రూపాయి-దిర్హామ్‌ వాణిజ్యం విస్తరణ:పెట్టుబడులకు అపార అవకాశాలు | Sakshi
Sakshi News home page

రూపాయి-దిర్హామ్‌ వాణిజ్యం విస్తరణ:పెట్టుబడులకు అపార అవకాశాలు

Published Fri, Oct 6 2023 4:47 AM

India, UAE looking at expanding rupee-dirham trade says Piyush Goyal - Sakshi

భారత్‌-యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపీ-దిర్హామ్‌ రూపంలో మరింత విస్తరించు కునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. రెండు దేశాలూ యూఏఈ నుంచి భారత్‌కు తక్కువ వ్యయానికే నిధులు పంపుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. 11వ భారత్‌–యూఏఈ ఉన్నత స్థాయి టాస్‌్కఫోర్స్‌ సమావేశం కోసం వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం నుంచి యూఏఈలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

ఆయన వెంట అధికారుల బృందం కూడా ఉంది. ‘‘ఆర్‌బీఐ, యూ ఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌తో ఇప్పుడే చర్చలు పూర్త య్యాయి. పరిశ్రమ, బ్యాంకర్లతో కలసి రూపీ–దిర్హా మ్‌ వాణిజ్యాన్ని మరింత వేగంగా, పెద్ద మొత్తంలో అమలు చేయాలని నిర్ణయించాం’’అని మీడియా ప్ర తినిధులకు పీయూష్‌ గోయల్‌ చెప్పారు. దేశీ కరెన్సీల రూపంలో వాణిజ్యం నిర్వహించుకోవడం వల్ల మొత్తం వాణిజ్యంపై 5% ఆదా చేసుకోవచ్చన్నారు.

పెట్టుబడులకు అపార అవకాశాలు
ఆహార, పారిశ్రామిక పార్క్‌లు భారత్‌లో ఏర్పాటు చేయడంపైనా ఇరువైపులా చర్చలు జరిగినట్టు మంత్రి గోయల్‌ చెప్పారు. యూఏఈ ఇన్వెస్టర్లు భారత్‌లో ఆర్థిక సేవలు, శుద్ధ ఇంధనాలు, మౌలిక రంగం, విద్య, హెల్త్‌కేర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. భారత్‌లో విమానయాన రంగం యూఏఈ పెట్టుబడిదారులకు నమ్మకమైనదిగా మారినట్టు చెప్పారు. రవాణా, పర్యాటక రంగాలకు భారత్‌ సర్కారు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు పేర్కొన్నారు.

రానున్న రజుల్లో తయారీ, సేవల రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, సంబంధాలకు ఇప్పుడు చంద్రుడు కూడా హద్దు కాదని అభివర్ణించారు. ఆవిష్కరణలతో పాటు, పెట్రోలియం, పెట్రోలియం కెమికల్‌ రంగాల్లో అప్‌స్ట్రీమ్‌ (అన్వేషణ, ఉత్పత్తి), డౌన్‌స్ట్రీమ్‌ (మార్కెటింగ్, విక్రయాలు) పట్ల రెండు దేశాల్లో ఆసక్తి ఉన్నట్టు ప్రకటించారు. భారత్‌-యూఏఈ గతేడాది మేలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమలు చేయడం గమనార్హం. 2021-22లో ద్వైపాక్షిక వాణిజ్య 72.9 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2022–23లో అది 84.9 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.  

ఏఐ ఎతిహాద్‌తో ఎన్‌పీసీఐ ఒప్పందం
నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ)కు చెందిన అంతర్జాతీయ విభాగం ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్, గురువారం యూఐఈకి చెందిన ఏఐ ఎతిహాద్‌ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకుంది. వాణిజ్య మంత్రి గోయల్‌ సమక్షంలో ఇది కుదిరింది. దీంతో రెండు దేశాల్లోని వారు తక్కువ వ్యయానికే రియల్‌ టైమ్‌ (అప్పటికప్పుడు) సీమాంతర చెల్లింపులు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. దేశీ లావాదేవీలు నిర్వహించుకున్నంత సులభంగా సీమాంతర లావాదేవీలు చేసుకోవచ్చని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. నగదు పంపిస్తున్నప్పుడు రెండు దేశాల కరెన్సీ విలువ, చార్జీల వివరాలు కనిపిస్తాయి. దీంతో పారదర్శకత పెరగనుంది.

గ్లోబల్‌ కార్డ్‌ల అవసరం లేకుండా డొమెస్టిక్‌ కార్డులను వినియోగించి నగదు పంపించుకోవచ్చు. ఈ ఒప్పందంతో ఎన్‌పీసీఐ ఉత్పత్తి అయిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), యూఏఈకి చెందిన ఇన్‌స్టంట్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ (ఐపీపీ) మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో యూపీఐ లావాదేవీ మాదిరే సులభంగా నిర్వహించుకోవచ్చు. అలాగే, భారత్‌కు చెందిన రూపే స్విచ్, యూఏఈ స్విచ్‌ మధ్య కూడా అనుసంధాన ఏర్పడుతుంది. దీంతో కార్డుల నుంచి కూడా నగదు పంపుకోవడం సాధ్యపడుతుంది. ఈ ఒప్పందం యూఏఈలో ఉపాధి పొందుతున్న 35 లక్షల భారతీయులకు (ప్రవాసులు) ప్రయోజనం చేకూర్చనుంది.  

Advertisement
Advertisement