పుట్టపర్తి అర్బన్/ పుట్టపర్తి టౌన్: క్రోధి నామసంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలని కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ మాధవరెడ్డి ఆకాంక్షించారు. క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి వేర్వేరు ప్రకటనల్లో వారు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కొత్త ఆలోచనలతో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. రానున్న సంవత్సరం ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
నీటి ఎద్దడి నివారణకు నిధులివ్వండి
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి
కలెక్టర్ వినతి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో తాగునీటి సరఫరాకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ అరుణ్బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డిని కోరారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా తదితర పరిస్థితులపై సమీక్షించారు. వీసీలో కలెక్టర్ అరుణ్బాబు, జేసీ అభిషేక్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లికార్జున, డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు సుమారు రూ.5.54 కోట్లు అవసరమవుతాయని, వెంటనే నిధులను విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలోని 179 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు. చేతి పంపులు, బోర్లు మరమ్మత్తులకు నిధుల కొరత లేదన్నారు. అలాగే జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల్లోపు ఉపాధి హామీ పనులు ముగించేలా చర్యలు తీసుకున్నామని సీఎస్కు తెలిపారు.
టీచర్లంతా శిక్షణ తరగతులకు హాజరు కావాలి
కొత్తచెరువు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 10న ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించనున్న శిక్షణ తరగతులకు ఉపాధ్యాయులంతా హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధులకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులంతా శిక్షణ తరగతులకు హాజరు కావాలన్నారు. పదో తరగతి ‘స్పాట్’కు హాజరైన వారు, స్పాట్ ఆర్దర్ వచ్చి మినహాయింపు పొందిన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావల్సిందేనన్నారు. ఎవరైనా శిక్షణ తరగతులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.