-
మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
‘సారూ..’ అన్న శబ్దం నా చెవి గూబను కాస్త గట్టిగానే చరిచింది. నా భార్యతో మాటలకు మధ్యలో కామా పెట్టి, ఎవరాని అటు దిరిగి చూశాను. వయస్సు అర్ధసెంచరీకి అవతలిగట్టు. అరవై ఏళ్లవరకూ ఉండొచ్చు. మాసిన చొక్కాకు అక్కడక్కడా చిన్నపాటి చిరుగులు. కింద లుంగీ.. ఇంకొంచెం పెద్ద చిరుగులతో చొక్కాను డామినేట్ చేస్తోంది. నెత్తిన జుట్టు దుమ్మును పులుముకొని చిందరవందరగా వుంది. కుడికాలికి పిక్క మునిగే వరకు కట్టు. కట్టుకట్టి చాలారోజులైందన్నట్టు తెల్లటి కట్టు మట్టి పులుముకొని కనిపించింది. మనిషిని చుట్టుముట్టిన పేదరికం ఛాయలు.‘ఏంటన్నట్లు?’ అతనివైపు చూశాను. ‘సారూ.. నేను హైదరాబాద్కు పొయ్యే రైలెక్కాలి. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!’ బతిమిలాడుతున్నట్లు మాట, అభినయం. ‘సరే చెబుతా! అక్కడ కూర్చోనుండు’ పక్కనే ఉన్న అరుగు చూపించి అన్నాను. ‘మర్చిపోవద్దు సారూ.. నీ కాళ్లు మొక్కుతా’ అంటూ మరింత దగ్గరగా వచ్చి నా కాళ్లపైకి వంగాడు.అతన్నుంచి జారి మందు వాసన నా ముక్కు పుటాలను తాకింది.ముఖం చిట్లించి ‘చెప్పాను కదా.. అక్కడ కూర్చో, రైలొచ్చినప్పుడు చెబుతా’ కాస్త విసుగ్గా అన్నాను.‘గట్లనే సారూ ..’ రెండడుగులు వెనక్కువేసి నిలుచున్నాడు.నేను, నా భార్య హైదరాబాద్ వెళ్లేందుకు బాపట్ల రైల్వేస్టేషన్ లో రైలు కోసం వెయిట్ చేస్తున్నాము. మా కూతురు, అల్లుడు హైదరాబాదులో కాపురంపెట్టి నెలన్నర. ప్రసవం పూర్తయి బిడ్డకు జన్మనిచ్చాక అయిదవ నెల వచ్చేవరకు కూతురు గాయత్రి మాతోనే ఉంది. అప్పటికే మనవడు గిర్వాన్ కాస్త వొళ్లుచేశాడు. కాళ్లు, చేతులు హుషారుగా ఆడించడం, కనుగుడ్లు పెద్దవిచేసి చూడడం, బోర్లా తిరగడం, మనం నవ్వితే.. నిశితంగా పరిశీలించి నవ్వడం, హెచ్చరికలకు స్పందించడం మొదలు పెట్టాడు.మనవడి మురిపెంలో అయిదు నెలలు అయిదు రోజుల్లా గడిచాయి. అల్లుడిది ప్రైౖవేటు కంపెనీలో ఉద్యోగం. తానెలాగోలా బాబును సగదీరుకుంటానని చెప్పి కూతురు హైదరాబాద్కు వెళ్లిపోయింది. మనవడి జ్ఞాపకాలు మరువలేక బుడ్డోన్ని చూడాలని నా శ్రీమతి తహతహలాడిపోయింది. నాకూ కాస్త అలానే ఉన్నా బయటపడలేని స్థితప్రజ్ఞత.ఇంతలో ఆరవనెల అన్నప్రాశన అని కూతురు కబురుపెట్టింది. కాగలకార్యం కాలం తీర్చినట్లు హైదరాబాద్ ప్రయాణం ఖరారైంది. రాత్రి పది గంటలకు సింహపురి ట్రైన్ లో ప్రయాణం. మనవడి కోసం బట్టలు, పెద్ద దోమతెరతో పాటు ఏమేమి తీసుకురావాలో కూతురు రెండు రోజులుగా పదేపదే లిస్ట్ చదివింది. నా శ్రీమతి.. కూతురు వద్దన్న వాటిని కూడా బ్యాగుల్లో బలవంతంగా కూర్చి ఉరువుల సంఖ్యను అయిదుకు పెంచింది.‘బయలుదేరేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు బ్యాగులను కౌంట్ చేయండి’ అన్న కూతురు ముందుచూపు సూచనలతో ఉరువులు లెక్కగట్టి రైల్వేస్టేషన్కు చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది. ప్లాట్ఫారంపై మరోమారు బ్యాగులు లెక్కగట్టి సంతృప్తి చెందాక అక్కడే ఉన్న అరుగుపై కూర్చుంది మా ఆవిడ. రైలు రావడానికి అరగంట సమయముంది. ‘అన్నీ సర్దావా? ఏవైనా మరచిపోయావా?’ అన్నమాటకు ‘గుర్తున్నకాడికి’ అంది. ఇంతలో కూతురు ఫోన్ . లగేజీల ప్రస్థానంపై ఆరా.ఆమె కొడుకు అన్నప్రాశన కోసం తీసుకున్న వెండి గిన్నె, స్పూన్, గ్లాసు ఎక్కడ మరచి పోతామో? అన్నది ఆమె టెన్షన్ . ఒకపక్క రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్లు, ప్రయాణికుల ఉరుకులు, పరుగులు. రైళ్లు ఎక్కి, దిగే ప్రయాణికుల రద్దీతో ప్లాట్ఫారాలు సందడిని నింపుకోగా, ఈ మధ్యే రంగులద్దుకున్న రైల్వేస్టేషన్ రాత్రిపూట ఎల్ఈడీ కాంతుల వెలుగుల్లో కన్నులకింపుగా కనపడుతోంది.‘సార్.. సార్’ అంటూ పెరుగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తి. ‘ఏమిటన్నట్లు?’ చూశాను.‘రైలు వస్తున్నట్టుంది సార్! హైదరాబాద్ దేనా?’ అన్నాడు. సీరియస్గా ముఖం పెట్టి ‘నువ్వెక్కడికెళ్లాలి?’ అన్నాను. ‘హైదరాబాద్ పొయ్యే రైలుకే సార్’‘ఎక్కడ దిగాలి?’ ఊరి పేరు చెప్పాడు. ఏపీ సరిహద్దులో ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఊరు.‘మేమూ ఆ రైలుకే వెళుతున్నాము, మాతో పాటు ఎక్కుదువులే’ అన్నాను. ‘దండాలు దొరా.. ఈ ఒక్క సాయం చెయ్యి.. మా అయ్య కదూ’ అని మరీ వంగి కాళ్లను తాకుతూ దండం పెట్టాడు. మందు వాసన నాతోపాటు పరిసరాలనూ పలకరిస్తోంది. నేను వెనక్కు తగ్గాను. ‘మర్చిపోబాకు సారూ రైలు రాగానే నాకు చెప్పు.. ఏమీ అనుకోకు’ అంటూ చేతులు జోడించాడు.తను పదేపదే దగ్గరగా రావడం నన్ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. కోపం, చిరాకు తెప్పిస్తోంది. ‘సరే.. చెబుతానన్నా గదా, రైలు రాంగానే చెబుతా, పొయ్యి అరుగు మీద కూర్చో’ అన్నాను.‘కోప్పడకు సారూ.. మరచిపోతావేమోనని చెపుతాండాలే ’ కొంచెం దూరం జరిగాడు. మరికొద్దిసేపట్లో గూడూరు– సింహపురి ఎక్స్ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్పారంపైకి రానుందని తెలుగు, ఇంగ్లిష్, హిందీలో అనౌన్స్మెంట్. అప్పటికే కిక్కిరిసిన జనం అలర్ట్ అయ్యారు. రైలు వస్తుందంటూ తోటి ప్రయాణికులతో చర్చలు. కొందరు షాపుల్లో వాటర్ బాటిళ్లు కొంటున్నారు, ఇంకొందరు పిల్లలకు బిస్కెట్లు, కూల్డ్రింక్స్ కొనిపిస్తున్నారు, మరికొందరు ఫోన్లో రైలు వచ్చిందంటూ ఇంటికి కబురు చెబుతున్నారు, కొందరు బయలుదేరుతున్నామంటూ గమ్యంలోని వారికి సమాచారం చేరవేస్తున్నారు. ప్రయాణికుల కోలాహలం పెరిగింది.మరోమారు నా భార్య మా లగేజీ బ్యాగులు లెక్కగట్టింది. మా కూతురు కౌంటింగ్ సూచనల ప్రభావం ఆమెను వీడనట్లుంది. ‘బ్యాగులు అన్నీ ఉన్నాయా?’ అన్న అర్థం వచ్చేలా ఆమెవైపు చూశాను. ఈసారి ఆమె నవ్వింది. ‘సార్..సార్ ఇదో టీ తీసుకోండి, వేడివేడి టీ..’ పరుగులాంటి నడకతో వచ్చాడు ఆ వ్యక్తి. సీరియస్గా చూశాను. ‘మీ కోసమే తెచ్చాను, టీ తాగండి సర్’ అన్నాడు. నాకు కోపం నసాలానికెక్కింది. చుట్టుపక్కల ప్రయాణికుల దృష్టి చాలాసేపటి నుంచి మా ఇద్దరిపైనే ఉంది. ప్రతిసారీ అతను వేరెవరి దగ్గరకు వెళ్లకుండా నావద్దకు వచ్చి బతిమిలాడుతుండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోమారు అందరూ నావైపు చూశారు. కోపం కంట్రోల్ చేసుకున్నాను.‘ఇప్పుడే ఇంట్లో అన్నం తిని వస్తున్నాను, ఇప్పుడు టీ తాగను, నువ్వు తాగు’ ఒక్కో అక్షరం గట్టిగా నొక్కి పలికుతూ కళ్లెర్ర చేశాను.నా ఆగ్రహం పసిగట్టినట్లున్నాడు, దూరంగా వెళ్లి టీ తాగి అక్కడే నిల్చున్నాడు. ట్రైన్ వస్తోందంటూ మరోమారు అనౌన్్సమెంట్. ప్లాటుఫారంపై డిస్ప్లేలలో రైలు నంబర్, బోగీ నంబర్లు వేస్తున్నారు. అది చూసి ప్రయాణికుల్లో హడావుడి. అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. ‘సార్ రైలొచ్చిందా?’ ఈసారి కాస్త దూరం నుంచే అడిగాడు ఆ వ్యక్తి.‘ఆ.. వస్తాంది. ఇక్కడే ఉండు ఎక్కుదాం’ అన్నాను. ‘సరే.. సరే’ అంటూ నాకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.నా భార్య మరోమారు బ్యాగులను చూపుడు వేలితో లెక్కించడం కనిపించింది. రైలు కూతతోపాటు దాని వెలుతురు తోడుగా ప్లాట్ఫారం పట్టాలపైకి భారంగా వచ్చి ఆగింది. మేమున్న దగ్గరకి కొంత అటు ఇటుగా మేము ఎక్కాల్సిన బీ–5 ఏసీ స్లీపర్ బోగి ఉంది. నా భార్య, నేను చెరో రెండు బ్యాగులు చేతికి తీసుకున్నాం. ఆదరబాదరగా వచ్చి ‘ఇటివ్వు తల్లీ’ అంటూ నా భార్య చేతిలోని రెండు బ్యాగులు తీసుకున్నాడా వ్యక్తి. ఆమె ఇంకో బ్యాగు తీసుకుంది. నా వెంటే బ్యాగులు మోసుకొచ్చాడు. బోగీలో మాకు కేటాయించిన సీట్ల వద్ద బ్యాగులు పెట్టాను. నా భార్యకు సీటు చూపించి కూర్చోబెట్టి.. ‘నీది యే బోగి?’ అడిగాను ఆ వ్యక్తిని. ‘నాదిక్కడ కాదు సారూ..’ అన్నాడు. ‘పద నీ బోగీలో దిగబెడతా’ అన్నాను. ‘నాదిక్కడ కాదులే సారూ..’ అన్నాడు మళ్లీ. ‘ఏదీ.. నీ టిక్కెట్ చూపించు? సీటెక్కడో చెబుతా’ అన్నాను. ‘టికెట్ లేదు సారూ..’ అన్నాడు.‘అదేంటి! టికెట్ తీసుకోలేదా?’ ‘లేదు సారూ.. అయినా మాకెందుకు సారూ టికెట్, మమ్మల్ని టికెట్ అడగరులే’ అన్నాడు. ‘టీసీ వచ్చి చెక్ చేస్తే?’ ‘అది మీకు సారూ.. మాకు కాదులే’ నసగుతూ అన్నాడు‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. ‘నేను అడుక్కునేటోన్ని సారూ.. మాకు టిక్కెట్ గట్ల లేదులే’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. మాసిన బట్టలు, ఆహార్యం చూస్తే అచ్చమైన పల్లెటూరి అమాయకుడిలా ఉన్నాడు తప్పించి మరీ అడుక్కునేవాడిలా కనిపించలేదు.‘నువ్వు అడుక్కుంటావా?’ అన్నాను. ‘అవును సారూ.. నేను బిచ్చగాన్ని’ అన్నాడు.నాముందు దాదాపు గంటపాటు రైల్వేస్టేషనులో ఉన్నాడు, నాకే టీ ఇవ్వబోయాడు, ఎవ్వరినీ డబ్బులు అడుక్కోలేదు. మనస్సు ఏదోలా అయ్యింది. తను అబద్ధం చెబుతున్నాడేమో! ‘నిజం చెప్పు నువ్వు అడుక్కుంటావా?’ అడిగాను. ‘నిజం సారూ.. నేను బిచ్చగాన్నే, ఆరేళ్లుగా అడుక్కుంటున్నాను’ అన్నాడు. ‘అంతకుముందు?’‘రైతును సారూ’ అన్నాడు. ఉలిక్కి పడ్డాను. తనవైపు తేరిపార చూశాను. రైతు కుటుంబంలో పుట్టిన నాకు తన మాటలు మనస్సులో అలజడి సృష్టించాయి. నా భార్యకు మళ్లీ వస్తానని చెప్పి తనతో పాటు బోగీల వెంట నడుస్తున్నాను. నాగటి చాళ్లలో నడచినట్లు కాలి పాదాలు తొసుకుతున్నాయి. సరిగ్గా అడుగులు వేయలేకపోతున్నాను. మనసుదీ అదే స్థితి. మెదడు గతితప్పింది.‘యే.. టిఫినీ.. టిఫినీ.. ఇడ్లీ వడా, ఇడ్లీ వడా... సార్ వాటర్.. వాటర్, కూల్డ్రింక్స్..’రైలు బోగీల్లో అరుపుల గోల. నా మనసు ఘోషపై ధ్యాసపెట్టిన నా చెవులు వాటిని పట్టించుకోలేదు. ఎలాగోలా జనరల్ కంపార్ట్మెంట్ కొచ్చాను. ఖాళీగా ఉన్న సీటుపై కూర్చున్నాను. ‘కూర్చో’ ఆ వ్యక్తికి సీటు చూపించాను.‘పర్లేదు సారూ నేను నిలుచుంటా’ అన్నాడు. చెయ్యిపట్టి కూర్చోబెడుతూ ‘నీ పేరు..?’ అడిగాను. ‘సోమయ్య సారూ..’‘నీ కథ వినాలని ఉంది చెప్పు సోమయ్యా..’ అన్నాను. ఒక్కక్షణం.. మొదలుపెట్టాడు.‘మాది మధిర దగ్గర పల్లెటూరు సారూ. చిన్న రైతు కుటుంబం. ఒక కొడుకు, ఒక కూతురు. రెండెకరాల మెట్ట. వానొస్తేనే పైరు, లేకుంటే బీడు. రెక్కలు గట్ల కట్టెలు జేసుకొని పని చేసేటోల్లం. అప్పులతో పెట్టుబడి, కరువులతో కష్టాలు. ఒక పంటొస్తే నాలుగు పంటలు పొయ్యేటియి. వడ్డీలు పెరిగొచ్చి అప్పులు కుప్పబడె. తీర్చే దారి దొరక్కపాయ.ఎదిగొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకోలేంగద సారూ.. ఎకరం అమ్మి బిడ్డ పెండ్లిజేస్తి. నా కష్టం పిల్లోడికొద్దని వాన్ని డిగ్రీ దాకా చదివిస్తి. అప్పులోల్లు ఇంటిమీద పడి ఆగమాగం జేస్తిరి. నానా మాటలు పడితి. అయి భరించలేక ఉరిపోసుకుందామని తీర్మానం జేసుకుంటి. భార్యా, కొడుకు దావలేని రీతిన వీధిన పడ్తరని మనసు మార్చుకుంటి. సేద్యం ఇక కుదిరేకత లేదని తీర్మానం జేసుకుంటి. ఉన్న అప్పు వడ్డీలతో గలిపి అయిదు లక్షలకు ఎగబాకె. ఎకరం అమ్మి లొల్లిజేసేటోల్లకు కొంత అప్పుగడ్తి. మా ఊర్లో నా దోస్తుగాల్లు కొందరు సేద్యం ఎత్తిపెట్టి చిన్నచిన్న యాపారాలకు బొయ్యి బాగానే సంపాదిస్తున్నారు. వో దినం నా బాధ వారికి మొరపెట్టుకుంటి.‘మాతో వస్తావా?’ అనిరి. అట్టే అని జెప్పి వొకనాడు వాల్లతో పాటు తిరుపతి రైలెక్కితి. ఎట్టోకట్ట గడ్డనెయ్యి స్వామీ అని ఎంకన్న స్వామికి మొక్కుకుంటి. తిరపతి బొయ్యి చూస్తే నా దోస్తుగాల్లు జేసే యాపారం బిచ్చమెత్తకోవడమని తెలిసె సారూ. పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా అడుక్కోడమే. ‘ఇదేందయ్యా ఇట్టాంటిదానికి దెస్తిరే’ అని తొలిరోజు మనసురాక యాతనపడితి.కలోగంజో కలిగిన కాడికి నలుగురికి పెట్టినోల్లం, ఇప్పుడు అడుక్కునే రోజులొచ్చే అని కుమిలిపోతి. అప్పుతీర్చాల, కొడుకును దారిలో పెట్టాల. మనకాడ యేముందని యేం యాపారం జేస్తాం! మనసుకు నచ్చజెప్పుకుంటి. ఆ రోజు నుంచి అడుక్కోడం మొదలు పెడ్తి సారూ. రెండువారాలు బిచ్చమెత్తడం ఇంటికి రాడం, రెండు రోజులుండి మల్లీ పోడం, నెలాఖరుకు రావడం రెండు రోజులుండి మల్లీ పోడం. ఆరేండ్ల కాలం గడచిపాయ దొరా.’మనసు బాధను పంచుకొనేదానికి దోస్తానా దొరికిండనుకున్నాడేమో? ఏకబిగిన తన కథ చెప్పాడు సోమయ్య. మనసును పిండేసే కథ. నేలను కదలించే కథ. కొన్ని నిమిషాలపాటు మా మధ్యన మాటల్లేవు. అంతా నిశ్శబ్దం. రైలు ఇనప చక్రాల రోదనా నా చెవికెక్కడం లేదు.కొద్దిసేపటి తరువాత.. ‘ఇప్పుడెలా ఉంది పరిíస్థితి’ అడిగాను. ‘బాగుందిసారూ .. అప్పులు తీర్చాను, ఊర్లో పాత ఇంటిని రిపేర్ చేసుకున్నాను. కొడుకు హైదరాబాద్లో కంపెనీలో చేరాడు’ చెప్పాడు.‘రైతుగా పదిమందికి పెట్టినోడివి బిచ్చమెత్తడం ఇబ్బందిగా లేదా సోమయ్యా..’ ‘ఎందుకుండదు సారూ.. ఎదుటి మనిషి ముందు చేయిచాచగానే కొందరు చీదరించుకుంటారు, కొందరు పనిజేసుకొని బతకొచ్చుగా అంటారు. కొందరు అసహ్యంగా చూస్తారు. కొందరైతే నానాతిట్లు తిడతారు’ అన్నాడు.‘మాటలు పడ్డప్పుడు బాధనిపించదా?’ అన్నాను.‘అనిపిస్తుంది సారూ.. కచ్చితంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా రైతుగా నేను పడిన కష్టాలు కళ్ల ముందేసుకుంటాను. పంట కోసం తెచ్చిన అప్పులు గట్టమని అప్పులిచ్చినోల్లు తిట్టిన తిట్లు గుర్తుకు తెచ్చుకుంటాను. తోటి మనిషన్న జాలి లేకుండా ఇంటి మీదకొచ్చి పరువు బజారుకీడ్చినప్పుడు పడ్డ యాతన గుర్తుకు తెచ్చుకుంటాను.పెండ్లాన్ని అమ్మైనా బాకీ తీర్చాలన్న మాటలకు గుండెపగిలి ఏడ్చిన ఏడుపు గుర్తుకు తెచ్చుకుంట సారూ. చుట్టుపక్కోల్లు గుమిగూడి ఓదార్చకుండా మాట్లాడిన వెకిలి మాటలకు పడ్డ యాతన, వేదన గుర్తుకు తెచ్చుకుంటా, ఆ మాటలు పడలేక ఉరిపోసుకొని చచ్చిపోదామనుకున్న రోజులు యాదికి తెచ్చుకుంట. ఆ కష్టాలు, అవమానాల కంటే బిచ్చమెత్తుకొనేటప్పుడు పడే మాటలు సిన్నయిగా అగుపిస్తాయి సారూ. రైతుగా ఉన్న నాటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి నొప్పి గుండెను పిండదు సారూ.’సోమయ్య మాటలు ఆర్ద్రంగా మారాయి. చొక్కా చెరుగుతో కళ్లను తుడుచుకున్నాడు. నా కళ్లకు సోమయ్య మసగ్గా కనపడుతున్నాడు. మనస్సు బాధగా మూలిగింది. ‘సోమయ్యా .. ఉద్యోగం చాలించి నేనూ రానా..’ ఆయన మనస్సు తేలిక చేయాలన్న ఉద్దేశంతో అన్నాను. ఒక్కసారి నావైపు చూసి చిన్నగా నవ్వాడు. ‘మీకెందుకు సారూ ఆ కర్మ? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’ అన్నాడు. ‘అవును సోమయ్యా! తిరుపతికే ఎందుకు వెళ్లడం అంతదూరం?’ అన్నాను.‘భక్తులు దేశం నలుమూలల్నుంచి వచ్చేతావు సారూ, పాపాలు చేసి పుణ్యం పట్టకపోయేటందుకు మొక్కులతో వస్తరు, దండిగా డబ్బులతో వస్తరు, ఖర్చుపెట్టేందుకు సిద్దపడే వస్తరు, దేవుడికింత , మాకింత’ చెప్పాడు. ‘అయితే బిక్షమెత్తి పాపులకు పుణ్యం పంచే దేవుడి ఉద్యోగం అన్నమాట’ అన్నాను. ‘ఊరుకొండి సారూ.. వెంకన్నస్వామే దేవుడు, నేను కాదు’ నవ్వుతూ అన్నాడు. సోమయ్యలో నవ్వు చూశాను. కొంచెం బాధ తగ్గింది. సెల్ఫోన్ లో టైమ్ చూశాను. పన్నెండు కావస్తోంది. ఎవరిగోడూ పట్టని సింహపురి ఎక్స్ప్రెస్ విజయవాడ దాటి మధిర వైపు వేగంగా పరుగెడుతోంది.‘మీరెల్లిపడుకోండి సారూ.. మేడం ఒక్కరే ఉంటారు, నేను ఇంకో గంటలో దిగిపోతా ’ అన్నాడు. ‘అవును సోమయ్యా.. నువ్వు బాపట్లలో ఎందుకున్నావు?’ అన్నాను. ‘తిరపతిలో తొందరతొందరగా రైలెక్కాను సారూ.. తీరాచూస్తే అది మావూరి దగ్గర ఆగదంట. అందుకే ఇక్కడ దిగాను, దసరా పండక్కు కొడుకు, కూతురు పిల్లలు ఊరికి వచ్చిండ్రు సారూ.. రేపే పండగ, మల్లీ రైలెక్కడ పోగొట్టుకుంటానో అని బయపడి మిమ్మిల్ని ఇబ్బంది పెట్టాను’ అన్నాడు.‘సరే’ అని లేచాను. ఇప్పుడు సోమయ్య దగ్గర నాకు మందు వాసన రావడం లేదు, మట్టి వాసన వస్తోంది, రైతు చమట వాసన వస్తోంది. చేయి కలిపాను. పాలకుల ఆదరణ కరువై వో రైతు కాడిదించాడు. వందల మంది జనం ఆకలి ఆర్తనాదాలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. అన్యమనస్కంగానే నా బోగీవైపు అడుగులు వేశాను. — బిజివేముల రమణారెడ్డి -
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
-
Funday Story: 'వనప్రస్థపురం'.. మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి ఇదే..!?
హాలిడే ట్రిప్కు పిల్లలు, మనవళ్ళతో ఓలా కార్లు బయల్దేరిపోయాయి. తలుపు దగ్గరగా వేసి వచ్చి, హాల్లో సోఫా మీద కూర్చున్నాను. డైనింగ్ టేబులు మీద ఆఖరు మనవడు చివరి క్షణం వరకూ తిననని మారాం చేస్తూ వదిలేసిన పప్పు, నేయి అన్నం. దాని పక్కనే హడావుడిలో మరచిపోయిన మంచినీళ్ళ బాటిల్. ఇల్లంతా నిశ్శబ్దం కరెంటు పోయినట్టుగా. గదిలో సుభద్ర ఒత్తిగిల్లుతూ, దుప్పటి పైకి లాక్కున్న చప్పుడు. ఎంగిలి కంచం సింకులో వేసి, బెడ్రూమ్లోకి తొంగిచుశాను. ‘ఎట్లా ఉంది’ ‘తగ్గుతున్నది జ్వరం. పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు నావల్ల’ ‘మరెప్పుడైనా వెళదాంలే ఏం పోయింది’ ‘మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాము తాజ్మహల్ చూద్దామని. అందరికీ కుదిరి, వాతావరణం బాగుండి, సెలవులు దొరికి, పరీక్షలు లేకుండా, ఇదిగో ఇన్నాళ్ళకి వీలయితే, ఈ వైరల్ ఫీవర్ మొత్తాన్ని దెబ్బతీసింది’ నిస్పృహగా నవ్వింది సుభద్ర. చేయి పట్టుకుని నిమిరాను. పలుచటి ముఖం. జ్వరంలోనూ తగ్గని ఆ ముఖంలోని నిర్మలత. కాకుంటే ఒత్తుగా ఉండే జుట్టొకటే ఈ మధ్య పలచబడింది. కాసేపటికి కునుకులోకి జారింది. బయటకు వచ్చి సోఫాలో కూర్చుని, క్రాస్వర్డ్ చేయటం మొదలు పెట్టాను. ఇరవై నిముషాలు పట్టింది. అలవాటయితే తేలికయిన ప్రక్రియే. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఫ్రిజ్ నుంచి పాలు తీసి బయటపెట్టాక, టీ డబ్బా కోసం వెతుకుతుంటే అకస్మాత్తుగా లాసా–లమ్సా చాక్లెట్ టీ గుర్తుకొచ్చింది. ఈ రోజుల్లో ఎవరయినా తాగుతున్నారా? అనుమానమొచ్చింది. ఫోను చేశాను. త్రివేణి సూపర్ మార్కెటులో ఆశ్చర్యకరంగా స్టాక్ ఉంది. పదినిమిషాల్లో పిల్లవాడితో పంపాడు. కొంచెం పాలతో, తక్కువ పంచదారతో, లైట్గా పెట్టిన టీ మరుగుతుంటే, వాసన కాస్త బలంగానే తగులుతోంది. రెండు మగ్గుల్లో పోసి బెడ్ రూమ్కు తీసుకువెళ్ళాను. చూస్తూనే లేచి కూచుంది సుభద్ర. మొదటి సిప్కే ముఖం విప్పారింది. ‘ఇదెక్కడిది’ ఆశ్చర్యంగా అడిగింది. ‘తెప్పించాను ఇప్పుడే’ టీ కప్పును చేతితో తిప్పుతూ చూస్తుండి పోయింది తాగడం మానేసి. ‘చల్లారిపోతుంది తాగు’ ‘ఈ రుచి, వాసన నీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి’ ‘ముంబైలోని మాతుంగా కింగ్స్ సర్కిల్. అక్కడి పూలమాలలు. పక్కనే శృంగేరి మఠం. గిరి బుక్ స్టోర్’ ‘ఇంకా’ ‘బొంబాయ్ బ్లాస్ట్స్... మోకాళ్ళలోతు నీటిలో పెద్దవాడి బస్సు కోసం మెయిన్ రోడ్డు వరకూ చుడీదార్ ఎగగట్టి నడచిపోవడం’ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా జాగ్రతగా నెమరువేస్తూ అవి అయిపోతాయేమో అన్న భయంతో కొంచెం కొంచెంగా టీ తాగాం. ‘ఎన్నేళ్ళయింది చాక్లెట్ టీ తాగి’ ‘1982లో ఆఖరిసారి తాగాము. బాంబే నుంచి స్విట్జర్లాండ్. వెనక్కు చెన్నై. కొన్ని రోజులు అమెరికా మళ్ళీ చెన్నై. ఎక్కడా దొరకలేదు మనకు’ అందామె. ‘మనం ప్రయత్నించలేదుగా’ ‘అంటే అత్తగారికి ఇష్టం లేదు. రెండు రకాల టీలు పెట్టే ఓపిక నాకు లేదు. మామయ్య, అత్తయ్య పోయాక, ఎప్పుడూ రుచిచూడని పిల్లలకు ఈ రుచి నచ్చలేదు’ ‘హోటల్స్లో దొరకదు’ నేను ముక్తాయింపుగా అన్నాను. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఫోను చేశారు పిల్లలు. అమ్మ ఎట్లా ఉంది. వంట ఏం చేసుకున్నారు వగైరా వగైరా. అమ్మ జ్వరం తగ్గిందనగానే వాళ్లకు కాస్త రిలీఫ్. కార్న్ ఫ్లేక్స్ను బౌల్స్లో తీసుకుని వేడి పాలు ఒంపుకొని డైనింగ్ టేబులు మీద కూర్చున్నాము. అల్మారాలో పై తంతెలో గోధుమ రంగులో ఉంది పెళ్లి ఆల్బమ్. దుమ్ము తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఆల్బమ్. పసి పిల్లలుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళయినారు. చిన్న గొలుసు రెండు పిలకలతో అక్కయ్య ఎత్తుకొని ఉన్న రమ్య ఇవాళ అమెరికాలో సెటిల్ అయింది. కళకళలాడుతున్న ముఖాల్తో అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నులు. కండువాతో తాతయ్య, అమ్మమ్మ. ఫ్యామిలీ ఫొటోలో దాదాపు 65 మందిమి ఉన్నాము. మనిషి మనిషిని లెక్కపెడితే ప్రస్తుతం అందులో నలభయి అయిదు మంది ప్రపంచంలోనే లేరు. పది మంది ఇండియాలో లేరు. ‘పెళ్ళిలో మామయ్య పాడిన పాట జ్ఞాపకముందా. భక్ష్యాలతో పాల మీగడ లేదని మీ ఆత్తకు కోపం వచ్చింది’ సుభద్ర జ్ఞాపకం చేసింది. ఆల్బమ్స్ వెనక్కి పెట్టేయబోతుంటే, సుభద్ర టీపాయి మీద ఉంచమన్నది– మధ్యాహ్నం తీరికగా చూసుకోవడానికి ఇద్దరం కలిసి. రోజుకు రెండుసార్లు పిల్లల ఫోనులు కొనసాగుతూనే ఉన్నాయి. టాక్సీ ప్రయాణం, హోటల్స్లో తందూరీ రోటీ రుచి. ఆగ్రా దారిలో ధాబాలు.. పుల్కాలు.. మజా కూల్డ్రింకు... బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు స్నానం చేసి స్లీవ్లెస్ నైటీలో బయటకు వచ్చింది సుభద్ర. చేతిలో కాగితాల కట్ట. ‘ఎన్నేళ్ళయింది నువ్వీ పింక్ స్లీవ్ లెస్ వేసుకొని’ అశ్చర్యంగా అడిగాను. ‘ఏమో! అల్మారా తెరిస్తే వేసుకోవాలనిపించింది’ ‘ఇన్నేళ్ళయినా ఎంత బాగుందో’ పెద్దగా అనేసి నాలిక కరుచుకొని చుట్టూ తిరిగి చూశాను. ఇంట్లో మేమిద్దరమే అన్న సత్యం మరోసారి గుర్తొచ్చింది. ‘ఏమిటి కాగితాల కట్ట’ ‘ఉత్తరాలు’ ‘ఏ ఉత్తరాలు’ ‘పెళ్ళికి ముందు ఆరు నెలలు మీరు నాకు, నేను మీకు రాసినవి’ నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది సుభద్ర. ఒక కట్టకు గ్రీన్ బాండు. అవి సుభద్ర రాసినవి. రెడ్ రబ్బర్ బాండ్తో నావి. ‘ఉప్మా చేయమంటారా?’ ‘నువ్వేం చేయద్దు. కాస్త తొందరగా భోజనం చేద్దాము. ఉత్తరాలిచ్చి సోఫాలో కూర్చో’ సుభద్ర ఉత్తరాలు నేను, నా ఉత్తరాలు సుభద్ర తీసుకున్నాము. ఎన్ని ఆశలు. ఎన్ని ఆలోచనలు. ఎంత అర్థం లేని కవిత్వం. ఎప్పటి సినిమా పాటలు. మూడు వేలతో హనీమూన్ ఎక్కడికంటూ ఎన్ని చర్చలు. పెళ్ళికి ముందు ఎదుర్కోలులో కట్టుకోబోతున్న కాఫీ రంగు కంచి పట్టుచీర వర్ణన. రాసి కొట్టేసిన చిలిపి మాటలు. అప్పుడు చదివిన నవలల ప్రశంస. కనబోయే పిల్లల మీద బెరుగ్గా సాగిన చర్చలు. తెలుగు రాత అర్థం కావడానికి కూడా కొంచెం సమయం పడుతోంది. నాకు మాత్రం ఆ ఉత్తరాలు కృష్ణబిలం కన్నా లోతుగా, ఎంకి పాటల కన్నా మధురంగా అనిపించాయి. గంట తరవాత ఉత్తరాల కట్ట మార్చుకున్నాము. ఉత్తరాలు చదువుతూ అరవయి ఏళ్ళు దగ్గర పడుతున్న సుభద్రలో అప్పుడప్పుడు అణచిపెట్టుకున్న నవ్వు, ముంచెత్తుతున్న సిగ్గు చూస్తుంటే ఒక్కసారి గుండె పొరలో ఏదో కదిలింది. శిథిలమయిన దేవాలయం తలుపులు తీస్తే, చెక్కు చెదరని అమ్మవారి విగ్రహం కనబడినట్లు అనిపించింది నాకు. పుస్తకాలు చదవడం మొదలెట్టాం. ఒకరోజు ‘మిడ్ నైట్స్ చిల్ట్రన్’ కొంతభాగం నేను చదివాను. సుభద్ర విన్నది. మరుసటి రోజు ‘వెన్నెల్లో ఆడపిల్ల’ యండమూరి రచన సుభద్ర చదివింది. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దగ్గరి సుధా హోటల్లో మసాలా దోశె. మూడోరోజు ఎన్నేళ్ళుగానో పోలేకపోతున్న శర్మ ఇంటికి సాయంత్రం ఓ గంటసేపు టీకి. ఎప్ప్పుడో టీటీడీ నుంచి తెప్పించిన పోతన భాగవతం తీసి చదవడం ప్రారంభించాం ఇద్దరం. ఉదయాన్నే ఐదున్నరకల్లా లేచి ఒక అరగంట ఐ.ఎం.లో నేర్చుకున్న యోగా చేయడం, ఆ తరువాత మరో అరగంట పాటు ఏ ఆలోచనా లేని మౌనం కోసం ధ్యానంలో కూర్చోవడం. మనవళ్ల స్కూలు, పిల్లల ఆఫీసు తొందర లేకపోవడంతో, పనిమనిషిని కూడా లేట్గా రమ్మన్నాము. ఒక విధమైన నిర్వా్యపారత్వంతో చాలారోజుల నుంచి వెతుకుతున్నది, కొంచెం కొంచెం దొరుకుతున్న తృప్తి మొదలైంది. వారం రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆదివారం వచ్చేసింది. పిల్లలు సాయంత్రం దిగుతారు. ఉదయాన్నే లేచి కాఫీ కూడా తాగకుండా, కాలనీ పార్కులో మౌనంగా అరగంట కూచున్నాము. శరీరాలు కొంచెం తగులుతున్నాయి. మనసులు పెనవేసుకున్నాయి. నెమ్మదిగా లేచి ఇంటికి వచ్చేశాము. పిల్లలు వచ్చేశారు. ఇల్లంతా మళ్ళా సందడి. పొద్దున స్కూలుకు తయారయ్యేవాళ్ళు, హోమ్వర్క్ మరచిపోయిన వాళ్ళు, స్కూలు బాగ్ దొరకని వాళ్ళు, బ్రేక్ఫస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికి హడావుడి.. పూర్తి బిజీ రొటీన్ మళ్ళీ మొదలయింది. మనవళ్ల బస్సు కోసం రోడ్డు మీద నిలుచోవడం, ఎన్డీటీవీలో ఊదరగొట్టే రాజకీయ చర్చలు, పాత సినిమా పాటలను కొత్త వాళ్ళతో పాడించే కార్యక్రమాలు. అప్పుడప్పుడు రాని నీళ్ళు, ఎప్పుడూ ఎగ్గొట్టే పనిమనిషి. పాత మూసలోకి క్రమంగా జారిపోతున్నాము. ఒంటరిగా ఉన్న వారం రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే, అవి ఒకసారి ఏడాది లాగా, మరోసారి ఏదో కలలాగా అనిపించడం ప్రారంభించాయి. నెలరోజుల తరువాత రెండోవాడి కొలీగ్ పెళ్ళికి పిలుపు వచ్చింది. పెళ్ళి చేసుకునే అమ్మాయి మాకు కూడా బాగా పరిచయం. ఇంటికి వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టి కార్డు ఇచ్చి రమ్మనమంటూ పిలిచింది. ఇంటిల్లిపాది బయలుదేరారు. ‘నాకెందుకో రావాలని లేదురా’ ప్రయాణానికి గంట ముందర చెప్పాను. ‘ఏం నాన్నా? ఒంట్లో బాలేదా’ ఆదుర్దాగా అడిగాడు మా రెండోవాడు. ‘ఒంట్లో బానే ఉంది. అక్కడికొచ్చి క్యూలో నిల్చుని, బఫే తినే ఇంట్రెస్టూ, రాను పోను నాలుగు గంటలు కార్లో కూచునే ఓపిక రెండూ లేవు’ నేనూ రానంటూ సుభద్ర ఉండిపోయింది. మమ్మల్ని వదిలి వాళ్లకు వెళ్లక తప్పలేదు. ఆ పైవారం బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం. కుటుంబసమేతంగా వనభోజనాలు. మరో వారం బిర్లామందిర్ ప్రయాణం. అన్నీ ఆఖరి క్షణంలో మానేశాము నేను, సుభద్ర. మమ్మల్ని, మా ప్రవర్తనని, ఆలోచనలను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న పిల్లలకు, ముఖ్యంగా కోడళ్ళకు, ఏం జరుగుతున్నదో అంతుపట్టడం లేదు. మేమేమీ కోపంగా లేము. సాధింపులు లేవు. పిల్లలతో చిరాకు పడటం లేదు. పైపెచ్చు పూర్వం కన్నా కొంచెం సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళకు, మాకూ తెలుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం. అందరం బ్రేక్ఫస్ట్ కానించి కూర్చున్నాము. పిల్లలు ఆడుకోడానికి వెళ్లారు. పెద్దకొడుకు, కోడలు, చిన్నకొడుకు, కోడలు హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. సుభద్ర వంటింట్లో టీ పెడుతోంది. పేపరుతో బయటకు వచ్చిన నన్ను చూసి, సింగల్ సీటరు సోఫా ఖాళీ చేసి కూర్చొమన్నాడు పెద్దవాడు. ‘అమ్మా నువ్వు కూడా ఇటురా’ పిలిచాడు. టీ కప్పులు ట్రేలో పట్టుకొని వచ్చింది సుభద్ర. మా దగ్గరున్న స్వతంత్రం వల్ల, ఇంట్లో ఉండే మంచి వాతావరణం వల్ల, ఏ ఉపోద్ఘాతం, డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు పెద్దవాడు. ‘నాన్నా ఈ మధ్య మీరు ఇద్దరూ మాతో బయటికి రావడాన్ని ఎవాయిడ్ చేస్తున్నారు. ఒంట్లో బాలేదా? మనసు బాలేదా?’ ‘అదేమీ లేదురా’ మాట దాటేశాను. ‘పోనీ పిల్లలతో, పనితో బాగా అలసిపోతున్నారా? వంటకు సహాయంగా మనిషిని పెడదామంటే మీరేగా వద్దన్నారు’ ‘పనిలో ఏ ప్రాబ్లమ్ లేదురా’ ‘ఎందులోనూ ఏ ప్రాబ్లమ్ లేకపోతే మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది. తాజ్మహల్ ట్రిప్ కాన్సిల్ అయినప్పటి నుంచి మీరు దేనికీ మాతో కలిసి రావట్లేదు. ఎందుకు?’ సుభద్ర, నేను మార్చి మార్చి చూసుకున్నాము. ఏమీ మాట్లాడవద్దన్నట్లు తల ఆడించింది సుభద్ర. నామటుకు నాకు, ఈ మౌనం, ముసుగులో గుద్దులాట కొనసాగితే, మనస్పర్థలు మొదలయితాయేమో అనిపించింది. ఆలోచించుకొని నెమ్మదిగా అన్నాను. ‘మేము వనస్థలిపురంలోని మన పాత ఇంట్లో ఉందామనుకుంటున్నాము. కనీసం ఓ ఆర్నెల్లు’ కొడుకులు, కోడళ్ళు అందరూ ఉలిక్కిపడ్డారు. ‘ఎందుకు నాన్నా? ఏమయింది’ చిన్నవాడి ప్రశ్న. ‘ఏమీ కాలేదు. మీరు మమ్మల్ని ఒక్కమాట అనలేదు. పిల్లలు కూడా ఏమీ నోరుజారలేదు. అంతా ఎంతో ప్రేమగా ఉంటున్నారు’ ‘మరి?’ ‘నేను చెప్పే కారణాలు కొన్ని మీకు నవ్వు తెప్పించవచ్చు. కొన్ని మీకు అర్థం కూడా కాకపోవచ్చు. మా అమ్మ చెప్పేది... రామాయణ వనవాస ఘట్టంలో దశరథుడి ఆక్రోశం అర్థం కావాలంటే పిల్లలుండాలని. అట్లాగే నేను చెప్పేవి, అనుకునేవి, మీకు అరవై, డెబ్బై ఏళ్ళు వస్తేగాని పూర్తిగా అర్థం కావు. వయసు పైబడ్డాక భార్య భర్తలకు ఏకాంతం యవ్వనంలో కన్నా ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం. పెళ్ళయిన మొదటి రెండేళ్లలో ఎట్లా ఉన్నామో, ఏం మాట్లాడుకున్నామో కూడా జ్ఞాపకం లేదు నాకు. మీ చదువులు, మా అమ్మ, నాన్న, బంధువులు, రోగాలు, ప్రయాణాలు కొన్ని దశాబ్దాలు హాడావుడిగా గడిచిపోయాయి. మీ అందరి మధ్య ఎంత ప్రేమగా ఉన్నా, మేమిద్దరం నిశ్శబ్దంగా పక్కపక్కన కూర్చోవడమో, మా పెళ్లి ఆల్బమ్ చుసుకోవడమో, మాకు ఎంతో సహాయం చేసిన స్నేహితుల విషయం మాట్లాడుకోవడమో, ఇప్పుడు దాదాపు అసంభవం అయింది. కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మనవరాలు చానల్ మార్చేస్తుంది. తలత్ మెహమూద్ గజల్ చిన్నకోడలికి మలేరియా వణుకుపాట. పాత ఆల్బం టీపాయ్ మీద పెడితే పిల్లల పుస్తకాల్లో కలసిపోతుంది. ఏమీ చేయకుండా ఉండటం, చేయదలచుకున్నది మాత్రమే చేయడం, ఈ స్వతంత్రం కాస్త కావాలి అనిపిస్తోంది రా’ నా మాటలకు చిన్నకోడలు కాస్త గిల్టీగా తలదించుకుంది. ‘ఓ పదిహేను రోజులు ఎక్కడి కన్నా వెళ్ళిరండి నాన్నా!’ చిన్నవాడు సలహా ఇచ్చాడు. ‘నేను కోరుకునేది ఎక్కడికీ పోనక్కరలేని స్థిరత్వం, ప్రశాంతత. నాకు అరవై అయిదు ఏళ్ళు. మహా అయితే మరో పదిహేనేళ్ళు, ఆరోగ్యం బాగుంటే ఇరవై. మా ఇద్దరిలో ఒకరు ముందు, ఒకరు వెనక పోక తప్పదు. మా ఇద్దరిలో ఒంటరిగా మిగిలిన వాళ్ళకి మనుమలు, మనవరాళ్ళు తప్ప, ఏ జ్ఞాపకాల గుబాళింపు, ఏ మాటల మంద్రధ్వని ఆలంబనగా ఉండనక్కరలేదా? కళ్ళు మూసుకొని మీ అమ్మను తలచుకుంటే కాఫీ పెడుతూనో, పసిపిల్లకు పాలు పడుతూనో కనబడుతున్నది. ఆ రూపం తప్ప మరే రూపమూ ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందుకు రావడం లేదు’ ఉద్యోగం చేస్తున్న పెద్దకోడలు తలదించుకొని నెమ్మదిగా అన్నది – ‘పోనీ మేమే ఎక్కడికన్నా మారిపోమా’ ‘మళ్ళా అదే మాట. మీరు మమ్మల్ని కష్టపెట్టడం లేదు. కాని మనమలు మనవరాళ్ళతో ఉండే సుఖం కన్నా కొంచెం వేరే సుఖం, శాంతి కావలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. ఏదో పొద్దున లేచి, గబగబా దీపం పెట్టి, హాడావుడిగా చేసే పూజ తప్ప, అరగంట ప్రశాంతంగా ఆత్మావలోకనం చేసుకునే తీరిక, వ్యవధి లేకుండా ఉన్నది జీవితం. తండ్రిగా, తాతగా, భర్తగా, ఉద్యోగిగా కాకుండా భగవంతుడు ఇచ్చిన జన్మకు ఒక వ్యక్తిగా నేను సాధించినదేమిటి? నన్ను, నేను ఎంతవరకు తెలుసుకున్నానన్న ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి కలవరపెడుతున్నది.’ ‘అయితే వెళ్ళిపోతారా’ కూతురు లేని లోటును తీర్చిన చిన్నకోడలు ఒక్కసారి బావురుమంది. ‘అదేమిటమ్మా, ఆరునెలలు అనుకుంటున్నాము. ఉండగలమో, లేదో? మనసంతా ఇక్కడికే లాగుతుందేమో? చంటివాణ్ణి జోకోట్టకపోతే నాకు నిద్ర పట్టదేమో? ఏ అవసరం వచ్చినా చెప్పండి రెండు గంటల్లో హైటెక్ సిటీలో వచ్చివాలతాము. ఏం తినాలనిపించినా, మమ్మల్ని చూడాలనిపించినా, వెంటనే బయలుదేరి రండి. మన పూర్వులు నిర్ణయించినట్లు వానప్రస్థ ఆశ్రమాన్ని కొన్ని నెలలు అయినా వనస్థలిపురంలో గడుపుదామని మా ప్రయత్నం. భగవంతుడి దయ వల్ల మొదటి రెండు నెలలు ఈ ప్రయత్నం సఫలమయితే, తరువాతి రెండు నెలలు ఉత్తరాలు రాసుకునే వెనకటి రోజులకు పోదామనుంది. వీలయితే వాట్సప్ని ఫోను నుంచి తీసేద్దామనీ ఉంది. రోజువారీ వ్యవహారంలో మీరంతట మీరు నిర్ణయాలు తీసుకోవడం, బాగా అవసరమనుకుంటేనే మా సలహాను అడగడం మీకూ మంచిది. మాకూ మంచిది. ఎవరు చూడొచ్చారు? ప్రతిరోజు కనబడకపోతే మూడు దశాబ్దాల క్రింది నా యూరోపియన్ అనుభవాలు మీకు వినాలనిపిస్తుందేమో! మనవరాలు సంగీతం క్లాసు టయిమ్కి వాకింగ్ పెట్టుకోకుండా నేను ఇంట్లోనే ఉండి దాని ముద్దు పాటలు వింటానేమో’ ‘అహంకారమడగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరతీసుకో అన్న పాట అంతరార్థం తెలుసుకోవాలని ఉందిరా మీ నాన్నకు’ సుభద్ర వత్తాసు పలికింది. తేలికపడిన మనసుతో కుర్చీలోంచి ఉత్సాహంగా లేచాను. — బారు శ్రీనివాసరావు ఇవి చదవండి: Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా! -
మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!
ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దుపొద్దునే కాఫీ గుమాళింపుతో ముక్కుపుటలకు తాకుతుంటే అబ్బా ప్రాణం లేచించింది అనిపిస్తుంది. చాలా మందికి ఇది తాగితే చాలు టిఫిన్లతో కూడా పనిలేదు. అలాంటి కాఫీ ఎలా మన దైన జీవితంలో భాగమయ్యింది?. ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా!. మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీని ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడమేమిటి? అనే కదా..!. ఆఫ్రికాకి చెందిన ఆ మేకల కాపరి ప్రతిరోజు మేకలను మేపుకుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలా మేకలను బయట మేపుకుని పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. అందులో ఓ మేకపిల్ల చాలా డల్గా ఉండేదట. అయితే మరుసటి రోజు కూడా యథాలాపంగా మేతకు వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే..అదే మేకపిల్ల చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా.. అదే మేకపిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఏంటిదీ అని విస్తుపోతాడు. అసలు ఏం చేస్తుంది..? ఈ మేకపిల్ల. మాములుగా మేతకు వెళ్లి ఇంటికి వచ్చాక కాస్త చలాకితనం తక్కువుగా ఉంటుంది. కానీ ఈ మేకపిల్ల మొదట్లో చాలా డల్గా అయిపోయి రాను రాను ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తోంది?.. అసలు ఇది ఏం తింటుంది..?, ఏం చేస్తుంది..? తెలసుకోవాలన్న ఆరాటంతో.. దాన్ని గమినించడం మొదలు పెట్టాడు. ఆ మేక అడవిలో ఉండే ఓ మొక్క గింజలను ఎక్కువుగా తినడం చూశాడు. దీన్ని తినడం వల్లే ఈ మేకపిల్ల యాక్టివ్గా ఉంటుందేమో..! అన్న అనుమానంతో ఆ మేకల కాపరి ఆ గింజలను కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతడు వాటిని పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకుని తాగాడు. ఎంతో రుచిగాను, పైగా తాగాక ఏదో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు ఉండటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు ఈ గింజలు చూపించి అసలు విషయం చెబుతాడు. అయితే ఎవ్వరూ ఈ గింజలను తినేందుకు మొదట్లో సాహసం చేయలేదు. అయితే అతను తాగినా ఏం కాలేదు, పైగా హుషారుగా ఉంటున్నాడు కదా! అని నెమ్మదిగా వాళ్లు కూడా తాగడం ప్రారంభిస్తారు. అలా క్రమక్రమంగా కాఫీగా తయారయ్యింది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఈ మేక తిన్న గింజలు ఏంటంటే..కాఫీ బీన్స్ గింజలట. అలా మేక నుంచి కాఫీ గురించి మానవులకు తెలిసిందిట. ఆ తర్వాతా ఆ కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైపోయిందట. (చదవండి: ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!) -
మిస్టరీ: అక్కడికి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా?
ప్రపంచాన్ని వణికించే ప్రదేశాల్లో ‘దార్గాస్’ ఒకటి. రష్యాలోని ‘నార్త్ ఒసీషియా– అలానియా’ రిపబ్లిక్లో గిజెల్డన్ నది సమీపంలో ఉన్న ఓ చిన్న పర్వతం మీద ఉన్న దార్గాస్ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని పిలుస్తారు. దీన్ని గ్రామం అనే కంటే శ్మశానాల దిబ్బ అనడమే కరెక్ట్. అక్కడి స్థానికులు పగటి పూట కూడా ఆ పర్వతం మీదకు ఒంటరిగా వెళ్లరు. ఆ దరిదాపుల్లో ఒంటరిగా తిరగరు. రాత్రి అయితే ఆ పర్వతం వైపు చూడను కూడా చూడరు. ‘నార్త్ ఒసీషియా–అలానియా’లో అత్యధికంగా నివసించే ఒసీషియన్ గిరిజన తెగకు చెందిన చరిత్రను చెబుతుంది ఈ ప్రాంతం. మధ్యయుగం నాటి ఒసీషియన్స్.. మరణించిన తమ కుటుంబసభ్యుల మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారట! ఇక్కడి శిథిల నిర్మాణాలు ఇంకెన్నో భయపెట్టే కథనాలతో బెదరగొడతాయి. దార్గాస్లో 99 సమాధులు చిన్నచిన్న ఇళ్ల మాదిరి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని దగ్గరదగ్గరగా.. ఇంకొన్ని దూరం దూరంగా.. మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా.. కనిపిస్తాయి. వాటికి ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది. దాని లోపలికి దిగడానికి పెద్దపెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే! అక్కడ సుమారు 10 వేలకుపైనే అస్థిపంజరాలు ఉన్నాయని అంచనా వేశారు పరిశోధకులు. అయితే అక్కడున్న శవపేటికలు పడవ ఆకారంలో ఉన్నాయట. చనిపోయిన వారి ఆత్మ.. నదులను దాటుకుని స్వర్గానికి వెళ్లడానికి పడవ అవసరమని అక్కడి స్థానిక పురాణాలు చెబుతాయి. ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు, వస్తువులను కూడా ఉంచేవారు. అయితే దార్గాస్ పర్వతం మీదకు వెళ్లినవారు తిరిగిరారనే ప్రచారం కూడా ఉంది. కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీదకెక్కి, అక్కడి సమాధుల మధ్యకు వెళ్లి, ఇక తిరిగి రాలేదట! దార్గాస్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతుంటారు. నిజానికి అక్కడ కేవలం 99 సమాధులే ఉన్నా, పదివేలకు పైగా అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నకు బదులుగా ఒక విషాదగాథ వినిపిస్తుంది. 18వ శతాబ్దంలో ఒసీషియాలో ప్లేగు వ్యాపించింది. ఆ సమయంలో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం.. ఈ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను పునరుద్ధరించి.. అక్కడ ప్లేగు వ్యాధిగ్రస్తులను ఉంచేవారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. వారికి కావాల్సిన ఆహారాన్ని, వస్తువులను అందించేవారట. వ్యాధి సోకిన వారు తిరిగి ఊళ్లోకి రావడానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట. దాంతో ఆ పర్వతం మీదే ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు కనీసం ఖననానికి కూడా నోచుకోకపోవడంతో మిగిలిన వ్యాధిగ్రస్తులు కుళ్లిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారని చరిత్ర చెబుతోంది. వరుస మరణాలతో నాటి పరిస్థితి చాలా ఘోరంగా గడిచిందట. నిజానికి దార్గాస్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఒక పక్క నది.. మరో పక్క ఎత్తయిన కొండలు, కొన్నిసార్లు నేలమీద దట్టంగా పేరుకున్న మంచు, మంచు కరిగినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల.. ఇలా కాలానికి తగ్గట్టుగా మారే దార్గాస్ ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి అందరూ సాహసించరు. కొందరు సాహసికులు మాత్రమే ఇక్కడికి Ðð ళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా రాత్రిపూట దార్గాస్ కొండల మీదకు వెళ్లేందుకు అనుమతి లేదు. మరి నిజంగానే అక్కడకి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
మూణ్నాళ్ల మురిపెం!ఆ సిరా గురుతు!!
కాకినాడ: ‘నీ వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగు చుక్క’ అంటూ ఎన్నికల సంఘం ఓటు విలువను తెలియజేస్తుంటుంది. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి వ్యక్తికీ ఎడమచేతి బొటన వేలిపై సిరా చుక్క పెడతారు. చేతి వేళ్లులేని దివ్యాంగులకు కాలి వేళ్లకు సిరా చుక్క పెడతారు. ఇది ఓటేశామని గుర్తు మాత్రమే కాదు. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం. ఎన్నికలలో వాడే ఇండెలిబుల్ ఇంక్ వేలిపై పెడితే 72 గంటల పాటు చెరిగిపోదు. ఈ సిరాను 1962 నుంచి కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వారి్నష్ కంపెనీ తయారు చేస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ కంపెనీ నుంచే సిరా సరఫరా అవుతుంది. సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండడంతో ఎక్కువ కాలం చెరిగిపోకుండా ఉంటుంది. -
ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'!
ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు : రమాకాంత్ సెప్టెంబర్ 3.. 2023 సంవత్సరం.. సాయంత్రం నాలుగు గంటలు. ఆసుపత్రి నుంచి డిశ్చారై్జ నేటికి మూడోరోజు. రియల్లీ సర్ప్రైయిజింగ్. భూమ్మీద నాకింకా నూకలున్నందుకు ఆనందించాలో.. విచారించాలో తెలియడం లేదు. నాలో ఇప్పుడు ఎలాంటి ఆశలు గానీ అసంతృప్తులు గానీ లేవు. డాక్టర్ నోటి వెంట వచ్చిన ఆ మూడుముక్కలు నా చెవిన పడ్డాక మనసు తేలికైంది. ఇక ఏ గొడవా లేదు. రోజులు లెక్కపెట్టుకుంటూ కాలం గడిపేయాల్సిందే. చివరిరోజుల్లో మనిషికి.. తనకు బాగా దగ్గరైన మిత్రులు గానీ, శత్రువులు గానీ గుర్తొస్తుంటారట. అందుకనేమో నాలో ఇప్పుడీ ఆలోచనలు.. ఏభైఆరేళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. వందల చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బహుభాషా చిత్రాల్లో నటించాను. అవార్డులెన్నో గెలుచుకున్నాను. పేరు, గౌరవం, డబ్బు, సెలబ్రిటీ స్టేటస్.. ఇవేవీ నాకు తెలియనివి కావు. వేషాల కోసం ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్లకంటే తిరస్కరించిన వాళ్ళే ఎక్కువ. తర్వాత వాళ్ళే నా డేట్స్ కోసం నా ఇంటిచుట్టూ తిరగడం నేనెరుగుదును. దానికి నేనేం గర్వంగా ఫీలవ్వను. ఎందుకంటే ఎవరి టైమ్ ఎప్పుడొస్తుందో చెప్పలేం గదా! కానీ ప్రతినాయక పాత్రల్లో ఆదరించి నన్నో స్టార్ని చేసిన ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపోను. అందుచేత కృతజ్ఞతలు చెప్పాల్సివస్తే అది మొదట ప్రేక్షకులకే. తర్వాత సినీ రంగానికి! పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు.. వారితో గల స్నేహాలూ, నైట్ పార్టీలూ నాకో కొత్త ఫిలాసఫీని పరిచయం చేశాయి. చివరకు అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది. లోపలకు ఎవరో వచ్చినట్టున్నారు.. మంచంపై నిస్తేజంగా పడున్న నేను కళ్ళు తెరచి చూశాను. నా భార్య లత..ఆమెతో పాటు ఎవరో ఇద్దరు పరిచయస్తులు. నా అచేతనావస్థను చూసి సన్నగా వాళ్లలో గుసగుసలు.. ‘ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? ప్చ్.. అంతా అతని కర్మ!’ ‘అతని కర్మ కాదు.. ఆమె చేసిన కర్మ!’ ‘ష్.. అవన్నీ ఇప్పుడెందుకులే..’ మాటలు ఆగిపోయాయి. లతకు ధైర్యం చెప్పి వాళ్ళ మానాన వాళ్ళు వెళ్లిపోయారు. వారి సంభాషణలో దొర్లిన ‘ఆమె’ మాత్రం ఈమె కాదు. ఆమె ఒకప్పటి నా కలల ప్రపంచం. నా జీవన మాధుర్యం. పాతికేళ్ళనాటి ఆమె జ్ఞాపకాలు ఒక్కటొక్కటిగా నాలో.. తన తమిళ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం నాట్యం తెలిసిన అమ్మాయి గురించి నా దర్శక మిత్రుడొకడు అన్వేషిస్తున్న కాలమది. అంతకు మునుపు రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శనతో అమితంగా ఆకట్టుకున్న ఓ అమ్మాయి చప్పున గుర్తొచ్చింది. ఆమె పేరు మధురిమ. ఆమె వివరాలను కనుక్కొని అతనికి పంపించాను. ఆమె హీరోయిన్గా సెలెక్టయ్యి నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ కృతజ్ఞతాభావంతో ఓ రోజు ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్కు ఆహ్వానించడంతో వెళ్లాను. ఒకే టేబుల్పై ఎదురెదురుగా కూర్చొని దగ్గరగా అలా చూడటం అదే తొలిసారి. విరిసిన మందారంలా.. స్వచ్ఛంగా.. ముగ్ధమనోహరంగా ఉందామె. ‘చెప్పండి.. ఏం తీసుకుంటారు?’ తేనెలొలుకుతున్నట్టు మధురంగా వినిపించిందామె గొంతు. ‘ఏదైనా చెప్పండి.. నో ప్రాబ్లెమ్’ అన్నాను. ‘ఐతే.. నాకిష్టమైనవన్నీ చెప్పేస్తా. ఫర్వాలేదా?’ అంది. సమ్మోహనమైన ఆమె నవ్వు నాలోని సీరియస్నెస్ను బద్దలు కొట్టింది. నవ్వాను తొలిసారి మనసు నిండుగా. ఆర్డర్ చేసినవి వచ్చాయి. తింటున్నంతసేపూ వసపిట్టలా మాట్లాడుతూనే ఉందామె. సొట్టబుగ్గల నడుమ ఆమె నవ్వు ముత్యాలహారంలా తళుక్కుమంటోంది. కలువకళ్ళ ఆమె ఓరచూపు ఆయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంది. ఆమెతో గడిపిన ప్రతీక్షణం.. అద్భుత ఊహాలోకంలో హాయిగా విహరిస్తోన్న ఆనందపరవశం. ప్రేమిస్తున్నానని చెప్పేశాను ఒకరోజు ఆమోదించిందామె. ప్రపంచానికి చక్రవర్తినైనంత సంబరం నాలో! ఫోన్ కబుర్లూ.. షికార్లూ.. లాంగ్డ్రైవ్ల ద్వారా ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరం ఇష్టపడేవాళ్ళం. అప్పటికే పరిశ్రమలో మాపై రకరకాల కథనాలు ఇద్దరి ఇళ్ల వరకూ పాకాయి. అభ్యంతరాలేవి ఎటువైపు నుంచీ లేవు. కానీ ఆమెకు నామీద ఒకే ఒక్క విషయంపై అభ్యంతరమో.. ఆగ్రహమోగానీ తీవ్రంగా ఉండేది. ఎన్నోసార్లు దాన్ని బహిరంగంగా ప్రదర్శించింది. నన్ను మార్చాలని చూసింది. సున్నితంగా హెచ్చరించింది. మగాణ్ణి కదా.. అహం. గ్రహించలేకపోయాను. ఆ రోజు కార్తీక పౌర్ణమి. తన పుట్టిన రోజు. టెర్రస్ నుంచి విశాఖసాగర తీరం ఉరకలేస్తూ కనిపించసాగింది. పండు వెన్నెల వెలుగుల్లో ఇసుక తిన్నెలు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. వీటన్నిటి సమక్షంలో తన పుట్టినరోజు వేడుక ఒక మధుర స్మృతిలా జరుపుకోవాలనేది మధు చిరకాల కోరిక. అది నెరవేరేసరికి రాత్రి తొమ్మిదయ్యింది. టేబుల్పై డిన్నర్ ఐటమ్స్ వున్నాయి. ‘మధూ.. ఇక భోంచేద్దామా’ అదుపు తప్పి తడబడిన మాటకు నా వైపు దూరం నుంచి సీరియస్గా చూసిందామె. ‘ఆకలిగా లేదు. నువ్వు భోంచెయ్’ అయిష్టంగానే అంది. ‘ఏం..ఎందుకని?’ ‘తినాలని లేదు’ ముఖంలోని గాంభీర్యం గొంతులో చేరి కఠినంగా వినిపించింది. ‘పోనీ.. నేను తినిపించనా?’ ‘ఎందుకు? నీ నోటి నుంచి వచ్చే వాసన భరించి తినడం కన్నా ఖాళీ కడుపుతో పడుకోవడం బెటర్.’ విసిరిన ఈటెలా వచ్చిపడిన ఆమె సమాధానానికి మత్తు దిగిపోయింది. కిందకు వెళ్లి సాయంత్రం నేను చేసిన ఘనకార్యమేమిటో గుర్తొచ్చింది. ‘సారీ మధు..’ అన్నాను. ‘మందు మానేస్తానని చేసిన ప్రామిస్ చేసిన సంగతి గుర్తుందా?’ ఆవేశంగా అంది. ‘ఉంది..కానీ ఈరోజు నీ పుట్టిన రోజు కదా అని..’ నసిగాను. ‘నీకెన్నిసార్లు చెప్పాలి.. డ్రంకర్డ్స్ అంటే నాకసహ్యమని! ఐనా నువ్వు మారడంలేదు. మారతావనే నమ్మకం కూడా లేదు. నీలాంటివాణ్ణి ప్రేమించినందుకు సిగ్గు పడుతున్నా.’ కళ్ళల్లో చేరిన సన్నటి కన్నీటిపొరను మునివేళ్ళతో తుడుచుకుంటూ అంది. ‘మధూ.. ఈ ఒక్కసారికి నమ్ము.. ప్లీజ్’ చిన్న పిల్లాడిలా అభ్యర్థించాను. ‘లేదు రమా.. ఈ రోజునుంచి మందు మానేస్తానని ఇదే లాస్ట్ ప్రామిస్ అని చెప్పి మరీ ఈ పని చేశావంటే నిన్నెలా నమ్మేది? ఇదిగో.. నువ్విచ్చిన గొలుసు. నాకవసరం లేదు. గుడ్ బై!’ గొలుసును నా చేతిలో పెట్టి రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతసేపు పిల్చినా.. బతిమాలినా స్పందన లేదు. ఉండుండి వినిపిస్తోన్న ఆమె ఏడుపు తప్ప! ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి నాకంటే ముందు వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి నన్ను కలవడానికి గానీ, మాట్లాడానికి గానీ ఇష్టపడలేదు. సెట్లో కనిపించినా ‘మనిద్దరి ఆలోచనలు వేరు. మనస్తత్వాలు వేరు. అవి కలవవు. మరిచిపో నన్ను’ అని కటువుగా చెప్పేసి దూరం పెట్టేసింది. నిర్వీర్యుడినయ్యాను. నాలో సగభాగం తెగిపడినట్టుగా కుంగిపోయాను. నిజమే. తప్పు నాదే. తన ఇష్టాయిష్టాలను ఏమాత్రం పట్టించుకోని అబ్బాయిని ఏ అమ్మాయైనా ఎందుకు ఇష్టపడాలి? డిప్రెషన్లో కూరుకుపోయాను. పెళ్ళయితే నాలో మార్పు వస్తుందని భావించిన అమ్మ పెళ్లి చేసుకోమంది. ఆమె సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను. మూడేళ్లకు నాకో కొడుకు. మధురిమ గురించిన సమాచారం పత్రికల ద్వారా కొన్నాళ్లకు తెలిసింది. హీరో అభిజిత్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనీ.. అతని భార్యగా జూబ్లీహిల్స్లోని ఖరీదైన భవంతిలో మహారాణిలా ఉంటోందని! విన్నాక నాకేం బాధనిపించలేదు. తనపై కోపం కూడా రాలేదు. జీవితం తనది.. దాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెది. తనేం చిన్నపిల్ల కాదు గదా. కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించిన మధురిమ జ్ఞాపకాల్ని ఎన్నాళ్ళైనా వదులుకోలేక పోయాను. ఆమెతో పంచుకున్న ప్రేమకబుర్లు చేసే గాయాల నుంచి తప్పించుకోలేకపోయాను. అదే నా పొరపాటు. నటనలో ఏకాగ్రత పోయింది. షూటింగ్లకు గైర్హాజరయ్యేవాడిని. రోజులు కాదు.. నెలలు. కొత్త తరంతో పోటీలో వెనకబడి పోయాను. అవకాశాలు కరువైపోయాయి. పార్టీలు ఎక్కువయ్యాయి. తాగుడికి బానిసనైపోయాను. భరించలేక మంచం పట్టి చనిపోయింది అమ్మ. లివరు పూర్తిగా, కిడ్నీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నేనిక బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. వారంరోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. అందరూ వచ్చి చూసి పోతున్నారు. చనిపోయేలోగా మధునొకసారి చూడాలనీ వీలైతే మాట్లాడాలనీ ఎక్కడో మనసు మూలల్లో కోరిక ప్రబలంగా ఉంది. ఐనా నా పిచ్చి గానీ తనిక్కడికి వస్తుందా.. మనసారా మాట్లాడుతుందా.. ఇది జరిగే పనేనా? నా భార్య లత చాలా మంచిది. నా గురించి, మధురిమతో నాకున్న ఎఫైర్ గురించి తెలిసే పెళ్ళికి సిద్ధపడింది. ఎప్పటికైనా ఈ వ్యసనం నుంచి బయటపడి మారతాననేది ఆమె నమ్మకం. వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఐనా సరే.. నన్నామె ఏనాడూ తక్కువగా చూడలేదు. నా అభిమానిగా అదామె గొప్పతనం. అందుకు సదా ఆమెకు రుణపడి వుంటాను. స్వతహాగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ సంపాదనతోనే కుటుంబ బాధ్యతను తన నెత్తికెత్తుకుంది. కొడుకును చదివించింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ శిక్షణ నిప్పించింది. వాడి ప్రయత్నాలేవో సాగుతున్నాయి. ఎప్పటికైనా వాడిని దర్శకుడిగా చూడాలనేది మా ఇద్దరి కల. అది ఎప్పటికి నెరవేరుతుందో.. మా ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో, నా ప్రాణం ఎంతవరకు నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. నిజాయితీ లోపించిన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదు : మధురిమ సెప్టెంబర్ 20.. 2023 సంవత్సరం.. ఉదయం పన్నెండు గంటలు.. ‘హలో మధూ..’ ‘చెప్పండి..’ ‘నీకీ విషయం తెల్సా ..’ ‘ఏంటి?’ ‘రమాకాంత్ చనిపోయాడట..’ ‘ఈజ్ ఇట్ ట్రూ?’ ‘యస్.’ ‘ఎప్పుడు?’ ‘నిన్న సాయంత్రం నాలుగు గంటలకు.. వాళ్లింట్లోనే..’ ‘మై గాడ్.. ఎంత ఘోరం..’ ‘కంట్రోల్.. ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ పెయిన్. ఎంతైనా నీ మాజీ లవర్ కదా!’ ఎప్పటిలాగే సూదుల్లా గుచ్చే అతని మాటలు. బాధనిపించలేదు. నాకివి మామూలే. ‘అంతేకాదు. ఒకప్పుడతను మన కోస్టార్. అది మరిచిపోకు. మనసు రాయి చేసుకుని ఉండలేం కదా నీలాగ!’ నావైపు కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేశాను. టీవీ ఆన్ చేశాను. రమాకాంత్ మరణవార్త ప్రసారమవుతోంది. కృష్ణానగర్లోని అతనింట్లో ఫ్రీజర్లో ఎముకల పోగులా అతని శరీరం.. చుట్టూ అతని బంధుమిత్రులు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా ఉండేవాడు రమాకాంత్.. ఆరడుగుల ఎత్తుతో బలిష్టమైన దేహం.. చురుకైన కళ్ళతో.. ఎలాంటి పాత్రనైనా కొట్టి పిండి చేయగల సత్తాతో! అతని వెరైటీ విలనిజానికి ప్రత్యేక అభిమానవర్గం ఉండేది. సినిమాల్లో ఎంత క్రూరంగా ఉంటాడో బయట అంత సౌమ్యుడు. శత్రువుకైనా సాయం చేసే మనస్తత్వం! చిన్నప్పటినుంచి నాకు డాన్ ్స అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఐదేళ్లు కష్టపడి కూచిపూడి నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రామ్లో నన్ను చూసిన రమాకాంత్ ఓ తమిళ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం సంప్రదించారు. అమ్మకు ఇష్టంలేకపోయినా నా బలవంతమ్మీద సరేనంది. ఆ సినిమా సక్సెసయ్యి సుమారు పాతిక సినిమాల్లో నటించాను. రమాకాంత్తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎక్కడకు వెళ్లాలన్నా ఏ ఫంక్షన్కు హాజరవ్వాలన్నా కలిసి వెళ్లి.. కలిసే వచ్చేవాళ్ళం. ఆ చనువును ఎప్పుడూ ఆసరగా లేదు. అమ్మకూ అతనంటే అభిమానమే. అందుకే అతన్ని పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడ్డాను. కానీ అతనికి ఒకే ఒక బలహీనత ఆల్కహాల్. ఏమాత్రం ఖాళీ దొరికినా స్నేహితులతో మందు పార్టీకే తొలి ప్రాధాన్యత. మానెయ్యమని ఎన్నోసార్లు చెప్పాను. బతిమాలాను. ‘పరిశ్రమలో మనుగడ సాగించాలంటే అందరితో టచ్లో ఉండాలి. కలిసి మెలిసి తిరగాలి. కనుక పార్టీలు తప్పవు’ అనే ఒక విచిత్రవాదనను వినిపించేవాడెప్పుడూ. ‘అదే నిజమైతే సినిమాలు మానేయ్. సంపాదించిన దాంతో ఏదైనా బిజినెస్ మొదలుపెట్టు. జీవితాంతం నేన్నీకు తోడుంటాను’ అని చాలాసార్లు హామీ నిచ్చాను. అతను పట్టించుకోలేదు. అమ్మ బెంగాలీ. నాన్నది ఇక్కడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాడీకున్న తాగుడు వ్యసనం వలన అమ్మ ఎంత బాధ పడిందో.. ఎన్ని ఇబ్బందులు.. అవమానాలు ఎదుర్కొందో నాకు తెలుసు. అందుకే తాగేవాళ్లంటే భయం. అసహ్యం. మందు మానేస్తానని ఎన్నోసార్లు రమాకాంత్ మాటిచ్చాడు. కానీ కట్టుబడిలేడు. అందుకే అతన్ని పూర్తిగా నమ్మలేకపోయాను. ఎక్కడైనా నమ్మకమూ, ప్రేమా ఉన్నచోటే గదా అభిమానం, ఆరాధన ఉండేవి. వాళ్ళమ్మ కూడా ఈ విషయంలో చేసేదేంలేదని చేతులెత్తేసింది. నా మనసు విరిగిపోయింది. నా నిర్ణయాన్ని అతనితో కరాఖండీగా చెప్పేశాను అదీ నా పుట్టిన రోజునాడే. అలా చెప్పడానికి నాలో నేనెంత వేదన పడ్డానో! మరచిపోవడం అతనికే కాదు. నాకూ కష్టమే! కానీ తప్పదు. నేను చాలా ప్రాక్టికల్. ప్రేమ పేరిట భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేంత పిచ్చితనం నాలో లేదు. ఆ తర్వాత అతను ఇల్లు ఎక్కడికో మార్చాడట. అదెక్కడో కూడా నాకు తెలియదు. కొన్నాళ్లకు హీరో అభిజిత్ లవ్ ప్రపోజల్ తెచ్చాడు.అతన్ని పెళ్లి చేసుకున్నాను. మరో ఏడాదికి అబ్బాయి పుట్టాడు. వాడిప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. నా భర్త చెడ్డవాడు కాదు. అలాగని మంచివాడూ కాదు. అతనొక మగాడు. అంతే! రమాకాంత్తో నా ప్రేమవ్యవహారాన్ని ముల్లులా గుచ్చుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.. అమ్మాయిలతో అతనికిగల సంబంధాల్ని ప్రశ్నించినపుడల్లా! రమాకాంత్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడనీ, భార్య సంపాదనతోనే ఇల్లు నడుస్తోందని తెల్సి చాలా బాధపడ్డాను. చేయి దాటిన పరిస్థితిని ఎవరు మాత్రం చక్కదిద్దగలరు? కేవలం సానుభూతి చూపించడం తప్ప. అతనలా మారడానికి కారణం నేనేనని ఎక్కడెక్కడో విని ఎన్నో రోజులు కుమిలిపోయాను. అతనికా వ్యసనం నా మూలంగా అబ్బలేదు. దాన్ని నేను ప్రోత్సహించనూ లేదు. అలాంటపుడు నన్నెలా నిందిస్తారు? మనుషులు గానీ, బంధాలు గానీ దక్కనపుడు కలిగే దుఃఖాన్ని భరించగలిగే మానసిక స్థితి లేదని తెలిసినపుడు మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి? సంబంధాల్ని ఎంత సున్నితంగా నెరపగలగాలి? ఒక పక్క భర్త ప్రవర్తనకూ మరోపక్క లోకం అపవాదుకూ మధ్యన నలిగిపోతూ ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయటపడి నగరంలోని ఒక రిచెస్ట్ ఏరియాలో డాన్ ్స స్కూల్ పెట్టాను. డాన్స్ చేస్తూ.. చూస్తూ.. నేర్పిస్తూ.. ఏళ్లుగా కోల్పోయిన నన్ను నేను అక్కడ పొందుతున్నాను. వారం క్రితం మేమిద్దరం నటించిన తొలి చిత్రాన్ని పాతికేళ్ళు నిండిన సందర్బంగా రీరిలీజ్ చేశారు. ఐమాక్స్ థియేటర్లో మళ్ళీ ఆ సినిమా చూసి నాటిæ షూటింగ్ అనుభూతుల్ని.. మధురస్మృతుల్ని ప్రెస్ మీట్ పెట్టి అందరం పంచుకున్నాం. మెయిన్ విలన్ ఒక్క రమాకాంత్ తప్ప. అతను తీవ్ర అనారోగ్యంతో బయటకురాలేని స్థితిలో ఉన్నాడనీ.. తెలిసి హృదయం ద్రవించింది. అతని చిరునామా ఎలాగోలా తెలుసుకొని చూసి రావాలనిపించింది. అంతలోనే హఠాత్తుగా ఈరోజు మరణ వార్త.. ‘రమాకాంత్ సర్ వాళ్లింటి దగ్గరకు వచ్చేశామమ్మా..’ డ్రైవర్ అన్నమాటతో ఈ లోకంలోకి వచ్చాను. కారు దిగి చుట్టూ చూశాను. జనంతో రద్దీగా వుంది. అభిజిత్కు కాల్ చేశాను. రమాకాంత్ చివరిచూపు కోసం వెళ్తున్నానీ.. రావడం లేటవుతుందనీ చెప్పి కాల్ కట్ చేశాను. లేకపోతే అటు నుంచి ఏం జవాబొస్తుందో నాకు తెలుసు. అది వినడం ఇష్టం లేదు. జనాల్ని తప్పించుకుంటూ లోపలకు నడిచాను. ఇంటి బయట టెంట్ వేసి ఉంది. రమాకాంత్ అంతిమ సంస్కారం పూర్తయినట్టుంది. బాధనిపించింది. గది మూలన అతని ఫొటో, దాని కింద దీపం వెలుగుతూ ఉంది. లీలగా వినిపిస్తోన్న బంధువుల రోదనలు తప్ప ఇల్లంతా ప్రశాంతం. నన్ను చూడగానే వచ్చారా అన్నట్టుగా చూసిందతని భార్య. బాగా తెలిసినవాడిలా కుర్రాడొకడు నన్ను లోపలకు తీసుకెళ్ళాడు. విశాలమైన రూమ్లో.. షెల్ఫ్లో షీల్డులూ, ఫొటోలూ, సన్మాన పత్రాల మెమెంటోలూ, కొన్ని పెయింటింగ్స్ కొలువుదీరి ఉన్నాయి. మరోపక్క నా బస్ట్ సైజ్ రూపం వాటర్ పెయింట్ ఒకటి గోడపై ఉంది. పుట్టిన రోజున నేను తిరిగిచ్చిన గోల్డ్ చైన్ పూదండలా దానిపై వేలాడుతోంది. ‘అదృష్టం ఒక్కసారే తలుపు తడుపుతుంది. దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుందట. ఆ అదృష్టం నేను చేజార్చుకున్న నీ సాహచర్యం. దురదృష్టం నన్ను కౌగిలించుకున్న ఈ వ్యసనం. మధూ.. క్షమించానని ఒక్క మాట చెప్పవూ..’ అని పెయింటింగ్ కింద రాసి ఉంది. చదివేసరికి గుండెను పిండేసినట్టయింది. కనుకొలకుల్లో నీళ్లు. ‘స్వఛ్చమైన, నిర్మోహమైన ప్రేమ కోసం జీవితపర్యంతం పరితపించి ప్రాణాలొదిలిన ప్రియ సఖుడా.. ఇదే నా కన్నీటి నివాళి. మనస్ఫూర్తిగా మన్నించా! వెళ్లి రా.. ప్రియనేస్తమా.. వేచి ఉంటా.. మరుజన్మలో నీ కోసం!’ నా మనసు ఆర్తిగా రోదించింది. ‘డాడీ ఎప్పుడూ మీ గురించే చెప్తుండే వారండీ.. యు ఆర్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ అంటూ!’ అన్నాడా కుర్రాడు. ఆ కుర్రాడెవరో అప్పుడర్థమైంది. కళ్ళు తుడుచుకొని నిశితంగా అతన్ని చూశాను. యుక్త వయసు రమాకాంత్ కనిపించాడు. పేరు హరీష్ అని చెప్పాడు. అతనితో చాలాసేపు మాట్లాడాను. మూగగా ఏడుస్తున్న రమాకాంత్ భార్య దగ్గరకు వెళ్లాను. ‘చనిపోయారనే వార్త ఈరోజు ఉదయమే తెల్సింది. అసలు రమాకాంత్ పరిస్థితి విషమంగా ఉందని ఈ మధ్యే విన్నాను. వద్దామని అనుకునేలోపే ఇలా.. ఆఖరికి చివరిచూపు కూడా దక్కలేదు’ వేదనగా అన్నాను. నా వైపే నిశ్చలంగా చూస్తూ వింటోందామె. ‘ఆయన ఉన్నప్పుడు కలిసుంటే బావుండేదండీ’ ముక్తసరిగా అందామె. కళ్లు దించుకున్నాను. ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. తర్వాత ఆమెతో మాట్లాడాను. ఈలోపు కాఫీ తెచ్చిచ్చాడు హరీష్. తాగడం మొదలుపెట్టాను. ‘హరీష్.. నీకో గుడ్ న్యూస్. ఇందాకే మేడమ్ చెప్పారు’ అందామె. తెలుసన్నట్టు చిన్నగా నవ్వాడతను. తల్లీ కొడుకుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ వెలుగు నాలో కూడా కొంత ప్రసరించింది. స్తబ్ధత, నైరాశ్యం ఒక్కసారిగా మాయమై రీలీఫ్గా అనిపించింది. లేచి నిలబడ్డాను. ‘రేపు ఆఫీస్లోనే ఉంటాను. హరీష్ను పంపించండి. అతనిదే ఆలస్యం. మా బ్యానర్లోనే.. నేనే ప్రొడ్యూసర్ని. అతన్ని దర్శకుణ్ణి చేసే బాధ్యత నాది. సరేనా?’ అన్నాను.. అంతకుముందు ఇద్దరితో చెప్పిన మాటను మళ్లీ ఒక్కసారి నిర్ధారిస్తున్నట్టుగా. ఆమె నా రెండు చేతుల్ని తన గుప్పిట్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ‘థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్’ అంది.. ఆమె గొంతు సన్నగా వణికింది. కారెక్కి కూర్చొని చూస్తే ఆమె చెంపల పైనే కాదు నా రెండు చేతుల పైన కూడా ఆమె కన్నీటి బొట్లే! ఇవి చదవండి: నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'! -
మిస్టరీ: 'డోంట్ టచ్’ అనే హెచ్చరికతో.. 'చెచెన్, చాకా' ట్రీస్
'మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ప్రతి చెచెన్ చెట్టుకు ‘డోంట్ టచ్’ అనే హెచ్చరిక బోర్డ్ మీద డేంజర్ బొమ్మ గీసి మరీ ఉంటుంది. అవును ఆ చెట్టు బెరడు తాకితే.. భయంకరమైన దద్దుర్లు వస్తాయి. తట్టుకోలేనంత దురద పుడుతుంది. భరించలేనంత మంట వస్తుంది. దాని బెరడు నుంచి నల్లటి జిగురు పొంగుతుంది. కొన్నేళ్లక్రితమే ఆ చెట్టుపై ఎన్నో ప్రయోగాలు జరిపి.. అది విషపూరితమని, పట్టుకుంటే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. అందుకే ఆ చెట్టుకు ‘బ్లాక్ పాయిజన్ వుడ్ ట్రీ’ అని పేరు పెట్టారు. కొన్నిసార్లు ఆ చెట్టు సమీపంలో తిరిగితే.. దద్దుర్లు వచ్చేవరకు తెలియదట ఆ చెట్టును మనం తాకామన్న సంగతి'. అయితే విచిత్రమేమిటంటే.. ఆ చెట్టుకు పక్కనే లేదా సమీపంలో ‘చాకా’ అనే మరో చెట్టూ కచ్చితంగా పెరుగుతుంది. చెచెన్ చేసిన గాయాలకు.. చాకా చెట్టు బెరడు విరుగుడుగా పనిచేస్తుంది. దద్దుర్లు రాగానే.. చాకా బెరడును కత్తిరించి.. దాని నుంచి వచ్చే జిగురును దద్దుర్లొచ్చిన చోట రాయాలి. బాడీ లోపలి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే.. ఈ చాకా బెరడుతో టీ పెట్టుకుని తాగొచ్చు. చెచెన్ ట్రీ బెరడు తగిలిన వెంటనే చాకా ట్రీ బెరడును ఔషధంలా ఉపయోగించకపోతే.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అయితే ఒక ప్రమాదం, దానికి పరిష్కారం రెండూ ఒకేచోట పుట్టిపెరగడం విశేషం. నిజానికి ఈ చెచెన్ – చాకా ట్రీస్ పుట్టుక వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆగ్నేయ మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ముగిసిన ఓ విషాద ప్రేమగాథే ఈ చెట్ల వెనుకున్న పురాణం. మాయన్ యోధులైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. టిజిక్, కినిచ్ అనే సోదరులు.. గొప్ప యుద్ధవీరులు.. ఆ రాజ్యానికి యువరాజులు కూడా. అయితే కినిచ్ దయా హృదయంతో, మంచివాడిగా ఉండేవాడు. ప్రేమతో, నిస్వార్థంగా జీవించేవాడు. అందరినీ ఆదరించేవాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు. చెచెన్ చెట్టు, పక్కపక్కనే ఉన్న చెచెన్, చాకా చెట్లు కానీ అతని సోదరుడు టిజిక్ మాత్రం.. కోపంతో, ఆవేశంతో నిత్యం అసహనంతో జీవించేవాడు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. అహంకారం ప్రదర్శించేవాడు. ఒకరోజు కినిచ్, టిజిక్లు రాజ్యపర్యటనలో ఉండగా.. ‘నిక్టే హా’ అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారట. ‘ఆమె నాకు సొంతమంటే నాకు సొంతం’ అని అన్నదమ్ములిద్దరూ వాదులాటకు దిగారు. అది కాస్తా గొడవకు దారితీసి.. యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి నిక్టే కళ్లముందే.. ఇద్దరు అన్నదమ్ములు యుద్ధానికి తెగబడ్డారట. కొన్నిరోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో.. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసిన ఒకనాడు.. సోదరులిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. తనను ప్రేమించిన ఇద్దరు మహాయోధులు చనిపోయారన్న బెంగతో నిక్టే కూడా మరణించింది. మరణానంతరం స్వర్గానికి వెళ్లిన ఇద్దరు సోదరులూ.. దైవాన్ని క్షమాపణ కోరి, మళ్లీ పుట్టించమని కోరుకున్నారు. అనుగ్రహించిన దేవతలు వారికి పునర్జన్మను ప్రసాదించారు. టిజిక్.. చెచెన్ చెట్టులా.. కినిచ్.. చాకా చెట్టుగా తిరిగి జన్మించారు. అప్పుడే వారికి సమీపంలోనే నిక్టేహా అందమైన తెల్లటి పువ్వులా జన్మించిందట. నిజానికి టిజిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా.. చెచెన్ చెట్టు విషాన్ని చిమ్మితే.. దాన్ని సరిచేసే ఔషధంలా కినిచ్.. చాకాలా ప్రేమను పంచుతున్నాడట. అందుకే ఈ పురాణగాథలో చెప్పినట్లే.. అన్నదమ్ములిద్దరూ ఆ చెట్ల రూపంలో ఎక్కడ పుట్టినా కలసే పుడతారట. వారి సమీపంలో నిక్టే కూడా అందమైన పువ్వు రూపంలో జన్మిస్తుందని నమ్ముతారు. ఏదేమైనా.. చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం నేటికీ ఓ మిస్టరీనే. ఈ సృష్టిలో అద్భుతమే. — సంహిత నిమ్మన -
భగీరథ యమధర్మరాజ సంవాదం
పూర్వం భగీరథ చక్రవర్తి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తుండేవాడు. ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు అయిన భగీరథుడు నిత్యం తన రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులను జరిపించేవాడు. ఆయన రాజ్యం సర్వసుభిక్షంగా ఉండేది. రాజ్యంలోని ప్రజలెవరూ ధర్మం తప్పేవారు కాదు. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు ముల్లోకాలకూ వ్యాపించాయి. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు విని యమధర్మరాజు ఒకసారి ఆయనను స్వయంగా కలుసుకోవాలనుకున్నాడు. ఒకనాడు యమధర్మరాజు భగీరథుడి వద్దకు వచ్చాడు. భగీరథుడు ఎదురేగి యమధర్మరాజుకు స్వాగతం పలికాడు. ఘనంగా అతిథి సత్కారాలు చేశాడు. భగీరథుడి సేవలకు యమధర్మరాజు సంతృప్తి చెందాడు. ‘భగీరథా! నువ్వు చాలా ధర్మాత్ముడివి. నీ కీర్తి ముల్లోకాలకూ వ్యాపించింది. అది వినే నేను నిన్ను స్వయంగా కలుసుకోవాలని వచ్చాను. నీ జీవితం మానవులందరికీ ఆదర్శప్రాయం’ అని ప్రశంసించాడు. ‘సమదర్శీ! నా మీద నీ అనుగ్రహానికి ఆనందభరితుణ్ణవుతున్నాను. అయితే, నాకు కొన్ని ధర్మసందేహాలు ఉన్నాయి. సకలలోక ధర్మాధర్మ విచక్షణాదక్షుడవైన నువ్వే నా సందేహాలను తీర్చగలవు. అవేమిటంటే, ధర్మాలంటే ఏవి? ధర్మాచరణ చేసేవారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయి? దయచేసి వివరించు’ అని వినయంగా అడిగాడు భగీరథుడు. ‘ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది. ధర్మం గురించి సంపూర్ణంగా చెప్పాలంటే లక్ష సంవత్సరాలైనా సరిపోవు. అయినా నువ్వు అడిగావు కాబట్టి సూక్ష్మంగా చెబుతున్నాను విను. లోకంలో బ్రాహ్మణులకు, ఆధ్యాత్మికవేత్తలకు చేసే దానం అత్యుత్తమమైనది. స్వయంగా కూప తటాకాది జలాశయాలు తవ్వినా, ఇతరులను నియమించి తవ్వింపచేసినా వచ్చే పుణ్యఫలం అనంతం. బావులు, చెరువులు తవ్వే పనిలో స్వల్పమైన సాయం చేసినా గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు వీరభద్ర మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు: పూర్వం గౌడదేశాన్ని వీరభద్రుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడు మహాదానశీలి, ధర్మాత్ముడు, అమిత పరాక్రమవంతుడు. వీరభద్రుడి భార్య చంపకమంజరి. వీరభద్రుడు ప్రతినిత్యం యజ్ఞయాగాదులు నిర్వర్తించేవాడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు. వీరభద్రుడి రాజ్యంలో ప్రజలందరూ ధర్మబద్ధులై ఉండేవారు. అతడి మంత్రులందరూ విద్యావంతులు, ధర్మాధర్మ విచక్షణ కలిగిన విజ్ఞులు కావడంతో పరిపాలన సజావుగా సాగేది. వీరభద్రుడి రాజ్యం భూతలస్వర్గంగా ప్రసిద్ధి పొందింది. ఒకనాడు వీరభద్రుడు తన మంత్రులు, పరివారంతో కలసి సమీప అరణ్యానికి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేట కొనసాగించారు. మధ్యాహ్నవేళ వీరభద్రుడు సహా అతడి పరివారమంతా బాగా అలసట చెందారు. అందరికీ విపరీతమైన దాహం వేయసాగింది. సమీపంలో నీటిజాడ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అందరూ వెదకసాగారు. కొంత దూరం ముందుకు వెళ్లాక కొండ మీద ఒక చెరువు కనిపించింది. అక్కడకు వెళ్లి చూశారు. చెరువులో చుక్క నీరైనా లేదు. ‘అసలు ఇంత ఎత్తులో ఎవరు ఈ చెరువు తవ్వించారు? ఇందులో నీళ్లు ఎందుకు లేవు?’ అని స్వగతంగా అన్నాడు వీరభద్రుడు. అక్కడే ఉన్న వీరభద్రుడి మంత్రి బుద్ధిసాగరుడు చెరువును మరికొంత లోతుకు తవ్వమని భటులను పురమాయించాడు. మూడడుగులు తవ్వేసరికి చెరువులోకి నీళ్లూరాయి. చెరువు కొంతవరకు నీళ్లతో నిండింది. అందరూ ఆ చెరువులో నీళ్లు తాగి సేదదీరారు. ‘మహారాజా! ఈ చెరువు వానాకాలంలోనే నిండేలా ఎవరో తవ్వించారు. మరికొంత లోతుకు తవ్విస్తే సర్వకాలాల్లోనూ ఇందులో నీళ్లు నిలిచి ఉంటాయి. బాటసారులకు దాహార్తి తీర్చేలా ఈ చెరువు మరింత లోతుకు తవ్వించేందుకు అనుమతించండి’ అన్నాడు బుద్ధిసాగరుడు. అందుకు వీరభద్రుడు సరేననడంతో మంత్రి బుద్ధిసాగరుడు దగ్గర ఉండి భటులతో చెరువును మరింత లోతుగా తవ్వించాడు. దానికి పటిష్ఠంగా రాతిగోడలు నిర్మించారు. కొంతకాలానికి ఆయుష్షుతీరి బుద్ధిసాగరుడు, వీరభద్రుడు నా లోకానికి వచ్చారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల చిట్టాను పరిశీలించి, కొండ మీద తటకాన్ని తవ్వించిన వారి మహత్కార్యాన్ని నాకు చెప్పాడు. ధర్మవిమానంలో వారు స్వర్గానికి వెళ్లడానికి అర్హులని గ్రహించి, వారిని విమానంలో స్వర్గానికి పంపాను. స్వర్గానికి బయలుదేరే ముందు వారు నన్ను కొండ మీద ఆ చెరువు చరిత్ర చెప్పమని అడిగారు. ‘పూర్వం సైకతపర్వతం మీద ఈ చెరువు ఉన్నచోట ఒక లకుముకి పిట్ట తన ముక్కుతో రెండంగుళాలు తవ్వింది. కొంతకాలానికి ఒక వరాహం అక్కడకు వచ్చి, తన ముట్టెతో రెండు మూరలు తవ్వింది. దాంతో అందులోకి అప్పుడప్పుడు కొంత నీరు చేరసాగింది. చుట్టుపక్కల వన్యప్రాణులు అందులోని నీరుతాగుతూ దాహార్తి తీర్చుకునేవి. మూడేళ్లు గడిచాక ఒక ఏనుగుల గుంపు వచ్చి, దానిని మరింత లోతుగా తవ్వడంతో చిన్న చెరువుగా మారింది. అప్పటి నుంచి ఏటా వానాకాలంలో ఆ చెరువు పూర్తిగా నీటితో నిండసాగింది. మీరు వేసవి ప్రారంభంలో వేటకు వెళ్లడం వల్ల ఆ చెరువు ఎండిపోయి కనిపించింది. అంతకు ముందు అందులోకి నీరు ఇంకి ఉండటం వల్ల కొద్ది లోతు తవ్వగానే నీరు దొరికింది. వీరభద్రా! నీ మంత్రి సూచనతో నువ్వు ఆ చెరువును మరింత లోతుగా తవ్వించి, పటిష్ఠంగా గోడ నిర్మించి, ఏడాది పొడవునా నీరు నిలిచేలా చేశావు. ఈ పనిచేసినందుకు నువ్వు, నీ మంత్రి, నీ పరివారం అభినందనీయులు’ అని చెప్పి ధర్మవిమానంలో వారిని స్వర్గానికి సాగనంపాను. ‘భగీరథా! తటాకాలను తవ్వించిన వారికి సమస్తపాపాలూ నశించి, అనంత పుణ్యఫలం లభిస్తుంది’ అని చెప్పాడు యమధర్మరాజు. భగీరథుడు ప్రణమిల్లి, అతడికి సాదరంగా వీడ్కోలు పలికాడు. ఇవి చదవండి: హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి.. -
మిస్టరీ: ఓక్చా వోర్ట్మన్!
జీవితంలో అసంపూర్ణంగా ఆస్వాదించిన కొన్ని మధురక్షణాలు.. మళ్లీ తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు పొంగుకొచ్చే భావోద్వేగాన్ని వర్ణించడం మహా కష్టం. ఇక ఆ తర్వాత అంతకుమించిన సంతోషాలెన్నొచ్చినా.. మనసు మాత్రం గతాన్నే నెమరువేసుకుంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటుంది. ‘స్టెల్లా హట్’ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె ఆలాపన, అన్వేషణ, ఆవేదన అంతా తన కన్నతల్లి కోసమే. అసలేంటా కథ? స్టెల్లా కథ.. ఓ అమెరికన్ అయిన ఆమె తండ్రి రాబర్ట్ వోర్ట్మన్ కథతోనే మొదలవుతుంది. అది 1971, జపాన్ . అప్పుడు రాబర్ట్కి 22 ఏళ్లు. తను జపాన్ లో ఎయిర్మన్ గా పనిచేసేవాడు. ఒకరోజు ఓ ప్రయాణంలో.. ఓక్చా అనే 20 ఏళ్ల కొరియన్ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లి అయిన ఏడాదికే స్టెల్లా పుట్టింది. రాబర్ట్.. తన భార్య ఓక్చాను ముద్దుగా ‘సన్నీ’ అని పిలుచుకునేవాడు. కొన్ని నెలలకు జపాన్ కి చెందిన ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్కు.. రాబర్ట్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో స్టెల్లాను సన్నీ(ఓక్చా)కి అప్పగించి.. అతడు అమెరికాలోని న్యూయార్క్కు వెళ్లాల్సి వచ్చింది. మధ్యమధ్యలో వచ్చి.. భార్యాబిడ్డలతో గడిపేవాడు. తండ్రి దూరంగా ఉండటంతో.. స్టెల్లాకు తల్లితో మరింత అనుబంధం పెరిగింది. ఐస్క్రీమ్ పార్లర్లో ఉద్యోగం చేసే సన్నీ.. కూతురు స్టెల్లాను చాలా ప్రేమగా చూసుకునేది. చాలా ప్రదేశాలకు తిప్పేది. వాటన్నిటినీ తల్లి ప్రేమకు గుర్తుగా గుండెలో దాచుకుంది స్టెల్లా. కొంతకాలానికి సన్నీకి బార్లో వెయిట్రెస్ జాబ్ వచ్చింది. అది నైట్ డ్యూటీ కావడంతో.. స్టేల్లాను న్యూజెర్సీలో ఉండే రాబర్ట్ బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. తనతో స్టెల్లా కూడా లేకపోవడంతో.. సన్నీకి బయట స్నేహాలు పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం తగ్గి.. బయట గడిపే సమయం పెరిగిపోయింది. దాంతో ఫ్యామిలీ వెకేషన్ ్స తగ్గిపోయాయి. రాబర్ట్తో గొడవలు మొదలయ్యాయి. కాల్ చేసుకున్నా, కలుసుకున్నా.. ఆ రోజంతా గొడవలతోనే ముగిసేది. పరిస్థితి చేయిదాటిపోతుందని గుర్తించిన రాబర్ట్.. సామరస్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్యతో ఓ ఒప్పందానికి వచ్చాడు. ‘ఇక నుంచి మనం కలసే ఉందాం.. నాతో పాటు అమెరికా వచ్చెయ్. న్యూజెర్సీ వెళ్లి స్టెల్లాతో సంతోషంగా ఉందాం’ అని కోరాడు. అందుకు సన్నీ సరే అంది. ఇద్దరూ న్యూజెర్సీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతో తన జాబ్ని న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి మార్పించుకున్నాడు రాబర్ట్. సన్నీని తీసుకెళ్లడానికి తిరిగి జపాన్ చేరుకున్నాడు. అయితే భర్త వెంట వెళ్లడానికి అభ్యంతరం చెప్పింది సన్నీ. ‘నేను ఇప్పుడే నీతో రాలేను. ఒకసారి మా కుటుంబాన్ని కలుస్తాను. వచ్చాక మనం న్యూజెర్సీ వెళ్లిపోదాం’ అని చెప్పి.. దక్షిణ కొరియాలోని సియోల్కి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదు. ‘ఆమె అసలు పేరు ఓక్చా అని, ఆమె సొంత ఊరు దక్షిణకొరియాలోని సియోల్’ అని తప్ప.. మరే వివరాలూ రాబర్ట్కి తెలియవు. ఆ మాటకొస్తే తను వెళ్లింది సియోల్కేనో కాదో కూడా తెలియదు. ఆ తర్వాత సన్నీ ఎప్పుడూ కూతురు స్టెల్లాని కలవలేదు. కానీ.. స్టెల్లా మాత్రం తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయేది. సరిగ్గా రెండేళ్లకు.. రాబర్ట్ తల్లి ఓ ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘స్టెల్లా స్టెల్లా’ అనే పిలుపుతో ఓ ఆడ గొంతును అవతలి నుంచి విన్నది. మరే మాట ఆమెకు అర్థం కాలేదు. దానికి కారణం.. రాబర్ట్ తల్లికి ఇంగ్లిష్ మాత్రమేవచ్చు. దాంతో ఫోన్ లో వినిపించిన మాటలేవీ రాబర్ట్ తల్లికి అర్థం కాలేదు. ఒక్క స్టెల్లా అనే పేరు తప్ప. అందుకే ఆ కాల్ చేసింది సన్నీయే కావచ్చు అన్న అనుమానం కలిగింది ఆ కుటుంబానికి. ఎందుకంటే.. సన్నీకి కొరియన్ మాత్రమే వచ్చు. తన తల్లి మాట్లాడే భాష అర్థంకాకే ఆ రోజు సన్నీ కాల్ కట్ చేసుంటుందనుకున్నాడు రాబర్ట్. 1985లో స్టెల్లాకు 4 గౌన్లు, ఓ కుక్కపిల్ల గిఫ్ట్గా వచ్చాయి. అయితే ప్యాకింగ్ మీద కాలిఫోర్నియా పోస్ట్ మార్క్ ఉంది. అది కచ్చితంగా తన తల్లే తనకోసం పంపించిందని ఇప్పటికీ నమ్ముతుంది స్టెల్లా. అయితే సన్నీ గురించి ఎలాంటి ఆధారం దొరకలేదు. కొన్నాళ్లకు తండ్రి రాబర్ట్.. మరో పెళ్లి చేసుకున్నాడు. అతడికి మరో పాప పుట్టింది. సవతి తల్లి కూడా స్టెల్లాను ప్రేమగా చూసుకునేది. కానీ కన్నతల్లిని చూడాలనే ఆశ.. స్టెల్లాలో చావలేదు. స్టెల్లాకు పెళ్లి అయ్యి.. ఒక బాబు కూడా పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా తన తల్లిని చూడలేకపోయానన్న వెలితి.. ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది. సన్నీ అలియాస్ ఓక్చాకి ప్రస్తుతం 73 ఏళ్లు దాటే ఉంటాయి. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని తల్లి కోసం స్టెల్లా మాత్రం ఇంకా అదే ఆశతో ఎదురుచూస్తోంది. మరి సన్నీ ఏమైంది? ఎందుకు చెప్పాపెట్టకుండా వాళ్ల జీవితాల్లోంచి వెళ్లిపోయింది.? ఒకవేళ మోసం చేయాలని తనకు లేకపోయినా.. అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైందా? అలా అయితే.. స్టెల్లా గురించి కాల్ చేసింది ఎవరు? స్టెల్లాకు గిఫ్ట్స్ పంపించింది ఎవరు?’ లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. దాంతో ఓక్చా కథ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం' -
Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం!
బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి కర్దమ మహర్షి కుమార్తె అనసూయతో వివాహం జరిగింది. అనసూయ భర్తను సేవించుకుంటూ ఉండేది. అత్రి మహర్షి సంసారయాత్ర కొనసాగిస్తూనే, జపతపాది విధులను యథాప్రకారం కొనసాగించేవాడు. వారి దాంపత్యాన్ని పరీక్షించడానికి ఒకసారి త్రిమూర్తులు వచ్చారు. అత్రి మహర్షి వారికి సాదరంగా స్వాగతం పలికాడు. తన ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు. ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు విధించారు. తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్రగా ఉండాలని కోరారు. అత్రి మహర్షి ఈ సంగతిని అనసూయకు చెప్పాడు. ఆమె సమ్మతించింది. వారు స్నానం చేసి వస్తే, భోజనం వడ్డిస్తానని చెప్పింది. త్రిమూర్తులు స్నానం చేసి వచ్చి, విస్తర్ల ముందు కూర్చున్నారు. అనసూయ వారిపై మంత్రాక్షతలను చల్లింది. వారు ముగ్గురూ చంటిబిడ్డల్లా మారిపోయారు. అప్పుడు అనసూయ వివస్త్రగా మారి వారికి భోజనం వడ్డించింది. తర్వాత ఆమె వస్త్రాలు ధరించి, తిరిగి వారిపై మంత్రాక్షతలు చల్లడంతో వారు తిరిగి యథారూపాల్లోకి మారారు. అనసూయ మహిమకు చకితులైన త్రిమూర్తులు అత్రి మహర్షిని, అనసూయను ఆశీర్వదించారు. వారికి లోకోత్తరులైన ముగ్గురు కొడుకులు పుడతారని వరమిచ్చారు. త్రిమూర్తుల వరప్రభావాన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుత్రులుగా కలిగారు. బిడ్డలు ముగ్గురు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగారు. ఒకనాడు అత్రి మహర్షి అనసూయను పిలిచి, ‘నువ్వు కోరుకున్నట్లుగానే నీకు పుత్రులు జన్మించారు. ఇక నేను తపోజీవనాన్ని సాగించాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా లేదా బిడ్డల దగ్గరే ఉంటావా?’ అని అడిగాడు. ‘స్వామీ! మన పుత్రులు ఇంకా పెద్దవాళ్లు కాలేదు. ఎదగని బిడ్డలను వదిలేసి తపోజీవనానికి వెళ్లిపోవడం ధర్మం కాదు. పుత్ర పోషణార్థం పృథు చక్రవర్తి వద్దకు వెళ్లి, ధనం తీసుకురండి. పిల్లలు పెద్దవాళ్లయ్యాక వానప్రస్థానానికి వెళ్లిపోదాం’ అని చెప్పింది. అనసూయ చెప్పిన మాటలు న్యాయంగానే తోచాయి. వెంటనే అత్రి మహర్షి ధనం కోరడానికి పృథు చక్రవర్తి వద్దకు బయలుదేరాడు. అప్పుడు పృథు చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. యాగం పూర్తయ్యాక యాగాశ్వాన్ని విడిచిపెట్టి, దాని సంరక్షణ కోసం పృథు చక్రవర్తి తన కొడుకును పంపుతూ, అతడికి సహాయంగా వెళ్లవలసినదిగా అత్రి మహర్షిని ప్రార్థించాడు. అత్రి మహర్షి అందుకు ‘సరే’నని సమ్మతించి, పృథు చక్రవర్తి కొడుకుతో కలసి యాగాశ్వం వెంట బయలుదేరాడు. పృథు చక్రవర్తి యాగవైభవాన్ని చూసి ఓర్వలేని ఇంద్రుడు పాషాండ వేషంలో వచ్చి, యాగాశ్వాన్ని అపహరించుకుని ఆకాశమార్గాన వెళ్లిపోయాడు. ఇది చూసి పృథు చక్రవర్తి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. యాగాశ్వాన్ని అపహించుకుపోతున్నది సాక్షాత్తు దేవేంద్రుడని గుర్తించడంతో అతడిపై బాణం వేసేందుకు సంశయించాడు. అప్పుడు అత్రి మహర్షి, ‘కుమారా! యజ్ఞయాగాదులకు భంగం కలిగించేవాడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించవచ్చు. నిస్సంశయంగా నువ్వు ఇంద్రుడిని ఎదిరించు’ అని బోధించాడు. పృథు చక్రవర్తి కుమారుడు వెంటనే దేవేంద్రుడిపై శరపరంపరను కురిపించాడు. ఆ బాణాల దెబ్బకు తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని అక్కడే విడిచిపెట్టి, పలాయనం చిత్తగించాడు. రాకుమారుడు అశ్వాన్ని తీసుకుని అత్రి మహర్షితో కలసి ఇంటికి తిరుగుముఖం పడుతుండగా, ఇంద్రుడు మాయరూపంలో మళ్లీ యాగాశ్వాన్ని అపహరించాడు. పృథుచక్రవర్తి కుమారునికి యాగాశ్వం ఎలా అదృశ్యమైందో అర్థంకాలేదు. కంగారు పడ్డాడు. అత్రి మహర్షి అతడికి ధైర్యం చెప్పాడు. దివ్యదృష్టితో చూశాడు. దేవేంద్రుడే మళ్లీ దుశ్చేష్టకు పాల్పడ్డాడని గ్రహించాడు. ‘నాయనా! ఇంద్రుడే మళ్లీ యాగాశ్వాన్ని తస్కరించుకుపోయాడు’ అని రాకుమారుడితో చెప్పాడు. కోపోద్రిక్తుడైన పృథు కుమారుడు ఇంద్రుడిని తరుముతూ బాణాలు గుప్పించాడు. అతడి ధాటికి తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని విడిచిపెట్టి, మళ్లీ పారిపోయాడు. ఈసారి పృథు కుమారుడు యాగాశ్వాన్ని సురక్షితంగా తీసుకువచ్చాడు. అత్రి మహర్షితో కలసి యాగశాలకు చేరుకున్నాడు. తండ్రితో జరిగినదంతా చెప్పాడు. యాగాశ్వ సరంక్షణలో అత్రి మహర్షి చేసిన సాయానికి పృథు చక్రవర్తి వేనోళ్ల పొగిడి, కృతజ్ఞతలు తెలిపాడు. అశ్వమేధాన్ని దిగ్విజయంగా నిర్వర్తించినందుకు పృథు చక్రవర్తిని అత్రి మహర్షి ప్రశంసించాడు. ఇదంతా నచ్చని గౌతమ మహర్షి ‘ఒక మానవమాత్రుడిని ఇంతగా పొగడటం తగదు’ అంటూ వాదులాటకు దిగాడు. ఇంతలో కశ్యప మహర్షి లేచి, ‘ఈ వాదులాట ఇక్కడ పరిష్కారం కాదు గాని, దీనిలోని ధర్మాధర్మాలను సనత్కుమారుడొక్కడే తేల్చగలడు’ అన్నాడు. కశ్యపుని మాట మేరకు అందరూ సనత్కుమారుని వద్దకు చేరుకున్నారు. అత్రి, గౌతములిద్దరూ అతడి వద్ద తమ తమ వాదనలను వినిపించారు. సనత్కుమారుడు అంతా విని, ‘ఇందులో అత్రి మహర్షి దోషమేమీ లేదు. నా విష్ణుః పృథివీపతిః అనే భావన ప్రకారం అత్రి మహర్షి మాటలు ధర్మసమ్మతమే’ అని అన్నాడు. పృథు చక్రవర్తి సంతోషించి, అత్రి మహర్షిని ఘనంగా సత్కరించి, ఆయనకు కోరిన ధనరాశులనిచ్చి, సాదరంగా సాగనంపాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: అమ్మా, నాన్న ఆనంద విహారం -
‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది!
విమానంలో వెళుతూ పైనుంచి చూస్తే, ఈ దీవి యుద్ధనౌకలా కనిపిస్తుంది. అలాగని, ఇదేమీ పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన దీవి కాదు. దీని వెనుకనున్న చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ప్రస్తుతం జపాన్లోని నాగసాకి నగరం పరిధిలోనున్న ‘హషిమా’ అనే ఈ దీవిని ఒకప్పుడు యుద్ధఖైదీల బందిఖానాగా ఉపయోగించేవారు. వేలాదిమంది చైనీస్, కొరియన్ ఖైదీలను ఈ దీవిలో నిర్బంధించేవారు. ఇక్కడ బొగ్గు నిల్వలు బయటపడటంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నేళ్ల వరకు ఖైదీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ, బొగ్గు నిల్వలను వెలికితీసేవారు. బొగ్గు గనులు మొదలయ్యాక ఇక్కడ ఇళ్లు, స్కూళ్లు వెలిశాయి. వాటితో పాటే ఒక ఆలయం, షాపింగ్ సెంటర్ ఏర్పడ్డాయి. ఈ దీవిలో తొలిసారిగా 1887లో బొగ్గు నిల్వలను గుర్తించారు. వాహనాల తయారీ సంస్థ ‘మిత్సుబిషి’ ఈ దీవిని 1890లో కొనుగోలు చేసింది. జపాన్ ప్రభుత్వం ఇక్కడకు తరలించే యుద్ధఖైదీలనే కార్మికులుగా ఉపయోగించుకుని, వారితో వెట్టిచారికి చేయించుకుని, భారీగా లాభాలు గడించింది. మిత్సుబిషి సంస్థ 480 అడుగుల మీటర్ల పొడవు, 160 మీటర్ల వెడల్పు గల స్థావరంలో గని కార్మికులుగా పనిచేసే 5,300 మంది ఖైదీలను నిర్బంధంలో ఉంచేది. గని తవ్వకాల్లో జరిగే ప్రమాదాల వల్ల, పోషకాహార లోపం వల్ల, జపాన్ సైనికులు అమలు జరిపే మరణ శిక్షల వల్ల దాదాపు 1,700 మంది ఖైదీలు అర్ధాంతరంగా ఇక్కడే మరణించారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 1974 నాటికి అంతరించిపోవడంతో, వెట్టిచాకిరి చేసే కార్మికులకు విముక్తి దొరికింది. వారు ఈ దీవిని ‘జైలు దీవి’ అని, ‘యుద్ధనౌక దీవి’ అని పేర్లు పెట్టారు. గడచిన ఐదు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఈ దీవిలోని కట్టడాలన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. మిత్సుబిషి సంస్థ నుంచి నాగసాకి నగరపాలక సంస్థ 2005లో ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. ఈ దీవిలోనే 2012లో జేమ్స్బాండ్ సినిమా ‘స్కై ఫాల్’ షూటింగ్ జరిగింది. యునెస్కో 2015లో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నాగసాకి నగరపాలక సంస్థ ఈ దీవి అభివృద్ధికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా, కుతూహలం ఉన్న కొద్దిమంది పర్యాటకులు అరుదుగా ఇక్కడకు వచ్చి, ఫొటోలు దిగి వెళుతుంటారు. ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!' -
సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం!
'చేసే పని పట్ల నిబద్ధత.. నిజాయితీ ఉంటే చాలు.. ఫలితం ఏదైనా గ్రాఫ్ స్టడీగానే ఉంటుంది. సిద్ధి ఇద్నానీ విషయంలో అదే జరిగింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినా నటిగా ఆమె మాత్రం ఫెయిల్ అవలేదు. కెరీర్లో గ్యాప్ వచ్చింది కానీ ఆమె తెరమరుగు కాలేదు. ఆమె నటించిన ఇటీవలి ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం. జయాపజయాలతో సంబంధంలేని పాపులారిటీని సొంతం చేసుకున్న సిద్ధి వివరాలు కొన్ని..' సిద్ధి.. ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి.. సింధీ, తల్లి.. గుజరాతీ. వాళ్లది ప్రేమ వివాహం. అమ్మ.. హిందీ టెలివిజన్ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. నాన్న బిజినెస్ మేన్. చిన్నతనంలో అమ్మతో కలసి సీరియల్ సెట్స్కి వెళ్లేది. ఆ ప్రభావంతోనే తనూ నటి కావాలనుకుంది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ బాంబే టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో థర్డ్ రన్నరప్గా నిలిచింది. దాంతో ‘గ్రాండ్ హాలీ’ అనే గుజరాతీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ అనుకొని మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది. సీరియల్స్, కమర్షియల్స్ చేస్తున్నప్పుడే ఒకసారి.. ఓ ఏజెన్సీ వాళ్లు సిద్ధికి ఫోన్ చేసి సినిమా ఆడిషన్కి పిలిచారు. అలా ఆమె తెలుగులో ‘జంబలకిడి పంబ’తో హీరోయిన్గా మారింది. తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘ప్రేమకథా చిత్రం 2’ సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ‘వెందు తనిందది కాడు’ చిత్రంతో తమిళ్లోనూ ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంది. వరుసగా కొన్ని చాన్స్లైతే వచ్చాయి కానీ.. విజయం ఇంకా ఎదురుచూపుల్లోనే చిక్కుకుపోయింది. కొంచెం గ్యాప్ తీసుకొని.. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’లో నటించింది. అందులోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈసారి సక్సెస్ ‘గ్రాండ్’ అనే విశేషణాన్ని జత చేర్చుకుని తన పాత బాకీలనూ తీర్చేసుకుంది. ఈ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్లో ఉంది. 'నా దృష్టిలో యాక్టింగ్ అంటే యాక్టింగే. భావమే దాని భాష. అందుకే భాష కన్నా కథ.. నా పాత్రే నాకు ముఖ్యం.' – సిద్ధి ఇద్నానీ ఇవి చదవండి: అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు! -
మృగశృంగుడి కథ
పూర్వం కుత్సురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు ధార్మికుడు. నియమబద్ధంగా జీవించేవాడు. కుత్సురుడి యోగ్యతను గమనించి, కర్దమ మహర్షి అతడికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి కుత్సురుడికి ఒక కొడుకు కలిగాడు. కుత్సురుడి కొడుకు గనుక కౌత్సుడని పేరు పొందాడు. అతడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు. కొడుకుకు ఐదేళ్ల వయసు రాగానే కుత్సురుడు అతడికి ఉపనయనం చేశాడు. తండ్రి వద్ద కౌత్సుడు సకల శాస్త్రాలనూ అభ్యసించాడు. యుక్తవయసు రాగానే దేశాటనకు వెళ్లాలనే అభిలాషతో తండ్రి వద్ద అనుమతి తీసుకుని బయలుదేరాడు.ఇంటి వద్ద నుంచి బయలుదేరి ఊళ్లు, అడవులు దాటుకుంటూ ప్రయాణించిన కౌత్సుడు కొంతకాలానికి కావేరీ తీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం. కావేరీ పరిసరాలు ప్రశాంతంగా ఉండటంతో అక్కడే ఉంటూ, అనుదినం నదిలో స్నానం చేస్తూ, తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. తపస్సులో నిమగ్నమై ఉన్న కౌత్సుడిని జింకలు తమ కొమ్ములతో నిమురుతూ ఉండేవి. మృగశృంగాలను ఆకట్టుకున్నవాడు కావడం వల్ల అతడికి మృగశృంగుడనే పేరు వచ్చింది. కొన్నాళ్లకు మృగశృంగుడికి శ్రీహరి దర్శనమిచ్చాడు. ‘వత్సా! ఏమి కావాలో కోరుకో’ అన్నాడు శ్రీహరి.‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! ఇక్కడ నన్ను అనుగ్రహించినట్లే, నువ్వు ఇక్కడే కొలువుంటూ భక్తులను కటాక్షిస్తూ ఉండాలి. అంతకు మించి నాకే కోరికా లేదు’ అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి సమ్మతించాడు. శ్రీహరి దర్శనం పొందిన తర్వాత మృగశృంగుడు ఇంటికి చేరుకున్నాడు. యుక్తవయసుకు వచ్చిన మృగశృంగుడికి వివాహం జరిపించాలని తల్లిదండ్రులు భావించారు. భోగాపురంలో దైవజ్ఞుడైన బ్రాహ్మణుడికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అన్ని విధాలా అనుకూలవతి అని తెలుసుకోవడంతో మృగశృంగుడు ఆమెనే వివాహం చేసుకోవాలని తలచాడు. తల్లిదండ్రుల అనుమతితో ఆమెను చూడటానికి బయలుదేరాడు. సుశీల తన ఇద్దరు చెలికత్తెలతో కావేరీ నదిలో స్నానం చేయడానికి బయలుదేరింది. వారు ముగ్గురూ నది వైపు వెళుతుండగా, ఒక మదపుటేనుగు ఘీంకరిస్తూ వారిని తరమసాగింది. ప్రాణభయంతో ముగ్గురూ హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ, తోవలో ఉన్న దిగుడుబావిలో పడిపోయారు. ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి, చూడటానికి వచ్చేసరికి వారు ముగ్గురూ దిగుడుబావిలో చనిపోయి ఉన్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అదే సమయానికి మృగశృంగుడు అక్కడకు చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకున్నాడు. ముగ్గురు యువతుల మృతదేహాలను అప్పటికే గ్రామస్థులు వెలికితీశారు. తాను వచ్చేంత వరకు ఆ మృతదేహాలను కాపాడుతూ ఉండమని చెప్పి, మృగశృంగుడు కావేరీ నదిలో మెడలోతు వరకు దిగి, యమధర్మరాజు గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. అతడి తపస్సుకు యముడు దిగివచ్చాడు. ‘కుమారా! నన్ను గురించి ఇంత దీక్షగా తపస్సు చేసిన వారెవరూ ఇంతవరకు లేరు. ఏమి కావాలో కోరుకో. నీ అభీష్టాన్ని తప్పక నెరవేరుస్తాను’ అన్నాడు యముడు.‘మహానుభావా! అకాల మరణానికి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ ముగ్గురు కన్యలనూ బతికించు’ అని కోరుకున్నాడు మృగశృంగుడు. ‘నీ పరోపకార బుద్ధికి సంతసిస్తున్నాను’ అంటూ యముడు సుశీలను, ఆమె చెలికత్తెలిద్దరినీ బతికించాడు.తర్వాత మృగశృంగునికి సుశీలతో వివాహం జరిగింది.సుశీలతో పాటు తమను కూడా పునర్జీవితులను చేయడంతో సుశీల ఇద్దరు చెలికత్తెలూ మృగశృంగునిపై మనసు పడ్డారు. వారు అతడి వద్దకు వచ్చి, ‘సుశీలను పునర్జీవితురాలిని చేసినట్లే, నువ్వు మమ్మల్ని కూడా పునర్జీవితులను చేశావు. హాయిగా సుశీలను పెళ్లాడావు. నిన్నే నమ్ముకుని ఉన్నాం. మా గతి ఏమిటి?’ అన్నారు. ‘ఒకరికి ఒక భార్య ఉండటమే ధర్మం’ అన్నాడు మృగశృంగుడు.‘ఒకరికి ఒక భార్య మాత్రమే ఉండాలనే నియమం ఏ శాస్త్రంలోనూ లేదు. దశరథునికి ముగ్గురు భార్యలు లేరా? ఆ కృష్ణ పరమాత్ముడికి ఏకంగా ఎనిమిది మంది భార్యలు ఉన్నారే! చివరకు ఆదిభిక్షువైన ఆ పరమశివునికి కూడా గంగ, గౌరి ఇద్దరూ భార్యలుగా ఉన్నారు కదా!’ అని వాదించారు.మృగశృంగుడు వారికి బదులివ్వలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.ఈలోగా పెద్దలైన కొందరు మునులు కలగజేసుకుని, ‘మృగశృంగా! అభ్యంతరం చెప్పకు. ఈ కన్యలిద్దరిని కూడా వారి మనోభీష్టం మేరకు పెళ్లాడు. బహుభార్యలను కలిగి ఉండటం శాస్త్రవిరుద్ధం కాదు. మొండిగా నువ్వు వారిని తిరస్కరిస్తే, వారు బాధపడి కన్నీరుపెడితే నీకు జయం కాదు’ అని నచ్చచెప్పారు.పెద్దలందరూ నచ్చజెప్పడంతో చివరకు మృగశృంగుడు సుశీల చెలికత్తెలిద్దరిని కూడా వివాహమాడాడు. ∙సాంఖ్యాయన -
నటి నుంచి సీఎం వరకూ.. ‘అమ్మ’ జీవితం సాగిందిలా!
పలువురు మహిళలు దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, సుచేతా కృపలానీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ సహా ఎందరో మహిళల పేర్లు దేశ ప్రజల నోళ్లలో మెదులుతాయి. దేశ రాజకీయాల్లో సత్తా చాటుతున్న నటీమణుల విషయానికొస్తే స్మృతి ఇరానీ, నుస్రత్ జహాన్, జయప్రద హేమమాలిని తదితరుల పేర్లు వినవస్తాయి. అయితే అమోఘమైన ప్రజాదరణ పొందిన మహిళా నేతల జాబితాను పరిశీలిస్తే ఒక నాటి నటీమణి, ఆ తరువాత తమిళనాట సీఎంగా సత్తా చాటిన జయలలిత తప్పుకుండా గుర్తుకువస్తారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మా’ అని పిలిచేంతటి ఆదరణ ఆమె సొంతం చేసుకున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 24) దివంగత సీఎం జయలలిత జన్మదినం. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ నేపధ్యం జయలలిత.. ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్లోని మాండ్య జిల్లాలోని పాండవపురా తాలూకాలోని మేలుర్కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’. ఆమె తండ్రి పేరు జయరామ్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె తల్లి పేరు వేదవల్లి. జయలలిత తల్లి వేదవల్లి ప్రముఖ నటిగా పేరు సంపాదించారు. బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు. బలవంతంగా ఆమె సినీ రంగంలోకి వచ్చారని చెబుతుంటారు. సినీ జీవితం చదువులో జయలలిత ఎంతో ప్రతిభ కనబరిచారు. జయలలిత తండ్రి ఆమెను లాయర్గా చూడాలనుకున్నారు. అయితే ఆమె తల్లి.. జయలలితను చిన్నతనంలోనే సినీ రంగంలోకి తీసుకువచ్చారు. జయలలిత కేవలం తన 15 ఏళ్ల వయసులోనే అడల్ట్ సినిమాలో నటించారు. ఆమె సినీ జీవితం అక్కడి నుంచే మొదలైంది. ఆమె సినిమాల్లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. జయలలిత తన కెరీర్లో మొత్తం 85 సినిమాలు చేయగా, అందులో 80 సినిమాలు అమోఘ విజయం సాధించాయి. సినిమాల్లో స్లీవ్లెస్ బ్లౌజ్ ధరించిన తొలి నటిగా ఆమె గుర్తింపు పొందారు. రాజకీయ ప్రయాణం నాటి రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ నటి జయలలితను సినిమాల నుంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎంజీఆర్, జయలలిత ప్రేమించుకున్నారని కానీ పెళ్లి చేసుకోలేదని, పైగా వారు తమ బంధాన్ని ఏనాడూ బహిరంగపరచలేదని చెబుతుంటారు. జయలలిత 1982లో ఎంజీ రామచంద్రన్తో పాటు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)లో సభ్యురాలయ్యారు. నాటి నుంచే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1984 నుండి 1989 వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. సాధించిన విజయాలు తమిళనాడులో జయలలిత ప్రజాదరణ పొందిన నటిగా మాత్రమే కాకుండా మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఆమె రాజకీయాల్లో సాధించిన అమోఘ విజయంగా చెబుతుంటారు. భ్రూణహత్యల నివారణకు ఆమె ‘క్రెడిల్ టు బేబీ స్కీమ్’ను ప్రారంభించారు. ‘అమ్మ’ బ్రాండ్ ప్రారంభించి, ఈ పేరుతో దాదాపు 18 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ పేరుతో అమలయిన ఈ పథకాలు పూర్తిగా ఉచితం. లేదా భారీగా రాయితీలు అందించేవి. పట్టణ పేదలకు ఒక్క రూపాయికే ఆహారం అందించేందుకు ఆమె ‘అమ్మ క్యాంటీన్’ను ప్రారంభించారు. జయలలిత తన 68వ ఏట 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
మనిషి మొదటి శాలరీ ఉప్పు?
ఉద్యోగం చేసే వ్యక్తి జీవితంలో శాలరీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ శాలరీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొక కాలంలో శాలరీ పేరుతో ఉప్పును ఇచ్చేవారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన రోమ్లో డబ్బుకు బదులుగా ఉప్పును ఉపయోగించేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు వారి పనికి ప్రతిఫలంగా ఉప్పును ఇచ్చేవారు. ‘ఉప్పు ఋణం’ లాంటి సామెతలు ఆ కాలం నుంచే ఉద్భవించాయని చెబుతుంటారు. ప్రముఖ మీడియా సంస్థ అందించిన ఒక నివేదిక ప్రకారం రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన ‘నేచురల్ హిస్టరీ’ పుస్తకంలో.. రోమ్లో సైనికులకు ఉప్పు రూపంలో శాలరీ ఇచ్చేవారని పేర్కొన్నారు. శాలరీ అనే పదం ఉప్పు నుండి వచ్చిందని దానిలో తెలిపారు. సోల్జర్ అనే పదం లాటిన్ పదం 'సల్ డేర్' నుండి ఉద్భవించిందని, దీని అర్థం ‘ఉప్పు ఇవ్వడం’ అని పలు నివేదికలు పేర్కొన్నాయి. రోమన్లో ఉప్పును సలారియం అంటారు. దీని నుండి శాలరీ అనే పదం ఉద్భవించింది. 10,000 బీసీ, 6,000 బీసీ మధ్య మొదటిసారి శాలరీ ఇచ్చారని ఫ్రెంచ్ చరిత్రకారులు భావిస్తున్నారు. పురాతన రోమ్లో పనికి బదులుగా బదులుగా ఉప్పు ఇచ్చేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని సైనికులకు శాలరీగా వారి చేతినిండా ఉప్పు ఇచ్చేవారు. అప్పట్లో ఉప్పు వ్యాపారం కూడా బాగా జరిగేది. -
నెలకు రూ. 60 లక్షలు సంపాదిస్తున్న ‘పోహె వాలా’
నిజాయతీగా కష్టపడే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి ‘పోహెవాలా’ ఫుడ్ స్టార్టప్ వ్యవస్థాపకులు, మహారాష్ట్రకు చెందిన చాహుల్ బల్పాండే, పవన్ వాడిభాస్మే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. చాహుల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక, పవన్ ఎంబీఏ డిగ్రీ అందుకున్నాక ఒక కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. సదరు కంపెనీ వారికి సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీంతో ప్రతి నెలా డబ్బుకు ఇబ్బంది ఎదురయ్యేది. దీంతో వారిద్దరూ పగటిపూట అదే ఆఫీసులో పనిచేస్తూ, రాత్రి పూట నాగపూర్లో పోహె విక్రయాలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వీరు తయారు చేసే పోహెకు ఆహార ప్రియుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో వీరిద్దరూ 2018లో తమ ఉద్యోగాలను వదిలేసి, పూర్తిస్థాయిలో పోహె విక్రయాలు ప్రారంభించారు. వీరు తమ బ్రాండ్కు ‘పోహె వాలా’ అనే పేరు పెట్టారు. అనంతరం అనేక రకాల పోహెలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం ఆరు సంవత్సరాలలో, వారు దేశంలోని 15 నగరాల్లో తమ అవుట్లెట్లను ప్రారంభించారు. ప్రస్తుతం పవన్, చాహుల్ ప్రతి నెలా రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తున్నారు. చాహుల్, పవన్లు ఫుడ్ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు తొలుత రాత్ర వేళ చిన్నగా పోహె విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఈ వ్యాపారంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడంతో పాటు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారనేది గ్రహించారు. 2018 మేలో వీరు నాగ్పూర్లో తమ పోహె వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోహె విక్రయించేవారు. ఇది వారికి మార్కెట్పై లోతైన అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యాపారం సాగిస్తున్న వీరు మొత్తం 13 రకాల పోహెలను తయారు చేస్తుంటారు. ఆర్గానిక్ పోహె అమ్మకాలు ప్రారంభించినది కూడా వీరే కావడం విశేషం. నేడు పోహెవాలా బ్రాండ్ పనీర్ పోహె, ఇండోరి పోహె, నాగ్పూర్ స్పెషల్ తారీ పోహె, చివ్దా పోహె, మిశ్రా పోహె చాలా ప్రసిద్ధి చెందాయి. ఒక ఇంటర్వ్యూలో చాహుల్ బాల్పాండే మాట్లాడుతూ నిజానికి ఏ వ్యాపారానికీ హెచ్చు తగ్గులుండవని, వ్యాపారం విజయవంతం కావడానికి వినూత్న ఫార్ములా, నాణ్యత, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరమని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సరైన వ్యూహాన్ని రూపొందించడం ముఖ్యమన్నారు. వీరు ‘పోహెవాలా’కు సొంత వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. దీని సాయంతో ఆన్లైన్లోనూ పోహె విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
ఎవరీ మోలీ? నూటపాతిక ఏళ్ల నుంచి భయపెడుతూనే ఉంది!
అది అమెరికా, అలబామాలోని ఆబ్విల్ పట్టణం. అక్కడ సూర్యాస్తమయం తర్వాత.. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఓ హెచ్చరిక జారీ అవుతుంది. ‘మోలీ వస్తోంది.. అల్లరి చేస్తే తీసుకెళ్లిపోతుంది, మోలీ వస్తోంది.. మాట వినకపోతే లాక్కుపోతుంది’ అని! మోలీ.. ఓ దయ్యం పేరు. ఆమె 7 అడుగుల ఎత్తుతో బలిష్ఠంగా ఉంటుందని.. నల్ల దుస్తులు ధరిస్తుందని చూసినవాళ్లు, తెలిసినవాళ్లు చెబుతుంటారు. ఆమె తలకు ముసుగు లేదా తలపాగా లేదా టోపీ పెట్టుకుని.. భయపెట్టే రూపంలో ఉంటుందని వర్ణిస్తుంటారు. చీకటి వేళ చల్లగాలిలో అమాంతం దూసుకొస్తుందట మోలీ. ఎంత వేగంగా పారిపోవడానికి ప్రయత్నించినా వెంటాడి పట్టుకోగలదట. ముఖ్యంగా ఆమె టార్గెట్ పిల్లలేనట. తరిమి తరిమి పట్టుకున్న తర్వాత గట్టిగా కౌగిలించుకుని.. చెవిలో చాలా పెద్దగా అరిచి.. అదృశ్యమవుతుందట. అంటే ‘ఆమె హానికరమైన దయ్యం కాదు’ అనేది అక్కడి వారి మాట. అయితే పిల్లల్ని అదుపు చేయడానికి పెద్దలు మాత్రం మోలీ పేరు చెప్పి బెదరగొడుతూంటారు. మోలీ ఎదురుపడిందంటూ.. రెండుమూడు రోజులు మంచం పట్టిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ మోలీ గతం గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మోలీ బాలింతగా ఉన్నప్పుడు.. తన పసిబిడ్డను కొంతమంది పిల్లలు ఎత్తుకుని, కౌగిలించుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ సోకి ఆ బిడ్డ చనిపోయిందని.. అప్పటి నుంచి పిచ్చిదైపోయిన మోలీ.. ఆ తర్వాత చనిపోయి, దయ్యమైందని చెబుతారు. ఆ దయ్యమే ఇలా పిల్లల వెంటపడుతుందని కొందరు నమ్ముతారు. అయితే మరికొందరు మాత్రం.. మోలీ ఒక స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేసేదని.. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టమని.. అందుకే చనిపోయిన తర్వాత దయ్యమై.. రాత్రి పూట పిల్లల్ని భద్రంగా కాపాడటానికి తాపత్రయపడుతుందని చెబుతుంటారు. 1900 సంవత్సరం నుంచి ఈ కథలు వినిపిస్తూనే ఉన్నాయి. అంటే మోలీ.. సుమారు నూటపాతిక ఏళ్ల నాటి దయ్యమన్నమాట. అయితే ఈ కథల్లో ఏది నిజం? ఎంతవరకు నిజం అనేదానిపై స్పష్టత లేదు. ఏది ఏమైనా.. మోలీ ఊసెత్తితే.. చాలామంది పెద్దలు కూడా ఉలిక్కిపడుతుంటారు. ఎందుకంటే తమ బాల్యంలో తమనూ మోలీ వెంటాడి పట్టుకుందని, చెవిలో గావుకేక పెట్టిందని చెబుతుంటారు. ఏదీ ఏమైనా నిజంగానే మోలీ ఆత్మ రూపంలో అక్కడ వీథుల్లో తిరుగుతోందా? లేక కేవలం భ్రమలు, పుకార్లేనా? అనేది నేటికీ మిస్టరీనే. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
బౌద్ధవాణి : మాకు పిచ్చుకలతో పోలికా..!?
"వసంతకాలం వచ్చేసింది. చివురులు తొడిగిన చెట్లన్నీ పుష్పించాయి. పూత పిందెలుగా మారుతోంది. ప్రకృతి పూల పరిమళాలతో పరవశించి పోతోంది. ఆ మామిడితోటలో చల్లదనానికి తోడు చక్కని పరిమళాలు వీస్తున్నాయి. ఆ తోట ఒక అంచున పెద్ద కాలువ. నీరు బాగా ఇంకిపోయి ఉంది. పాయలు పాయలుగా సన్నని ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ కాలువ గట్టు మీద పెద్ద మామిడిచెట్టు. సమయం మధ్యాహ్నం దాటింది. పొద్దు పడమటికి వాలింది. ఆ చెట్టు కింద భిక్షుగణంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షువులకి తాము తీసుకోవలసిన ఆహార నియమాల గురించి బోధిస్తున్నాడు." ‘‘భగవాన్! నేను రోజుకు మూడు పూటలా తినేవాణ్ణి. చిన్నతనం నుండి అదే అలవాటు. బౌద్ధసంఘంలో చేరాక ఉదయం, సాయంత్రం కొన్నాళ్ళు తిన్నాను. మధ్యాహ్నం క్రమంగా మానేశాను. కొన్నాళ్ళు చాలా బాధ అనిపించింది. ఆకలికి తాళలేకపోయాను. కానీ.. కొన్నాళ్ళకు అదే అలవాటైంది. ఆ తరువాత మీరు.. ‘రాత్రి భోజనం మానండి’ అన్నారు. నెమ్మదిగా మానేశాను. ఇప్పుడు రోజుకి ఒక్కపూట భోజనం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఉత్సాహంగా ఉన్నాను. తేలికపడ్డాను. చదువు పట్ల శ్రద్ధ పెరిగింది.’’ అన్నాడు ఉదాయి అనే భిక్షువు. అంతలో ఆ పక్కనే ఉన్న తుమ్మచెట్లు మీదనుండి పిచ్చుకల అరుపులు వినిపించాయి. కొందరు అటుకేసి చూశారు. అరుపులు నెమ్మదిగా సద్దుమణిగాయి. చిక్కని కొమ్మల్లో చిక్కుకుపోయిన పిచ్చుక నెమ్మదిగా బైటపడి, రెక్కలు దులుపుకుని లేచిపోయింది. ‘‘భగవాన్! రాత్రిపూట చీకటిలో భిక్ష కోసం తిరగాలంటే.. ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. ఒకసారి నేను మురికి గుంటలో పడ్డాను. మన ధర్మపాలుడైతే ముళ్ళ పొదలో చిక్కుకున్నాడు’’ అన్నాడు ఒక భిక్షువు. ‘‘నేనైతే.. ఒకసారి దొంగలమూకతో కలసిపోయాను’’ అన్నాడు ఇంకో భిక్షువు. ‘‘భగవాన్! నా అనుభవం చెప్పడానికి మరీ ఇబ్బందికరం. ఆరోజు రాత్రి మబ్బు పట్టింది. నేను ఒకరి ఇంటికి వెళ్ళే సమయానికి పెద్ద మెరుపు మెరిసింది. ఇంటి పెరట్లో ఉన్న స్త్రీ నన్ను ఒక్కసారి చూసి భూతం అనుకొని భయపడింది. పెద్దగా అరిచింది. తెగ తిట్టి పోసింది. నేను ‘‘చెల్లీ! నేను భిక్షువుని’’ అని సర్ది చెప్పి బైటపడ్డాను’’ అన్నాడు మరో భిక్షువు. కానీ కొందరు భిక్షువులు మాత్రం అసహనంగా కూర్చొని ఉన్నారు. వారికి ఒంటిపూట భోజనం అలవాటు కావడం లేదు. మూడుపూటలా తింటే గానీ.. ఆకలి శాంతించదు. కొందరు కనీసం రెండు పూటల’’ అన్నారు. అంతలో.. తుమ్మచెట్టు మీద మరలా పిచ్చుకల అలజడి.. చిక్కని కొమ్మల మధ్య చిక్కుకుపోయిన ఎండు పీచుల మధ్య చిక్కుకుపోయింది ఒక పిచ్చుక. అది అటూ ఇటూ కొట్టుకుంటుంది. కొట్టుకున్న కొద్దీ ఇంకా ఇంకా చిక్కుకు పోతోంది. బుద్ధుడు నెమ్మదిగా.. ‘‘భిక్షువులారా! మీలో ఒకరు వెళ్లి ఆ బంధనాలు విడిపించండి’’ అన్నాడు. ఒక భిక్షువు లాఘవంగా చెట్టెక్కి పిచ్చుక బంధనాల్ని తొలగించాడు. అది భయంతో తుర్రున ఎగిరిపోయింది. ‘‘భిక్షువులారా! చూశారా! ఆ పిచ్చుక చిక్కుకున్న బంధాలు చిన్న చిన్న పీచులు. ఎండిపోయినవి. బలహీనమైనవి. కానీ, ఆ పిచ్చుక దాన్ని తెంచుకోలేక పోయింది.. కారణం?’’ అని అడిగాడు. ‘‘ఆ పిచ్చుక ఆ బంధనాల కంటే బలహీనమైంది’’ అన్నాడు ఉదాయి. ‘‘మరి, చాలా బలమైన గొలుసులతో తాళ్ళతో బంధించిన ఏనుగు ఆ బలమైన బంధనాన్ని సైతం తెగ తెంచుకోగలదు. ఆహారం విషయంలో మీలో కొందరు ఆ పిచ్చుకలాంటి వారే. మరికొందరు ఏనుగు లాంటివారు. కోరికల్ని తెగ తెంచుకోగలిగారు’’ అన్నాడు. ‘‘బుద్ధుడు, ఇంకా ఎందరో భిక్షువులు ఒంటిపూట భోజనంతో సంతోషంగా, ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటున్నారు. మేమెందుకు పిచ్చుకలంత బలహీనులం కావాలి?’’ అనుకున్నారు ఆకలికి ఆగలేనివారు. వారూ నెమ్మదిగా దాన్ని సాధించుకున్నారు. మాకు పిచ్చుకలతో పోలికా? అన్నట్లు దృఢచిత్తులయ్యారు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఊహా ప్రపంచాలు.. కొత్త కథలతో స్టార్ హీరోల ప్రయోగాలు
మంచి ఊహలు ఎప్పుడూ బాగుంటాయి. నేరుగా చూడలేని ప్రపంచాలను ఊహించుకున్నప్పుడు ఓ ఆనందం దక్కుతుంది. ఇక కొత్త ప్రపంచాలను సిల్వర్ స్క్రీన్పై చూసినప్పుడు కనువిందుగా ఉంటుంది. అలా ఊహా ప్రపంచం నేపథ్యంలోని కథలకు కొందరు స్టార్స్ ఊ అన్నారు. కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను రా రమ్మంటున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం... పది సెట్స్లో విశ్వంభర ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (1990), ‘అంజి’ (2004) వంటివి చిరంజీవి కెరీర్లోని సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ జానర్ను టచ్ చేశారు చిరంజీవి. ఈ కోవలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడిగా తొలి సినిమా ‘బింబిసార’ను సోషియో ఫ్యాంటసీ జానర్లో తీసిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ అంతా ఓ కల్పిత ప్రాంతంలో జరుగుతుందట. చిత్రీకరణకు తగ్గట్లుగా పదికి పైగా సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్లో జాయిన్ అవుతారట చిరంజీవి. ఈ చిత్రంలో హనుమంతుని భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, త్రిష హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఓ చైల్డ్ ఎపిసోడ్ కూడా ఉంటుందట. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ డేట్ అనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. కల్కి లోకం భారతీయ ఇతిహాసాల ఆధారంగా సైంటిఫిక్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా కథలో ఇతిహాసాల ప్రస్తావన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఊహించవచ్చు. ఓ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇండియా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తాం అన్నట్లుగా ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల సందర్భంలో పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీ రోల్స్లో కనిపిస్తారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్’ తర్వాత హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘రావణం’ అనే మైథలాజికల్ ఫిల్మ్ రానుందని, ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఊహాజనిత ప్రపంచంలో జరిగే చిత్రం అని టాక్. ట్రాక్ మారింది ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’... హీరో అల్లు అర్జున్– దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవి. కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ మూడు సినిమాల తర్వాత అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్లో నాలుగో సినిమా గురించిన ప్రకటన వెల్లడైంది. కానీ ట్రాక్ మారింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రం ఉండదట. ఇది పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అని, మహాభారతం రిఫరెన్స్ ఈ సినిమాలో ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది. అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా ్రపారంభం కావడానికి కాస్త సమయం పట్టేలా ఉందని తెలిసింది. కంగువ ప్రపంచం ‘కంగువ’ టీజర్ చూస్తున్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా ప్రేక్షకులకు అనిపిస్తుంటుంది. సూర్య హీరోగా నటించిన చిత్రం ఇది. పూర్తి స్థాయి ఫ్యాంటసీ ఫిల్మ్ కాకపోయినప్పటికీ ‘కంగువ’లో ఆడియన్స్ ఆశ్చర్యపోయే, అబ్బురపరచే విజువల్స్ చాలానే ఉన్నాయన్నది కోలీవుడ్ టాక్. కథ రీత్యా కాస్త సైంటిఫిక్ టచ్ ఉన్న ఈ సినిమాలో సూర్య పదికి పైగా గెటప్స్లో కనిపిస్తారని సమాచారం. దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందట. తొలి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. కేరాఫ్ భైరవకోన గరుడ పురాణంలో మిస్ అయిన ఓ నాలుగు పేజీల కథే ‘భైరవకోన’ అట. మరి.. ఈ గరుడ పురాణం పూర్తి వివరాలు, ఈ నాలుగు పేజీల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న థియేటర్స్లో విడుదలయ్యే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటించారు. అఘోరా శంకర్ యంగ్ హీరోల్లో ఒకరైన విశ్వక్ సేన్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘గామి’ ఒకటి. ఇందులో శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్ కనిపిస్తారు. కథ రీత్యా శంకర్కు మానవ స్పర్శ తెలియదు. కానీ ఆ స్పర్శను అనుభూతి చెందాలన్నది అతని ఆకాంక్ష. ఈ క్రమంలో ఏం జరగుతుంది? అనేదే ‘గామి’ కథ అట. ఈ సినిమాలో అఘోరా ట్రాక్ మాత్రమే కాకుండా మరో స్టోరీ ట్రాక్ కూడా ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు సంవత్సరాలుగా తీస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఊహించవచ్చు. విద్యాధర కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జై హనుమాన్ ఈ సంక్రాంతికి ‘హను–మాన్’ సూపర్హిట్. అంజనాద్రి అనే ఊహాజనితప్రాంతం నేపథ్యంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. కె. నిరంజన్రెడ్డి నిర్మించారు. కాగా ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ తీస్తున్నారు ప్రశాంత్ వర్మ. స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ‘జై హను–మాన్’ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండేట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అఖిల్ నెక్ట్స్ సినిమా గురించిన ఓ వార్త అక్కినేని ఫ్యాన్స్లో ఆసక్తిని కలిగిస్తోంది. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ కలిసి ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాను నిర్మించనున్నాయట. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతారని భోగట్టా. ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇలా ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో మరికొన్ని సినిమాలు రానున్నాయి. -
'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..
‘జీవితం విలువైన బహుమతి, ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. దయచేసి ఒంటరిగా ఇక్కడ తిరగొద్దు.. వెంటనే క్షేమంగా తిరిగి వెళ్లిపోండి’ ఇవి ఔకీగహారా సమీపంలో కనిపించే ప్రమాద హెచ్చరికలు. ‘పో.. దూరంగా పో.. తిరిగి వెళ్లిపో.. బతుకు..’ అంటూ గమనిక బోర్డులనిండా రాతలు. అవి స్పష్టంగా కనిపిస్తున్నా.. అడవి మాత్రం ‘రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో’ అని పిలుస్తుందట. టోక్యోకు పశ్చిమంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో.. ఫుజి అనే ఎత్తైన పర్వతానికి ఆనుకుని.. ఔకీగహారా అనే ఫారెస్ట్ ఉంది. అక్కడ ప్రతి మొక్కలో, ప్రతి మలుపులో విషమ గీతమే వినిపిస్తుంది. ఏదో తెలియని క్రూరత్వం రారమ్మంటూ వల విసురుతున్నట్లుగా ఉంటుంది. ‘అవన్నీ ఆత్మహత్యలకు ఆహ్వానాలే’ అంటుంటారు చాలామంది. ఈ అడవి భూమ్మీద అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ప్రపంచంలోనే ఆత్మహత్యల రేటులో ఈ అడవిది రెండో స్థానం. ఏటా ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా మృతదేహాలను వెలికితీస్తుంటారు. ఇది ఇంత ప్రమాదకరమైన ప్రదేశమని తెలిసి కూడా కొందరు .. ఇక్కడికే హైకింగ్కి వస్తుంటారు. పురాణ కథనం పురాణాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం కొంతమంది పేదలు ఇక్కడ ఆకలితో మరణించి ఆత్మలుగా మారారని ఒక కథనం. ఆ ఆత్మలు కొత్త ఆత్మల కోసం వెదుకుతూ ఉంటాయని.. అందుకే అవి అడవి సమీపానికి వచ్చిన మనుషుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంటాయని చాలామంది నమ్ముతారు. అయితే ఈ అడవిలో చనిపోయిన శవాలు కదులుతాయని.. భీకరంగా కేకలు వేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. మరో కథనం ప్రకారం.. పూర్వం స్థోమత లేని కుటుంబాల్లోని వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధపడే బంధువులను ఈ అడవికి తీసుకొచ్చి వదిలేసేవారని.. వారంతా అక్కడే ఆకలితో చనిపోయేవారని.. వారి ఆత్మఘోషే ఈ విషాదానికి కారణమని మరో కథనం. 'సీచో మాట్సిమోటో' అనే రచయిత.. 1961లో రచించిన ‘ది టవర్ ఆఫ్ వేవ్స్’ అనే నవల వల్ల.. ‘ఔకీగహారా’ అడవి విశేషాలు బాగా పాపులర్ అయ్యాయని కొందరి అభిప్రాయం. అప్పటి నుంచే ఈ అడవి మిస్టరీని కథాంశంగా తీసుకుని.. అనేక చిత్రాలు, కథనాలు పుట్టుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. శాస్త్రవేత్తల మాట్లలో.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ‘ఇక్కడి ఇనుప నిక్షేపాల కారణంగా అవి దిక్సూచిగా మారి దారి తప్పించడంతో అడవిలోనే చనిపోతున్నారు. అందుకే ఈ అడవిలోకి వెళ్లాలి అనుకునే హైకర్స్.. టేప్ లేదా స్ట్రింగ్ని ఉపయోగించడం మంచిది’ అని సూచిస్తున్నారు. అడవి ప్రాంతం విస్తారంగా, దట్టంగా ఉండటంతో.. ఇక్కడ అడుగుపెట్టిన చాలామంది శవాలు కూడా దొరకట్లేదు. మిస్ అయిన వాళ్లని కనిపెట్టడంలో రెస్క్యూ టీమ్ కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. దాంతో ఆత్మహత్యలను, మిస్సింగ్లను నివారించడానికి.. అటవీ ద్వారాల ముందు భద్రతా కెమెరాలతో పాటు.. సెక్యూరిటీనీ పెంచారు. నిర్మానుష్యమైన ఈ అడవిలో.. నిర్ఘాంత పోయే దృశ్యాలు భయపెడుతూ ఉంటాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న షూలు, బట్టలు, టోపీలతో పాటు భీతికలిగించే బొమ్మలు కూడా ఉంటాయి. అవన్నీ చెట్టు కొమ్మలతో తాళ్లు మెలిపెట్టి బొమ్మల్లా అల్లినట్లు ఉంటాయి. చూడటానికి రాక్షసుల్లా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని ఎవరు అలా పెట్టారో ఎవరికీ తెలియదు. మనిషి పుర్రెలు, ఎముకలు అక్కడక్కాడా అగుపిస్తూ హడలెత్తిస్తుంటాయి. చనిపోయిన వారి శవాలు కూడా దిష్టిబొమ్మల్లా.. ఊడలమర్రిపై దయ్యాల్లా వేలాడుతూ భయపెడుతూ ఉంటాయి. ఏదిఏమైనా ఈ అడవి.. మనుషుల్ని ఆత్మహత్యలకు ఎలా ప్రేరేపిస్తోంది? అక్కడ తాళ్లతో రాక్షసుల రూపాలను ఎవరు తయారు చేశారు? వంటివన్నీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. - సంహిత నిమ్మన -
హనుమ హృదయంలో సీతారాములు
రామ రావణ యుద్ధంలో రావణుడు అంతమొందాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. సీతా సమేతంగా వానర వీరులను, విభీషణుణ్ణి తోడ్కొని పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకోవడానికి బయలుదేరాడు. రాముడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న భరతుడు అయోధ్య పొలిమేరల్లోనే సపరివారంగా నిలబడి, నెత్తి మీద పాదుకలను ఉంచుకుని రాముడికి స్వాగతం పలికాడు. అయోధ్యవాసుల జయజయ ధ్వానాల నడుమ, పురోహితుల వేద మంత్రాలతో రాముడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం తర్వాత రాముడు తనకు అడుగడుగునా సహకరించిన వారందరికీ విలువైన కానుకలను బహూకరించాడు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, జాంబవంతుడు తదితర వానర యోధులకు, విభీషణుడికి కానుకలతో సత్కరించాడు. హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సీతమ్మవారికి ఒక విలువైన రత్నాల హారాన్ని ఇచ్చాడు. ‘నీకు ఇష్టమైన వారికి దీనిని బహూకరించు’ అని చెప్పాడు రాముడు. ‘మహారాజా! మానసపుత్రుల మధ్య భేదభావాన్ని కలిగించాలనుకుంటున్నారా? తల్లికి బిడ్డలందరూ సమానమే కదా!’ అంది సీత. ‘సమానులెలా అవుతారు? బిడ్డలు అందరూ సమానులే అయితే శాస్త్రాల్లో సుపుత్రులు, కుపుత్రులు అని ఎందుకు వర్ణించారు?’ ప్రశ్నించాడు రాముడు. ‘ఏ వేలికి గాయమైనా నొప్పి సమానంగానే కలుగుతుంది. తల్లికి పుత్రులందరూ సమానమే. తల్లి మమత పుత్రులందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే, సద్గుణాల కారణంగా, భక్తి కారణంగా కొంత తారతమ్యం కలుగుతుంది. ఆ తారతమ్యం గుణాలకు సంబంధించినది మాత్రమే!’ అని పలికింది సీత. ‘నా అభిప్రాయం కూడా అదే! గుణాలలో ఎక్కువగా ఎవరిని భావిస్తావో వారికే ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. ‘అందరూ గుణవంతులే! అందరూ భక్తులే!’ అంది సీత. ‘అయినా కొద్ది తారతమ్యం ఉండనే ఉంటుంది. నువ్వు సంకోచిస్తున్నట్లున్నావు. నువ్వు ఇవ్వదలచుకున్న వాళ్లకు నిస్సంకోచంగా ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. సభలో ఉన్నవారంతా సీతారాముల మధ్య జరిగిన ఈ సంభాషణను అత్యంత ఉత్కంఠతో ఆలకిస్తూ, ఆ హారాన్ని సీతమ్మవారు ఎవరికి ఇస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు. హనుమంతుడు మాత్రం ఏమీ పట్టనట్లుగా నిశ్చలంగా రాముణ్ణే చూస్తూ ఉన్నాడు. సీతమ్మవారు హనుమంతుడిని పిలిచి, రాముడు తనకు ఇచ్చిన హారాన్ని అతడికిచ్చింది. హనుమంతుడు ఆ హారాన్ని మెడలో ధరించాడు. సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు. తర్వాత హనుమంతుడు తన ఆసనంపై యథాప్రకారం ఆసీనుడయ్యాడు. సీతమ్మవారు తనకు ఇచ్చిన హారంలోని రత్నాలను ఒక్కొక్క దాన్నే పరిశీలనగా చూస్తూ, ఒక్కొక్క రత్నాన్నే కొరికి నేల మీద పడేయసాగాడు. సభాసదులందరూ హనుమంతుని చేష్టను వింతగా చూడసాగారు. ఇంతలో విభీషణుడు ధైర్యం చేసి, ‘కోతికేం తెలుసు అల్లం రుచి’ అన్నాడు. హనుమంతుడు విభీషణుడివైపు చూసి, ‘లంకాధిపా! అయితే ఏమంటావు? మీ లంకలోని రాక్షసులు ఎక్కువగా అల్లం తింటారు. అందుకే మీకు తెలిసినంతగా అల్లం రుచి మా వానరులకు ఎలా తెలుస్తుంది?’ అన్నాడు. ‘తినకపోతే మాత్రం నీలా ఉన్నామా? సీతమ్మవారు విలువైన హారాన్ని కానుకగా ఇస్తే, నువ్వు చేస్తున్న పనేమిటి?’ అని కాస్త కోపంగానే అడిగాడు విభీషణుడు. ‘సీతమ్మ ఎంతో విలువైనదిగా భావించే ఈ హారాన్ని నాకు ఇచ్చింది కదా, ఇందులో నా దేవుడు ఉన్నాడో లేడోనని చూస్తున్నాను. ఏ ఒక్క రత్నంలోనూ నా దేవుడైన రాముడు కనిపించలేదు. నా దేవుడు లేని వస్తువు ఏదైనా అది నాకు విలువ లేనిదే’ అన్నాడు హనుమంతుడు. ‘సరేనయ్యా! ఈ మణులలో నీ దేవుడైన రాముడు లేడు. పర్వతంలాంటి శరీరంతో తిరుగుతున్నావు కదా, అందులో మాత్రం ఉన్నాడేమిటి?’ అన్నాడు విభీషణుడు. ఆ మాటకు ఆవేశభరితుడైన హనుమంతుడు, తన పదునైన గోళ్లతో రొమ్ము చీల్చి గుండె తెరిచాడు. నివ్వెరపోతూ చూస్తున్న సభాసదులకు హనుమ హృదయంలో సీతారాములు కనిపించారు. వారంతా దిగ్భ్రాంతులయ్యారు. రాముడు హుటాహుటిన సింహాసనం దిగివచ్చి, హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. -సాంఖ్యాయన -
మందపాలుడి కథ
పూర్వం మందపాలుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు లపిత అనే భార్య ఉండేది. అయితే, వారికి సంతానం లేదు. మందపాలుడికి తపస్సు చేయాలనే కోరిక కలిగింది. వెంటనే బ్రహ్మచర్య దీక్ష వహించి, ఒక కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ వెయ్యేళ్లు ఘోర తపస్సు చేశాడు. తర్వాత యోగమార్గంలో ప్రాణత్యాగం చేశాడు. ప్రాణాలు వదిలిన తర్వాత ఊర్ధ్వ లోకాలకు పయనమయ్యాడు. పుణ్యలోకాల్లోకి ప్రవేశించకుండా దేవదూతలు అతడిని అడ్డుకున్నారు. ‘నన్నెందుకు అడ్డుకుంటున్నారు? వెయ్యేళ్లు తపస్సు చేసిన నాలాంటి తపస్సంపన్నుడైన మహర్షికి పుణ్యలోకాల్లో ప్రవేశం లేకపోవడానికి కారణం ఏమిటి? నేనే పాపం చేశాను?’ అని మందపాలుడు దేవదూతలను నిలదీశాడు. ‘ఎంత తపస్సు చేసినా ఏం ప్రయోజనం? సంతానం లేనిదే సద్గతులు సంప్రాప్తించవు. నువ్వు తిరిగి భూలోకానికి వెళ్లి, సంతానం పొంది వస్తే, అప్పుడు పుణ్యలోకాల్లోకి ప్రవేశించగలవు’ అని బదులిచ్చారు దేవదూతలు. మందపాలుడు మళ్లీ భూలోకానికి వచ్చేశాడు. త్వరితగతిన సంతానం పొందడం భూమ్మీద పక్షులకే సాధ్యమని, పక్షుల్లో లావుక పిట్టలు మరింత త్వరితగతిన సంతానం పొందగలవని గుర్తించి, లావుక పిట్టగా మారాడు. జరిత అనే లావుక పిట్టతో కాపురం చేసి, సంతానం పొందాడు. పక్షుల రూపంలో పుట్టినా, మందపాలుడి నలుగురు కుమారులూ బ్రహ్మజ్ఞానులు. సంతానం కలిగిన తర్వాత మందపాలుడు జరితకు, ఆమె నలుగురు కుమారులకు ఖాండవవనంలో ఒక గూడును ఏర్పరచాడు. కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత తన మొదటి భార్య లపిత దగ్గరకు బయలుదేరాడు.ఒకరోజు అతడికి మార్గమధ్యంలో ఖాండవవనం వైపు వస్తున్న అగ్నిదేవుడు ఎదురయ్యాడు. అగ్నిని చూడగానే, అతడు ఖాండవవనాన్ని దహించడానికే వస్తున్నాడని మందపాలుడికి అర్థమైపోయింది. అగ్నికీలల్లో తన భార్యకు, సంతానానికి ప్రాణగండం తప్పదని గ్రహించి, అగ్నిసూక్తాలు పఠిస్తూ ఎదురేగి, అగ్నికి నమస్కరించాడు. మందపాలుడి స్తోత్రాలకు అగ్నిదేవుడు ప్రసన్నుడయ్యాడు. ‘మహర్షీ! ఏమి కోరిక?’ అని అడిగాడు. ‘అగ్నిదేవా! ఈ ఖాండవవనంలోనే నా భార్య, నా నలుగురు కొడుకులు లావుక పిట్టల రూపంలో ఉన్నారు. ఖండవవనాన్ని దహించేటప్పుడు వాళ్ల మీద దయచూపు. వాళ్లకు ప్రాణహాని లేకుండా కాపాడు’ అని ప్రార్థించాడు. ఈ సంగతి జరితకు, ఆమె పిల్లలకు తెలియదు. సరేనంటూ అగ్నిదేవుడు మందపాలుడికి అభయమిచ్చాడు. కృష్ణార్జునుల అండతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం ప్రారంభించాడు. అగ్నిని నిలువరించడానికి వచ్చిన దేవేంద్రుడితో కృష్ణార్జులు యుద్ధం సాగించారు. వనాన్నంతటినీ అగ్నికీలలు దహించివేస్తూ దూసుకొస్తుండటంతో జరిత భయపడింది. రెక్కలు రాని కూనలను ఎలా రక్షించుకోగలననుకుని ఆమె దుఃఖించసాగింది. కూనలను వదిలేసి, తన మానాన తాను ఎగిరిపోవడానికి ఆమెకు మనసు రాలేదు. అందుకని ఆమె తన కొడుకులకు ఒక ఉపాయం చెప్పింది.‘బిడ్డలారా! ఈ చెట్టు కిందనే నేల మీద ఎలుకలు చేసిన బొరియ కనిపిస్తోంది. మీరు నెమ్మదిగా వెళ్లి అందులో దాక్కోండి. నేను బొరియ ప్రవేశమార్గాన్ని మట్టితో కప్పేస్తాను. అప్పడు మీకు అగ్ని వేడి సోకదు. అగ్ని చల్లారిన తర్వాత మనం మళ్లీ కలుసుకుందాం’ అంది.జరిత కూనలలో పెద్దవాడు జరితారి ‘అమ్మా! ఎలుకల బిలంలోకి వెళితే, అక్కడ మమ్మల్ని ఎలుకలు చంపి తినేస్తాయి. ఎలుకలకు ఆహారం కావడం కంటే, అగ్నికి ఆహుతైపోవడమే పుణ్యం. గాలితో పాటు అగ్ని మరోవైపు మళ్లితే, ఇక్కడే మేం బతికే అవకాశం ఉంటుంది. కనుక మేం ఇక్కడే ఉంటాం. నువ్వు ఎగిరి పారిపో! కనీసం నీకైనా ప్రాణాపాయం తప్పుతుంది. మేం కాలిపోయినా, నీకు మళ్లీ సంతానం కలుగుతుంది. ప్రాప్తముంటే మళ్లీ మేమే నీకు సంతానంగా కలగవచ్చు. నీ పుణ్యం వల్ల మేం బతికి బయటపడ్డామంటే మనం మళ్లీ కలుసుకోవచ్చు’ అని చెప్పాడు. ఇలా రకరకాలుగా నచ్చచెప్పి, నాలుగు కూనలూ తల్లిని సాగనంపాయి. ఇంతలో వనమంతా దహించేస్తూ ఉన్న అగ్ని పక్షికూనలు వైపు వచ్చాడు. మందపాలుడి కుమారులైన నలుగురూ వేదమంత్రాలతో అగ్నిదేవుడిని స్తుతించారు. అగ్ని వారికి అభయమిచ్చి, వారికి ఏ అపాయం లేకుండా కాపాడాడు.ఖాండవ దహనం పూర్తయి, అగ్ని చల్లారిన తర్వాత జరిత తిరిగి వచ్చింది. తన గూడు, పిల్లలూ క్షేమంగా ఉండటం చూసి సంతోషించింది. -
రింకూ సిక్సర్ సింగ్
అహ్మదాబాద్లో కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. గుజరాత్ 204 పరుగులు చేయగా.. భారీ లక్ష్యంతో కేకేఆర్ బరిలోకి దిగింది. మ్యాచ్ ముగింపు దశకు వచ్చే సరికి కోల్కతా ఓటమి దాదాపు ఖాయమైంది. విజయంపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. ఆట ఆఖరి ఓవర్కు చేరింది. చివరి 5 బంతుల్లో 28 పరుగులు కావాలి. అంటే కచ్చితంగా ప్రతి బంతికీ సిక్సర్ రావాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో గానీ అంతర్జాతీయ టి20ల్లో గానీ ఇది ఎప్పుడూ సాధ్యం కాలేదు. దాంతో గుజరాత్ ఆటగాళ్లు తమ గెలుపు ఖాయమైందని భావించి నిశ్చింతగా ఉన్నారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న ఆ యువకుడు అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. తన ఆటపై అచంచల విశ్వాసం ఉన్న అతను ఆ పరుగులు ఎందుకు సాధ్యం కావు అనుకున్నాడు. మానసికంగా కూడా ఎంతో దృఢమైన అతను బయటకు ఎలాంటి భావోద్వేగాలు చూపించలేదు. సిక్సర్ల కోసం సిద్ధమైపోయాడు. గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ ఒక్కో బంతిని వేస్తూ వచ్చాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు.. ఇలా బంతి స్టాండ్స్లోకి వెళుతూనే ఉంది. అనూహ్యం, అద్భుతం, అసాధారణం..లాంటి ఏ విశ్లేషణలకూ సరిపోని రీతిలో ఆ వీరంగం సాగింది. 6, 6, 6, 6, 6 .. ఐదు సిక్సర్లతో 30 పరుగులు రాబట్టి ఆ బ్యాటర్ జట్టును గెలిపించాడు. తన సత్తాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడే 26 ఏళ్ల రింకూ సింగ్. అతను ఒక్క రోజులో స్టార్గా మారేందుకు ఆ ఐపీఎల్ మ్యాచ్ ఒక వేదిక అయింది. అయితే ఈ ఐదు సిక్సర్లతో మాత్రమే రింకూ గొప్ప ఆటగాడిగా మారిపోలేదు. ఈ మ్యాచ్కంటే ముందు కూడా అతను ఈ స్థాయికి ఎదిగేందుకు కష్టపడిన తీరు, పోరాటం, పట్టుదల అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక్కడి వరకు సాగిన అతని ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. -మొహమ్మద్ అబ్దుల్ హాది కొంతకాలం కిందటి వరకూ క్రికెట్ అందరి ఆట. సామాన్యుడు కూడా తన ఆటతో ఉన్నత స్థాయికి చేరేందుకు మంచి అవకాశాలు మెండుగా ఉండేవి. అయితే ఐపీఎల్ కారణంగా క్రికెట్లో బాగా డబ్బు చేరడంతో అందులో అడుగుపెట్టి పైస్థాయికి చేరడం కష్టంగా మారిపోయిన పరిస్థితి. మంచి నేపథ్యం లేదా డబ్బు ఉండటం లేదా పెద్ద పరిచయాలు.. ఇలాంటివేవీ లేకుండా క్రికెట్ ప్రపంచంలో మనుగడ కష్టం. ఇది స్కూల్ క్రికెట్, అండర్ –13 స్థాయి నుంచే కనిపిస్తుంది. ఆటలో సత్తా ఉన్నా జట్టులో చోటు దక్కించుకోవడం, ప్రాథమిక దశలో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశాలు రావడం అంత సులువు కాదు. ఉత్తరప్రదేశ్లాంటి రాష్ట్ర సంఘాల్లో ఇది చాలా చాలా ఎక్కువ. అలాంటి చోట నెగ్గాలంటే అసాధారణ ప్రతిభ ఉండాలి. ఆ ప్లేయర్ ఆటను చూసి ఇక అతనిని ఆపలేమని, అవకాశం కల్పించక తప్పదనే పరిస్థితి కల్పించాలి. ఇక్కడే రింకూ సింగ్లాంటి కుర్రాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. తనలోని ఆట, ఆత్మవిశ్వాసమే అతడిని పైస్థాయి వరకు చేర్చింది. ఏ రకంగా చూసినా రింకూది కనీసం మధ్య తరగతి కూడా కాదు. అతని తండ్రి గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు సరఫరా చేసే ఉద్యోగి. అది తప్ప మరో ఆదాయవనరు లేదు. అలాంటి నేపథ్యంలో అతను క్రికెట్ను ఎంచుకోవడం పెద్ద సాహసమే. తండ్రి కూడా ఫలానాది చేయమని, వద్దని వారించే స్థితిలో లేడు. దాంతో చిన్న వయసులోనే అన్నీ తానై రింకూ సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొందరు మిత్రుల కారణంగా క్రికెట్ వైపు ఆకర్షితుడైన రింకూ కొద్ది రోజుల్లోనే అద్భుత ఆటగాడు అనే దశకు చేరాడు. తన నేపథ్యం కారణంగా స్కూల్ క్రికెట్ ఆడే అవకాశం అతనికి రాలేదు. కానీ క్లబ్ క్రికెట్లో రింకూ అనే ఒక కుర్రాడు ఉన్నాడని, భారీ షాట్లతో విరుచుకుపడతాడనే గుర్తింపు వచ్చింది. మరోవైపు సహజంగానే రోజూవారీ ఖర్చులకు సంబంధించి సమస్యలు వద్దనుకున్నా తోడొచ్చాయి. తనూ ఏదైనా పని చేస్తే తప్ప తనకూ, ఇంటికీ ఉపయోగపడలేడని అర్థమైంది. క్రికెట్ ఆడే టైమ్ మినహా తతిమా సమయాల్లో ఎలాంటి పని దొరికినా చేయడానికి సిద్ధపడ్డాడు. ఒక కోచింగ్ సెంటర్లో చిన్న చిన్న పనులతో పాటు స్వీపర్గా ఆఫీస్ను శుభ్రం చేసే పని కూడా చేశాడు. అయితే ఏనాడూ అతను ఈ విషయంలో చింతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో తన క్రికెట్ ఆట మాత్రం ఆగకూడదని ఆశించాడు. తన భవిష్యత్తుపై గట్టి నమ్మకం ఉంచాడు. అలా మొదలైన ఆట.. రింకూ దూకుడైన ఆట గురించి యూపీ క్రికెట్ వర్గాల్లో బాగా చర్చకు వచ్చింది. దాంతో 2013లో తొలిసారి యూపీ అండర్–16 జట్టులో చోటు లభించింది. ఆ ఎంపికతో అధికారికంగా అతని ఆటకు ఆమోద ముద్ర పడింది. ఆ తొలి అవకాశాన్ని అతను వృథా చేసుకోలేదు. బంతిని చూడటం, బలంగా బాదడం.. తనకు తెలిసిన విద్యనే అంతటా ప్రదర్శించి యూపీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా యూపీ అండర్–19 టీమ్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఉండే అండర్–19 స్థాయికి వచ్చాక రింకూ ప్రదర్శనలే అతని విలువేంటో చూపించాయి. ఆపై వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేని రీతిలో రింకూ ఆట సాగింది. మరోవైపు అండర్–16 స్థాయి నుంచే తనకు డైలీ అలవెన్స్ల రూపంలో వచ్చే చిన్న చిన్న మొత్తాలను కూడా పొదుపు చేసుకుంటూ.. ఇంటి ఖర్చుల కోసం దాచుకునే విషయంలో సగటు దిగువ మధ్య తరగతి మనస్తత్వాన్నే అనుసరించాడు. భారీ షాట్లు కొట్టడం, ఏ బౌలర్నైనా లెక్క చేయకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, కీలక సమయాల్లో కూడా ఒత్తిడి లేకుండా ఆడటం వంటి అర్హతలు రింకూ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ క్రమంలో 17 ఏళ్ల వయసులోనే యూపీ సీనియర్ వన్డే జట్టులో, టి20 టీమ్లో చోటు సంపాదించుకున్నాడు. త్రిపురతో జరిగిన వన్డేలో 44 బంతుల్లోనే 91 పరుగులు బాదడంతో అతను నిలబడగలడనే నమ్మకం కలిగింది. రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం రావడంతో దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రింకూ ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. ఐపీఎల్ ప్రస్థానం.. తమ టీమ్లోకి తీసుకునేందుకు ఐపీఎల్ జట్లు టాలెంట్ సెర్చ్ క్యాంప్లు నిర్వహిస్తుంటాయి. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ కూడా సెలక్షన్స్ ఏర్పాటు చేసింది. ఒక మ్యాచ్లో 18 ఏళ్ల రింకూ 31 బంతుల్లోనే 95 పరుగులు బాది సంచలనం సృష్టించాడు. చివరకు వేర్వేరు కారణాలతో ముంబై అవకాశం ఇవ్వకపోయినా కొద్దిరోజులకే అతని ప్రతిభ గురించి తెలిసిన పంజాబ్ జట్టు రూ. 10 లక్షలకు రింకూను సొంతం చేసుకుంది. తర్వాతి సీజన్లోనే 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస విలువతో అతను బరిలో నిలవగా, నాలుగు రెట్లు ఎక్కువగా రూ. 80 లక్షలకు కోల్కతా ఎంచుకుంది. ఇదే అతని కెరీర్లో మేలి మలుపు. తొలి మూడు సీజన్లలో తగినన్ని అవకాశాలు రాకపోయినా 2022లో ఫినిషర్గా ఇచ్చిన పాత్రలో అతను చెలరేగిపోయాడు. ముఖ్యంగా లక్నోతో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని విలువ తెలిసింది. ఈ సీజన్లోనైతే తన మెరుపు బ్యాటింగ్తో ప్రత్యేక ముద్ర వేసిన రింకూ కేకేఆర్ తరఫున టాప్స్కోరర్గా నిలవడం విశేషం. ఇదే ఆట రింకూకు భారత టి20 జట్టులో చోటు కల్పించగా అక్కడ చెలరేగిపోయిన ఈ యూపీ బ్యాటర్ 2024 టి20 వరల్డ్ కప్ కోసం తన అవకాశాలు మెరుగుపరచుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 6 ఇన్నింగ్సే ఆడిన రింకూ 96 బంతుల్లోనే 180 పరుగులు సాధించాడు. ఇందులో 134 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. హాస్టల్ సౌకర్యం కల్పించి.. భారత జట్టు క్రికెటర్గా ఎదిగినా రింకూ తన మూలాలను మర్చిపోలేదు. డబ్బు విలువ బాగా తెలిసినవాడిగా దానిని సమర్థంగా వాడుకోవడం కూడా ముఖ్యమని భావించాడు. ముందుగా తన ఇంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం అతను చేసిన పని రింకూపై మరింత గౌరవాన్ని పెంచింది. తన స్వస్థలమైన అలీగఢ్లో.. తాను ఓనమాలు నేర్చుకున్న కోచింగ్ సెంటర్లో క్రికెట్ నేర్చుకునేందుకు వచ్చే పేద ఆటగాళ్ల కోసం రూ. 50 లక్షలు వెచ్చించి.. హాస్టల్ బిల్డింగ్ కట్టించాడు. ఆట కోసం వచ్చి.. భారీ అద్దెలు కడుతున్నవారి కోసమే ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అతను చెప్పాడు. -
బాయి దాహం
‘ఈ బాయికి దాహం జాస్తి! ఎబ్బుడు తీర్తాదో ఏమో!’ హఠాత్తుగా అంది వెంకటలక్ష్మి. ‘బావికి దాహం ఏందే ఎర్రి ఎంకటమ్మా’ నవ్వేసింది రోజా. ‘అసలు ఈ బావే ఎంతమంది దాహం తీర్చిందో.. ఎన్ని పంటలకు నీళ్లిచ్చిందో కదా!’ బావి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ అంది. అది చాలా పెద్ద దిగుడు బావి. దాని లోతు ఎన్ని మట్లో ఎవరికీ తెలీదు. పేరే పెద్ద బావి! నిండు వేసవిలో కూడా అందులో నీళ్లు తగ్గవు. వేసిన ప్రతి పంటా సిరుల పంటే! ఒకప్పుడు.. తాతల కాలంలో.. ఏతం తొక్కడం, కపిల బానలతో బావిలో నుండి నీళ్లు తోడి పొలాలకు పారించే వాళ్ళట. ఇప్పుడు తండ్రి హయాంలో మోటర్లు బిగించారు. స్విచ్ వేయడం ఆలస్యం నీళ్లు పైపుల నుండి దూకుతాయి. కరెంటు కోతే తప్ప నీళ్ల కొరత ఎప్పుడూ లేదు. ‘పద్దన అమ్మ నన్ను ‘ఎంకటా’ అని పిలిస్తే నువ్వేమంటివీ?’ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని గంభీరంగా చూస్తూ నిలదీసింది వెంకటలక్ష్మి. ‘ఏమన్నానబ్బా?’ గుర్తు తెచ్చుకుంది రోజా. ‘ఎంకటి వుండబట్టిగానీ లేపోతే నేనేం చేసుందును? మీ అప్పను చూసేదానికి వచ్చేవాల్లు .. పోయేవాల్లు.. ఇల్లంతా తిరనాల మాదిరి ఉండె. ఇంట్లో పని.. వంట పని మొత్తమంతా ఆ బిడ్డే సమాళించింది.’ అమ్మ మాటలకు తను చిరాకు పడింది వెంకటలక్ష్మి వేపు మెచ్చుకోలుగా చూస్తూనే! ‘ఎంకటి ఏంది మా సంకటి మాదిరి. దాని పేరు వెంకటలక్ష్మి. మా వెంకటరెడ్డి సారు దానికి ఆ పేరు పెట్టి రిజిస్టర్లో రాసినారు తెల్సా!’ ‘ఆ! ఆ! తెల్సులే! బడిలో చేరిన చానామంది పిల్లోల్లకి ఆ పేరే పెట్టినాడంట కదా ఆ ఎంకట్రెడ్డి సారు? ఆడపిలకాయలకు ఎంకటలక్ష్మి.. మగ పిలకాయలకు ఎంకటేసూ అనీ! ఆ యప్పకు ఆయన పేరు అంటే ఇస్టమో లేపోతే ఆ ఎంకటేస్పర సామంటే భకితో మల్ల!’ అమ్మ నవ్వుతూ అంది. ‘అది నిజమే! అయినా నేను తప్ప దీన్ని ‘వెంకటలక్ష్మి’ అని ఎవరూ పిలవలా! ఆఖరికి పేరు పెట్టిన మా సారు కూడా! అందరూ ఎంకటా.. ఎంకటమ్మా అనేవాళ్ళే!’ కినుకగా అంటున్న తన మాటలకు అందరూ నవ్వేసుకున్నారు. ఇప్పుడు నవ్వొచ్చేసింది ఇద్దరికీ. ‘సారీ బా! అలవాట్లో పొరపాటు. అవునూ.. మన వెంకట రెడ్డి సారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరగలాడుతారా?’ ఆసక్తిగా అడిగింది రోజా. ‘ఆహా! బొంగరం మాదిరి. మొన్నో దినం మీ అప్పని చూసేదానికి కూడా వొచ్చినారు. పక్క పల్లెలోనే సారు ఉండేది.’ ‘అవునా! ఒకసారి పోయి చూసి వద్దామే సారును! మనకు అక్షరాభ్యాసం చేసిన గురువు కదా!’ ‘ఎబ్బుడొచ్చినా పట్టు పట్టుమని పోడమే గాని నాలుగు దినాలుండినావా ఎబ్బుడన్నా? ఉడుకు నీల్లు కాల్ల మింద పోసుకొని వొచ్చినట్టు వొస్తావు. ఇబ్బుటికో మాపటేలకో మీ ఇంటాయన పోన్ చేస్తే తెల్లారే బస్సెక్కెయ్యవూ?’ నవ్వింది వెంకటలక్ష్మి. ‘లేదులేవే! పద్దినాలు రానని చెప్పొచ్చినాలే! అప్పను చూస్తేనే బాధగా వుందే! పెద్దపులి మాదిరి ఉండేవాడు.. ఇప్పుడు ఇట్లా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నా!’ రోజా కళ్ళు చెమర్చాయి. ‘సావాల్సింది’ వెంకటలక్ష్మి మాట పదునుకు అదిరిపడింది రోజా. ‘ఏమంటివే?’ రోజా గొంతులో కోపం కళ్ళల్లో ఎరుపును నింపింది. ‘ఆ! డాక్టర్ చెప్పిండ్లా! బీపీ తలక్కొడితే సానామంది గుండాగి సత్తారంట కదా! మీ అప్ప అదృస్టం.. కాలు సెయ్యి పడిపోయినా ప్రానంతో వుండాడు కదా మనిసి’ వెంకటలక్ష్మి మాటల్లో అమాయకతకు రోజా లజ్జపడింది తన తొందరపాటు కోపానికి. ‘అవును అమ్మ అయిదోతనమే అప్పను కాపాడిందన్నారు అందరూ! కానీ ఇంటికి, పొలానికి, పట్నానికి తిరుగుతూ ఉండే కాలు.. అడుగు వేయలేని ఇప్పటి పరిస్థితికి.. హూంకరింపులతోనే దడిపించే నోరు.. వంకర పోయి మాట స్పష్టంగా పలకలేని నిస్సహాయతకు అప్ప ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో..’ అనుకుంటుంటే కడుపులో దేవినట్లైంది రోజాకు. ‘వెంకటలక్ష్మి! మా అప్పకు మీ అప్ప చేసే సేవ.. నువ్వు అమ్మకు అన్ని విధాలా సహాయంగా ఉండటం.. నిజంగా మీ ఇద్దరికీ చాలా థాంక్సే! మీ రుణం తీర్చలేనిది’ రోజా మనస్ఫూర్తిగా అంది వెంకటలక్ష్మి చేయి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. ‘అయ్యో! అదేంమాట? అమ్మ సేతి కూడు తిని బతికే మాకు తాంక్స్ ఎందుకు? అమ్మ మల్లిపూలు కోసుకు రమ్మనింది. కోద్దాం రా!’ అంటూ వెంకటలక్ష్మి మల్లెచెట్టు వైపు నడిచింది. ‘అమ్మకీ దొంతు మల్లిపూలంటే సానా ఇస్టం!’ పంటల నాట్లు, కోతలప్పుడు, చెరుకు గానుగలాడేనప్పుడు తండ్రి ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడు. భోజనం చేయడానికి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడే ఓ చిన్న గది కట్టించాడు.. ఇదివరకు ఉన్న పాకను పీకేయించి. రోజా మెల్లగా గది తలుపు తీసి లోపలికి వెళ్ళబోయి ఆగిపోయింది. ఆమె చూపులు క్షణం పాటు గదిని పరిశీలనగా చూసి చికిలించుకుపోయాయి. వెంటనే తలుపు మూసేసి మల్లెచెట్టు వైపు నడిచింది. మల్లెపొద కింద కూర్చుని వెంకటలక్ష్మి ఏడుస్తోంది. రోజా గాభరాగా వెళ్లి పక్కన కూర్చుని వెంకటలక్ష్మి భుజం చుట్టూ చెయ్యేసి ‘ఏంటిది వెంకటలక్ష్మి! ఊర్కో!’ అంది. ‘ఈ బాయికి ఎంతమంది ఉసుర్లు తీస్కొన్నా దాహం తీరలే! కడాకు నా రాముడ్ని కూడా..’ వెక్కివెక్కి ఏడుస్తున్న వెంకటలక్ష్మిని ఓదార్చడం రోజా వల్ల కాలేదు. ‘పోయినోళ్లు పుణ్యాత్ములు! ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటారు. రాముడు ఎక్కడికి పోతాడు? నీ కడుపులో పెరుగుతున్నాడు కదా! బాధపడకు వెంకటలక్ష్మీ! బిడ్డ కోసమన్నా నువ్వు మనసు నిబ్బరం చేసుకోవాలి’ ఓదార్పుగా అంది రోజా. ‘అవును మా! నా బిడ్డ కోసమే బతికుండా. లేపోతే రాముడ్తో పాటే పొయుండనా?’ ఏడుస్తూనే ఉంది వెంకటలక్ష్మి. బావి దగ్గర బురదలో జారి.. బావిలో పడబోతున్న తండ్రిని లాగి పడేసి తను బావిలోకి జారిపోయాడని చెప్పారు. ఆ షాక్లో.. హై బీపీతో అప్పకు పక్షవాతం వచ్చింది. వెంకటలక్ష్మి అరుపులకు.. కాస్త దూరంగా పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు వచ్చి అప్పను ఇంటికి తీసుకుపోయే హడావిడిలో పడ్డారు. కానీ నీళ్లలో పడ్డ రామున్ని గుర్తించలేదు. వెంకటలక్ష్మి భయంతో, దుఃఖంతో సొమ్మసిల్లి పడిపోయింది.తనకు తెలివి వచ్చేసరికి రాముడు వాకిట్లో దీపం ముందు పడుకోబెట్టబడి ఉన్నాడు. ఆమె దుఃఖ సముద్రమే అయింది. ఇప్పటికీ విచారం, విషాదం నిండిన దుఃఖపు అలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కడుపులో బిడ్డ కోసం గుండెలవిసే దుఃఖానికి కంటి రెప్పల చెలియలికట్ట వేసుకొని భారంగా శరీరాన్ని, మనసును మోస్తోంది. చిన్నప్పుడు తాము ఈ బావి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు? ఎండాకాలం సెలవుల్లో మగ పిల్లలంతా ఈ బావిలోనే ఈత కొట్టేవాళ్ళు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు బెండు కట్టి ఈత నేర్పేవాళ్లు. పెద్ద పిల్లలకు కూడా ఈత నేర్పేంత ఈతగాడు రాముడు. వాడు బావిలోకి దూకే విధానం, నీళ్లలో వేసే మునకలు వేగంగా ఈత కొట్టడం.. చాలా ముచ్చటగా, థ్రిల్లింగ్ గానూ ఉండేది చూసే తమకు. వెంకటలక్ష్మి మరీ మురిపెంగా చూసేది. రాముడు తనకు మేనమామ కొడుకే. ఎల్లమ్మ జాతరకు వచ్చిన రాముడి తల్లి ప్రమాదవశాత్తు ఇదే బావిలో పడి చనిపోతే రాముడ్ని తమ ఇంట్లోనే పెట్టుకొని పెంచారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు. తర్వాత కొంత కాలానికే అనూహ్యంగా ఇదే బావిలో పడి వెంకటలక్ష్మి తల్లి కూడా చనిపోతే ఇద్దర్నీ వెంకటలక్ష్మి నానమ్మే సాకింది. ‘ఒరేయ్! మాకు కూడా ఈత నేర్పీరా!’ అని తను, వెంకటలక్ష్మి కూడా రాముడ్ని బతిమిలాడే వాళ్ళు. ‘దీనికి నేర్పిస్తా! నీకు మాత్తరం నేర్పీను. అమ్మో! మీ అప్ప పెద్దపులి. నాకు భయమబ్బా’ అనేవాడు రాముడు. వెంకటలక్ష్మికి నేర్పాడు కూడా. ఈత కొడుతూ కేరింతలాడే వాళ్ళని చూస్తూ తను ఉక్రోష పడేది. వాళ్ళిద్దరి చిన్ననాటి నెయ్యం మూడుముళ్ల బంధం అయింది. చూడ చక్కని జంట! చిలుకాగోరింకల్లా అన్యోన్యంగా, ఆనందంగా వున్న ఆ జంటను చూసి విధికే కన్ను కుట్టిందేమో! మృత్యువు .. బావి రూపంలో వచ్చి రాముడ్ని మింగేసింది. ‘వెంకటలక్ష్మీ! రాముడు గజ ఈతగాడు కదా? వాడు నీళ్లలో మునిగి చనిపోవడం ఏమిటి?’ హఠాత్తుగా అడిగింది రోజా. ‘మొక్కే దేముడే యముడై ముంచేస్తే ఏం చేస్తాములే మా!’ నిర్లిప్తంగా అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. ‘అదేమట్లంటావు? అసలేం జరిగిందా రోజు? నువ్విక్కడే వున్నావుగా?’ రోజా దీర్ఘంగా చూస్తూ అడిగింది. ‘ఏమి జరక్కూడదో అదే జరిగిపోయినంక ఇంగిపుడు ఏంజేస్తాములే మా!’ నిర్వేదంగా అంది వెంకటలక్ష్మి. ‘బాయిలో పడేనబ్బుడు గోడకు తగిలి తల పగిలిందన్నారు’ శుష్కహాసం చేసింది. ‘అయినా గడా ఈ బాయికి ఎంత దాహమో! మాయమ్మ, అత్త, ఊర్లో చానా మంది ఆడవాళ్ల ఉసుర్లు.. కడాకు నా రాముడి ఉసురు గడా పోసుకొనింది. దీనికి వాయి వరసా లేదు’ వెంకటలక్ష్మి మాటలు కోపం, దుఃఖం, బాధ కలగలిపి జీరగా ఉన్నాయి. ‘అది కాదు వెంకటలక్ష్మీ..’ రోజా ఏదో అనబోయేంతలో మధ్యలో కలగజేసుకుంది వెంకటలక్ష్మి.. ‘అంతంత పెద్ద సదువులు సదివినావు కదా! ఏదొక దినం నీకే అర్తమవుతాది లే. పదమా! అమ్మ ఎదురు సూస్తాంటాది’ అంటూ ముందుకు నడిచింది.. కోసిన మల్లెమొగ్గలు కొంగులో మూటకట్టుకొంటూ!‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా!’ రెడ్డెప్పకు కాలు, చెయ్యి నూనె మసాజ్, స్నానం చేపించి.. బట్టలు తొడిగి.. టిఫిన్ తినిపించి.. టీవీ ముందు వాలు కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన కుప్పడికి చద్దన్నం పెడుతూ అంది సావిత్రమ్మ. కుప్పడు ఇడ్లీలు, దోశలు తినడు. మూడు పూటలా అన్నమే కావాలంటాడు. ఆ రోజు శుక్రవారం. తలారా స్నానం చేసి తన పొడవాటి జుట్టును కింద జారుముడి వేసి ఇంత మల్లెపూల దండ పెట్టుకుంది. పసుపు రాసిన మొహంలో పావలా కాసంత నిండు ఎరుపు కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతున్న సావిత్రమ్మను అలా చూస్తూ ఉండిపోయాడు కుప్పడు తినడం కూడా మర్చిపోయి. ‘పర్వాలేదు లేరా బాద, కస్టం, ఏడుపూ.. అన్నీ మర్చిపోతిన్లేరా! అసలుకు అయ్యన్నీ అలవాటైపోయిండ్లా? ఎదిరించడం, ఎదురు మాటాడటం.. తెలీకుండానే మన కాలం గడిచిపోయ కదా! మన బిడ్డలు బాగుంటే సాలనుకుంటిమి. కానీ.. దేముడని నమ్మితే.. నీకు, నీ బిడ్డకు గడా అన్నాయమే చేసినాడా ముండా దేముడు. ఆ పొద్దు నీ పెండ్లాన్ని, చెల్లిని, ఇబ్బుడు నీ అల్లుడ్ని గడా తీస్కపోయి’ గద్గదంగా అంది సావిత్రమ్మ. ఆమె కళ్ళు ఉబ్బి, మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. కుప్పడు మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు గానీ గుండెలో అదురు పుట్టింది. సావిత్రమ్మ మాటలు వింటున్న వెంకటలక్ష్మి కూడా బొమ్మలా అయిపోయి అలా చూస్తోంది. ఇద్దరి కళ్ళూ ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. అది చూసి ‘ఏంరా కుప్పా? ఏమైందీ’ సావిత్రమ్మ కంగారుగా అడిగింది. ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ చేతిలోని పచ్చిమిరపకాయ చూపించాడు కుప్పడు. ‘నువ్వెందుకు ఏడస్తాండావే ఎంకటమ్మా?’ వెంకటలక్ష్మి వేపు తిరిగింది సావిత్రమ్మ. వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న చాటలో తను తొక్క తీస్తున్న ఉల్లిపాయలు చూపింది. ‘బాగుండాదిలే మీ కత! నిన్ను మిరపకాయ, దాన్ని ఎర్రగడ్డ ఏడ్పిస్తాండాయా?’ నిట్టూర్చింది సావిత్రమ్మ. ‘అది సరే.. చిన్న బిడ్డ.. ఎర్రగడ్డ గాటు తట్టుకోలేదు. నీకేందిరా కుప్పా? ఇంత జీవితం చూసినంక గడా అంతంత కారం మింగినాక గడా ఇంగా ఏడుస్తాంటే ఎట్లా ? తిను. తిను. తినేసి రెడ్డెప్పను బాయి కాడికి తొడ్కో పో! ఎంకటమ్మను నీ కూడా తీస్కపో! తోడుంటాది. ఇద్దురూ భద్రం! ముందూ ఎనకా చూస్కోండి’ జాగ్రత్తలు చెప్తూనే సావిత్రమ్మ దేవుని గదిలోకి వెళ్ళిపోయింది. ‘అప్పా! నెలలు నిండిపోయినాయంట. రెండు మూడు దినాల్లో పురుడొచ్చేస్తాదని సెప్పింది నర్సమ్మ. పుట్టేది రాముడే. వాడీ భూమ్మీద పడేలోగా..’ పొద్దున గొడ్లచావిట్లో తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న వెంకటలక్ష్మి.. సావిత్రమ్మను చూసి మాట మింగేసింది. ఆమె ప్రతి శుక్రవారం గోపూజ చేస్తుంది. పూజా సామగ్రి పళ్ళెంతో వచ్చింది. ‘తొలి కాపు కదమా! బిడ్డ బయపడతాంది’ కుప్పడు సావిత్రమ్మను చూసి తడబడ్డాడు. ‘తల్లి లేని బిడ్డ. తొలి కానుపు భయం ఉంటాదిలే! ఇంట్లో ఆడదిక్కు లేదు. తోడుగా మీ చెల్లిని రమ్మన్నానంటివే! ఇంగా రాలేదా?’ కుప్పడు ఒళ్ళంతా తోమి, కడిగి తయారుగా వుంచిన ఆవు నొసట్న పసుపు కుంకుమ పెడుతూ అడిగింది. ‘చెనిగి చెట్లు పెరకతాండారంటమా! ఈ పొద్దు అయిపోతాది రేపటికంతా వొచ్చేస్తానని చెప్పింది’ చెప్పాడు కుప్పడు. ‘సరే! అయినా గడా ఎంకట్లక్ష్మి పే..ద్ద ధైర్నవంతురాలని రోజమ్మ అంటాంటాంది. నువ్వేమిట్లా ఎర్రిగొడ్డులా ఏడస్తాండావు?’ అంది సావిత్రమ్మ ఆవు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ! ‘మనూరి నర్సమ్మ చెయ్యివాసి మంచిది. నీకేం కాదులేమే! మంచిగా కానుపైతాదిలే! ఆ దేముడు, రాముడు నీకు తోడుంటార్లే!’ ధైర్యం చెప్పింది. సావిత్రమ్మ.. రెడ్డెప్పను బావి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తండ్రీ కూతుళ్ళు! కూడబలుక్కున్నట్లుగా ఇద్దరూ ఒకేసారి లేచి నిలబడ్డారు కళ్ళు తుడుచుకొంటూ! ‘అప్ప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడనేలేదు. కర్రసాయం లేకండా నడవలేడు. ఆయన అడిగితే మాత్రం నువ్వు ఎట్లా పంపించినావు మా బావి దగ్గరకు? అక్కడేమి పుట్టి మునిగిపోతా ఉందని?’ రోజా తల్లిని నిలదీసింది నిష్ఠూరంగా. తండ్రి చనిపోయి దశ దిన కర్మలు ముగిశాక.. బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయాక తల్లి కూతుర్లు మిగిలారు ఇంట్లో. బావి దగ్గరికి వెళ్లిన తండ్రి కాలుజారి బావిలో పడిపోయాడు. కాపాడాలని కుప్పడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘ఏం చేసేది రోజమ్మా? ఆయనే పొద్దు నా మాట యిన్నాడని? అసలుకు ఏమన్నా ఎదురు చెప్పే ధైర్నమన్నా నాకుండేనా? అయినా.. కిష్ణుడు గీతలో చెప్పినట్టు నా మాట నిమిత్తమాత్తరమే! ఆయన సావు ఆయనే తెచ్చుకొన్యాడు.’ ‘నువ్వే తీసుకుపొమ్మన్నావని చెప్పినాడే కుప్పడు?’ సాలోచనగా చూసింది తల్లి వైపు. ‘అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. ముందు దాని దుక్క బారం తీరాల. అబ్బుడే అది కనే బిడ్డను సంతోసంగా సాకతాది అన్పించె నాకు. కడుపుతో వున్న.. తల్లి లేని బిడ్డ కోరికను తల్లి మాదిరి తీర్చల్ల కదా!’ సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా, నిర్విచారంగా, నిర్వేదంగా చెబుతుంటే రోజా గుడ్లప్పగించి చూస్తోంది. తానేం అడిగింది.. తల్లి ఏం చెబుతోంది? అర్థంకాని అయోమయం! హఠాత్తుగా ఆమె కళ్ళల్లో తానా రోజు బావి దగ్గర గదిలో చూసిన చిందరవందర సామాను, ఎండిపోయిన మల్లెపూల దండలు, పగిలిన గాజు ముక్కల దృశ్యం కదలాడింది. ‘బాయిలో వున్న ఎంతోమంది ఉసుర్లు సంతోసంగా, ప్రెసాంత బడిన దినాన బాయి దాహం తీర్తాది’ వెంకటలక్ష్మి కసి మాటలు గుర్తొచ్చాయి. ఊర్లో వాళ్ళు, బంధువులు, సేద్యగాళ్ళు, పొలం పనులకు వచ్చే కూలి వాళ్ళు ‘లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి’ అని పొగుడుకొనే అమ్మలో దుష్టశిక్షణ చేసే ఒక కాళికా మాత కనిపించింది రోజా కళ్ళకి. తల్లి దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంటే ఆమె బుగ్గ తడి తియ్యగా తగిలింది. ‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా! ‘ఈ బాయికి దాహం జాస్తి! ఎబ్బుడు తీర్తాదో ఏమో!’ హఠాత్తుగా అంది వెంకటలక్ష్మి. ‘బావికి దాహం ఏందే ఎర్రి ఎంకటమ్మా’ నవ్వేసింది రోజా. ‘అసలు ఈ బావే ఎంతమంది దాహం తీర్చిందో.. ఎన్ని పంటలకు నీళ్లిచ్చిందో కదా!’ బావి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ అంది. అది చాలా పెద్ద దిగుడు బావి. దాని లోతు ఎన్ని మట్లో ఎవరికీ తెలీదు. పేరే పెద్ద బావి! నిండు వేసవిలో కూడా అందులో నీళ్లు తగ్గవు. వేసిన ప్రతి పంటా సిరుల పంటే! ఒకప్పుడు.. తాతల కాలంలో.. ఏతం తొక్కడం, కపిల బానలతో బావిలో నుండి నీళ్లు తోడి పొలాలకు పారించే వాళ్ళట. ఇప్పుడు తండ్రి హయాంలో మోటర్లు బిగించారు. స్విచ్ వేయడం ఆలస్యం నీళ్లు పైపుల నుండి దూకుతాయి. కరెంటు కోతే తప్ప నీళ్ల కొరత ఎప్పుడూ లేదు. ‘పద్దన అమ్మ నన్ను ‘ఎంకటా’ అని పిలిస్తే నువ్వేమంటివీ?’ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని గంభీరంగా చూస్తూ నిలదీసింది వెంకటలక్ష్మి.‘ఏమన్నానబ్బా?’ గుర్తు తెచ్చుకుంది రోజా.‘ఎంకటి వుండబట్టిగానీ లేపోతే నేనేం చేసుందును? మీ అప్పను చూసేదానికి వచ్చేవాల్లు .. పోయేవాల్లు.. ఇల్లంతా తిరనాల మాదిరి ఉండె. ఇంట్లో పని.. వంట పని మొత్తమంతా ఆ బిడ్డే సమాళించింది.’అమ్మ మాటలకు తను చిరాకు పడింది వెంకటలక్ష్మి వేపు మెచ్చుకోలుగా చూస్తూనే! ‘ఎంకటి ఏంది మా సంకటి మాదిరి. దాని పేరు వెంకటలక్ష్మి. మా వెంకటరెడ్డి సారు దానికి ఆ పేరు పెట్టి రిజిస్టర్లో రాసినారు తెల్సా!’ ‘ఆ! ఆ! తెల్సులే! బడిలో చేరిన చానామంది పిల్లోల్లకి ఆ పేరే పెట్టినాడంట కదా ఆ ఎంకట్రెడ్డి సారు? ఆడపిలకాయలకు ఎంకటలక్ష్మి.. మగ పిలకాయలకు ఎంకటేసూ అనీ! ఆ యప్పకు ఆయన పేరు అంటే ఇస్టమో లేపోతే ఆ ఎంకటేస్పర సామంటే భకితో మల్ల!’ అమ్మ నవ్వుతూ అంది. ‘అది నిజమే! అయినా నేను తప్ప దీన్ని ‘వెంకటలక్ష్మి’ అని ఎవరూ పిలవలా! ఆఖరికి పేరు పెట్టిన మా సారు కూడా! అందరూ ఎంకటా.. ఎంకటమ్మా అనేవాళ్ళే!’ కినుకగా అంటున్న తన మాటలకు అందరూ నవ్వేసుకున్నారు. ఇప్పుడు నవ్వొచ్చేసింది ఇద్దరికీ. ‘సారీ బా! అలవాట్లో పొరపాటు. అవునూ.. మన వెంకట రెడ్డి సారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరగలాడుతారా?’ ఆసక్తిగా అడిగింది రోజా. ‘ఆహా! బొంగరం మాదిరి. మొన్నో దినం మీ అప్పని చూసేదానికి కూడా వొచ్చినారు. పక్క పల్లెలోనే సారు ఉండేది.’ ‘అవునా! ఒకసారి పోయి చూసి వద్దామే సారును! మనకు అక్షరాభ్యాసం చేసిన గురువు కదా!’ ‘ఎబ్బుడొచ్చినా పట్టు పట్టుమని పోడమే గాని నాలుగు దినాలుండినావా ఎబ్బుడన్నా? ఉడుకు నీల్లు కాల్ల మింద పోసుకొని వొచ్చినట్టు వొస్తావు. ఇబ్బుటికో మాపటేలకో మీ ఇంటాయన పోన్ చేస్తే తెల్లారే బస్సెక్కెయ్యవూ?’ నవ్వింది వెంకటలక్ష్మి. ‘లేదులేవే! పద్దినాలు రానని చెప్పొచ్చినాలే! అప్పను చూస్తేనే బాధగా వుందే! పెద్దపులి మాదిరి ఉండేవాడు.. ఇప్పుడు ఇట్లా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నా!’ రోజా కళ్ళు చెమర్చాయి. ‘సావాల్సింది’ వెంకటలక్ష్మి మాట పదునుకు అదిరిపడింది రోజా. ‘ఏమంటివే?’ రోజా గొంతులో కోపం కళ్ళల్లో ఎరుపును నింపింది. ‘ఆ! డాక్టర్ చెప్పిండ్లా! బీపీ తలక్కొడితే సానామంది గుండాగి సత్తారంట కదా! మీ అప్ప అదృస్టం.. కాలు సెయ్యి పడిపోయినా ప్రానంతో వుండాడు కదా మనిసి’ వెంకటలక్ష్మి మాటల్లో అమాయకతకు రోజా లజ్జపడింది తన తొందరపాటు కోపానికి. ‘అవును అమ్మ అయిదోతనమే అప్పను కాపాడిందన్నారు అందరూ! కానీ ఇంటికి, పొలానికి, పట్నానికి తిరుగుతూ ఉండే కాలు.. అడుగు వేయలేని ఇప్పటి పరిస్థితికి.. హూంకరింపులతోనే దడిపించే నోరు.. వంకర పోయిమాటస్పష్టంగా పలకలేని నిస్సహాయతకు అప్ప ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో..’ అనుకుంటుంటే కడుపులో దేవినట్లైంది రోజాకు. ‘వెంకటలక్ష్మి! మా అప్పకు మీ అప్ప చేసే సేవ.. నువ్వు అమ్మకు అన్ని విధాలా సహాయంగా ఉండటం.. నిజంగా మీ ఇద్దరికీ చాలా థాంక్సే! మీ రుణం తీర్చలేనిది’ రోజా మనస్ఫూర్తిగా అంది వెంకటలక్ష్మి చేయి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. ‘అయ్యో! అదేంమాట? అమ్మ సేతి కూడు తిని బతికే మాకు తాంక్స్ ఎందుకు? అమ్మ మల్లిపూలు కోసుకు రమ్మనింది. కోద్దాం రా!’ అంటూ వెంకటలక్ష్మి మల్లెచెట్టు వైపు నడిచింది. ‘అమ్మకీ దొంతు మల్లిపూలంటే సానా ఇస్టం!’ పంటల నాట్లు, కోతలప్పుడు, చెరుకు గానుగలాడేనప్పుడు తండ్రి ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడు. భోజనం చేయడానికి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడే ఓ చిన్న గది కట్టించాడు.. ఇదివరకు ఉన్న పాకను పీకేయించి. రోజా మెల్లగా గది తలుపు తీసి లోపలికి వెళ్ళబోయి ఆగిపోయింది. ఆమె చూపులు క్షణం పాటు గదిని పరిశీలనగా చూసి చికిలించుకుపోయాయి. వెంటనే తలుపు మూసేసి మల్లెచెట్టు వైపు నడిచింది. మల్లెపొద కింద కూర్చుని వెంకటలక్ష్మి ఏడుస్తోంది. రోజా గాభరాగా వెళ్లి పక్కన కూర్చుని వెంకటలక్ష్మి భుజం చుట్టూ చెయ్యేసి ‘ఏంటిది వెంకటలక్ష్మి! ఊర్కో!’ అంది. ‘ఈ బాయికి ఎంతమంది ఉసుర్లు తీస్కొన్నా దాహం తీరలే! కడాకు నా రాముడ్ని కూడా..’ వెక్కివెక్కి ఏడుస్తున్న వెంకటలక్ష్మిని ఓదార్చడం రోజా వల్ల కాలేదు. ‘పోయినోళ్లు పుణ్యాత్ములు! ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటారు. రాముడు ఎక్కడికి పోతాడు? నీ కడుపులో పెరుగుతున్నాడు కదా! బాధపడకు వెంకటలక్ష్మీ! బిడ్డ కోసమన్నా నువ్వు మనసు నిబ్బరం చేసుకోవాలి’ ఓదార్పుగా అంది రోజా. ‘అవును మా! నా బిడ్డ కోసమే బతికుండా. లేపోతే రాముడ్తో పాటే పొయుండనా?’ ఏడుస్తూనే ఉంది వెంకటలక్ష్మి. బావి దగ్గర బురదలో జారి.. బావిలో పడబోతున్న తండ్రిని లాగి పడేసి తను బావిలోకి జారిపోయాడని చెప్పారు. ఆ షాక్లో.. హై బీపీతో అప్పకు పక్షవాతం వచ్చింది. వెంకటలక్ష్మి అరుపులకు.. కాస్త దూరంగా పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు వచ్చి అప్పను ఇంటికి తీసుకుపోయే హడావిడిలో పడ్డారు. కానీ నీళ్లలో పడ్డ రామున్ని గుర్తించలేదు. వెంకటలక్ష్మి భయంతో, దుఃఖంతో సొమ్మసిల్లి పడిపోయింది.తనకు తెలివి వచ్చేసరికి రాముడు వాకిట్లో దీపం ముందు పడుకోబెట్టబడి ఉన్నాడు. ఆమె దుఃఖ సముద్రమే అయింది. ఇప్పటికీ విచారం, విషాదం నిండిన దుఃఖపు అలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కడుపులో బిడ్డ కోసం గుండెలవిసే దుఃఖానికి కంటి రెప్పల చెలియలికట్ట వేసుకొని భారంగా శరీరాన్ని, మనసును మోస్తోంది. చిన్నప్పుడు తాము ఈ బావి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు? ఎండాకాలం సెలవుల్లో మగ పిల్లలంతా ఈ బావిలోనే ఈత కొట్టేవాళ్ళు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు బెండు కట్టి ఈత నేర్పేవాళ్లు. పెద్ద పిల్లలకు కూడా ఈత నేర్పేంత ఈతగాడు రాముడు. వాడు బావిలోకి దూకే విధానం, నీళ్లలో వేసే మునకలు వేగంగా ఈత కొట్టడం.. చాలా ముచ్చటగా, థ్రిల్లింగ్ గానూ ఉండేది చూసే తమకు. వెంకటలక్ష్మి మరీ మురిపెంగా చూసేది. రాముడు తనకు మేనమామ కొడుకే. ఎల్లమ్మ జాతరకు వచ్చిన రాముడి తల్లి ప్రమాదవశాత్తు ఇదే బావిలో పడి చనిపోతే రాముడ్ని తమ ఇంట్లోనే పెట్టుకొని పెంచారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు. తర్వాత కొంత కాలానికే అనూహ్యంగా ఇదే బావిలో పడి వెంకటలక్ష్మి తల్లి కూడా చనిపోతే ఇద్దర్నీ వెంకటలక్ష్మి నానమ్మే సాకింది. ‘ఒరేయ్! మాకు కూడా ఈత నేర్పీరా!’ అని తను, వెంకటలక్ష్మి కూడా రాముడ్ని బతిమిలాడే వాళ్ళు. ‘దీనికి నేర్పిస్తా! నీకు మాత్తరం నేర్పీను. అమ్మో! మీ అప్ప పెద్దపులి. నాకు భయమబ్బా’ అనేవాడు రాముడు. వెంకటలక్ష్మికి నేర్పాడు కూడా. ఈత కొడుతూ కేరింతలాడే వాళ్ళని చూస్తూ తను ఉక్రోష పడేది. వాళ్ళిద్దరి చిన్ననాటి నెయ్యం మూడుముళ్ల బంధం అయింది. చూడ చక్కని జంట! చిలుకాగోరింకల్లా అన్యోన్యంగా, ఆనందంగా వున్న ఆ జంటను చూసి విధికే కన్ను కుట్టిందేమో! మృత్యువు .. బావి రూపంలో వచ్చి రాముడ్ని మింగేసింది. ‘వెంకటలక్ష్మీ! రాముడు గజ ఈతగాడు కదా? వాడు నీళ్లలో మునిగి చనిపోవడం ఏమిటి?’ హఠాత్తుగా అడిగింది రోజా. ‘మొక్కే దేముడే యముడై ముంచేస్తే ఏం చేస్తాములే మా!’ నిర్లిప్తంగా అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. ‘అదేమట్లంటావు? అసలేం జరిగిందా రోజు? నువ్విక్కడే వున్నావుగా?’ రోజా దీర్ఘంగా చూస్తూ అడిగింది. ‘ఏమి జరక్కూడదో అదే జరిగిపోయినంక ఇంగిపుడు ఏంజేస్తాములే మా!’ నిర్వేదంగా అంది వెంకటలక్ష్మి. ‘బాయిలో పడేనబ్బుడు గోడకు తగిలి తల పగిలిందన్నారు’ శుష్కహాసం చేసింది. ‘అయినా గడా ఈ బాయికి ఎంత దాహమో! మాయమ్మ, అత్త, ఊర్లో చానా మంది ఆడవాళ్ల ఉసుర్లు.. కడాకు నా రాముడి ఉసురు గడా పోసుకొనింది. దీనికి వాయి వరసా లేదు’ వెంకటలక్ష్మి మాటలు కోపం, దుఃఖం, బాధ కలగలిపి జీరగా ఉన్నాయి. ‘అది కాదు వెంకటలక్ష్మీ..’ రోజా ఏదో అనబోయేంతలో మధ్యలో కలగజేసుకుంది వెంకటలక్ష్మి.. ‘అంతంత పెద్ద సదువులు సదివినావు కదా! ఏదొక దినం నీకే అర్తమవుతాది లే. పదమా! అమ్మ ఎదురు సూస్తాంటాది’ అంటూ ముందుకు నడిచింది.. కోసిన మల్లెమొగ్గలు కొంగులో మూటకట్టుకొంటూ! ‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా!’ రెడ్డెప్పకు కాలు, చెయ్యి నూనె మసాజ్, స్నానం చేపించి.. బట్టలు తొడిగి.. టిఫిన్ తినిపించి.. టీవీ ముందు వాలు కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన కుప్పడికి చద్దన్నం పెడుతూ అంది సావిత్రమ్మ. కుప్పడు ఇడ్లీలు, దోశలు తినడు. మూడు పూటలా అన్నమే కావాలంటాడు. ఆ రోజు శుక్రవారం. తలారా స్నానం చేసి తన పొడవాటి జుట్టును కింద జారుముడి వేసి ఇంత మల్లెపూల దండ పెట్టుకుంది. పసుపు రాసిన మొహంలో పావలా కాసంత నిండు ఎరుపు కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతున్న సావిత్రమ్మను అలా చూస్తూ ఉండిపోయాడు కుప్పడు తినడం కూడా మర్చిపోయి. ‘పర్వాలేదు లేరా బాద, కస్టం, ఏడుపూ.. అన్నీ మర్చిపోతిన్లేరా! అసలుకు అయ్యన్నీ అలవాటైపోయిండ్లా? ఎదిరించడం, ఎదురు మాటాడటం.. తెలీకుండానే మన కాలం గడిచిపోయ కదా! మన బిడ్డలు బాగుంటే సాలనుకుంటిమి. కానీ.. దేముడని నమ్మితే.. నీకు, నీ బిడ్డకు గడా అన్నాయమే చేసినాడా ముండా దేముడు. ఆ పొద్దు నీ పెండ్లాన్ని, చెల్లిని, ఇబ్బుడు నీ అల్లుడ్ని గడా తీస్కపోయి’ గద్గదంగా అంది సావిత్రమ్మ. ఆమె కళ్ళు ఉబ్బి, మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. కుప్పడు మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు గానీ గుండెలో అదురు పుట్టింది. సావిత్రమ్మ మాటలు వింటున్న వెంకటలక్ష్మి కూడా బొమ్మలా అయిపోయి అలా చూస్తోంది. ఇద్దరి కళ్ళూ ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. అది చూసి ‘ఏంరా కుప్పా? ఏమైందీ’ సావిత్రమ్మ కంగారుగా అడిగింది. ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ చేతిలోని పచ్చిమిరపకాయ చూపించాడు కుప్పడు. ‘నువ్వెందుకు ఏడస్తాండావే ఎంకటమ్మా?’ వెంకటలక్ష్మి వేపు తిరిగింది సావిత్రమ్మ. వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న చాటలో తను తొక్క తీస్తున్న ఉల్లిపాయలు చూపింది. ‘బాగుండాదిలే మీ కత! నిన్ను మిరపకాయ, దాన్ని ఎర్రగడ్డ ఏడ్పిస్తాండాయా?’ నిట్టూర్చింది సావిత్రమ్మ. ‘అది సరే.. చిన్న బిడ్డ.. ఎర్రగడ్డ గాటు తట్టుకోలేదు. నీకేందిరా కుప్పా? ఇంత జీవితం చూసినంక గడా అంతంత కారం మింగినాక గడా ఇంగా ఏడుస్తాంటే ఎట్లా ? తిను. తిను. తినేసి రెడ్డెప్పను బాయి కాడికి తొడ్కో పో! ఎంకటమ్మను నీ కూడా తీస్కపో! తోడుంటాది. ఇద్దురూ భద్రం! ముందూ ఎనకా చూస్కోండి’ జాగ్రత్తలు చెప్తూనే సావిత్రమ్మ దేవుని గదిలోకి వెళ్ళిపోయింది. ‘అప్పా! నెలలు నిండిపోయినాయంట. రెండు మూడు దినాల్లో పురుడొచ్చేస్తాదని సెప్పింది నర్సమ్మ. పుట్టేది రాముడే. వాడీ భూమ్మీద పడేలోగా..’ పొద్దున గొడ్లచావిట్లో తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న వెంకటలక్ష్మి.. సావిత్రమ్మను చూసి మాట మింగేసింది. ఆమె ప్రతి శుక్రవారం గోపూజ చేస్తుంది. పూజా సామగ్రి పళ్ళెంతో వచ్చింది. ‘తొలి కాపు కదమా! బిడ్డ బయపడతాంది’ కుప్పడు సావిత్రమ్మను చూసి తడబడ్డాడు. ‘తల్లి లేని బిడ్డ. తొలి కానుపు భయం ఉంటాదిలే! ఇంట్లో ఆడదిక్కు లేదు. తోడుగా మీ చెల్లిని రమ్మన్నానంటివే! ఇంగా రాలేదా?’ కుప్పడు ఒళ్ళంతా తోమి, కడిగి తయారుగా వుంచిన ఆవు నొసట్న పసుపు కుంకుమ పెడుతూ అడిగింది. ‘చెనిగి చెట్లు పెరకతాండారంటమా! ఈ పొద్దు అయిపోతాది రేపటికంతా వొచ్చేస్తానని చెప్పింది’ చెప్పాడు కుప్పడు. ‘సరే! అయినా గడా ఎంకట్లక్ష్మి పే..ద్ద ధైర్నవంతురాలని రోజమ్మ అంటాంటాంది. నువ్వేమిట్లా ఎర్రిగొడ్డులా ఏడస్తాండావు?’ అంది సావిత్రమ్మ ఆవు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ! ‘మనూరి నర్సమ్మ చెయ్యివాసి మంచిది. నీకేం కాదులేమే! మంచిగా కానుపైతాదిలే! ఆ దేముడు, రాముడు నీకు తోడుంటార్లే!’ ధైర్యం చెప్పింది. సావిత్రమ్మ.. రెడ్డెప్పను బావి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తండ్రీ కూతుళ్ళు! కూడబలుక్కున్నట్లుగా ఇద్దరూ ఒకేసారి లేచి నిలబడ్డారు కళ్ళు తుడుచుకొంటూ! ‘అప్ప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడనేలేదు. కర్రసాయం లేకండా నడవలేడు. ఆయన అడిగితే మాత్రం నువ్వు ఎట్లా పంపించినావు మా బావి దగ్గరకు? అక్కడేమి పుట్టి మునిగిపోతా ఉందని?’ రోజా తల్లిని నిలదీసింది నిష్ఠూరంగా. తండ్రి చనిపోయి దశ దిన కర్మలు ముగిశాక.. బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయాక తల్లి కూతుర్లు మిగిలారు ఇంట్లో. బావి దగ్గరికి వెళ్లిన తండ్రి కాలుజారి బావిలో పడిపోయాడు. కాపాడాలని కుప్పడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘ఏం చేసేది రోజమ్మా? ఆయనే పొద్దు నా మాట యిన్నాడని? అసలుకు ఏమన్నా ఎదురు చెప్పే ధైర్నమన్నా నాకుండేనా? అయినా.. కిష్ణుడు గీతలో చెప్పినట్టు నా మాట నిమిత్తమాత్తరమే! ఆయన సావు ఆయనే తెచ్చుకొన్యాడు.’ ‘నువ్వే తీసుకుపొమ్మన్నావని చెప్పినాడే కుప్పడు?’ సాలోచనగా చూసింది తల్లి వైపు. ‘అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. ముందు దాని దుక్క బారం తీరాల. అబ్బుడే అది కనే బిడ్డను సంతోసంగా సాకతాది అన్పించె నాకు. కడుపుతో వున్న.. తల్లి లేని బిడ్డ కోరికను తల్లి మాదిరి తీర్చల్ల కదా!’ సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా, నిర్విచారంగా, నిర్వేదంగా చెబుతుంటే రోజా గుడ్లప్పగించి చూస్తోంది. తానేం అడిగింది.. తల్లి ఏం చెబుతోంది? అర్థంకాని అయోమయం! హఠాత్తుగా ఆమె కళ్ళల్లో తానా రోజు బావి దగ్గర గదిలో చూసిన చిందరవందర సామాను, ఎండిపోయిన మల్లెపూల దండలు, పగిలిన గాజు ముక్కల దృశ్యం కదలాడింది. ‘బాయిలో వున్న ఎంతోమంది ఉసుర్లు సంతోసంగా, ప్రెసాంత బడిన దినాన బాయి దాహం తీర్తాది’ వెంకటలక్ష్మి కసి మాటలు గుర్తొచ్చాయి. ఊర్లో వాళ్ళు, బంధువులు, సేద్యగాళ్ళు, పొలం పనులకు వచ్చే కూలి వాళ్ళు ‘లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి’ అని పొగుడుకొనే అమ్మలో దుష్టశిక్షణ చేసే ఒక కాళికా మాత కనిపించింది రోజా కళ్ళకి. తల్లి దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంటే ఆమె బుగ్గ తడి తియ్యగా తగిలింది. అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. - యం.ఆర్ అరుణకుమారి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ హీరోల్లాంటి సినిమాలు చేయాలని ఉంది: సత్యదేవ్
మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు!
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్ఎఫ్.. ఎక్కడంటే..
'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement