Manisha Koirala: Interesting Facts On Her Birthday Special - Sakshi
Sakshi News home page

Manisha Koirala: ప్రేమించిన భర్తే శత్రువు.. 6 నెలలకే గొడవలు, క్యాన్సర్‌తో మరిన్ని కష్టాలు.. జీవితం చీకటిమయం..

Published Wed, Aug 16 2023 9:37 AM

Manisha Koirala Interesting Facts On Her Birthday Special - Sakshi

క్రిమినల్‌, బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి మనీషా కొయిరాలా.  నెల్లూరి నెరజాణగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతోంది. నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా.. కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా దిల్‌ సే, భాఘి, కంపెనీ, లస్ట్‌స్టోరీస్‌ లాంటి హిందీ చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఇవాళ ఆమె 53వ బర్త్ డే సందర్భంగా ఆమె కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

(ఇది చదవండి: ఎన్నో కలలు కన్నాను.. కానీ పెళ్లైన ఆర్నెళ్లకే అలా జరిగింది : మనీషా కొయిరాల)

డాక్టర్ కావాలనుకుని.. 

మనీషా కొయిరాలా 16 ఆగస్టు 1970లో నేపాల్‌లో జన్మించింది. పాఠశాలలో చదువుతుండగానే 1989 లో ఫేరి భేతౌలా అనే నేపాలీ సినిమాలో మొదటిసారి నటించింది. చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలనుకున్న ఆమె మొదట మోడల్‌గా పని చేసింది. 1991లో వచ్చిన హిందీ సినిమా సౌదాగర్‌తో  బాలీవుడ్‌లో ప్రవేశించింది. ఆ తర్వాత పలు భారతీయ భాషల సినిమాల్లో నటించింది.

1942-ఎ లవ్ స్టోరీ , తమిళ చిత్రం బొంబాయి సినిమాలతో గుర్తింపు సంపాదించింది. తర్వాత వచ్చిన అగ్నిసాక్షి , గుప్త్ - ది హిడెన్ ట్రూత్ , కచ్చే ధాగే , ఏక్ చోటీసి లవ్ స్టోరీ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. నేపాల్  కుటుంబం రాజకీయ నేపథ్యమున్న మనీషా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. 2001లో ఈమె నేపాల్ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది.
 
వ్యాపారవేత్తతో పెళ్లి-విడాకులు

నేపాల్‌కి చెందిన వ్యాపారవేత్తతో సామ్రాట్‌ దహల్‌తో 2010లో మనీషాకు వివాహం జరిగింది. పెళ్లైన ఆరు నెలలకే వీరిమద్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. ఆ సమయంలోనే మనీషా క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్నారు. ఇటీవలే తన పెళ్లి గురించి మాట్లాడింది. పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నా.. కానీ ఆర్నెళ్లకే మాకు గొడవలు ప్రారంభమై.. తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

నేను మాత్రమే కాదు, మీరు మీ పెళ్లి బంధంలో సంతోషంగా లేకుంటే, విడిపోవడమే మంచిదంటూ మనీషా కొయిరాలా పేర్కొంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో తన జీవితం సంపూర్ణమైందని ఆమె అన్నారు. అయితే లైఫ్‌ పార్టనర్‌ ఉంటే తన జీవితం ఇప్పుడు మరోలా ఉండేదేమో చెప్పలేనని తెలిపారు. ఇకపోతే పిల్లలను పెంచడమంటే నాకు చాలా ఇష్టమని.. సింగిల్‌ మదర్‌గా పిల్లలను పెంచగలననే ధైర్యం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయం గురించి ఆలోచిస్తానని మనీషా వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement