మార్చి 15 తర్వాత పని చేసేవి.. పని చేయనివి ఇవే.. | Sakshi
Sakshi News home page

మార్చి 15 తర్వాత పని చేసేవి.. పని చేయనివి ఇవే..

Published Tue, Feb 20 2024 5:23 PM

PPBL Releases FAQs Belongs To Customer Queries - Sakshi

ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముందుగా 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన ఆర్‌బీఐ తేదీని సవరించింది. ఈ నేపథ్యంలో ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఇటీవల ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ స్థానంలో యాక్సిస్‌ బ్యాంక్‌తో ఒన్‌97 కమ్యునికేషన్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

రీఛార్జ్‌లు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు పేటీఎంను ఉపయోగించవచ్చా?

ప్రజలు అన్ని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌ల కోసం పేటీఎం యాప్‌ని ఉపయోగించవచ్చని కంపెనీ తన FAQ పేజీలో ధ్రువీకరించింది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ.. వంటి అధీకృత బ్యాంకులకు తమ పేటీఎంను లింక్ చేసిన వారిపై తాజా నిషేధం ఎలాంటి ప్రభావం చూపదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా తెరిచిన వినియోగదారులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది.

పేటీఎం క్యూఆర్‌ కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్ ఎప్పటిలాగే పని చేస్తాయా?

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పేటీఎం క్యూఆర్‌, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్‌లపై ఎలాంటి ప్రభావం చూపదు. మార్చి 15 తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ని ఉపయోగించవచ్చా?

పేటీఎం వాలెట్‌లో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు.. ఉపసంహరించుకోవచ్చు.. మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. మార్చి 15, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు మాత్రం చేయలేరు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌/ ఎన్‌సీఎంసీ కార్డ్‌ని ఉపయోగించవచ్చా?

ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌/ ఎన్‌సీఎంసీ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత రీఛార్జ్ చేయలేరు. అందులో డబ్బును డిపాజిట్‌ చేయలేరు. అందులో ఉన్న నగదును ఉపయోగించవచ్చు. లేదా గడువులోపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌/ ఎన్‌సీఎంసీ కార్డ్‌ని మూసివేయవచ్చు. అందులో ఉన్న నగదు రీఫండ్ కోసం బ్యాంక్‌ని కోరవచ్చు.

ఇదీ చదవండి: మీ బైక్‌ మైలేజ్‌ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే..

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్‌ ఎలా? 

వాలెట్‌లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్‌ డ్రాయిల్‌ లేదా, బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయలేరు. డిపాజిట్‌ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్‌ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

Advertisement
Advertisement