ఆ ఇద్దరితో రూమ్‌ అస్సలు షేర్‌ చేసుకోను: రోహిత్‌ శర్మ | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు పరమ గలీజ్‌గాళ్లు.. వాళ్లతో రూమ్‌ అస్సలు షేర్‌ చేసుకోను: రోహిత్‌ శర్మ

Published Sun, Apr 7 2024 4:49 PM

Rohit Sharma On Kapil Sharma Show Names Two Teammates He Wont Share A Room With - Sakshi

ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ హోస్ట్‌ చేసిన ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్‌.. హిట్‌మ్యాన్‌, శ్రేయస్‌లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్‌, శ్రేయస్‌ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్‌, శ్రేయస్‌ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతుంది. 

ఆ ఇద్దరు పరమ గలీజ్‌గాళ్లు..
షో సందర్భంగా కపిల్‌ హిట్‌మ్యాన్‌తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్‌ షేర్‌ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్‌ చేసుకుంటారని రోహిత్‌ను అడిగాడు. ఇందుకు రోహిత్‌ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్‌ షేర్‌ చేసుకోవాల్సి వస్తే శిఖర్‌ ధవన్‌, రిషబ్‌ పంత్‌లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్‌ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్‌ డిస్టర్బ్‌ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్‌ క్లీనింగ్‌కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్‌ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్‌ షేర్‌ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అ‍స్సలు అనుకోనంటూ హిట్‌మ్యాన్‌ బదులిచ్చాడు.

ఇదే సందర్భంగా రోహిత్‌ మరిన్ని విషయాలను కూడా షేర్‌ చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 7) ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్‌ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. 
 

Advertisement
Advertisement