Chinese National Arrested By Security Agencies From Indo-Nepal Border - Sakshi
Sakshi News home page

Chinese National Arrested: నేపాల్‌లో చైనా ‘పెంగ్‌’.. భారత్‌లోకి చొరబడుతూ..

Published Sat, Jul 22 2023 7:40 AM

chinese national arrested by security agencies from indo nepal border - Sakshi

భారత్‌- నేపాల్‌ సరిహద్దుల మీదుగా నకిలీ ధృవపత్రాలతో భారత్‌లోకి చొరబడేందుకు ఒక చైనా పౌరుడు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి డార్జిలింగ్‌ మీదుగా భారత్‌ సరిహద్దుల్లోకి అక్రమంగా ‍చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై ఆ వ్యక్తిని అరెస్టు చేశాయి. 

ఉమేష్‌గా మారిన పెంగ్‌ యోంగ్జిన్‌
మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం భారత్‌-నేపాల్‌ సరిహద్దులోగల డార్జిలింగ్‌ స్పెషల్‌ సర్వీస్‌ బ్యూరో(ఎస్‌ఎస్‌బీ) పానీటంకీ అవుట్‌పోస్ట్‌ వద్ద ఒక చైనా పౌరుడిని అరెస్టు చేసింది. అతను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్‌ఎస్‌బీఈ చర్య చేపట్టింది. అరెస్టయిన ఆ చైనా పౌరుని పేరు పెంగ్‌ యోంగ్జిన్‌. ఇతను నేపాల్‌లో ఉమేష్‌ అనే నకిలీ పేరుతో నివసిస్తున్నాడు. ఇదే పేరుతో నేపాల్‌లో పాస్‌పోర్టు కూడా చేయించుకున్నాడు. ఈ పాస్‌పోర్టు ఆధారంగానే ఆ చైనా పౌరుడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు. 

భారత్‌లోకి చొరబాటు వెనుక..
ఎస్‌ఎస్‌బీ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్‌లో ఉంటున్న ఆ చైనా పౌరుడు అక్కడ పాస్‌పోర్ట్‌ పొందేందుకు స్థానికులు సహాయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌బీ అదుపులో ఉన్న ఆ చైనా పౌరుడిని విచారిస్తున్నారు. అతను అక్రమంగా భారత్‌లోకి ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

నేపాల్‌లో ఉంటూ..
భారత్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలోని పానీటంకీ ప్రాంతం నేపాల్‌లోని కకర్‌వీటా పరిధిలోని డోక్లామా చికెన్‌ నెక్‌కు సమీపంలో ఉంది. ఈ సున్నిత ప్రాంతంలో ఇన్నాళ్లూ నివాసమున్న ఈ చైనా పౌరుడు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు సాగించాడో తెలుసుకునేందుకు ఎస్‌ఎస్‌బీ ప్రయత్నిస్తోంది. భారత్‌-నేపాల్‌ సరిహద్దు 1850 కిలోమీటర్ల మేర ఉంది. అయితే  ఆ చైనా యువకుడు తాను ఉండేందుకు డార్జిలింగ్‌ సమీపంలోని ప్రాంతాన్నే ఎందుకు ఎన్నుకున్నాడనేది అధికారుల ముందున్న ప్రశ్న. ఈ డోక్లామ్‌ రీజియన్‌ విషయంలో భారత్‌-చైనాల మధ్య వివాదం రగులుతోంది. 

ఏడేళ్లుగా మారుపేరుతో..
భారత్‌లోకి పాక్‌ నుంచి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌ ఉదంతం సంచలనంగా మారిన నేపధ్యంలో భారత ప్రభుత్వం మరింత అ‍ప్రమత్తమయ్యింది. రక్షణ బలగాలు తనిఖీలు మరింత ముమ్మరం చేశాయి. కాగా పెంగ్‌ తన పేరు, గుర్తింపును మార్చుకుని నేపాల్‌లో అక్రమంగా గడచిన ఏడేళ్లుగా ఉంటున్నాడు. తాజాగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన అతనిని అదుపులోకి తీసుకున్న స్పెషల్‌ సర్వీస్‌ బ్యూరో అతనిని సుదీర్ఘంగా విచారిస్తోంది. 
ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి

Advertisement
Advertisement