Ayodhya: ఆన్‌లైన్‌లో ప్రసాదం.. అమెజాన్‌కు నోటీసులు | Amazon India Gets Government Notice After Fake Ayodhya Prasad Row, See Details Inside - Sakshi
Sakshi News home page

Amazon Fake Ram Mandir Prasad: ఆన్‌లైన్‌లో అయోధ్య నకిలీ ప్రసాదం.. అమెజాన్‌కు నోటీసులు

Published Sat, Jan 20 2024 7:35 AM

Amazon gets government notice After Fake Ayodhya prasad Row - Sakshi

ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ.. ఆధ్యాత్మికం పేరిట ఆన్‌లైన్‌లో నకిలీ ఉత్పత్తుల హవా కనిపిస్తోంది. తాజాగా అయోధ్య పేరిట  నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. 

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)ఫిర్యాదు నేపథ్యంలో.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA)అమెజాన్‌ సంస్థకు నోటీసులు పంపింది. శ్రీ రామ మందిర్‌ అయోధ్య ప్రసాద్‌.. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామ మందిర్‌ అయోధ్య ప్రసాద్‌, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్‌ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్‌ పేడ.. ఇతరాల్ని అమెజాన్‌లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. 

అయితే సాధారణ మిఠాయిలనే.. అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారని.. మోసపూరిత వాణిజ్య పద్ధతుల్లో అమెజాన్‌ నిమగ్నమై ఉందని.. తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని అమెజాన్‌పై ఫిర్యాదులో పేర్కొంది సీఏఐటీ. నోటీసుల నేపథ్యంలో అమెజాన్‌ సంస్థ వారంలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది సీసీపీఏ. మరోవైపు నోటీసులపై అమెజాన్‌ స్పందించింది. ఈ విషయంలో సెల్లర్ల జాబితాను పరిశీలించాలి చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకు వెళ్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement
Advertisement