Sakshi News home page

దేశంలోనే టాప్‌ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి..

Published Tue, Feb 13 2024 10:17 AM

Top 500 Companies Listed By Hurun India And Burgundy - Sakshi

భారత్‌లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మొదటిస్థానంలో నిలిచింది. యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగమైన బర్గండీ ప్రైవేట్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా ఒక నివేదిక తయారుచేశాయి. గతేడాది అక్టోబరు వరకు ఆయా కంపెనీల మార్కెట్‌ విలువ ఆధారంగా దీన్ని రూపొందించాయి. అందులోని కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

టాప్‌ 3 కంపెనీలు ఇవే..

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). దాంతో ఈ కంపెనీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.12.4 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.14.90 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉంది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.11.3 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. 

ప్రైవేటు రంగంలోని టాప్‌-500 కంపెనీల (రిజిస్టర్డ్‌, అన్‌ రిజిస్టర్డ్‌) మార్కెట్‌ విలువ 2.8 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.231 లక్షల కోట్లు)గా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధితో 952 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.79 లక్షల కోట్ల) విక్రయాలను నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువ. దేశంలోని 70 లక్షల మందికి (మొత్తం ఉద్యోగుల్లో 1.3 శాతం) ఈ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా, ఇందులో 437 మంది మహిళలు ఉన్నారు. 179 మంది సీఈఓ స్థాయిలో ఉన్నారు.

  • కంపెనీ స్థాపించి 10 ఏళ్లు కూడా పూర్తవని సంస్థలు 52 ఉన్నాయి. 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడీ-ప్యారీ కూడా 500 కంపెనీల జాబితాలో ఉంది. 
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జాబితాలో 28వ స్థానం సాధించింది. 
  • హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు 2023 ఎడిషన్‌లో మరోసారి టాప్‌-10 జాబితాలోకి చేరాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

హైదరాబాద్‌ కేంద్రంగా 29 కంపెనీలు ఈ జాబితాలో చోటు సాధించగా, వీటి మార్కెట్‌ విలువ రూ.5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ మొత్తం విలువ 22% పెరిగింది. దేశంలో సొంతంగా అభివృద్ధి చెందిన సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% పెరిగింది.

టాప్‌ కంపెనీలు(మార్కెట్‌ విలువ) ఇవే..

  • దివీస్‌ ల్యాబ్స్‌: రూ.90,350 కోట్లు
  • డాక్డర్‌ రెడ్డీస్‌: రూ.89,152 కోట్లు
  • మేఘా ఇంజినీరింగ్‌: రూ.67,500 కోట్లు
  • అరబిందో ఫార్మా: రూ.50,470 కోట్లు
  • హెటెరో డ్రగ్స్‌: రూ.24,100 కోట్లు
  • లారస్‌ ల్యాబ్స్‌: రూ.19,464 కోట్లు
  • సైయెంట్‌: రూ.17,600 కోట్లు
  • ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌: రూ.17,500 కోట్లు
  • డెక్కన్‌ కెమికల్స్‌: రూ.15,400 కోట్లు
  • కిమ్స్‌: రూ.15,190 కోట్లు

ఇదీ చదవండి: రూ.70వేలకోట్ల అమెజాన్‌ షేర్లు అమ్మనున్న బెజోస్‌..

ఈ జాబితాలో సువెన్‌ఫార్మా, నాట్కోఫార్మా, తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, రెయిన్‌బో హాస్పిటల్స్‌, ఆరజెన్‌ లైఫ్‌సైన్సెస్‌, అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ, యశోదా హాస్పిటల్స్‌, మెడ్‌ప్లస్‌, ఒలెక్ట్రాగ్రీన్‌టెక్‌, ఎన్‌సీసీ, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌, హెచ్‌బీఎల్‌ పవర్‌, గ్రాన్యూల్స్‌, మేధా సర్వో డ్రైవ్స్‌, కేఫిన్‌ టెక్‌, ఎంటార్‌ కంపెనీలు ఉన్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement