తెలుగు హీరోలకు ఎక్కువ పారితోషికం? దిల్ రాజు ఆన్సరిదే!
Published
Sat, Mar 30 2024 2:15 PM
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిత సమర్పణలో దిల్రాజు, శిరీష నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు చిత్రయూనిట్ చైన్నెలోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు.
త్వరలో తమిళ సినిమా చేస్తా
అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఇటీవల తాను నటించిన ఖుషీ చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్తో ప్రేక్షకుల మందుకు రానున్నామన్నారు. గీతగోవిందం చిత్రం తరువాత పరశురామ్ దర్శకత్వంలో తాను నటించిన చిత్రం ఇదని చెప్పారు. మంచి కుంటుంబ కథా చిత్రంగా ఈ ఫ్యామిలీస్టార్ ఉంటుందన్నారు. తదుపరి గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. త్వరలోనే తమిళ చిత్రం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. పలువురు దర్శకుల కథలు వింటున్నట్లు చెప్పారు.
తెలుగు హీరోలకు ఎక్కువ పారితోషికం?
నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందు విజయ్ హీరోగా నిర్మించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని సాధించిందని, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఫ్యామిలీస్టార్ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. పేద, గొప్ప ప్రతి ఇంట్లోనూ ఒక ఫామిలీస్టార్ ఉంటారని, అలాంటి కథే ఈ చిత్రం అన్నారు. ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండను రౌడీస్టార్ అని అంటున్నారని, ఈ చిత్రం తరువాత ఫ్యామిలీస్టార్ అంటారని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో థింక్స్ స్టూడియోస్ తరుణ్ విడుదల చేస్తున్నారని చెప్పారు. తెలుగులో హీరోలకు అధిక పారితోషికం ఇస్తారనే విషయాన్ని తాను అంగీకరించనని, దేనికైనా ఒక లెక్క ఉంటుందని, దాన్ని బట్టే పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు.