'మా సినిమాలకు బలం అతనే.. థ్యాంక్స్'.. ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్‌! | Sakshi
Sakshi News home page

Vyooham and Shapatham Trailer: 'మా చిత్రాలకు సహకరించింది ఆయనే'.. సెన్సార్‌ బోర్డ్‌పై ఆర్జీవీ కామెంట్స్‌!

Published Tue, Feb 13 2024 5:49 PM

Ram Gopal Varma Latest Movie Vyooham Movie Trailer Released Today - Sakshi

టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వస్తోన్న తాజా చిత్రం వ్యూహం. ఇప్పటికే ఈ మూవీ విడుదల ఆలస్యం కాగా.. ఈనెల 23న ప్రేక్షకులను ముందుకొస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌తో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే పార్ట్‌-2 వస్తోన్న శపథం సినిమా కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని "వ్యూహం", "శపథం" చిత్రాలను తెరకెక్కించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది.  తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇప్పటికే వ్యూహం టీజర్‌ రిలీజ్‌ కాగా..  మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. డబుల్ డోస్ ట్రైలర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే రెండు సినిమాలకు సంబంధించి ఓకే ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా.. శపథం(పార్ట్-2) మూవీ మార్చి 1న రిలీజవుతోంది. 

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – 'వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒకే ఒక వ్యక్తి నారా లోకేష్. నేను, దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాలను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ లోకేష్ కోర్టుకు మా సినిమాను అడ్డుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్స్‌కు ముందు మా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా పరోక్షంగా హెల్ప్ చేసింది నారా లోకేషే. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. డిసెంబర్‌లో రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి జనం మర్చిపోయేవారు. నేను ముందు నుంచీ చెబుతున్నా.. ఎవరైనా ఏ సినిమానైనా శాశ్వతంగా సినిమా రిలీజ్ కాకుండా ఆపలేరని. వారం రోజుల తేడాతో రెండు సినిమాలు రిలీజ్ కావడం వల్ల ఇబ్బందేం ఉండదు. నచ్చితే జనాలు చూస్తారు. లేదంటే రెండూ చూడరు.'

సెన్సార్‌ బోర్డ్ గురించి మాట్లాడుతూ..'సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ వ్యవస్థ. ఏ కథ తీసినా వాళ్లకు అభ్యంతరాలు ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తీసేశారు. అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మిస్ కాలేదు. ప్రజా జీవితంలో ఉన్న కొందరి మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలా నాకున్న అభిప్రాయాలతో వాస్తవ ఘటనల నేపథ్యంగా నేను వ్యక్తీకరించిన సినిమాలే వ్యూహం, శపథం. ఈ సినిమాలు ఎవరి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను చెప్పలేను. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఫిలిం మేకర్‌కు వాస్తవ ఘటనలను తన కోణంలో తెరకెక్కించే స్వేచ్ఛ ఉందని హైకోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్స్‌లో పేర్కొంది. వైఎస్‌  మృతి నుంచి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు వ్యూహం కథ ఉంటుంది. జగన్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు శపథం కథ చూపిస్తున్నాం. నేను ఈ సినిమాను జగన్ కోసం కాదు పవన్, చంద్రబాబు కోసం తీశాను. అన్నారు.

నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ - 'వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ విషయంలో దేవుడు మాకు అన్నీ కలిసొచ్చేలా చేశాడని అనుకుంటున్నాం. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం. రెండు సినిమాలు గ్యారెంటీగా సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలు మొదలుపెట్టినప్పుడే రిలీజ్‌కు అడ్డంకులు వస్తాయని తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్నా..లోకేష్ పార్టీ కార్యక్రమాలు అన్నీ వదిలి మా సినిమాలు రిలీజ్ కాకుండా కోర్టులకు, సెన్సార్ ఆఫీసులకు తిరిగారు. రోడ్లపై ధర్నాలు చేయించాడు. ఆయన అంత పోరాటం చేశాడంటేనే మా సినిమాల్లో ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా మాకు రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ధర్మం గెలిచిందని మేము భావిస్తున్నాం'. అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement