వాలే ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌కు అర్హుడని అభిప్రాయపడుతున్నారు. జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీ సాధించికపోయింటే భారత్‌కు అంత భారీ ఆధిక్యం లభించేది కాదని పోస్ట్‌లు చేస్తున్నారు.

జైశ్వాల్‌కు అన్యాయం చేశారని 'ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌' కీ వర్డ్‌ను ఎక్స్‌లో తెగ ట్రెండ్‌చేస్తున్నారు. మరికొంత మంది కావాలనే జైశ్వాల్‌కు అవార్డు ఇవ్వలేదని, రాజకీయాలు చేస్తున్నారని కామెట్లు చేస్తున్నారు. అంతకముందు రెండో టెస్టులోనూ జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.

ఓ వైపు సహచర బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నప్పటికి.. యశస్వీ మాత్రం ఇంగ్లండ్‌ బౌలర్లపై ఒంటరి పోరాటం చేశాడు. అప్పుడు కూడా జైశ్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు వరించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Advertisement
Advertisement